Friday, July 31, 2009

ఇక్కడే - ఇప్పుడే


విశ్వం అనంతమైతే

అదెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే
ఐతే...
నువ్వెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే

విశ్వంలా ఎప్పటికీ ఉండే నువ్వు
ఇక్కడ - ఇప్పుడు ఉన్నట్లే
అందుకే...
నువ్వెవరైనా
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి
ఇంతకన్నా మంచి సమయం మరొకటి లేదు.

here and now

if the universe is infinite
wherever it is
and 'forever' does exist
wherever it does
then wherever you are
you are forever
and
whenever you are
you are here, and now
and
whoever you are
I cannot find
a better way
to say
I love you

(శేఖర్ కపూర్ కవితకు స్వేఛ్ఛానువాదం)

****

Thursday, July 30, 2009

నిడదవోలు మాలతి గారి పునరావలోకనం పై నా పునరాలోచన


"(చివరకు మిగిలేది) నవల చదవడం ముగించిన తరవాత ఈ నవల సందేశం ఏమిటి అని చాలా ఆలోచించవలసివచ్చింది. మగవారి మనోభావాలు ఇంత సంకుచితంగా తమ పరిధిలోనే ఉంటాయా? మగవారిలో కనీసం దయానిధిలా ఆలోచించేవారు వుండటానికి అవకాశం ఉందనా? ఇలా జీవితం విశ్లేషిస్తూ కూచుంటే జీవితం నిజంగా అనుభవించడం గానీ, జీవితంలో సాధించేది గానీ ఏమీ ఉండదనా?" - నిడదవోలు మాలతి

నేను రాసిన "చివరకు మిగిలేది ఎందుకు చదవాలి?" వ్యాసం చదివిన ఒక మిత్రులు నిడదవోలు మాలతిగారు ఈ నవల మీద ఎప్పుడో రాసిన "పునరావలోకనం"ని pdf రూపంలో పంపించారు. మొత్తంగా చదివిన తరువాత కొంత ఆశ్చర్యం మరికొంత నిరాశ కలిగాయి. వ్యాసం చాలా శాస్త్రీయంగా సాగినా, నా భావాలకు ప్రతికూలంగా ఉండటం వల్లనో లేక నవల ముందిచ్చిన ఉపోద్ఘాతాన్ని పట్టుకుని మొత్తం నవలని (తన ప్రెజుడిస్ లతో కలిపి) జడ్జిచేసిన విధానం వల్లనోగానీ నిరాశ ఎక్కువ కలిగింది. అందుకే ఆ వ్యాసాన్ని ఉటంకిస్తూ దానిపై ఒక పునరాలోచన నాతరఫున్నుంచీ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

ఒక రచనను ముందుమాటా వెనుకమాటల్లాంటి ‘కొసరుమాటల’ తులనల ద్వారా (అవి స్వయంగా రచయిత రాసినవైనా సరే) బేరీజు చెయ్యడం పాఠకులకు చెల్లితే చెల్లచ్చేమోగానీ విమర్శకులకు చెల్లదనేది నా నమ్మకం. ఎందుకంటే విమర్శకుడి ఉద్దేశమే to see the work in itself, as IT IS. అలాంటప్పుడు మూల రచన ముందుండగా దాని ముందు వెనుకల్ని త్రవ్వి నవల స్థాయిని నిర్ణయిస్తాను అనేది విమర్శన స్ఫూర్తికే విరుద్ధం. పైగా "అతను (దయానిధి) జీవించి ఉండగానే ఇక ఏమీ లేదు అనుకోవడం నిరాశావాదం" గనక, నవలకు సామాజిక ప్రయోజనం ఏర్పడలేదని. "నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీ లేదు" (పుట 4) గనక పాఠకులకు ఈ నవల జీవితంపై కలగ జేసిన ధృక్పథం ఏమీ లేదని తేల్చెయ్యడం చాలా హ్రస్వదృష్టి అనిపించింది.

విమర్శకురాలు "అప్పట్లో అందరూ చదువుతున్నారనో,ఎవరో చదవమన్నారనో" యాభైసంవత్సరాల క్రితం ఈ నవలను చదివి "మనసును రంజింపజేయగల రచన"కాదు అని నిర్ధారించుకునేశారు. ఆ తరువాత ఇంత కాలానికి "మల్లీ ఈ వ్యాసంకోసం" చదివారు. మనసుకు హత్తుకోలేదు గనక "మళ్ళీ చదువుతానా అంటే ఏమో" (పుట 5) అనే సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి pre- conceived bias, prejudice నేపధ్యంలో నవల ‘విలువని’ పాఠకుడి కోసం ఎత్తి చూపడం సాధ్యమేనా? ఒకవేళ ప్రయత్నించినా నిస్పాక్షికమైన విమర్శన సాధ్యమేనా? అనేవి నా సమస్యలు. నావరకూ ఆ నిస్పాక్షికత కరువయ్యిందనే అనిపించింది.

విమర్శకురాలి విశ్లేషణలో నవల యొక్క చరిత్ర, ఈ నవలకి ఖ్యాతి నార్జించి పెట్టిన (రెండు) విశేషాల గుర్తింపుని నేను అంగీకరిస్తాను. ముఖ్యంగా ఈ నవలా విశేషాలైన సైకో అనలిటికల్ అప్రోచ్ (మానసిక విశ్లేషాత్మక విధానం), ‘జీవితం గురించి అభిప్రయాల సిద్ధాంతీకరణ’ నన్ను ఒక పాఠకుడిగా అమితంగా ప్రభావితం చేసిన అంశాలు. కాకపోతే వ్యాసంలో ఈ రెండు విషయాలనీ అపరిపక్వంగా అర్థం చేసుకున్న విమర్శన కనిపిస్తుందేతప్ప నవల సార్థకతను గుర్తించే నిశితదృష్టి కనిపించదు. అదే నిరాశను కలిగిస్తుంది.

సైకో అనలిటికల్ అప్రోచ్ సాహిత్యంలో ఎలా ఉపయోగిస్తారో తెలిసిన విమర్శకురాలైతే "దయానిధి వాదనల్లో, ఇతివృత్తం విషయంలో నేలవిడిచి సాము చేస్తున్నట్లు అనిపిస్తుంది" (పుట 1) అని నిర్ణయించి ఉండరు. ముఖ్యంగా "కథంతా దయానిధి అనబడే ఒక తాత్వికునికోణంలో నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు" (ఫుట 2) అని సుస్పష్టంగా గుర్తించిన పిదప ఇటువంటి జడ్జిమెంటుని వెలువరించడం ఆశ్చర్యకరం. తత్వచింతన, మానసికవిశ్లేషణ,ఆలోచన,భవ్యోద్రేకం స్థూలజగత్తుకు చెందిన ప్రక్రియలు కావు. భావజగత్తుకు చెందిన మానవ అంతరాళాల్లో అవి జరుగుతాయి. దాన్ని "నేలవిడిచి సాముచెయ్యడం" అనము. కళాసాధన అంటాము. కళాయజ్ఞం అని ప్రశంసిస్తాము. తల్లి, కోమలి,అమృతం,సుశీల, ఇందిర, నాగమణి, కాత్యాయని ఎవరూ దయానిధికి పూర్తిగా అర్థం కారు. సాహిత్యంలోనే కాదు నిజజీవితంలో కూడా ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం కారు. కానీ, దయానిధి స్తూలజగత్తును మీరిన తన తాత్విక చింతనద్వారా భావజగత్తుకు చేరువై, వాళ్ళను మనకన్నా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే నవల ఉద్దేశం కూడా.

తల్లి నైతిక ప్రవర్తన దయానిధిని "బాధిస్తూంటుంది"(పుట 2) అని విమర్శకురాలు స్వీయప్రకటన కావించేసి, "దయానిధిలో ఆమె దుష్ప్రవర్తనకి వెనుకనున్న కారణాలు ఏమిటి అనిగానీ, ఆమెని అర్థంచేసుకోవాలన్న తపన, వాటిని అధిగమించి తాను సమపార్జించిన జ్ఞానం ద్వారా తన జీవితాన్ని చక్కదిద్దుకుందాం అన్న అవేశం కనిపించవు." అనే నిర్ధారణకి చాలా లాజికల్ గా వచ్చేసారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, "యవ్వనమొక ప్రాచీనశక్తి... నిశోధి తెరుచుకున్న ద్వారాలమధ్య ఆత్మహత్య చేసుకున్న యవ్వనపు శక్తి, సంస్కారాన్ని కోరదు... ఏ చదువు ఈ అస్థిపంజరపు నిర్మాణాన్ని మార్చగలదు? బుర్ర,మెదడు, యివి దాస్యానికి అంతరాయాలే." అన్న తాత్వికుడు దయానిధి. శారీరకశక్తులపైన ఒకస్థాయి పరిపూర్ణ అవగాహనా, వాటిని అధిగమించలేని బలీయమైన బలహీనతల్లో ఓలలాడిన ఇతడికి తల్లి "దుర్నడత"ను అర్థం చేసుకోవడం నిజంగా కష్టమా? తల్లి ప్రవర్తనని దయానిధి ఏనాడో అర్థం చేసుకున్నాడు. కానీ షేక్స్పియర్ హేమ్లెట్ లాగే ఆ అర్థాన్ని అంగీకరించే విఫలయత్నం (నవలలోని ‘చీకటి సమస్య’ ప్రకరణ దాని గురించే) చేస్తూవచ్చాడు. coming to terms with that reality through self realization is the effort. ఇక్కడ ఆ యత్నం ముఖ్యం. దాని ఫలితం కాదు.

విమర్శకురాలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేసి, అమృతంలోని తల్లి సారూప్యతని చూసి దయానిధి అమృతానికి దగ్గరయ్యాడని, అమృతంతో "అనుభవం" కారణంగా తల్లి నడవడిక అర్థమయ్యిందని, తల్లికి పట్టిన దురవస్థే అమృతం కూతురికి పడుతుందన్న స్పృహకన్నా, అమృతం కూతురు తనదా కాదా అన్న ధ్యాసే ఎక్కువ అని తీర్మానించి (పుట 2) దయానిధిని నిజాయితీని పాఠకుడు శంకిస్తాడేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తూ విమర్శకురాలు దయానిధి నిజాయితీ మీద ప్రశ్నచిహ్నాన్ని ముద్రించేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనల్లోని అమృతం "ఆడతనాన్ని" విమర్శకురాలు గుర్తించలేకపోవడం.

అమృతం-దయానిధి కలయిక ప్రేమోద్రేకమే అయినా, పరిస్థితి అమృతం కల్పించింది అనేది కాదనలేని నిజం. ఆ కలయిన అమృతం తన సంసారాన్ని నిలబెట్టుకోవటానికి ఒక "అవసరం" అయినంత మాత్రానా, తనకు దయానిధి పట్ల ఉన్న ప్రేమ మలినమైపోదు. ప్రేమలేని దయానిధికి తన అపేక్షని అందించి, తన అవసరాన్ని పూర్తి చేసుకున్నంత మాత్రానా అమృతం స్వార్థపరురాలైపోదు. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పదు. స్త్రీపాత్రలకున్న సహజ అవసరాలు, కుటుంబం కోసం వాళ్ళు ఆడేనాటకాలూ బహిరంగంగా చర్చించాలంటే మనకు బెదురు. తేటతెల్లంగా కనిపించినా, కళ్ళు మూసుకుని "పవిత్రత జపం" చేస్తేనే మనకు ఆనందం.

నిజానికి ఈ కలయిక తరువాత ఎక్కువ గిల్ట్ ఫీలయ్యేది దయానిధి. అతని పూర్వపు భావాలూ,ఆదర్శాలూ,అభిప్రాయాలకీ ఈ నిజతత్వానికీ ఎంతటి బేధముందో తెలుసుకుని భయపడేది ఇతనే.తనకు నిజస్వరూపాన్ని చూపించి హాయిగా నిద్రపోతున్న అమృతానికి ముఖం చూపించలేక "పారిపోయేది" దయానిధే. వెళ్తూవెళ్తూ నిద్రపోతున్న అమృతాన్ని చూసి "అంత నిద్రపోవడానికి ఎంతటి నిర్మల హృదయమో! కడసారి పవిత్రంలో పవ్వళించిన అమృతం" అనుకోవడమూ దయానిధికే సాధ్యం. ఇక్కడ దయానిధి అమృతానికి అపవిత్రత,చెడుగు,దుర్నీతి ఆపాదించలేదు. అమృతం నిజరూపాన్ని (ఒక స్థాయిలో విశ్వరూపాన్ని) చూసిన కళ్ళతో "ఈ వ్యక్తుల్నీ, ఈ స్థలాన్నీ"చాడలేను అనుకుని వెళ్ళిపోతాడు. ఆ కలయికని అవినీతి అనుకోని దయానిధి నిజాయితీని పాఠకుడు ఎందుకు శంకించాలి? అమృతం అప్పటికీ పవిత్రమే అనుకునే దయానిధి మనసులో ఉన్న వికారమేమిటి? అది self realization అనుకోవాలా లేక self obsession అని విమర్శకురాలిలాగా తీర్మానించాలా?

దయానిధి-అమృతం కలయిక ఇక ఎత్తైతే,(తనకు పుట్టిందనుకుంటున్న) అమృతం కూతుర్ని చూడటానికి దయానిధి వెళ్తే అక్కడ అమృతం ప్రవర్తన మరొక ఎత్తు. దయానిధి ఇంట్లో, అత్తా-భర్తలు లేని సమయంలో, ఒంటరితనంలో దయానిధిపై అమితమైన అపేక్షను చూపిన అమృతం అక్కడ మచ్చుకైనా కనబడదు. బిడ్డద్వారా సంసారాన్ని సుస్థిరపరుచుకున్న గృహస్థురాలు కనిపిస్తుంది. దయానిధి చూసిన నిజరూప ఛాయలుకూడా అమృతంలో కానరావు. మరో కొత్త రూపంలో దర్శనమిస్తుంది. అమృతం ఇంటికి దొంగచాటుగా వెళ్తున్న దయానిధి పరిపరి విధాలుగా వారి "కలయిక" తరువాతి కలయికని ఊహించుకుంటాడు, ఆ కలయికలోని ప్రేమను కనీసం రహస్యంగానైనా వ్యక్తపరిచే అమృతాన్ని ఆశిస్తాడు. కానీ...ఈ అమృతం వేరు. ఆ అమృతం వేరు అని గ్రహిస్తాడు. తన జీవితం "బండి మలుపు" తిరిగిందని గుర్తిస్తాడు.

మరో ముఖ్యపాత్ర కోమలి గురించి విమర్శకురాలి ధృక్కోణానికీ అమృతం పట్లగల అవాజ్యనీయమైన అభిమానానికీ ఏదో బలవత్తరమైన కారణం ఉందనిపిస్తుంది. కోమలిని ప్రాగ్మాటిక్ అనీ, జాణ అనీ, లౌక్యం తెలిసిన స్త్రీ అని విమర్శకురాలు నవలమొత్తం ఆకళింపు చేసుకుని తేల్చేస్తారు. దయానిధికి కోమలిపట్లవున్న దైహికవాంచ, మానసిక ప్రేమని దయానిధి పాత్రలోని వైరుధ్యంగా తేల్చేస్తారు. ఇకడుగు ముందుకేసి, దయానిధి ధృక్పధం అన్ని స్త్రీపాత్రల పట్లా sexist అనే అర్థంవచ్చే విధంగా "అతని మనోవైజ్ఞానిక విశ్లేషణ ఒకచోటా శారీరకమైన "కళ్ళు" (పుట 2) మరొకచోటా ఉంటాయి" అని చెప్పి నవలలోవున్న (తను అనుకుంటున్న) అంగాంగవర్ణనల గురించి చెప్పారు.

కోమలి ఒక కుటుంబ స్త్రీ కాదు. తనది సామాజికంగా అమోదమైన పుట్టుకకూడా కాదు. కులగోత్రాలూ,చదువూసంస్కారాలూ లేవు. జీవితం ఒక గాలివాటు గమనం. ప్రపంచానికి నిమిత్తం లేని బ్రతుకు. అయినా దయానిధి ఆమెను వాంచించాడు. ఈ వాంఛకు కారణం తన యవ్వనం, కోమలి సౌందర్యం అని గ్రహించాడు. "ఇంద్రియాలు పీకేస్తున్నాయి. పల్చటి ఎముకలు చల్లటి మాంసం - వీటికి తన యవ్వనం దాస్యం చెయ్యక తప్పదు" అని తెలుసుకున్న తాత్వికుడు దయానిధి.ఆరంభ యవ్వనం నుంచీ ఫ్రౌఢయవ్వన పరిణామ దశవరకూ సౌందర్యశక్తులు ప్రబలంగా పనిచేస్తాయనే ఎరుక కలిగిన జ్ఞాని దయానిధి. కోమలి సౌందర్యం దయానిధిని చిత్రవర్ణ కిమ్మీరితం చేసింది. అందుకే "చదువు లేకపోతే చెప్పించొచ్చు, సంపర్కం వల్ల సంస్కారం తెప్పించొచ్చు, ఎట్లాపడితే అట్లా తయారు చేసుకోవచ్చు, కానీ సౌందర్యం ఎక్కడనుంచీ తేగలం..." అని ప్రశ్నిస్తాడు. "కోమలే కావాలి -ఇంకెవ్వరూ (తన యవ్వనానికి) పనికిరారు" అని నిర్ణయిస్తాడు. దైహిక వాంచలోని తాత్వికసిద్ధాంతాన్ని ఇంత చక్కగా చెప్పిన రచయిత తెలుగులో ఇంకెవరున్నారు? ఆ అనుభవాన్ని అందుకుని సిద్ధాంతీకరించిన పాత్రలెన్నున్నాయి?

కోమలిని కలవటానికి వెళ్ళిన దయానిధి "ఆకస్మికంగా ఆమెని ప్రేమించడం జరిగింది" అందుకే తిరిగొచ్చేశాను అనటంలో విమర్శకురాలికి అతని వైరుధ్యం కనిపించింది. కానీ అదొక సహజమైన పరిణామం అనే ఆలోచన రాకపోవడం విచారకరం. దయానిధి ఆ పరిణామానికి తనదైన కారణంకూడా చెబుతాడుకూడా. "(మనిషి) వాంఛించిన వస్తువుల్ని ఎప్పూడూ ప్రేమించలేడు. వాంఛించడం అంటే అనుభవించడం, అనుభవించడంవల్ల వస్తువు నశిస్తుంది. నశింపు కాకుండా చేసేదే నిజమైన ప్రేమ అనుకుంటాను" అని సిద్ధాంతీకరిస్తాడు. అంతటితో ఆగక "నాకు చంద్రుడూ, నక్షత్రాలూ, మేఘాలూ, హిమాలయా పర్వత శిఖరం, కోమలీ అందరూ సమానులే. ఇవి లేకపోతే నే జీవించలేను. వీటిని వాంఛించను. ప్రేమిస్తాను." అని కోమలికి తన జీవితంలోని ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఇంతకన్నా ఉత్తమమైన ప్రేమ,స్వార్థరహితమైన ప్రేమ ఉంటుందా? అంతకన్నా గౌరవం "సౌందర్యానికి" లభిస్తుందా? ఇందులో వైరుధ్యంకన్నా ఒక సిద్ధాంత పరిణామం కనిపిస్తుంది. ఒక తాత్వికుడి భావప్రగతి కనిపిస్తుంది.

ఇక కోమలి గురించి. కోమలి కుటుంబ స్త్రీ కాదు కాబట్టి జాణతనాన్నీ, లౌక్యాన్నీ తేలిగ్గా అంటగట్టచ్చు. ఎవరెవరితో తిరిగిందో, ఎంత మందిని డబ్బడిగిందో, ఎంత మందితో తన అవసరాలు తీర్చుకుందో లెక్కగట్టచ్చు. కానీ కోమలి లోని ఉనికే అర్థంకాని ముగ్ధను, అమాయకత్వాన్ని చూసిన దయానిధి నిజాయితీ మీద మాత్రం విమర్శకురాలికి అనుమానమే. అమృతం అవసరం కుటుంబం కోసం కాబట్టి "పవిత్రం". కోమలి అవసరం తనకోసం కాబట్టి ప్రాగ్మటిజం. ఈ వైరుధ్యం ఎవరిది. నటనకు పట్టంగట్టే మన నైతికతదా? పరిస్థితుల ప్రభావంలో జీవితాల్ని తమదైన విధంగా నిర్దేశించుకున్న ఈ ఇద్దరు మహిళలదా. ఐతే ఇద్దరూ జాణలే. లేకపోతే ఇద్దరూ పవిత్రమైనవారే. రెండూ కాకుండా ఏ జడ్జిమెంటూ లేకుండా ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించే, తాత్వికతను ప్రేరేపించే పాత్రలే. నా ఆప్షన్ మూడోది. ఇక పాఠకుల ఆప్షన్ వారి సంస్కారాన్ని బట్టి వారిది. విమర్శకురాలి కోణం మాత్రం ఇప్పటికీ (నాకు) అభ్యంతరకరమే.

ఒక విధంగా చూస్తే దయానిధి గమ్యం ఎప్పుడూ కోమలే. అయితే, ఆ గమ్యాన్ని చేరడానికి మరిన్ని అనుభవాలు అవసరమై జీవితాన్ని అలాఅలా గడిపాడు.దయానిధి గమ్యం తన తాత్విక చింతనద్వారా ప్రత్యామ్న్యాయ జీవన సిద్ధాంతాల్ని (తనకోసం) తెలుసుకోవడం. అలాంటప్పుడు "కోమలి అసలు స్త్రీయేకాదు. అన్ని శక్తుల్నీ తనలో కలుపుకుని దహించేసే ఒక జ్వాల. సంప్రదాయాలూ, ఆచారాలూ, నైతిక విలువలూ,కట్టుబాట్లు - అన్నింటినీ ముంచెత్తివేసే మహాసముద్రంలోని అఘాతం" అని గ్రహించిన మరుక్షణం తనను అందిపుచ్చుకోవలసింది. ఉన్న జీవన విలువల్ని కాల్చి-ముంచితేగానీ కొత్త సిద్ధాంతం పుట్టదుకదా! కానీ ఆ అద్వితీయ తీరానికి అప్పుడే చేరే ధైర్యాన్ని ప్రోది చేసుకోలేకపోయాడు. పారిపోయాడు. అనుభవాల్ని వెతుక్కున్నాడు. ఆనందాన్ని శోధించాడు. చివరకు కోమలి రాకతో, అప్పటివరకూ సంపాదించుకున్న అనుభవంతో సిద్ధాంతాన్ని స్థిరీకరించుకుంటాడు. అందుకే నవల అక్కడే అంతమవుతుంది.

మరణంతోనే జీవితానికి ముగింపు.కానీ దయానిధి శోధన "చివరకు మిగిలేది"ఏమిటో తెలుసుకోవడం. అది తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న "సత్యం"తో ఎవరైనా విభేధించొచ్చు. కానీ తన తత్వచింతన, దానికోసమై తను చేసిన యత్నాన్ని నిరర్థకం అని తీర్మానించడం సబబు కాదు.కాబట్టి నవల తన సిద్ధాంతంతో కాకుండా తన మరణంతో మరణంతో అంతమవ్వాలన్న ప్రతిపాదన అర్థరహితం (పుట 4). కోమలి గమ్యం కూడా దయానిధే. అందుకే తిరిగొచ్చిన తరువాత "నేనప్పుడు పుట్టలా. నాకు తెలీకుండా అవన్నీ జరిగాయి. ఇప్పుడన్నీ తెలుసు నాకు. మీదగ్గరే ఉండనియ్యండి...లేకపోతే చచ్చిపోతాను!" అంటుంది. దయానిధికి, కోమలి " సంపూర్ణంగా ఏర్పడలేదని" ఎప్పుడో తెలుసు. ఈ చేతులు మారిన ప్రయాణంలో పూర్ణత్వాన్ని సంతరించుకుని తిరిగొచ్చింది. తమతమ అనుభవాలు పరిపూర్ణం చేసిన రెండు జీవితాలు ఒకదానికొకటి గమ్యమై వీరి కలయిక జరిగింది. అందుకే కులస్త్రీ అయిన అమృతాన్ని త్రోసిరాజని కోమలి ఈ నవలానాయిక అయ్యింది.

విమర్శకురాలు దయానిధి మీద వేసిన మరో అపవాదు "తనచుట్టూ వున్న అమ్మాయిలందరూ తనకొసం తపించిపోతున్నారని, తనపై ఉచ్చులు పన్నుతున్నారనీ మురిసిపోతూ రోజులు గడపటం" (పుట 3). నవలలోని ‘అనుభవానికి హద్దులు లేవు’ ప్రకరణ మొత్తంగా ఈ ఆకర్షణ,వికర్షణ,ప్రకర్షణలదే. ఇందులో దయానిధి మురిసిపాటుకన్నా, స్త్రీత్వంలోని మార్మికతను అర్థంచేసుకునే ప్రయత్నం కనిపించకపోవడం శోచనీయం. యవ్వనాకర్షణలోని స్వేచ్చననుభవిస్తున్న స్త్రీపాత్రల మధ్యనున్న సౌందర్యాస్వాదకుడైన యువకుడు ఆ స్త్రీల స్త్రీత్వాన్ని గురించి అర్థం చేసుకునే ఆలోచన చేస్తే అది సత్యాన్వేషణ కాదా? ఉన్న ఒక్కమగాడినీ తమవైపు తిప్పుకోవాలనే అసంకల్పిత ఆలోచన అక్కడున్న కోమలి,సుశీల,నాగమణి,అమృతం తమదైన విధంగా చెయ్యటం అత్యంత సహజపరిణామం. కాలేజీ టుర్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇది కొత్తకాదే! ఒకమగాడు పదిమంది ఆడవాళ్ళ మధ్యనున్నా అదే జరుగుతుంది. ఒక స్త్రీ పదిమంది స్నేహపూరితమైన మగాళ్ళమధ్య ఉన్నా ఈ ప్రయత్నాలు తప్పవు. వాటి ఉద్దేశం "అనుభవించడం" కానఖ్ఖరలేదు. కానీ ఆకర్షించడం వరకూ అసంకల్పితంగా జరిగేదే.

మూల ఉద్దేశాల్ని గాలికొదిలి, ఆపాదనల మధ్య తీవ్రమైన ప్రతిపాదనలు చేసిన ఈ వ్యాసం యొక్క నిబద్ధత శంకించదగినదిగా అనిపించింది. దయానిధిలోని తాత్విక చింతనని మగవారిలోని సంకుచిత భావనలు అని నిర్ణయించి, విమర్శకురాలు చేసిన వ్యాఖ్య All men are bastards అనే (ఇక్కడా మరో స్త్రీని అవమానిస్తున్నామన్న స్పృహకూడా లేని) పిడివాదస్త్రీవాదుల భావజాలానికి అతిదగ్గరగా అనిపించింది. ఈ పునరావలోకనం ఎప్పుడు చేశారో తెలీదు. కానీ ఈ పునరావలోకనం మీద ఒక పునరాలోచనమాత్రం అత్యంత అవసరం అని నా నమ్మకం.

*****

Tuesday, July 28, 2009

‘చివరకు మిగిలేది’ ఎందుకు చదవాలి?


"భావాలు చాలా చిత్రమైనవి. సొంతభావాలు,ఎవరివోలా కనిపిస్తాయి. ఎవరో చెప్పినవి మన సోంతంలా అనిపిస్తాయి. నిజంగా కొత్తభావాలంటూలేవు ఆకలి,నిద్ర,దాహం,ఆకర్షణ అసంతృప్తి, జీవితంపై మమకారం - అందరికీ ఇవి సమానమే. కొత్తవి ఎట్లావస్తాయి? భావాలు మానవుల్నందరినీ ఏకం చేస్తాయి. వాటిని చెప్పడంలో ప్రయోగించే వివిధ భాషలు, మానవుల్ని విడదీస్తాయి" - బుచ్చిబాబు, చివరకు మిగిలేది.

నచ్చిన పుస్తకాలు చాలా ఉంటాయి. కానీ జీవితాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు కొన్నే ఉంటాయి. వాటి గురించి ఎప్పుడు రాయాలన్నా చిక్కే. ఎందుకంటే, చాలా వరకూ ప్రభావితం చేశాయనుకున్న పుస్తకాలుకూడా కొన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే "నిజమా!" అనే సందేహం కలుగుతుంది. అప్పట్లో ఈ పుస్తకం నన్ను ప్రభావితం చేసింది అని ఎందుకనుకున్నాను అనే ప్రశ్నకూడా ఉదయిస్తుంది. బహుశా ఆ వయసుకి అవసరమైన జ్ఞానాన్ని లేక అప్పటి సమస్యలకు సమాధానాల్ని ఆ పుస్తకాలు ఇవ్వడం వలన "ప్రభావితం" చేశాయి అనే భావన ఉన్నా, మళ్ళీ తిరిగి చూసుకుంటే జీవితాంతం ప్రభావాన్ని వీడిన పుస్తకంగా అది కనిపించకపోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు "నా జీవితాన్ని ప్రభావం చేసిన పుస్తకం" అని ఏ పుస్తకాన్ని గురించి చెప్పాలన్నా నాక్కొంచెం బెరుగ్గా ఉంటుంది.

ఇప్పటివరకైతే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ పుస్తకాన్ని నిస్సందేహంగా జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకంగా చెప్పగలను. ఇంకో పది సంవత్సరాలకు మారితే...తెలీదు. ‘చివరకు మిగిలేది’ని నేను ఎనిమిదో తరగతి చదివినప్పుడు ఒక లెండింగ్ లైబ్రరీ నుంచీ తెచ్చుకుని చదివాను. సగానికి పైగా అర్థం కాలేదు. కానీ కొన్ని భాగాలు మాత్రం వెంటాడుతూనే ఉండేవి. ముఖ్యంగా ‘కోమలి’తో దయానిధి ప్రేమ. నాగమణికి దయానిధిపై గల ఆసక్తి. సుశీలకు దయానిధిపట్ల ఉన్న ప్రేమ-విముఖత. అమృతంలోని "ఆడతనం". ఇందిర సాధారణత్వం. దయానిధి తల్లి పాత్రలోని మర్మం. జగన్నాధం పాత్రలోని చలాకితనం. శ్యామల ‘సౌందర్య రాహిత్యం’ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. తెలిసిన మనుషులు, అర్థమయ్యీ కాని భావాలు ఒక విధమైన గుర్తుల్ని మిగిల్చాయి. అజ్ఞాతంగా, అసంకల్పితంగా ఈ నవల నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిందన్న విషయం కొన్ని సంవత్సరాలకిగానీ తెలిసిరాలేదు.


అప్పటి నుండీ ఇప్పటి వరకూ నా జీవితంలోని వివిధ దశల్లో ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏదో కనుక్కుంటూనే ఉన్నాను. కొత్త అర్థాల్ని వెలికితీస్తూనే ఉన్నాను. పుస్తకం తన మార్మిక పార్శ్వాల్ని అవిష్కరిస్తూనే ఉంది. పాత్రలు ఉల్లిపొరల్లాగా తమ వ్యక్తిత్వాల్నీ,అస్తిత్వాల్నీ ఒక్కో పొరగా విడిచి విడర్చి చూపుతూకూడా, మనసుకు పూర్ణంగా అవగతం కాకుండానే మిగులుతున్నాయి. నాయకుడు ‘దయానిధి’ నవలలో "జీవితానికి అర్థం ఏమిటి?" అని అడిగినట్లు, "చివరకు మిగిలేది లో ఏముంది?" అని ఇప్పటికీ ప్రశ్నించుకుని కొత్తకొత్త సమాధానాలు నాకైనేను కనుక్కొని సమాధానపరుచుకుంటూనే ఉన్నాను. "ఇది ఇంతే" అనే సమాధానం ఇప్పటికీ దొరకలేదు. దొరకాలని కోరుకోవడం కూడా లేదు.

ఈ నవల నాకు అంతగా నచ్చడంతో పాటూ నా జీవితాన్ని ప్రభావితం చెయ్యడానికి గల కారణాలు రెండు. ఒకటి ఈ నవల శైలి. రెండు నవల విషయంలోని తాత్విక కోణం, ఆ తాత్విక చింతనం యొక్క సిద్ధాంతీకరణ.

ఈ నవల శైలి గురించి "ప్రొఫెషనల్"గా చెప్పగలిగే జ్ఞానం నాకు లేకున్నా, ఈ నవల తీరులోని మానసికవిశ్లేషణాత్మకత (సైకో అనలిటికల్ అప్రోచ్) నన్నెప్పుడూ ఆకట్టుకుంది. ఏదో కథ చెబుతున్నట్లు కాకుండా, తన మనసునీ, ఆలోచననీ పంచుకున్నట్లుగా నాయకుడు దయానిధి తరఫునుంచీ సాగే వివరణ ఈ పుస్తకానికి అవసరమైన "ఆత్మ"ని అందించిందనిపిస్తుంది. కథలోని పాత్రల్ని, పరిస్థితుల్నీ వ్యక్తిగత-సామాజిక ‘విలువల’ కోణంలోంచీ కాకుండా, తన స్వతంత్ర్యాలోచన ద్వారా అర్థం చేసుకోవాలనుకునే నాయకుడి తపనను ఆవిష్కరించే ఈ నవలా శైలి అద్భుతం అనిపిస్తుంది. బహుశా ఈ శైలివల్లనే రచయిత బుచ్చిబాబుకూ నాయకుడు దయానిధికీ మధ్యనున్న తేడా అప్పుడప్పుడూ చెరిగిపోయినట్లుగా భావించాల్సి వస్తుంది. "జీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి కథగా సమకూర్చడంతో తాను పొందిన అనుభూతిని కళగా మార్చి ఇతరులతో పంచుకునేటందుకు కృషి చేసేవాడు కథకుడు. కథకుడు చూసినవీ, అనుభవించినవీ, హృదయంతో తెలుసుకున్నవీ అతడితో కలిసిపోయి ధృక్పథం ద్వారా మార్పులకు గురై కొత్త స్వరూపంతో కొంత కాలానికి కథగా ఆకృతి తెచ్చుకుంటుంది" అని బుచ్చిబాబు బహుశా అందుకే అన్నాడేమో!

ఈ నవల శైలి కారణంగా పాఠకుడు దయానిధి హృదయంలో మిళితమై, మెదడు అలోచనల్లో భాగమై ప్రయాణించే, అనుభవించే, ఆలోచించే అవకాశం పొందుతాడు. అందుకే నవల చదివిన ప్రతి పాఠకుడూ అదే అనుభవాల్లోంచీ వేర్వేరు సమాధానాల్ని, పాఠాల్నీ అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. రచయిత తన అనుభవాల్లోంచీ మందుచీటీల్ని రాసి పాఠకుడిని ఉద్ధరించే ప్రయత్నం చెయ్యకుండా, తన అనుభవంలోకి ఆహ్వానించి తనతొపాటూ ప్రయాణించే అవకాశం ఇవ్వడం ఎంతైనా ముదావహం కదా!

నవలలోని తాత్వికత మరో ఆకట్టుకునే అంశం. పాఠకుడి అంతరాళాల్లో శోధనకు ప్రేరేపించే విషయం. "మనుషులందరికీ మనసుంటుంది. కొందరు దానిని గుర్తించనే గుర్తించరు. అనేకులకు దాని శక్తేమిటో అసలు తెలియదు. మనసు ఎంతో దూరం పోగలదు. దానికి ఎన్నో శక్తులున్నాయి. ఆచరణలోకి తీసుకొస్తున్న కొద్దీ ఒక్కోశక్తీ మనకు తెలిసి వస్తుంది" అంటాడు బుచ్చిబాబు. బహుశా ఆ శక్తే దయానిధిని జీవితాన్ని కేవలం జీవించడానికి కాకుండా జీవితాన్ని గురించి ఆలోచించడానికి పురిగొల్పుతుంది. దయానిధిది స్థూలజగత్తు కాదు. భావజగత్తు. ఒక తాత్విక జగత్తు. నవలంతా స్థూలజగత్తులోని సంకుచిత జీవితంలోని పరిధిని తన ఆలోచనలతో, మనసు శక్తితో విశాలపరుచుకోవడానికి దయానిధి చేసే ఒక యజ్ఞం.

ఈ యజ్ఞాన్ని భౌతికజగత్తు కోణంలోంచీ చూస్తే ఒక విఫల ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ, స్థూలజగత్తులోని అనుభవాల ఆధారంగా భావజగత్తులో తాత్వికతను వెతుక్కోవడం భవ్యోద్రేకానికి సంకేతం. ఆ భవ్యోద్రేకంలోంచీ వచ్చిన భావస్పష్టత ఒక తాత్విక సిద్ధాంతం అవుతుంది. ఇవన్నీ మనలాగా "సాధారణంగా" జీవించేవాళ్ళం చెయ్యలేం. మన సామాజిక చట్రంలో అలా జీవించడం బహుశా కుదరదేమో కూడా. అందుకే ఆ తాత్విక చింతనని బుచ్చిబాబు దయానిధి చేత మనకోసం చేయించాడు. దయానిధి జీవితం గాలివాటు గమనంలా అనిపించినా, తాత్విక విశ్లేషణతో ప్రధానమైన జీవిత సమస్యలైన ప్రేమ,ధనం, కీర్తి ఒక సైద్ధాంతిక సమన్వయాన్ని సాధించి పాఠకుడికి అర్పించాడు. ఆ అర్పణను అందిపుచ్చుకోవడం మన కర్తవ్యం.

‘చివరకు మిగిలేది’ ఒక కళాత్మకత వాస్తవిక వాదాన్ని అందించే నవల. అది సామాజిక వాస్తవికతకన్నా భిన్నంగా ఉన్నంత మాత్రానా "కల్పన" అని కొట్టిపారెయ్య తగదు. సంఘాన్ని సంస్కరించడానికో, నైతిక విలువలు స్థాపించడానికో ఈ నవల ప్రయత్నించదు. కాబట్టి, ఆ కోణంలో ఈ నవలను చదివితే దయానిధి ఒక విఫలుడిగా కనిపిస్తాడు. సాధకుడిగా కాదు. అందుకే నవల శైలిని అందులోని తాత్వికతల్ని అందిపుచ్చుకోగలిగితే, ఒక మార్మికలోకం సాక్షాత్కరిస్తుంది. ఆ మార్మిక లోకం మన మనోలోకానికి అతిదగ్గరగా ఉంటుంది. మనల్ని మనం కనుక్కోవడానికి, మన అంతరాలాల్లోని కొన్ని పార్శ్వాలతో పరిచయం పెంచుకోవడానికీ ఈ నవల ఉపయోగపడుతుంది.

అందుకే, నవల
"- కాలవగట్టున యిప్పటిలాగే ఏకాంతంలో గడ్డిలో పడుకుని అతను వేసుకొన్న ప్రశ్న "జీవితానికి అర్థం ఏమిటి?" ఈనాడూ అదే ప్రశ్న.
చివరికి మిగిలింది. దానికి సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేటందుకు తను చేసిన యత్నాల జ్ఞాపకాలు - తనలో తాను సమాధానం పడటం - అది మిగిలింది" అంటూ అంతమవుతుంది.

*****

Sunday, July 26, 2009

‘గ్యాంగ్ టాక్’ అందాలు

















మిత్రుడు డెరాల్డ్ జాక్సన్ తీసిన కొన్ని గ్యాంగ్ టాక్ పోటోలు మీ కోసం

*****

Friday, July 24, 2009

కథెప్పుడు మారేను?

కథ ఎప్పుడూ ఇలాగే మొదలౌతుంది...

తలవంచుకుని అబ్బాయి
తలదించుకున్నఅమ్మాయితో
కళ్ళుకళ్ళు కలుపుతాడు
ముసిముసినవ్వులు
ఆకర్షణలూ,కోరికలూ
వయసు ప్రతాపమో, సినిమా ప్రభావమో
ప్రేమలౌతాయి

అప్పుడే...
సమాజం ఒళ్ళు విరుచుకుంటుంది
కులాలూ,గోత్రాలూ
మతాలూ,వర్గాలూ
సామాజిక గౌరవాలూ అంటూ
బేధాల లెక్కలు బేరీజుచేస్తారు
ప్రేమికుల్ని విడదీసి
వారి ఎడబాటుని, విరహాన్ని,
పెట్టుకోని ముద్దుల్ని,కలువలేని కౌగిలింతల్ని
గర్వంగా పద్దురాసి పాతిపెడతారు

ప్రేమికులు ఎదిరిస్తారు
పోరాడి పారిపోతారు
పారిపోయి పెళ్ళాడతారు
బెదురు కుందేళ్ళ సంసారం
ఆనందసాగర మధనం
కొన్నాళ్ళే...ఆ తరువాత
జాడతీసి జోడీని విడదీస్తారు
తెగనరికి న్యాయాన్ని నిలబెడతారు.

సాహసించి పోరాడారు.
పోరాడి హతులుగా మిగిలారు
ఇంతేనా కథ?

కథ ముగింపు మార్చాలి
ఈ కథని కలలో అయినా ఒకసారి తల క్రిందులు చెయ్యాలి!


*హర్యాణాలో ఒక ప్రేమ జంటను ఒకే గోత్రనామం కలిగివుండి, సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకున్నారని మొత్తం గ్రామవాసులందరూ కలిసి చంపేశారు. చంపామని గర్వంగా మీడియా ముందు చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులుకూడా కసాయిలతో చేతులు కలిపారు. పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చునే ఉన్నారు. రాజకీయ నాయకులు కులపంచాయతీల వ్యతిరేకంగా ఒక ముక్కకూడా మాట్లాడటం లేదు. ఈ ఆటవికన్యాయానికి పాశవికంగా బలైన ప్రేమ జంటకు నివాళి ఈ కవిత.

*****

Thursday, July 23, 2009

మతరహిత ప్రభుత - మతరహిత పాలన


"తీర్ధయాత్రలకూ ఇచ్చే సబ్సిడీ రాజ్యాంగ విరుద్ధం" అని రాష్ట్ర హైకోర్టు నిరసించింది. రాష్ట్ర ప్రభుత్వం (మైనారిటీ ఆప్పీజ్మెంటులో భాగంగా) జరూసలేం కు ప్రభుత్వ ఖర్చుతో వ్యక్తిగతమైన తీర్ధయాత్రలు చెయ్యించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఇటువంటి వ్యక్తిగతమైన తీర్థయాత్రలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయొద్దని స్పష్టంగా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


రాజ్యాంగంలోని 27వ అధికరణం ప్రకారం మతపరమైన కార్యక్రమాల నిర్వహణ, ప్రోత్సాహం, ఖర్చుల కోసం ఏ రకమైన పన్నునూ వసూలు చేయడానికి వీల్లేదు. అలాగే ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 245, 246, 266, 283 తదితర అధికరణలకు విరుద్ధమనే పిటిషనర్ల వాదనని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఆర్‌.దవే, జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసిన పిమ్మట ఈ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ సమయంలోనే హైకోర్టు ధర్మాసనం 'ప్రభుత్వ సాయంతో పుణ్యం సంపాదించుకోవటం ఎంత వరకూ సబబంటూ' ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొసమెరుపు.

ఈ ఉత్తర్వుతో జరూసలేం యాత్రలతో పాటు, భవిష్యత్తులో ఆరంభం కానున్న అమరనాథ్‌ యాత్రలూ ఆగిపోతాయి. హజ్‌ యాత్రలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక చట్టం కూడా ఉంది. కానీ ఆ యాత్రల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి అవలంభించాల అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

హైకోర్టు చర్యతో మతంపట్ల ప్తభుత్వం వ్యవహరించాల్సిన తీరుపైగల రాజ్యాంగ స్ఫూర్తికి కొత్త ఉపిరి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధానంతో అయినా భవిష్యత్తులో మన ప్రభుత మతరహిత పాలనను అందిస్తుందనే ఆశ చిగురించింది.

*****

‘గ్యాంగ్ టాక్’ సెలబ్రిటీ



****

Monday, July 20, 2009

నవ్వే సంకెళ్ళు


‘స్వేఛ్ఛగా తిరిగే నీకు మళ్ళీ స్వతంత్ర్యం ఎందుకు?’

అని అడిగిన ప్రతిసారీ
నా కనపడని సంకెళ్ళు శబ్ధం చేసి పెద్దగా నవ్వుతాయి
"స్వతంత్ర్యం అంటే స్వేఛ్ఛగా తిరగటం కాదు
భయం లేకుండా ఉండటం" అంటాయి


ఈ ఫోటో ఆప్ఘనిస్తాన్ బాలికది.
ఫోటో చూడగానే ఏదో దిగులుగా అనిపించింది. ఆ దిగులికి అక్షరరూపం ఇది.

*****

Sunday, July 19, 2009

నిజం చెబితే నేరమా?


"నిజం చెబితే అదేమీ నేరం కాదు. ఇంకా మీకు ఎదురు డబ్బులిస్తాము." అంటున్నారు స్టార్ టీవీవాళ్ళు.

ఈ నిజాలేమైనా మనుషుల్ని కాపాడేవీ, దేశాన్ని రక్షించేవీ అయితే ఏమైనా అనుకోవచ్చు.
కానీ ఇవి కాపురాలు కూల్చేవీ, ప్రేమించిన వాళ్ళను దూరం చేసేవీ అయితే ఎట్లా?!!
అటూఇటూగా మన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలో దివాకరంలా అయిపోమంటున్నారు ‘సచ్ కా సామ్నా’ అనే ఒక టీవీ కార్యక్రమం నిర్మాతలు.
‘మూమెంట్ ఆఫ్ ట్రూత్’ అనే ఒక అమెరికన్ టీవీ షోకి ఇదొక భారతీయ అనుకరణ.


జూలై పదిహేనో తేదీన ప్రారంభమైన ఈ నిజాలు చెప్పే కార్యక్రమాన్ని నేను చూడలేదుగానీ, ప్రోమోలు చూసే కొంచెం ఉలిక్కిపడాల్సొచ్చింది.
ఈ కార్యక్రమానికొచ్చిన ఒక టీచర్ ను యాంకర్ అడిగిన ప్రశ్న... "ఎప్పుడైనా భర్తకు తెలీకుండా ఇంకో మగాడి గడిపాలనుకున్నారా?"
హోరున మ్యూజిక్కు...టీచర్ దిక్కులు చూసింది...భర్త ముఖంలో రంగులు మారాయి...వారి పిల్లలు ఇబ్బందిగా ముఖం పెట్టారు...
"లేదు" అని టీచర్ సమాధానం
"తప్పు సమాధానం" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
టీచర్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు. భర్త మూఖంలో తీవ్రమైన బాధ. పిల్లల్ని చూపించలేదు.
"ఎప్పుడైనా మీరు మీ భర్తను చంపాలనుకున్నారా?"
"అవును"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
ఈ షో తర్వాత వాళ్ళ సంసారం ఏమయ్యిందో తెలీదు.


ఇంకో కుటుంబం
ఒక టెలివిజన్ నటుడు. దాదాపు యాభై అరవై వయసుంటుంది.
యాంకర్ అడిగాడు "మీరెప్పుడైనా వేశ్యా సంపర్కం కలిగి ఉన్నారా?" అని.
"లేదు"
"తప్పు సమాధానం" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
ఈ నటుడికి ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్తో జీవిస్తున్నాడు
తరువాత ప్రశ్న "మీ రెండో పెళ్ళాం మిమ్మల్ని కేవలం డబ్బుకోసం పెళ్ళిచేసుకుందని అనుకుంటున్నారా?"
"అవును"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
యాంకర్ తిన్నగా తలవంకించాడు.
"మీ డ్రీమ్ గర్ల్ ఇప్పటికైనా మీకు దక్కిందా?"
"లేదు. ఇప్పటికీ నా డ్రీమ్ గర్ల కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను. దొరికేస్తే డ్రీమ్ గర్ల్ ఎట్లవుతుంది?"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
యాంకర్ నవ్వాడు.
ముగ్గురు భార్యలూ, గర్ల్ ఫ్రెండ్ ముఖాలు మాడిపోయి కనిపించాయి.
ఆ తరువాత వారి జీవితాలు ఏమవుతాయో తెలీదు.

ప్రేక్షకులు మాత్రం ఆనందిస్తున్నట్లు. తృప్తిగా తలలాడిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
స్టూడియోలో, ఇళ్ళలో ఈ భాగోతాన్ని ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తోంది.
ఇప్పటికి ఈ షోలో పాల్గొనటం కోసం ఇరవై ఐదు లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారు.

‘మానవుడి మనస్సులో ఒక అధోలోకం ఉంటుంది’ అంటారు. అది అంధకారంలో, స్వప్నాల్లో జాగృతమై అక్కడి జంతువులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేసి తమ తీరని కోరికల్ని తీర్చుకుంటాయి. బహుశా అదే మానవ మనోఅధోలోకం కోరికలు ఈ voyeuristic రియాలిటీ టీవీల ద్వారా పూర్తవుతోందేమో!
ఇప్పటివరకూ రియాలిటీ టీవీ అంటే పాటల పోటీలూ, డ్యాన్సుల పోటీలూ వచ్చేవి.
కొన్నాళ్ళకు ముందు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఒకర్నొకరు డంప్ చెయ్యడాలు (M- tv Splits villa), రాఖీ సావంత్ స్వయంవరాలూ ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు చెప్పలేని నిజాలు, చెబితే కాపురాలు కూలిపోయే నిజాలు చెప్పించి మనోరంజనం చేస్తామంటున్నారు.
కానీ....ఆనందిద్దాం! మనలోని అధోలోకాల్ని సంతృప్తి పరుద్ధాం!

*****

జీవితం


జీవితాన్ని గడిపేస్తూ

జీవిస్తున్నాననుకున్నా
భావాలని అనుభవిస్తూ
జీవిస్తున్నాననుకున్నా
అనుభవాల్ని విశ్లేషిస్తూ
జీవిస్తున్నాననుకున్నా
విశ్లేషణల్ని అభిప్రాయాల్ని చేసుకుంటూ
జీవిస్తున్నాననుకున్నా
అభిప్రాయాల్ని ప్రాతిపదికలు చేసుకుంటూ
జీవిస్తున్నాననుకున్నా
ప్రాతిపదికల్ని ప్రణాళికలుగా మలుస్తూ
జీవిస్తున్నాననుకున్నా
జీవితాన్ని గడిపేస్తూ
జీవిస్తున్నాననుకున్నా

కానీ...
ఇప్పుడే తెలిసింది
నేను ప్రణాళికల్లో పడున్నప్పుడు
తనకుతానుగా గడిచిపోయింది జీవితమని

"Life is what happens to you when you are planning other things"
- John Lennon

****

Friday, July 17, 2009

అతిధి


అనుకోకుండా ఆగమనం

నాకన్నా ముందొచ్చి
నా కోసం స్వాగతం

"హలో" అని స్నేహం చేశా
హత్తుకుని జీవితాంతం గడిపేసా
ప్రతిఘడియా వెళ్తాడేమో అని చూశా
కానీ...
నేను పొయ్యేసమయానికి
నాకే వీడ్కోలిచ్చి పంపేసాడు

అతిధి అనుకున్నా...కానీ
నాకే నా జీవితాన్ని అందించి
తను మాత్రం కదులుతున్నట్లు కనిపిస్తూనే
ఎక్కడికీ కదలకుండా సాగనంపాడు

విడిపోతూ వీడుకోలు చెబుతూ అడిగాను
"అతిధి ఎవరని?"
చిరునవ్వే సమాధానం
గీత దాటిన క్షణాన తెలిసింది
మనమంతా అతిధులం
‘సమయం’ మాత్రమే శాశ్వతం అని

"People come and go, but time stays. Time is not a guest."
- Geoff dyle

****

‘సంకట్ సిటీ’ ఒక చీకటి కోణం


ఈ మధ్యకాలంలో కొందరు నటులుంటే చాలు ఆ సినిమా బాగానే ఉంటుంది అని నమ్మెయ్యదగ్గ “నమ్మకం” సంపాదించుకున్న నటుల్లో బాలీవుడ్ నటుడు కేకే(మీనన్) ఒకరు. హఠాత్తుగా ఒక పోస్టర్ చూసి ఇదేదో హాలీవుడ్ సినిమా ‘సిన్ సిటీ’ తరహాలో ఉందే అనుకుంటే ఆ సినిమా పేరే ‘సంకట్ సిటీ’ అని కనిపించింది. ఆ పోస్టర్ పైన కేకే బొమ్మ. ఇంకేం సినిమా చూసెయ్యాలని డిసైడ్ అయ్యాను. చూశాను.

ఇదొక వెధవ సినిమా. సినిమాలో కనిపించే ప్రతిపాత్రా వెధవ పాత్ర. చేసే ప్రతి చర్యా వెధవ చర్య. అయ్యే ప్రతి ప్రతిచర్యకూ ఒక వెధవ పర్యవసానం. మొత్తంగా పడీపడీ నవ్వుకునే వెధవాతివెధవ సినిమా.

ఇదేమిటీ ఇన్ని వెధవలు వాడేసాడు అనుకోకండి. ఆ “వెధవ” పదం నెగిటివ్ గా వాడటం లేదు. సీరియస్గానే ఒదొక చీకటి బ్రతుకుల సినిమా. దొంగలు, దొంగస్వాములు, దొంగ బిల్డర్లు, దొంగ ఫైనానసర్లూ, దొంగ ఫిల్మ్ మేకర్లూ వాళ్ళనే మోసం చేసే మంచి దొంగలు, పిరికి దొంగలు, ఒక ఫ్రొఫెషనల్ హంతకుడు ఉన్న సినిమా ఇది. సినిమా ప్రారంభం నుంచీ అంతం వరకూ అన్నీ అవకతవకలే జరిగే సినిమా ఇది.

డబ్బులు చేతులు మారటాలు. బ్యాగులూ, సూట్ కేసులు తారుమారవటాలు. కార్ల దొంగతనాలు. తలకు దెబ్బతగిలి ఉన్నమతి పోవటాలు. చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ముళ్ళు కలవటాలు. అన్ని రెగ్యులర్ సినిమా మసాలాలూ పిచ్చెక్కించేలా పిచ్చిపిచ్చిగా అల్లేసి ఒక బ్లాక్ కామెడీని సృష్టించేశాడు దర్శకుడు. సినిమాలో ఏం జరుగుతుందో మనకు తెలుసు, కానీ ఏ మలుపులో అలా జరుగుతుందో ఎదురుచూస్తూ మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆ జరుగుతున్నది పూర్తిగా అసంబద్ధం అని మనకు తెలుసు. కానీ, ఆ అసంబద్ధతలోని నిబద్ధతని చూసి మురిసిపోవచ్చు.

కొన్ని సినిమాలకు మెదడు ధియేటర్ బయట వదిలి వెళ్ళాలంటారు. ఈ సినిమాలో మెదడు తల్లోపెట్టుకునే, మెదడు అవసరం లేని మెదడుకలిగిన సినిమా చూడొచ్చు. చిత్రంగా ఉందికదా! అదే ఈ సినిమా విచిత్రం. ఇదొక ఘాట్ రోడ్డు ప్రయాణం లాంటి సినిమా ఎవరో చెప్పినట్లు “మలుపు మలుపులోనూ ట్విస్ట్” ఉన్న సినిమా ఇది.

అనుపమ్ ఖేర్ లో చూపించడానికి ఇంకా కొత్తగా ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే అని ఈ సినిమా ఋజువు చేస్తుంది. రిమీ సేన్ (?) కూడా పాత్రకుతగ్గ నటన చేసింది. ప్రభవల్కర్ నటన సహజంగా ఉంది. చంకీపాండే ఫరవాలేదనిపించాడు. హీరో గెటప్ లో కన్నా, హైదరాబాదీ డుప్లికేట్ గా మంచి నటన చూపాడు.
దర్శకుడు పంకజ్ అద్వానీ గురించి పెద్ధగా తెలీదుగానీ, త్వరలోనే Most Wanted దర్శకుడు అయ్యే లక్షణాలు కనిపిస్తాయి. వెధవతనంలో సిన్సియారిటీ చూపే దర్శకులు మనకున్నారుగానీ, వెధవతనాన్ని ఇంత మెదడుతో మనోరంజకంగా తెరకెక్కించిన దర్శకుడిగా ఖచ్చితంగా మెప్పు పొందుతాడు. ఖోస్లా కా ఘోస్లా, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ దర్శకుడు దిబాకర్ బెనర్జీ తరహా పరిణితి కనిపిస్తుంది.

ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని నేను చెప్పనుగానీ, చూడకపోతే మాత్రం బాలీవుడ్ కొత్తతరహా సినిమాలకు శ్రీకారం ఎలా చుడుతోందే తెలుసుకునే ఒక లంకెతో మీరు పరిచయం కోల్పోతారు. కాబట్టి నిర్ణయం మీదే!

*****

కైతునకల దండెం - కవితా సంకలనం


ఈ కులంలో పుట్టకపోతే

నేనూ ఇంకోలా ఆలోచించేవాడ్నేమో
ఈ కులంలో పుట్టడమే మంచిదయింది
అవమానమంటే అర్థమయింది
అందర్నీ ప్రేమించడమూ తెలిసింది

ప్రాచీనసాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
బయటపడకూడదనో,పారిపోవాలనో
బహిష్కరించాలనో అనుకునేవాడ్ని
మూకుమ్మడిగా కళ్ళనీ నామీదే ఫోకస్!
ఎన్నిసార్లు చంపుతావంటూ
దేవుడ్ని కాలర్ పట్టుకోవాలనిపించింది!!

నాకు తెలీదు
అమ్మకడుపులోనైనా అవమానాలకు దూరంగా ఉన్నానోలేదో
బాబుకాలికి మచ్చెలా వచ్చిందని
ఈ మధ్యనే అమ్మనడిగితే
‘ప్రశ్నించడం నేర్చుకుంటున్నాడు’ ఏమవుతుందో!
అనుకుంటూ, తడబడుతూనే చెప్పింది

"నువ్వు కడుపులో ఉండగా పెద్ద తుఫానొచ్చింది
ఊళ్ళోజనమంతా పెద్దోళ్ళింటికెళ్ళిపోయారు
నేనూ కడుపీడ్చుకుంటూ
కాస్త చోటిమ్మని బతిమిలాడాను
మైలపడిపోతే చచ్చిపోతామని
లోనికేకాదు పంచెకే చేరనివ్వలేదు!
రివ్వురివ్వున గాలి,పెద్ధపెద్ధ ఉరుములు,హోరిహోరున వర్షం,
ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు
కూకటివేళ్ళతో కూలిపోతున్నా
ఆ చెట్లేదిక్కయాయా రెండ్రోజులూ !
తుఫాను వెలిసిన ఆ మర్నాటికి
ఆకలితో నకనకలాడి కళ్ళుతిరిగి పడిపోయాను
నిండుచూలాల్ని బ్రతికించమని ప్రాధేయపడుతూ
మళ్ళా పెద్దోళ్ళింటికే వెళ్ళాడు మీ బాబు
పొద్దుకాలమంతా పెద్దోళ్ళకేకదా పనిచేసేది
కాసిన్ని గెంజినీళ్ళైనా పెయ్యమని అర్థించాడు
కట్టెలుకొట్టుకొస్తే పోస్తామన్నారు
ఖాళీకడుపుతోనే, తూలిపోయినా
కట్టెలతోపాటూ కాలూ గాటుపెట్టుకునైనా
కాసిన్ని గెంజినీళ్ళి సంపాదించాడు !
గుక్కెడు మాత్రం గుటకేసాను
కడుపులో ఇమడలేదు
మీ బాబు రుచిచూస్తే తెలిసింది
పెద్దోళ్ళు పోసింది బియ్యం కడుగేనని !"

ఇంకెన్ని గుండెల్లో దాచుకున్నారో
గుచ్చిగుచ్చి అడిగితేతప్ప నాకుచెప్పరెప్పుడూ

ఈ కులంలో పుట్టడమే మంచిదయ్యింది
లేకపోతే మనుషుల్ని ప్రేమించలేకపోయేవాడ్నేమో
అవమానాలకు తట్టుకోలేక
ఆగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేవాడ్నేమో!






Kaitunakala dandem_kavitalu

Thursday, July 16, 2009

కలలు


పేదోడి కలలూ

పెద్దోడికలలూ ఎప్పుడైనా కలుస్తాయా?
కలుస్తాయేమో,
ఒకసారి చూడండి!

పేదోడిది ఒకే ఒక కల
కోరుకున్నది తినాలని
పెద్దోడిలా ఉండాలని

మరి పెద్దోడో!
తిన్నది అరిగించుకోవాలని
పేదోడిలా తయారవ్వాలని

కలలు కలిసాయి
కానీ బ్రతుకులు...

"The dreams of the rich, and the dreams of the poor - they never overlap, do they?
See, the poor dream all their lives of getting enough to eat and looking like the rich. And what do the rich dream of? Losing weight and looking like the poor."
-The White Tiger,Arvind Adiga
****