Wednesday, November 12, 2008

కాలం చెల్లిన భీష్ములు

మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్రలు కర్ణుడు, భీష్ముడు. ఒకరు విభ్రమకు గురిచేస్తే మరొకరు విభ్రాంతిని అందిస్తారు. కర్ణుడు తన నిబద్ధత నిలబెట్టుకుంటూకూడా , బాహ్యప్రపంచ కారకాలమూలంగా ప్రాణాలు కోల్పోతాడు. కానీ భీష్ముడు, తన వ్యక్తిత్వంలోని లోపాల కారణంగా అసువులుబాస్తాడు. ఈ విధంగాచూస్తే, భీష్ముడు ఒక క్లాసిక్ షేక్స్పీరియన్ పాత్ర తరహా అన్నమాట. సినిమా పరిభాషలో "miscasting" అంటారు. అంటే మోహన్ బాబు పాత్రలో మహేష్ బాబుని పెట్టడంలాంటిదన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం నాటి విలువలు కలిగిన భీష్ముడు, ఈ ద్వాపరయుగంలో a complete miscast అనిపిస్తుంది.


భీష్ముడి పాత్రలో వున్న అత్యంత definingలోపం, 'సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం' . మొత్తం మహాభారతంలో కృష్ణుడికి సరితూగగలిగిన శక్తియుక్తులు, బలాబలాలూ,జ్ఞానవిజ్ఞానాలూ సొంతమైనా, భీష్ముడు మహాభారతాన్ని నిర్దేశించడానికి తన ఉనికిని వాడడు. ప్రతిసారీ ఒక ప్రేక్షకుడిగానో లేక తప్పుజరుగుతుంటే దానిలో మూగభాగస్వామిగానో కనిపిస్తాడేగానీ, పరిస్థితుల్ని మార్చగలిగివుండీ నిర్ణయాత్మకంగా అడుగులువేసే ధీరీద్ధాత్తుడిలాగా ఆగుపించడు.కొన్ని సందర్భాలలో కృష్ణుడికీ భీష్ముడికీ మధ్య జెట్ -కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ల మధ్య కుదిరిన ఒప్పందంలాంటి 'డీల్' కుదిరినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ జెట్-కింగ్ ఫిషర్ డీల్ లో optimization of operational costs అయితే, కృష్ణ-భీష్ముల మధ్య ధర్మసంస్థాపనకోసం, ఒకరు వేగవంతమైన మరొకరు మూగవంతమైన భాగస్వాములుగా పాత్రలు పోషించారనిపిస్తుంది. కానీ, ఈ పరిణామక్రమంలో కృష్ణుడు అవతారమైపోతే, భీష్ముడు మాత్రం అపవాదునేమూటగట్టుకున్నాడు.లేకపోతే, భీష్ముడుమాత్రం అవతార హోదాకి అర్హుడుకాదా?


తండ్రి సుఖంకోసం, కాబోయేతల్లి పిల్లలకు అధికారం ఇవ్వడంకోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేసి ఈ గాంగేయుడు భీష్ముడయ్యాడు.పెద్దతమ్ముడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. భార్యల్నికూడా గెలిచితెచ్చుకోలేని బలహీనుడైన తమ్ముడు విచిత్రవీర్యుడికి అంబాలిక,అంబికలకు కట్టబెట్టి, అంబ జీవితాన్ని అడవులపాలు చేశాడు. తీరా, విచిత్రవీర్యుడు వంశాంకురాన్నివ్వకుండా కన్నుమూస్తే, తన ప్రతిజ్ఞకు మూలకారణమే నశించినాకూడా, పట్టినపట్టువీడని భీష్ముడిది మంకుపట్టు అనిపిస్తుందేతప్ప,మహాప్రతిజ్ఞలాగా అనిపించదు.వంశాన్నుద్ధరించడానికి వ్యాసుడ్ని పట్టితేగలిగినవాడు, తనే ఆపనిచేసుంటే మహాభారతం ఎలావుండేదో! బహుశా అందుకేనేమో రచయిత వ్యాసుడే కల్పించుకుని కాగలకార్యంకాస్తా నెరవేర్చాడు.


ఇక్కడా భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే కాంక్షకనిపిస్తుందేగానీ, నిజంగా అంబాలిక,అంబికల స్త్రీత్వాన్ని గౌరవించినట్లు కనపడదు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాసునితో కూడమని చెప్పడంవలనే, ఒకరికి రక్తహీనుడైన పాండురాజు జన్మిస్తే వేరొకరికి అంధుడైన ధృతరాష్టృడు జన్మించాడు. ఇందులో జరిగిన మంచిఏదైనా ఉంటే,అది concessionగా విదురుడు జన్మించడం. ఇక ఈతరంలోనూ స్త్రీల ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఈ మహానుభావుడికి పట్టింది. కుంతీ,మాద్రుల్ని సంసారసుఖం ఇవ్వలేని పాండురాజుకు కట్టబెడతాడు. గుడ్డివాడైన ధృతరాష్టృడ్ని గాంధారికి కట్టబెట్టాడు. ఒకరికి సుఖంలేదు మరొకరికి శాంతిలేదు. వేరే ప్రత్యామ్న్యాయం ఉండీ, ఇన్ని సంకరాల్ని చేజేతులారా చేసిన భీష్ముడు, ఆ తరువాత జరిగిన దారుణాలకు మూగసాక్షిగా మిగలక, సాధికారంగా ఆపగలిగేవాడా!


భీష్ముడి వ్యక్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటి ఘటన, ద్రౌపదీ వస్త్రాపహరణం. ఇంటికోడలిని, ఏకవస్త్రను నిండుకొలువులో వలువలీడ్పించే సమయంలో,ఆపగలిగిన అధికారం బాధ్యత రెండూ వుండికూడా మౌనం వహిస్తాడు. "ఇంతకన్నా, misplaced sense of loyalty మరోటుంటుందా?" అనిపిస్తుంది. ఈ ఘోరావమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికూడా, ఆ నిండుకొలువులో "నేను ధర్మ విదితనా, అధర్మవిధితనా?" అని ఒక్కభీష్ముడి నుంచే సహాయాన్ని అర్థిస్తుంది. కానీ దానికి ఇతడి సమాధానం మాత్రం "దర్మం నిఘూడమైనది. నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను" అని. దర్మాధర్మాల సంగతిపక్కనపెట్టినా, ఒక క్షత్రియుడిగా, విజ్ఞుడిగా, కనీసం మనిషిగా బలాత్కారం చెయ్యబడుతున్న ఒక దాసిని రక్షించకూడదా? కానీ ఆపనిచెయ్యలేకపోయాడు. కారణం విధేయత,విశ్వాసపాత్రత. అదీ ఎవరికి, అన్యాయానికి,అక్రమానికి. ఇంతటి మూర్ఖపు విధేయత అవసరమా అనిపిస్తుంది.బలహీనుల్ని రక్షించాల్సిన క్షాత్రధర్మాన్ని విస్మరించిన భీష్ముడి విధేయత,ధర్మనిబద్ధత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.


ఇక్కడే యుగధర్మానికి కట్టుబడిన కృష్ణుడికీ, ‘సత్తెకాలపు సత్తెయ్య’లాంటి భీష్ముడికీ తేడాకనబడుతుంది. కాకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయానికొచ్చే సరికీ ఈ విధేయతకూడా కోల్పోయిన రూపం భీష్ముడిలో కనిపించడం, మరో షాక్. సర్వసైన్యాధ్యక్షుడయ్యుండీ, కావలసినప్పుడు మరణించే వరం పొందుండీ తన చావురహస్యాన్ని తన ప్రభువుయొక్క ప్రత్యర్థులకు సునాయాసంగా చెప్పేసే ఈ మహానుభావుడ్ని ఎలా అర్థం చెసుకోవాలో తెలీదు.జీవితాంతం తప్పుడునిర్ణయాలుతప్ప, తప్పనిసరి పరిస్థితుల్లో సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేని భీష్ముడు చనిపోతూ, అంపశయ్యమీద ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని నేర్పడం మహాభారతానికే హైలైట్.


బహుశా, మనందరిలోనూ ఈ భీష్ముడున్నాడు. ఈ కలియుగంలో యుగధర్మాన్ని విస్మరించి, కొంత సత్య- త్రేత్రా - ద్వాపరయుగాలలోని విలువల్ని ఆచరిస్తూ, సరైనసమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక, అసంబద్ధ విధేయతని (misplaced loyalty) ప్రకటించుకుంటూ జీవిస్తూ ఉంటాము. మనలోని ఆ భీష్ముడికి కాలం చెల్లాలి. కాలం చెల్లిన భీష్ములకు కాలం చెల్లాలి.


****

37 comments:

నవ్వులాట శ్రీకాంత్ said...

మహేష్ గారు,

భీష్ముని పై మీ దృష్టి కోణం కొత్త గా ఉంది .బాగుంది .మీ ధృక్పధం లో యుగ ధర్మాలంటే ఏమిటి ?

కలి ధర్మ మేమిటి ?

ఉదాహరణ లతో వివరణ ఇవ్వగలరా ?

మీరు యుగ ధర్మాలను నమ్ముతున్నారా ?

నవ్వులాట శ్రీకాంత్ said...

ద్రౌపతి కాదు. ద్రౌపది.ద్రుపద రాజ పుత్రి .

Anonymous said...

దృక్కోణం కొత్తగా ఉన్నా, partial view అన్న అనుమానం వచ్చింది.

"కానీ, ఈ పరిణామక్రమంలో కృష్ణుడు అవతారమైపోతే, భీష్ముడు మాత్రం అపవాదునేమూటగట్టుకున్నాడు.లేకపోతే, భీష్ముడుమాత్రం అవతార హోదాకి అర్హుడుకాదా?"...

నా దృష్టిలో కాడు. కృష్ణుడికి అవతార హోదా భగవద్గీత వల్లో, మహాభారతం పరిధికిలోబడి, భారతం నడిపించడం వల్లో రాలేదు. అది తన వ్యక్తిత్వం, తను చేయాలనుకున్న కార్యాన్ని (ప్రతిఙ్ఞలని కాదు!) నిర్భీతిగా ఆచరించడం వల్ల (rebelion spirit) వచ్చిందని నా అభిప్రాయం.

నవ్వులాట శ్రీకాంత్ said...

శాపం వల్ల భూమి పై జన్మించిన భీష్ముడు ,దానికి తగిన ఫలితం అనుభవించ వద్దా ?.భీష్ముని మిగిలిన కధను అంగీకరించినపుడు ,శాపాన్ని కూడా
అంగీకరించాలి.అప్పుడే కధనానికి సమగ్రత ఉంటుంది.మీ వ్యక్తిగత సత్యం మీకు ముఖ్యం కావచ్చు .కానీ మన కంటే భారతానికే కొన్ని వేల ఏళ్ళు గా వ్యాప్తి ,ఖ్యాతి ఉన్నాయి.రేపు మనం లేము .కానీ భారతం ఉంటుంది.

Kathi Mahesh Kumar said...

@శ్రీకాంత్: మీ సవరణకు ధన్యవాదాలు. ద్రౌపదిని సరిదిద్దాను. ఇకమీరు అడిగిన ప్రశ్నల గురించి. నేను యుగధర్మాలను ఒక evolution of societies ధృక్పధంతో చూస్తాను.

సత్యయుగమంటే నాదృష్టిలో, మనిషి తన అస్థిత్వంయొక్క గమ్యాన్ని శోధించి తెలుసుకున్న సమయం.త్రేతాయుగంలో ఆ సత్యం యొక్క స్థాపన జరిగి, మానవసమాజాల నిర్మాణం జరిగిన సమయం.ద్వాపరయుగం సమాజంలోని హెచ్చుతగ్గులూ,వైషమ్యాలూ,భేధభావాలూ ఏర్పడి-పోరాడి సమాజనిర్మాణాన్ని కొంత అదుపుతప్పించిన సమయం. ఇక కలికాలం(యుగం),అమలులోవున్న అన్ని విలువలనూ, సత్యాలనూ ప్రశ్నించి,చేధించి,సాధించి absolute truth ని లేకుండా చేసే సమయం.

ఇదొక చక్రం.This is a development process. మిగతా యుగాలలొ పాతవిలువలు మారితే, కలియుగంలో కొత్తవిలువల సాధనలో పాతవిలువలు నాశనం చెయ్యబడతాయి.

నాకు అర్థమయిన ఈ పరిధిలో యుగధర్మాల్నిను ఈ ధృక్కోణంలోంచీచూస్తే, నమ్మదగ్గవిగానే అనిపిస్తాయి.They do have a convincing logic behind it.


@రవి: I am sure this is a partial view,no point of view is complete. అందుకే దాన్ని ధృక్కోణం అంటాం.పరమసత్యం కాదు.

నావరకూ whoever lived like a super human is an Avatar.మనిషి స్థాయినిదాటి మనీషిగా మారిన ప్రతిమహాత్ముడూ అవతారమే.ఒక్కోసారి వారిని అంశ అంటాం.ఒక్కోసారి ఆత్మస్వరూపం అంటాం.కేవలం దశావతారాల concept కి లోబడి నేను "అవతారం" అనేపదప్రయోగం చెయ్యలేదు. బహుశా, అది కృష్ణుడి సందర్భంలో వచ్చిందికాబట్టి అలా అనిపించి ఉండొచ్చు.

ఇక మీరు చెప్పిన ఆఖరి వాక్యం భీష్ముడి పేరుకు సంబంధించా? కొంత స్పష్టత లేదు. వివరించగలరు.

@శ్రీకాంత్: అష్టావసువుల్లో ఒకరైన ప్రభాసుడు (నందినిని దొంగిలించాడుకాబట్టి) మానవజన్మఎత్తమని శాపమేగానీ,ఇలా వ్యక్తిత్వలోపాలతో బ్రతకమనికాదు. భీష్ముడు అప్పటికీ "పితామహుడే".

కాకపోతే, మనం ఒక గ్రంధాన్ని రచనగా చూస్తున్నప్పుడు willing suspension of disbelief ని పక్కనపెట్టి, human drama గా కొలుస్తాము. మహాభారతం మారకపోవచ్చు కానీ కాలాన్నిబట్టి దాన్ని చదివేధృక్కోణాలూ, అర్థంచేసుకునే తీరూ మారతాయి. మారాలికూడా.

నవ్వులాట శ్రీకాంత్ said...

మీరు సాహిత్య అకాడమీ తెలుగులో అనువదించిన "పర్వ " చదివారా ?,మీకు బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను.

Anonymous said...

కృష్ణుడు దశావతారాల్లో ఒక అవతారం అని నా అభిప్రాయం కాదు. ఆ మాటకొస్తే, జీసస్ ను, మహమ్మదు ను, సోక్రటీస్ ను అవతార పురుషులన్నా ఇబ్బంది లేదు.

ఆఖరు వాక్యం కృష్ణుడికి సంబంధించిందే. కాస్త వివరిస్తాను. నా దృష్టిలో అవతారపురుషుడు లేదా మహనీయుడు అంటే, non - confirmist and rebellion. ఇది నా చాదస్తం కూడా అనుకోండి :-).తరచి చూస్తే భీష్ముడు కొంచెం confirmist అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని నిబంధనలను (ఆదర్శాలను?) ఏర్పరచుకుని, వాటికి అనుగుణంగా జీవితాన్ని గడిపిన వ్యక్తి. కృష్ణుడు అలా కాదు. కృష్ణుడికి అప్పటి సమాజంలో ఉన్న ఆదర్శాలతో పని లేదు. తనకు నచ్చిన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఒకమ్మాయిని లేపుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవడం, చెరలో ఉన్న వేల మంది అమ్మాయిలను విడిపించి తన అంతఃపురం లొ తెచ్చి పెట్టుకోవటం, ఓ ప్రతిఙ్ఞ చేసి, తిరిగి దాన్ని ఉల్లంఘించటం (ఆయుధం పట్టనని చెప్పి పట్టాడు)...ఇలా...ఇలాంటి వాళ్ళు trend setters, అవతార పురుషులు అని నా అభిప్రాయం (చాదస్తం).

Kathi Mahesh Kumar said...

@రవి: మీ చాదస్తం (నాకైతే) చాలా అర్థవంతంగ ఉంది.నాదీ ఇంచుమించి ఇలాంటి ఆలోచనే.పాతవిలువలస్థానే కొత్తవిలువల్ని స్థాపించే ప్రతిఒక్కరూ అవతారమే.

భీష్ముడు ఒకస్థాయిలో అసంబద్ధమైన విలువలలో జీవించినవాడిగా కనపడతాడు. వ్యక్తిగా అంత stature ఉండీ,సామర్ధ్యం వుండీ miscast అయిపోవడంవలన అవతారం కాలేకపోయాడనిపిస్తుంది. ఒకవేళ ఇతడేగనక ద్వాపరయుగంలోకాక త్రేతాయుగంలో వుండివుంటే ఖచ్చితంగా అవతారమే కదా!

Anonymous said...

త్రేతా యుగం లో పుట్టి ఉంటే - మీరు చెప్పదలుచుకున్నది అర్థం అయ్యింది. (ద్వాపర యుగానికి ముందు కృతయుగం కూడా ఉన్నది, కానీ మీరు ఆ యుగం గురించి చెప్పలేదు). నిజమే. తప్పక అవతార పురుషుడు అయి ఉండే వాడు, మనం ప్రతీ యేడూ, వడపప్పూ,పానకాలు ఆరగిస్తూ ఆనందించే వాళ్ళం, ఆయన పేరు చెప్పుకుని. (Thank God)

నవ్వులాట శ్రీకాంత్ said...

మీ దృష్టిలో యుగధర్మాలను వివరించారు.సరే,మీ దృష్టిలో యుగప్రమాణాలను వివరిస్తారా ?,ప్రతి యుగం లక్షల సంవత్సరాలు ఉనికి కల్గి ఉంటుందా ?ఇప్పుడు నడుస్తున్నది కలియుగమే అని మీరు ఏ కొలబద్ద తో చెబుతున్నారు ?

సవివరంగా తెలియజేయండి.

మీ అవగాహనతో మా అనుమానాలను దూరం చేయండి .

Kathi Mahesh Kumar said...

@రవి: సత్యయుగాన్నే కృతయుగం అనికూడా అంటారు.కాకపోతే, దాన్ని దేవతలుపాలించిన కాలంగా చెప్పుకుంటారుగనక,ఆప్రస్తావన తీసుకురాలేదు. త్రేతాయుగంలోనే రాముడులాంటి absolute values ఉన్నవాళ్ళున్నారని చెబుతారు. కనక, భీష్ముడు ఆకాలంలో వుంటే రాణించి మనకు పప్పూబెల్లాలు పెట్టించేవాడు.

@శ్రీకాంత్: యుగాలని ఖచ్చితమైన సంవత్సరాలలో లెక్కించడం,నాకు పెద్దగా ఆమోదయోగ్యం కాదు. మార్పు అనేది ఒక నిరంతరప్రక్రియ. తేదీమారగానే పరిస్థితులు మారవు.అందుకే ప్రతియుగానికీ ఒక సంధియుగంకూడా ఉంటుంది.

నా అవగాహన పరిమితమే అయినా,ఇప్పుడు నడుస్తున్నది కలియుగమే అనడానికి నాకున్న కొలబద్ధ ‘మార్పులోని విస్తృతత్వం’.

అందుకే, change కీ revolution కీ తేడా ఉందంటారు.Industrial revolution మొదలు ఈ ప్రపంచంలో జరుగుతున్న మార్పులన్నీ విప్లవాత్మకాలే.పాతపద్ధతుల్ని సమూలంగా పెకలించివేసిస్తున్న ఈ paradigm shift, కలియుగం అనిపిస్తుంది.

అయితే,ఇదివరకు చెప్పినట్లుగా, తేదీమారగానే అన్నీ మారిపోనట్లు, అన్నివిషయాలలోనూ ఈ విప్లవాలు ఒకేసారి రాకపోవచ్చు.సంకేతాలనుబట్టి ఒకటిమాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది...the time has come!

Bolloju Baba said...

మంచి అంశంపై ఆరోగ్యకరమైన పద్దతిలో చర్చలు నడుస్తుండటం చాలాబాగుంది.
ఈ టెంపో ఇలా కొనసాగాలని ఆశిస్తున్నాను.
భీష్మ పాత్రపై మహేష్ గారు శాస్త్రీయకోణంలో చేసిన విశ్లేషణ నామట్టుకు సహేతుకంగానే అనిపిస్తుంది. ఎవరో విభేదించినట్లుగా, అవతారపురుషునిగా పరిగణింపబడటం మినహా.

మళ్ళా వస్తాను మరిన్ని కొత్త కోణాలు తెలుసుకోవటానికై.

అభినందనలు

బొల్లోజు బాబా

Anonymous said...

"సారపు ధర్మమున్‌, విమల సత్యము పాపము చేత బొంకుచే
పారము పొందలేక చెడబారిన దురవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేతురది
వారల చేటగుగాని, ధర్మ నిస్తారకమయ్యును, సత్య శుభదాయకమయ్యెడి దైవముండెడిన్‌..''
కొంత మరిచిపోయాను గానీ, ఈ పద్యం మహాభారతంలోనిది.
"ధర్మము, సత్యము పాపము చేత చెడిపోయిన దురవస్థను మార్చగలిగిన సమర్థులు ఆ పని చెయ్యకుండా ఉపేక్ష వహిస్తే, అది వారికే చేటు చేస్తుంది. అంతే. మిగిలిన కార్యాన్ని చక్కదిద్దడానికి, ధర్మసత్యాలను కాపాడటానికి దైవం ఎటూ ఉండనే ఉంటాడు!!'' అని దాని భావం. పరిస్థితిని చక్కదిద్దగలిగే సమర్థుడయి కూడా భీష్ముడు ఎందుకు ఉపేక్షభావం వహించాడో - సరిగ్గా ఆ కారణం చేతే శ్రీకృష్ణుడు భగవదవతారంగా రూపొందాడు!!
ఇంతకీ మహేష్‌గారూ, వ్యక్తులు స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు కదా! మనకు బాగా దగ్గరనుకున్నవారి మనసులోనే ఎప్పుడేముందో, ఏం ఆలోచిస్తున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, తీసుకున్నారో, అవి ఎందుకో.. మనకు తెలియదు. అంచనా వెయ్యలేం. అలాంటిది వేల ఏళ్లకు ముందు జీవించినవారు (లేదా కల్పిత పాత్రలే అనుకున్నా) ఎందుకలా ప్రవర్తించారో ఎలా తెలుసుకోగలం? ఇతిహాసపురాణాలను చదవడం అంటే - ఆనాటి స్థలకాలాదులను అవగాహన చేసుకుని, ఆలోచనను విశాలం చేసుకోవడమే అనుకుంటా. అంతేతప్ప 'భీష్ముడలా ఎందుకు చెయ్యలేదో, కర్ణుడిలా ఎందుకు చేశాడో.. అంటూ ఇప్పుడీ విచికిత్స అవసరమంటారా? అయినా, మీ ఆలోచన బానే ఉంది. పైన చెప్పినట్టు
ఎస్సెల్‌ భైరప్ప గారి 'పర్వ', ఇరావతి కార్వే రాసిన 'యుగాంత' వంటి పుస్తకాలు మహాభారతం, అందులోని పాత్రల తీరుతెన్నుల పట్ల ఓ కొత్త దృక్కోణాన్నిస్తాయి.. ఇంకా బాగా అర్థం చేసుకునేందుకు దోహదం చేస్తాయి. తప్పకుండా చదువుతారు కదూ?

నవ్వులాట శ్రీకాంత్ said...

"మార్పు అనేది ఒక నిరంతరప్రక్రియ. తేదీమారగానే పరిస్థితులు మారవు.అందుకే ప్రతియుగానికీ ఒక సంధియుగంకూడా ఉంటుంది."

మార్పు నిరంతర ప్రక్రియ అయినప్పుడు,

పరిస్థితులలో మార్పు లేకపొవటమేమిటీ ?

సంధి యుగమేమిటి ?

ప్రతి స్థితి ,పరిస్థితి వేటికవే సత్యం,

ఈ క్షణం లో ప్రవాహం లో ఉంచిన పాదం,

మరుక్షణం లోని పాదం ఒకటిగానే కనిపిస్తాయి.

అలా అని మార్పు లేనట్టా ?

మార్పు మన ఉహకు అందనట్టా ?

అందుచేత మార్పు నిత్యమైతే సంధీ ఉండదు,

మార్పు లేని పరిస్థితి ఉండదు .

మీరు ఒక్కసారి ఆలోచించండి .

Kathi Mahesh Kumar said...

@అరుణ: నమ్మకాల సంగతి పక్కనపెడితే, స్థల,కాల పరిస్థితులకు అనుగుణంగా పాత్రల విశ్లేషణ చెయ్యడానికి మహాభారతం రాసినకాలంగానీ, జరిగిన కాలంగానీ ఇంతవరకూ చరిత్రకారులు ఖచ్చితంగా తేల్చిచెప్పిన దాఖలాలు లేవు.ఇప్పటికీ క్రీపూ 400 నుంచీ క్రీశ 400 వరకూ ఉన్నకాలంలో మహాభారతం రాయబడివుండొచ్చన్నదొ ఒక అనుమానం(Wenternitz,Hopkins and Eilson etc.) మాత్రమే.

మీరు చిన్నప్పుడు చదివినపుస్తకం పెద్దయినతరువాత మళ్ళీ చదివితే, కొత్తార్థాలు స్ఫురిస్తాయికదా. అలాగే, పాఠకుడున్న కాలమానాన్ని బట్టి రచనలో కొత్తర్థాల్ని వెతుకుతాడు. దాన్నే reader centric interpretation అంటారు.నేను చేసిన ప్రయత్నం అలాంటిదే.

ఇది విచికిత్సకాదు. ఒక పాఠకుడిగా నేను అర్థంచేసుకున్న భాష్యం. మీరు చెప్పిన పుస్తకాలు చదవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.

@శ్రీకాంత్:నాఉద్దేశం, తేదీలు మారగానే ‘హఠాత్తుగా’ పరిస్థితులు మారవని. ప్రతియుగానికీ యుగానికీ మధ్య రెండురకాల విలువలూకలిసిన కాలం ఒకటొస్తుంది. దాన్ని సంధియుగం అంటారు.Transition period అనుకోవచ్చు.

మీరు ఒక సంవత్సరం తరువాత సొంతవూరికెళ్ళారనుకోండి,అక్కడ మీ పాతమిత్రుడొకరు కలిసి "శ్రీకాంత్ నువ్వు చాలా మారిపోయావురా!" అంటాడు. కానీ, నిత్యం అద్దంలో మిమ్మల్ని చూసుకునే మీకు ఆమార్పు కనబడదు. అంటే మార్పు ఉన్నటా? లేనట్టా? అదే బహుశా, theory of relativity కోణం.

ఒక సైద్ధాంతిక చర్చలో, highest order of philosophy కూడిన ఒక ప్రశ్నని లేవనెత్తడం అభినందనీయమేగానీ, దీని సాధ్యాసాధ్యాలసంగతి మీకు తెలియంది కాదు.

ప్రతి స్థితి, పరిస్థితీ వేటికవే సత్యమని అందరూ నమ్మితే, ఏగొడవా వుండదు. కానీ, "మార్పు" జరుగుతోందనే స్పృహ,చైతన్యం మనిషిని ఆ వేదాంత స్థితికి చేరనివ్వదు.ఏకొందరో చేరుతారు. అలా చేరినవారికి ఈ ప్రపంచంతో పెద్దపనుండదు.

@బొల్లోజుబాబాగారు: ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

అమ్మో, చర్చ భలేగా సాగుతోందే!
రవి గారు, నేను ఇదివరలో మిమ్మల్ని భగవద్గీత గురించి, కృష్ణ తత్వాన్ని గురించి ఒక టపా రాయమని కోరింది ఇందుకే! కృష్ణుడు మీరు చెప్పిన కారణాలవల్లే అవతార పురుషుడయ్యాడని నా నమ్మకం కూడా! అందుకే నా అభిమాన అవతారం(ఈ మాట ఎబ్బెట్టుగా ఉంది అభిమాన నటుడు లాగా)"కృష్ణం వందే జగద్గురుం" అని నేను ఈ కోణంలోనే నమస్కరిస్తాను ఆయనకు.

బుజ్జి said...

ఫస్ట్ పారాలో ఇష్టం అన్నారు, కింద అన్నీ విమర్శలే కనిపిస్తున్నాయి మరి, అదేంటి? ఎందుకిష్టo?

Anil Dasari said...

మీ విశ్లేషణ ప్రకారం భీష్ముడు అవతార పురుషుడి హోదాకి తగ్గ పరిణితి కనబరచినట్లు లేదే.

Kathi Mahesh Kumar said...

@బుజ్జి: భీష్ముడిలో అన్నిలోపాలున్నాయుగాబట్టే ఇష్టం. He is so human.We can learn so much from him.గొప్ప లక్షణాలుకలిగీ తప్పుచెయ్యడమే మనిషిలక్షణం.ఎంతనిబద్ధత కలిగిన మనుషులైనా, సమయం సందర్భం కలిసిరానప్పుడు, ఆ సమయమే వారిదికానప్పుడు ఇలాగే కనబడుతారు.He is a misfit at this point in time,but might have excelled given a different frame of reference. అందుకే, అందరి మనుషుల్లోనూ భీష్ముడున్నాడని అన్నాను.

@అబ్రకదబ్ర: భీష్ముడు మంచివాడే, కానీ గొప్పవాడు(అవతారం) కావటానికి తగ్గ పరిణితి,పటుత్వం చూపించలేదు. అందుకే, అతనిలోని తప్పుల్ని తెలుసుకుని నేర్చుకునే అవకాశం వుంది. ఒకటి, taking right decision at right time. రెండు, సమయానుగుణంగా మనం నమ్మే విలువలలో మార్పుని తీసుకురావడం.

@సుజాత: రవిగారి టపాకోసం మేమూ ఎదురుచుస్తాము.

Anonymous said...

"కృష్ణుడికి అప్పటి సమాజంలో ఉన్న ఆదర్శాలతో పని లేదు. తనకు నచ్చిన పనిని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఒకమ్మాయిని లేపుకుని వెళ్ళి పెళ్ళి చేసుకోవడం, చెరలో ఉన్న వేల మంది అమ్మాయిలను విడిపించి తన అంతఃపురం లొ తెచ్చి పెట్టుకోవటం, ఓ ప్రతిఙ్ఞ చేసి, తిరిగి దాన్ని ఉల్లంఘించటం (ఆయుధం పట్టనని చెప్పి పట్టాడు)...ఇలా...ఇలాంటి వాళ్ళు trend setters, అవతార పురుషులు అని నా అభిప్రాయం"

అయ్యో రవిగారూ, ఇప్పటిదాకా అవతారపురుషుడవ్వాలంటే ఎంతో కష్టం అనుకుంటున్నాను. ఇంత సులభం అని మీరు తేల్చేస్తారనుకోలేదు. చెప్పకుండా చిరంజీవి కూతుర్ని లేవనెత్తుకు పెళ్ళిచేసుకున్న భరద్వాజ్ (పేరు కరక్టేనా?), ఊరికో కాపురం పెట్టి అందరినీ చక్కగా చూసుకుంటున్న రాజకీయనాయకులు,నటులూ, చేసిన ప్రతీ ఒట్టునూ గట్టు మీద పెట్టే మన నాయకదేవుళ్ళూ - అందరూ అవతారాలేనన్నమాట.
మరిచిపోయాను - రెబెలెయిన్‌ అవ్వడమే అవతార లక్షణం కదా - గద్దర్ లూ, నారాయణమూర్తులూ, వరవర రావులూ కూడా అవతారాలే. ట్రెండ్ సెట్టర్లే...
కళ్ళు తెరిపించారు.

బాబూ, సరదాకి కామెంటాను. కృష్ణుడు అవతారం కాదని నేనేమీ అనటం లేదు - మీకూ నాకూ విబేధం లేదు. మహేష్ గారూ మీరు కానివ్వండి. ఏదో రవిగారితో ఉన్న చనువుతో సరదాగా చిన్న లెగ్ పుల్లింగ్ అంతే...

రవి వైజాసత్య said...

ఇప్పుడే మీ వీరాభిమాని సుత్తి నరేష్ బాబు బ్లాగు పానశాలలో పీకలదాకా తాగి సేదతీరుదామని పర్ణశాల కొచ్చానండీ. అభినందనలు Imitation is the sincerest form of flattery!!

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మీ మెకాలే టపా కో వ్యాఖ్య రాసా. టపా కింద వచ్చినట్లు లేదు. అలాంటి వ్యాఖ్యే మళ్ళీ రాయాలనిపించింది ఈటపా చదివితే. భీష్ముడిని (ఇంకెవరినైనా సరే) వేరే దృక్పధంలోంచి చూడడం మంచి విషయమే, కానీ ఓనాలుగు పేరాలలో భీష్ముడిలాంటి వ్యక్తిత్వాన్ని ఇమడ్చబూనడం దుస్సాహసం. అంత అవగాహన మీకు రాకముందే టపా రాసినట్లుగా ఉంది. మొదటిపేరా లోంచి చివరి పేరాలోకి వెళ్ళేసరికి ఎన్ని inconsistencies దొర్లాయో. వ్యాఖ్యలకి సమాధానాలలో ఇంకొన్ని. భీష్ముడంటే ఇష్టమంటారు, మనలోని భీష్ములు నశించాలంటారొకసారి. దీనికో సమాధానం ఇస్తారిప్పుడు. ఏదైనా ఒకస్టాండు తీసుకుని, కూలంకషంగా చర్చించండి, వ్యాఖ్యలకి ముక్కకి ముక్కగా కాకుండా కొన్ని వచ్చినతర్వాత మీటపా దృష్ట్యా సమాధానం చెప్పండి.. మెప్పుకోసమో, మెహర్బానీకో టపా రాసే అవసరమున్న స్థితికాదు మీది. అలాగే, ఆలోచించలేని, బాగారాయలేని బ్లాగరు కూడా కారు మీరు. సాలిడ్ టపారాయండి - తక్కువ రాసినా పర్వాలేదు. ఈవ్యాఖ్య ప్రచురించాల్సిన అవసరం లేదు. సూక్ష్మం గ్రహిస్తే చాలు.

Kathi Mahesh Kumar said...

@సత్యసాయి కొవ్వలి: మీరు ఒకబ్లాగు నుంచీ ఏమి ఆశిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.పూర్తిఅవగాహనతో, ఏవిధమైన వైరుధ్యాలూ లేకుండా,కూలంకషంగా నా అభిప్రాయాల్ని-ఆలొచనల్ని-భావాల్నీ ఎందుకు చెప్పాలోకూడా నాకు తెలియడం లేదు.

పూర్తి అవగాహవచ్చే వరకూ నేను రాయకుండా ఉండాలంటే, జీవితంలో ఏ విషయం మీదా రాయలేను. ఈ భూప్రపంచంలో ఎవరూ రాయలేరుకూడా.ఒక బ్లాగు టపాలో Phd స్థాయి(అది కూడా సమగ్రంగా ఉండదు)విస్తృతత్వమో, విషయసాధికారత ఆశించడం ఎంతవరకూ సమంజసం.

Can't we have random thoughts, sparks of musings,stream of ideas? బ్లాగంటే అదే అని నా ఉద్దేశం.

@రవి వైజాసత్య: ధన్యవాదాలు.Its true, imitation only proves the worth of the original.

@చివుకుల కృష్ణమోహన్‌: మీరు "సరదా లెగ్ పుల్లింగ్" అనిచెప్పినా, మీఉద్దేశం అర్థమయ్యింది.

గద్దర్ లూ, నారాయణమూర్తులూ, వరవర రావులూ అవతారమాకాదా అనేది వాళ్ళద్వారా తమ జీవితాల్లో స్వాంతనపొందినవాళ్ళని అడిగితే చెబుతారు.అలా నిర్ణయించే అధికారమూ మతగ్రంధాలకన్నా, ఆ మనుషులకే ఉంది. They are rebels with a cause.వీళ్ళ రెబల్ నేచర్ వల్ల కొన్నిజీవితాలు బాగుపడితే, కనీసం ఒక్క జీవితం బాగుపడుంటే వీళ్ళని అవతారం చెయ్యడంలో నాకైతే అభ్యంతరం ఉండదు.

Anonymous said...

@ మహేష్ - మరేమి, సత్యసాయిబాబానీ, జీయరుస్వామినీ, ఇంకొందరు ఇలాంటి వారినీ అవతారాలుగా గుర్తించమని ప్రార్థన. వాళ్ళవల్ల బాగుపడ్డ జీవితాలు కొన్నిటిని, కనీసం ఒక్కరి చొప్పున నేను మీకు పరిచయం చేయగలను.

Kathi Mahesh Kumar said...

@చివుకుల కృష్ణమోహన్‌:సత్యసాయిబాబా, జీయరుస్వామి వల్ల జీవితాలు బాగుపడినవాళ్ళు ఖచ్చితంగావాళ్ళని అవతారాలుగానే భావిస్తారు.

What made you think I have an issue with that? కాకపోతే, వాళ్ళని అందరూ అవతారాలుగా గుర్తించనఖ్ఖరలేదు. మీరు ఎద్దేవాచేసినవాళ్ళని తక్కువమనుషులుగానూ చూడనఖ్ఖరలేదు.

Unknown said...

Wanted to write a comment... but it became a size of post.
So wrote a post.
http://pradeepblog.miriyala.in/2008/11/blog-post.html

Anonymous said...

నేనెవర్నీ ఎద్దేవా చేయలేదండి. చేసినది కొందరు రాజకీయనాయకులనీ, బోలెడు పెళ్ళిళ్ళు చేసుకున్నవారినీ, పిల్లని లేపుకెళ్ళి పెళ్ళి చేసుకున్నవాళ్ళనీ... వాళ్ళు కూడా మీరు అవతారాలే అంటున్నారు. అలాగే కానీండి. ఆలెక్కన ప్రతీ మనిషి ఒక అవతారమే అన్నది మీ అభిప్రాయంలా కనిపిస్తోంది. ఇంకా దానికి చెప్పడానికేముంది? ఆ లెక్కన మనిషి అంటే సరిపోదా - అవతారం అన్న కొత్తపదం వాడడం దేనికి?
ఓ పక్క రవిగారు కృష్ణుడు,ప్రవక్త ఇలాంటి కొందరే అవతారాలంటారు. మీరు అదే అభిప్రాయంతో ఉన్నానంటారు. మళ్ళీ అందరు మనుష్యులూ అవతారాలే అంటారు. బహుశా మీ స్థాయి విశ్లేషణ అర్థం కాడానికి నేనింకా చాలా ఎదగాలనుకుంటా. అంతదాకా కాస్త చేతివేళ్ళని కీబోర్డు నుంచి కాస్త దూరంగా వుంచి మీ బ్లాగు చదువుకుంటే మేలు.

...and just hope you do not get into your standard reply mode for this.

Disclaimer: తెలిసి నేనెక్కడా ఈ కామెంటులో వ్యంగ్యాన్ని చొప్పించడం గానీ, ఎవరినీ కించపరచడం గానీ చేయలేదు. ఒకవేళ అలా జరిగితే ముందస్తు క్షమాపణలు కూడా ఇక్కడే జతచేస్తున్నాను. వాటిని చదువుకుని నన్ను వదిలేయమని ప్రార్థన.

Anonymous said...

చివుకుల కృష్ణమోహన్ గారు, మీరు చెప్పిన వాళ్ళు "అవతారం పురుషులు". సున్న మాత్రమే తేడా. :-)

(Rebellion is different from Rection. తేడా సున్నితమైనది.)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

....పూర్తిఅవగాహనతో, ఏవిధమైన వైరుధ్యాలూ లేకుండా,కూలంకషంగా నా అభిప్రాయాల్ని-ఆలొచనల్ని-భావాల్నీ ఎందుకు చెప్పాలోకూడా నాకు తెలియడం లేదు.....
పైది మీసమాధానం. ఆశించినట్లుగానే ప్రతిస్పందించారు. ఆలోచనలని స్పష్టంగా, పరస్పర వైరుధ్యాలు (టపాలోపల)లేకుండా ఎందుకు చెప్పాలని నన్నడిగితే .. నేనేమి సేయుదురా.

ఆనందగురు said...

Dear blogfriends,

Visit this post also :

http://aanamdaguru.blogspot.com/2008/11/blog-post.html

విరజాజి said...

"భీష్ముడు చనిపోతూ, అంపశయ్యమీద ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని నేర్పడం మహాభారతానికే హైలైట్."

మీరన్నది అక్షరాలా నిజం. కృష్ణుడే భీష్ముణ్ణి భీష్మాచార్యులుగా మార్చాడు. తాను సారధ్యం వహించి అంతోటి యుధ్ధాన్ని నడిపినప్పటికీ, తాను చెప్పిన గీతా సారం పాండవుల వంట బట్టలేదని గ్రహించిన శ్రీ కృష్ణుడు వారికి అర్ధం అయ్యే రీతిలో రాజ్య ధర్మాన్ని చెప్పగల సమర్ధుడు భీష్ముడేనని చెప్పి పాండవులకు భీష్మునిచే ధర్మోపదేశం చేయించాడు. గురువు ముఖతః విననిదే ఏ ఉపదేశానికీ సాఫల్యత లభించదు కనుక వారికి సరిపడిన గురువునే చూపించాడు. (పదో క్లాసు చదివే పిల్లవాడికి యూనివర్సిటీ ప్రొఫెసర్ తో పాఠాలు చెప్పించనక్కరలేదు కదా !) ఈ భీష్మ - యుధిష్ఠిర సంవాదంలో "శ్రీ విష్ణు సహస్ర నామాలు" బోధించి జగత్తుకే ఒక దారి చూపించాడు! భీష్ముడు చెప్పిన ధర్మ సూక్ష్మాలన్నీ ఒక ఎత్తు, ఒక్క విష్ణు సహస్రనామాలు ఒక ఎత్తు ! భీష్ముని నిరంతర దైవ భక్తి, భీష్ముడు భగవంతుని కొలిచే విధానాన్ని, భీష్ముడు తానుగా సంకలనం చేసిన విష్ణు సహస్రనామాలతో ప్రపంచానికి శ్రీ కృష్ణుడు తేటతెల్లం చేశాడు. భగవద్ నామాలు బోధించగల అర్హత ఉన్న వ్యక్తిగా భీష్ముడు ఆ భగవంతునితోనే గుర్తింపబడడం ఎంతో గొప్ప విషయం!

కామేశ్వరరావు said...

కారణాలు కాస్త వేరైనా భీష్మూడు, కర్ణుడూ నాకూ ఇష్టమైన పాత్రలే. ఇద్దరికీ మధ్యనున్న పోలికా, తేడా ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకి, భీష్ముడూ కర్ణుడూ ఇద్దరూ ధర్మం తెలిసినవారే. ఇద్దరికీ కృష్ణుడు అవతారపురుషుడని (ఇక్కడ అవతారపురుషుడంటే, రవిగారి నిర్వచనం కాదు!) తెలుసు, పాండవుల పక్షాన కృష్ణుడున్నాడు కాబట్టి వాళ్ళూ గెలుస్తారనీ తెలుసు. ఇద్దరూ వాళ్ళవాళ్ళ మాటలకి కట్టుబడే దుర్యోధనుడివైపు యుద్ధం చేస్తారు. ఇవి స్థూలంగా కనిపించే పోలికలైతే, సూక్ష్మంగా ఎన్నో తేడాలు కనిపిస్తాయి. బాగా కనిపించే ఒక తేడా, దుర్యోధనుడు చేస్తున్నది తప్పని భీష్ముడు దుర్యోధనుడికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కర్ణుడు చెయ్యడు. అది వాళ్ళ వాళ్ళ స్థాయివల్లా, దుర్యోధనుడితో ఉన్న సంబంధం వల్లనా కావచ్చు. ఈ పోలికలూ తేడాల గురించి విపులంగా రాస్తే ఒక కావ్యమే అవుతుంది!
మహేష్ గారు వారికున్న పరిమితుల మేరకూ, వారి అభిప్రాయాలను పంచుకున్నారు. బావుంది. కాకపోతే, భారతంలోని వివరాలు (ప్రసిద్ధమైనవే) ప్రస్తావించినప్పుడు ఒకసారి సరిచూసుకుంటే బావుంటుంది, ఇలాటి సలహా ఇంతకుముందూ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. భీష్మునివల్ల అడవులపాలయింది అంబాలిక కాదు, అంబ. ద్రౌపది అన్నది "ధర్మ విజితనా? అధర్మ విజితనా?".
ఈ టపా చదివాక నాకొచ్చిన ఓ సందేహం. భీష్ముడు త్రేతాయుగపు విలువలని ద్వాపరంలో పాటించడం పెద్ద పొరపాటని అన్నారు సరే. మరి ద్వాపరయుగంలోని భీష్ముణ్ణి, ఈనాటి కలియుగంలోని విలువలతో బేరీజు వెయ్యడం పొరపాటు కాదా? మహేష్ గారడిగిన చాలా ప్రశ్నలు నాకలానే అనిపించాయి. నిజంగా ఆ ప్రశ్నలకి సమాధానాలున్నాయన్న నమ్మకంతో భారతం (మళ్ళీ?) చదివితే, మహేష్ గారికి సమాధానాలు దొరుకుతాయన్న నమ్మకం నాకుంది.
ఇంతకీ మహేష్ గారు, మీలో ఉన్న భీష్మునికి కాలం చెల్లిందంటారా? :-)

నీ మిత్రుడు said...

"వంశాన్నుద్ధరించడానికి వ్యాసుడ్ని పట్టితేగలిగినవాడు, తనే ఆపనిచేసుంటే మహాభారతం ఎలావుండేదో"! దీన్ని కొంచెం వివరిస్తార...ప్లీజ్.

Anonymous said...

ఈ జాబులో మీరు రాసినదీ, ఇక్కడి వ్యాఖ్యలకు మీరిచ్చిన సమాధానాలనూ చూస్తే సత్యసాయి గారికి కలిగిన అభిప్రాయమే నాకూ కలిగింది.. ఈ వైరుధ్యాల గురించి ఆయనడిగిన ప్రశ్నకు మీరిచ్చిన సమాధానం ఇంకాస్త హుందాగా ఉండాల్సింది.

Anonymous said...

మహేశ్ కుమర్ గారి టపాకు ఇక్కడ కుతూహలం ఆపుకోలేక నేను చేసిన వ్యాఖ్యకు ఇంకో చోట కాస్త ప్రహసనం జరిగింది. నాకు personal గా కొన్ని వేగులు వచ్చాయి. (ఎవరినో లేపుకొచ్చాడు, అమ్మాయిలను చెరబట్టాడు...ఇలా కృష్ణుణ్ణి ఏకుతావా అంటూ. నిజానికి నా ఉద్దేశ్యం వేరు. నా ఉద్దేశ్యం ప్రకారం కృష్ణుడు ఆత్మ నిర్దేశం ప్రకారం నడుచుకున్న మహానుభావుడు అన్నది మాత్రమే. పైన చెప్పిన ఉదంతాలు, కేవలం వాటికి దృష్టాంతాలు).నిజానికి అందరివీ అభిప్రాయాలు మాత్రమే. భీష్ముడి మీదో, మరో పురాణ పురుషుల మీదో రాయాలంటే, వారి నుండీ మనం ఏం తెలుసుకోగోరుతున్నామో ఆ దిశగా "చర్చ" కొనసాగాలి. (ఈ inference నాకు కూడా వర్తిస్తుంది). మన అభిప్రాయాలు చెప్పాలంటే, కనీసం మనం వారున్న పరిస్థితుల్లోనో మనం ఉండి ఉండాలి., వారి జీవన శైలికి దగ్గరగా మన జీవన శైలి ఉండాలి.

అలా కాక మన opinions ని చెప్పేయడం వల్ల (ఏ సినిమాలో, రాజకీయాలో అయితే పర్లేదు, కానీ పురాణ పురుషుల మీద అయితే మాత్రం) ఎవరికో అపోహలు కలిగించిన వాళ్ళం, లేదా మనమే కొన్ని అపోహలకు లోనయి వాటినే నిజమని నమ్మే పరిస్థితుల్లో పడతాం తప్ప సాధించేదేమి ఉండదనిపిస్తుంది.

బ్లాగ్లోకం లో రెండవ సారి నాకు ఎదురైన అనుభవం ఇది.

Being said all the above, there are certain ideals, which are just ideals (but nothing else), but people (we) have a tendency to cling on to (un to) them. To discuss about them requires, better insight and also lot of patience and perserverance from all the people involving in those discussions. Hopefully blogworld will accommodate such discussions in future.

శివ్ said...

కత్తి మహేష్ కుమార్ గారు,

ఈ మధ్య తెలుగు బ్లాగులు చదవడం కుదరడం లేదు. ఇప్పుడు చూస్తే చాల మిస్ అయిపోయానని అనిపిస్తోంది.

మీరు ఈ మధ్య రాసిన రెండు మూడు టపాలు చూస్తే అందుకో అప్రయత్నంగా ఈ పాట గుర్తుకొచ్చింది ...

"అప్పులు గొప్పగా చెయ్యచ్చండీ,
అసలుకు ఎసరే పెట్టచ్చండీ,
పీపాలెన్నో తాగొచ్చండీ,
పాపాలెన్నో చెయ్యచ్చండీ,

కొత్తా దేవుడండీ, కొంగోత్తా దేవుడండీ ...."

'రాజాధిరాజు' సినిమాలో నూతన్ ప్రసాద్ సాతాను వేషంలో పాడే పాట .... కలియుగ ధర్మం కదా మరి, అందుకనేమో ....

- Shiv.

Anonymous said...

మహేష్ గారు,

ముందుగా భీష్ముడు ఈ కాలం స్త్రీలకు చేసిన ద్రోహం ఏంటొ, వారి ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఏంటొ వివరించగలరు. ఇకపొతే అది మాయాజూదం అయినను వొకింత ధర్మబద్దం గా జరిగినదే. అందుకే తను ఆ సమయం లొ మౌనం దాల్చి ఉండొచ్చు. మీ లాగే తను కూడ తనదైన సిద్దాంతాన్ని నమ్మి ఉండొచ్చు. మరో విషయం, భార్యల్ని కూద 'తెచ్చుకోలేనీ అన్నారు, అసలు ఆయన ఉన్నదే అందుకు... నా ఉద్దేశ్యం, భరత వంశ్యాన్ని కాపాడటం... అటువంటి సంకట స్థితి లో తనకు తెలియకుండా జరిగిన తప్పులకు బాధ్యత వహించాలనటం అవివేకం. తన విధేయతా, విస్వాశపాత్రత స్వధర్మానికే కాని అన్యాయానికి కాదు. అంబ, అంబాలిక ల విషయం లో తరుణోపాయం అలోచించాడే కాని మంకుపట్టు పట్టలేదు. నాటి క్షత్రియ ధర్మం ప్రకారం నడిచాడు. భారతం లో కర్ణుడిదే నీచమైన వ్యక్తిత్వం. ఎందుచేతనిన, ధుర్యొధనుడు అర్జునునికి సమవుజ్జీ గా అతనిని భావించే యుద్ధానికి సన్నద్ధమవుతాడు. భీష్ముడు ఎప్పుడూ తనని విమర్శించే వాడే కాని, ప్రోత్సహించలేదు. కాని తనని యుద్ధానికి ఉసిగొల్పిన వారిలో ఒకడైన కర్ణుడే స్వకీర్తి కోసం స్నేహధర్మాన్ని విస్మరించాడు. అందులో మొదటిది, కుంతికి 'అర్జునిని తప్పా అని వరమివ్వటం కాగా, ఇంద్రుడికి కవచకుండలాలు దానమివ్వటం, ఇంకనూ, భీష్ముడు వున్నంత వరకూ యుద్దానికి రానని చెప్పటం మొదలైనవి. భీష్ముడిది పూర్తిగా సత్య, ధర్మా లతో ( న్యాయం కాదు ) కూడిన జీవితం కాగా, కర్ణుడిది కొంత అదర్మాన్ని ప్రోత్సహించటం, అసత్యాలు, మరికొంత స్వకీర్తి, కీలక సమయం లో తప్పుడు నిర్ణయాలు.. Vijay