Sunday, November 30, 2008

మతం - మతవాదం - మతోన్మాదం


ముంబై మారణహోమం నేపధ్యంలో మతాన్నీ, మతవాదాన్నీ, మతోన్మాదాన్నీ ఒకేగాటనకట్టి చాలామంది తమ భావజాల జాలాన్ని విజయవంతంగా అల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరహా ప్రశ్నలు రాజకీయఉద్దేశాలను సాక్షాత్కరించగలవేగానీ సమస్యకు సమాధానాన్ని కాదు.


మతం: ఒక పుస్తకాన్ని,ప్రవక్తను లేక ఒక నిర్దేశించబడిన/ వివరించబడిన విధానాన్నిఆధారం చేసుకుని దాన్ని అనుసరించి జీవితాన్ని గడపడం. హిందూ మతం ఒక నిర్ధిష్టమైన code నుంచీ ఉద్భవించలేదు. కానీ క్రైస్తవం యూదుల మతానికీ రోమన్ సామ్రాజ్యానికీ వ్యతిరేకంగా ఉద్భవించింది, ఇస్లాం జుడాయిజం,క్రైస్తవంలోని అవినీతికి వ్యతిరేకంగా మహ్మదు ప్రవక్త సమర్పణ భావానికి ప్రతీకగా ఆవిర్భవించింది. నిజానికి ఇస్లాం అంటేనే భగవంతునికి సమర్పించబడింది అని అర్థం. క్రైస్తవం ఇస్లాం అవిఉద్భవించిన చారిత్రక స్థితినిబట్టి మతాలుగా వ్యాప్తిచేందే దిశలోనే మతవాదాలుగా మారిపోయాయి.

మతవాదం: ఒక రాజకీయ ప్రయోజనన్ని ఆశించి అనుకూలమైన మతం మాత్రమే పాలనకు అర్హమైనదిగా భావించడం. ఆ భావజాలం నేపధ్యంలో మిగతా మతాలను సమాన రాజకీయ అవకాశాలకూ పాలనాధికారాలకూ దూరం చెయ్యడం. ఒక విధంగా ఇతర మతాలను second rate citizens గా భావించడం. ఇస్లాం క్రైస్తవం సహజంగా నే ఈ విధానం వైపు త్వరగా మొగ్గుచూపినా హిందూ మతం ఈ ధోరణులనుంచీ దూరంగానే ఉంది. ముస్లింల దండయాత్రల నేపధ్యంలో కొంత ఈ భావజాలం కనిపించినా, ఆ తరువాత మొఘల్ కాలంలో (ఔరంగజేబ్ వరకూ) సద్భావనే వెల్లివిరిసింది. బిటిష్ కాలంలోకూడా మతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ ప్రయోజనాలను బేరీజు చెయ్యలేదు. కానీ కాలక్రమంలో ముస్లింలీగ్ ఒకవైపు హిందూమహాసభ మరోవైపు (ఆ తరువాత ఆర్.ఎస్.ఎస్- సంఘ్ పరివార్) మతవాదానికి పెద్దస్థాయిలో తెరతీసారు. దేశవిభజన ఆ తరువాత పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలు మతపరమైన అపనమ్మకాన్ని ఒక రాజకీయ వాదాలరూపంలో, హిందుత్వవాదం పేరుతో బీజేపీ ఇప్పటికీ సజీవంగా నిలుపుతోంది. అందుకే మతవాదానికీ మతానికీ ఆధారం మతమే అయినా, రెంటికీగల తేడా గుర్తించడం అవసరం. కొందరి రాజకీయ ఉద్దేశాలకూ మతాన్ని నమ్మి జీవించే సామాన్యప్రజలకూ గల భావవైరుధ్యాన్ని తెలుసుకోవడం అవసరం.


మతోన్మాదం: తమ మతం తప్ప మిగతామతాలు అనర్హమైనవిగా భావించడం. తాము ఉత్తమమైనదిగా భావించే తమ మతస్థాపనలో భాగంగా ఇతర మతాల ప్రజలను హింసకు గురిచెయ్యడం, ప్రాణాలు హరించడం మతం ఇలా చెయ్యమని ఎక్కడా చెప్పదు. మతవాదం బలంగా వ్యాపించినప్పుడు ఆ మతాలకు చెందిన కొందరు ఈ ఉన్మాదస్థితిలోకి చేరే ఆవకాశం ఉంటుంది. ఈ ఉన్మాదానికి రాజకీయ, ఆర్థిక శక్తులు/ఆశయాలు తోడైతే ఉగ్రవాదంరూపంలో బయటపడుతుంది. వీరికి మతంతోకానీ, మతాన్ని అనుసరించే ప్రజలతోగానీ సంబంధం ఉండదు. ఒకస్థాయిలో వీరు పిచ్చివాడి చేతిలో రాయిలాంటివాళ్ళు. మరొకస్థాయిలో స్వయానా ఉన్మాదస్థితిలో ఉన్నవాళ్ళు. మతవాదుల చేతుల్లో బలమైన ఆయుధాల్లాంటివాళ్ళు. హిందుమతాన్ని పరిరక్షించడానికి. మాలెగావ్ లో బాంబులు పేల్చినా పాకిస్తాన్ ప్రోద్బలంతో ముంబైలో మారణహోమం చేసినా అది మతోన్మాదమేతప్ప మరొకటికాదు. ఈ మతోన్మాదాన్ని మతవాదంతో ముడిపెట్టి తమ రాజకీయపబ్బాలు గడుపుకునే నాయకత్వం వలన ఈ ధోరణి పెరుగుతుందేతప్ప అదొక ప్రత్యామ్నాయం అవుతుందని అనుకోవడం మన తెలియనితనమేతప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆ రెండూ ఒకదానిమీద ఒకటి తమ అస్థిత్వాన్ని నిలుపుకునే విధానాలు.

ఈ తేడాలను గుర్తించకుండా కేవలం భావోద్వేగాలతో ప్రస్తుత పరిస్థితికి సమాధానం వెతకాలనుకుంటే మనకు మిగిలేది ద్వేషం, కసి, కోపమేతప్ప శాంతీయుతంగా జీవించడానికి మనం ఆశిస్తున్న మార్పుకాదు. ఈ విషయం గమనించి స్పందించడం చాలా అవసరం.


****

Saturday, November 29, 2008

దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !


ఏభావజాలాన్ని నమ్మినా, టెర్రరిజం యొక్క ముఖ్య ఉద్దేశం భీభత్సాన్ని సృష్టించి ప్రజల్లో భాయాందోళనల్ని కలిగించడం. వ్యవస్థమీద సామాన్యులకు అపనమ్మకాన్ని కలిగించటం.జీవితాల్లో దిగులు నింపి అసురక్షిత భావాన్ని కలిగించడం. ముంబై మారణహోమం నేపధ్యంలో వస్తున్న తెలుగు బ్లాగుల స్పందనల్ని చూస్తుంటే, తీవ్రవాదులు తమ ఉద్దేశంలో సఫలమైనట్లుగా అనిపిస్తోంది. ఆధునిక టెర్రరిజం యుద్ధం కాదు. అదొక ఉన్మాదం. ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రణాళికకన్నా, ఆత్మస్థైర్యం ముఖ్యం. అదే మనకిప్పుడుకావాలి. ముంబై పోలీసులూ, NSG కమేండోలూ అదే నిరూపించారు. మనకు దారి చూపించారు. టెర్రరిస్టులని చంపడంతోపాటూ వారి మూల ఉద్దేశాలను నిర్విర్యం చేసినప్పుడే గెలుపు మనవైపు నిలుస్తుంది.


ఇలాంటి పరిస్థితుల్లో మనం సురక్షితంగా ఉన్నామా? అనే ప్రశ్న ఉదయించడం సహజం. కానీ, ఆ అపనమ్మకం కలిగిందంటే తీవ్రవాదుల ఉద్దేశం సాకారమైనట్లే. ఒకవైపు వ్యవస్థవైఫల్యాలు తేటతెల్లంగా కనబడుతుంటే భయపడకుండా, దుగులుపడకుండా ఉండలేము. కానీ, మనలోని భయాన్ని మార్పుని ఆశించే ఆలోచనగా, మనలోని దిగులుని మార్పుకోసం పోరాడే నిర్ధిష్టమైన కోపంగా మార్చుకోవడం ఎంతో అవసరం. ఆ ఆలోచననీ, నిర్ధిష్టమైన కోపాన్నీ channelize చెయ్యడానికి తగిన ప్రాతిపదికని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిద్దాము.


ముంబై మారణహోమంలో మరణించిన సామాన్యులకూ, పోరాడుతూ ప్రాణాలు విడిచిన పోలీసులూ, కమెండోలకూ అశృనివాళి.


****

Wednesday, November 26, 2008

నాకు దేవుడు కావాలి

‘దేవుడున్నాడా? లేడా?’ అనే ప్రశ్నలు చర్చిస్తే తెలేవీకాదు. ఒకరు నిర్ణయిస్తే ఆమోదించేవీ కావు. ప్రతిపాదిస్తే అంగీకరించేవీ కావు. అందుకని, అలాంటి చర్చలకన్నా ‘దేవుడు కావాలా? వద్దా?’అనడం సరైన పద్దతనుకుంటాను. వ్యవస్థీకృత మతానికీనాకూ చుక్కెదురైనా, దేవుడుంటే బాగుంటుందనిపిస్తుంది. నేనేదో ఆధ్యాత్మిక ధోరణిలోపడ్డానని అనుకోకండి. ఇక్కడా నాది తార్కికమైన స్వార్థమే!


మానవపరిణామ సిద్ధాంతం ప్రకటించినట్లు ఈజీవరాసులన్నీ "అలాఅలా" వృద్ధిచెందెయ్యకుండా, దేవుడు ఈ జగాన్ని సృష్టించివుంటే ఖచ్చితంగా ఒక ఉదాత్తమైన గమ్య ఒకటి జీవితాలకు ఏర్పడేది. అలాకాకుండా, డార్విన్ ను నమ్ముకున్నామనుకోండి. మనకు మిగిలేదల్లా అర్థరహితమైన, గమ్యహీనమైన కొండొకొచో అతలాకుతలమైన జీవితాలు. ఎందుకంటే, ఆ సిద్ధాంతం ప్రకారం జీవరాశులు వివిధ దశల్లో natural selection, survival of the fittest అంటూ ఏర్పడిపోయాయేతప్ప వాటికి higher purpose అనేవి లేవు. అలాంటప్పుడు మనుషులతోసహా ఈ జీవరాశులకు అలౌకికమైన గమ్యాలూ, ఉదాత్తమైన ఆలోచనలు అనవసరం. ఏదో పుట్టామా,బ్రతికామా, చచ్చామా అనేతప్ప మిగతావిషయాలు అనవసరం. కానీ, అలా వుంటే ఏమైనా బాగుంటుందా???


అందుకే, ఒక ఉదాత్తమైన ప్రయోజనం గమ్యం ఈ మానవజన్మకు కావాలి. జీవించడానికి ఒక అర్థవంతమైన కారణం కావాలి. కేవలం అవసరాలూ కోరికలూ తీర్చుకుంటూ బ్రతికేకన్నా,కొంత స్వార్థరహితంగా మరికొంత త్యాగమయంగా వుంటేనే జీవితం ఆసక్తికరంగా వుంటుంది. ‘ఇవన్నీ ఒక అలౌకికప్రయోజనం లేకుండా సాధ్యమా !’ అంటే, "కష్టమే" అని చెప్పుకోవచ్చు. నిస్వార్థంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం. ఒకరినొకరు కాంక్షించుకోవడం. ఒకరికొకరు సాంత్వన చేకూర్చుకోవడం. ఇటువంటి భావాలకు జగత్ సంబంధిత (cosmic) ప్రయోజనం లేకుంటే, కేవలం లాభనష్టాలు బేరీజు చేసుకుని స్వార్థంకోసం అమలు జరిపేస్తాం. అందులో ఏమైనా తృప్తి వుంటుందా???


అందుకే మానవచైతన్యానికి ఒక అద్వితీయమైన అలౌకికప్రయోజనం కావాలి. అర్థరాహిత్యానికీ, అర్థంకాని ప్రయోజనానికీ మధ్య నన్ను ఎంచుకోమంటే ఖచ్చితంగా అర్థంకాని(అలౌకిక) ప్రయోజనాన్నే ఎంచుకుంటాను. అందుకే నాకు దేవుడు కావాలి. కాకపోతే ఆధునిక పోకడలైన సైన్సూ, లౌకికకవాదం,వ్యక్తివాదం ఎవ్వరూ ప్రశ్నించలేని ఆ ఉదాత్త జగత్ ప్రయోజనాన్ని పక్కనబెట్టి మతాలూ,పూజారులూ, నిబంధనలూ, సాంప్రదాయాలూ దేవుడ్ని ప్రశ్నార్థకం చేసేసాయి.


ఈ సందర్భంలో మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆయన ప్రకారం "God is nothing but a center out side your own center. You need Him/Her some times."


****

Tuesday, November 25, 2008

సాపేక్షసిద్ధాంతం - మానవసంబంధాలు


మానవసంబంధాల చర్చవచ్చినప్పుడలా 'ఆల్బర్ట్ అయిన్ స్టీన్' సాపేక్షసిద్ధాంతం (theory of relativity) గురించి ప్రస్తావిస్తుంటే కొందరు, "అదొక భౌతికశాస్త్ర సిద్ధాంతంకదా! దాన్ని మానవసంబంధాలలోకి ఎలా అన్వయిస్తున్నారు?" అని పదేపదే అడిగారు. ఇది చాలా సాధారణ విషయంకదా, దాదాపు అందరికీ తెలిసేవుంటుందనే నమ్మకంతో ఆ ప్రశ్నని పక్కనపెట్టాను. కానీ, ఈ రోజు మా ఆఫీసులో subjectivity - objectivity చర్చలోకొచ్చే సరికీ మళ్ళీ ఈ సాపేక్షసిద్ధాంతం నా మెదడ్లో మ్రోగింది. ఎలాగూ ఆలోచించేసానుగనక, ఒక టపా రాసే బాగుంటుందనిపించి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాను.


1905 లో స్పేషియల్ (special) ధియరీ ఆఫ్ రిలేటివిటీ ఆతర్వాత 1915లో జనరల్ ధియరీ ఆఫ్ రిలేటివిటీని అయిన్ స్టీన్ ప్రతిపాదించాడు. అప్పటివరకూ సమయం (Time), స్థలం (space) స్థిరం అనే నమ్మకంతోవున్న ప్రపంచం, ఈ ప్రతిపాదనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాస్త over simplification చేసి చెబితే, "ఒక వస్తువుకు కాంతివేగంతోవున్న సంబంధాన్నిబట్టి 'స్థలం' మరియూ 'సమయాల్లో' మార్పువస్తుంది" (time and space are capable of being altered according to the nature of one's trajectory in relationship to the speed of light) అన్నమాట. ఈవిధంగా చెబితే సగంమందికి అర్థంకాదుగనక, అయనే ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. "ప్రేమికురాలితో కూర్చునిగడిపిన ఒక గంట నిమిషంగానూ, బస్సుకోసం ఎదురుచూస్తూ గడిపిన ఒక నిమిషం ఒక గంటగానూ అనిపిస్తాయి. అదే సాపేక్షసిద్ధాంతం" అని.


ఈ విధంగా మానవసంబంధాలకు సాపేక్ష సిద్ధాంతాన్ని ఈ మహానుభావుడే లింకెట్టేసాడు. కాకపోతే, ఈ ఆలోచనాధోరణిని ఆధారం చేసుకుని 'ఫాన్స్ బావోజ్' అనే ఒక సామాజికశాస్త్రవేత్త 'సాంస్కృతిక సాపేక్షసిద్ధాంతానికి' (cultural relativism) తెరతీసాడు. దీని ఆధారంగా అప్పటివరకూ డార్విన్ ప్రతిపాదించిన ఏకమూససామాజిక ఎదుగుదల (savagery- barbarism-civilization) సిద్ధాంతాలని అద్యంతం అన్వయించుకుంటున్న సమాజనిర్మాణశాస్త్రవేత్తలు (anthropologists), ప్రతి సమాజాన్నీ ప్రత్యేకమూసగా పరిగణించి దాని మూలాలఅధారంగా అర్థం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే, ఒక absolute విలువ అధారంగా సమాజాన్ని అర్థం చేసుకునే పోకడలుపోయి ఒక పదార్థాన్ని, సమాజాన్ని,వ్యక్తినీ, పరిస్థితినీ దాని ఉనికి,స్థితి ఆధారంగామాత్రమే అర్థం చేసుకునే సాపేక్షత (relativity) అలవడిందన్నమాట. ఈ సైద్ధాంతిక మూలాల ఆధారంగానే వ్యక్తివాదం, అస్థిత్వవాదం వంటి భావజాలాలు మానవసంబంధాలను ముఖ్యంగా స్త్రీపురుషుల సంబంధాలని నిర్వచించడం మొదలయ్యింది.


అక్కడే మానవసంబంధాలలో సాపేక్షసిద్ధాంతం యొక్క ఉనికి బలపడింది. ఇక్కడే సాంప్రదాయాలూ,మతం,సామాజిక కట్టుబాట్లు వంటి absolutism,fundamentalism పోకడలకు చుక్కెదురయ్యింది.


****

Sunday, November 23, 2008

ఏదిపాపం?

ఆధునిక నవలాకారుల్లో (చిట్టిబాబు,బుచ్చిబాబు, కుటుంబరావు గారితోపాటూ) నాకునచ్చిన మరో నవలాకారుడు ‘చివుకుల పురుషోత్తం’. బహుశా రావలసిన గుర్తింపుకూడారాని నవలాకారుడుకూడా ఈయనేనేమో!


మొదటి నవల "ఏదిపాపం?"తోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్యాఅకాడమీ బహుమతి పొందినా, ఇప్పటికీ చాలా మంది పాఠకులకు ఈ పేరు (సు)పరిచితం కాదు. నేను మా కాలేజి లైబ్రరీ పుణ్యమా అని చివుకుల పురుషోత్తం గారి నవలలు చదివాను. కానీ, ముద్రణలో లేని కారణంగా ఆ తరువాత ఎక్కడ ప్రయత్నించినా ఈ రచయిత నవలలు దొరకలేదు. ఈ మధ్య విజయవాడలోని పాతపుస్తకాల షాపుల్లో వెదుకుతుంటే, "ఏదిపాపం?", "మేలుకొలుపు" అనే రెండు నవలలు మాత్రం దొరికాయి.


‘ఏదిపాపం?’ నవలలోని కొన్ని పేరాలను ఇక్కడ రాస్తున్నాను. ఎవరిదగ్గరైనా చివుకుల పురుషోత్తం గారి మిగతానవలలుంటే తెలుపవలసిందిగా కోరుతున్నాను.


వనజ: "మగవారికి మా ఆడవారి ధృష్ట్యా కొన్ని మూర్ఖపు నమ్మకాలుంటాయి. నన్ను ఇరవైమూడేళ్ళ వయసుదానిని పెళ్ళిచేసుకున్నాడు విశ్వనాధం. కానీ, ఆయన అభిప్రాయం ప్రకారం నేను అప్పటిదాకా మనస్సును శూన్యంగా అట్టిపెట్టుకుని, ఆ మహాపురుషునితో వివాహం కాగానే ఆయనను మనస్సులో పెట్టుకుని పూజించుకొంటున్నాననుకుంటాడు. ఇపుడు మీ వెంటవచ్చాను కాబట్టి తప్పంతా మీదేననుకుంటాడు. మీ మగజాతి సంగతంతా ఇంతే! ఆడదాని గురించి అనాదిగా మూర్ఖంగా కొన్ని అసందర్భపు భావాలను ఏర్పరచుకున్నారు. వాటినీ మాపైరుద్దారు. మాలోఅందరూ ఆ మీ అభిప్రాయాల ప్రకారం నడుచుకున్నట్లు నటిస్తాం. కానీ, ఒక్కోసారి సహజంగా ప్రవర్తిస్తాము. ఆ సహజప్రవర్తన మీ అభిప్రాయాలకు భిన్నంగా వుంటుంది గనక మీరు ఆడదాన్నర్థం చేసుకోవడం కష్టం అనుకుంటూంటారు.

ఎమోషనల్ గా స్త్రీపురుషులు సమానులే. మీ బుర్రల్లో ఏం మెదులుతుందో మా బుర్రల్లోనూ అంతే. వివాహమంటే అండదే పవిత్రంగా చూసుకోవాలి -పాతివ్రత్యం ఆడదానిధర్మం - అనేవి కల్లబొల్లి కబుర్లు. అంతరగతంగా ప్రతి ఆడదానికీ తెలుసు - ఇలాంటి కబుర్లు చెబుతుంటేనే మగవాడు సంతోషిస్తాడని. మాకు ఆర్థికస్వాతంత్ర్యం లేదుకదా? పిల్లలు అనే బంధాలు మమ్మల్నే ఎక్కువగా బాధిస్తాయికదా? అందుకే పడివుంటాము అబద్దాలు చెప్పుకుంటూ - అసహజమూ, అసత్యమూ అయి. "


నారాయణ: "అసలు స్త్రీకి పవిత్రత అనే విచిత్ర భావనలు ఈ కాలంలోనే విపరీతంగా, అర్థరహితంగా,శాస్త్రభిన్నంగా ఉన్నాయి. పరపురుషుడి వేలు తగిలితేనే కుక్క ముట్టినకుండ అంటారు. అంటే పగలగొట్టెయ్యొచ్చన్నమాట. కానీ మనపూర్వులు ధర్మశాస్త్రంలో అలా అనలేదు. కొన్ని స్మృతులను చూస్తుంటే ఈనాటికీ చాలా అడ్వాన్సుడ్ గా కనబడుతాయి. స్త్రీకి వ్యభిచారం అనేది ఓ పెద్దతప్పుగా చెప్పలేదు. ఆనేరానికి ప్రాయశ్చిత్తంకూడా సింపుల్గా చెప్పారు. స్త్రీకి వ్యభిచార దోషం ఒక రజోదర్శనం నుండీ మరో రజోదర్శనం వరకే అంటే ఒక బహిష్టు నుండీ మరో బహిష్టువరకూ అని. ఆ తరువాత ఆటోమేటిగ్గా ఆ పాపం పోతుంది. ఇంకా ఉల్లిపాయలు, మాంసాహారం తిన్న నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణునికే ప్రాయశ్చిత్తం చాలా ఎలాబరేట్ గా చెప్పారు."

"...మన శాస్త్రాలు కాన్స్టిట్యూషన్స్ లాంటివి. వాటికి అమెండ్మెంట్స్ ఇచ్చుకోమనికూడా శాస్త్రాలలొ నిర్దేశించారు. ధర్మశాస్త్రాల్లో సాంఖ్యాకంగా చెప్పి వీటిలో వేటినైనా మార్చుకోమన్నారు. అయితే ఆ మార్పు పెద్దలచెత చేయించమన్నారు. రాగద్వేషాలకు అతీతుడై, వయసుపండి ఆత్మదర్శనం చేసిన వ్యక్తిమస్తిష్కానికి తోచిన దానికంటే మించిన ధర్మం లేదు పొమ్మన్నారు. అట్టిధర్మం ఎలాంటిదయినా, అంతవరకూవున్న ధర్మశాస్త్రాలకు భిన్నంగా ఉంటే పాతధర్మాన్ని తుంగలో తొక్కమన్నారు...."


****

Tuesday, November 18, 2008

కొత్త బిచ్చగాడు

కొత్తగా ఏదైనా నేర్చుకుంటే దాన్నే సమయం సందర్భం లేకుండా చేస్తూ, కనపడినవాడికి తమ కొత్త విద్యలోని నైపుణ్యాన్ని గురించీ, కొత్తగా నేర్చుకున్న విషయవిజ్ఞానాన్ని గురించీ చెప్పిచెప్పీ విసిగించి వేసారిపోయేలా చెయ్యడం మనం సాధారణంగా చేసేపని. అప్పుడే "కొత్తబిక్షగాడు పొద్దెరగడు" అని వ్యవహరించేస్తూ ఉంటారు.


విశాల్ భరద్వాజ్ హిందీ సినిమా 'మఖ్బూల్'లో ఇలాంటిదే ఒక మతానికి సంబంధించిన సామెత చెబుతాడు. "నయా ముసల్మాన్ హై, పాంచ్ బార్ నమాజ్ తో పఢేగా హీ" అని. అంటే, 'కొత్తముస్లిం కదా, ప్రస్తుతానికి ఐదుసార్లు నమాజ్ ఖచ్చితంగా చదువుతాడ్లే!' అని అర్థం. ఈ విధంగా, కొత్తగా మతంపుచ్చుకున్నవాళ్ళలో ఈ ధోరణివుండటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మాటిమాటికీ మతపరమైన references వాళ్ళమాటల్లో కనిపించేది అందుకే.


కొత్తగా మతంపుచ్చుకున్న ఒక క్రైస్తవ మిత్రుడి వింతధోరణి గురించి వాసిలి సురేష్ తన బ్లాగు 'తెలుగు నేస్తమాలో' రాసినటపా చదివేసరికీ, మా కాలేజిలో జరిగిన మతచర్చలు గుర్తొచ్చాయి. నేను చదివింది ఇంగ్లీషు సాహిత్యం, అందులో ఆధునిక సాహిత్యంలోని సింహభాగం చర్చ్ (Church) వ్యతిరేక సాహిత్యం గనక, మా చర్చల్లో మతం తరచూ receiving endలో ఉండేది. బైబిల్ గ్రంధాన్ని గురించికూడా ఆంగ్లసాహిత్య చరిత్రలో భాగంగా చదువుకున్న మాకు ఈ వింతపోకడల్ని సాధికారంగా ఖండించే అవకాశం ఉండటంతో, క్లాసులోవున్న క్రైస్తవ మిత్రులు తమ నిరసనని బాహాటంగా చెప్పేవారు కాదు. కానీ, క్లాసు ముగిసిన తరువాత కాస్త informal గా జరిగే మాటల్లో "మతాన్ని గురించి అలామాట్లాడితే ఎలా?" అనేవాళ్ళు.


ఈ సంవాదాల్లో జరిగేచర్చల్లో ముఖ్యంగా వచ్చే విషయాలు "మనమంతా పాపులం" అనే నమ్మకం. ఇతర మతాల దేవుళ్ళపటాలు,ప్రసాదాలూ తాకకూడదు. సినిమాలు చూడకూడదు,సినిమా సంగీతం వినకూడదు లాంటివి. మొదటి నమ్మకానికి కనీసం బైబిల్ లో కొంత ప్రాదిపదిక వున్నా, మిగతా రెండిటీకీ క్రైస్తవమతానికీ సుదూరంలోకూడా సంబంధం లేదు. కానీ,దినదిన వ్యవహారాలలో ఇలాంటివి మాటిమాటికీ ఎదురై, ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తేవి. అందుకే తెగని చర్చలకు మూలమయ్యేవి.


మా ఫ్రొఫెసర్ ఒకాయన సరదాగా "పాపిగళూ బన్ని అంతా బోర్డ్ హాకి కరితారప్పా! నీవు హోగబేడ. నీ పాపియేనో?" అని కన్నడలో ప్రశ్నించేవాడు. అంటే, "పాపులారా రండి అని బోర్డుపెట్టుకుని మరీపిలుస్తారయ్యా! నువ్వెళ్ళకు. నువ్వు పాపివి కావుకదా?" అనర్థం. క్రైస్తవమతంలో original sin అనే ఒక భావన ఉంది.ఆడమ్- ఈవ్ భగవంతుడు నిషేధించిన (జ్ఞానఫలం)పండు (forbidden fruit) తినడం వలన దేవుడు సృష్టించిన పవిత్రలోకానికి దూరమయ్యారని. కాబట్టి, ఆడమ్-ఈవ్ సంతానమైన అందరిమనుషులూ పుట్టుకతో ఆ పాపాన్ని పంచుకుని పుడతారని ఒక నమ్మకం. ఆ పాపం నుంచీ పరిహారం పొందడానికి దేవుడిదారి ఎంచుకోవాలనే ఆధారంతో ఈ నమ్మకాన్ని మతవ్యాప్తికి బాగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం మీద క్రైస్తవుల్లోని వివిధ శాఖల్లోకూడా బహు విభేధాలున్నాయి.


మా కాలేజి చర్చల్లో తేలిన conclusion ఏమిటంటే,‘if eating the fruit of knowledge is a sin, it's good that the sin happened’ అని. జ్ఞానఫలం తినకుండా ఉంటే, మనిషి మనషిగా ఉండేవాడుకాదు కదా! అందుకే, ఆ "పాపం" జరగడం మంచిదనే నిర్ణయానికొచ్చేవాళ్ళం. ఆపని చెయ్యకుండా ఉంటే మనుషజాతికూడా అనభూతులులేని కూరగాయలో,జంతువులలాగానో ఉండేవాళ్ళంకదా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ పాపం, పాపమెలా అవుతుంది అనేది ప్రశ్నార్థకమే! అంతేకాకుండా, మతానికి ‘గిల్ట్’ (అపరాధభావన) ప్రాతిపదికైతే,దాంట్లో ఎస్కేపిజమే తప్ప జీవనమూల్యాల సాధన సాధ్యమా అనేది తరచూ ఉద్భచే సందేహం.


ఇక ఇతరమతాల దేవుళ్ళపటాలనూ,ప్రసాదాన్నీ తాకకూడదు అనేది కేవలం అపోహేతప్ప బైబిల్ ను ప్రాతిపదికగా చేసుకున్న నమ్మకమైతే అస్సలు కాదు. చారిత్రకంగా రోమన్ సారాజ్యానికి వ్యతిరేకంగా ఒక reactionary మతంగా క్రైస్తవమతం ఉధ్బవించినా, (ఆ తరువాత కాలంలో రాజకీయ ఉద్దేశాలతో ప్రారంభమైన క్రుసేడర్ సమయం మినహా) చాలావరకూ శాంతీ, ప్రేమలను ఆధారం చేసుకుని వ్యాప్తి చెందింది. అందుకే, ఇస్లాం మతంలో కనిపించే పరమతంపట్ల వ్యతిరేకత ( పేగన్లకు వ్యతిరేకంగా ఇస్లాంలో చాలా విధివిధానాలున్నాయి) కనబరిచే అవకాశం లేదు. అదీ ముఖ్యంగా "ఒక అంగీకారాత్మక ప్రాతిపదికన రాయబడిన" కొత్తనిబంధన గ్రంధం ఆవిధంగా ప్రవచించే అవకాశమే లేదు.


ఇక కొత్తక్రైస్తవుల సినిమా ప్రహసనం గురించి నా ఇదివరకటి టపాలో చెప్పాను చూడండి.


అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుంది. హిందుమతంలోని అపోహలకు చాలా కారణాలుండొచ్చు. కారణం ఇక్కడ ఏక గ్రంధం,ఏక ప్రవక్త, ఏక దేవుడు లేడు. కానీ, క్రైస్తవం బైబిల్ కు కట్టుబడింది కాబట్టి (పేరే కొత్తనిబంధన గ్రంధం కదా!), నియో- క్రైస్తవులు కనీసం బైబిల్ ని పుర్తిగా చదువుకోవాలేమో!


****

Monday, November 17, 2008

నువ్వు ఆడపిల్లవి

కొన్ని సంవత్సరాలుగా తస్లీమా సస్రీన్ 'లజ్జా' (Shame) పుస్తకం కంటిముందు కనబడుతూవున్నా, ఇంతవరకూ చదవలేదు. కానీ ఇప్పుడే ఆ నవల ఆంగ్లానువాదంనుంచీ కొన్ని వాక్యాలు చదవటం జరిగింది. వాటిని తెలుగులో అనువదించి ఇక్కడ అందిస్తున్నాను.

నువ్వు ఆడపిల్లవి
ఆ విషయం నువ్వు మర్చిపోకు
గడపదాటావా, మగాళ్ళు నిన్ను అనుమానంగా చూస్తారు



నువ్వు వీధిలోకి వస్తే
మగాళ్ళు నిన్ను వెంటాడతారు, వేధిస్తారు
వీధిదాటి రోడ్డుమీదకొచ్చావో...
నిన్ను నిందిస్తారు,నిన్ను కళంకిని అంటారు

నువ్వు నిజంగా పవిత్రురాలివైతే
వెనుదిరిగి చూడవు
తలొంచుకు వెళ్తావు
ఇప్పుడెలా వెళ్తావో, అప్పుడూ అలాగే ఉంటావు.

- తస్లీమా సస్రీన్

ఈ వాక్యాలు చదివిన తరువాత ఆడపిల్లలపై ఆంక్షల విషయంలోభారతీయ పరిస్థితికీ బాంగ్లాదేశ్ పరిస్థితికీ పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఈ పుస్తకం ఆంగ్లంలో తెలుగులోకూడా విరివిగా లభ్యమవుతుంది. ఈ వాక్యాలు చూసిన తరువాతనే నేనూ పూర్తి నవలను చదవాలని నిర్ణయించుకున్నాను. వీలైతే మీరూ చదవండి.


****

Sunday, November 16, 2008

కులాల కురుక్షేత్రం

చెన్నై లోని అంబేద్కర్ లా కాలేజిలో జరుగుతున్న సం‘కుల’సమరం నేపధ్యంలో మళ్ళీ కులచర్చలు వీధుల్లోకొచ్చాయి.దళితుల్లో సామాజిక స్పృహ పెరిగినకొద్దీ కులఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నది ఎవరూ కాదనలేని సత్యం . అగ్రకులాలుదీన్ని, ‘అతిగా స్పందించడం’ అంటుంటే, దళితులు ‘వారి ఎదుగుదలకి ఓర్వలేని అగ్రకులాల దాష్టీకానికి వ్యతిరేకంగా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి’ అంటున్నారు. రెండుధృక్పధాలూ పాక్షికంగా సరైనవే, కానీ తమిళనాడు చారిత్రక నిజాల వెలుగులో చూస్తే ఈ generalization అంత సులభం కాదనిపిస్తుంది.


తమిళజాతీయవాద స్ఫూర్తితో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ/తమిళ ఉద్యమం అగ్రకుల ఆధిపత్యానికి సవాలుగా జరిగినా, బ్రాహ్మణేతర కులాలు దళిత అజెండాని ఈ పోరాటంలో భాగం చెయ్యక దళిత ఉనికిని మరుగుపరిచారని దళితమేధావుల వాదన. దీంతో సామాజిక, ఆర్థిక,రాజకీయ పరంగా దళితులు వెనక్కునెట్టబడి, ఇప్పటికీ (కనీస) మానవహక్కులకోసం నిత్యజీవన పోరాడటం సాగిస్తున్నారు.తమిళ అస్థిత్వసాధనలో, హిందీ hegemony కి వ్యతిరేకంగా తమిళసంస్కృతి పునర్జీవనం జరిగినా, అందులోనూ దళితులకు సముచిత స్థానం లభించలేదు. గుళ్ళో ప్రవేశం, పూజల్లో వివక్ష, మతంలో సముచిత స్థానం ఇంతవరకూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికీ జీవించడంలోనే కాక చావులోకూడా ఈ వివక్ష కొనసాగటం ఈ వివక్షవిస్తృతత్వానికి అద్దం పడుతుంది.


ఇదే నియో-అగ్రకులభావజాలం ఒకవైపు రాజకీయ వ్యవస్థలో ప్రతిఫలిస్తే, మరోవైపు అధికారవ్యవస్థ నిర్మాణానికి ఇదే మూలంకావడంతో పరిస్థితి విషమించింది. ఒకవైపు సమాజం, మరో వైపు ప్రభుత దళితవ్యతిరేక భావజాలానికి ఆధిపత్యం వహిస్తే, ఒకమూలకు త్రోయబడ్డ దళితులు ప్రతిఘటించడంతప్ప మరేమీ చెయ్యలేని నిస్సహాయులయ్యారు. ఈ నిస్సహాయతలోని ఉక్రోషం ఒకవైపు అడుగడుగునా తక్కువచెస్తున్న అగ్రకులాలపై కోపం మరోవైపు, ఇవన్నీ చూస్తూకూడా నిమ్మకునీరెత్తినట్లుండే ప్రభుత్వం,రాజకీయవ్యవస్థపై తిరుగుబాటు ధోరణి ఒకవైపూ ఏకమై ఈ ఘర్షణలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం జరిగిన ఘటనకు మూలం కాలేజి పేరులోని ‘అంబేద్కర్’ పేరుతొలగించి దేవర్ కులస్థులు ఒక కరపత్రాన్ని పంచడం. దళిత ఆత్మగౌరవానికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుకీ విడదీయరాని సంబంధం ఉందని తెలిసీ ఈ పని చెయ్యడం దేవర్ కులస్థుల అహంకారానికి ప్రతీకైతే, హింసకుపూనుకోవడం పల్లవర్ కులస్తుల పోరాటస్ఫూర్తిలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఈ రెండు సామాజిక పార్శ్వాలకూ వారికారణాలు వారికుంటే, ఉద్రిక్త పరిస్థితి తెలిసీ ముందస్తుజాగ్రత్తలు తీసుకోని కాలేజీ యాజమాన్యం(ప్రిన్సిపాల్), ఘర్షణ సమయంలో అక్కడుండీ చోద్యం చూసిన పోలీసుల పాత్రమాత్రం సిగ్గుపడేలాగా ఉంది. ఇలాంటి ఘర్షణలకు ఊతమచ్చి తమ రాజకీయ పబ్బంగడుపుకునే రాజకీయ పార్టీల తీరు అత్యంతహేయం.

ఈ పరిస్థితుల చారిత్రక నేపధ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.

DALITS IN DRAVIDIAN LAND — Frontline Reports on Anti-Dalit Violence in Tamil Nadu 1995-2004: S. Viswanathan; Pub. by Navayana Publishing, I Floor, 12/293, Ahmed Complex, Royapettah High Road, Chennai-600014. Rs. 300.


****

Saturday, November 15, 2008

పోహా - జిలేబి

పోహా- జిలేబి...ఇదేంటా! అని ఆలోచిస్తున్నారా?!?


మధ్యప్రదేశ్ రాష్త్రంలో ‘మాల్వా’(Malwa) అనే ప్రాంతం వుంది. ఇండోర్ (Indore) నగరానికి చుట్టుపక్కలున్న ప్రదేశానంతా మాల్వాగా వ్యవహరిస్తారు. కొంత రాజస్థాన్, గుజరాత్ లోని ప్రాంతాలనుకూడా చారిత్రకంగా మాల్వా ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. మనం చిన్నప్పుడు చందమామ కథల్లొ చదివిన మాళవదేశం ఇదేనట. అదేంటో...ఆ కథల్లో ఎప్పుడూ మాళవదేశం రాకుమారుడూ, వంగదేశపు రాకుమారీ మాత్రమే ఉండేవారు!!


ఆ సంగతి పక్కనబెడితే, ఈ ప్రాంతంవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఫలహారం - బ్రేక్ ఫాస్ట్ "పోహా- జిలేబి". జిలేబి సంగతి అందరికీ తెలిసిందేకాబట్టి, విశదంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ ‘పోహా’ కూసింత కొత్తపదంగనక చెప్పుకోవాల్సిందే. మనం అటుకులంటామే..ఫ్లాట్ రైస్ దాన్ని లెమన్ రైస్ తరహాలో పోపుబెట్టి, నిమ్మకాయపిండితే అదే పోహా. ఈ పులిహోరలాంటి పోహాకీ, చెక్కెరపాకం కారే జిలేబీజీ చనువెప్పుడు కుదిరిందో, మనువెప్పుడు జరిగిందో తెలీదుగానీ, ఈ ప్రాంతం మొత్తం ఇదే తరహా. పొద్దునైతే చాలు రొడ్డుపక్కన చిన్నచిన్నబళ్ళూ, కాకాహోటళ్ళూ ఇదే వడ్డిస్తూ కనిపిస్తాయి. మనుషులు వీటిని మనసారా ఆరగిస్తూనే కనిపిస్తారు.


ఇడ్లీ, వడ,దోసె, ఉప్మా-పెసరట్టు, పొంగల్, పులిహోరకి అలవాటుపడ్డనాకు ఇంట్లో ఏంవండుకున్నా, ఈ పోహా- జిలేబి మాత్రం పాప్యులర్ వంటకం విచిత్రమైన కాంబినేషన్ గానే అనిపించింది. అక్కడున్న మూడు సంవత్సరాలూ, కనపడిన ప్రతి వ్యక్తినీ ఈ పెళ్ళిసంబంధం గురించి ఆరాతీసా. కానీ నిరాశే మిగిలింది. ఇదితప్ప పొద్దున్నే అక్కడ ఇంకేదైనా కావాలంటే దొరికేవి సమోసా, కచోరి. అక్కడక్కడా అప్పుడప్పుడూ పూరి, పరాఠా. ఈ పరాఠా మన ఆంధ్రాతరహా కాదండోయ్! వీళ్ళకి పారాఠా అంటే, ఆలూ,గోబీ,పన్నీర్, పాలక్ (పాలకూర) లాంటి filling కలిపిన stuffed పరాఠా అన్నమాట. దాంట్లోనూ డాల్డాకారేలా కాలిస్తేగానీ వీరికి ముద్దదిగదు.మనలాంటోళ్ళకి గొంతు దిగదు.కాబట్టి safe bet పోహా -జిలేబీనే. పొద్దునే స్వీట్ తినే అలవాటు లేకపోవడం వల్ల, జిలేబీవద్దంటే దుకాణమోడు జూలో జంతువల్లే చూసేవాడు. తెలుగులో అంటామే "గాడిదకేంతెలుసు గంధం వాసన", "అడవికోడి కేందెలుసు వడ్లగింజ రుచి" అని, అలాచూస్తారన్నమాట.


ఇప్పుడు ఈ వంటకం ఒకవైపు గుజరాత్,రాజస్థాన్ లలో మరోవైపు మహరాష్ట్రలోకూడా జాతీయ బ్రేక్ఫాస్ట్ అయ్యిందని విన్నాను. ఈమధ్య హైదరాబాద్ వచ్చినతరువాత, మళ్ళీ బయట ఎన్నిరకాల బ్రేక్ఫాస్టులో....I am loving it. మెక్ డోనాల్డ్స్ నాకుపెద్దగా నచ్చదుగానీ, ఈ ట్యాగ్ లైన మన ఆంద్రాటిఫిన్ హోటళ్ళకూ, కర్ణాటక తరహా దర్శినిలకూ మాత్రం అర్జంటుగా పెట్టేసి సంతోషించెయ్యాలనుంది.


చివరిగా ఒక్కమాట, భోపాలో, ఇందోరో, అహ్మదాబాదో, నాగ్ పూరో వెళితేమాత్రం పోహా-జిలేబి కాంబినేషన్ ప్రయత్నించండే...భలే వుంటుంది "ఆవకాయ్ బిర్యానీ"లాగా.


****

Thursday, November 13, 2008

బాలబాలికల దినోత్సవం

మళ్ళీ బాలల దినోత్సవం వచ్చింది. అందరుపిల్లలూ బడికెళ్ళి, ప్రేమగా చాచా నెహ్రూని తలుచుకుంటారు. చిన్నపిల్లలో ఎవడోఒకడికి నెహ్రూ తరహా శేర్వాణీ తొడిగి, జేబుకు గులాబిగుచ్చి సరదాగా నవ్వుకుంటారు. టీచర్లు చాక్లెట్లో, లడ్డూలో పంచిపెట్టి "ఈ రోజు మీరోజర్రా!" అని ఒక పదినిమిషాలు ఊదరగొట్టేస్తారు. ఆ తరువాత, బాలల దినోత్సవం అయిపోతుంది.


కానీ, పుట్టగానే చనిపోయే కొందరి గురించి. పుట్టినా, కొన్నాళ్ళకే గిట్టే మరికొందరి గురించి. బ్రతికినా, బ్రతికినకొన్నాళ్ళూ ఆకలీ, అనారోగ్యంతో బ్రతికే మరికొందరిగురించి. బడికెళ్ళలేని బడుగు బుడుగుల గురించి కొన్ని నిజాల్ని కూడా తెలుసుకుని, వాళ్ళకోసంకూడా బాలల దినోత్సవం జరుపుకుందాం.

  • ప్రతిసంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ళు నిండకుండానే 9.7 మిలియన్ పిల్లలు చనిపోతే, వారిలో దాదాపు 21% అంటే 2.1 మిలియన్ పిల్లల భారతదేశంలో మరణిస్తారు.
  • ప్రపంచవ్యాప్తంగా ఇలా మరణించేవారిలో, పుట్టిన నెలరొజులకే సంక్రమించే అనారోగ్యాల (neo-natal) కారణంగా 37% చనిపోతే, మనదేశంలో 50% మంది పిల్లలు మరణిస్తారు.
  • నిమోనియా కారణంగా 19%
  • విరోచనాలు (డయేరియా) కారణంగా 17%
  • మలేరియా కారణంగా 8%
  • తట్టు (measles) మరియూ ఇతర గాయాల కారణంగా 4% మరియూ 3%
  • ఎయిడ్స్ కారణంగా 3%
  • ఇతర కారణాలవల్ల మిగతా 10% మరణిస్తారు.
  • ప్రస్తుతం 9.4 మిలియన్ పిల్లలు ప్రాణాంతక వ్యాధుల్ని నివారించే టీకాలు వేయించుకోకుండా ఉన్నారు.
  • దాదాపు 8.3 మిలియన్ పిల్లలు పుట్టుకసమయంలో కనీసం 1.5 కిలోల బరువుకూడా లేకుండా పుడుతున్నారు.
  • ప్రపంచంవ్యాప్తంగా పౌష్టికాహారలేమి కారణంగా బరువుతక్కువగా (underweight) ఉన్న పిల్లల్లో 1/3 వవంతు భారతదేశంలో ఉన్నారు.
  • ప్రతి లక్షజన్మాలకీ 450 నుంచీ 301 మందిపిల్లలు చనిపోతున్నారు (Infant Mortality Rate)
- UNICEF, 2007


మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.


****

Wednesday, November 12, 2008

కాలం చెల్లిన భీష్ములు

మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్రలు కర్ణుడు, భీష్ముడు. ఒకరు విభ్రమకు గురిచేస్తే మరొకరు విభ్రాంతిని అందిస్తారు. కర్ణుడు తన నిబద్ధత నిలబెట్టుకుంటూకూడా , బాహ్యప్రపంచ కారకాలమూలంగా ప్రాణాలు కోల్పోతాడు. కానీ భీష్ముడు, తన వ్యక్తిత్వంలోని లోపాల కారణంగా అసువులుబాస్తాడు. ఈ విధంగాచూస్తే, భీష్ముడు ఒక క్లాసిక్ షేక్స్పీరియన్ పాత్ర తరహా అన్నమాట. సినిమా పరిభాషలో "miscasting" అంటారు. అంటే మోహన్ బాబు పాత్రలో మహేష్ బాబుని పెట్టడంలాంటిదన్నమాట. సత్యయుగం, త్రేతాయుగం నాటి విలువలు కలిగిన భీష్ముడు, ఈ ద్వాపరయుగంలో a complete miscast అనిపిస్తుంది.


భీష్ముడి పాత్రలో వున్న అత్యంత definingలోపం, 'సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం' . మొత్తం మహాభారతంలో కృష్ణుడికి సరితూగగలిగిన శక్తియుక్తులు, బలాబలాలూ,జ్ఞానవిజ్ఞానాలూ సొంతమైనా, భీష్ముడు మహాభారతాన్ని నిర్దేశించడానికి తన ఉనికిని వాడడు. ప్రతిసారీ ఒక ప్రేక్షకుడిగానో లేక తప్పుజరుగుతుంటే దానిలో మూగభాగస్వామిగానో కనిపిస్తాడేగానీ, పరిస్థితుల్ని మార్చగలిగివుండీ నిర్ణయాత్మకంగా అడుగులువేసే ధీరీద్ధాత్తుడిలాగా ఆగుపించడు.కొన్ని సందర్భాలలో కృష్ణుడికీ భీష్ముడికీ మధ్య జెట్ -కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ల మధ్య కుదిరిన ఒప్పందంలాంటి 'డీల్' కుదిరినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ జెట్-కింగ్ ఫిషర్ డీల్ లో optimization of operational costs అయితే, కృష్ణ-భీష్ముల మధ్య ధర్మసంస్థాపనకోసం, ఒకరు వేగవంతమైన మరొకరు మూగవంతమైన భాగస్వాములుగా పాత్రలు పోషించారనిపిస్తుంది. కానీ, ఈ పరిణామక్రమంలో కృష్ణుడు అవతారమైపోతే, భీష్ముడు మాత్రం అపవాదునేమూటగట్టుకున్నాడు.లేకపోతే, భీష్ముడుమాత్రం అవతార హోదాకి అర్హుడుకాదా?


తండ్రి సుఖంకోసం, కాబోయేతల్లి పిల్లలకు అధికారం ఇవ్వడంకోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేసి ఈ గాంగేయుడు భీష్ముడయ్యాడు.పెద్దతమ్ముడు చిత్రాంగదుడు యుద్ధంలో మరణిస్తాడు. భార్యల్నికూడా గెలిచితెచ్చుకోలేని బలహీనుడైన తమ్ముడు విచిత్రవీర్యుడికి అంబాలిక,అంబికలకు కట్టబెట్టి, అంబ జీవితాన్ని అడవులపాలు చేశాడు. తీరా, విచిత్రవీర్యుడు వంశాంకురాన్నివ్వకుండా కన్నుమూస్తే, తన ప్రతిజ్ఞకు మూలకారణమే నశించినాకూడా, పట్టినపట్టువీడని భీష్ముడిది మంకుపట్టు అనిపిస్తుందేతప్ప,మహాప్రతిజ్ఞలాగా అనిపించదు.వంశాన్నుద్ధరించడానికి వ్యాసుడ్ని పట్టితేగలిగినవాడు, తనే ఆపనిచేసుంటే మహాభారతం ఎలావుండేదో! బహుశా అందుకేనేమో రచయిత వ్యాసుడే కల్పించుకుని కాగలకార్యంకాస్తా నెరవేర్చాడు.


ఇక్కడా భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే కాంక్షకనిపిస్తుందేగానీ, నిజంగా అంబాలిక,అంబికల స్త్రీత్వాన్ని గౌరవించినట్లు కనపడదు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాసునితో కూడమని చెప్పడంవలనే, ఒకరికి రక్తహీనుడైన పాండురాజు జన్మిస్తే వేరొకరికి అంధుడైన ధృతరాష్టృడు జన్మించాడు. ఇందులో జరిగిన మంచిఏదైనా ఉంటే,అది concessionగా విదురుడు జన్మించడం. ఇక ఈతరంలోనూ స్త్రీల ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఈ మహానుభావుడికి పట్టింది. కుంతీ,మాద్రుల్ని సంసారసుఖం ఇవ్వలేని పాండురాజుకు కట్టబెడతాడు. గుడ్డివాడైన ధృతరాష్టృడ్ని గాంధారికి కట్టబెట్టాడు. ఒకరికి సుఖంలేదు మరొకరికి శాంతిలేదు. వేరే ప్రత్యామ్న్యాయం ఉండీ, ఇన్ని సంకరాల్ని చేజేతులారా చేసిన భీష్ముడు, ఆ తరువాత జరిగిన దారుణాలకు మూగసాక్షిగా మిగలక, సాధికారంగా ఆపగలిగేవాడా!


భీష్ముడి వ్యక్తిత్వానికి గొడ్డలిపెట్టులాంటి ఘటన, ద్రౌపదీ వస్త్రాపహరణం. ఇంటికోడలిని, ఏకవస్త్రను నిండుకొలువులో వలువలీడ్పించే సమయంలో,ఆపగలిగిన అధికారం బాధ్యత రెండూ వుండికూడా మౌనం వహిస్తాడు. "ఇంతకన్నా, misplaced sense of loyalty మరోటుంటుందా?" అనిపిస్తుంది. ఈ ఘోరావమానం ఎదుర్కొంటున్న ద్రౌపదికూడా, ఆ నిండుకొలువులో "నేను ధర్మ విదితనా, అధర్మవిధితనా?" అని ఒక్కభీష్ముడి నుంచే సహాయాన్ని అర్థిస్తుంది. కానీ దానికి ఇతడి సమాధానం మాత్రం "దర్మం నిఘూడమైనది. నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను" అని. దర్మాధర్మాల సంగతిపక్కనపెట్టినా, ఒక క్షత్రియుడిగా, విజ్ఞుడిగా, కనీసం మనిషిగా బలాత్కారం చెయ్యబడుతున్న ఒక దాసిని రక్షించకూడదా? కానీ ఆపనిచెయ్యలేకపోయాడు. కారణం విధేయత,విశ్వాసపాత్రత. అదీ ఎవరికి, అన్యాయానికి,అక్రమానికి. ఇంతటి మూర్ఖపు విధేయత అవసరమా అనిపిస్తుంది.బలహీనుల్ని రక్షించాల్సిన క్షాత్రధర్మాన్ని విస్మరించిన భీష్ముడి విధేయత,ధర్మనిబద్ధత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది.


ఇక్కడే యుగధర్మానికి కట్టుబడిన కృష్ణుడికీ, ‘సత్తెకాలపు సత్తెయ్య’లాంటి భీష్ముడికీ తేడాకనబడుతుంది. కాకపోతే, కురుక్షేత్ర యుద్ధ సమయానికొచ్చే సరికీ ఈ విధేయతకూడా కోల్పోయిన రూపం భీష్ముడిలో కనిపించడం, మరో షాక్. సర్వసైన్యాధ్యక్షుడయ్యుండీ, కావలసినప్పుడు మరణించే వరం పొందుండీ తన చావురహస్యాన్ని తన ప్రభువుయొక్క ప్రత్యర్థులకు సునాయాసంగా చెప్పేసే ఈ మహానుభావుడ్ని ఎలా అర్థం చెసుకోవాలో తెలీదు.జీవితాంతం తప్పుడునిర్ణయాలుతప్ప, తప్పనిసరి పరిస్థితుల్లో సక్రమమైన నిర్ణయాలు తీసుకోలేని భీష్ముడు చనిపోతూ, అంపశయ్యమీద ధర్మరాజుకు రాజ్యధర్మాన్ని నేర్పడం మహాభారతానికే హైలైట్.


బహుశా, మనందరిలోనూ ఈ భీష్ముడున్నాడు. ఈ కలియుగంలో యుగధర్మాన్ని విస్మరించి, కొంత సత్య- త్రేత్రా - ద్వాపరయుగాలలోని విలువల్ని ఆచరిస్తూ, సరైనసమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక, అసంబద్ధ విధేయతని (misplaced loyalty) ప్రకటించుకుంటూ జీవిస్తూ ఉంటాము. మనలోని ఆ భీష్ముడికి కాలం చెల్లాలి. కాలం చెల్లిన భీష్ములకు కాలం చెల్లాలి.


****

Monday, November 10, 2008

మహిళ నుంచీ, ‘మానవి’గా మారిన ఒక స్త్రీ కథ

నవల పేరు : మానవి
రచయిత్రి: వోల్గా
ప్రచురణ కర్త: స్వేచ్చ ప్రచురణ
మొదటి ముద్రణ: 1998
ధర: 50 రూపాయలు
ప్రతులకు: ప్రజాశక్తి, దిశ, నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్


ఇల్లే స్వర్గం. భర్తే దైవం. పిల్లలే లోకం అనుకున్న ఒక మహిళకు, తను నమ్మిన విలువలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోతే? ఇల్లాలిగా తన హోదా, భార్యగా తన గుర్తింపు, తల్లిగా తన గౌరవం అర్థాంతరంగా ప్రశ్నార్థకమైతే? ప్రేమించే భర్త మరో స్త్రీని ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిస్తే? తన విలువలు పుణికిపుచ్చుకున్నదనుకున్న కూతురు, తన సంసారాన్ని కాపాడుకోవడానికి ఆ తల్లినే దూరం చేస్తే? బంధాలతోనే కొలవబడి. అనుబంధాల ఆసరాతోనే జీవితాన్ని అర్థం చేసుకుని. ఇల్లాలిగా మాత్రమే గౌరవాలందుకున్న ఒక మహిళను, ఎంచుకున్న జీవితం, పెంచుకున్న బంధం. అర్థరహితమై, తన అస్థిత్వాన్ని ప్రశ్నిస్తే? అప్పుడా మహిళ ఏం చేస్తుంది?


ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వోల్గా’ నవల ‘మానవి’. పాతికేళ్ళ కాపురం తరువాత, డాక్టర్ సురేష్ తన తోటి డాక్టర్ నీలిమతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అతడికి భార్య,కొత్తగా పెళ్ళయిన కూతురు, యూనివర్సిటీలో చదువుతోన్న మరో కూతురు ఉంటారు. అయినా అతడు ఈ బంధం నుంచి తప్పించుకోలేకపోతాడు. భార్యతో ఈ విషయం దాచకుండా చెప్తాడు. దానితో అతడి భార్య వసంత దాదాపు పిచ్చిదవుతుంది. భార్యగా తనలో ఏదైనా లోపముందా! ఇల్లాలిగా తను ఏదైనా తప్పుచేసిందా!! తల్లిగా తనుభాద్యతలు నెరవెర్చలేదా!!! అనే మీమాంశలో వసంతం ఉక్కిరిబిక్కిరవుతుంది. నీలిమలో గల ఆకర్షణేమిటో తను ఇప్పుడు భర్తని ఎందుకు ఆకట్టుకోలేకపోతోందో తెలీక సతమతమవుతుంది.ఏంచెయ్యాలో తెలీదు. ఎలా భర్తను "అదుపులో పెట్టుకోవాలో" అర్థం కాదు. ఈ నిరాశానిస్పృహల మధ్య భర్తకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసి, మళ్ళీ ప్రేమికురాలి దగ్గర స్వాంతన పొందేంతగా మానసికహింసకు గురిచేస్తుంది. తనూ మానసికక్షోభ అనుభవిస్తుంది.


ఈ సంఘర్షణలో భాగంగా, తన ఆలోచనలకూ ఆకాంక్షలకూ ప్రతిరూపమైన పెద్దకూతురు లావణ్య దగ్గర స్వాంతనపోందాలనుకుంటుంది. కానీ, తల్లికన్నా తన సంసారం ముఖ్యమనుకునే లావణ్య, తల్లికి ఆర్థికంగా తండ్రి సహాయం చెయ్యాలనే షరతు (తన భర్తద్వారా) తండ్రికి తెలియపరుస్తుందే తప్ప, వాళ్ళని కలిపే ప్రయత్నం చెయ్యదు. అవసరానికి కావాలనుకున్న తల్లి కష్టాల్లో వుండటం చూసి, తప్పించుకోవాలనుకుంటుందేతప్ప ఆధారమై ఆదుకోవాలని అనుకోదు. ఈ విధంగా ఆశపెట్టుకున్న కూతురు నిరాశపరుస్తుంది. కారణం, ఆ కూతురికీ తన సంసారమేతప్ప తల్లిదండ్రులు ముఖ్యంకాదు.


వ్యక్తిత్వాన్ని మూర్తీభవించినట్లుండే (యూనివర్సిటీలో చదివే) రెండో కూతురు ‘నవత’ ఒకవైపు తల్లికి ఆసరాగా నిలవడమేకాక, తండ్రిని అర్థం చేసుకుని గౌరవప్రదంగా తల్లిదండ్రులు విడిపోవడానికి తోడ్పడుతుంది. నవత సహవాసంలో వసంత తన జీవితంలో అప్పటివరకూ నమ్మిన విలువల్ని త్యజింస్తుంది. ఇల్లే ప్రపంచంగా, భర్తా పిల్లలే జీవితంగా తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఒక reflected relationships యొక్క ఆసరాతో బ్రతికిన ఒక గృహిణి, తను నమ్మిన విలువలన్నింటినీ ఒక్క క్షణంలో కోల్పోయిన తరువాతకూడా, zero base నుంచీ జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ, పాత విలువల్ని (భర్త సురేష్ ని) ఒక dispassionate human being గా కళ్ళలోకళ్ళుపెట్టి చూసిన తరువాత, మార్పుని మనస్ఫూర్తిగా ఆహ్వానించి పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుని "మానవి" అవుతుంది.


ఈ నవలలో రచయిత్రి ఉద్దేశం 'మహిళకు తనదంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. సంబంధాలు తన జీవితాన్ని నిర్వచించక, ఒక మనిషిగా తనకు ఒక వ్యక్తిత్వం-అస్థిత్వం ఉండాలి' అనిచెప్పడం. అందుకే అటు నీలిమకూ ఇటు సురేష్ పాత్రకూ ప్రాధాన్యత ఇవ్వలేదు. Point of conflict ఆ సంబంధం అయినప్పటికీ, ప్రధాన వస్తువు కాదు. ఒక మహిళ, భార్య,తల్లి,గృహిణి నుంచీ మనిషిగా మారిన వసంత లో జరిగే "మార్పు" కథావస్తువు. కాకపోతే, రచయిత్రి ఈ సంబంధాన్ని సమాజిక విలువలకోణంలోంచీ చూపించి నిరసించకపోవడం ఒక పెద్ద తెరపి అనుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో, నీలిమ పాత్రను ఒక వ్యాంప్ లాగా చిత్రిస్తే, వసంత పాత్రకు మరింత సానుభూతి దక్కుండేది. కానీ అలా చెయ్యకపోవడం రచయిత్రిలోని ప్రత్యేకతని చాటుతుంది.


అదే విధంగా సురేష్ పాత్రకూడా సాధ్యమైనంత సాధారణంగా ఈ "తప్పు" గురించి భార్యదగ్గర ప్రస్తావిస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఎక్కడా నీతి,అనైతికతా అనే పదాలు రాకపోవడం. ఈ ఘటనని ఒక మానవీయపరిస్థితి (human situation) గా ఎటువంటి value judgment లేకుండా చెప్పటంలో రచయిత్రి చేసిన కత్తిమీది సాము అభినందనీయం. ఈ నవలలో, ఆర్థికంగా సామాజికంగా స్వతంత్ర్యంగా ఉంటూ, శారీరక-మానసిక అవసరాలకోసం ఒకపెళ్ళయిన మగాడితో సంబంధం కొనసాగించే వసంత స్నేహితురాలు శాంత నీలిమను రెప్రెజెంట్ చేస్తే. వసంతం- శాంతల పాత్రధోరణులలోని భిన్నత్వానికి వారధిలా, ఒకవైపు ఇల్లూ చూసుకుంటూ మరో వైపు డాక్టరుగా తన వ్యక్తిత్వాన్నీ నిలుపుకుంటూ మరో స్నేహితురాలు డాక్టర్ రోహిణి కనిపిస్తుంది. అతిముఖ్యంగా వసంత చిన్నకూతురు నవత భవిష్యత్తుకు చిహ్నంగా అనిపిస్తుంది.బహుశా అందుకే తన పేరు "నవత" అయ్యిందేమో! ఈ విధంగా మహిళా సాధికారతలోని వివిధస్థితిగతుల్ని రచయిత్రి తన పాత్రలద్వారా చూపించడం, అదీ సామాజిక విలువల ప్రస్తావన లేకుండా హృద్యంగా అనిపిస్తుంది.


భార్య, తల్లి,గృహిణిగా వసంత తన identity కోల్పోయి, ఆఖరికి వసంత, వసంతగా మిగులుతుంది. కేవలం ఒక మహిళగా కాకుండా ఒక వ్యక్తిగా, మనిషిగా, మానవిగా మిగులుతుంది. prescribed, ascribed and reflected identities పోయి తన true identityతో మిగులుతుంది.

తప్పకుండా చదవ వలసిన నవల. ప్రచురించబడి పది వసంతాలు కావస్తున్నా, ఇప్పటి పరిస్థితులకూ అన్వయించుకోదగ్గ విషయమున్న నవల.


****

Sunday, November 9, 2008

మెకాలే (Macaulay) మానసపుత్రులు

ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) త్రోవలో ఏ చర్చ సాగించాలన్నా, సాంప్రదాయవాదులు మొదటిగా వేసే నింద "మెకాలే మానసపుత్రులు". భారతదేశంలో ఆధునికవిద్య ప్రవేశపెట్టిన థామస్ బెనింగ్టన్ మెకాలే -Lord Thomas Babington Macaulay (1800-1859) విధానాలవలన హిందూమతానికి దూరమైన మూఢులే ఈ ‘మెకాలే మానసపుత్రులు’. హిందూజాతీయవాదం పేరుతో ఉప్పొంగుతున్న భావజాల నేపధ్యంలో, ఈ భావన బలంగా పాతుకుపోయింది. హిందూజాతీయవాదులే కాక, సాధారణ హిందువులుకూడా, ఈమధ్య అంతర్జాలంలో ప్రచలనలోకి వచ్చిన కొన్ని వాక్యాలను (quote) ఆధారం చెసుకుని ఈ విషయాన్ని నమ్మడానికి తయారుగా వున్నారు. పూర్తి చరిత్ర చదవటమో, లేక కనీసం ఆ quote యొక్క పూర్వాపరాలను తెలుసుకోవడం (ఆ మెకాలే విధానాలవలన వచ్చిన ఉద్యోగాలలో) బిజీగా వున్న మనజీవితాలలో కుదరదు కాబట్టి, చెప్పింది యధావిధిగా నమ్మేయడం జరుగుతోంది.


ఈ quote నేపధ్యానికి చెందిన కొంత చరిత్ర, మరికొంత విశ్లేషణా సేకరించి ఔత్సాహికులైన ఉదారవాదులకోసం ఇక్కడ పొందుపరుస్తున్నాను.

"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."


మెకాలేకి ఆపాదించబడుతున్న పై
quote యొక్క కాలం 1835 బ్రిటిష్ పార్లమెంట్ గా చెబుతారు. ఇక్కడున్న సమస్యేమిటంటే, 1835 సమయానికి మెకాలే భారతదేశంలో వున్నాడు. ఈ విషయం మీద తను బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడింది 1833 లో. ఈ నిజాన్ని పక్కనబెట్టి, కేవలం తను చెప్పాడని అనుకుంటున్న quote లోని విషయాన్ని చూద్ధాం. ఆకాలంలో ఆంతరంగికంగా బ్రిటిష్ వాళ్ళ ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాకూడా, ఒక పార్లమెంటరీ డిబేట్ లో ఇలాంటి వాదాలు చేసేవారు కాదు. ‘నాగరికతను స్థాపించడం’ మరియూ ‘బానిస విధానాలను అంతమొందించడం’ లాంటి ఉద్దాత్తమైన విధానాల పేరుతో అప్పటి సామ్రాజ్యవాద (colonial) విస్తరణ జరిగింది. అందుకే, ఎప్పుడూ తాము గొప్పవాళ్ళమని, ఈ చీకటి ప్రపంచంలోకి వెలుగు నింపడానికి వచ్చామనీ చాలా బలంగా నమ్మేవాళ్ళు. కానీ, ఇక్కడమాత్రం మెకాలే భారతీయ సంస్కృతిని ఆకాశానికెతేస్తూ, దాన్ని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకోవాలని ఒక పబ్లిక్ ఫోరంలో చెబుతున్నట్లుగా నమ్మించాలని చూసారు. పైగా, బ్రిటిష్ సంస్కృతికన్నా ఈ నాగరికత గొప్పదన్నట్లుగా ఆ కాలంనాటి ఒక upper class ఇంగ్లీష్ అధికారి (అదీ పార్లమెంట్ లో, ఈస్ట్ ఇండియా కంపెనీని represent చేస్తూ) మాట్లాడినట్లు చెప్పడం నమ్మశక్యం కాని విషయం.


ఒకవేళ మాట్లాడాడు అనుకున్నా, 1833-35 నాటికి మన భారతీయ సంస్కృతి తను చెప్పినంత ఉన్నతంగా ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. కేవలం 2% కన్నా తక్కువమందికి వేదాలూ,స్మృతులూ,ధర్మాలూ ఇతరత్రా విషయాల జ్ఞానం ఉండేది. కేవలం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులు ఈ విధివిధానాలను పాటించేవారు. ఈ జ్ఞానాన్ని సమపార్జించేవారు. అప్పటికే
జనబాహుళ్యంలో మూఢనమ్మకాలూ, హింసాత్మకమైన ఆచారాలూ వేళ్ళూనుకొని వున్నాయి.ఇక్కడ మరో విచిత్రమేమిటంటే, ఈ పురాతనజ్ఞానం మీద సర్పాల్లా తిష్టవేసుకున్న ఇవే వర్గాలు/కులాలు, మెకాలేవిధానాల వలన అత్యధికంగా లాభపడ్డారు. కార్మికులూ,కర్షకులూ, రైతులూ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలవలన చితికిపోతే, ఈ సాంప్రదాయ ప్రేమికులు దుబాసీలుగా, బ్రిటిష్ అధికారానికి దాసులుగా రాజ్యం చేసారు.


ఇక్కడ మెకాలే భారతదేశానికేదో పెద్ద సేవ చేసాడని చెప్పడం ఉద్దేశం కాదు. కాకపోతే, అప్పట్లో తనకు ఇచ్చిన పనిని సిన్సియర్గా చేసాడు అంతే! అప్పట్లో బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం వ్యాపారం, ఆ తరువాత రాజ్యాధికారం. వాటిని సాకారం చెయ్యడానికి కావలసిన విధానాల రుపకల్పన చేసాడు.

ఇతని మీద వేసే మరొ అభియోగం, ‘హిందువుల్ని మతరహితుల్ని చేసి, తమ భావజాలానికి బానిసలుగా చేసే విద్యావిధానాన్ని నిర్మించాడు’ అని. దానికి ఆధారంగా చూపే
quote ఇది;

'It is impossible for us, with our limited means, to attempt to educate the body of the people. We must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern; a class of persons, Indian in blood and colour, but English in taste, in opinions, in morals, and in intellect." నేనిక్కడ ఒక వాక్యాన్ని బోల్డ్ లో పెట్టి, ప్రత్యేక ఆకర్షణగా నిలిపినట్లే ఈ quote చెప్పేటప్పుడు తమ వాదనల్ని వినిపించేవారూ చేస్తారు. కానీ మెకాలే అదే వ్యాఖ్యలో తరువాత చెప్పిన వాక్యాల్ని మాత్రం ఎక్కడా చూపించరు. వాటిని ఇక్కడ చూడండి; "To that class we may leave it to refine the vernacular dialects of the country, to enrich those dialects with terms of science borrowed from the Western nomenclature, and to render them by degrees fit vehicles for conveying knowledge to the great mass of the population.'" ఇప్పుడు మొత్తం పేరాని ఒకసారి చదువుకోండి. Now you may know, who is taking you for a ride.


ఇక్కడ మెకాలే మాటల్లో ఆ కాలంనాటి classic liberalism కనిపిస్తుందేతప్ప "కుట్ర" కనిపించదు.అప్పట్లో యూరోప్ లో ప్రచులితమైన శాస్త్రీయ ధృక్పధం (scientific temperament), సాంకేతిక విజ్ఞానాన్ని మనస్ఫూర్తిగా జ్ఞానమని నమ్మి, దాన్ని అందరికీ అందేలా చెయ్యాలనుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక సంస్కృతి గొప్పదనంవలన తమ ఉద్దేశాలు సాకారం కావుగాబట్టి, మోసంతో దాన్ని అంతం చెయ్యాలనుకునే మూర్ఖుడు కనిపించడు.అంతేకాక, అప్పటికే ఇతర సంస్కృతులవలన బాగుపడిందనుకున్న బ్రిటిష్ సంస్కృతి నేర్చుకున్న పాఠాలను, భారతదేశానికి అన్వయించాలనుకునే మేధావి కనబడతాడు. ఇదే speech లో తను బ్రిటన్ గురించీ, బ్రిటన్ లోకి ఇతర సంస్కృతులు వచ్చి ఎలా enrich చెసిందీ చెప్పాడు.

"The first instance to which I refer, is the great revival of letters among the Western nations at the close of the fifteenth and the beginning of the sixteenth century. At that time almost everything that was worth reading was contained in the writings of the ancient Greeks and Romans. Had our ancestors acted as the Committee of Public Instruction has hitherto acted; had they neglected the language of Cicero and Tacitus; had they confined their attention to the old dialects of our own island; had they printed nothing and taught nothing at the universities but Chronicles in Anglo-Saxon, and Romances in Norman-French, would England have been what she now is? What the Greek and Latin were to the contemporaries of More [Thomas --, 1478-1535] and Ascham [Roger --, 1515-68], our tongue is to the people of India."



ఇక్కడ, జ్ఞానాన్ని పంచుకోవడంలో తను తెలుసుకున్న మార్గాన్ని విధానరూపంలో చూడాలనుకునే ఒక ఔత్సాహిక విధ్యావేత్త కనిపిస్తాడు. గ్రీకు లాటిన్ భాషలద్వారా బ్రిటిష్ వారు నేర్చుకున్న నమూనాలో ఇంగ్లీష్ ద్వారా భారతీయులు ఆ
జ్ఞానాన్ని సంపాదించుకుంటారనే conviction కనిపిస్తుంది. కొందరు మిత్రులు "ఆ..మెకాలే కొత్తగా నేర్పే జ్ఞానమేమిటి? మనదగ్గరున్న వేదాల్లో అప్పటికే అన్నీ వున్నాయిగా!" అంటారు. నిజమే. నిజమే!! కానీ అదెక్కడుంది? ఎంతమందికి తెలుసు? దాన్ని పంచుకోవడానికి ఎవరు తయారుగా ఉన్నారు? కనీసం ఇప్పటికన్నా దాన్ని వెలికితీసి అందరికీ పంచరే!!! వీటికి మాత్రం సమాధానాలు రావు.

మెకాలే ఇదంతా ఏదో లాభాపేక్షరహితంగా చేసాడనో, బ్రిటిష్ వారు భారతదేశం మీద ప్రేమతోనో చేసింది కాదని అందరికీ తెలిసిన సత్యమే.అది వారెక్కడా దాచుకోలేదుకూడా.
"It is scarcely possible to calculate the benefits which we might derive from the diffusion of European civilisation among the vast population of the East. It would be, on the most selfish view of the case, far better for us that the people of India were well governed and independent of us, than ill governed and subject to us; that they were ruled by their own kings, but wearing our broadcloth, and working with our cutlery, than that they were performing their salams to English collectors and English magistrates, but were too ignorant to value, or too poor to buy, English manufactures. To trade with civilised men is infinitely more profitable than to govern savages."


ఇలా విద్యకూ వ్యాపారానికీ గల సంబంధం యొక్క రహస్యాన్ని విప్పిచెప్పాడుకాబట్టే, మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం విద్యపైన డబ్బులు ఖర్చుపెట్టాయి. లేకపోతే, మనమూ ఏ ఆప్ఘనిస్తానో లేక ఆఫ్రికా దేశాల్లాగానో అధమం నేపాల్ లాగానో తయారయ్యుండేవాళ్ళం. మెకాలే అర్థజ్ఞానంతో తన ప్రతిపాదనల్ని సమర్పించాడనుకున్నా, ఈ ప్రతిపాదనలు ఏకపక్షంగా అంగీకరించబడలేదు. దాన్ని ప్రతిఘటించినవారూ, చర్చించినవారూ ఉన్నారు. కానీ, వారి వాదనలు నిలబడలేకపోయాయి. అప్పటికే Tradition Vs Modernity చర్చలు జరుగుతున్న బ్రిటన్లో, ఈ రెండిటిమధ్యా కావలసిన సమన్వయాన్ని ప్రతిపాదించేవాళ్ళు లేకపోయుండచ్చు. అందుకే సాంప్రదాయం మీద ఆధునికత విజయం జరిగిపోయింది.


మెకాలే మీద చేసే మరో ఆరొపణ క్రైస్తవ మిషనరీల ఉద్దేశాలకు అనుగుణంగా విద్యావ్యవస్థను తయారు చేసాడని. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం మరో వైపు బ్రిటిష్ చర్చిని సముదాయించి, బిజ్జగిస్తేగానీ ప్రశాంతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోలేని సమయం అది. తను కలకత్తాలోని ఒక ఎవాంజెలిస్ట్ ఫాదర్ కు రాసిన లేఖలోని భాగాలను చూడండి;


"No Hindoo, who has received an English education, ever remains sincerely attached to his religion. Some continue to profess it as matter of policy; but many profess themselves pure Deists, and some embrace Christianity. It is my firm belief that, if our plans of education are followed up, there will not be a single idolater among the respectable classes in Bengal thirty years hence. And this will be effected without any efforts to proselytise; without the smallest interference with religious liberty; merely by the natural operation of knowledge and reflection. I heartily rejoice in the prospect."



ఇక్కడకూడా హిందూమతానికి దూరమైన వార్లో కొందరి క్రైస్తవానికి రావచ్చనే ఆశనికల్పించాడేతప్ప, అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేదు. జ్ఞానం మనిషిలో బుద్దివికాసానికి తోడ్పడితే, వాడు మానవతావాది అవుతాడే తప్ప మతాల్ని పట్టుకుని వేలాడడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఈ దారిలోనే ఇస్లాం మతం లో, మదరసాల విద్యకు దూరంగా, సెక్యులర్ విద్యను భోధిచడం ఇస్లాం తీవ్రవాదానికి సరైన మందుగా ఒకవైపు ప్రభుత్వాలు భావిస్తుంటే, అది త్వరితగతిన జరగాలని హిందూ సాంప్రదాయవాదులు కోరడం. అప్పట్లోని అవసరాలకు అనుగుణంగా మెకాలే ప్రతిపాదిస్తే తప్పు, ఇప్పుడు మన అవసరాలకి అనుగుణంగా మనం కావాలనుకుంటే ఒప్పు. అంతే!


మెకాలే సిద్ధాంతాల వలన వచ్చిన ఆంగ్లవిద్య కావాలి. అదే విద్యద్వారా వచ్చే ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ జాబ్స్ కావాలి. తద్వారావచ్చే ఆర్థిక లాభాలూ,స్వావలంబనా కావాలి. దాని ఆధారంగా మనం ఒక developed nation కావాలి. కానీ, ఎవరైనా
ఉదార-లౌకిక సాంప్రదాయాలు (secular liberal traditions) లేక లౌకికమానవతావాదాల(secular humanism) గురించి మాట్లాడితే మాత్రం "వాడొక మెకాలే మానసపుత్రుడు". సాంప్రదాయాల్నీ, సంస్కృతుల్నీ, విలువల్నీ ఆధునికత ఆధారంగా ప్రశ్నిస్తే...వారు మెకాలే మానసపుత్రులు. మెకాలే విధానాలు అందించిన లాభాలు మాత్రం కావాలి, ఆలోచనలు మాత్రం ఒద్దు. మెకాలే విధానాలు అందించే సామాజిక గుర్తింపుకావాలి, విలువలు మాత్రం ఒద్దు. వాటిని మాత్రం ఎవరికీ తెలీని రహస్య వేదాల్లో, అర్థంకాని సంస్కృత శ్లోకాల్లో వెతుక్కోవాలి.

"English remains indispensable for technical education and as a means of inter-State communication. The software revolution in India might never have happened had it not been for Macaulay's Minute. And India might not have still been united had it not been for that Minute either. For, it was the existence and availability of English that allowed the States of South India to successfully resist the imposition of Hindi upon them"
- Guha (2007)


*కొసమెరుపేమిట్రా అంటే, మొదట్లో ఉటంకించిన quote ఒక అంతర్జాల HOAX అని కొన్నాళ్ళకి తేలడం.

****
References
http://en.wikipedia.org/wiki/Thomas_Babington_Macaulay
http://www.languageinindia.com/april2003/macaulay.html
http://www.humsurfer.com/india-in-1835-a-proposal-from-lord-macaulay-to-british-parliament
http://www.countercurrents.org/dalit-prasad271004.htm
http://koenraadelst.bharatvani.org/articles/hinduism/macaulay.html
http://www.mumbai-central.com/nukkad/jan2008/msg00251.html


****

Saturday, November 8, 2008

‘మరో చరిత్ర’ కు ముప్పైయ్యేళ్ళు


గత ముప్పైసంవత్సరాలుగా తెలుగు జీవితాలలో, తెలుగు సినిమాలలో ప్రేమకథల్ని ప్రభావితం చేసిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరో చరిత్ర’. 1978 లో విడుదలైన ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. ఈ ఏటితో ఈ చిత్రానికి ముప్ఫైఏళ్ళూ నిండుతాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొంత తలుచుకుందాం.

పూర్తివ్యాసం కోసం ఇక్కడ (నవతరంగం) చూడండి.

Friday, November 7, 2008

లైంగికత Vs నైతికత : ఒక జెండర్ ధృక్కోణం

లైంగికత ఒక శారీరక స్పందన. నైతికం ఒక సామాజిక కట్టుబాటు. మొదటిది సహజం. రెండవది సమాజనిర్మితం. లైంగికత హద్దులుదాటితే, సమాజంలోని నిర్ధిష్టత,ప్రామాణికత దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఈ సహజత్వాన్ని హద్దుల్లో పెట్టడానికి నైతికత అనే కృత్రిమ కంచె ఏర్పాటు చెయ్యటం జరిగింది. కాకపోతే, ఇక్కడకూడా men are more equal than women అయిపోయారు. ఈ లింగవివక్షతోకూడిన నైతిక నిర్వచనాల స్థాపనలో, శారీరక గుణాలపాత్ర చాలా వుందని తెలుసుకోవడం ముఖ్యం. ఈ నిజాన్ని ఎంత విస్తృతంగా తెలుసుకుంటే, అంతే విశదంగా 'నైతికతే మన సమాజంలోని లింగవివక్షకు మూలం' అనే సత్యం గోచరిస్తుంది.


'శారీరక కలయిక గర్భాదానానికే!' అనేది మన శాస్త్రాలు చెప్పే విషయం.ఇలాంటి మాటలే దాదాపు అన్ని మతాల్లోనూ చెప్పడం జరిగింది. అది చాలావరకూ నిజం కూడాను. లైంగికతలోని మూల ఆశయం పునరుత్పత్తి (procreation). ప్రతిజీవీ తన సంతతిని వృద్ధిచేసుకుంటూ మనుగడ సాగించడం ఈ లైంగికత ద్వారానేసాధ్యం.అందుకే ఈ ప్రక్రియకి పవిత్రత ఆపాదించబడింది. ఆ పవిత్రత ఆధారంగా, కలయికకి సంబంధించిన కొన్ని నియమాలు సృష్టించబడ్డాయి. ఈ సందర్భంలో ఆడవారికీ మగవారికీ గల మౌళికమైన తేడాను గుర్తించడం అవసరం. మగవారు పవిత్రత మీరినా, నియమాల్ని వుల్లంఘించినా వాటికి ఆధారాలు లభ్యంకావు.కానీ, అదేపని ఆడది చేస్తేమాత్రం ఆక్షణంలో కాకపోయినా మరో కొన్నివారాలకి సమాజ ప్రామాణికతను దెబ్బతీసే ఆధారాలతొసహా పట్టుబడుతుంది.


'దొరికితేనే దొంగలు' అనేది మన సామాజిక న్యాయసిద్ధాంతం కాబట్టి, ఈ దొరకని దొంగలకి మినహయింపునిచ్చేసి, దొరికే దొంగల మీద ప్రత్యేకశ్రద్ధ పెట్టడం జరిగింది. మన పూర్వజులు బహుతెలివైనవారూ, మానవప్రవృత్తిని కూలంకషంగా అర్థం చేసుకున్నవారూ కనక, దొంగ చేతికే తాళాలిచ్చేసారు. ఆ తాళాలే "సుసంపన్నమయిన మన సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన స్త్రీమూర్తులు" అనే బాధ్యత. కుటుంబ గౌరవం, వంశప్రతిష్ట, సంస్కృతీ సాంప్రదాయాల తాళాలు ఈ విధంగా సమకూరినవే.


ఈ తాళాలను మోస్తూమోస్తూ అదేతమ జీవితాశయంగా బ్రతికెయ్యడం మొదలయ్యింది. సమయం మారింది. పరిస్థితి మారింది. ఆశయాలు మారాయి.ఆదర్శాలు మారాయి. కానీ, ఇవేమీ పట్టనట్టుగా మన నైతిక నిర్వచనం మాత్రం మారలేదు. తాళాలిచ్చిన దొంగలుకూడా, 'నిజంగా ఇది మా బాధ్యతే కామోసు' అన్న గౌరవప్రదమైనభ్రమలో జీవించడం కొనసాగించారు.లింగవివక్ష వేళ్ళూనుకుంది, నైతికతని లైంగికత, లైంగికతని నైతికతా విడదియ్యరాని సామాజిక పార్శ్వాలుగా వర్ధిల్లుతున్నాయి.


ఒకసారి సమాజం మతం నైతికతకు ఇచ్చే నిర్వచనాన్ని చూసి తరువాత ఆధునికయుగంలో జరిగిన మార్పుల నేపధ్యంలో వాటిని బేరీజు చేద్దాం.

1.కలయిక ఉద్దేశం గర్భధారణకాబట్టి అది అత్యంతపవిత్రమైన కార్యం.
2. ఆ పవిత్రకార్యం పెళ్ళితరువాతనే జరగాలి.
3. కలయికద్వారా సంభవించే సంతానానికి తల్లిదండ్రులిద్దరూ బాధ్యత వహించాలి.

ఆధునిక యుగంలో గర్భనిరోధకాలద్వారా గర్భధారణతో సంబంధం లేని కలయిక సంభవం,సాధారణం. కాబట్టి, కలయికకు ఆపాదించబడే పవిత్రతకు స్థానం లేదు. పెళ్ళి అనేది ఐచ్చికం (optional) కాబట్టి, పెళ్ళి కలయికకు అత్యవఅవసరమైన షరతు అసలు కాదు. ఇక్కడ పిల్లల ప్రసక్తి లేదుకాబట్టి బాధ్యతాయుతమైన కలయిక అంటే, ఈ కలయిక ద్వారా పిల్లలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ప్రస్తుతం ప్రాణాంతకమైన వ్యాధులు సంక్రమిస్తున్నాయి కాబట్టి అవి సంక్రమించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం.


ఈ ఆధునిక మార్పుల నేపధ్యంలోంచీ చూస్తే, పైన చెప్పిన మూడు నిబంధనల్నీ ఇలా మార్చుకోవచ్చు.

1.కలయిక ఉద్దేశం చాలావరకూ ఆనందం. అప్పుడప్పుడూ మాత్రమే గర్భధారణ
2. పెళ్ళికీ కలయికకూ ఎటువంటి బాదరాయణ సంబంధం లేదు.
3. కలయిక ఇరు పక్షాల సమ్మతంతో, బాధ్యతాయుతంగా జరగాలి.

ఒకప్పుడు స్త్రీకి తన శరీరంపైన ఎటువంటి నియంత్రణా లేదుకాబట్టి, అప్పటి పరిస్థితికి అనుగుణంగా లైంగికతను నిర్దేశించే నైతికతను ఆపాదించడం జరిగింది. కానీ,మారిన నేపధ్యంలో కూడా అవే కొనసాగటం మాత్రం కొంత సామాజిక కుట్రలో భాగం అనిపించకమానదు.


అంతెందుకు, వ్యవస్థీకృత కలయిక జరిగే పెళ్ళిలో కూడా గర్భాధారణతోపాటూ, పెళ్ళి అనే సంబంధం ప్రేమతో కలకాలం కొనసాగే ప్రక్రియలో భాగంగా గర్భనిరోధక కలయికను ఆమోదిస్తున్నప్పుడు, దానికి ఇంకా procreation పవిత్రతను అంటగట్టడం అర్థరహితం. అలా చెయ్యటం లేదుకాబట్టి, ప్రేమించిన స్త్రీ ఆ ప్రేమకారణంగా సుముఖంగా గర్భందాల్చడానికి ఇష్టపడిందని అనుకోవాలి.అంటే, ఇక్కడ స్త్రీ ఇష్టానికిగల ప్రాధాన్యత ముఖ్యంగానీ పెళ్ళి అనే వ్యవస్థకున్న ప్రాముఖ్యత నగణ్యం. కారణం, పెళ్ళైనంతమాత్రానా భర్తతో బలవంతంగా కాపురం చెయ్యాలి లేక పిల్లల్ని కనివ్వాలన్నది చట్టరీత్యా నేరం కాబట్టి.


స్త్రీకి తన శరీరంపైన తనకుగల సంపూర్ణహక్కుల నేపధ్యంలో,ఆ హక్కుల్ని కాపాడుకునే సాంకేతిక జ్ఞానం మరియూ విజ్ఞానం యొక్క లభ్యత దృష్ట్యా పవిత్రతలూ, నైతికతలకు కాలం చెల్లిపోయిందనే సైద్ధాంతిక రూపేణే భావించాలి.కానీ, మన సమాజిక నిర్మాణం,వ్యవస్థా ఈ మార్పులకి అనుగుణంగా ప్రస్తుతానికైతే అగుపించడం లేదు. లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తియొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం.

Thursday, November 6, 2008

ఫ్యాషన్...అంటే!

మధుర్ భండార్కర్ ‘ఫ్యాషన్’ సినిమా చూసినతరువాత వచ్చిన కొన్ని అసంపూర్ణ ఆలోచనలు.


ఫ్యాషన్ TV మొదలైన కొత్తల్లో ఒక మిత్రుడితో కలిసి చూస్తూ, "అసలు నిజజీవితంలో ఈ బట్టలెవరైనా వేసుకుంటారా?" అనే ఒక ప్రశ్న లేవదీసాను. దానికి ఆ మిత్రుడు సగౌరవంగా,"నీ పరిధిలోని జీవితంలో ఈ దుస్తులు వేసుకునేవాళ్ళు లేకపోయినంతమాత్రానా, ఇలాంటివి వేసుకోరని ఎందుకనుకుంటావు. బహుశా, మన స్థాయికీ,పరిధికీ అంతుచిక్కని ప్రపంచంలో వీళ్ళు వుంటారేమో కదా!" అన్నాడు. అప్పుడు నేను తనతో అంగీకరించకపోయినా, ఇప్పుడు తలుచుకుంటే ఆ మాటల్లోని మర్మం అర్థమవుతోంది.


పదిసంవత్సరాల క్రితం కేవలం ఫ్యాషన్ టీవీలో మాత్రమే కనిపించిన దుస్తులు, ఐదారు సంవత్సరాలక్రితం సినిమాలలో ప్రవేశిస్తే, ప్రస్తుతం షాపింగ్ మాల్లలోనూ, వాటికొచ్చే మన ఎదురింటి పక్కింటి అమ్మాయిలూ,అబ్బాయిల వంటిమీద కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ అంటే, అప్పటి సమాజంలో చాలా మంది ఆచరించే ఆహార్యశైలి అనుకుంటే, ఈ మార్పు త్వరితగతిన జరిగిందని అనిపిస్తుంది. కానీ, ఫ్యాషన్ నిజజీవితాలకు దూరంగా వుంటుందా అని ప్రశ్నించుకుంటే మాత్రం, "కాదేమో!" అనిపించకమానదు. మనకు తెలియకుండానే చాలా ఆహార్యధోరణులు మన జీవితాల్లో వివిధస్థాయిల్లో ప్రవేశించేస్తాయి.


ప్రతి ప్రాంతానికీ తగ్గ ఆహార్యవ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి. కానీ, ఈ విస్తృతత్వం మాత్రం బహుశా 18 వశతాబ్ధంలో పెద్దస్థాయిలో బట్టల పరిశ్రమలు స్థాపించబడి, వివిధరకాల వస్త్రాలు జనబాహుళ్యానికి అందుబాటులోకి వచ్చినప్పటినుండీ వేగవంతమై, ఒక వ్యవస్థీకృతమైన రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. లండన్, ప్యారిస్,మిలాన్ వంటి యూరోపియన్ నగరాలు ఈ ఫ్యాషన్ రంగానికి ఆద్యులనుకుంటే, భారతదేశంలో ఢిల్లీ,ముంబై నగరాలు ఫ్యాషన్లకు పుట్టినిల్లులుగా గుర్తిస్తాము.


నా జీవితంలో చాలా భాగంవరకూ ఫ్యాషన్లని నిర్దేశించింది మాత్రం మా ఊరి దర్జీ (టైలరు). మా టీచరొకాయన తనసొంతమైన అర్థం వచ్చేటట్లు "we are all tailor made personalities" అనేవాడు. తను ‘పర్సనాలిటీ’ అనేపదానికి తీసిన అర్థం వ్యక్తిత్వమని కాకుండా, appearance గురించి వుండేది. నిజానికి, వ్యక్తిత్వానికి తీసుకొనే ఒకానొక కొలమానాలలో వేషధారణ,ఆహార్యం కూడా వుంటాయి. కాబట్టి, ఈ విధంగా చూస్తే, మనం టైలర్లు చేసిన మనుషులమే కదా!


నా చిన్నప్పుడు సఫారీ సూట్ల ఫ్యాషనొకటొచ్చింది. నేనూ మా నాన్నా, అన్నయ్యా ముగ్గరం ఒకే రంగు సఫారీ సూట్లేసుకుని పండగకు ఊరికి బయల్దేరేవాళ్ళం. ఆ సమయంలో మరేదైనా ఫంక్షన్ జరిగినా ‘ఒకే ఫ్యామిలీ’ తరహాలో ఒకేరకం బట్టలతో దిగుమతయ్యేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే చాలా చిత్రంగా వుంటుందిగానీ. అప్పట్లో చాలా కుటుంబాలలో ఇదే పద్దతుండేది.


ప్యాంట్ల విషయంలో నాకు బాగా గుర్తున్న మార్పు. గొట్టాం (ప్యారలల్)ప్యాంట్లనుంచీ కనీసం నాలుగేసి ఫ్లీట్లున్న (మడతలు) బ్యాగీప్యాంట్లలోకి మారడం. బహుశా ఏదో సినిమాలో నాగార్జున ఆ ప్యాంటు తరహా వెయ్యడంతో, ఒకే రాత్రికి ఆంధ్రదేశం మొత్తం ఈ బ్యాగీప్యాంట్లు ఫ్యాషనై కూర్చున్నాయి. ఆ ప్యాంటుల బెలూను తరగా ఉబ్బడానికి తోడు, సరిగ్గా ఐరన్ చెయ్యకపోతే చిత్రంగా కనిపించే ఫ్లీట్లొకటొచ్చి పడ్డాయి. కొందరైతే ప్యాంటుకున్నవి చాలనట్లు, షర్టులకి కూడా, మధ్యలో చీలినట్లో లేక అటూఇటూ మడిచినట్లో ఈ ప్లీట్ల ఫీట్లు పడేవారు. ఆప్పట్లో కొందరు పెద్దోళ్ళు, "ఇదేం లేటేస్ట్ ఫ్యాషన్ ‘గుండమ్మ కథ’ సినిమాలో ఏఎన్నార్, ఎన్టీయార్ ఈ ప్యాంట్లే వేస్తేనూ" అనేసారుకూడాను.


ఆ తరువాత వచ్చిన విప్లవాత్మకమైన మార్పు. జీన్స్ ప్యాంట్. మొదట్లో ఈ గోనెపట్టలూ,టార్పాలిన్ తరహా ప్యాంట్లు ఎవరేస్తారనుకున్న నాలాంటి చిన్నూరు జనం, అతిత్వరలో ఈ జీన్స్ యొక్క సౌలభ్యాలను (ఉతక్కుండా వారమేసుకోవచ్చు, ఐరనింగ్ ఇతర మెయింటెనన్స్ సున్నా) గుర్తించి ఆదరించేసాము. అదే తీరులో లంగా ఓణీలు వేసే ఆంధ్ర అమ్మాయిలు సౌలభ్యాలను గుర్తించి, సల్వార్ కమీజులను స్వాగతించేసారు. నా చిన్నప్పుడు ఎవరైనా ఆడపిల్లలు సల్వార్ కమీజ్ (మా వైపు ఇప్పటికీ పంజాబీ డ్రస్సులంటారు) అడిగితే, "నీకెందుకే ఈ తురక డ్రస్సు" అనేవారు. కారణం, అప్పట్లో ఈ దుస్తుల్ని కేవలం ముస్లిం అమ్మాయిలు మాత్రమే ధరించడం.


ఒకప్పుడైతే, ఊరి టైలర్ కుట్టినబట్టల్ని బట్టి మన ఆహార్యాలు తయారయ్యేవి. కనీసం కొంత భిన్నత్వం,కూసింత వ్యక్తిత్వం ఆ టైలర్నిబట్టీ మనం కుట్టించుకున్న తీరునిబట్టీ ఉండేవి. కానీ, ఇప్పుడు ఎక్కడచూసినా మనం వేసుకున్న బట్టల్లాంటి బట్టలే ప్రతిఒక్కరూ వేసుకుని కనబడతారు. ఈ విధంగా ఫ్యాషన్ ప్రజాస్వామ్యం వచ్చేసిందన్నమాట.


అప్పటికీ ఇప్పటికీ FTV లోనో ఇండియా ఫ్యాషన్ వీక్ లోనో వుంటుందనుకునే ఫ్యాషన్ చాపక్రిందనీరులా బట్టలరూపంలో, ఇతర వస్తువుల రూపంలో మన ఇంటికీ, ఒంటిమీదకీ చేరుతూనే వున్నాయి. తేడాఅల్లా, ఇప్పుడది చాలా త్వరగా జరుగుతోంది. ఒకప్పుడు మనకు సౌలభ్యంగా అనిపిస్తేనే అవి పాప్యులర్ అయ్యేవి, కానీ ఇప్పుడు పాప్యులర్ చేసిమరీ మనచేత కొనిపిస్తున్నారు. అంతే తేడా...ఏది ఏమైనా ఫ్యాషన్ మనలో వుంది.ఉంటుంది కూడానూ!

Saturday, November 1, 2008

హిందూమతం Vs సనాతనధర్మం

మతాల గురించి చర్చవచ్చిన ప్రతిసారీ,ఎవరో ఒకరు "హిందూయిజం మతంకాదు. అదొక జీవన విధానం. సనాతనధర్మం." అంటూ, ఏవేవో చెప్పేస్తూ వుంటారు. ఇదివరకూ నేను రాసిన టపాలోకూడా ఇలాంటి వ్యాఖ్య ఒకటొచ్చింది. ఈ వాదన చేసేవారు నిజంగా సనాతనధర్మం యొక్క అర్థం తెలిసీ, ప్రస్తుతం హిందూయిజంలో వున్నపోకడల్ని చూస్తూకూడా ఈ నిరర్థక ప్రయత్నం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు.


సనాతనం అంటే, నశ్వరమూ,ఆది-మధ్యం-అంతం లేనిది. ధర్మం అంటే సహజవిధానం అని అర్థం. రెంటినీ కలిపి అర్థం చేసుకుంటే, మొదలు-తుది లేని ఒక సహజ జీవన విధానమే సనాతనధర్మం. కాకపోతే, అది ఖచ్చితంగా హిందూమతమే అని వీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనేదే నాకొచ్చే సందేహం. అంతేకాక, మనం ప్రస్తుత పరిస్థితుల్లో పాటిస్తున్న హిందూ విధుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా, ఈ వాదన ఎలా చెయ్యగలరనేది మరీ ఆశ్చర్యాన్ని గొలిపే విషయం.


చాలా వరకూ హిందూ స్వాములూ, రాజకీయ నాయకులూ, మతాధిపతులూ,మఠాధిపతులూ, గుళ్ళూగోపురాలలో ప్రస్తుతం విజయవంతంగా అమలులోవున్న హిందూమతానికీ సాతనధర్మంగా పిలువబడే విలువలకీ నక్కకీ నాగలోకానికీ వున్నంత తేడా వుంది. ఆ తేడావల్ల వచ్చిన అతివాదాన్ని తప్పుబట్టడానికి ప్రయత్నించినాకూడా, సనాతనం పేరుచెప్పి "మేము మిగతా మతాలకన్నా, ప్రత్యేకం" అనెయ్యడం చిత్రంగా వుంటుంది. నిర్ధిష్టంగా చూపించగలిగే ప్రత్యేకతల్లా, మిగతామతాలకి ఏకదేవుడూ లేక ప్రవక్తా మరియూ గ్రంధం అయితే, మనకుమాత్రం దేవతలు కోట్లలో దాటుతారు. మతగ్రంథాల్లో మనకు సోలో గ్రంథం అంటూ ఏదీలేదు. మనకిష్టమొచ్చినట్లు ఒకసారి భగవద్గీత అంటే, మరోసారి రామాయణాన్నీ, వేదాల్లో దేన్నోఒకదాన్ని చెప్పెయ్యొచ్చు. అస్సలు సమస్య రాదు.


కానీ, కొంచెం లోతుగా చూస్తే సనాతనధర్మం యొక్క అర్థం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సనాతనధర్మానికి నిర్థిష్టమైన ప్రవక్తలూ,గ్రంధాలూ లేకపోయినా, మూలాధారం మాత్రం అనుభవం మరియూ నమ్మకం. అంటే,ఇతర మతాలలాగా ఎవరో ప్రవక్త అనుభవించి నమ్మిన సిద్ధాంతాలనుకాకుండా, తనంతటతానుగా ప్రతివ్యక్తీ ‘సహజమార్గంలో’(ధర్మ) అనుభవించి నమ్మాలన్నది సనాతనధర్మం యొక్క ఉద్దేశం.ఇక్కడ ఉదయించే ప్రశ్నేమిటయ్యా అంటే, నిజంగా ప్రస్తుతం అమలులోవున్న హిందూమతంలో ఈ లక్షణం ఉందా? అని. నాకైతే లేదనే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఇదితప్పు ఇది కరెక్టూ అని శాస్త్రాలుపట్టుకుని తయారుగా వుంటారు. చివరికి కాలకృత్యాలు తీర్చుకోనేప్పుడు కూడా జంధ్యం ఎక్కడ చుట్టుకోవాలో చెప్పే హిందూమతం, ‘సనాతనధర్మం’ ఎలా అయ్యిందో అబ్బురపరిచే చిత్రమే కదా!


క్రీస్తుపుర్వం దాదాపు 6,000 సంవత్సరాల పుర్వంనాటి వేదాలు ఈ సనాతనధర్మానికి మూలమని చెబుతారు. మౌఖికంగా చెప్పబడి ఆతరువాత ఎప్పూడో సంస్కృతంలో రాయబడాయిగనక ఈ వేదాలు ఆటోమేటిగ్గా హిందూ మతానికి సంబంధించినవే అని మనవాళ్ళ గట్టినమ్మకం.మరైతే "ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి"(సత్యం ఒక్కటే.దాన్ని విభిన్నమైనవ్యక్తులు వివిధరకాలుగా చెబుతారు) అన్న వేదవాక్కుని మనవాళ్ళు పక్కనబెట్టి వాళ్ళు వేరే మతమోళ్ళు, మతమార్పిడి చేస్తున్నారని ఎలా అంటారు? ఆ మతాన్నికూడా సత్యాన్ని చేరేందుకుగల ఒక విభిన్నమార్గంగా ఎందుకు అనుకోరు?


నిజానికి సనాతనధర్మం ఒక cosmopolitan పోకడలాగా అనిపిస్తుంది. మనిషి సంతోషాన్నీ,మనిషిలోని దైవత్వాన్నీ ఈ ధర్మం ప్రేమిస్తుంది, ఆకాంక్షిస్తుంది."సర్వే భవంతి సుఖిన:,సర్వే సంతు నిర్మాయ:,సర్వే భద్రాణి పష్యంతి, మా కశ్చిద్ దు:ఖ భగభవేత" అంటూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్నీ, సంతోషాన్నీ కోరుకునే సనాతనమెక్కడ ! హిందూమతమెక్కడ? ఏవరు ఏం చేస్తే పాపమో, ఎవరు ఏ పని చేస్తే పుణ్యమో, దానికి పరిహారమేమిటో, పుణ్యంపురుషార్థాలేమిటో చెబుతూ, జీవితంలోని సహజత్వాన్ని చంపేస్తూ, రూల్సుతప్ప అనుభవానికీ,నమ్మకానికీ అసలు విలువివ్వని హిందుమతమా సనాతనం?


అందుకే, ప్రస్తుతం నేను రోజువారీగా చూస్తున్న హిందూమతం సనాతనమంటే నాకు అంగీకారాత్మకం కాదు. ఎవరైనా ఆ సనాతనధర్మం మన హిందూయిజం అని భ్రమపెట్టడానికి తయారైతే అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను.

అసతోమా సద్గమయా
తమసొమా జ్యోతిర్గమయా
మృత్యొర్మా అమృతంగమయా

అంటూ, బూటకం నుంచీ నిజానికీ, అంధకారంనుంచీ వెలుగులోకి, చావునుంచీ బ్రతుకులోకి నడిపించే సనాతనధర్మం నాకు శిరోధార్యమేగానీ, ఇక్కడ చర్చలకు పెట్టే హిందూమతం అదేనంటే నమ్మే మూర్ఖత్వం మాత్రం నాలో ప్రస్తుతానికి లేదు. సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు. అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది.


****