Saturday, May 30, 2009

ప్రేమ చెలమ


పగిలిన హృదయంలో
ప్రేమ చెలమ మిగిలింది
ఎండిన గుండెల్లో
నీ గుర్తుచెమ్మ మిగిలింది
రగిలి ఎండినా
ఎండి పగిలినా
ప్రేమ నీటిఊట మాత్రం
పదిలంగా మిగిలింది

(ఫోటో బాగుంది. బ్లాగులో పెట్టాలనిపించింది. ఈ కవిత ఒక సాకు.)

****

Friday, May 29, 2009

తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్ర ధారణ - కొన్ని ప్రశ్నలు ; జవాబులు

ఆస్ట్రేలియా శారదగారు తెలుగు సినిమాల్లో స్త్రీల వస్త్రధారణ చూసి "కంపరం, వెగటూ, రోతా" పుట్టించేసుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలు ఇవి.

అవి చదివేముందు, పక్కనున ఫోటొల్లో ఉన్న హీరోయిన్లపై కొంత సమాచారం. నిండుగా చీరకట్టుకున్నది మా మదనపల్లె అమ్మాయి బిందు మాధవి. అవకాయ బిర్యానీ సినిమా తరువాత కష్టంగా మరో సినిమా సంపాదించుకుంది. ఆ పక్కనే ఒళ్ళువిరుచుకుని ఇలియానా. ప్రస్తుతానికి తన రెమ్యూనరేషన్ కోటి రూపాయల పైమాటే.

1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఈ ధోరణికూడా ఆ ప్రభావం వల్లనే అయ్యుండొచ్చుకదా! సినిమా మన దగ్గర ఒక అసంపూర్ణస్వప్నాల్ని అందిపుచ్చుకునే ఒక (చీకటి) ఊహాలోకం. ఆ లోకంలో అణగారిన కోరికలుంటాయి, అందుబాటులో లేకపోయినా ఆశపడే అందాలుంటాయ్,సాహసాలుంటాయి,అసంబద్ధ పోకడలుంటాయి. అంటే సమాజనికి అద్ధం సినిమాలైతే, సినిమా అద్ధాన్ని చూసి ఇమిటేట్ చేసేవారికీ తక్కువలేదు.

2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
సినిమా హీరోయిన్ వృత్తి (హీరోతోపాటూ)ప్రేక్షకుడ్ని titillate చేసి రంజింపజెయ్యటం. దాన్నొక ప్రొఫెషన్ గా చూస్తే, వారు వేసుకునే దుస్తుల్ని చూసి బాధపడనవసరం లేదు. కానీ, మనకున్నది “విలువల దృష్టి”. ఇలా ఉంటే “తప్పు” అనే pre-conditioned ధృక్కోణం నుంచీ చూస్తే మనకు మిగిలేది humiliation, అయ్యేది over reaction.

3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
చాలా మంది మగవాళ్ళు సినిమాకి వెళ్ళేదే ఈ voyeuristic pleasure “కుతి”ని అనుభవించడానికి. తమ suppressed sexuality కి ఒక చీకటి outlet కోసం. మరి ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి ఏముంది? సినిమా ఒక గౌరవప్రదమైన దారాయె!

4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
మహిళా సంఘాలు ఎన్నోసార్లు ఈ “బూతు” సంస్కృతి మీద ధ్వజమెత్తి సినిమాహాళ్ళను ధ్వంసం చేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఈ ధోరణి సామాన్య ప్రజల్లో అంగీకారాత్మకం అయిపోవడంతో వీళ్ళకు చెయ్యడానికి ఏమీ మిగల్లేదు. ఇదొక విస్తృత సామాజిక ధోరణి దీనకి సమాధానం ‘ఎవరో ఒకరు’ వెతకడం కష్టం. సమిష్టిగా ఒక ప్రయత్నం జరగాలి. కానీ ఈ సమస్యను define చెయ్యడంలోనే చాలా సమస్యలున్నాయి. అందుకే బహుశా ఇంతవరకూ “ఇది చెయ్యాలి” అని చెప్పగలిగేవాళ్ళు లేరు. ఈ సందర్భంలో film studies లాంటి ఒక పరిశోధన చాలా అవసరం.
ఈ క్రింది లంకెలోని వ్యాసాన్ని ఒకసారి చూడండి
http://navatarangam.com/2008/08/telugu-sex-films/

5.Where does creative expression end and pornography begin?
Both are projected to be interrelated. Though they are actually not. Its saleability that is determining soft-pornographic aspects in mainstream Indian cinema, Telugu cinema in particular.


****

Wednesday, May 27, 2009

దళిత లిబరలిజం

లోక్ సభ ఎన్నికల్లో మాయావతి ఉత్తరప్రదేశ్ లో ఓటమి చవిచూసింది. ఓటు శాతం తగ్గకపోయినా సీట్లు మాత్రం పోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దళిత-బ్రాహ్మణ కాంబినేషన్ కు నాంది పలికి ఒక కొత్త సమీకరణాన్ని సాధించినా ఆ మార్గం ఈ సారి ఫలితాల్ని ఇవ్వలేదు.

నిరసనవాద అస్తిత్వవాద దళిత గుర్తింపుతో భారత రాజకీయాల్లో ఒక దుమారం రేపింది మాయావతి. దళితులకు ఆధిపత్యం వహిస్తూనే ఉత్తరప్రదేశ్ లో భౌగోళికంగా, సామాజికంగా దళితులతో మమేకమైన ముస్లింల ఓట్లను సమాజ్ వాదీ పార్టీ నుంచీ లాక్కోవడంలో సఫలమయ్యింది. క్రితం ఎన్నికల్లో యాదవుల,ఠాకూర్ల రాజ్యంలో రాజకీయ గుర్తింపు కోసం ప్రాకులాడుతున్న బ్రాహ్మణులతో జట్టుకట్టి దళిత అస్తిత్వాన్ని మించిన రాజకీయపుటెత్తుగడ వేసి అధికారం కైవశం చేసుకుంది. దళిత బహుజన రాజ్యం ఒక్క దళితులవల్ల రాదనే పాఠాన్ని వంటబట్టించుకుందన్న తరుణంలో ఈ ఓటమి ఒక పునరాలోచనకు పిలుపు.

ప్రముఖ దళిత సిద్ధాంతకర్త చంద్రభాన్ ప్రసాద్ "మాయావతి తన ఇమేజ్ ని పునర్నిర్వచించుకోవాలి" అంటాడు. ముఖ్యంగా దళితులు తమ అస్తిత్వాన్ని కొల్పోకుండా ఇతర కులాల్ని కలుపుకుని సమానత్వం దిశగా, రాజ్యాధికారం దిశగా ప్రయాణించే "దళిత లిబరలిజం" మాయావతి లక్ష్యం కావాలని గుర్తుచేస్తున్నాడు. మాయావతికి "నేను దళిత స్త్రీని" అని చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. తన పోరాటం "దళిత అణచివేతకు వ్యతిరేకంగా" అని ఎలుగెత్తిచాటాల్సిన అవసరం అసలు లేదు. తరాలుగా దళితకులాల్ని వంచించిన అగ్రకులాలపై నిప్పులు చెరగాల్సిన rhetoric అప్రస్తుతం. ఇవన్నీ తెలిసిన విషయాలే. కాబట్టి ఈ తరహా రాజనీతికి విలువ లేదు. అందుకే, మాయావతి ఉద్దేశం అన్ని కులాల,వర్గాల ప్రజలకూ నేతృత్వం వహించే ఒక దళిత మహిళగా ఎదగడమే కావాలి. దళిత లిబరలిజం సిద్ధాంతమే పునాదిగా ఈ ప్రయాణం జరగాలి.

****

Tuesday, May 26, 2009

నేను


ఉఛ్చ్వాస నిశ్వాసాల నడుమ ఏ క్షణం నిలుస్తుందో

ఏ స్వరం లేమితో సంగీతం సుస్వరమవుతుందో

ఏ పదం లేకుండా కవి కల్పన కవిత్వమవుతుందో

ఆలోచన లేక ముందే ఏ భావన ఉదయించిందో

ఆద్యంతాలు కలిసే శూన్యం ఎక్కడ జనించిందో

ఆ క్షణాన్ని నేను

స్వరాన్ని నేను

పదాన్ని నేను

భావాన్ని నేను

ఆ శూన్యాన్ని నేను

*****

Monday, May 25, 2009

యువత - ప్రేమ నిర్వచనం

ఈ కాలం యువత ప్రేమ నిర్వచనం చాలా సింపుల్, "ప్రేమంటే... ఒక వయసుకొచ్చాక మానసిక, శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఆపోజిట్ సెక్స్ 'తోడు' కోరుకోవడం" అంతే.

ఈ నిర్వచనంలో కేవలం వ్యక్తిగత భావనలు తప్ప సాంఘిక విలువలు, సామాజిక ఆదర్శాలూ కనపడవు. సమాజం అందించిన విలువల ఆధారంగా జీవితాన్ని గడుపుతున్న చాలా మందికి ఇది అంగీకారాత్మకం కాకపోవచ్చు. ఎందుకంటే, మనం ఒక పద్దతిప్రకారం ఆల్రెడీ నిర్వచింపబడిన (Well Defined) మూసలో పెరిగి, ఆ విలువల్ని జీర్ణించుకుని, పరిపూర్ణులుగా వ్యక్తిత్వాన్ని సంతరించుకుని ఏర్పడిపోయాం. కొత్త విలువలు లేక మనవి కాని విలువల్ని మన వ్యవస్థ (system) అసంకల్పితంగా రిజెక్టన్నా చేస్తుంది లేక నెగటివ్ గా రియాక్టన్నా అవుతుంది. కానీ చాలా వేగంగా మారుతున్న ఈ విలువల్ని అర్థం చేసుకోలేని సంధియుగం లో ఉన్న మనం వాటిని అందిపుచ్చుకోకపోయినా, కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నింఛాల్సిన అవసరం చాలా ఉంది.

లేకపోతే 'ఫ్యూచర్ షాక్' కోసం సిద్దంగా ఉండాల్సిందే. మొన్న ఒక స్నేహితురాలు నాతో చర్చిస్తూ ఒక మాటంది, "కులాంతర వివాహాలను అంగీకరిస్తూ మనం 'మనసులు విశాలం' చేసుకునే లోఫు, ఏ అమెరికా పిల్లనో చూపించి ఖండాంతర వివాహానికో, లేక అసలు అమ్మాయేకాక ఒక అబ్బాయితో స్వలింగ వివాహానికో తయారౌతున్న జనరేషన్ ఇది" అని. ఇంత ప్రళయం మన గుమ్మం ముందుకు రాక మునుపే, కనీసం మారుతున్న నిర్వచనాల్ని తెలుసుకుంటే అవి 'షాక్ అబ్జార్బర్లు' గా ఉపయోగపడుతాయి.

*****

Thursday, May 21, 2009

ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?

"ప్రజలకు కావలసిన అత్యుత్తమ స్థాయి వైద్యం పైసా ఖర్చులేకుండా జరుగుతుంటే ఆరోగ్యశ్రీ అన్యాయం అంటావేమిటి?" అని ఒక మిత్రుడు రాజశేఖర్ రెడ్డి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అడిగారు. నిజమే! ఒకవైపు నాణ్యమైన సేవల్ని, సౌకర్యాల్ని ఇవ్వలేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు కష్టాలు పడే బాధ తప్పింది. అందరి ద్రాక్షల్లాంటి కార్పొరేట్ వైద్యం తీగందించి పేదోళ్ళ నోట్లో తియ్యటి ద్రాక్షల్ని నింపుతోంది. పైసా ఖర్చు లేకుండా పేదోడికి ఉత్తమప్రమాణాలున్న వైద్యం ప్రాణాలు కాపాడుతోంది. మరి ఇందులో సమస్యేమిటి?

సమస్య లేదనుకోవడమే ఇక్కడ సమస్య. వైద్యరంగంసంస్కరణల నేపధ్యంలో అరోగ్యశ్రీ ఒక aberration. ప్రభుత్వ వైద్యవ్యవస్థను బాగుపరచాలనుకునే ఆశయాలకొక గొడ్డలిపెట్టు. ఇప్పటికే దాదాపు 80% ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యసేవల్ని పూర్తిస్థాయిలో ప్రైవేటు పరం చేసి, ప్రైవేటు సంస్థలకు సిల్వర్ ప్లేట్లో వందశాంతాన్ని అందజేసే కుట్రలో భాగం. కానీ ఇదొక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నమూనాను మరిన్ని రాష్ట్రాలు త్వరలో అమలు చెయ్యడానికి పూనుకొన్నంతటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అందుకే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక "పాజిటివ్ ప్రైవెటైజేషన్" అనాల్సొచ్చింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకోసం నామమాత్రపు యూజర్ ఛార్జిలు పెడితే, ఆ చర్యను ప్రైవెటైజేషన్ పేరుతో పీకిపాతరేసిన వై.ఎస్.ఆర్ కొనసాగిస్తున్న ఈ పరోక్ష ప్రైవెటైజేషన్ మాత్రం విన్నూత్నమవడం విచిత్రమే. ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఈ రంగంలో స్థిరమైన పాజిటివ్ మార్పు కోరుకునే మేధావులూ, ప్లానర్లూ, వ్యూహకర్తలూ నిశ్శబ్ధం వహించడం మాత్రం షాకింగ్ గా ఉంది. ఈ నిశ్శబ్ధానికి వీరు చెప్పే సమాధానాలు self defeating గా ఉన్నాయన్న స్పృహకూడా లేకుండా కొందరు వివరణ ఇవ్వబూనడం మరింత హాస్యాస్పదం.

వీరు ముఖ్యంగా చెప్పేదేమిటంటే ప్రైవేటు రంగంలో ఉన్నన్ని సాంకేతిక సౌకర్యాలు,నిపుణత ప్రభుత్వరంగంలో రావాలంటే మరో 20 సంవత్సరాలు పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నపని. కాబట్టి ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఇప్పటికే ఉన్న ప్రైవేటు రంగానికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇవ్వడం సమంజసం అనేది వీరి వాదన. ప్రస్తుతానికి ఈ విధానం బాగానే ఉంది. మరి వచ్చే 20 సంవత్సరాలలో ప్రభుత్వరంగ ఆసుత్రుల్ని సూపర్ స్పెషాలిటీ చెయ్యడానికి ప్రణాళిలున్నాయా? అని అడిగితే మాత్రం నీళ్ళునములుతారు. ఈ వివరాల్ని చెప్పిన పరిశోధనలు ఎవరు చేశారన్న ప్రశ్నకి మౌనమే సమాధానం.

అంటే అతిముఖ్యమైన ఖర్చుఎక్కువా ఆదాయం తక్కువైన ప్రాధమిక ఆరొగ్యసేవల్ని వ్యయప్రయాసలకోర్చి ప్రభుత్వరంగం నడుపుతుంది. డబ్బులు దండుకోవడానికి ‘హైకాస్ట్ హెల్త్’ సూపర్ స్పెషాలిటీ పేరుతో ప్రైవేటు రంగం పాలవ్వాలి. ఇప్పుడ్యు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రిలను బాగుపరచడానికి ఖర్చుపెట్టవలసిన డబ్బంతా ప్రైవేటువారికి తినిపిస్తుంది. భవిష్యత్తులో చేతులెత్తేసి, ప్రజల్ని ప్రైవేటు హాస్పిటళ్ళపరం చేస్తుంది. ఇదేగా మన గొప్ప సంస్కరణ!

నిజానికి పదిహేను సంవత్సరాల క్రితం పరిస్థితి చూస్తే ప్రభుత్వ బోధనా వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా పేరుగాంచాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ల జీతాలు పెంచక, సరైన సౌకర్యాలు కల్పించకా ప్రైవేటురంగం వైపుగా పంపించారు. ఇప్పుడు అదే expertise తక్కువయ్యిందనే కారణం చూపి రోగుల్నీ అక్కడికే పంపుతున్నారు. అదీ డబ్బులిచ్చి మరీ. ఆంటే పద్ధతి ప్రకారం ప్రభుత్వరంగాన్ని పనికిరాకుండా చేసి ప్రైవేటుకు ధారాదత్తం చెయ్యడమేగా లక్ష్యం.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చుకన్నా, ప్రజలు తమ ఆరోగ్యంపై పెట్టుకునే ఖర్చు ఎక్కువ. భారతదేశంలోనూ అదే పరిస్థితి. మారుమూల పల్లెలనుంచీ పట్నాలదాకా ఆర్.ఎం.పీ లకూ, ప్రైవేటు డాక్టరలకూ, వైద్యపరీక్షలకూ, మందూమాకుకూ సామాన్యప్రజలు పెట్టే ఖర్చు చూసుకుంటే ప్రభుత్వం పెట్టే ఖర్చుకన్నా కనీసం తొమ్మిది రెట్లు ఎక్కువుంటుంది. మన ప్రభుత్వాలు వైద్యరంగానికి కేటాయించే బడ్జెట్ GDP లో 0.9% దాటిన పాపాన ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు టార్గెట్ 2-3% అంటున్నారు. కానీ ఇలా భవిష్యత్ ప్రణాళిలు లేని పబ్లిక్-ప్రైవేటు భాస్వామ్య కార్యక్రమాలు కొసాగిస్తే చివరికి మొత్తం ప్రభుత్వ ధనంకూడా ప్రైవేటువాళ్ళకిచ్చేసి వాళ్ళనే వైద్యరంగాన్ని నడపమనే పరిస్థితి రావచ్చు.

ఇక్కడ ప్రైవేటు రంగం వారి తెలివిని అభినందించాలి. వీళ్లు preventive and primary health care లోకి ఛస్తే అడుగుపెట్టరు. ఎందుకంటే అక్కడ కష్టమెక్కువ అమ్యామ్యా తక్కువ. పైగా 80% సాధారణ రొగాల్ని ఆస్థాయిలో అడ్డుకట్టవెయ్యగలిగితే వీరికి పనిలేకుండాపోతుందాయె. అంటే రోగాల్ని ఆపడంలో వీరికి అస్సలు ఆసక్తి లేదు. రోగాలుండి అవి పెచ్చరిల్లితేనే కదా వీరికి లాభాలు. వీరి ముఖ్యమైన పెట్టుబడల్లా ఆధునిక పరికరాలని దిగుమతి చేసుకుని "కొత్త వైద్యాన్ని కనిపెట్టి" ఖర్చుపెంచడం. ఒక గుండెకు సంబంధించి శస్త్రచికిత్సకు ఖర్చెంతవుతుందనే ఖచ్చితమైన అంచనాలు ఎవరైనా చెప్పగలరా? ప్రైవేటువారు ఎంత చెబితే అంత. ఈ ధరల్ని నిర్ణయించడంలోని శాస్త్రీయత ఎంత? దీనిపైన ఎవరి నియంత్రణైనా ఉందా? అనేవి ఎవరూ అడగని, అడగకూడని ప్రశ్నలు.

వైద్య,ఆరొగ్యరంగం మొత్తం భారతదేశంలోనే ఒక మాయాజాలంగా తయారయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు మంత్రులు, ముగ్గురు సెక్రెటరీలు,దాదాపు ఏడుమంది కమీషనర్లతో మాయను మించిన మహేంద్రజాలంగా తయారయ్యింది. ఈ పరిస్థితుల్లో సంస్థాత,వ్యవస్థాత సంస్కరణలు నిజంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయా అనేది ఒకపెద్ద ప్రశ్న.

*****

Wednesday, May 20, 2009

ప్రేమిస్తేగానీ...



ప్రేమిస్తేగానీ...
అవసరం అనుభూతి అవదు
అనుభవం సమర్పణ అవదు
కలయిక పవిత్ర్రం అవదు

చర్యలో లేనిది
భావనలో ఏముందో ?
భావుకత్వం
నిజానికి "విలువ"నిస్తే
మరి నిజానికి నిజమైన విలువెక్కడ?

అవసరంలోనే అనుభూతి ఉంటే
అనుభవం సమర్పణ కాదెందుకు?
పవిత్రతే ఒక అవసరమైతే
ఆ భావన విలువెంత?


ప్రశ్నలేగానీ జవాబులు లేవు
తెలిసిచెప్పకపోయినా
తలలు వేయి వ్రక్కలవవు
రహస్యంగా అనుభవించే
ఆలోచనలేగానీ
ఇవేమీ బేతాళ ప్రశ్నలు కావుగా!

అందుకే
నాకోసం
అందరికోసం
మరికొందరికోసం
ప్రేమిస్తేగానీ...

*****

Tuesday, May 19, 2009

తెలుగు పుస్తకం : విలువ Vs ధర

ఇప్పుడే కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులో పుస్తకాలు వాటి ధరల గురించి ఒక రచయిత వేదన అనుభవించి వస్తున్నాను.

నిజమే! మల్టిప్లెక్సులో తెలిసితెలిసీ ఒక చెత్త సినిమా చూడ్డానికి పెట్టే వందరూపాయలు ఒక చదవగలిగిన ( చదివితేగానీ అది మంచి పుస్తకమా చెత్త పుస్తకమా అని తెలీదు) తెలుగు పుస్తకానికి ఖర్చుపెట్టాలంటే మనకెందుకో ‘నొప్పి’. అదే ఇంగ్లీషు పుస్తకానికి పెట్టాలంటే వందకాదుకదా, ఐదువందలైనా ఏమాత్రం సంకోచం చేకుండా పెట్టేస్తాం. అంటే పుస్తకానికి ఖర్చుపెట్టడం సమస్య కాదుగానీ, తెలుక్కొచ్చేసరికీ మాత్రం "ధర" ఒక పెద్ద క్రైటీరియా అయిపోయింది. ఇలా పాఠకుడికీ పుస్తకానికీ. పుస్తకాల వెలకూ విలువకూ సంబంధం లేని ధరలతో మన తెలుగు పుస్తకాల మార్కెట్ కళకళలాడుతూ కలగాపులగంగా తయారయ్యింది.

తెలుగునాట కొత్త పాఠకులు తయారయ్యే సంస్కృతే లేదు అనే మూల సమస్యని పక్కనబెడితే, ప్రస్తుతం ఉన్న ఈ సమస్యకు నాకు అనిపించిన సమాధానం, ఇంగ్లీషు పుస్తకాలు కొనేముందు వాటి "విలువ" యొక్క సమాచారం మనకు ఎక్కడో ఒకదగ్గర తెలిసుండటం. ఒక రచయిత గొప్పతనమో, ఆపుస్తకం యొక్క ఉపయోగత్వమో లేదా ఆ పుస్తకాన్ని చదివిచెప్పిన ఒక "విలువైన" అభిప్రాయమో మనకు ముందే తెలుస్తాయి. అప్పుడు పుస్తకం యొక్క ధరతో విలువను బేరీజు చేసి కొనడానికి మానసికంగా సంసిద్ధమైపోతాం. ఎకానమీ ఆఫ్ స్కేల్ తీసుకుంటే అధిక సంఖ్యలో అమ్ముడవుతాయి కాబట్టి ఇంగ్లీషు పుస్తకాల ధరలు తక్కువగా ఉండాలి. కానీ వారు ధరని కాకుండా, విలువని మార్కెట్ చెయ్యటంలో సఫలమవుతున్నారు. కాబట్టి లాభాలకు లాభాలూ ధరలకు ధరలూ మెండుగా దండుకొంటున్నారు. కానీ తెలుగులో ఆ సౌలభ్యం తక్కువ. పుస్తక సమీక్షలు, చర్చాగోష్టులూ తప్ప పుస్తకాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యడానికి, ప్రమోట్ చెయ్యడానికీ మనకు తగినన్ని సంస్థాగత ఏర్పాట్లు లేవు. ఈ కారణంగా అలాంటి పుస్తకాల్ని చదవాలనుకునే టార్గెట్ పాఠకుల్ని కూడా అందుకోలేని దుస్థితి మన తెలుగు పుస్తకాలకు పట్టింది. లేకపోతే పదికోట్ల జనాభావున్న తెలుగోళ్ళుండగా సంవత్సరాల తరబడి కనీసం వెయ్యికాపీలు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రచయితలూ పబ్లిషర్లూ ఉండటమేమిటి?

ఒక వేళ ఆ సౌలభ్యం ఉన్నా, అంత ధర చెల్లించి మనోళ్ళు తెలుగు పుస్తకాలు అస్సలు కొనరన్నది కొందరి వాదన. అలా అయితే, కొంత మన మానసికతను గురించి ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుపుస్తకాల్ని చీప్ గా కొనడం మనకు అలవాటయ్యిందా లేక ధరకుతగ్గ విలువ మన పుస్తకాల్లో ఉండదా అనేవి తెలుసుకోవలసిన సమాధానాలు. ఇక్కడ మళ్ళీ విత్తుముందా చెట్టుముందా అనే ప్రశ్న ఉదయిస్తుందేమో! అంత ధరకు తప్ప పెరిగితే కొనేవాళ్ళు తక్కువకాబట్టి అంతే నిర్ణయించామని పబ్లిషర్లు, ఇంత ధరకే ఇప్పటివరకూ లభ్యతలో ఉంది కాబట్టి అంతకే కొంటూవచ్చాం అని పాఠకులూ అనేస్తే మన మొదటి ప్రశ్న కాస్తా చతికిలబడుతుంది. అంటే తక్కువ ధర ఒక ‘అలవాటు’ అనేది కొంచెం సంశయించాల్సిన విషయమే.

ఎందుకంటే, మన దినపత్రికలూ, వారపత్రికలూ, మాసపత్రికల ధరలు గత పది సంవత్సరాలలో కనీసం వందశాతం పెరిగాయి. ఉదాహరణకు 5 రూపాయలున్న సితార ఇప్పుడు 10 రూపాయలు. ఈ పత్రిక ప్రయాణాల్లో పదినిషాలు చదువుకుని, ఆ తరువాత పేపర్ ప్లేట్లుగా ఉపయోగించుకోవడానికి తప్ప మరెందుకూ పనికిరాదు.ఆరు రూపాయలున్న స్వాతి పత్రిక ఇప్పుడు పది రూపాయలు. దినపత్రికలైతే అలవాటు పడిన తరువాత రెండ్రూపాయలనుంచీ మూడున్నరకు వెళ్ళినా కొనడం ఆపిన ప్రజలు నాకైతే ఎవరూ కనిపించలేదు. ఇహ వాటి సర్క్యులేషనైతే నేను పుట్టినప్పటి నుంచీ ఎప్పుడూ లక్షల్లోనే ఉంది. అంటే టైంపాసు పత్రికలకూ, ఆరోజు గడిచిన తరువాత ఎటువంటి విలువా లేని దినపత్రికల ధరల్లో మార్పులు జరిగినా కొనడం ఆపని పాఠకుడు చదివి దాచుకోగలిగే పుస్తకానికొచ్చే సరికీ ధర విషయంలో వెనకంజ వేస్తాడా? అనేది పరిశోధించదగిన విషయం. లేదా మన పబ్లిషర్లూ,రచయితలూ కొనరన్న అపోహతో ధరల్ని కుదించి అలా సెటిలైపోయారా అనేదికూడా తెలుసుకోవాలి.

రెండో విషయం మన తెలుగులో ధరకుతగ్గ విలువున్న పుస్తకాలు తక్కువుండటం. ఇది మరో ఔట్రేజియస్ ఆరోపణే అవుతుంది. కొత్త పుస్తకాల విలువలు ప్రమోషనూ, పబ్లిసిటీ నిర్ణయించినా, మన దగ్గర అత్యంత విలువైన పాతబంగారమైన సాహితీభాండారం ఉన్నమాటైతే ఎవరూ కాదనలేని నిజం. మరి ఆ విలుకుతగ్గ ధరని మనం నిర్ణయించామా అనేది ఆలోచించాలి. కొన్ని ఎవర్ గ్రీన్ పుస్తకాలు ఎప్పుడూ అమ్ముడయ్యేవే. చలం, బుచ్చిబాబు,తిలక్,రంగనాయకమ్మ, కొడవటిగంటి,మధురాంతకం,శ్రీశ్రీ, లు సమయం, సందర్భం, ధరతో సంబంధం లేకుండా పుస్తకాల షెల్ఫుల నుంచీ ఎగిరెళ్ళిపోయే వారే. కాకపోతే ఇక్కడ ధరతోపాటూ పుస్తకాల ముద్రణయొక్క నాణ్యత మరో సమస్య. నాదగ్గరున్న ‘అమరావతి కథలు’ ఎవరో తీసుకుని మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ కొందామని ఈ మధ్య షాపుకెళ్ళాను. ధర పదిశాతం పెరిగిందిగానీ, నాణ్యత వందశాంతం తగ్గింది. ఇదే దుస్థితి బారిష్టర్ పార్వతీశం పుస్తకానీకీ పట్టింది. చలం పుస్తకాల రీడిజైనింగ్ ఇంకా కొత్త పాఠకుల్ని తెచ్చిపెట్టగలదు. కొన్ని మంచి పుస్తకాలు ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్ అని చెబుతూనే ఉంటారు. 2000 సంవత్సరంలో లో ఔటాఫ్ ప్రింట్ అయిన ‘ఖాకీబతుకులు’ నవల నేనింకా వెతుకుతూనే ఉన్నాను. ఇలా మరెన్నో పుస్తకాలు జ్ఞాపకాల్లోతప్ప పుస్తకాలుగా నాదగ్గర లేకుండా పోయాయి. ఇదో తెలుగు పాఠకుడి వెరైటీ ఖర్మ.

మళ్ళీ మొదటి నుంచీ మెదలెడితే, ఈ మధ్య సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు చూడ్డం మానేసి డబ్బులెక్కువ పెట్టి మల్టిప్లెక్సుల్లో సినిమాలు చూడ్డానికి కారణం, సినిమా చూడ్డంలో పొందే నిర్థిష్టమైన అనుభవం. మామూలు ధియేటర్లలో ఆపరేటర్ ఇష్టమొచ్చిన దగ్గర సౌండ్ పెంచెయ్యడం, కార్బన్ సరిగ్గా పెట్టక బొమ్మ మసకేసెయ్యడం, కొత్త సినిమా అయితే బోనస్ గా వచ్చే అరుపులూ కేకలూ మల్టిప్లెక్సుల్లో ఉండవు. సినిమాని దర్శకుడు ఎలా చూపించడానికి డిజైన్ చేశాడో అదే అనుభవాన్ని మల్టిప్లెక్స్ నాకు అందిస్తుంది. సెట్టింగ్, ఫెసిలిటీ, అనభవంలో మార్పుకోసం అదనంగా డబ్బులు ఖర్చుపెట్టడానికి తయార్. ఇదే అనాలజీ పుస్తకాల షాపులకు కూడా వర్తిస్తుందేమో! ఉదాహరణకు ఒడిస్సీ, వాల్దన్, క్రాస్ రోడ్స్ లాంటి షాపులకు వెళ్ళండి. అక్కడి యాంబియెన్స్ ద్వారా ఒక పాఠకుడితో ఆ షాపు ప్రవర్తించే తీరు, పుస్తకాన్ని ఖరీదుచేసే వాతావరణాన్ని సమూలంగా మార్చేస్తుంది.

మైసూర్ లో చదువుతుండగా అక్కడ యూనివర్సటీ క్యాంపస్ లోని హిగిన్ బాథమ్ రెగ్యులర్ విజిటింగ్ పాయింట్. అక్కడ మనం మొదటి సారి వెళ్ళి ఒక పుస్తకాన్ని ఎంచుకుని కౌంటర్లోకి రాగానే మన అభిరుచికి అనుగుణంగా మరికొన్ని మరికొన్ని పుస్తకాలు సూచింపబడతాయి. అప్పటికప్పుడు మరొకటి కొనడమో లేక కనీసం ఆ తరువాత కొనడానికి నిర్ణయించుకోవడానికో ఈ సూచనలు ఉపయోగపడతాయి. రెండోసారి వెళ్ళినప్పుడు ఆపుస్తకం షాపు యజమాని మనం క్రితం కొన్న పుస్తకం ఎలా ఉంది? నచ్చిందా,లేదా? అనే ప్రశ్నలు ఖచ్చితంగా ఆడుగుతాడు. ఈ విధంగా ఆ పుస్తకం షాపుతో మనకు ఒక వ్యక్తిగత బంధం ఏర్పడిపోతుంది. ఇక ఎక్కడికెళ్ళొచ్చిన్నా, ఆ పుస్తకం షాపుమాత్రం జీవితంలో ఒక భాగంగా మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలోని మాల్ బుక్ షాపుల్లో, పుస్తకం కొనకపోయినా కాఫీ తాగుతూ ఆ పుస్తకం చదివే సౌకర్యాలూ, పుస్తకాల గురించి చర్చించుకునే చర్చా వేదికలూ, పుస్తక పఠన సెషన్లూ కల్పిస్తూ పాఠకులకు మరింత దగ్గరవుతున్నాయి. కానీ తెలుగు పుస్తకం, పుస్తకాల షాపూ, పాఠకుడూ ఎక్కడవేసిన గోంగళి అక్కడనే. పుస్తకమేళాలూ, ఎగ్జిబిషన్లూ మొదలైనా అవి ఈవెనింగ్ ఔటింగుకెక్కువా, తెలుగు పుస్తక ప్రమోషన్కు తక్కువాగా ఉన్నవే.

ఏదిఏమైనా, ఒక పుస్తకం "విలువ" అది చదివితేగానీ మనకు తెలీదు. చదివినా, దాని విలువని మన జీవితానికి ఆ పుస్తకం అందించే అనుభవాన్ని బట్టిగానీ నిర్ణయించలేము. అందుకే కొన్ని పుస్తకాల్ని ‘అమూల్యం’ అంటుంటాము. కొన్నింటిని "వేస్టు" అనేస్తాం. కానీ ఈ రెండు నిర్ణయాలకూ పుస్తకాల్ని కొని చదవడం అవసరం. కానీ కొనిచదవడానికి "ధర" మనకు అడ్డొస్తే....ఆ కారణంగా మనం కోల్పోబోయే విలువని తెలియజెప్పడానికి ఒక మాధ్యమం కావాలి. అది తెలుగులో లేనన్నాళ్ళూ ఒకవైపు రచయితకూ, పబ్లిషర్లకూ మరోవైపు పాఠకుడికీ ఈ తిప్పలు తప్పవు.

*****

Monday, May 18, 2009

హేట్ బ్లాగర్లకు అంకితం

"Opinions are like assholes.
Everybody has one."
-The Dead Pool (1988)

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ హేట్ బ్లాగర్లతో సమస్యేమిటంటే.....

"Opinions are like assholes. Everybody's got one and
everyone thinks everyone else's stinks."
తోవచ్చింది అసలు తంటా.
మనకంపు మనకు ఇంపేగానీ, పక్కొడు పేలిస్తేమాత్రం కంపుకంపే!

జైహో!

*******

హిందువులకు ‘జైహో’

భయ్ హో! అంటూ ముందుకొచ్చిన అతివాద,మతవాద,హిందుత్వవాదాల్ని ఈ ఎన్నికల్లో హిందువులు మట్టికరిపించారు. ఎమ్.జె.అక్బర్ తన ఎడిటోరియల్ లో చెప్పినట్లు "India is not a secular nation because Indian Muslims want it to be secular. India is a secular nation because Indian Hindus want it to be secular." అనేది జాతీయరాజకీయాల్లో మరోసారి ఋజువయ్యింది.

భయం ప్రాతిపదిక మీద. ద్వేషం ఆధారంగా. అసహనాన్ని నూరిపోసే బీజేపీ రాజకీయాల్ని నిర్ధ్వందంగా హిందూ ప్రజలు తిరస్కరించారు. వైషమ్య రాజకీయాలకన్నా, కుహానాలౌకికవాదంగా హిందుత్వవాదులచే పిలువబడే కాంగ్రెస్ ఉదారవాద రాజకీయానికి పట్టంగట్టారు. సామాన్యప్రజల రోజువారీ సమస్యలతో సంబంధం లేని, రిచ్యువలిజం తప్ప రిలిజియమ్ జీవితాల్లో లేని ఇన్సెక్యూర్ మధ్యతరగతి హిందుత్వవాద ధోరణి ఒక మైనారిటీ వాదం అనే నిజం తేటతెల్లం అయ్యింది.

ముస్లింల జనాభా ఎన్ని రెట్లు వృద్ధి చెందినా, క్రైస్తవంలోకి ఎంత మంది వెళ్ళినా హిందువుల మెజారిటీకి ఈ దేశంలో వచ్చే ఢోకా ఏమీ లేదు అనే నిజం జనాలకి తెలిసొచ్చింది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు తీవ్రవాద స్థావరాలైతే మనకొచ్చే ముప్పుకన్నా బీజేపీ మైనారిటీల్లో రేపే భయంవల్ల, హింసాకాండవల్ల ఏర్పడే తీవ్రవాదుల వల్లే మనదేశానికి ముప్పనే నిజం ఎరుకలోకి వచ్చింది. కాంగ్రెస్ మైనారిటీ,దళిత, గిరిజన విధానాలవల్ల హిందువులకు అన్యాయం జరిగిపోతోందనే బీజేపీ శుష్కవాదానికి తెరపడింది.

బీజేపీ పార్టీ రాజకీయ అస్తిత్వాన్నీ, నాయకత్వం యొక్క క్రెడిబిలిటీని, మూలతత్వమైన హిందుత్వాన్నీ ఈ ఎన్నికల ద్వారా ప్రశ్నార్థకం చేసి ఈ దేశ హిందువులు తమ భావవైశాల్యాన్ని నిరూపించారు. ప్రతి చిన్నాచితకా విషయానికీ మనోభావాలు దెబ్బతీసుకుని తమ నమ్మకాలు ఎద్దేవా చెయ్యబడుతున్నాయనే కుహానా మధ్యతరగతి హిందువులు ఒక అల్పబుద్దికలిగిన మైనారిటీగా నిరూపించబడింది. అందుకే చైతన్యవంతులైన మెజారిటీ హిందువులకు ఈ ఎన్నికల్లో జైహో!

****

Saturday, May 16, 2009

ప్రభాత ప్రార్థన


ప్రతిక్షణాన్నీ
ఒక ఆశ్చర్యాద్భుతంగా
మలచడానికి
జీవితాన్ని
అదే ఆశ్చర్యాద్భుతంలో
ఆ సంభ్రమలో జీవించడానికి
ఆ ఆనందంలో
వెచ్చటి భాష్పాంజలి ఘటించడానికి

ప్రతి నిమిషం
ఒక విభ్రమలో
ప్రేమలో
క్షమలో
...నీ సన్నిధిలో
ఆలింగనలో
పరిష్వంగనలో...

the morning prayer

to create
every moment
an act of absolute astonishment
to live
in astonishment
and in wonder

and to cry
with tears of joy
and warmth

every moment
in awe
and in love
and in forgiveness

and in your embrace

(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

*****

Thursday, May 14, 2009

చరిత్రా, పురాణమా!

"ఒక జాతి ముందుకు పోవటానికి తోడ్పడేది చరిత్రా,పురాణమా? ఈ ప్రశ్నకు పురాణమే అని సమాధానమిచ్చే స్థితిలో ఉన్నవాడు బహుశా భారతీయుడే అయి ఉంటాడు. వాస్తవ చరిత్ర లిఖిత రూపాలలో నిక్షేపించడం ఇతర ప్రాచ్య దేశాలవారికి తెలిసినట్టు భారతీయులకు తెలీదు. అందుచేత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మన తొలి సంస్కృతిని పాశ్చాత్యులు మన వైదిక సంస్కృతిలో చూస్తే, మన సంస్కృతిని మధ్య ఆసియావాసులు గణితంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ, వైద్యశాస్త్రంలోనూ చూస్తే, మనం మటుకు దాన్ని రామాయణంలో చూస్తున్నాము. ప్రపంచానికి చూపించటానికి గర్వపడుతున్నాం.

మనజీవితానికి ఉపకరించే సత్యాలన్నీ రామాయణంలో ఉన్నట్టు ఆధునిక పౌరాణికులు ప్రచారం చేస్తున్నారు. చరిత్రనుంచీ ఫలాని విషయాలు నేర్చుకోవాలని గట్టిగా ప్రచారం చేసేవాళ్ళు లేరు. మన భవిష్యత్తంతా రామాయణం మీద ఆధారపడి ఉండగా మళ్ళీ చరిత్ర దేనికి?

ఇంతకన్నా చిత్రం ఏమిటంటే మనం ఆపురాణాలను ఉన్నవి ఉన్నట్టుగా ఉండనీయటం లేదు.మన సంస్కృతికి పరాకాష్ట అయిన రామాయణం కథా, శంబూక వధా అన్నీ రామాయణ ప్రక్షిప్తాలలో ఉన్నవే.ప్రక్షిప్తాలుకాని రామాయణ భాగాలనుకూడా మన పౌరాణికులు, ఔత్సాహికులూ మార్చారు. ఈ విధంగా రాముడికి మిత్రుడిగా చెప్పబడ్డ గుహుడు రాముడికి భక్తుడయ్యాడు. శబరి ఇంకో భక్తురాలయ్యింది. అక్కడక్కడా సామాన్యమానవుడి దౌర్బల్యాలు బాహాటంగా ప్రదర్శించే రాముడు ఉన్నట్లుండి దేవుడయి పోతాడు!

పురాణ సంస్కృతి మన సంస్కృతికి పునాది అయినా రాజకీయ కారణాలవల్ల మనకు కొంతవరకూ చరిత్రను గురించి కూడా తోడవటం అవసరనవుతుంది. కాని అందువల్ల కలిగే ఇబ్బందిని దాటడానికి మన పురాణాలకు చేసిన మర్యాదే చరిత్రకు కూడా చేస్తుంటాం. దాన్ని మన పురాణసంస్కృతికి అనుకూలంగా కూర్చుతూ ఉంటాం. అప్పుడు పురాణాలకూ, చరిత్రకూ గల అట్టే తేడా ఉండనవసరం లేదు."

- కొడవటిగంటి కుటుంబరావు
యువ మాసపత్రిక, ఆగష్టు -1980

కళలు -శాస్త్రీయ విజ్ఞానం, విరసం ప్రచురణ, సెప్టెంబరు, 1980


పుస్తకం:
కొడవటిగంటి కుటుంబరావు - చరిత్రవ్యాసాలు
ప్రచురణ: విప్లవరచయితల సంఘం
ప్రతులకు: ననోదయ బుక్ హౌస్
వెల: రూ 100 /-



****

Wednesday, May 13, 2009

సాహిత్యంలో మరో వివాదం - భరతఖండంబు చక్కని పాడియావు


భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
దెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తేటగీతి’ ఇది. 1907 రాజమండ్రి లో బిపిన్ చంద్రపాల్ గారి వందేమాతర ఉద్యమ ప్రచార సభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పద్యం చెప్పగా విశేషస్పందన వచ్చింది. ఆయన మనసులో ఊహించుకుని చెప్పినట్లు చెప్పడం వల్ల ఇది అశువుగా చెప్పిన పద్యమనుకుని ఇప్పటివరకూ చాలా మంది సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధన కర్తలు అది చిలకమర్తిగారి పద్యమనే అనుకుంటున్నారు. ఈ పద్యం తొలిదేశభక్తి కవితగా కూడా ప్రసిద్ధి చెందింది. తద్వారా చిలమర్తివారు తొలిజాతీయోద్యమ కవి అయ్యారు.

1968 లో చిలకమర్తివారి శతజయంతి జరిగినప్పటి నుండీ ఈ పద్యం విషయంలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు దాదాపు వందసంవత్సరాల తరువాత ఈ పద్యం 1905 లో చెన్నాప్రగడ భానుమూర్తి గారు రాసిన ‘భారత ధర్మదర్శనం’ అనే ఖండకావ్యంలోనిదిగా అది 1905-07 ప్రాంతంలో అచ్చయినదిగా కరణం సుబ్బారావు తగినన్నిఆధారాలతో ఒక పుస్తకంగా ప్రచురించారు. చిలకమర్తివారు వారి,స్వీయచరిత్రలోకూడా "ఊహించుకుని (గుర్తు చేసుకుని) చదివితిని" అనడం. 1907 నుంచీ 1920 ప్రాంతంలోని ఏ పత్రికా ఈ పద్యం చిలకమర్తివారి రచనగా పేర్కొనకపోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

వందసంవత్సరాల తరువాత ఈ పద్యం ఎవరురాశారు అనేది తిరగదోడడం అవసరమా? అని ప్రశ్నించేవారికి "ఒక కవికి అన్యాయం జరగకూడదు" అనే ఈ పుస్తక రచయిత ఆశయం సమాధానం చెబుతుంది. ఈ పద్యం రాయకపోయినంత మాత్రానా చిలకమర్తి వారి స్థాయి తెలుగు సాహిత్యంలో తగ్గేదీకాకపోయినా, ఈ కొత్త నిజం ఒక మరచిపోయిన, సరైన గుర్తింపు లభించని కవికి గుర్తింపునిస్తే అంతేచాలు.

ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు.

సమాధానకర్త: కరణం సుబ్బారావు
ముద్రణ: మార్చి,2009
ప్రచురణకర్త: అనూస్ పబ్లికేషన్స్
వెల: రూ.50 /-

*****

Tuesday, May 12, 2009

బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ - రేరాజుకు కొన్ని సమాధానాలు

రేరాజుగారు ‘బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్' అనే టపాకి సంబంధించిన చర్చల్లో నేను "బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది." అని వివరిస్తే కొందరు దీన్నొక బ్రాహ్మణ ‘కుల’ ద్వేషంగానో లేక మరొక డెఫినిటివ్ స్వరంగానో పరిగణించడం జరిగింది. దానికి కొనసాగింపుగా "వేదకాలంనాటి హైందవానికీ అ తరువాత కాలంలో వచ్చిన వ్యవస్థీకృత హిందూమతానికీ చాలా తేడాలున్నాయి. ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి! ఇవన్నీ ఒక వర్గం వారు తమ స్వార్థానికి తెచ్చిపెట్టిన లంపటాలు. వీటిని ప్రశ్నించకుండా “పవిత్రం” చేసిన ఘనత కూడా వీరిదే. వారెవరో కొత్తగా చెప్పాలంటారా?

వేదకాలంలో ఉన్న “నేతినేతి” సంస్కృతిని “ఇతిఇతి”గా మార్చిన ఘనత సామాజిక ఆధిపత్యాన్ని కాంక్షించిన సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులదే. దీనికి చరిత్ర సాక్ష్యం.ఈ “ఇతిఇతి” నుంచీ బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ వచ్చిందని, అదొక సామాజిక ధోరణిగా మారిందని నా అంచనా. అదే నా నమ్మకం కూడాను. ఈ ఆలోచనకు ప్రత్యామ్న్యాయం లభించేవరకూ అదే నా “డెఫినిటివ్” అబిప్రాయం." అని చెబితే, ఇందులోకూడా అర్థంకాని విషయాలు చాలా కనిపించాయి.

ఆ సందర్భంలో ‘dominant paradigm’ and ‘hegemony’ అనే రెండు పదాల్ని రేరాజుగారికిచ్చి, వీటి గురించి తెలుసుకొంటే బహుశా నా ధృక్కోణం మరింతగా తెలుస్తుంది అని చెప్పటం జరిగింది. అప్పుడు రేరాజు బీయింగ్ వాట్ హియీజ్, నన్నే ఒక టపారాసి పుణ్యంగట్టుకోమన్నారు. అందుకే ఈ ప్రయత్నం.


‘dominant paradigm’: ప్రచులిత విలువల సమాహారం - ‘hegemony’ : ఆధిపత్యం

ప్రతిసమయంలోనూ ప్రతి సమాజంలో కొన్ని నిర్థారిత విలువలు ప్రచులితమై ఉంటాయి. ఆ విలువలే ఆ సమాజాన్ని నిర్వచిస్తాయి, నాగరికత స్థాయిని నిర్థారిస్తాయి. ఈ విలువలు పూర్తిసమాజంలోని అన్నిపార్శ్వాలలోనూ ఒకటిగా ఉండకపోవచ్చు. ప్రతిపార్శ్వంలోనూ వివిధ స్థాయిల్లో కొన్ని నిర్ధిష్టమైన విలువలు ఏర్పడుతూ ఉంటాయి. అవి సాధారణమైన గాలివానలకు చెదరవు. ఈ విలువల్ని కూకటివేళ్ళతోసహా పెకిలించగలిగిన "మార్పు" వస్తేనే అవి సమూలంగా మారేదిశగా పయనిస్తాయి. ఇలాంటి సమూలమైన మార్పుల్ని "paradigm shift" అంటారు. చర్చ ఈ paradigm shift ది కాదు. చర్చ reinforcing the dominant paradigm అనే ప్రక్రియది.

ప్రచులితమైన విలువలవలన లాభం పొందుతున్న వర్గాలు ఎప్పుడూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే చూస్తారు. అది సహజం. ఈ ఆధిపత్య ధోరణిని hegemony అంటారు. వీటిల్లో ముఖ్యంగా cultural and social hegemony అనేవి బ్రాహ్మణభావజాలం (కులం కాదు) ద్వారా మన భారతీయ సమాజంలో, కొన్ని వర్గాల ఆధిపత్యానికి కొమ్ముకాసేవిధంగా అమలు జరపబడుతున్నాయి. ఈ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి cultural and social imperialism అనే ప్రక్రియ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆదిమకాలం నాటి యుద్ధాలంతా ఘోరంగా ఉండవు. చాలా సున్నితంగా,సౌకుమార్యంగా,సాధికారంగా ఇతర సంస్కృతుల హననంగావించి, తమ ఆధిపత్యాన్ని చాటుతూ ఉంటారు. ఒక స్థాయికొచ్చేసరికీ ‘సంస్కృతి’ అంటే ఇదే! అనే స్థితికి ఈ hegemonic భావజాలం సమాజాన్ని తీసుకొస్తుంది.

ఈ ఆధిపత్యధోరణి ఒక కాలంలో కొన్ని వర్గాలవల్ల భారతదేశంలో అమలైతే, ఇప్పుడు మన స్థాయి పెరిగి అమెరికా వంటి దేశాల బారిన పడుతున్నాం. అంతేతేడా.

ఉదాహరణకు సంస్కృతి అనగానే మనకు గుర్తొచ్చే ప్రక్రియలేమిటి. నృత్యం, సంగీతం, ఆహార్యం. వీటిల్లో నాగరికమైనవి (అని అంటున్నవి) ఏవో ఒక సారి పరిశీలించండి. ఇవన్నీ ఎవరివి? పూర్తి జాతికి సంబంధించినవా? కేవలం కొన్నివర్గాలవారు "ఇదే సంస్కృతి" అని (మనకోసం) తీర్మానించడంవలన సంస్కృతిగా చలామణి అవుతున్నాయా?

ఇప్పుడు హెజిమొనీని సుస్థిరంచేసుకోవడంలో ఉపయోగికారి అయ్యే 'reinforcing the dominant paradigm' ప్రక్రియ గురించి ఆలోచిద్ధాం. ప్రస్తుతం అమలులోవున్న విలువలపై ఎవరైనా అభ్యంతరకరమైన ప్రశ్నలు లేవనెత్తితే లేదా బలీయమైన మార్పు రావాలి కోరుకుంటే, పురాతన కాలంలాగా వారిని వెలివెయ్యడం కుదరదుగనక, వారికి అదే విలువలలోని మరో పార్శ్వాన్ని కన్వీనియంట్ గా కరెక్టివ్ రూపంలో చూపి, "చూడు! విలువల్లో తప్పులేదు. అదిఅర్థం చేసుకుని అమలుచేసే మనుషుల్లోనే సమస్యంతా" అని మభ్యపెట్టి మూలాల్లో మార్పురాకుండా కాపాడుకుంటారు. అంటే అదొక చిన్న alteration అవుతుందేతప్ప "మార్పు" కాదన్నమాట.

ఉదాహరణకు కె.విశ్వనాధ్ సినిమాలన్నీ ఆ dominant paradigm ని reinforce చేసే సినిమాలే. నాకు బాగానచ్చిన సప్తపది తీసుకుంటే, ఆ కథాంశంలోని విలనూ హీరో రెండూ వేదాలే. ఇన్నివైరుధ్యమైన సంభవాలకు చోటునిచ్చిన "మార్మికమైన" వేదాల్ని త్యజించి "కొత్త విలువలు" సృష్టించాలని ఆ సినిమా వాదించదు. ఇప్పటి దాకా మనుషుల వలన తప్పుజరిగింది. "జ్ఞానం" వలన కాదు. ఇప్పుడు కొత్తగా ఆ జ్ఞానానికి భాష్యం చెబుతున్నాను కాబట్టి ఇంతవరకూ జరిగింది "తూచ్!" అని యాజులు చెప్పేస్తే, మనమంతా "ఆహా ఎంత గొప్పఆభ్యుదయ చిత్రం" అనుకుంటూ తలలూపుకొని అదే శాస్త్రాల్నీవేదాల్నీ నెత్తినెత్తుకుని ఊరేగుతాము. ఏమిటయ్యా అంటే, `ఏదో కొందరి స్వార్థంతో అజ్ఞానంతో "తప్పు" జరిగింది. అంతమాత్రానా మొత్తాన్నీ కాదనుకుంటామా? ఎంత ఉదాత్తమైన విలువలూ!' అనుకుంటూ సంబరపడిపోతాము.

నా ఉద్దేశంలో బ్రాహ్మణికల్ ఆటిట్యూడ్ కూడా ఈ పరిణామక్రమంలో ఒక hegemonic ఉపకరణగా, dominant paradigm ని reinforce చేసేది మాత్రమే. Paradigm shift కోసం ఎవరు ప్రయత్నించినా ఈ శక్తులు తమ యుక్తులతో చేతనంగా, ఉపచేతనంగా క్రియాశీలకంగా అడ్డుతగుల్తూనే ఉంటాయి.

రేరాజు అడిగిన ఈ క్రింది మూడు ప్రశ్నలకూ సమాధానం పైన చెప్పబడిన "వ్యవస్థే"కారణం.

1.తెలుగు మీద జరుగుతున్న ఇంగ్లీషు “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
2.తెలుగు సినిమా మీద జరుగుతున్న “అణచివేత” గురించి – వేర్ డు వి స్టాండ్!?
౩.భారత దేశం మీద జరుగుతున్న “అణచివేత” మీద – వేర్ డు వి స్టాండ్!?

ఈ వివరణ కొంత oversimplification అయినా, మూలభావనలకు విఘాతం కలిగించేవి కావు.


*****

Sunday, May 10, 2009

ప్రార్థన


యంశైవా సముపాసతే
శివైతి బ్రహ్మేతి వేదాంతిన:
బుద్ధాహ బుద్ధైతి
ప్రమణాపతావ:
కర్తేతి నయ్యాయికా:
అర్హనిత్యాత జైన శాసనవతా:
కర్మేతి మీమాంశకా:
క్రైస్తాహ క్రిస్తయితి
క్రియాపవర్తాహ
అల్లేతి మోహమ్మదా:
సోయాంభో విధాధతు
వాన్ఛిత ఫలం
త్రైలోక్యనాథో హరి:

(ఇది మా కాలేజి ప్రార్థన. ఈ రోజు వింటుంటే, "ఎంత గొప్ప ఆలోచన" అనిపించింది)

Friday, May 8, 2009

ఎల్లోరాలో ఏకాంత సేవ


మళ్ళీ ఇంతకాలానికి దుమ్ముదులిపి, బుచ్చిబాబు కథలు చదవడం మొదలెట్టాను. మొట్టమొదటి సారి ‘చివరకు మిగిలేది’ చదివిన తరువాత, కూసింత మూర్చబోయి, హఠాత్తుగా ఎదిగిపోయి, నవీన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని, జీవితాన్ని మరింతగా ప్రేమించడం మొదలెట్టాను. ఆ పఠనం మొదలు, చిట్టిబాబుని నా అభిమాన రచయితగా నిర్ణయించేసుకుని ‘బుచ్చిబాబు కథలు’ అదే అవేశంలో సాధించేశాను. మాఊర్లో పుస్తకాలు అద్దెకిచ్చే షాపువాడి దగ్గర ఆఖర్న చూసిన ఈ పుస్తకం, ఈ మధ్య మళ్ళీ విజయవాడ లెనిన్ సెంటర్లో పాతపుస్తకాల దుకాణంలో చూసేసరికీ పాతమిత్రుడ్ని కలుసుకున్నంత ఆనందం. ఆ తరువాత ఇన్నాళ్ళకు మళ్ళీ..మళ్ళీ మొదటి కథ "ఎల్లోరాలో ఏకాంత సేవ" చదివాను.

రాసిందెప్పుడో, ముద్రణ ఎక్కడో,ప్రచురణ ఎప్పుడో తెలియని కథ. అయినా, నిన్నమొన్న రాసినట్లే ఉంది. బుచ్చిబాబు పక్కన కూర్చుని చదివి వినిపించినట్లే ఉంది. సినిమా ప్రొజక్టర్లో ఈ కథను నా కళ్ళముందు నిలిపినట్లే ఉంది. వైధవ్యంలో చెల్లెలి భర్త ఆకర్షణను త్రుంచుకుని, అణగారిన తన యవ్వనాన్ని బేరీజుచేసుకుంటూ బ్రతుకువెళ్ళదీసే జ్ఞానసుందరి నాకు తెలుసు. భర్త అనే వస్తువు మీద సర్వహక్కులూ కలిగి, అనుభూతుల్ని కాకుండా కేవలం బాధ్యతల్ని పంచుకునే నాగరాజ్యలక్ష్మిని నేనెరుగుదును. భాధ్యతలూ- భావుకతలూ, ఆకర్షణలూ-అడ్డుగోడల మధ్య ఊగిసలాడుతూ ఏదో ఒక ఏకాంతానికి (ఏల్లోరాలో ఏకాంతానికి) పారిపోవాలనుకునే మధుసూదనం నాలో కొంత ఉన్నాడు.బహుశా ప్రతి మగాడిలోనూ కొంత ఉంటాడు. అందుకే ఈ కథ నన్ను ఇంతగా ఆకట్టుకుందో తెలీదుగానీ, ఖచ్చితంగా తన ముద్రను మాత్రం నాలో చిత్రించింది.

ఆ కథలోని కొన్ని ముత్యాల్లాంటి వాక్యాల్ని మీకోసం ఇక్కడ పొందు పరుస్తున్నాను.

"స్త్రీని ఆటవస్తువుగా,ఆస్తిలో ఒకభాగంగా, బానిసగా వాడుకుంటున్నారు ఈ మొగాళ్ళంతా అంటారుగానీ, వీళ్ళెవరికీ అసలువిషయం తెలీదు. స్త్రీయే పురషుణ్ణి పెద్దహాల్లో మధ్య బల్ల మీద పూలతొట్టి లాగా చూసుకుంటుందని ఎవరూ పైకనరేం? ఆ తొట్టిలో రోజూ కొత్తకొత్త పూలుపెట్టి వాసన చూసుకుంటూ,--- హాల్లో చోటులేక బల్ల జరినిపినప్పుడు, ఆపూలతొట్టిని దూరంగా దొడ్లొ పడెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కోపమొస్తే దాన్ని నేలకేసి కొట్టడం- అది ముక్కలడం. డబ్బున్న స్త్రీ కొత్త తొట్టిని కొనుక్కుంటుంది."

ఎంత విచిత్రమైన కోణం! మొగుడూ-పెళ్ళాల మధ్య కేవలం అనుభవించి ఎప్పుడూ ఎవరూ చెప్పుకోని కోణం. ఇప్పుడొక ప్రకృతి వర్ణన చూడండి.

"చెట్ల వెనుకనుంచి సంధ్య వెలుగులో అతశయోక్తిగా పరిభ్రమిస్తూవున్న పొడుగాటి నీడలు, పల్చబడి, రాళ్ళరంగుల్ని వెలిగించి, ఆకృతుల్ని మార్చి దిగజారుతున్నాయి. ఆకులమధ్య కిరణాలు వనదేవత కుట్టుపనిలో సూదులలా వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. గాలి తగ్గింతరువాత అగ్నిదేవుడు వేసిన గాలిపటం కిందపడిపోతున్నట్లు, నీడలు వెనక్కి వెనక్కి వెడుతున్నాయి."

ఎంత అందమైన పదచిత్రణ. కుంచెపట్టుకుని మన ఎదురురుగానే ఒక మాస్టర్ ఆర్టిస్ట్ గీసినట్లు లేదూ! ఆ తరువాత బుచ్చిబాబు తన పాత్ర ప్రకృతి సాగించే వైరం చెబుతాడు వినండి.

"ఇక్కడెవరూ లేరు. తనొక్కత్తే- ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి కదలదు. తనగుండెలు బాధతో కొట్టుకుంటూవుంటే, ప్రకృతి చెవులు నిక్కబొడిచి చోద్యంగా వింటుంది."

"శరీరం చూసిందాన్ని మనస్సు చెబుతున్నట్లుగా వర్ణించడం నాకు రాదు."

"ఈ అందం మళ్ళా మనకి దొరకదు. పూలపరిమళం క్షణికం, బాల్యం క్షణికం, కీర్తి క్షణికం - అన్నీ క్షణికాలే - అంతమాత్రం చేత వాటిని మనం వొదులుకోలేము. క్షణికం గనకనే, వాటిని కాంక్షిస్తాముకూడా."

"మాట్లాడకండి. చూడండి. భూమిలోంచీ వింత ధ్వనులు మీ వెన్నుగుండా శరీరంలోకి తరంగాలుగా ప్రవేశిస్తాయి, వినండి. - అదే విశ్వగానం అంటే - అదిగో ఆ రాతి మీ చెవి అన్చండి.యుగయుగాల క్రితం తిరుగాడి చనిపోయిన జీవుల అంతిమ బాధ, మృత్యుఘోష, పగిలిన హృదయాల చప్పుడు - అదొక నాదం."

"తనలో ఔదార్యం,కారుణ్యం - ఏవేవో ఉన్నాయి. వాటిని ఉపయోగించే అవకాశాలు లేక, ఇంద్రియాలు ఎండి, ఎత్తు నుండీ పారుతూ వొంపుదగ్గరదాకా ప్రహించి నిలిచిపోయిన పెద్ద జలప్రవాహంలా తనలో అల్లాఉండిపోయాయి."

"ఏదో జరగబోతోంది - తాను సిద్ధంగా ఉందా? నరాలు, రక్తం వొక్కసారి చెలరేగినట్లు, శరీరం తృష్ణతో బిగిసి, విడి, బిగిసి, సర్ధుకుని,సిద్ధమని, స్థిమితపడి, ఉదయించని సూర్యుని వైపు చేతులు జోడించిన ఋషి ప్రశాంతత తనలో కమ్ముకుంది."

"అమ్మో- శరీరానికి ఎంతశక్తి. ఎంత వొత్తిడి, ఎంత బలం - యుగయుగాలుగా భూగర్భంలో అణగారినశక్తులు వొక్కసారిగా భూకంపంద్వారా ప్రేలి బైటపడ్డంత శక్తి, సముద్రగర్భాన్ని కలచివేసి నెట్టి, బైట వొడ్డున ముద్ధకింద ఎండించి పడేసినంత వొత్తిడి, మహత్తర శిఖరాన్ని కూల్చి అధోలోకంలో లాకుపోయినంతటి బలం..."

"శరీరం పట్ల మనకు గౌరవం పోయింది. శివలింగ పూజలోని ప్రాధాన్యతని పూర్వులు పొగిడినా, ఈనాడు శరీశక్తి పట్ల ఆదరణ లేదు. ప్రతిభాశాలులైన ఒకరిద్ధరు శిల్పులు రాయిద్వారా యీ సూత్రం చాటుతున్నారు.ఆధునిక శిల్పానికి మొహం ఉండదు - స్ఫుటమైన ఆకారంలో ముఖ్యమైన కోణాలుంటాయి. అట్లా ప్రదర్శిస్తే, కళ్ళు తెరచి శరీరం చూస్తారని. కాని చూడ్డంలేదు. ఎగ్జిబిషన్లో పెడుతున్నారు. శిధిలాలకింద జమగట్టి, పురావస్తుశాఖవారికి వప్పగించేస్తారు. మరొకి శరీరం చూడలేనివారు, తమ శరీరాలు చూసుకోలేరు."

"మామూలువాళ్ళకి నీతీ మంచీ వుండాలి - కాని ఏఒకరిద్ధరో అసాధారణ వ్యక్తులుంటారు. ప్రతి సంఘంలోనూ వారికి స్వేచ్చ ఉండాలి. ఉంటేనే ఏదోఒక ఘనకార్యం చెయ్యగలుగుతారు. సంస్కృతీ, నాగరికతా వారివల్లనే వృధ్ధిచెందుతాయి."

ఈ కథ ఒక అద్భుతం. చదకపోతే జీవితంలో కొంత కోల్పోయినట్లే!

ఈ సంకలనంలో మరో ఆరు కథలున్నాయి. చదవాలి. మళ్ళీమళ్ళీ చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు చెబుతాను వాటి గురించి.

*****

Thursday, May 7, 2009

సీత రాముడికి ఏమవుతుంది?


శీర్షికలోని ప్రశ్నచూసి చొప్పదంటు ప్రశ్నో లేక పిచ్చి ప్రశ్నో అనుకునేరు. చాలా సీరియస్ ప్రశ్న. కొత్తవాదన అనుకోకండి. తెలియని వారికి ఇది కొత్తగా అనిపించినా, తులసీరామాయణం, కంబరామాయణం,కుమారవాల్మీకి రామాయణం, ఆధ్యాత్మరామాయణాలకన్నా ముందున్న బౌద్ధరామాయణం తెలిసినోళ్ళకు ఇది కొత్త ప్రతిపాదనా కాదు. కొత్తవాదన అంతకన్నా కాదు. ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట.

షాకింగ్ గా ఉందా! అంత ఆశ్చర్యపోనఖ్ఖరలేదు. కథ ఎంతైనా కథే కదా.

ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు. కొంతకాలానికి ఆ పిల్లల తల్లి చనిపోతే మరొక భార్యను పెళ్ళిచేసుకున్నాడు దశరధుడు. ఆ రెండో భార్యకు పుట్టిన కొడుకు భరతుడు.కొత్తకొడుకు ఆనందంలో పెళ్ళాన్ని వరం కోరుకోమంటే, "నా కొడుక్కి ఏడేళ్ళు నిండేసరికీ రాజ్యాభిషేకం చెయ్యి" అని వరం కోరిందట ఆ పిచ్చితల్లి. దశరధుడు మండిపడితే భరతకుమారుడితల్లి అలిగి పడుకుంది. ఆ తర్వాత పీడించడం మొదలెట్టింది.

భార్య పీడనతోపాటూ, ఆ ఉన్మాదంలో మారుపెళ్ళాం తన పిల్లల్ని ఎక్కడ చంపించేస్తుందో అన్న భయంకూడా దశరధుడ్ని పట్టుకు పీడించింది. అందుకే,తెలివిగా ఒక ఆలోచన చేశాడు.తాను మరణిస్తే పెద్ద కుమారుడ్నే రాజుగా చెయ్యాలని నియమం కాబట్టి, అంతవరకూ పిల్లల్ని చావకుండా కాపాడాలంటే వారిని అడవులకు పంపడం సరైన మార్గమని తలచాడు. జ్యోతిష్కులతో సంప్రదించి తన ఆయుర్ధాయం ఇంకా పన్నెండేళ్ళుందని తెలుసుకుని, ఆ పన్నెండేళ్ళూ అడవుల్లోనో లేక ఏ సామంత దేశంలోనూ ఉండమని చెప్పి పంపేసాడు.

పిల్లలు దూరమైన శోకంతో దశరధుడు జ్యోతుష్కులు చెప్పిన సమయంకన్నా ముందే, తిమ్మిదేళ్ళకే మరణించాడు. అదే అదనుగా భరతకుమారుడి తల్లి భరతుడికి పట్టంగట్టాలనుకుంది. కానీ పండితులు అసలు రాజు అడవిలో ఉండగా ససేమిరా అన్నారు. వేరేదారిలేక భరతుడు రాముడ్ని వెతుక్కునివెళ్ళి పట్టాభిషేకానికి ఆహ్వానించాడు. కానీ తండ్రి మాట జవదాటని రాముడు, సీతా లక్ష్మణుల్ని తీసుకెళ్ళమని చెప్పి తన వనవాసం పూర్తయ్యాకనే వస్తానని చెబుతాడు. రాజ్యపరిపాలన ఎరుగని భరతుడి తాను ఎలా రాజ్యమేలతానని ప్రశ్నిస్తే, రాముడు తన పాదుకల్ని ఇస్తాడు. ఆ పాదుకల మహత్యం ఏమిటంటే, రాజ్యపాలనలో అన్యాయం జరిగితే ఒకదానితో ఒకటి జగడమాడటం మొదలెడతాయి. న్యాయం జరిగితేగానీ శాంతించవు. ఈ విధంగా భరతుడు రాజ్యపాలన చేశాడు.

వనవాసం పూర్తయిన మీదట, రాముడు రాజ్యానికి వచ్చాడు. భరతకుమారుడు మంత్రులతోసహా వెళ్ళి, రాముడ్ని రాజుగానూ, సీతను రాణినిగా చేసి రాజ్యాన్ని అప్పగించాడు.

ఈ రామాయణంలో రావణుడులేడు. హనుమంతుడు లేడు.యుద్ధం లేదు. రామాయణం ప్రబోధించే "విలువలు" లేవు. ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే.

ఈ కథను కొందరు రామాయణాన్ని కించపరచడానికి బౌద్ధులు పన్నిన కుట్రగా అభివర్ణిస్తారు. కానీ ఈ కథకు కొనసాగింపుగా సాగే వ్యాఖ్యానంలో బుద్ధుడు శుద్ధోధన రాజే దశరధుడని, లక్ష్మణకుమారుడు సారిపుత్రుడని, భరతకుమారుడు ఆనందుడనీ, సీతాదేవి యశోధర అని, తానే రామపండితుడ్ననీ చెబుతాడు. అలాంటప్పుడు ఇది రామాయణాన్ని అపహాస్యం చేసే ప్రయత్నమని ఎలా అనుకోవాలన్నది సందేహాస్పదం.

ఏదిఏమైనా ఇదొక ఆసక్తికరమైన కథ. ఇలాంటి కథే మరొకటి ఈ లంకెద్వారా చదవండి.

*****

Wednesday, May 6, 2009

ఒంటరి బందిఖానా


కొలతల్లో కొలవడానికి
సందర్భాల్లో ఇమడ్చడానికి
అర్థాల్లో కుదించడానికి
మనసు నిర్ధిష్టతను కోరింది

నిజమే...
నిర్ధిష్టమైన నిర్వచనాలుంటే కానీ
అహానికి తృప్తి రాదు
తనని తాను బంధించి
ఈ విశ్వసృష్టిలోని
ఒక మరుగుజ్జు భాగంలో కుదించి
అదే తన అస్థిత్వమని
మురిసిపోతుంది
ఆ నిర్ధిష్ట నిర్వచనాల
ఇరుకు గదుల మధ్య
గుర్తింపు కోసం
వ్యక్తిత్వం కోసం
అభిమానం కోసం
ప్రేమ కోసం
కల్పన కోసం
పరితపిస్తుంది

కానీ...
ఏ లోకం నుంచీ
ఈ ఆశలు సాకారమవ్వాలో
ఆదే ప్రపంచం
ఈ గోడల మధ్య
స్వీయ కల్పనల
అనంతకోటి బంధిఖానాల
నడుమ మిగిలింది

ఒక్క ఊహ...
విశ్వం మొత్తాన్నీ
అక్కునచేర్చుకునే
విశ్వజనీయమైన ప్రేమ సొంతమైతే!
అహం బందిఖానాని
కూల్చుకుని
నిర్భంధపు సంకెళ్ళు తెంచుకుంటే!


Solitary Confinement

The mind looks to confine
to measure
to contextualize
to give meaning
to itself

for the ego
can exist only
in finite possibilities
needing to enclose itself
in a part of the universe
walled off
from the rest of creation
and from within that prison
to show itself off
yearning to be recognized,
to be individualized
to be admired
and from within that prison
to be loved !
imagining
that everything around itself
has confined itself too
imprisoned itself too
sensing the universe
surrounded by
imagined bits of similar prisons


Imagine

a love you could embrace
the whole universe with

if only you came out of
the solitary confinement
your ego has imprisoned you in


(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

****

కొత్త సంవత్సరం


ఉగాదిపోయి రెండు మాసాలవుతుంటే కొత్తగా ‘కొత్త సంవత్సరం’ అంటున్నాడేమిటా అనుకుంటున్నారా! ఇది ఆ కొత్త సంవత్సరం కాదు లెండి. నా బ్లాగుకి కొత్త సంవత్సరం. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్లాగడం మొదలెట్టాను. అంటే ఈ మే నెలకి కొత్త సంవత్సరం వచ్చినట్లే కదా!

నిర్ధిష్టంగా ఏంసాధించానో తెలీదుగానీ, రాయటాన్ని ఒక దినచర్యలో భాగంగా మాత్రం చేసుకున్నాను. కనీసం ఒక లైనైనా రాయకుండా గడచిన రోజులు ఈ సంవత్సరంలో వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అందుకేనేమో ఈ సంవత్సరం లో 200 టపాలు కట్టేసాను. బ్లాగులో పెట్టేసాను. అన్ని టపాల మీదా ఒకటో రెండో వ్యాఖ్యలు పాఠకులు దయదలిచి రాసినవి ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని టపాలపైన బారెడంత చర్చలూ, ఘాటైన విమర్శలూ, నిరసనలూ, తిట్లూదీవెనలూ అన్నీ జరిగిపోయాయి. సరిగ్గా లెక్క తెలీదుగానీ, అక్కడక్కడా నా సమాధానాలతో సహా దాదాపు 50 వ్యాఖ్యలున్నవి కనిపించినా కనిపిస్తాయి. అందుకేనేమో నా వ్యాఖ్యల మీటరు ఏప్రిల్ నెల దాటే సరికీ 3,000 సంఖ్య దాటినట్లు చూపించింది.

మధ్యలో నా హిట్ కౌంటరు తిక్కతిక్కగా ప్రవర్తించి తలతిక్క అంకెలు చూపించంది. కాబట్టి దాన్ని ఎంతవరకూ నమ్మాలో తెలీదుగానీ 40,000 మంది దాకా నా బ్లాగుని చూశారన్న ఫీలింగ్ మాత్రం, అబ్బో! చెప్పలేను. అంతేకాకుండా నా బ్లాగుని క్రమం తప్పకుండా చూసే 33 మందిని సంపాదించుకున్నాను. ఇక బ్లాగుల ద్వారా ఏర్పడిన మిత్రులు, శ్రేయోభిలాషుల సంగతి అద్భుతం ఆంతే!

ఈ సంఖ్యలు, అంకెలవల్ల నేను సాధించింది ఏమిటో నాకు అర్థం కాలేదుగానీ, నాదంటూ ఏదో ఒకటి చేశానన్న తృప్తి మాత్రం ఏంతో సాధించిన భావనను కలిగిస్తోంది.

ఈ సందర్భంగా నా బ్లాగు దర్శించిన అందరికీ, వ్యాఖ్యానించిన అందరికీ, వ్యాఖ్యానించని అందరికీ, తిట్టినవాళ్ళకీ, అభిమానంగా ప్రోత్సహించినవారికీ అందరికీ నా అభినందనలు.

****

మునెమ్మ పై ఒక స్థానిక పాఠకుడి (native reader) స్పందన -3

(పూర్తి విశ్లేషణ ఓకే భాగంలో ఇవ్వలేకపోయినందుకు క్షమించాలి)
ఈ వ్యాసం యొక్క మొదటి మరియు రెండవ భాగాల్ని ఇక్కడ చదవండి.

కథలో చాలా మంది విమర్శకులకూ పాఠకులకూ అర్థంకాని పజిల్ గా మిగిలింది ఆరంభ ఘట్టం. బొల్లిగిత్తని జయరాముడు చావగొట్టే ఉదంతం.దాంతోపాటూ, ఇంట్లో పెరిగిన గొడ్డుని.ప్రాణంలా చూసుకున్న గొడ్డుని.తమ్ముడిలా చూసుకున్న గొడ్డుని. జోవనోపాధిగా మారిన గొడ్డుని. జయరాముడు (పరసలో)సంతలో తెగనమ్మేందుకు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ కథకుడు ఆ ఘటనా స్థలిలో ఉండే పాత్రల ద్వారా కాకుండా, అక్కడ ఏం జరుగుంటుంది? జయరాముడికి ఆ ఉన్మాదం ఎలా ఆవరించింది? అనే ప్రశ్నలకు జయరాముడి తల్లి సాయమ్మ భయంద్వారా సమాధానం ఇప్పిస్తాడు. ఆ సమాధానం మూల ప్రశ్నల్లోనే మార్పుని ఆశిస్తుంది.

బొల్లిగిత్త మునెమ్మ మీదికి ఏ ఉద్దేశంతో చేరింది అనే ప్రశ్నకన్నా, జయరాముడు బొల్లిగిత్త చేష్టలకి హఠాత్తున ఉగ్రుడెందుకయ్యాడు అనేది సరైన ప్రశ్న. జయరాముడు బొల్లిగిత్తని తమ్ముడిలాగా చూసుకున్నాడన్నది కథారీత్యా తెలిసిన సత్యం. మునెమ్మ, జయరాముడూ,బొల్లిగిత్తా వీధిలో వెళ్తుంటే సీతారామలక్ష్మణుల్లాగా అనిపించేదని మునెమ్మ కూడా చెబుతుంది. అలాంటప్పుడు బొల్లిగిత్త ప్రేమగా మునెమ్మను చేరడం చూసి, పెళ్ళాం చీరకట్టిన పాపానికి నాటకంలో వేషం వేసినాయన్ని తెగనరికిన దొరసామిరెడ్డి రక్తం ప్రవహిస్తున్న జయరామి రెడ్డిని ఆ క్షణాన ఉన్మాదం ఆవరించడం సహజమైన భ్రంశనగానే అనిపిస్తుంది. "జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగటే కనబడతావుండాయి" అన్న సాయమ్మ వాగ్మూలం అందుకు సాక్షం. అంటే ఇక్కడ బొల్లిగిత్త యొక్క తెలియని ఉద్దేశాలకన్నా, మునెమ్మ అమాయకత్వంకన్నా, జయరాముడి ఉన్మాద చర్య కథకు కీలకం. దీన్నొదిలేసి విమర్శకులు, పశువులు మనుషులపైకి వస్తాయా? boredom sex పశువుల్లో ఉందా? అనే పనికిమాలిన శాస్త్రీయ ప్రమాణాలను వెతుక్కున్నారు. పైపెచ్చు అదేదో రచయిత మానసిక రుగ్మతకు సాక్షంగా ఊదరగొట్టారు.

ఒక రాయలసీమ పల్లెవాసిగా, ఎదకొచ్చిన/సుల్లరానికొచ్చిన పశువులు మనుషుల మీద "ఎగరడం" నాకు తెలుసు. దానికి శాస్త్రీయ ప్రమాణం అనవసరం. అంతేకాకుండా, వ్యవసాయ ప్రాధాన్యమైన సంస్కృతిలో పశువుల్ని మనుషుల్లాగా ప్రేమించడం ఎంత సహజమో, పశువులకూ మనుషులకూ "సంబంధాల్ని" అంటగట్టి హాస్యాలాడ్డమూ అంతే సహజం. కాబట్టి, ఇక్కడ శాస్త్రీయ ఆధారాలకన్నా, సాంస్కృతిక ధోరణిని అర్థం చేసుకోవడం అవసరం. అంతేకాక, విషయం అవగతమైన తరువాత సాయమ్మ అనే మాటలు గమనిస్తే, అంతర్లీనంగా జయరాముడి మార్పుపట్ల భయం కనిపిస్తుందేతప్ప ఆ ఘటన యొక్క "తప్పొప్పులు" కాదు. సాయమ్మ సినబ్బతో అంటుంది,"...పాపమేది పుణ్యమేది అని తెగజెప్పాల్సి వచ్చినప్పుడు దేవాను దేవతలే ఒక్కోసారి ముందూ యనకా అయినారు. మనుషులు మనమెంత? జైగాడిలో వాళ్ళ నాయన గుణాలు ఒగిటొగిటే కనబడతా ఉండాయి. వాడికి మీసాలొచ్చినప్పట్నుంచి ఇది గవనిస్తానే ఉండాను. ఇక ఆ గొడ్డు ఒక్క దినం గూడా ఉండకూడదనిపించిందిరా. అది ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఏ మూలనో నాగుపాము ఉన్నట్లే ఉంటుంది" అని. ఇక్కడ కూడా బొల్లిగిత్త ఎందుకు మునెమ్మ మీదకొచ్చింది? అది తప్పాఒప్పా? అనే ప్రశ్నలకన్నా, జయరాముడి అనుమానం ద్వారా కలిగే విపరీతాలనుంచీ కుటుంబాన్ని కాపాడలనుకునే తల్లే కనిపిస్తుంది. అడ్డుచెబుతుందనుకున్న అత్తకూడా బొల్లిగిత్తను అమ్మేందుకే తయారవడం మునెమ్మకు అర్థం కాకపోవడానికి కారణంకూడా సాయమ్మకు తెలిసిన కుటుంబ చరిత్ర మునెమ్మకు తెలియకపోవడమే.

ఈ అపోహకు కారణం బహుశా, నవలతోపాటూ వచ్చిన అంబటి సురేంద్రరెడ్డి రాసిన విశ్లేషణలోని వాక్యాలు కూడా కావచ్చు. ముందుమాటలూ, వెనుకమాటలూ, విశ్లేషణలూ నవలతోపాటూ ఇవ్వడం పాఠకుడి ఊహల్ని కుంచించుకుపోయేలా చేసి, ఒక preconditioned మూసలో interpret చేసేలా ప్రేరేపిస్తాయనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే ఈ నవల ఇస్తూ చాలా మందికి ముందుమాటా వెనకమాటా చదవొద్దని చెప్పాను. బహుశా ఈ నవల చాలా చిన్నదవటం వలన, పేజీలు పెంచడానికి ప్రకాశకులు వీటిని జతచేశారేమో. ఇలా జతచేయడం వలన లాభంతో పాటూ కొంత నష్టమూ జరిగిందని మాత్రం చెప్పగను.

(నాలుగవ భాగం త్వరలో...)

*****

Tuesday, May 5, 2009

అస్తిత్వవాదాల గమ్యం!?!

ఈ మధ్య శివారెడ్డి గారి కవితా సంకలనం "ఆమె ఎవరైతే మాత్రం" పుస్తకావిష్కరణ సభకు వెళితే, అక్కడ పుస్తక పరిచయం చెయ్యడానికొచ్చిన వేణు గోపాల్ గారి ప్రసంగం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అస్తిత్వవాదాల విషయంలో తన అభిప్రాయం ఆలోచనలకు పురిగొల్పింది.


సామాజిక-ఆర్ధిక-సాంస్కృతిక-రాజకీయ-ప్రాంతీయ నేపధ్యాలలో పుట్టిన అస్తిత్వ ఉద్యమాలు సాహితీరంగంలో చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. అణచివేయబడ్డ గొంతుకలు అక్షరాల్ని పట్టి, ఆ అక్షరాలతో తమ కథల్ని,వ్యతల్ని కళ్ళకుట్టి ఎదుటనిలిపి ఉద్యమ స్ఫూర్తిని, జీవనశక్తిని నింపే దిశగా అస్తిత్వ ఉద్యమాల తోడ్పడ్డాయి. తెలుగు సాహిత్యాన్ని "రంగుల"మయం చేసాయి. స్త్రీవాదం, దళితవాదం, తెలంగాణా వాదం లాంటి అన్ని వాదాలూ మొదటగా అణచివేత నేపధ్యంగా ఒక ధిక్కారస్వరంలా మొదలై తమ ఆత్మనిశ్చయ ముద్రల్ని బలంగా చిత్రించి, సమాంతర అస్థిత్వాలుగా ఎదిగాయి.

ఈ ఎదుగుదల పరిణామక్రమంలో ఈ అస్తిత్వవాదాలు తమ ఉనికిని కోల్పోకుండా ప్రధానస్రవంతిలోకి మమేకం అవ్వడం సహజంగా జరగాల్సిన పరిణామం, ఉదాహరణకు, దళితవాదం కుల వివక్షతకు నిరసనగా తమ సాధికారక ఉనికిని ఎలుగెత్తి చాటడానికి ఉద్భవించినా, దాని అంతిమ లక్ష్యం సమానత్వాన్ని కాంక్షించి,మార్పుచెందిన సమాజంలో భాగమవడం. జీవితమైనా,సాహిత్యమైనా అదే జరగాలి. అంటే పుట్టుకతో వచ్చిన అస్థిత్వాలను పోగొట్టుకోవడానికి పోరాడి, సాధించి సంపాదించుకున్న వ్యక్తిత్వాల ఆధారంగా నూతన సమాజాన్ని నిర్మించి తమదిగా చేసుకోవడం ఈ ఉద్యమాల లక్ష్యం.

కానీ, ప్రస్తుతం అస్తిత్వ ఉద్యమాలు అటువైపు ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు అన్నది వేణుగోపాల్ గారి అభిప్రాయం. నిజమే! కాలక్రమంలో అస్థిత్వ ఉద్యమాలు తమ అంతిమ లక్ష్యాల్ని మరచి, వర్తమానంలో ధిక్కారస్వరాలకు వచ్చే గుర్తింపు, అవి కలిగించే మత్తులో మిగిలిపోతున్నాయి అనిపిస్తుంది. అంతే అయితే ఫరవాలేదు. ఆ ధోరణుల్ని మరింత ఛాందసంగా మార్చే వాదనలు ఈ మధ్యకాలంలో మరింతగా వినవస్తున్నాయి. ‘శ్రీశ్రీ, కొకు లు ఆంధ్రా వారు కాబట్టి, వారి సాహిత్యం తెలంగాణాకు వద్దు’. ‘స్త్రీవాద సాహిత్యం కేవలం స్త్రీలే రాయాలి’. ‘దళితసాహిత్యంతో దళితేతరులకు సంబంధం ఉండకూడదు’ వంటి "అతి"వాదాలు ఇలాంటివే.

బహుశా అస్తిత్వ ఉద్యమాల ప్రగతిలో ధిక్కార యుగం ఇంకా అంతమవలేదు. కొన్ని విషయాలలో ఇంకా బలమైన నిరసన,వ్యతిరేకత అవసరం. కానీ, ఇలాంటి అతివాదాలు ధిక్కారం నుంచీ సామరస్యత దిశగా ప్రయాణించాల్సిన అస్తిత్వవాద ఉద్యమాల్ని కేవలం అక్కసు వెళ్ళగక్కే ఉద్యమాలుగా మిగులుస్తాయేమో అన్నది ఆలోచించాల్సిన విషయం. పుట్టుకతో వచ్చిన ascribed, prescribed విలువలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న అస్తిత్వ ఉద్యమాలు, ఆ విలువల్ని ప్రశ్నించడంతో సాహిత్యం మొదలుపెట్టినా, ఒక సాధికారకమైన ప్రత్యామ్న్యాయ విలువల నిర్మాణం దిశగా అడుగులు వేసి సామరస్యతని సృష్టించాలి. ఆ అడుగులు ఆలస్యమవుతున్నాయో లేక దారి తప్పమో అన్నది ఒక్క క్షణం ఆగి తరచిచూసుకోవలసిన సమయం ఇది అనిపిస్తుంది.

****

ప్రగాడ కాంక్ష - PASSION


ఆ క్షణం లో జనించింది
మరో క్షణంలో నశించింది
చివరికి...
అప్పుడే మొదలయ్యింది

అదొక
విచ్చిన్నమౌతున్న
సూపర్ నోవా చిత్తరువు
ఈ సృష్టిలోని
అన్నిటిలాగే
కూలడానికే ఎగుస్తుంది
కూలితేనే తిరిగి ఎగుస్తుంది
జ్ఞానం బూడిద నుంచీ
సృజనాత్మకత జ్వలిస్తుంది
అదీ క్షణికమే...
అటుపైన మరణిస్తుంది

Passion

in the instant it began
it was over,
but then
in the end
it had just begun.

The picture is of a collapsing super nova,
which, like everything
(or no-thing)
in our universe,
rises
only to collapse
and then to rise again
only on the ashes of knowledge
can true creativity bloom,
but remains creative
only for a moment
and then dies


(శేఖర్ కపూర్ కవితకు స్వేచ్చానువాదం)


*****

Monday, May 4, 2009

తిరస్కృతి


అక్షరాల పొరల్లోంచీ
కొత్త అర్థాలు వెతుకుతూ
అది పదోసారి...
దుర్భిణితో
అనంతాన్ని కొలుస్తూ
అది పదకొండోసారి...

చదివిన ప్రతిసారీ
కాదు ఔనవుతుందన్న ఆశ
అందలేని దూరాల తార
అధాట్టున అందుతున్న ధ్యాస

నిజం...
నీ తిరస్కారంలో
నా ఉనికికి
కొత్త అర్థం వచ్చింది
పన్నెండోసారి...

ధనవంతుడి పక్కనుంటేనే కదా
పేదోడికి తన దరిద్రం తెలిసేది
నువ్వు కాదంటేనే కదా
నా ఉనికికి అస్థిత్వం వచ్చేది!
పదమూడోసారి...

పద్నాలుగోసారి....
అర్థం మారలేదు
అక్షరాల పొరల్లోంచీ
నీ కాఠిణ్యం
కత్తులు దూస్తుంటే
నా గుండెలు చిందిన రక్తం
నన్ను పునీతుణ్ణి చేసింది
పదిహేనోసారి...
నన్ను పునర్జీవితుడ్ని చేసింది

పదహారోసారి...
మరొక్కసారి నీ జవాబుకై
ఎదురుచూశాను
మళ్ళీ మరణించడానికి
నన్నునేను సిద్ధం చేశాను
మళ్ళీ...ఒకటోసారి...

****

మునెమ్మ పై ఒక స్థానిక పాఠకుడి (native reader) స్పందన -2


మొదటి భాగం ఇక్కడ చదవండి...

మా చిత్తూరు పల్లెల్లో కథలు చెప్పే వాళ్ళు ఇంటికొకరూ వీధికొ్కరూ ఉంటారు. మునెమ్మ కథ చెప్పే 'సినబ్బ' కూడా అలాంటి సిన్నోడే. తనుజెప్పేదాంట్లో నిజమెంతుంటుందో ఊహా అంతే ఉంటుంది.విషయమెంతుంటుందో అలవికాని వివరమూ అంతే ఉంటుంది. కతెంతుంటుందో కతకు ఏ సంబంధమూలేని మెట్టవేదాంతమూ అంతే ఉంటుంది. ఇవన్నీ కథ చెప్పే కిటుకులోని భాగాలు. కథను మరింత రసవత్తం చేసే అంశాలు.ఆద్యంతం శ్రోతలు లేక పాఠకుల ఆసక్తిని నిలిపే విషయాలు. అందుకే, ఒక పాఠకుడిగా, సినబ్బ చేత కథచెప్పించిన రచయితకన్నా కథ చెప్పిన సినబ్బ నాకు ముఖ్యం.

ఇరవైఏళ్ళ సినబ్బ. మునెమ్మ ఆక్కో,వదినో తెలీని సినబ్బ. కల తరువాత మునెమ్మలోని మార్పునిచూసి అబ్బురపడిన సినబ్బ. మునెమ్మ సాహసొపెతమైన ప్రయాణంలో కలిసి ప్రయాణించిన సినబ్బ. మునెమ్మ సాహసాన్ని కళ్ళప్పగించి
చూసిన సినబ్బ. మునెమ్మ వృత్తాంతాన్ని అభిమానంగా, గర్వంగా, ప్రేమగా తనదైన రీతిలో చెప్పేప్రయత్నంలో మునెమ్మని ఒక శక్తిలా ఆరాధించాడు, ఒక దేవతలా పూజించాడు.బహుశా ప్రేమించాడుకూడా. కథకుడికి ఇలాంటి అద్వితీయ భావనే లేకపోతే కథలో ఇంత సాధికారత రాదు. అదే కల్లాకపటం లేని రాయలసీమ నేల మహత్యం. ఆ ప్రాంతపు కథా సంస్కృతికి చిహ్నం.

చిన్నప్పుడు మా పల్లెలో ఎవరైనా కుటుంబ పెద్దలు లేక గ్రామ ప్రముఖులు చనిపోతే, వాళ్ళ దినాలకు కథపెట్టించేవాళ్ళు. ఆ కథ చనిపోయిన మనిషి గురించుండేది. మా తాతగారు చనిపోయినప్పుడు ఆ కథకుల్ని ఉస్తికాయలపెంట,పాకాల లేకపోతే కంగుంది కుప్పం నుంచీ పిలిపించారు. అప్పుడు నా వయసు ఏడెనిమిదేళ్ళుంటుందేమో. పదకొండో రోజు కథైతే కథకులు నాలుగు రోజుల ముందే వచ్చేసారు. బంధువర్గంలో కలిసిపోయి ఆమాటా ఈ మాటా సేకరించారు. పదకొండో రోజు వాళ్ళు కథ చెబితే...కేవలం ముసలివాడిగానే నాకు తెలిసిన మా తాతగారి బాల్యం నాముందు ఆవిష్కృతమయ్యింది. యవ్వనంలో అతని వేట సాహసాలు విదితమయ్యాయి. వ్యక్తిగా,కుటుంబ పెద్దగా, గ్రామంలో ప్రముఖుడిగా తను చేసిన పనులు చెబుతుంటే మా తాతగారికన్నా గొప్ప వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనిపించింది. అ కథకులు చెప్పినదాంట్లో ఎంత నిజముంది, ఎంత కల్పనుంది అనేది నాకు అప్రస్తుతమయ్యాయి. కథ చెప్పిన తీరు.కథ చెప్పిన ఉద్దేశం. కథద్వారా కథకులు శ్రోతల్లో కలిగించిన రసస్పందన. ఇవే ముఖ్యం. బహుశా అందుకే రసస్పందనలో తర్కం కూడదంటారేమో!

పాఠకుడి ఉద్దేశం రసస్పందన.పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు. తన అనుభవాల్లోంచీ కథను అర్థం చేసుకుని అనుభవించి ఆనందిస్తాడు. విమర్శకుడు అలా కాదు. తను కథ ఔచిత్యాన్ని, సార్థకతనూ,సామాజిక అర్ధవంతతనూ తమ
దగ్గరున్న పనిముట్లతో బేరీజు చేస్తాడు. అంటే రసస్పందనలో తర్కాన్ని ఆశిస్తాడు. కాబట్టి ఒక స్థానికుడిగా నేను ఇటువంటి కథకుడు (సినబ్బ) చెప్పే ఇతివృత్తంలో అతడి సమర్పణభావాన్ని చూసానేకానీ,సాధ్యాసాధ్యాలను కాదు. పాఠకుడిగా కథద్వారా కలిగిన రసస్పందనని ఆస్వాదించానేగానీ తర్కాన్నిశోధించలేదు. అందుకే ఒక స్థానిక పాఠకుడిగా నాకు జవాబుల్లేని ప్రశ్నకి సమాధానాలు లభించాయి.

మూడవ భాగం త్వరలో...

****

Saturday, May 2, 2009

శివతాండవం


స్వరజతులే లేని చోట
అడుగులు వెతుకుతు
అసంభవ నృత్యం
ఒక ప్రళయ తాండవం

రేఖల రూపులు కోల్పోకుండా
సామరస్యం శ్రుతికొచ్చేనా?
ఆద్యంతాల
స్మృతి ఉంటే
శివతత్వం తెలిసొచ్చేనా?

ఆ ప్రళయ రుద్ర నృత్యంలో
నన్ను నేను కోల్పోవాలి
ప్రయత్నించక
అడ్డుచెప్పక
ఆలోచించక
అసహాయుడైన బాలుడిలా
మాతృస్తన్యపు
ప్రవాహంమధ్యన
మునిగి
నిర్భయుడిగా మిగలాలి

అప్పుడే...
నిశ్శబ్ధంగా
చల్లగా
ఊపిరి
శివుడి ఊపిరి
అల్లుకుంటుంది
అల్లుకుని
భావమాలిన్యాన్ని హరిస్తుంది
ఆతరువాత నిశ్శబ్ధం
ఆ నృత్యాన్ని మించిన నాట్యం లేదు
అయినా స్థబ్ధత
కేవలం
అప్పుడే పుట్టిన పాపడు
అబ్బురపడి వేసే చిరుకేక
మాత్రం వినిపిస్తుంది

ఆ తరువాత...
ఈ అనంత విశ్వపు
నిట్టూర్పులో
ఆఖరి శ్వాసని
త్యజించడం
ఆ శ్వాస
నా నుంచీ విడిపడ్డాక
తాండవంతో ప్రమేయం లేకుండా
శ్వాసతో సంబంధం లేకుండా
అనుభూతితో అవసరం లేకుండా
జ్ఞానంతో నిమిత్తం లేకుండా
నేను లేనట్టే
నా శరీరమూ లేదు


Dance with Shiva

the impossible dance
of chaos
finding the steps
to follow a pattern
where there is none
seeking harmony
without letting go
of linearity ?
being with shiva
with out
sensing timelessness?
allowing myself
to be
swept into
the chaos
of the dance
not resisting
not thinking
not trying
like a helpless child
in the wave of
a raging storm
of it's mother's milk
drowning
but not afraid
ad then the breathing
the breath of Shiva
silent
like a cool balm
washing away all the senses
and then silence
beyond the dancing
there is not dance
but stillness
just a gentle cry
from the baby's last
sense of wonder
then ...
the letting go
of the last breath
that mingles
with an everlasting
universal sigh
as the breath leaves me
and my body ceases to exist
as do i
lost beyond the dance
beyond the breath
beyond perception
beyond wisdom
for no reason


(శేఖర్ కపూర్ ఆంగ్ల కవితకు ఇది స్వేఛ్చానువాదం)

*****

Friday, May 1, 2009

‘మునెమ్మ’ పాఠకుడి (native reader) స్పందన - భాగం 1


ఈ మధ్యకాలంలో తెలుగు నవలాసాహిత్యంలో ఒక అలజడిని రేపిన నవల మునెమ్మ. ఈ నవల గురించి నా అభిప్రాయాలు కొన్ని...

నేను కాలేజిలో ఆంగ్లసాహిత్యం మేజరు చదివేప్పుడు మా ఫ్రొఫెసర్ ఎన్.ఎస్.రఘునాథ్ , "Read English literature to understand it, to appreciate it and to learn literary theories.But, if you really want to "feel" literature, go back to your native (language) literature" అని చెప్పేవారు. అంటే, స్థానికేతర సాహిత్యాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించడం వరకూ బానేవుంటుందిగానీ, అనుభవానికొచ్చే సరికీ స్థానిక సాహిత్యమే బెస్టన్నమాట. సాహిత్యసృజన ఆ భాషకు సంబంధించిన సామాజిక-సాంస్కృతిక-రాజకీయ-ఆర్ధిక నేపధ్యంనుంచీ కలిగే అభివ్యక్తిని
అక్షరబద్ధం చేసే ప్రక్రియ. ముఖ్యంగా, ఈ అన్ని అంశాల్నీ ప్రభావితం చేసే క్షేత్ర లక్షణాల్ని (nature of land scape) ఆ సాహిత్యం పుణికిపుచ్చుకుంటుంది .అందుకే ఈ నేపధ్యానికి దగ్గరగావున్న స్థానికులు తమ భాషా సాహిత్యాన్ని అర్థంచేసుకుని ఆస్వాదించడమే కాకుండా ముఖ్యంగా అనుభవించగలిగిన సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సౌలభ్యం పరాయి సాహిత్యంలో అంతసులువుగా సంభవం కాదు. ఇదే తర్కాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళితే,మునెమ్మ నవలలోని కథాప్రదేశానికి (రాయలసీమ- చిత్తూరు) స్థానికుడిగా, నా అనుభవానికీ ఇతర ప్రాంతాల వారి పఠనానుభవానికీ పిసరంత తేడా ఖచ్చితంగా ఉంటుందని నా నమ్మకం. ఆ నమ్మకమే ఈ వ్యాసం రాయడానికి కారణం !

ఈ నేపధ్యంలోంచీ నేను 'మునెమ్మ' చదివాను. బహుశా ఆ కారణంగానే ముందుమాట, వెనకమాట, సైకో-సోషియల్ సాహితీ సిద్ధాంతాల ప్రమేయం లేకుండా ఆ (నా) నేల మీద నడిచిన కథ నడిచినట్టుగానే నన్ను ఆకట్టుకుంది. అందుకే నా విశ్లేషణని వ్యాఖ్యానంగా కాక ఒక ప్రతిస్పందనగా భావిస్తాను. విమర్శకుల కొలమానాల శాస్త్రీయత ఇక్కడ కనిపించదు. స్థానికపాఠకుడిగా ఇది నా స్పందన, ఒక ధృక్కోణం అంతే!

కాల్పనిక సాహిత్యంలో, ఇతివృత్తం (theme) తరువాత కథాప్రదేశం (setting) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కథ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలకు అత్యంత కీలకమైన సమాధానాలుగల అంశం అది . ఆతరువాత ప్రముఖంగా చెప్పుకునే అంశాలైన పాత్రలు(characters) కథావస్తువు(plot),ధృక్కోణం(point of view),శైలి (style) మొదలైన అంశాలు కథాప్రదేశానికి అనుగుణంగానే ఏర్పడతాయి. పాత్రల ప్రవర్తన,వేషభాషలూ మరియూ విధివిధానాలూ. కథావస్తువు సాగే విధానం.ఎవరి ధృక్కోణంలో కథ సాగుతోందన్న సత్యం. వీటన్నిటికీ అనువుగా శైలి కుదురుకుంటాయి లేక ఎంచుకోబడతాయి. ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని మునెమ్మ నవలలో నాకు కనిపించిన మరో ముఖ్యపాత్ర కథాప్రదేశానిది.ఆంగ్లంలో landscape అనుకోవచ్చు. అందుకే for me మునెమ్మ novel is as much about the place and its culture in itself beyond the story that happened over there.


రెండో భాగం త్వరలో...

*****