మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేదు. నిజానికి ఎందరో దళితేతరుల కృషి లేకపోతే దళిత ఉద్యమమే లేదు. కాబట్టి ఇక్కడా అది చెల్లదు.
కానీ...తెలుగు భాషలో నిర్బంధ విద్య కావాలి అని కోరుకునేవాళ్ళు తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చేర్పించకపోయినా, కనీసం చేర్పించిన స్కూళ్ళలో తెలుగు కోసం శ్రమించినవాళ్ళో,వాదించినవాళ్ళో లేక పేరెంట్స్ కమిటీలో ప్రస్తావించినవాళ్ళో ఉండాలనుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఎందుకంటే, తమ పరిధిలోనే తెలుగు కోసం పోరాడని ఈ సాహసవంతులు ఉద్యమాలు చేసి ప్రభుత్వాల్ని మారుస్తామంటే నమ్మడానికి చెవిలోపూలు పెట్టుకున్నవాళ్ళు బ్లాగుల్లో కొందరున్నా, అందరూ అలా ఉండరని చెప్పడానికి ఆమాత్రం ప్రశ్నించక తప్పదు.
ప్రాధమిక విద్యలో తెలుగు తగ్గిపోతుందనడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఎక్కడా లేవు. సంఖ్యాపరంగా ఈ వాదం ఎక్కడా నిలబడదు. 2005-06 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో మొత్తం 50,895 ప్రాధమిక పాఠశాలలున్నాయి.విధ్యార్థుల సంఖ్య 30,84,212. ప్రైవేటు పాఠశాలల్లో కేవలం 3,570. విద్యార్థలు 6,03,160. ప్రభుత్వపాఠశాలల్లో తెలుగులోనే బోధిస్తారనేది అందరికీ తెలిసిందే. ప్రాధమికోన్నత విద్యలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏదో కుట్రచేసి తెలుగును చంపేస్తుందనటం తెలియనితనం. ప్రభుత్వం తన ముస్లిం appeasement కోసం తెలుగుని పట్టించుకోవటం లేదనడం మూర్ఖత్వం. ఉర్దూ చదివిన ముస్లింలు పాకీస్తానీలు అయిపోయి శతృవర్గంగా తయారవుతారనడం ఉన్మాదం.
తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల పిల్లలెవరూ తెలుగు మీడియం చదువులు చదవటం లేదు. వీళ్ళు ప్రభుత్వం మీదపడి స్టేజిల్లోనూ,బ్లాగుల్లోనూ ఏడవటంతప్ప క్రియాశీలకంగా తెలుగును ఒక ప్రజాఉద్యమంగా ఎన్నడూ చెయ్యాలనుకోలేదు.ఎందుకంటే,ఒక్కసారి ప్రజల్లో పడితే వీళ్ళబ్రతుకులు కుక్కలుచింపిన విస్తరే. "మీకు మాత్రం ఇంగ్లీషు చదువులూ మాకు మాత్రం తెలుగు బ్రతుకులా" అని ప్రజలు అడిగితే వీళ్ళు మొఖం ఎక్కడబెట్టుకుంటారో వీళ్ళకే తెలీదు.
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.
ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.
రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!
మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.
పైవేవీ ఈ పెద్దలు చెయ్యరు చెయ్యలేరు...ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం తెలుగు భాష బ్రతకడం కాదు, తెలుగుతప్ప మరేదీ చదువుకోలేని ఒక తరగతి ప్రజల్ని మరో యాభైసంవత్సరాలు ఈ గొప్పోళ్ళకు వాళ్ళవారసులకూ పోటీరాకుండా చెయ్యడం. అందుకే తెలుగు భాష గురించి emotional rhetoric మాట్లాడతారేగానీ,విద్యాప్రమాణాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం తెలుగు కోసం ఏదో చెయ్యలంటారుగానీ, వీళ్ళు మాత్రం ప్రైవేటు విద్యకు మహారాజపోషకులు. అందరూ నిర్భంధ తెలుగు విద్య అభ్యసించాలంటారుగానీ,వీళ్ళ పిల్లలు మాత్రం కాన్వెంటుల్లో రాజ్యమేలుతుంటారు. They are the most dangerous people at this point in time. Beware of them.