Tuesday, June 30, 2009

తెలుగుకు పొయ్యేగాలం !

"ఒకసారి పల్లెల్లొకిబోయి సూడండి సామీ బాస దర్జాగా బతికిపోతావుండాది. సచ్చింది సస్తావుండేదీ “ఇది సరైన భాష” అని చెప్పిచచ్చిన భాష. అది ఉన్న్యా పోయినా ఒగటే.పనికొచ్చే బాసంటే ఉద్యోగానికి అచ్చొచ్చిన బాసేకాదు. బతుకుల్ని బతికించే బాసగూడా. మాఊర్లో ఇంగా అదే మాట్లాడతావుండాము. తెలుగు. గాకపోతే కొందరు మనుసుల్లాంటి మనుసులు “అహే నీది బాసేకాదు. రాయాలంటే ఇలాగే ‘వ్రాయాల’. యాకరణం శుద్దంగా ఇట్టే పలకాల” అని నాశనం సేసి హైరానా పట్టిత్తనారుగానీ మాబాసకేమొచ్చింది పోగాలం? వడ్డారమైన మీబాసలకే వస్తాది పొయ్యేగాలం."
- కత్తి మహేష్ కుమార్

బ్లాగులు భావవ్యక్తీకరణకు అని నేను అన్నప్పుడల్లా "భాష ఉపయోగం కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు" అని రేరాజు పోస్టేసిమరీ నా వెనుక పరుగెట్టేవారు. నాబాధ నాదిరా మగడా అంటే, భాషే అన్నిటికీ సుప్రీం. తెలుగు భాషలో ఆలోచిద్ధాం అనే మెలికేసి వాయించెయ్యడం రేరాజు సహజమైన తరహా. ఈ చర్చల మధ్యలో ఎప్పుడో డిగ్రీలో చదివిన "functions of language" అప్పుడప్పుడూ గుర్తొచ్చేది. ఈ రోజు పొద్దులో భైరవభట్ల కామేశ్వర్రావు గారి "An Apology of a Telugu fa(lu)natic" చదవగానే ఆ చదువు కాస్త పంచుకుందామనే ఆవేశం వచ్చింది. అందుకే ఈ టపా.

Buhler అనే మానసిక -భాషా శాస్త్రవేత్త ప్రతిపాదించిన థియరీ ఆఫ్ లాంగ్వేజ్ ప్రకారం భాషకు మూడు ఉపయోగాలున్నాయి. ఒకటి expressive function- (భయాలూ,బాధలూ,కోపాలూ,ఆనందాలూ,అవసరాలూ చెప్పుకునే కార్యం) భావవ్యక్తీకరణ కార్యం. రెండోది signaling function - సౌజ్ఞలు (మాటలతో అవసరం లేకుండానే చేతలతో,ముఖకవళికలతో, శబ్ధాలతో) చేసేపని. మూడోదిగా descriptive function - వివరణాత్మక కార్యం. కాలక్రమంలో ఇంకో ముఖ్యమైనపని భాష చేస్తుందని గ్రహించి Popper అనే ఆయన నాలుగోదిగా argumentative function -వాదోపవాదాల పనిని జోడించారు. కానీ ఇక్కడ మతలబేమిటంటే "animal and human languages have much in common at the levels of expression and signaling but the descriptive level is distinctively human" అని తేలుస్తారు. ఇక వాదోపవాదాలు మనుషులుతప్ప మరొకరు చేసేపని కాదనేది జగమెరిగిన సత్యం.

మనుషుల్లో భాషయొక్క వివరణాత్మకమైన ఉపయోగాన్ని వివరిస్తూ "The descriptive function is characteristic of the human species. And it is something new,and something truly revolutionary: human language can convey information about a state of affairs, about a situation that may or may not be present or biologically relevant. It may not even exist." అని సాహితీసృజన భాషా ఉపయోగంగా ఎలా మారిందో వివరిస్తాడు పోప్పర్.

ఒకడుగు ముందుకేసి "descriptive language is almost infinitely flexible and this enables the playful and creative invention of myths and stories (hence),The advent of descriptive language raises the issues of truth and falsity, which leads to the possibility of argument and the use of reasons for or against the truth or adequacy of a description." అంటూ వాదోపవాదాలకు కూడా ఈ వివరణాత్మక ప్రక్రియే మనుషుల్లో కారణం అని సుతిమెత్తగా చెప్పాడు. ఈ వృద్దిచెందిన భాషా ప్రయోగాలే మనిషిని సృజనాత్మకతకూ, భిన్నమైన ఆలోచనలకూ పురిగొలుపుతుంది కాబట్టి ఇవే మనిషిని మనిషిగా మారుస్తాయి అని పట్టంగడతాడు.

ఈ సిద్ధాంతంలో "తెలుగునం" లేదుకాబట్టి లేదా ఇదొ "తెలుగు ఆలోచన" కాదు కాబట్టి, నేను అంగీకరించను అనేవాళ్ళతో నేను వాదించలేనుగానీ, భాష పుట్టినతరువాత భాష ఉపయోగాన్ని విశ్లేషించడానికే తప్ప కొత్తభాషను పుట్టించడానికి ఈ సిద్ధాంతం ప్రతిపాదించలేదు గనక ఈ ధియరీతో నాకు పెద్దగా సమస్యలు లేవు.

ఇప్పుడు మనల్ని పట్టిపీడిస్తున్నదనుకుంటున్న సమస్య తెలుగు భాష మనుగడ. నాకైతే అది సమస్యగా అస్సలు అనిపించడం లేదు. ఎందుకంటే మనిషి...ముఖ్యంగా తెలుగు మనిషి బ్రతికున్నంతవరకూ మొదటి రెండు పనులైన భావవ్యక్తీకరణా, సౌజ్ఞల పనులు భేషుగ్గా జరుగుతూనే ఉంటాయి. మనుగడలేకుండాపోతే సంస్కరించి,స్థిరీకరించామనుకుంటున్న వివరణాత్మక తెలుగు ముగడలేకుండా పోతుంది. ఎందుకంటే, మనోళ్ళు భాషను అర్థంచేసుకునే ఉద్దేశంతో కాకుండా, "శుద్ది" చేసి "సంస్కరించే" నెపంతో వ్యాకరణాన్ని గొంతుక్రిందకి దిగదియ్యాలనుకున్నారు. అప్పుడే మూల ఉపయోగాల్ని కించరిచే మానవప్రత్యేకమైన వివరణాత్మక,వాదోపవాద కార్యాలకు విపరీతమైన ప్రధాన్యత తెలుగు భాషలో ఉదయించింది. బలమైన పునాదిలేకుండా భవంతి ఎలా నిలబడదో, మూలవాసుల భావవ్యక్తీకరణను చిన్నచూపుచూసి సంస్కరితవ్యాకరణం ఆధారంగా వివరణాత్మకతకు ప్రాధాన్యతనిస్తే భాషా నిలబడదు.


మనిషిని జంతువున్నా ఉన్నతుల్ని చేసే వివరణాత్మక కార్యాన్ని జనబాహుళ్యానికి చెందకుండా కేవలం పరిమిత స్థితిగతుల్లో జరిగేలా మనోళ్ళు చాలా జాగ్రత్తలు తీసేసుకున్నారు. ఇందులో స్వార్ధముందో లేక తెలియనితనం ఉందో నాకు తెలీదుగానీ. ఇదే జరిగిందేమో అనేది నా "అపోహ". సంస్కృతాన్ని ప్రమాణంగా తీసుకుని ఎప్పుడైతే మనం మన వ్యాకరణాన్ని సంస్కరించామో అప్పుడే మన భాషకు మంగళహారతి పాడెయ్యటం జరిగింది. ఇక తెలుగులో "ఒరిజినల్ ధాట్" ఎక్కడ్నుంచీ వస్తుంది? మన ఆదికవి నన్నయ్యే అనువాద కవి అయితే మనదైన "తెలుగు సాహిత్యం" ఎక్కడ్నుంచీ పుడుతుంది? ఈ విధంగా తెలుగు ప్రజల భావాల్ని (భాషని) పట్టించుకోకుండా తెలుగు "అభివృద్ధి" చెందిపోయింది. మహాకావ్యాలు పుట్టేశాయి. పద్యకావ్యాలు గంగవెర్రులెత్తాయి. గ్రాంధికాలు తమ బాకాలు ఊదాయి. వ్యావహారికంతో విప్లవం తేవాలనుకున్నా, దానిలోనూ ఆభిజాత్యాలు సహజత్వాన్ని చంపేశాయి. ఇలా "(రా)వ్రాస్తేనే గౌరవప్రదమైన తెలుగు" అని తెలుగోళ్ళనే తెలుక్కి దూరం చేసేశారు. ‘జానుతెనుగు’ అంటూ పల్లెతెలుగును కుదేశారు.

ఈ వ్యవహారాన్నంతా అమలు(perpetuate) చేసే బోధనాపద్దతి గురించి ఎంత తక్కువమాట్లాడుకుంటే అంత మంచిది. ఎంతైనా కడుపుచించుకుంటే కాళ్ళమీద పడుతుందాయె. నాదైన ఆవు వ్యాసం పూర్తిగా రాయించకుండానే, సీసపద్యంలోని సొబగుని ఆస్వాదించమన్న తెలుగుకి దూరంగా ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా పారిపోవాలనుకున్న మొదటి విద్యార్థిని నేను కాదు. అలాగని చచ్చిన సంస్కృతాన్ని మార్కులకోసం ఉద్దరించడం చేతకాక, కనీసం "పనికొస్తుందేమో"అన్న ఆశతో హిందీ తీసుకున్న విద్యార్థుల్లో మాత్రం నేనొకడిని. నిత్యజీవితంలోని భావవ్యక్తీకణకు సహాయకారి కావడానికి సహకరించాల్సిన భాషను తమ భిజాత్యంతో ఆకాశంలో కూర్చోబెట్టి, ఇప్పుడు "గగనమైపోతోంది" అని వాపోతే ఎలా? దానికి బాధ్యత ఎవరిది. కారణం ఎవరు.


నావరకైతే గ్రంధాలు నశించినా, పద్యాలు కృశించినా, పుస్తకాలు చెదపట్టినా తెలుగుమాత్రం బ్రతికే ఉంటుంది. మా ఊర్లో, మా అవసరాల్లో, మా అవేశాల్లో, మా అవేదనల్లో, మా ఆనందాల్లో తెలుగు మాత్రం బ్రతికే ఉంటుంది. పొయ్యేగాలం పోవాల్సిన తెలుగుకే వస్తుంది. తెలుగు మాత్రం బ్రతికేవుంటుంది.

****

Monday, June 29, 2009

పురాణ ప్రలాపం - చరిత్ర ప్రలోభం

ఓటమి కారణాలు వెతుకుతూ బీజేపీ పార్టీ అంతర్మధనం గావిస్తోంది. ‘హిందుత్వకు దూరమెళ్ళిపోయాం కాబట్టి మన ఓటర్లు మనల్ని దూరం చేశారు’ అని కొందరు. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని,ప్రజానాయకుల్ని విస్మరించి బోర్డురూం పొలిటికల్ లీడర్లు పార్టీని మట్టిగరిపించారు’ అని మరికొందరు ఇప్పటికే పబ్లిక్ లో దులిపేసారు. వరుణ్ గాంధీ ముస్లిం వ్యతిరేకత, నరేంద్రమోడీ ని నెక్స్ట్ పి.ఎమ్ అనడం పార్టీని మరింతగా దిగజార్చాయని కొందరు విశ్లేషకులంటుంటే, మరికొందరు అసలు ఒక తమదంటూ ఒక కోర్ అజెండానే లేకుండా బీజేపీ ఎలెక్షన్ల బరిలోకి దిగి దిమ్మదిరిగిపడిపోయిందని నిర్ణయించేశారు. మొత్తానికి "రైట్"...రాంగ్ అయ్యింది.

మరోవైపు మిని రష్యా చైనాల్ని భారతదేశపు రెండు చిన్నచిన్న మూలల్లో స్థాపించిన వామపక్షపార్టీలు చారిత్రాత్మక విజయం నుంచీ చరిత్రైపోయే పరాజయం వరకూ UPA తోకపట్టుకుని ఈ ఎన్నికల్లో ప్రయాణించేశారు. 2004 ఎన్నికల్లో వచ్చిన వాపుని బలుపనుకుని భ్రమపడిపోయిన ఈ పార్టీలు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కులాగే పనితప్ప, ఎన్నికల్లో తమకొచ్చిన ప్రజామద్ధత్తుని సక్రియంగా ఉపయోగించిన దాఖలాలు బూతద్ధం పట్టుకుని వెతకాల్సిందే. విదేశీపెట్టుబడులను తగ్గించడం, PSU లను లిక్వీడేట్ చెయ్యకుండా కాపాడటం తమ ఘనత అని వీరు అనుకున్నా, ప్రజలు మాత్రం అదేదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు. ఇక ప్రజాసామాన్యానికి ఏమాత్రం అర్థం కాని న్యూక్లియర్ ఒప్పందంపై మొండిపట్టుపట్టి, కనీసం ప్రజల్లోకి కూడా వెళ్ళకుండా ఢిల్లీలోనే కూర్చుని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో వీరి క్రెడిబిలిటీ కాస్తా లయబిలిటీగా మారింది. ఇప్పుడూ వీరూ తమకు అలవాటైన అండర్ గ్రౌండ్ లో దూరి అంతర్మధనాలు గావించుకుంటున్నారు. మొత్తానికి లెఫ్టూ....రాంగ్ అయ్యింది.

వాజ్పేయి తరువాత బీజేపీ ఒక అనాధపార్టీ అయినమాట తేటతెల్లం. అద్వానీని బలమైన ప్రధాని అని ప్రొజెక్ట్ చేసినా, పార్టీలోని స్థబ్ధతని కనీసం బద్ధలుకొట్టలేని బలహీన నాయకుడిగానే మిగిలిపోయాడు. ఇక అస్మదీయులూ తస్మదీయులూ గ్రూపులుగా విడిపోయి తన తలప్రాణం తోకలోకి తీసుకొచ్చిన సంగతి ఇప్పుడిప్పుడే పబ్లిక్ డొమెయిన్లోకి వస్తోంది. ఇవన్నీ రాజకీయకోణాలైతే అతిముఖ్యమైన సైద్ధాంతిక కోణం బీజేపీని నట్టేట్లో ముంచిందనుకోవాలి. అదే పురాణ (mythological) ధృక్కోణం నుంచీ వర్తమానాన్ని అర్థం చేసుకున భవిష్యత్తుని దర్శించే వైఖరి. ప్రసన్నరాజన్ చెప్పినట్లు బీజేపీ తమ బలాన్ని,నమ్మకాన్నీ "monochromatic mythos" నుంచీ పొందుతున్నంత వరకూ వర్తమానంలోని "నిజాన్ని" గుర్తించలేరు.

రైట్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే లెఫ్ట్ పార్టీలు తమ చరిత్ర (History)లో తామే చిక్కుకుపోయారు. They are in their own historical time lock. భారతదేశంలో సమసమాజ నిర్మాణానికి కార్మిక రాజ్యం కాదు కర్షక రాజ్యం కీలకం అని వీరు భూమి పంపకాల ఉద్యమాలలో గ్రహించినా, అతిత్వరలో యూనియన్ గూండాయిజాల్లో తమ కమ్యూనిజాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఈ విధానాల కొనసాగింపులో చివరికి వీరికి మిగిలింద్ బెంగాల్ లో సమ్మెలు, కేరళలో పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మిగిలిన యువత. రష్యావిప్లవంలోని చారిత్రక సిద్ధాంతానికి, నిజంగా వర్ధిల్లుతున్న కమ్యూనిస్టు చైనా -క్యాపిటలిజానికీ లంకె ఎలా వెయ్యాలో అర్థంకాని కూడలిలో తమదంటూ ఒక వర్తమానాన్ని సృష్టించుకోలేక వీరు తమ అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసుకున్నారు. ఇంత కంన్ఫ్యూజన్లో ఉన్న భారతీయ కమ్యూనిజం ద్వారా మనకొరిగేది ఏమీ లేదని ప్రజలు నిర్ధారణకొచ్చినట్లునారు.

ఒకవైపు పురాణ ప్రలాపాలూ మరోవైపు చరిత్ర ప్రలోభాలూ రెండూ కలిపి లెప్ట్ రైట్ పార్టీలను ఈ ఎన్నికల్లో లెప్ట్ రైట్ అని నడిపించక "పీఛే ముడ్" ని చేశాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి మేలేగానీ, మేలైన ప్రతిపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యానికి మాత్రం కీడే. Hope they will recover from their ailments.

****

Sunday, June 28, 2009

పసంగ (తమిళ్) - సమీక్ష


సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు. పిల్లలకు “మంచిని బోధించే”(?) సందేశాత్మక voyeuristic సినిమా అసలు కాదు. పిల్లాటల సినిమా అస్సలు కాదు. ఇదొక సినిమా. ఒక ని…జ…మై…న పిల్లల సినిమా. అంతే.

ఐదో తరగతి నుంచీ ఆరో తరగతికి వెళ్ళిన కొందరు పిల్లల కథ. ‘అన్బు’(కిషోర్), ‘జీవ’(శ్రీరాం) అనే ఇద్దరు విద్యార్థుల కథ. వాళ్ళ కుటుంబాల ప్రేమలు, గొడలవ కథ. పిల్లల్లోని పిడుగులూ, అల్లరిమూకలూ, బుద్దిమంతులు, క్లాస్ లీడర్ రాజకీయాలు, రైవల్రీలూ అన్నీ కలిపిన అద్వితీయమైన కథ. ఒక చిన్న ఊర్లోని గవర్నమెంటు స్కూళ్ళో ఏంమేమి జరుగుతుంటాయో వాటన్నింటినీ తెరకెక్కించిన చిత్రం.

పూర్తి సమీక్ష కోసం నవతరంగం చూడండి...

Saturday, June 27, 2009

ఆర్.డి.బర్మన్ జయంతి

27 June, 1939 – 4 January,1994

1986 బొంబాయిలోని ఒక మ్యూజికల్ సిట్టింగ్. సినిమా దర్శకుడు పాటల రచయిత గుల్జార్ ఒక కాగితాన్ని సంగీతదర్శకుడికి ఇచ్చాడు.

కళ్ళద్దాల్లోంచీ ఆ కాగితంలోని వాక్యాల్ని చదివి “మంచి సీను. చాలా కవితాత్మకంగా ఉంది” అని క్రిందపెట్టేసాడు ఆ సంగీత దర్శకుడు.
“సీను కాదు అదే నేను రాసిన పాట. నువ్వు కంపోజ్ చెయ్యాలి” అన్నాడు గుల్జార్.
“నీ కేమైనా పిచ్చిపట్టిందా! రేపు టైంమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకొచ్చి దాన్ని కంపొజ్ చెయ్యమనేట్టున్నావే!!”
“నువ్వు చెయ్యగలవు. నువ్వే చెయ్యగలవు. అందుకే నీకిస్తున్నాను”
“హ్మ్…చూద్ధాం. ఏదీ ఒకసారి చూపించు. పదాలు పైకిచెప్పు”


ఆ తరువాత....నవతరంగంలో చదవండి.

*****

Friday, June 26, 2009

బోర్డు పరీక్ష..హుష్ కాకి!

పదోతరగతి బోర్డు పరీక్షలు ఎత్తేస్తామనే కపిల్ సిబ్బల్ పిలుపుతో కొందరు పిల్లలు సంతోషపడితే మరికొందరు మేము మిగతావారికంటే మెరుగని తెలిసేదెట్లా అని వాపోయారు. కొందరు పెద్దలు మరి మా పిల్లల "విలువ" గ్రహించేదెలా అని బాధపడితే, మరికొందరు కనీసం ఒక టెన్షన్ తగ్గిందని సంబరపడ్డారు. కొందరు విద్యావేత్తలు పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుందని శెలవిస్తే, మరికొందరు ఇంటర్లో బ్లాంచులు కేటాయించేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు (U.P) మేము మీకన్నా ముందున్నాం అని ఈ సంవత్సరం నుంచే పదోతరగతి పరీక్షల్ని తీసేస్తే, మరికొన్ని రాష్ట్రాలు స్టేట్ సబ్జెక్టైన విద్యను కేంద్రం లాగేసుకోవడానికి ఇదొక ఎత్తుగడ అని వ్యతిరేకిస్తున్నారు.

ఇన్ని విభిన్నమైన ఆలోచనలూ ప్రతిస్పందనల మధ్య ఈ విషయం నిల్చుంది. టీవీల్లో మేధావులు మేధావులు తమ అమూల్యమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే...ఈ ప్రతిపాదనను కపిల్ సిబ్బల్ కొత్తగా ప్రతిపాదించినట్లు అందరూ చెప్పుకోవడం. నిజానికి విద్యను ఒక రాజ్యాంగపరమైన హక్కుగా చెయ్యడం, ప్రస్తుతం ఉన్న విద్యావిధానం (National curriculum for school education) చాలా పురాతనమైనది గనుక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం అనేవి క్రితం సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెయ్యాలనుకున్న పనులు. ఒకవైపు అర్జున్ సింగ్ అలసత్వం మరోవైపు లెఫ్ట్ పార్టీల గోల, బీజేపీ పాలిత రాష్ట్రాల వ్యతిరేకత (బహుశా వీళ్ళకి తాము ఆధికారంలో ఉన్నప్పుడు చేసిన చిలిపిపనులు గుర్తొచ్చాయేమో) అన్నీ కలిపి ఏమీ చెయ్యలేక పోయింది.

ప్రస్తుత ప్రతిపాదనకొక చరిత్ర ఉంది. ఒక నేపధ్యముంది. ఎందరో విద్యావేత్తల మేధావుల,టీచర్ల, విద్యార్థుల అనుభవాలూ పరిశీలనలూ ఉన్నాయి. National Policy on Education in 1986 ఆధారంగా జరిపిన ఒక పరిశోధన సారంగా Learning without Burden (1993) సూచనలు వెలువడినప్పుడు దేశంలోని విద్యావేత్తలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి తాము విద్యార్థులపైన ఎంత జులుంచేస్తున్నామో గ్రహించారు. చదువుకోవడం ఒక భారంగా భావిస్తున్న విద్యార్థులకు ముకుతాడుకట్టి విద్యబోధించడం జ్ఞానాన్ని అందించడం కాదనే నిర్ధారణకు వచ్చారు. అప్పటి నుండీ వివిధ స్థాయిల్లొ చర్చలు జరిగాయి. ప్రతి రాష్ట్రప్రభుత్వంతోనూ సమన్వయ కమిటీలు ఏర్పరిచారు. ప్రొఫెసర్ యశ్పాల్ సార్ధ్యంలో 35 మంది సభ్యుల స్టీరింగ్ కమిటీ ఏర్పడింది. 21 జాతీయ చర్చా సమూహాలు దేశం నలుమూలలా తిరిగి అభిప్రాయ సేకరణ, శోధన,పరిశోధన చేశారు.

a) Areas of Curricular Concern - అన్ని సబ్జెక్టుల్లో బోధనా పద్దతుల సమీక్ష
b) Areas for systemic reform - విద్యావ్యస్థ పాలన విధానాల్లో మార్పులు
c) National Concerns - ఆర్ధిక,సామాజి,లింగపరమైన integration కోసం ప్రయత్నం

పై విషయాలలో విస్తృత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లోని కొన్ని నిర్ణయాల మూలంగానే మా కాలేజిలో (Regional Collage of Education) లో గ్రాడ్యుయేట్ టీచర్ కోర్సులు తీసేసి In -service teacher education మొదలెట్టారు. పైపై మెరుగులు ఎన్నిదిద్దినా మూల విషయాలలో పెద్ద break through జరలేదు. చివరకు కొన్ని పోరాటాల తరువాత అన్ని SCERT ల (State Council for Educational reserach and Training) consensus తో National curriculum for school education-2005 బయటికొచ్చింది. అప్పట్నుంచీ ఇప్పటిదాకా అది కూడా కోల్డ్ స్టోరేజిలో ఉంటే ఇప్పుడే కపిల్ సిబ్బల్ దానికి వేడి పుట్టించారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వాలు దీన్ని పాటిస్తాయో లేదో తెలీదు. ఈ సంస్కరణలు ఎప్పుడు మొదలవుతాయో...ఎప్పుడు మన విద్యావ్యవస్థ బాగుపడుతుందో!

NCSE-2005 లోంచీ వచ్చిన మొదటి రెకమండేషన్ ఇది. ప్రస్తుతానికి కేవలం CBSC స్కూళ్ళకే వర్తిస్తుంది. ఎందుకంటే, వీరి ప్రకారం 5th - 12th స్కూల్ విద్యగా పరిగణిస్తారు. పదోతరగతి నుంచీ పదకొండు కేవలం క్లాసు రూములో మార్పేతప్ప స్కూలు మార్పుకాదు. కానీ మనలాంటి రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ను pre-university education గా పరిగణిస్తారు. దీన్ని మార్చే వరకూ మన విద్యార్థులకు "విడుదల" లేనట్టే. చెయ్యాల్సిందింకా చాలా ఉంది. ఎంతచేసినా తక్కువే అవుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో!

*****

Thursday, June 25, 2009

సామాజిక ప్రయోజనం అంటే!

"మీ అభిప్రాయాలకు సామాజిక ప్రయోజనం ఉండాలని అనుకుంటున్నారా లేదా?" అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నాకు ఈ ప్రశ్నపట్ల ఉన్న సందేహాలు తీర్చుకోవడం అవసరం అనిపించింది. నా అభిప్రాయాలకు విలువివ్వాల్సిన అవసరమే ఎవరికీ లేదని నేను నమ్మినప్పుడు దాని ద్వారా సామాజిక ప్రయోజనం ఆశించడం సుదూరస్వప్నం. మరి ఈ ప్రశ్నకు సమాధానం!!! అందుకే ఈ ఆత్మాశ్రయం.

ఎక్కడో నేను చెప్పినట్లు..."మనుషులు తాము నేర్చుకున్న అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ, జ్ఞానాన్నీ, తమకున్న అభిప్రాయాల్నీ అక్షరబద్ధం చేస్తారు. దాని ఆశయం గుర్తుంచుకోవడం కావచ్చు, లేదా ఇతరులకు తెలియజెప్పడం కావచ్చు లేక కేవలం మనసు,మెదడులోని భావాల్నీ ఆలోచనల్నీ రాయడం ద్వారా వ్యక్తపరచి, కొంత మానసిక ఒత్తిడి నుంచీ ముక్తి పొందడమూ కావచ్చు. బహుశా మనం బ్లాగులు కూడా ఇందుకోసమే రాస్తామేమో కదా!


మనం మనస్ఫూర్తిగా నమ్మిందో లేక వ్యతిరేకించేదో లేకపోతే రాయడం వృధా, What is the point in writing, if we have nothing to believe in or nothing to rebel against? అని నా నమ్మకం. బహుశా అదే "నా ప్రయోజనం" కూడా. అందుకే నా టపాలలో చాలావరకూ, నేను బలంగా నమ్మినవీ లేక తీవ్రంగా వ్యతిరేకించే విషయాల్ని రాస్తాను. కాకపోతే ఆ భావనలు నా జీవితంలో వచ్చిన నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, కొంత తార్కికంగా విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను. దీన్ని చదివిన కొందరు ఎందుకు అంత వ్యతిరేకం? ఎవరిమీద నీ కోపం? అంటే, "నామీద నాకే" అని చెప్పగలనేకానీ, వీరిమీద అని ఖచ్చితంగా సూచించలేను. ఎందుకంటే I rebel against issue, ideas, concepts, norms, individual hypocrisies. వాటిని స్థూలరూపంలో చూడాలంటేనే కష్టమే, ఇక నిర్థిష్టంగా వివరించాలంటే... అసాధ్యం. అందుకే I write because I want to. I write because I think I have some thing to say. I shall say it in the space I created for my own self. Take it or leave it."


సామాజిక ప్రయోజనానికి 'ఆత్మాశ్రయం' గొడ్డలి పెట్టులాంటిదని కొందరి నమ్మకం. కానీ 'వైయక్తికత' అనేది (నాదైన) సామాజిక వాస్తవితను ప్రతిఫలిస్తుందనే విషయాన్ని నేను నమ్ముతాను. అందుకే ‘నా’ విషయాలు నేను రాస్తాను. వాటికి సామాజిక "ప్రయోజనం" ఉందా లేదా అనేది నిర్ణయించాల్సింది నేను కాదు. అలా ప్రయోజనం సిద్ధించానే ఉద్దేశంతో రాసేది వైయక్తికం కాదు. నా బ్లాగు వ్యక్తిగతం. అచ్చంగా నా గోల. కాబట్టి వాటికి సామాజిక ప్రయోజనం సిద్ధించేంత వరకూ వాటి యొక్క సామాజిక ఉపయుక్తత తెలీదు. నా గమ్యం మాత్రం అదికాదు. By default అది జరిగితే నాకొక బోనస్సే తప్ప అది నా ఆశమూ కాదు. గమ్యం అసలే కాదు.

ఇక ఈ బ్రహ్మపదార్థం అనే ప్రయోజనానికి "విలువ" ఆపాదించడం నాకు చేతకాదు. ఏది మంచి ఏది చెడు అని నేను నిర్ధిష్టంగా ఎప్పుడూ చెప్పలేను. I am never certain of many things in life. కేవలం నా అనుభవాలకి అప్పటికప్పుడు ఆపాదించుకున్న విశ్లేషణలతో అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాను లేకపోతే ఉన్న జ్ఞానానికి నా ఆలోచననూ అనుభవాన్నీ బేరీజుచేసి "ప్రస్తుతానికి ఇది ఇంతే కాబోలు" అనే నిర్ణయానికొస్తాను. కాకపోతే at any given pint of time I "believe" in few set of things. I also ensure a possibility of CHANGE in them. ఆమాత్రం స్వీయనిర్వచనాలు లేకపోతే జీవితంలో మాజా ఏముంటుంది? ఎంత ఖరాఖండిగా చెప్పలేకపోయినా, మనకంటూ కొన్ని విలువలే లేకుంటే అర్థమేముంది? కాని వాటిని మంచి చెడు అని నిర్ణయించేది మాత్రం ఆ విలువల ఆధారంగా నేను చేసే "చర్య"లు మాత్రమే. ఆ చర్యల ఫలితాలు నా prospective happiness ని హరించనంతవరకూ అవి నాకు మంచి. ఒకవేళ అలా జరిగితే అది చెడు. అంటే నావరకూ మంచిచెడులు కూడా చాలాచాలా subject. ఇక సామాజికంగా ఏది మంచి అనేది ఎవరు నిర్ణయిస్తారో అది నా చర్యల్ని influence చేసేవాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. దాని విస్తృతత్వం నా circle లోనే ఉంటుంది. Apart from things like global economy, natural disaster etc. etc.

నా బ్లాగు ఉద్దేశం సమాజోద్ధరణ కాదు. వ్యక్తుల్ని మార్చి తద్వారా సామాజిక ప్రయోజనాన్ని సాధించండం అంతకన్నా కాదు. నా ఆలోచనల్తో ఇతరుల్ని ప్రభావితం చెయ్యడానికో లేక వారి అభిప్రాయాల్ని మార్చడానికో వీలౌతుందని నేను విశ్వసించను. వాదనలతో మనుషులు తమ అభిప్రాయాలు మార్చుకుంటారనే అహంకారం నాకు ఏమాత్రం లేదు. అనుభవాలు మనుషుల అభిప్రాయాల్ని ఏర్పరుస్తాయి. వాదనలు అనుభవాలను మించిన ప్రభావశాలిగా ఏనాడూ అవలేవు. ఇతరుల నమ్మకాల్ని మార్చాలనే ఆశ అసలు లేదు. ఎందుకంటే నమ్మకాలు కుటుంబ విలువలు(పెంపక), సామాజిక విలువలు (కండిషనింగ్) మీద ఆధారపడుంటాయి. అవి ఇతరుల అభిప్రాయాలూ, ఆలోచనలవల్ల మారేవి కావు. ప్రత్యామ్న్యాయమైన విలువలు జీవితంలో ప్రవేశించి ఒక కుదుపుకుదిపితేగానీ నమ్మకాలు మారవు. అది నా బ్లాగుల్లోని రాతలవల్ల జరుగుతుందంటే నాకైతే "నమ్మకం" లేదు.

మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే...నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ‘నా’ బ్లాగు టపాల్ని ‘నాలాగా’ రాయటం.

*****

Wednesday, June 24, 2009

ఒక కాశ్మీరీ యువకుడి జీవిత శోధన - కర్ఫ్యూడ్ నైట్



అందానికే అందం కాశ్మీరం. భువిలో స్వర్గం కాశ్మీరం.
1989 ....తరువాత
పాకిస్తానీ ఉగ్రవాదుల స్థావరం కాశ్మీరం. భారతీయ సైన్యం పర్మనెంటు గుడారం కాశ్మీరం.

భారత ప్రభుత్వం కథనాలమధ్య. పాకిస్తానీ అంతర్జాతీయ ఆరోపణలమధ్య. భారతీయ మీడియా అందించే కథలతొ మనకు కాశ్మీరం అర్థమయ్యింది. అంతే మనకు తెలిసొచ్చింది.

ఒక ఉగ్రవాద పోరాటం. ఒక మిలిటరీ ఆపరేషన్. ఒక ద్వైపాక్షిక సమస్య. కొన్ని అంతర్జాతీయ ఘటనలకు మూలం. ఇంకా లోతుగా వెళితే ఒక రాజకీయ విన్యాసం. మత ఘర్షణల పరమపదసొపానం. వేర్పాటువాదం. భారత-పాకిస్తానీ వ్యతిరేకత. స్వయంప్రతిపత్తికోసం పోరాటం. వగైరా వగైరాలు.

రెండు దశాబ్దాలు గడిచాయి. ఒక తరం మారింది. కానీ...కాశ్మీర్ లోయనుంచీ తరిమివేయబడ్డ కాశ్మీరీ పండితులు ఒకవైపు , మరోవైపు తుపాకి నీడలో జీవితం గడుపుతున్న కాశ్మీరీ ముస్లింలు, మొత్తంగా కాశ్మీరీ ప్రజలు ఈ సమస్యను ఎలా చూస్తున్నారో, వారి మనసుల్లో ఎటువంటి భావాలున్నాయో ఒక తెలియని...బహుశా మనమెప్పుడూ తెలుసుకోదలచని కోణం.

ఆ అత్యవసరకోణాన్ని ఆవిష్కరించే పుస్తకం "కర్ఫ్యూడ్ నైట్". ఇదొక కాశ్మీరీ యువకుడి జ్ఞాపకాల,నిజాల, కథల శోధన ప్రయాణం. 1989 లో కాశ్మీర్లో మిలిటెంసీ -ఉగ్రవాదం విస్తృతంగా తలెత్తినప్పుడు బష్రత్ పీర్ ఒక టీనేజి కుర్రాడు. తన స్కూలొక ఉగ్రవాద అడ్డాగా మారటం. అన్యాయమైపోతున్నామన్న భావన మధ్య తుపాకిని దగ్గరగా చూసి మిలిటెంసీని రొమాంటిసైజ్ చెయ్యడం (అచ్చు సింధూరం సినిమాలో రవితేజ చేసినట్లు). తన దేశంలోనే తననొక అన్యుడిగా చూస్తూ అడుగడుక్కీ ఐడెంటిటీ కార్డులడగటం, అనుమానంగా చూడటం,కొద్దిలో అన్యాయపు అరెస్టు నుంచీ తప్పించుకోవడం, మిత్రులు ఎన్కౌంటర్లో చనిపోవడం వంటి ఘటనల నేపధ్యంలో తీవ్రవాదం పట్ల ఆర్షితుడౌతాడు.

కానీ కుటుంబ ఒత్తిడుల మధ్య పైచదువులకోసం అలీఘడ్ పంపెయ్యబడతాడు. 2003 వరకూ అలీఘడ్ లో చదువు, ఢిల్లీలో రీడిఫ్,తెహల్కా,గార్డియన్,ఫైనాన్షియల్ టైంస్ వంటి పత్రికల్లొ ఉద్యోగం తరువాత తన అనుభవాల్ని వెతుక్కుంటూ కాశ్మీర్ ప్రయాణ మవుతాడు. పాత జ్ఞాపకాలు, పరిచయాలు, ఉగ్రవాద కథలు, కుటుంబాల శోకాలు, యువత నైరాశ్యం, కోపం,ద్వేషం వంటి ఎన్నో భావనల వెనుక ఆలోచనల్ని,ఆభిప్రాయాల వెనుక అనుభవాల్నీ మనసులో పొందుపరిచి అక్షరబద్ధం చేస్తాడు. ఇప్పుడీ రచయిత న్యూయార్క్ లో జీవిస్తున్నాడు.

బ్రష్రత్ పీర్ జీవితంలో చిన్నప్పట్నుంచీ ఇప్పటివరకూ సాగిన అనుభవాల,జ్ఞాపకాల, ప్రయాణాల కథనం కర్ఫ్యూడ్ నైట్. 256 పేజీల పుస్తకం. ఖరీదు 395 రూపాయలు. కానీ మనకు తెలీని కాశ్మీర్ కోణాన్ని చూపించే ఒక దుర్భుణి. ఒక కాశ్మీరీ ముస్లిం ధృక్కోణం నుంచీ జరిగిన ఘటనల్ని తెలియజెప్పే కథనం. "beautifully written,brutally honest and deeply hurtful" అని ప్రముఖ ఇండియన్ ఇంగ్లీష్ రచయిత కుష్వంత్ సింగ్ చే కితాబు దక్కించుకున్ పుస్తకం ఇది. తప్పకుండా చదవాల్సిన పుస్తకం. కాశ్మీర్ సమస్యను ఒక మానవీయకోణం నుంచీ ఒక వ్యక్తిగతకోణంలోంచీ చూడటానికి ఈ పుస్తకాన్ని చదవాలి.

హైదరాబాద్ లోని అన్ని (ఇంగ్లీషు)పుస్తకాల షాపుల్లోనూ ఈ పుస్తకం దొరుకుతుంది.

*****

Tuesday, June 23, 2009

Mad Cow Sacred Cow


అబ్బే...ఆ పవిత్రమైన పిచ్చి పశువుల గురించి కాదులెండి! ఈ శనివారం నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చూసిన ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి.


అనగనగా ఒక కెనడాలో పట్టిన భారతీయ సంతతి వ్యక్తి. పేరు ఆనంద్ రామయ్య. కెనడియన్ భార్య. అప్పుడే మరో బిడ్డకు తండ్రయ్యాడు. సంతోషంగా సాగే జీవితం. హఠాత్తుగా కెనడాలో ‘మ్యాడ్ కౌ’ రోగం కమ్ముకుంది. రోజూతినే బర్గర్లోని బీఫ్ ద్వారా రోగాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఆహారం విషయంలో అబద్రత ఏర్పడింది. తినేతిండి ఎంత సురక్షితమో ప్రశ్నార్థకం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు మూల కారణం వెతకాలని తన వీడియో కెమెరాతో బయల్దేరాడు.

ఆనంద్ రామయ్య భార్య కుటుంబీకులు ఒకప్పుడు పశువుల పెంపకం వృత్తిగా కలిగినవారు. వారందరినీ కలిసి మాట్లాడాడు. తెలిసిందేమిటంటే పశువుల పెంపకం కుటుంబ వృత్తిగా ఉన్నంతవరకూ బాగానే ఉండేదని, కొన్ని కార్పొరేషన్లు/కంపెనీలు మాంసం ఉత్పత్తిని ఏకీకృతంచేసి గుత్తాధిపత్యం చెలాయించే స్థితికి వచ్చేసరికీ రైతుకు తీవ్రమైన నష్టాలువచ్చి, పశువుల పెంపకంకూడా కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. మ్యాడ్ కౌ వ్యాధి మూలాలు ఇక్కడ్నించే మొదలయ్యాయనే నిజం ఆనంద్ కు తెలిసొచ్చింది.

కంజ్యూమర్/కస్టమర్ కు అతితక్కువ ధరకు బీఫ్ (పశుమాంసం) అందించి అధిక లాభాల్ని సంపాదించే వ్యూహంలో భాగంగా కారొరేషన్లు పశువుల దాణాలో వ్యర్థంగా మైగిలిపోయిన పశుమాంసాన్నే పౌడర్ రూపంలో కలిపే విధానానికి శ్రీకారం చుట్టారు. పశువుల ఆరోగ్యంతో సంబంధం లేకుండా శాఖాహారులైన పశువులకు పశువుల్నే తినిపించే ఘోరమైన పద్ధతిని అవలంభించారు. ‘మ్యాడ్ కౌ’ రోగం ఈ హేయమైన వ్యాపారపద్ధతికి మూలమయ్యింది.

ఒకవైపు రైతులు మరొక వైపు ప్రజారోగ్యం కారొరేషన్ల ధనదాహానికి బలైపోయాయి. తినేతిండి విషతుల్యమైపోయింది. అనే విషయం తెలుసుకున్న ఆనంద్ కు చాలా బాధకలిగింది. అదే సమయంలో తన పూర్వజులు భారతదేశంలో పశువులకున్న ప్రాధాన్యత గురించి, పవిత్రత గురించీ చెప్పిన విషయాలు మనసులో మెదులుతున్న ఆనంద్ ‘మ్యాడ్ కౌ’ (పిచ్చి పశువు) కు వ్యతిరేకమైన ‘సేక్రెడ్ కౌ’ (పవిత్ర పశువు)ను వెతుక్కుంటూ కేమెరా భుజాన వేసుకుని భారతదేశం వచ్చాడు.

పూర్తి వ్యాసం నవతరంగంలో చదవండి.


****

Monday, June 22, 2009

ముసుగుదొంగ రూపాలు...మూడోసారి!


‘నువ్వు బ్రాహ్మణుల్ని (as a collective community !) నిందించావు కాబట్టి నిన్ను నిందించడం సరైనదే’ అనేది కొందరి వాదన. ఆ వాదన ఎంత పేలవంగా ఉందో అలా వాదించేవాళ్ళకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే సైద్ధాంతిక విభేధానికీ వ్యక్తిగత నిందకూ తేడా తెలీని లోకంలో వీరు విహరిస్తున్నారు. ఉదహరించిన నా వ్యాఖ్య "ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది" అనేది. ఇందులో చారిత్రక సత్యమేతప్ప నిందెక్కడుంది?

అయినా బ్రాహ్మణుల్నందర్నీ పేరుపేరునా నిందిండానికి అసలు వీలయ్యే పనేనా! అలా చెయ్యాల్సిన అవసరం నాకేమైనా ఉందా? ఏదో ఒక సైద్ధాంతిక చర్చలో కొంత చరిత్రను ఉటంకించి కులవ్యవస్థను కాపాడటంలో/వ్యవస్థీకృతం చెయ్యడంలో బ్రాహ్మణుల పాత్ర గురించి చెప్పాను. అది మొత్తంగా ప్రస్తుతం జీవిస్తున్న బ్రాహ్మణులందరినీ అవమానించినట్లు అనుకోవడం వ్యక్తుల మూర్ఖత్వంగానీ దానికేమన్నా ప్రాతిపదికుందా? అసలు దానివలన నాకొచ్చే లాభమేమైనా ఉందా? బ్రాహ్మణ బ్యాషింగ్ కనీసం పొలిటికల్ స్లోగన్ గా కూడా చచ్చిపోయి నాలుగు సంవత్సరాలౌతోంది. అలాంటిది దానివల్ల నేను పొందే మైలేజ్ ఏమిటి! ఇవన్నీ ఎవరికీ తోచవు. ఎందుకంటే కొందరిలో తర్కం చచ్చి కేవలం ద్వేషంతో కళ్ళను బైర్లుగమ్మింది.

కుల వ్యవస్థ గురించి సమగ్రమైన శాస్త్రీయ పరిశోధనలు బ్రిటిష్ సమయంలోనే జరిగాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది Louis Dumon’s Hierarchicus. దాని ప్రకారం భగవద్గీతలో చెప్పబడిన చాతుర్వర్ణం మనుస్మృతిలో నిబద్ధీకరింపబడింది. దాన్నే వర్ణాశ్రమధర్మం లేక మనుధర్మంగా చెప్పుకుంటాం. కాలక్రమంలో అవర్ణం లేక పంచమవర్ణం అని ఒక కొత్త వర్ణం పుట్టుకొచ్చింది. ఇలా hereditary specialization, hierarchy and repulsion అనే మూడు మూలాల్లోంచీ మొత్తం వర్ణవ్యవస్థ స్థిరీకరించబడింది. ఈ పరిశోధనకు ఆధారం, అప్పుడు లభ్యతలో ఉన్న సంస్కృత పుస్తకాలు/ సాహిత్యం. ఆ సమయంలో సంస్కృతం బ్రాహ్మణ క్షత్రియులకు తప్ప అన్యులకు అందుబాటులో ఉండేది కాదు. ముఖ్యంగా మతానికి సంబంధించిన అన్ని రచనలూ బ్రాహ్మణులే చేపట్టారు. కులాన్ని వ్యవస్థీకరించి ఆంక్షలు పెట్టడంలో, ముఖ్యంగా పంచముల్ని అత్యంత అధమస్థాయిలోకి నెట్టడంలో బ్రాహ్మణ రాతల పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. ఈ విషయంలో భారతదేశంలోని అందరు సామాజిక శాస్త్రవేత్తలకు అంగీకారం ఉంది. కొందరు దీన్ని అంగీకరించనంత మాత్రానా చరిత్ర- శాస్త్రీయతలకొచ్చిన నష్టం ఏమాత్రం లేదు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది state అంగీకరించిన "నిజం". ఈ నిజాన్ని ఎక్కడ చెప్పినా "నేరం" కాదు.

ఈ విషయంలో నాతో విభేధించే హక్కు అందరికీ ఉంది. వాదించే అధికారం అందరికీ ఉంది. నేను చెప్పేది శుద్ధ అబద్ధం అని, కొత్తగా ఎమైనా ప్రతిపాదనలు చేసే అవకాశం అందరికీ ఉంది. తమతమ బ్లాగుల్లో నేనొక బ్రాహ్మణద్వేషిగా, హిందూద్వేషిగా అభివర్ణించుకునే సౌలభ్యం అందరికీ ఉంది. కానీ....కానీ.... గోపాలరాజు అలియాస్ ప్రసాద్ అలియాస్ కురియన్ అలియాస్ భాస్కరరామరాజు కు నన్ను "హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక" అనే అధికారంమాత్రం అస్సలు లేదు. పైగా దాన్ని నేరంగా పరిగణించడానికి నాకు హక్కుంది.

కొందరి వింతైన వాదన ఏమిటంటే, "ఆ వాక్యాల్లో కులప్రస్తావన లేదుకదా మరి కేసెలా అవుతుంది" అని. OK కులప్రస్తావన కాకుండా కుల అవహేళన కాకుండా ఈ వాక్యంలో మరే ఇతర అర్థం ఉండే అవకాశం ఉందో మొదటగా చూద్ధాం.

Option 1: వికలాంగులకిచ్చే రిజర్వేషన్తో చదివావు కాబట్టి నువ్వు గొప్ప కాదు.
Option 2: కేవలం సెంట్రల్ యూనివర్సిటీలో చదివినంత మాత్రానా కొమ్ములు రావు. కాబట్టి ఎగిరెగిరి పడకు.
Option 3: కేవలం కులం ప్రాతిపదికన లభించిన రిజర్వుడు సీట్లో పీజీ చెయ్యగానే నువ్వు గొప్పోడివి కావు. ఎందుకంటే నీకది అయాచితంగా,అర్హత లేకుండా దొరికింది. కాబట్టి ఊరికే ఎగిరెగిరిపడక సైలెంటుగా కూర్చో.
Option 4: ఏదీ కాదు.


నాకైతే మూడో ఆప్షన్లోనే బలముందనిపిస్తోంది. "ద్వేషం + ఆభిజాత్యం = వివక్ష" కోణంలోనే నాకు కనిపించింది.

ఇక ఈ విషయంలో చట్టం గురించి. THE SCHEDULED CASTES AND THE SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) ACT, 1989 "3.(x) intentionally insults or intimidates with intent to humiliate a member of a Scheduled Caste or a Scheduled Tribe in any place within public view;" అనేది చట్టం.

భారతీయ రాజ్యంగంచే నాకు కల్పించ బడిన హక్కుని హేళన చేసి. రిజర్వేషన్ లభించే కులంలో పుట్టానుగక నన్నొక అనర్హుణ్ణిగా ఎంచి అవమానించడానికి కాక, ఎత్తుకుని ముద్దెట్టడానికి వీరు వ్యాఖ్య రాశారని నేను నమ్మలేను. ఆ వ్యాఖ్యలో అటువంటి అవాజ్యమైన ప్రేమ నాకు కొరవడినట్లు కనడుతోంది. దొంగపేరుతో రాయడం ఖచ్చితంగా ఉద్దేశపూర్వకం. ఇప్పుడు కూడా ‘నేనే రాశాను ఏంచేస్తావో చేసుకో’ అన్నట్లుగా ఎలుగెత్తి చాటుతున్నారు. కనుక చట్టప్రకారం అతనిపై నేరారోపణ చేసే హక్కు నాకుందని నమ్మాను. నమ్ముతున్నాను. ఇక వెబ్ పత్రిక అనేది ఒక "పబ్లిక్ వ్యూ" అనేదాన్ని ఎవరూ విభేధించలేరు.

--------------------------------------------------------------------------------------------------------

ఇక అసలు విషయానికి వద్ధాం. ఈ ముసుగుదొంగ గారికి మరో పేరుందండోయ్ ఆపేరు కొంచెం వెలుగుతూ ఉంటుంది. "సూర్యకిరణ్". మిషనరీలూ,ముల్లాలూ అంటే వీరికి పరమ అలెర్జీ. బ్రాహ్మణుల్ని ఎవరైనా ఏమైనా అంటే పరమ చిరాకు. ఉండాల్సిందే! హిందువుల భూముల్ని క్రైస్తవ ముఖ్యమంత్రి లాగేసుకుంటున్నాడని తెగ బాధపడిపోతారు. రైటే!

కాకపోతే దొంగ పేర్లతో, తప్పుడు ఈ మెయిల్స్ తో ఇవన్నీ రాస్తుంటారు. ఎవర్నైనా తిట్టాలన్నా, అవమానించాలన్నా ఇలా దొంగదారులు పట్టేస్తుంటారు. లేకపోతే తన బ్లాగులో ఈయన ఉదాత్తంగా వేసుకునే ఒక యోగి ముసుగుకి దెబ్బకదా. వేదాలు వల్లిస్తారు (అచ్చు ఆ సామెతలాగే). గాయత్రిని జపిస్తారు. పద్యాల్ని రచిస్తారు. ఇతరులు కవితలు రాస్తే వాటిని గర్హిస్తారు. ముఖ్యంగా దళితులెవరైనా రాస్తే "పోనీ ఏమైనా కవితా?" అని ప్రశ్నిస్తారు. చాలా ఉద్దాత్తరూపుడు. ఉదారస్వభావుడూ. యోగి. ఋషి. పల్నాటి వీరుడు. వేదసంహితుడు. ఇంకా ఎన్నెన్నో.
--------------------------------------------------------------------------------------------------------

"చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది."

******

Sunday, June 21, 2009

ముసుగుదొంగ రూపాలు...రెండోసారి!




ఈ విషయంపై నేను రాసిన మొదటి టపాలో ఈ మర్యాదస్తుడు దొంగపేరుతో "నీ dalit christian agenda తో Arabian sea లో కలువు" అని శెలవిచ్చారు. ఇందులో వీరి తోడుదొంగలకు కుల,మత వివక్షలు కనిపించకపోయినా కనీసం వీరి విద్వేషం, ఆభిజాత్యం, ఝాఢ్యం కనిపిస్తాయనుకున్నాను. కానీ ఏం చేద్దాం! దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ భావజాలాన్ని నెత్తికెక్కించుకుని ఊరేగుతున్న జనాలకు "అర్థం" అవుతుందనుకోవడం నా అమాయకత్వం.

"నేను ఎవ్వనితో గొడవకు దిగను, నన్ను కించపరిస్తే తప్ప. అలా కొన్ని సార్లు జరిగింది కూడా. నేను పెద్ద లెక్క చెయ్యను దేన్నైనా. ఇలాంటిది ఇక్కడ జరిగే కాళ్ళు లాగుడు గట్రా ఐ కేర్ ఏ హూట్." అని ఉదాత్తంగా శెలవిచ్చిన ఈ మహాజ్ఞాని ఎన్ని మారుపేర్లతో తన బ్లాగురాయడమనే "ఫన్"ని సాధించాడో చెప్పక తప్పదు. ఒక్కో వ్యాఖ్యా చదువుతుంటే మీలో చాలా మందికొ కొన్ని హేట్ బ్లాగులు గుర్తుకొస్తే అది నాతప్పు కాదు. ఎందుకంటే వాటన్నింటినీ బహుశా ఈ మహానుభావుడే ఫన్ కోసం రాసుండొచ్చు. లేదా ఈయన చెంచాలు సగర్వంగా contrinute చేసుండొచ్చు.

"కత్తిని ఎక్కడాన్నా నేను తిట్టినట్టు చూపండి." అని నా బ్లాగులో ఛాలెంజ్ చేసి, ‘పుస్తకం’లో గోపాలరాజు ఈ ఉన్నతుడే అని నేను చెప్పేసరికీ రొమ్ము విరుచుకుని "ఐతే ఏమిటి" అన్న ఈ ఉదాత్తచరితుడికి మంగళహారతి పట్టాల్సిందే. కొందరు ఆల్రెడీ పడుతున్నారు లెండి. నా హారతి కొంచెం ఘాటెక్కువ అందుకని కొంచెం దూరంగానే పట్టాలి. పడతాను. ఎంతైనా భారతీయ సంస్కృతీ, చరిత్ర, సాంప్రదాయాలూ ముఖ్యంగా బ్రాహ్మణ గౌరవాన్ని ఒంటిచేత్తో, పదిపన్నెండు పేర్లతో, ఒక సైన్యాన్ని తయారుచేసి, విద్వేషాన్ని నింపి, గండ్రగొడ్డళ్ళు నింపే గంధర్వలోకాలకు సాగనంపి, కనీసం ద్వేషాన్ని రగిలించి నిలపాలని పరితపించే వ్యక్తికదా!

ఏమైనా అంటే "కుచ్ తో లోగ్ కహేంగే" అని పాటలు పాడతాడుగానీ, తన కుతిని తీర్చుకోవడానికి ఎన్నెన్ని తప్పుడు దారులు తొక్కాడో ఒక్కొక్కటీ తెలుస్తుంటే నాకూ విపరీమైన గౌరవం వచ్చేస్తోంది. అర్జంటుగా గుంటూరు పిలిపించి మర్యాదలు చేశెయ్యాలనే భావావేశం ఉప్పొంగిపోతోంది.

ఈ టపాలో ఈ మహాజ్ఞాని , సిద్ధయోగికున్న మరో నామధేయం అలాగే తనకంటూ పది బ్లాగులున్నా నా బ్లాగు మీద గౌరవంతో దాని URL ఇచ్చే ఔదార్యం గురించి తెలుసుకుందాం. ఇందులో చెప్పడానికి ఏమీ లేదు. ఒకసారి ఆల్రెడీ తెలిసిన IP అడ్రస్సుతో పోల్చుకుంటే తన ఫేవరెట్ పేరు గోపాలరాజు కాకుండా ప్రసాద్ అనే పేరుతో "Crime is a crime who ever committed it. It cannot be washed out. And it cannot be justified in any grounds." అని శెలవిచ్చారు. ఎంత విశాలమైన ప్రతిపాదనకదా!

ఇక్కడ కిటుకేమిటంటే, ఈయన విశాలత్వం అంతా దళితులకూ, క్రిస్టియన్లకూ మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు మాత్రమే చట్టం దృష్టిలో సమానంగా ఉండాలి. అలా ఉండకపోతే ఈయన గారి ఔదార్యానికి ఖర్చయిపోయేదెట్లా? ఎంత ఉన్నతమైన ఆలోచనకదా! అదే ఈయన గొప్పతనం. అభినందించాల్సిందే. పూజించాల్సిందే. ఈ వ్యాఖ్యలో మీకు "samuel reddy is very dangerous to this country" అనే వాక్యం వింటుంటే కొన్ని ప్రత్యేకమైన బ్లాగుల్లోని రాతలు గుర్తు రాలేదుకదా! వస్తే నాది మాత్రం పూచీ కాదండోయ్!!

ఈ సర్వాంతర్యామి గురించి కేవలం రెండు టపాల్లో చేప్పేస్తే ఎలా....ఐ టీవీ స్టైల్లో... "చెప్పాల్సింది చాలా ఉంది. చూడాల్సిందింకా మిగిలే ఉంది."

PS: కొందరు బ్లాగు మిత్రులకు ఒక చిన్న మనవి. టెర్రరిజానికిచ్చే కొన్ని నిర్వచనాల్లో ఒకటి "The use of violence for the achievement of political ends is common to state and non-state groups. " ఇక్కడ హింస భావజాలంలో, వాడేపదాల్లో ఉంది. ఈ టెర్రరిస్టు మూక మమ్మల్నెక్కడ అటాక్ చేస్తుందో అని భయంభయంగా మీమీ బ్లాగుల్లో దాక్కుంటే అదే వారి విజయం. వారి విజయాన్ని కాంక్షించి ఊరకుంటారో, నాతో గొంతుకలిపి వెళ్ళగొడతారో అది మీ ఛాయ్స్. మీ హక్కు. కానీ నా పోరాటం మాత్రం ఆగదు. సైలెంటుగా నాకు మద్ధత్తు తెలుపుతున్న అందరికీ నా కృతజ్ఞతలు.

****

Saturday, June 20, 2009

ముసుగుదొంగ రూపాలు...ఒకటోసారి!


మర్యాదస్తుల అసలు రూపాలు...
IP అడ్రసులు గమనించుకోండి. గొప్పోళ్ళ గొప్పలు మళ్ళీ చూసుకోండి.
This is just the beginning.

****

విన్నపం : తెలుగు బ్లాగుల్లో కులవివక్ష - సైబర్ నేరాలు

పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో నాపై కులపరమైన నింద చేస్తూ "హయ్దరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో రిజర్వేషన్ తో పీజీ చేయంగనే ఓ కొమ్ములేం రావు. ఊర్కే రెచ్చిపోమాక" అనే వ్యాఖ్య గోపాలరాజు అనే వ్యక్తి చెయ్యడం జరిగింది. సదరు గోపాలరాజు తనదంటూ, నా బ్లాగు URL కూడా అక్కడ ఉంచడం జరిగింది. అంటే అతని పేరు మీద క్లిక్ చేస్తే డైరెక్టుగా నా బ్లాగుకు లంకె వెళ్ళేలా ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ఆ వ్యక్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Author : గోపాలరాజు (IP: 12.107.152.253 , s1.oag.state.ny.us)
E-mail : gopalaraju@gmail.com
URL : http://parnashaala.blogspot.com
Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=12.107.152.253

ఈ IP ఆధారంగా నేను కొందరి మిత్రుల సహాయంతో ఈ వ్యక్తిని కనుగొనడం జరిగింది. కొన్నాళ్ళుగా ఇతను వివిధ బ్లాగుల్లో,వివిధ పేర్లతో నాగురించి రాసిన వ్యాఖ్యల్ని కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు మితృలు సహృదయంతో స్పందించగలనని ఆశిస్తున్నాను. ఎక్కడెక్కడైతే వ్యాఖ్యాత స్థానంలో నా బ్లాగు URL ఇవ్వబడి misleading, impostoring amounting to cyber-cheating చెయ్యబడిందో అలాంటి అన్ని చోట్లా ఈ వ్యక్తి "నా గుర్తింపు" ని దుర్వినియోగం చేసి చట్టప్రకారం శిక్షార్హుడు అవుతున్నాడని నేను నమ్ముతున్నానుగనక, దయచేసి ఆ వివరాల్ని నాకు ఇవ్వగలరని కోరుతున్నాను.

వర్డ్ ప్రెస్ వాడుతున్న బ్లాగర్లందరూ దయచేసి ఈ IP అడ్రసు నుంచీ నన్ను నిందిస్తూ వచ్చిన వ్యాఖ్యలతో నన్ను సంప్రదించగలని కోరుతున్నాను. బ్లాగర్ వాడుతున్న బ్లాగర్ మిత్రులు సందేహాస్పదమైన వ్యాఖ్యల్ని నాకు URLతో సహా పంపిన ఎడల గూగుల్ వారి హైదరాబాద్ ఆఫీసు ద్వారా ఈ ముసుగు వీరుడిని తన ఇతర స్నేహితులనూ సత్కరించే ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాను. నా మెయిల్ ID mahesh.kathi@gmail.com. నన్ను మెయిల్ ద్వారా సంప్రదిస్తే నా దగ్గరున్న వివరాల్ని పంచుకోగలను.

ఇంత చదువుకున్న వ్యక్తి,అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉంటున్న వ్యక్తి, ఉన్నత సాంప్రదాయక కుటుంబం నుంచీ వచ్చానని చెప్పుకొంటున్న వ్యక్తి, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల్ని-దేశభక్తినీ రగరగాల్లో నింపుకుని కార్యోన్ముఖుడై ఉన్నాని చెప్పుకునే ఒక వ్యక్తి, తెలుగు బ్లాగుల్లో కుల వివక్షనూ, మత విద్వేషాలనూ, సైబర్ నేరాలనూ ప్రోత్సహించి నాయకత్వం వహించడం శోచనీయం. కేవలం ఖండించి పక్కకు తప్పుకునే స్థాయినుంచీ వ్యక్తిత్వహననం చేసి, అమానవీయ నిందా వ్యాఖ్యలు చేసి భారతీయ శిక్షాస్మృతిలో శిక్షార్హమైన నేరాలను తనూ చేస్తూ ఇతరులనూ ప్రోత్సహిస్తున్న స్థాయికి ఎదగడంలో మనందరి పాత్రా ఉంది. మనందరి మౌనప్రోత్సాహం లేకుంటే, మనందరం ఉపేక్షించకుండా ఉండివుంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చుండేది కాదు. కనీసం ఇప్పటికైనా బాధ్యత తీసుకుందాం. నా తరఫునుంచీ ముందడుగు వెయ్యడానికి నేను సిద్ధం. మీ సహకారం కోసమే ఈ అభ్యర్థన.

కూడలి, జల్లెడ,పుస్తకం,నవతరంగం నిర్వాహకులకు కూడా ఇదే అభ్యర్థనను చేస్తున్నాను. నాకు చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని అందించండి. తెలుగు బ్లాగుల్ని ఈ ఆభిజాత్యాలనుంచీ రక్షించండి. చట్టవ్యతిరేక చర్యలకు పాలుపడుతున్న వ్యక్తులను భారతీయ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం సాక్షిగా శిక్షించే ప్రయత్నంలో సహకరించండి.

****

Thursday, June 18, 2009

కాంట్రడిక్షన్


కారుకూతలు కూసి
కాలాన్ని కాపాడుతారు
మనిషిని చిన్నచూపు చూసి
మానవత్వానికి పట్టంగడతారు

క్రిందనున్న నలుపు
కెలుకుడు బలుపు
మూర్ఖపు ఝడుపు
మేధో(తో) విరుపు
వీళ్ళను వటవృక్షాల్ని చేస్తే
ఆముదాల చెట్టు అలికిడికి
అధాట్టున దాక్కుంటారు

గ్రూపుల్ని తుదముట్టడానికి
తొడగొట్టి
సైన్యమని జట్టుకట్టి
పోరాటనికి... దైన్యంగా...
ముసుగులేసుకుని
ముసురుకుంటారు
ఎదురైనా పడతారా అంటే
ఎదురేలేని వీరికి
ఎక్కడిదో అంతటి అదురూ బెదురూ!

చీకట్లోనే స్వైరవిహారం
ముసుగుల్లోనే సాహస విన్యాసం
గూఢమైన కుతిరాతల్లోనే
రతి ఆస్వాదం

కాంట్రడిక్షన్ ను కాంట్రడిక్ట్ చెయ్యాలంటే
ఆమాత్రం కసరత్తు తప్పదు
ఏ అపోహ కోసం పోరాడుతున్నారో
ఆ అపోహ తామవ్వక తప్పదు


*****

‘కత్తెర’ కథ

“the great editing skill will protect the director from committing suicide”

- Sean penn, Actor/Director


“కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే దృశ్యాల్నే డబ్బులిచ్చిమరీ తెరమీద ఎన్నాళ్ళని చూస్తారూ! అందుకే సినిమా ఒక పనికిరాని భవిష్యత్తేలేని సాంకేతిక ప్రయోగంగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడొచ్చాడు కత్తెర తీసుకుని మన ప్రప్రధమ ఎడిటర్ ఎడ్విన్ పోట్టర్.

ఎడ్విన్ పోట్టర్ తన కత్తెరతో “ఇంటర్ కట్” అనే ఒక అద్వితీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఒకే సమయంలో జరుగుతున్న రెండు వేరు వేరు పరస్పర సంబంధమైన ఘటనల్ని మార్చిమార్చి చూపించడం ద్వారా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఒకవైపు మంటల్లో రగులుతున్న భవనం. మరోవైపు గుర్రబ్బళ్ళలో మంటల్ని ఆర్పడానికి వస్తున్న ఫైర్ మెన్. వచ్చారా…రక్షించారా…ఏమయ్యింది అని ఉత్కంఠంతో ప్రేక్షకులు ఊపిరిబిగబట్టి సినిమా చూశారు. 1903 లో సినిమాల్లో ఎడిటర్ జన్మించాడు. దానితోపాటూ ఒక కొత్త భాష, కొంగ్రొత్త కళ ఉద్భవించాయి. ఒక్క కనురెప్ప మూసిన క్షణంలో దిగంతాలనుంచీ అనంతాలవరకూ, మానవ ముఖకవళికలనుంచీ తన బుర్రలోని అధోలోకాలవరకూ తెరమీద ఆవిష్కరించగల కళారూపం సృష్టించబడింది.

ఏడిటింగ్ సమయాన్ని నిదానించగలదు. సమయాన్ని వేగవంతం చెయ్యగలదు. ఒక్క కట్ తో ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేచి నుంచోపెట్టగలదు. ఆశ్చర్యపరచగలదు. భయపెట్టగలదు. షాట్ నిడివి, సీన్ నడవడికను నిర్ణయించి కథన రీతిని నిర్దేశింగలదు. ప్రేక్షకులభావేశాన్ని నియంత్రించగలదు. బహుశా తన జీవితాన్ని నిర్దేశించాలనుకునే మనిషిలోని అంతర్లీన కోరికకు ఎడిటింగ్ ప్రతీకలాగా అనిపిస్తుంది. ప్రతి మనిషీ తన జీవితంలోని బోరుకొట్టే చెడ్డభాగాలను కత్తిరించి పారెయ్యాలనుకుంటాడు. ఆసక్తికరమైన భాగాలను నిదానంగా,లోతుగా తరచి చూసి ఆనందించాలనుకుంటాడు. ఆవేశాన్నీ కోపాన్నీ ఉద్వేగాన్నీ వేగంగా ముగించెయ్యాలనుకుంటాడు. అదే సౌలభ్యం ఎడిటింగ్ లో ఉంది. బహుశా ఎడిటింగ్ వలనే మనిషికి సినిమా నచ్చుతుంది. ఎడిటింగ్ లేకపోతే సాధారణ జీవితంలాంటి సినిమా బోర్ కొట్టదూ!


పూర్తి వ్యాసం కోసం నవతరంగం చూడండి.


P.S. భారతీయ ఎడిటర్ల గురించి రాయడానికి ప్రయత్నించాను. కనీసం మొదటి మూకీ `రాజాహరిశ్చద్రం’(1913) ఎడిటర్ ఎవరో మొదటి టాకీ ‘అలం అరా’(1931) ను కత్తిరించిందెవరో చెబుదామని వెతికాను.దురదృష్టవశాత్తూ ఆ వివరాలు నాకు లభించలేదు. బహుశా అశిష్ రాజ్యాధ్యక్షా పుస్తకంలో ఉన్నాయేమో చూడాలి.

ఒకటి మాత్రం చూచాయగా చెప్పొచ్చు. ఎడిటర్లకు ఇప్పటికీ మనం ఇచ్చే గుర్తింపు తక్కువే. అప్పట్లో ఎంతిచ్చామన్నది వాళ్ళపేర్లు లభ్యమవకపోవడం సూచిస్తోంది. భారతీయ సినిమా ఎడిటింగ్ పరంగా అందించిన నూతన విధానం ఏమైనా ఉందా అనేది ఒక పెద్ద ప్రశ్నే!


****

Wednesday, June 17, 2009

లిటరరీ & ఫిల్మ్ క్లబ్స్ ఎక్కడా?

రచయిత ఉద్దేశించినట్లే అందరు పాఠకులూ అర్థం చేసుకోవాలని కోరుకోవడం బహుశా మితిమీరిన ఆశావాహక దృక్పధం అనిపించుకుంటుంది. సినిమా విషయంలోనూ అంతే. దర్శకులూ,నిర్మాతలు ఎవరూ ఫ్లాపు సినిమా తియ్యాలని తియ్యరు. అలా అయిపోతాయంతే. ఒక రచన చేసేప్పుడు అది "ముఖ్యమైనది" అనుకునే రచయితలు రాస్తారు. కానీ పాఠకుడు "చెత్త" అనుకుంటే మనం చెయ్యగలిగెదేమీ లేదు. దీనికి విపరీతంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఏదో ‘అలాఅలా’ రాసేస్తే అదొక ఉద్యమాన్ని సృష్టించెయ్యొచ్చు. సినిమా మామూలుగా తీస్తే కళాఖండంగా మిగిలిపొనూవచ్చు.

రాసిన వెంఠనే రచన రచయితను మీరి స్వతంత్ర్య ప్రతిపత్తిని సంతరించుకుంటుంది. ఒకసారి పాఠకుడి చేతుల్లోకి వెళ్ళిన తరువాత తన మనఃస్థితిని బట్టి, పూర్వజ్ఞానాన్ని బట్టి కొత్త అర్థాల్ని సంతరించుకుంటుంది. దీన్నే reader centric interpretation అంటారు. సినిమాను తెరపై చూస్తున్న ప్రతి ప్రేక్షకుడూ ఒకే స్పందన చెందుతాడనేది ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఇక్కడా ప్రేక్షకుడి "స్వీయానువాదానికి" బలమైన స్థానముంది. ఆ స్పందనలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే...ఒకసారి నవతరంగంలో ఒకే సినిమాపై వచ్చే రెండు విపరీతమైన సమీక్షలు చదివితే అర్థమవుతాయి. టీవీల్లో తమ సినిమాని ఊదరగొట్టే దర్శకులు చెప్పినదానికీ ఈ రెండు,మూడు,నాలుగు సమీక్షలకీ అస్సలు పొంతనుండదు. మరొ వందమంది అదే సినిమా గురించి చెప్పినా అవి ఎంతోకొంత స్థాయిలో విభిన్నంగానే ఉంటాయి.

ప్రతి పాఠక/ప్రేక్షకుడి “స్థాయీ” రచయిత/దర్శకుడి స్థాయి కాబఖ్ఖరలేదు. రచయిత/దర్శకుడు ఆశించిన స్థాయిలోనే పాఠక/ప్రేక్షకుడు రసస్పందన చెందనవసరమూ లేదు. అయితే, పాఠక/ప్రేక్షకుల స్వీయానువాదానికి ఎంత విలువున్నా ఒక text ని intended form లో చదవడానికి కొంత “EDUCATION”(what ever it means) అవసరం అనేది చాలా మంది అంగీకరించే విషయం. సినిమా విషయంలో కూడా ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది. అందుకే లిటరరీ క్లబ్స్, ఫిల్మ్ క్లబ్స్ ఒక సాంస్కృతిక ఒకప్పుడు ఉద్యమంలాగా బయల్దేరాయి. ఈ క్లబ్స్ ఉద్దేశం రచనలు/సినిమాల మూల ఉద్దేశాల్ని అవగతం చెయ్యడం. అంతేకాక వాటికున్న సామాజిక సైద్ధాంతిక నేపధ్యాల్ని పరిచయం చేస్తూ పాఠక/ప్రేక్షకుల్లో ఒక మానసిక వేదికని ఏర్పరిచి అభిరుచుల్ని పెంపొందించుకునేలా చేసేవి. కానీ ఇప్పుడు అవి బలహీనమయ్యాయో లేక అనవసరం అయ్యాయో తెలీటం లేదు. బ్లాగుల్లో జరుగుతున్న సాహితీచర్చల నేపధ్యంలో వాటి అవసరం మాత్రం ఉంది అనిపిస్తోంది.

****

Tuesday, June 16, 2009

కవిత్వమొక శుద్ధ దండగ !

కవిత్వమొక శుద్ధ దండగన్నారో పెద్దమనిషి. కవిత్వం సాహిత్యాన్ని చంపేస్తోందన్నారు మరో సాహితీప్రేమికుడు. నిజమే కాబోలు. కవిత్వం వల్ల, మరీ ముఖ్యంగా భావకవిత్వం వల్ల నిర్ధిష్టమైన "సామాజిక ప్రయోజనం" లేకపోవడం చేత, చాలా మంది ఛెస్టు మీది స్టీము వదిలించుకోవడానికి భావకవిత్వమనే దగ్గర దారిని ఎంచుకోవడం మూలంగా పుంఖాలు పుంఖాలుగా కవిత్వం వెల్లివిరిసిపోతోంది. అంతేకాక భావకవిత్వంలోని విస్తృతిని విస్మరించి దాన్నొక ప్రేమకవిత్వంలోకి కుదించేసి "రైఠో!" అనేస్తున్నారు. బుక్ షాపుల్లో, వెబ్ పేజిల్లో, బ్లాగుల్లో, పత్రికల్లో కవితలే కవితలు. అంతులేని కవితలు. అంతమవని కవితలు. అడ్డూఅదుపూ లేని కవితలు. అదరగొట్టే కవితలు. బెదరగొట్టే కవితలు. అరగదీసే కవితలు. ఇరగదీసే కవితలు. అప్పుడప్పుడూ అరుదైన కవితలు.

ప్రేయసి జ్ఞాపపికలు, విరహాగ్ని కీలకలూ, ప్రేమైక గీతికలూ అలవోకగా ప్రతొక్కరూ పదాల తోరణాలు కట్టి కవిత్వం పేరుతో అక్షరాల్లోకి కుదించెయ్యగలరు. ఇందులో చర్చించడానికీ, విభేధించడానికీ,మేధోమధనం చెయ్యడానికీ ఏమీ ఉండదు. చదివి బాగుందనుకోవడానికో లేక నాకూ ఇలాంటిదొక అనుభవం ఉందనుకోవడానికో లేక నేనూ ఒకటి రాసెయ్యగలను అని ధీమా తెచ్చుకోవడానికోతప్ప కవిత్వంలో ప్రయోజనం, ప్రయోజకత్వం అంతగా కనిపించదు. కాకపోతే ఈ "ధీమా" మాత్రం ప్రతొక్కరినీ కవిని చేసెయ్యగలదు. అదే ఒక గొప్ప ప్రయోజనమంటే మాత్రం చచ్చినట్లు అంగీకరించాల్సిందే. ఎంతైనా భాషా యొక్క వ్యాప్తికి ఈ కవితా ధోరణి దోహదం చేసినట్లే కదా!

"కవిత్వాన్ని నిర్వచించరా!" ఒక ఇంగ్లీషొడ్ని అడిగితే...."The poem is a physical artifact consisting of marks on paper, or the grooves on a Babylonian tablet.
The poem is the sequence of sounds uttered by a speaker, reading aloud.
The poem is the experience of the reader.
The poem is an expression of the experience of the author.
The poem is a stratified complex of values, which cannot be reduced to any of the previous four theories. అన్నాడట. "చచ్చింది గొర్రె" అన్నట్లు. ఇదే సమస్య మనకూ ఉంది. కవిత ఒక వాక్యంలో ఉండాలా, హైకుల్లా మరుగుజ్జైపోవాలా, లేక చాంతాడంత కావ్యాలైపోవాలా అనేది ఎవరూ నిర్ణయించి చచ్చే విషయం కాదు. కాబట్టి రాసిందే కవిత. అందుకే మనకీ ఖర్మతప్పదు.

దండగన్న పెద్ద మనిషి బాధ ‘కవితల్లో ఊహావర్ణనలేతప్ప నిజానికి స్థానం ఉండటం లేదని’. నిజమే! నిజానికి స్థానం ఇవ్వాలంటే నేలవిడిచి సాము చెయ్యడం మానాలి. కానీ కవితాలోకంలో విహరించడం తప్ప జీవించడం ఉండదే! అప్పుడేలా? భావకవిత్వాన్ని పక్కనబెట్టి విషయకవిత్వమూ, అభిప్రాయ కవిత్వమూ, యిజాలకవిత్వమూ మొదలెట్టేస్తే ఆ నిజాలకు స్థానం దక్కి ప్రయోజనం సిద్ధించేస్తుందా అనేది జవాబులేని ప్రశ్న.

కవిత్వం వలన సాహిత్యానికి హాని జరుగుతోందన్న సాహితీప్రేమికుడు వ్యధ చాలా అర్థవంతంగా ఉంది. బండ్లకొద్దీ వస్తున్న కవిత్వం రీములకొద్దీ పేపర్ ను ఖర్చుపెట్టించి అలవికాని ప్రదేశాన్నంతా ఆక్రమించేసి మిగతా సాహిత్యానికి ‘నిలువనీడ’ లేకుండా చెస్తోంది అనేది ఈ వాదన. తప్పదు అంగీకరించాల్సిందే. మరీ ముఖ్యంగా "ఇదే సాహిత్యం" అనుకొని ఒకసారి కవిత్వాన్ని ముట్టుకుని భయపడిపోయిన కుర్రకుంకల్ని చాలా మందిని నేనెరుగుదును. "ఐతే పద్యాలంటారు. లేకపొతే కవిత్వాలంటారు. ఎందుకు మాకీ తంటా" అని ప్రశ్నించిన మా బంధువులబ్బాయి నాకళ్ళముందింకా మెదులుతూనే ఉన్నాడు. "ఈ సాహిత్యానికొక దండం స్వామీ! ఇంతకన్నా యండమూరి నవలలు, పర్సనాలిటీ డెవలెప్మెంట్ పుస్తకాలు బెస్టు" అన్న విద్యార్ధుల్నీ ఎరుగుదును. "యండమూరిదీ సాహిత్యమేరా భడవా" అంటే "అలా అంటే మీరొప్పుకోరుగా" అని చురక అంటించాడు మరొకడు.

కనీసం కథాసాహిత్యం, నవలా సాహిత్యం ప్రొఫెషనల్ రచయితల పుణ్యమా అని జనాల్లో మిగిలుంటే దానిక్కూడా గండిగొట్టేపని కవితాసాహిత్యం చేస్తోంది అనేది మరొక వాదన. క్లాసుల్లో పద్యాల హోరుతో భయపడి పుస్తకప్రపంచంలో కవితల్తో హడలెక్కి తెలుగు పుస్తకం ముట్టుకుంటే ఝడిసిపోయే ఘటాల్ని మనం తయారుచేస్తున్నామేమో ఈ కవితా ప్రవాహం వల్ల అనేది ఒక అనుమానం.

వ్యక్తిగతంగా నేను బ్లాగుల్లోకొచ్చేంతవరకూ కవితల్ని చదివిన పాపాన పోలేదు. ఏదో శ్రీశ్రీ ఆవేశాలూ, కృష్ణశాస్త్రి భావాలూ గాల్లో ఎగురుతూ అప్పుడప్పుడూ తాకినవేగాని ప్రత్యేకించి అందులో నేను చేసిన సాధన అస్సలు లేదు. చదవంగా చదవంగా కొంత ఆనందాన్ని మరింత ఆశ్చర్యాన్నీ కొన్ని కవితలు ఖచ్చితంగా ఇచ్చాయని చెప్పొచ్చు. "మరి ఆనందానికీ, ఆశ్చర్యానికీ సామాజిక ప్రయోజనం ఉందా?" అంటే మాత్రం నేను నోరుమూసుకోక తప్పదు. అలౌకిక అనుభూతుల గురించి నాకు తెలీదుగానీ మనుషుల్లోని కాంప్లెక్సిటీని అప్పుడప్పుడూ భాష అభివ్యక్తీకరించలేకపోతే వాటిని కవితల రూపంలో ప్రయత్నించొచ్చేమో అనే ఆశమాత్రం కలుగుతుంది నాకు.

స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ పరవశించి నృత్యం చేసిన తరువాత కళ్ళలో నీళ్ళు నింపుకుని ‘కళలో ఇంత ఆనందం ఉంటుందని ఇప్పటి వరకూ నాకు తెలీదు" అంటుంది. అప్పటిదాకా భౌతిక ‘ఆశ’ల కోసం కళను చిన్నచూపు చూసిన ఆ పాత్ర "రసస్పందన" పొందడంలో పారలౌకిక ఆనందాన్ని అనుభవిస్తుంది. అది పేట్రనైజింగ్ గా అనిపించినా అప్పుడప్పుడూ సాహిత్యానికున్న పరమావధి కూడా అదేకదా అనిపించక మానదు. తిండీగుడ్డా సమస్యలుగా ఉన్న మనుషులకు సాహిత్యంతోగానీ మరే ఇతర కళలతోగానీ ముఖ్యంగా కవిత్వంతో అస్సలు అవసరం లేదు. బౌతికావసరాలు మీరి మానసిక అవసరాలలోకూడా ఒక స్థాయిని దాటిన మనుషులకు మాత్రమే ఇవి కావాలి.

కాబట్టి ప్రయోజనమే కొంత మందికున్న సాహిత్యాన్ని గురించి కవిత్వాన్ని గురించీ పేజీలు పేజీలి బాధపడటమే అనవసరం అనిపిస్తోంది. ఏమిటో ఈ పిచ్చి.


*****

Monday, June 15, 2009

వేసవి రుచి

కాంపౌండ్ గోడ మీది వేడిగాలి ఎండమావిని తలపిస్తోంది. ఎండాకాలం మొదలైపోయింది.

ఈ వేసవి మధ్యాహ్నపు ఇబ్బందికరమైన నిశ్శబ్ధం. నిశ్శబ్దాన్నిభంగం చేస్తూ వేలితో కిటీకీ ఊచమీద నోటి వెంటొచ్చిన సన్నటి పాటకు అనుగుణంగా లయబద్దంగా ఒక చిన్న దరువు వేసాను. "తుమ్ ఆగయేహో నూర్ ఆగయాహై"అనే కిశోర్ కుమార్ పాత హిందీ పాట. నీకూ నాకూ అమితంగా నచ్చిన పాట.

కొన్నేళ్ళ క్రితం నీ కోసం ఈ పాట పాడినప్పుడు, ఇప్పుడున్న ఇనుపచువ్వల స్థానంలో నీ కాలి మువ్వలున్నాయి. ఆ మద్యాహ్నంలో కూడా ఇలాంటి నిశ్శబ్దమే. ముదురాకుపచ్చ చీర, మ్యాచింగ్ బ్లౌజుతో నువ్వు. చేతిని ఆసరా అడిగిన చుబుకం, మధురమైన నిద్రకొరిగినట్లుగా తల కొద్దిగా పక్కనపెట్టి, కళ్ళు మూసుకుని నా ఒడిలో నువ్వు. నీకు గుర్తుందా? ఆ మధ్యాహ్నం, నా గదిలో మనం. సీలింగ్ ఫ్యాన్ గాలికి నీ కురులు బుగ్గల్ని తడుముతుంటే, ఏదో నల్లమబ్బుల మాటునున్న నిజాన్ని తట్టిలేపుతున్న అనుభూతి. ఇంకా ఏదేదో!

పాటకు పరవశిస్తున్న నువ్వు, నా చెయ్యి నీ బ్లౌజు మీదున్న చెమట తడిని ముట్టుకున్నా కళ్ళు తెరవలేదు. నీ మెడనుంచీ చెమట మెల్లగా కుడి వక్షం వొంపు క్రిందకు నిదానంగా జారుతుంటే నేనందుకున్నాను. నువ్వుమాత్రం కళ్ళు మూసుకుని మెత్తగా నవ్వుకున్నావు. ఆ నీ చెమట బిందువు నా వేలికొసపై చిన్నగా, వెలుతురు సరిగా లేని గదిలో వెచ్చగా మెరిసింది. ఆ తడి వేలిని నా పెదాలు తాకాయి. ఆ క్షణంలో ఈ వేసవి రుచి నాకు అవగతమయ్యింది.

ఆ తరువాత...నా నుదుర్ని నీ ఒడి కాల్చినప్పుడుగానీ నేను కళ్ళు మూయలేదు. నా చేతులు నీ పాదాలు తాకిన తరువాత గానీ నువ్వు కళ్ళు తెరవలేదు.

ఆ కలయికే ఒక జీవితకాలం. ఆ అనుభవమే నా శాశ్వత ధ్యానం.

ఇప్పుడు నువ్వు లేవు. నేనున్నా నేను లేను. జ్ఞాపకం మాత్రం మిగిలే ఉంది. చీకటి గదిలో ఆ చెమటచుక్క ఇంకా మెరుస్తూనే ఉంది. వేసవి మధ్యాహ్నపు రుచి గుర్తొస్తూనే ఉంది.

*****

Saturday, June 13, 2009

సంగమం


నాకూ ఆమెకూ మధ్య జరిగే
ఈ అంతిమ ప్రయాణానికి ముందు
ఎన్ని రూపులు వశించిందో
ఎన్ని చేతులు సృజించాయో
ఎందరు పురుషులు స్పృశించారో

అగమ్యమైన గమనంతో
తను నన్ను చేరినప్పుడు
నిశ్చలంగా పరికించాను
ఈ అనంతంలోని
ఘటనను పూరించడానికి
నన్ను తనలో కలుపుకున్నప్పుడు
అబ్బురపడి పులకించాను

ఆద్యంతాల్ని సృష్టించిన
ఆ ఆదివిస్ఫోటం మొదలు
నేనూ...ఆమె...ఆమె...నేను
ఈ ఉదంతం కోసమే కదా ఎదురుచూసింది!

****

Friday, June 12, 2009

కథ వెనుక కత/సొద

గాల్లోంచీ పుట్టడానికి కథలు స్వాములోరి విభూధో, లింగాలో కాదు కదా! ఈ కథా గాల్లోంచే పుట్టలేదు. నా స్వీయానుభవాల్లోంచీ కాకపోయినా, నేను చూసిన ఘటనల్లోంచీ పుట్టింది. నాకు పరిచయమున్న మనుషుల్లోంచీ పుట్టింది. విడివిడి అనుభవాల్నీ, విభిన్నమైన ఘటనల్ని, వేరువేరు మనుషుల్ని ఒక్క తాటితో బంధించి ఒక్క కథగా చెబుతామన్న నా ఆలోచనలోంచీ వచ్చింది. అక్కడ్నించీ ప్రారంభమయ్యింది నా కథ వెనుక కథ.

కథ రాయాలి అనుకున్నాక, ‘కథే ఎందుకు’ అనే ప్రశ్నకాక ‘కథంటే ఏమిటి’ అనే అంతర్మధనం మొదలయ్యింది. ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో రాసేది సాహిత్యమేనా! పేరున్న పత్రికలూ వాటి సంపాదకులూ "వాహ్ వాహ్" అనకుంటే ఆ కథకు అస్తిత్వం ఉంటుందా? అనే కొసరు ప్రశ్నలనుంచీ, అసలు కథంటే ఏమిటి అనే అసలు ప్రశ్న ఉదయించింది. అంటే నేను చిన్నప్పుడు చందమామా,బాలమిత్ర చదవలేదని కాదు. పెద్దయ్యాక కొడవటిగంటి, చిట్టిబాబు,మధురాంతకం రాజారాం, చలం కథలు ఎరగక కాదు. సమస్యల్లా అవి ఎరిగుండటమే అనిపించింది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కథను నిర్వచించలేదు. కథల్ని సృష్టించారు. కథన రీతుల్ని కవ్వించారు. కథాశైలిని నర్తింపజేసారు. ఏ ఒక్కరి కథాగమనం మరొకరితో పోల్చలేం. ఏ ఒకరి మూసనూ ఇదే కథ అని తేల్చలేము. అంతెందుకు, మధురాంతకం గారు స్వయంగా తెలుగు కథా చరిత్ర గురించి రాసిన ‘కథాయాత్ర’ లో తెలుగు కథ పరిణామం, పాత్ర చిత్రణల్ని గురించి చెప్పారేగానీ తెలుగు కథకు ఈ లక్షణాలే ఉండాలని శాసించలేదు. కానీ,ఇప్పుడు ఒక ‘కత’ చెబితే "అబ్బే ఇది కథలాగా లేదే" అనే నిర్ణయస్వరం బహుగాఠ్ఠిగా వినిపించేస్తున్నారు. ఇక మంచికథ, గొప్పకథ, ప్రమాణాల్లో తూగే కథ అని నానారకాల లేబుళ్ళు కూడా తయారయ్యాయి. అందుకే నేను రాసిన తరువాత "ఇది కథ కాదు. నాకు కథ అంటే ఏమిటో తెలీదు" అనే డిస్క్లైమరొకటి పడేద్దామనుకుని రాయడం మొదలెట్టాను.

నాకు తోచినట్లు, నేను అనుకున్నట్లు రాసేసాను. తీరా రాశాక, ఇప్పుడింకో తంటా. కొందరు మిత్రులకి రహస్యంగా చూపించాను. కొంచెం పరిణితి కనిపించిందన్నారు. కొంత ఎడిటింగ్ అవసరం అన్నారు. "నువ్వే కనిపిస్తున్నావ్ నీ పాత్రలెక్కడా?" అని ప్రశ్నించారు. కథా వస్తువు బాగుంది కానీ పాత్ర చిత్రీకరణ "ప్చ్" అని పెదవి విరిచారు. "డిటెయిల్స్ ఎక్కడా? వర్ణనలు ఏవి?" అని గద్ధించారు. "బ్లాగులో కావాలంటే పెట్టుకో పత్రికలకు పంపితే ఇంతే సంగతులు చిత్తగించవలెను" అన్నారు. కనీసం వెబ్ పత్రికలకు పంపించు వారి ఫీడ్ బ్యాక్ మంచి చేస్తుందేమో అన్నారు. కథలో ఉన్న లోటుపాట్లేమిటో ఇది కథగా ఎందుకు క్వాలిఫై కాదో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒకరు సహృదయతతో "అసలు కథ ద్వారా ఏంచెప్పలనుకున్నావు?" అని అడిగారు. దిమ్మతిరిగిపోయిందంటే నమ్మండి. చచ్చీచెడీ చెప్పాలనుకున్నది కథరూపంలో చెప్పేస్తే, ఏంచెప్పాలనుకున్నావని అడిగితే ఎలా!

ఒక స్నేహితుడు శ్రమపడి వాక్య నిర్మాణాన్ని సరిదిద్ది ప్రవాహంలో అర్థాలు కోల్పోతున్న వాక్యాలకూ ఊతమిచ్చి ఒడ్డుకు చేర్చారు. మరో మిత్రుడు "నీ అభిప్రాయాలను పాత్రల చేత పలికించి, నీ భావాలను పాఠకులపై ఎందుకు రుద్ధాలనుకుంటున్నావు?" అని సూటిగా ప్రశ్నించాడు. "కథ రాసింది నేను. ఈ ఆలోచనలు పాత్రల రూపంలో అయితే బాగుంటాయని నిర్ధారించింది నేను. ఆ భావలకు భాషనందించి ఒక రూపుదిద్దింది నేను. అలాంటప్పుడు ఈ కథ ‘నా కథ’లాగా కాకుండా పాత్రల కథగా ఎందుకుండాలి?" అని ఎదురు ప్రశ్నిస్తే నీ తలరాత అని తప్పుకున్నాడు. అంతటితో ఆగుతానా, పాఠకులపై నేను రుద్ధడమేమిటి? అని ప్రశ్నించాను. తన దగ్గర నుంచీ సమాధానం లేదు. ఇక భావాల సంగతంటావా, ఎంత మంది తమ ప్రేమ రొదల్ని కవితలుగా అల్లటం లేదు. ఎంత మంది తమ విరహ వేదనల్ని కావ్యాలు చెయ్యటం లేదు. మరి నేను నా భావాలను కథగా రాస్తే తప్పేమిటి అనిపించింది. అంతగా అయితే దీన్ని అభిప్రాయాల కథ, ఆలోచనల కథ, సొంత భావాల కథ, మహేష్ భావజాలం కథ అని ఎన్నైనా అనుకో అని ఆ మిత్రుడికి వెసులుబాటు కల్పించేశాను. ఎవరో ఒకరు పుట్టిస్తేగానీ భాషలో పదాలు పుట్టనట్లు, కొందరు మనుషుల్ని కలగలిపితేగానీ ఒక కథాపాత్రవ్వదుకదా! కొన్ని ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ వారిలో నింపితేగానీ ఆ పాత్రలకు రూపం రాదుగా! మరి ఆ ఆలోచనలూ, అభిప్రాయాలూ రచయితవైతే వచ్చిన తప్పేమిటి? లేదా రచయిత ఆశించినవైతే వచ్చే నష్టమేమిటి అనేవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

ఈ కథకాని కథకొస్తే... అసలు ‘దేవత’ అనే పదానికి నెగిటివ్ అర్థం వచ్చేలా చూడొచ్చనే ఆలోచన కలిగించిన మిత్రుడు హరీష్ కు శీర్షిక క్రెడిట్ ఇవ్వాలి. కాలేజిలో ప్రియ అని మధురై నుంచీ ఒక జూనియర్ ఉండేది. చాలా అందమైన పిల్ల. ఎంత అందమంటే...నిజంగా కల్పనల్లోని దేవతలాగా, రవివర్మ పెయింటింగ్ లోని దేవతలాగా ఉండేది. ఒకసారి ఆ అమ్మాయి అందాన్ని పొగుడుతూ ఉంటే హరీష్ అన్నాడు "నిజమే ఆ అమ్మాయి దేవత. నీకూ నాకూ ఇక్కడున్న అందరికీ పూజించి ఆరాధించడానికి తప్ప మరెందుకూ పనికిరాని దేవత" అని ఎత్తిపొడిచాడు. అప్పుడనిపించింది, what a way of looking at it అని. అద్వితీయమైన మంచితనాన్ని కూడా దేవతల లక్షణంగా చెబుతాం. కానీ, ఆ మంచితనాన్ని సాధారణమైన మనుషులు భరించలేరు. అలాంటిది, ఒక స్త్రీ మగాడితో సమానంగా వ్యవహరిస్తేనే భరించలేని వ్యక్తికి ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ ప్రేమిస్తే ఆమెనుకూడా భరించలేడు అనే ఆలోచన ఎప్పటి నుండో ఉండేది. అలా ప్రారంభమయ్యింది ఈ దేవత కథ.

హేమంత్ పాత్ర కొంత నేను మరికొంత నాకు బాగా తెలిసిన కొందరు మగాళ్ళ మనసుకు, ఆలోచనకూ రూపం. చిన్నప్పటి నుంచీ నూరిపోయబడిన ‘మగతనం’, మారుతున్న ఆధునిక నగరీయ జీవితంలోని అంగీకరించలేని ‘లైంగిక సమానత్వం’ మధ్యన వ్యక్తిత్వాన్ని విశాల పరుచుకుంటున్నామో లేక కోల్పోతున్నామో తెలియని యువతకు ప్రతినిధి హేమంత్. పర్వర్టో, దుర్మారుడో కాదు. కేవలం గుర్తింపు రాహిత్యం (identity crisis)లో కొట్టుమిట్టాడుతున్న సాధారణమైన మగాడు. హేమంత్ ని విలన్ ని చెయ్యడం చాలా సులభం. తనలో ఒకే క్షణంలో ఉద్భవించే ఉన్నత భావాలు, లేకి అభిప్రాయాల మధ్యనున్న వైరుధ్యాల్ని ఆరా తియ్యడం మరీ సులభం. కానీ అంతకన్నా తన "ఉదాత్తమైన వెధవతనాన్ని" సహానుభూతితో అర్థం చేసుకోవడం చాలా అవసరం అనిపించింది.తన ఆలోచనల్లోని బలహీనతల్ని తన నమ్మకాలుగా చెప్పించడం ద్వారా, పాత్ర వెధవ అని తేలుతుంది. కానీ తన నమ్మకం పట్ల సానుభూతిని మిగులుస్తుంది అనిపించింది. అందుకే కథను ప్రధమ పురుషలో తన తరఫునుంచీ చెప్పించాలనిపించింది. ఎలాగూ హేమంత్ నాలో కొంత భాగం, నాకు తెలిసిన ఇతరుల ఆలోచనల రూపం కాబట్టి కథకుడిగా కథను ‘నడిపించడం’లో వెసులుబాటు ఉంటుందని అలా కానిచ్చేసాను.

నిజానికి నాదృష్టిలో హేమంత్ నిజమైన హీరో. తనకు సామాజిక సంక్రమణలుగా లభించిన బలహీనతల్ని నమ్మకాలుగా మలుచుకుని, ఆ నమ్మకాల కోసం సుప్రియ ప్రేమను త్యజించిన హీరో హేమంత్. సాధారణంగా హీరో అంటే మారాలి. తన బలహీనతల్ని అధిగమించి "మంచి"గా మారాలి. కానీ ఈ హీరో ట్రాజిక్ హీరో. తన బలహీనతల కోసం వెధవలాగా పాఠకుల మనసుల్లో మిగిలిపోయే నాయకుడు. అలా మిగిలిపోతూ కూడా మగపాఠకుల మనసుల్లో కొన్ని ప్రశ్నల్ని నిలిపే హీరో. కథ చదివిన మగపాఠకులు బయటకు ఒప్పుకోకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు అసంకల్పితంగానే ఎప్పుడో ఒకసారి తమకూ వచ్చాయనే స్పృహ కలిగించే ధీరుడు. ఇక స్త్రీపాఠకులు ఖచ్చితంగా identify చేసుకోగలిగిన హీరో అని ప్రత్యేకంగా చెప్పనఖ్ఖరలేదనుకుంటాను.

సుప్రియ పాత్రలోని యాక్సిడెంట్ ఘట్టం. కుడిచేయి పోతే ఎడమచేత్తో మళ్ళీ వెనువెంఠనే జీవితాన్ని ప్రారంభించిన ఘట్టాలు నిజంగా నాకు తెలిసిన అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు. కలిసి పెట్టే ఖర్చును లెక్కేసి మరీ వెనక్కిచ్చేస్తే లక్షణమూ నాకు పరిచయమున్న కొందరు స్నేహితురాళ్ళకుంది. వాళ్ళ లాజిక్ సింపుల్ "కలిసి ఖర్చు పెట్టాం. కలిసి షేర్ చేసుకుందాం". ఇందులో అఫెండ్ అవడానికి ఏమీ లేకున్నా, కొందరు మగవాళ్ళు తమ మ్యాగ్నానిమిటీకి దెబ్బ అనుకుంటారు. ఈ లక్షణాలన్నింటినీ కలగలిపినా సుప్రియ పాత్ర సృష్టి కష్టమే అనిపించింది. ఎందుకంటే she is just a manifestation of insecurity in many of the men. కాబట్టి తన పాత్రకన్నా హేమంత్ ఆ పాత్రద్వారా పొందిన "ఆత్మన్యూనత" కథాంశమైతే బాగుంటుందనిపించింది. కాబట్టే ఎక్కడా సుప్రియ వర్ణన లేదు. తను అందంగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానం ఎక్కడా దొరకదు. తన బాహ్యసౌందర్యంకన్నా, తన బలమైన వ్యక్తిత్వంకన్నా తను హేమంత్ లో రేపే ఇన్సెక్యూరిటీ ఈ కథలో నేను చెప్పాలనుకున్న విషయానికి ముఖ్యం అనిపించింది. అందుకే సుప్రియ కథలో ఎక్కడా కనిపించదు.

ఇక "ప్రేమించడంలో" స్త్రీ యాక్టివ్ పాత్ర తీసుకుంటే తమ మగతనానికి ఛాలెంజ్ అనే విధంగా ప్రయత్నించేవాళ్ళే కాకుండా, తీవ్రమైన ఇన్సెక్యూరిటీ పాలయ్యేవాళ్ళు (చెప్పరుగానీ) చాలా మందే. ఈ లక్షణాలనన్నింటినీ కలగలిపి హేమంత్ ని తయారు చేశాను. He is the best hero I have created అని నాకైతే అనిపించింది. ఇంకెవరికైనా మరోలా అనిపించుంటే నేను చెయ్యడానికి ఏమీ లేదు.

కొసమెరుపు ఏమిటంటే, ఈ కథని ఒక వెబ్ పత్రికకి పంపించాను. వారి సమాధానం

"మహేష్ కుమార్ గారూ,

మీరు పంపిన "దేవత" కథ ---- నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల ప్రచురించలేకపోతున్నాం. మీనుంచి మరింత ఉన్నత ప్రమాణాలతో కూడిన రచనలను ఆశిస్తూ

నెనరులతో
-----------"

అప్పుడనుకున్నాను. పత్రికా ప్రమాణాలను బట్టి నేను కథరాయాలా? నా నమ్మకాలే ప్రమాణాలుగా కథరాయాలా? అని. ఎందుకో రెండోదే బెటర్ అనిపించింది. ఈ మధ్య అబ్రదబ్రగారి చర్చల్లోకూడా దాదాపు ఇలాంటి యక్షప్రశ్నలే ఎదురయ్యాయి. I write because I want to write. Then its better I stick to my blog writing. అనుకుంటున్నాను. హేమిటో ఈ ప్రమాణాలూ, నాణ్యతలూ నాకైతే అర్థం కావు. రాసుకుంటూ పోవడమే మ తరహా!

(బ్లాగులున్నదే సొంత కతలు చెప్పుకోవడానికి. కాబట్టి నా స్వోత్కర్ష మీకు తప్పదు)

******

Wednesday, June 10, 2009

దేవత

బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. మగ అహం, మగాలోచన,మగాహంకారం,మగభావాలు ప్రశ్నింపబడ్డాక మగటిమి ప్రశ్నార్థకమౌతుంది.కొన్ని వేల సంవత్సరాలుగా మగాడి నరనరాల్లో నిక్షిప్తమైన మగసంస్కృతి పతనమౌతుంది. సుప్రియ అలాంటి ఆడది. పరిచయమయినప్పటి నుంచీ అంతే. నేను మగాడినన్న స్పృహేనాకు కలిగించలేదు. మగాడన్న స్పృహే తడబడ్డాక ఆడామగా మధ్య ఉన్న బంధం నిలుస్తుందా? ఆ విషయం ఇప్పుడైనా అర్థం చేసుకుంటుందనుకున్నాను. ఎంతైనా, ‘తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’

****

జీన్సు వేసుకునే ఆమ్మాయిల ఆప్రోచబిలిటీ గురించి నేను చేసే ప్రతిపాదనల్ని క్లాస్ రూంలో ఒకమూల సైలెంటుగా కూర్చుని వింటుండగా మొదటిసారి చూశాను. అప్పుడే సుప్రియ నన్ను చూసి కళ్ళతోనే ఫక్కున వెక్కిరించినట్టనిపించింది. ఆ తరువాత నెలపాటూ, మా పరిచయం మొదలయ్యేవరకూ ఆ వెక్కిరింపే నన్ను వెంటాడింది. బెంగుళూర్ అమ్మాయిలంటే నాక్కొంచెం చులక భావం. ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే మరీను. మేకప్పు, మార్కుల మీదున్న శ్రద్ధ వీరికి మనుషుల మీదుండదు. తమ వీకెండ్ ప్లాన్స్ మీదున్న ఆసక్తి వల్డ్ దిసి వీక్ (World This Week) మీదుండదు. హాలీవుడ్ సెలబ్రిటీలు ఫింగర్ టిప్స్ మీదుంటారుగానీ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సినిమాల గురించి తెలీదు. ప్రపంచమంతా బెంగుళూరు చుట్టే తిరుగుతుందనే బలమైన నమ్మకం వీళ్ళకి. అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీషు మాట్లాడే అబ్బాయిలతో తప్ప బట్లరింగ్లీషుగాళ్ళు వీళ్ళలెక్కలో అసలు మగాళ్ళేకాదు.

సుప్రియది బెంగుళూరు.కానీ తెలుగమ్మాయి అని తరువాత తెలిసింది. అప్పటికీ "మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అనే చెప్పింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ని అని చెప్పినంత హుందాగా. అదేమిటోగానీ, నేను ‘హైద్రాబాదీని’ అని చెప్పుకుందామనుకున్నా దాంట్లోంచీ కూడా ఏదో ముతకవాసనే వస్తుంది. ఆ గుర్తింపులోంచీ మధ్యతరగతి అస్తిత్వపు అరుపు వినిపిస్తుందేతప్ప అర్బన్ పోష్ నెస్ అస్సలు కనిపించదు.

మా పరిచయంకూడా చాలా విచిత్రంగానే జరిగింది. యూనివర్సిటీలో చేరిన నెలకు మా సీనియర్లు ఫ్రెషర్స్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో జూనియర్స్ కూడా ఏదో ఒకటి చెయ్యాలి. పాటలు పాడాలి కొన్ని గేమ్స్ డిజైన్ చెయ్యాలి అని ప్రతిపాదించారు. గ్రూప్ గేమ్స్ డిజైన్ చెయ్యడానికి కొందరు వాలంటీర్ చేసేస్తే, ఇక పాటలుపాడేవాళ్ళెవరనే దగ్గరకొచ్చి చర్చ ఆగింది. ఇబ్బందిగానే నేను పాడగలను అని చెప్పేసాను. సుప్రియకూడా పాడుతుందట. ఇద్దరూ ఒకొక సోలో సాంగ్ ఆ తరువాత కలిపి ఒక డ్యూయెట్ పాడాలని క్లాస్ వాళ్ళు నిర్ణయించేశారు. "హలో హేమంత్. యు సింగ్ టూ?" అంటూ దగ్గరకొచ్చింది. అప్పటివరకూ సుప్రియకు నా పేరు తెలుసనికూడా నాకెప్పుడూ అనిపించలేదు.

మా క్లాస్ లోని ఐదుమంది బెంగుళూర్ అమ్మాయిలదీ ఒక జట్టు. ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. వాళ్ళ జోకులూ, మాటలూ,నవ్వులూ మనలోకానికి సంబంధించినవిగా అనిపించేవికావు. వేరే అమ్మాయిలతో సంబంధం లేనట్లు ప్రవర్తించేవాళ్ళు. అబ్బాయిల్నైతే అసలు గుర్తించేవాళ్ళే కాదు. వాళ్ళుతప్ప మిగతావాళ్ళెవరూ మనుషులు కారన్నట్లుగా ఉండేది ప్రవర్తన. అందుకే సుప్రియకు నాపేరు తెలుసంటే ఆశ్చర్యం.
"యెస్" అని ముక్తసరిగా సమాధానం చెప్పాను.
"వాటార్యూ ప్లానింగ్ టు సింగ్? ఎనీ తెలుగు సాంగ్!" అంది.
చులకన చేస్తోందేమో అనిపించింది.
"లేదు. నో. అయాం సింగింగ్ ఎ హిందీ సాంగ్" అన్నాను.
"హిందీ ఎందుకు? తెలుగులో చాలా మంచి పాటలున్నాయిగా!"
అప్పుడే సుప్రియ నోటివెంట తెలుగు మాటలు వినడం. "నువ్వు తెలుగా" అన్నాను ఆశ్చర్యంగా.
"కాదు. మా అమ్మానాన్నా తెలుగు. నేను బెంగుళూరమ్మాయిని" అంది. ఆ గొంతులో ఏదో ఆలోచన. తన గుర్తింపుని తనే నిర్దేశించుకునే తపన.
ఒక్క క్షణం ఆలోచించి "తెలుగులో ఏం మంచిపాటలున్నాయ్!" అనగలిగాను.
"కొత్తవి కాదు. పాత పాటలు. ముఖ్యంగా బాలసుబ్రమణ్యం లేతగొంతుతోపాడిన పాటలు ఎన్ని లేవు" అంది.
తరువాత సుప్రియ కొనసాగింపుగా "రాజన్ -నాగేంద్ర సంగీతంలో కన్నడ తెలుగు భాషల్లో వచ్చిన బోలెడన్నిపాటలున్నాయి. అన్నీ నాకిష్టమైన పాటలే" అంటూ నా సమాధానం కోసం ఎదురుచూసింది.
ఒక్కసారిగా షాక్ మీద షాక్. నాలోని తన ఊహాచిత్రం ఛిద్రమైన క్షణం. నా అభిప్రాయాల గోడ నామీదే కూలి నన్ను భూస్థాపితం చేసిన క్షణం. ఐ జస్ట్ హేటెడ్ హర్. నన్ను నా బలహీనతల సాక్షిగా కుదింపజేసిన సుప్రియని జీవితంలో క్షమించలేననుకున్నాను.

"మరి నువ్వుకూడా తెలుగు పాట పాడుతావా?"
"లేదులేదు. తెలుగు మాట్లాడటం వరకే. పాడటం నాకు రాదు. కాబట్టి హిందీ పాడతాను."
"మరి డ్యూయెట్ ఎలా? హిందీ పాడదామా!" అని అడిగాను. వెంఠనే "సరే" అంది.
క్లాసులైపోయిన తరువాత కలిసేవాళ్ళం.రెండ్రోజులు డ్యూయెట్ ప్రాక్టిస్ చేశాం. చష్మెబద్దూర్ అనే హిందీ సినిమాలోంచీ ‘కహాసే ఆయే బదరా...ఖిల్తా జాయే కజరా..’ అనే సెమీ క్లాసికల్ గీతం. నిజానికి ఏ కాంపిటీషన్లో పాడాల్సిన పాట. సుప్రియ "చాలా మంచిపాట కదా పాడుదాం" అంటే, ఫ్రెషర్స్ పార్టీ కోసం పాడటానికి ఒప్పుకున్నాను. ఎక్కడో ఒక మూల ఈ పాట విని నీరసంగా ఉందని సీనియర్లు వెక్కిరిస్తారని ఒక కోరిక. నేను పొందే అవమానంకన్నా, సుప్రియ ఆ అవమానంలో భాగవుతుందన్న ఆశ గొప్ప స్వాంతన కలిగించింది. దీక్షగా పాట ప్రాక్టిస్ చేశాను.

ఆరోజు సాయంత్రం. సుప్రియ ఉమ్రావ్ జాన్ సినిమాలోంచీ ‘దిల్ చీజ్ క్యాహై ఆప్ మెరే జాన్ లీజియే’ అనే ఘజల్ పాడింది. ఆ తరువాత కాస్సేపటికి ఇద్దరి డ్యూయెట్. చాలా కష్టమైన పాట పాడామని అందరూ అభినందించారు.చివరిగా నా వంతు.

నేను ‘పూజ’ సినిమా నుంచీ రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీనాదీ’ అనే బాలసుబ్రమణ్యం పాట పాడాను. సుప్రియ కళ్ళలో మెరుపు. ఆ పాటపాడాలని నేనెందుకు నిర్ణయించుకున్నానో నాకు ఖచ్చితంగా తెలీదు. అంతగా ద్వేషించే సుప్రియని ఆకర్షించాలని నాలో అంతర్లీనంగా కోరికుందేమో. బహశా తనపై నా ఆధిపత్యాన్ని తనకిష్టమొచ్చింది చేసి సంపాదించుకోవావన్న కోరికనాలో కలిగిందేమో. ఇద్దరిమధ్యా పరిచయం పెరగడానికి ఆ పాట తోడ్పడింది. మరికొన్ని సాయంత్రాలు మామధ్య రాజన్-నాగేంద్ర రాజ్యమేలారు. బాలసుబ్రమణ్యం గాత్రం నా గొంతులోంచీ వినిపించేది. నా పాట మరుపుకు సుప్రియ కళ్ళలోని మెరుపు ఆరాధన అనిపించిన గర్వక్షణాల్ని, నా పాటకు బదులుగా తను పాడేపాటతో తునాతుకలు చేసేది. ఇక్కడా బదులు తీర్చుకునేది. నేనేదో "ఇచ్చానన్న" సంతృప్తినికూడా కలిగనిచ్చేది కాదు.

సినిమాలలో,షికార్లలో, హోటళ్ళలో తనవంతు ఖర్చు తాను క్రమం తప్పకుండా ఇచ్చేది. ఒకవేళ నేను కావాలని మర్చిపోయినా గుర్తుచేసి మరీ అప్పు తీర్చేది. ప్రేమించే మగాడిగా, సాధికారంగా సుప్రియ కోసం నేను చేయాలనుకున్న ఏ పనులూ తను చెయ్యనిచ్చేది కాదు. "కలిసి తిరుగుతున్నాం. కాబట్టి, కలసి చేసే ఖర్చు పంచుకుని చెయ్యాలి" అని నా విలువని శంకిస్తూ మాట్లాడేది.తనని "ఆదుకునే" అధికారం నాకు ఏమాత్రం లేదని ఎప్పుడూ గుర్తుచేసేది. నా చెయ్యి తన శరీరాన్ని తాకినపుడు సహజమైన సిగ్గుతో కుంచించికుపోకుండా, దయతో ప్రేమతో కోరికతో సహకరించేది. అనుభవాన్ని అధికారంతో పంచుకునేది. "ఇలాకాదు ఇలా" అని మార్గనిర్దేశన చేసి నన్నొక వస్తువులాగా, కీ ఇస్తే ఆడే బొమ్మలాగా వాడుకునేది. ఎన్ని అవమానాలు. ఎన్ని ఆక్షేపణలు. ఇలా నా అహాన్నీ,వ్యక్తిత్వాన్ని ఫణంగాపెట్టి సుప్రియ వ్యక్తిత్వాన్ని భరించాల్సి వచ్చేది.


ఏదోఒక స్థాయలో మనల్నిమనం మోసం చేసుకుంటేగానీ జీవితంలో ప్రేమించలేమేమో. "ఐ లైక్ యువర్ సింప్లిసిటీ అండ్ డౌన్ టూ ఎర్చ్ నేచర్" అని సుప్రియ అన్నప్పుడల్లా, నిజంగా నేనూ తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానేమో అనే అపోహ కలగేది. సుప్రియ నన్నంతగా అభిమానించడానికి నాలోని గుణాల్ని ఎంచిచూపించేదేకానీ తనకున్న కారణాలు చెప్పేది కాదు.సాధికారంగా జీవితాన్ని పంచుకునేదేగానీ, ఆధారపడుతూ నా ప్రాముఖ్యతను పెంచేది కాదు. నన్ను తన జీవితంలో ఒక ముఖ్యమైనవాడిగా చేస్తూ నన్నొక బానిసని చేసింది. తన జీవితంలో నన్నొక సమానమైన భాగం చేసి నా అహాన్ని కాలరాసింది.

ఇలా ఒక సంవత్సరం నన్ను నేను చంపుకుంటూ తన నిర్వచనాల్లో ఒంపుకుంటూ గడిచింది. వేసవి శెలవులకి సుప్రియ వారం రోజుల ముందే బయల్దేరింది. సుప్రియ వెళ్ళిన మరుసటి రోజు ఒక దారుణమైన వార్త తెలిసింది. సుప్రియ వెళ్ళే బస్సుకి కర్నూలు -అనంతపూర్ల మధ్యన యాక్సిడెంట్ అయ్యింది. విండో సీట్లోకూర్చున్న సుప్రియ కుడిచెయ్యి మోచేతివరకూ తెగిపోయింది. ఆపరేషన్ కోసం బెంగుళూరు చేరేసరికీ తెగిన చెయ్యిని ఐస్ బాక్సులో పెట్టి జాగ్రత చెయ్యకపోవడంతో సర్జరీ చేసి అతికించేందుకు వీలులేకుండా పోయింది. నా గుండె ఆగినంత పనయ్యింది. హుటాహుటిన బెంగుళూరు బయల్దేరాను.ఈ క్షణం లో నా స్నేహితురాలిపై సానుభూతి తప్ప వేరే ఏ భావమూ కలగలేదు. ఐతే ఒక పక్కన ఆమెని నేను నిజం గా ప్రేమిస్తున్నానేమో.


ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు. హఠాత్తుగా అనిపించింది ‘ఇప్పుడు తను ఆధారపడటం నేర్చుకునే సమయం వచ్చిందికదా!’ అని. నావ్యక్తిత్వాన్ని తిరిగి దక్కించుకునే అవకాశం నాకు దక్కుతుందేమో. నా మగతనాన్ని తిరిగి సంపాదించుకునే ఛాన్స్ దొరుకుతుందేమో. గర్వంగా తనని ఈ కష్టం నుంచీ ఆదుకునే అదను లభిస్తుందేమో. ఎక్కడో ఆశ. మై పాస్ట్ గ్లోరీ విల్ రెటర్న్.

బాధలో,ఆలోచనల్లో,ఆశల్లో తేలుతూ హాస్పిటల్ చేరాను. సుప్రియ రూము బయటే తన తల్లిదండ్రుల్ని డాక్టర్ తో మాట్లాడుతుండగా కలిశాను. డాక్టర్ అంటున్నాడు "వాటే బ్రేవ్ గర్ల్ షి ఈజ్. స్పృహలోకొచ్చిన మరుక్షణమే, తన పరిస్థితి తెలిసి ఏడ్చి బాధపడకుండా, పక్కనే ఉన్న పెన్నూ, డైరీ తీసుకుని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ పేరేమిటి అని తెలుసుకుని ఏడమచేత్తో రాయడం మొదలెట్టింది. యు షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హర్".

ఆమె పట్ల నాకేదైనా సాఫ్ట్ కార్నర్ /ప్రేమ అనే భావన ఉంటే ఆ క్షణమే పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.తన కష్టాలకీ, నా కష్టాలకీ తనే నా గుండె పై వాలి "హేమూ, నువ్వు లేకపోతే నేనేమైపోయే దాన్ని" అని భరింపరాని కృతజ్నత తో నా పురుషత్వాన్ని కన్నీటితో ముంచేసే స్త్రీత్వం లేని సుప్రియ ని ఏ మగవాడైనా ఎలా ప్రేమించగలడో నాకర్ధం కాలేదు.

వెనక్కొచ్చేశాను. సుప్రియని కనీసం కలవకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియ తల్లిదండ్రులు ఆగమని చెబుతున్నా వినకుండా వెనక్కొచ్చేశాను. సుప్రియను ఎప్పుడు కలుస్తానో, అసలు కలుస్తానో లేదో తెలీదు. కానీ ఒక లేఖ మాత్రం రాశాను. ఎప్పుడో ఒకప్పుడు తనకు ఇవ్వడానికి.

"సుప్రియా, నువ్వు దేవతవి. నువ్వు గొప్పదానివని నేను నిన్ను ‘దేవత’ అని పిలవటం లేదు. నువ్వు నాకూ, ఈ ప్రపంచానికీ పనికిరానిదానివి కాబట్టి దేవతగా భావిస్తున్నాను. పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనుషులు మసలే సమానత్వమనే ఒక ఊహాలోకపు జీవివి నువ్వు. అందుకే నీకు ఈ లోకంలో అందరు మనుషుల్లా బ్రతికే హక్కులేదు. నీ ఉనికిని, వ్యక్తిత్వాన్నీ నేనూ,ఈ ప్రపంచం భరించలేము. అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను."
ఇట్లు
హేమంత్

*****
(ఇది కథో కాదో నాకు తెలీదు. అసలు కథంటే ఏమిటో తెలీకుండా పోయింది.
ఎందుకలా అంటున్నానో ‘కథవెనుక కథ’ లో చెబుతాను)

Tuesday, June 9, 2009

ఆక్రందన


ప్రతి కదలికా చర్యకో రూపమే
ప్రతి క్షణం సమయంలో బంధమే
ప్రతి స్థలం విశ్వంలో భాగమే
ప్రతి వ్యక్తీ అనంతంలో ఏకమే

ఏ భావమూ భావనతో విడిపోలేదు
ఏ సంఘటననూ ఘటనతో విడదీయలేము
ఏ చేతననూ చైతన్యంతో విడదీసి చూడలేము
ఏ ఆలోచనానూ స్పృహ నుంచీ విడగొట్టలేము

అందుకే...
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అంటే
‘నా’నుంచీ నన్ను కాపాడి
నీలో కలుపుకోమనే ఆక్రందనేతప్ప
స్వార్థమెలా అవుతుంది?

*****

పదికోట్ల మందిలో పదివేల పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?

అమెరికా నుంచీ వెలువడే ఒక తెలుగు పత్రిక (తెలుగునాడి) మూతపడిందని కాశ్యప్ తన బ్లాగులో ‘అక్షరం తలదించుకుంది’ అని శీర్షికపెట్టి బ్రహ్మానందం గారు రాసిన ఒక హృద్యమైన వ్యాసాన్ని ప్రచురించారు. బ్రహ్మానందం గారు ఆ పత్రిక గుణగణాల్ని వివరించి, కొన్ని కన్నీళ్ళు కార్చి, ఆ చచ్చిన పత్రికని బ్రతికించడాని ఎవరైనా ఆక్సిజన్ ఇస్తే తనవంతు సిలిండర్ సహాయం చేస్తానని ఆ వ్యాసంలో ప్రతిజ్ఞ చేశారు.

ఆ వ్యాసం చదివి నాకూ బాధకలిగింది. ముఖ్యంగా "అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది. ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి." అంటూ వర్ణించిన ఆ పత్రిక గుణగణాల్ని చదివి మరీ బాధపడ్డాను. ఒక్క డయాస్పొరా కథల్ని మినహాయిస్తే సాక్షి దినపత్రిక ‘ఫ్యామిలీ’ సెక్షన్లో నాకు ఈ పత్రికలోని గుణగణాలన్నీ ప్రతిరోజూ కనిపించడమే నా బలవంతమైన బాధకు కారణం.

చాలా నికృష్టమైన పోలికలాగా, నా టేస్ట్ పరమ చీప్ గా కనిపిస్తే నేనేమీ చెయ్యలేను. నామట్టుకునాకు ఆ గుణగణాల వర్ణన అచ్చుగుద్దినట్లు చౌకబారు ‘స్వాతి’తో సహా అన్ని పత్రికలకూ వర్తింపజెయ్యొచ్చేమోనన్న హడలుపుట్టింది. ఏడాదికి 24 డాలర్లు వెచ్చించి ఈ పత్రిక కొనడానికి కనీసం పదివేల మంది పాఠకులు లేక పత్రిక మూతపడాల్సివచ్చిందనేది ఒక సత్యం. అంటే పదికోట్లున్న తెలుగు జనాల్లో పత్రిక చదవడానికి నెలకు వందరూపాయలు ఖర్చుపెట్టే (సాహితీ) పోషకులు ఎవరూ లేరన్నమాట. చాలా విచారించదగ్గ విషయమే. కాకపోతే, "ఉటంకించిన గుణగణాలన్నీ అత్తెసరు ఆర్రూపాయల పత్రికల్లో దొరుకుతున్నప్పుడు, వందెందుకు పెట్టాలి?" అనేది నాలాంటి తలతిక్క పాఠకుడి ప్రశ్న.

నేను ఈ పత్రిక జీవితంలో ఒకసారికూడా చూడలేదు. చదవలేదు. కాబట్టి దాని గొప్పతనం నాకు తెలీదు. కానీ వింటుంటే మాత్రం ఏమీ గొప్పగా అనిపించడం లేదు. ఒక ముఖ్యమైన ప్రశ్నమాత్రం ఉదయిస్తోంది.....

పదికోట్ల మంది తెలుగోళ్ళలో పదివేల మంది పాఠకులు దొరక్కపోవడం ఎవరి తప్పు?


****

Monday, June 8, 2009

పెళ్ళెందుకు?

పెళ్ళెందుకు అని చుట్టుపక్కలున్న పదిమందిని అడిగితే పది సమాధానాలొస్తాయి. తాపీధర్మారావు గారు ‘పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు’ లో చెప్పినట్లు "చేతులారా మెడకు ఒక బండ కట్టుకోవడమే పెళ్ళి అంటాడు ఒకడు. కామభోగాలకు - ఇతరులకు ఎలాంటి హక్కులూ లేకుండా గుత్త తీసుకోవడమే అంటుంది ఒకర్తె. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇల్లు గడుపుకోవడం అంటుంది ఒకర్తె. పగలంతా పరమ చాకిరీ,రాత్రంతా రాద్ధాంతం రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు. ఇంటిపేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధనం అంటాడొకడు. స్వర్గారోహణకు పెళ్ళి ఒక నిచ్చెన అంటాడొకడు. సాంప్రదాయం అంటుందొకర్తె. అదొక సందడి అంటుందొకర్తి..."

తాపీవారు వందసంవత్సరాల ముందు ఇలా చెప్పినా, ఇప్పుడు మరొకరు ఎవరైనా చెప్పినా, పెళ్ళి గురించ వేనోళ్ళ వేయి ఆభిప్రాయాలూ, పెళ్ళి చేసుకోవడానికి భిన్నమైన ఆశయాలూ, పెళ్ళంటే విపరీతమైన ఆలోచనలు.

యండమూరి ఏదో నవల్లో చెప్పినట్లు "మగాడు సెక్స్ కోసం పెళ్ళిని అంగీకరిస్తే ఆడది సేఫ్టీ కోసం పెళ్ళిని ఒప్పుకొంటుంది" అనేది మరో ఆధునిక భాష్యం. మొత్తాని పెళ్ళి ఇలా అవసరాలు, అభిప్రాయాలూ, కోరికలూ, ఆశల మధ్య నిర్వచనాల్ని వెతుక్కుంటూ కాలం గడిపేస్తోంది. లోకభిన్న రుచి: అన్నట్టు ప్రతివాడికీ, ప్రతొకత్తెకీ పెళ్ళికి కావలసిన కారణాలు విభిన్నం. కానీ పెళిమాత్రం ఒక అత్యవసరం. తధ్యం. ఎంతైనా రంగీలా సినిమాలో అమీర్ ఖాన్ అన్నట్లు "లైఫ్ లో సెటిలవ్వాలికదా! "

ఇక్కడ విషయం పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరం అయితే పెద్దాయన తాపీధర్మారావు గారు ఆంత్రాపొలాజికల్ సాక్షాలతో సహా ఎప్పుడో తేల్చేశారు కాబట్టి నేను కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. పెళ్ళి గురించి నా అభిప్రాయం రాయాలంటే అదొక మహాభారతం అవుతుంది. అంటే మొత్తం కథ తరువాత యుద్ధం మాత్రం గ్యారంటీ అన్నమాట. అందుకే ఆ విషయాల ప్రస్తావన దాటేద్ధాం.

మొత్తానికి ఈ పెళ్ళి గోలంతా ఇప్పుడెందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య స్టార్ మూవీస్ లో ఒక ఇంగ్లీషు సినిమా చూస్తుంటే అనుకోకుండా ఒక జ్ఞానగుళిక పుటుక్కున తెరచించుకుని నా కళ్ళు తెరిపించింది. ప్రత్యేకంగా చెప్పఖ్ఖర లేదనుకుంటాను. ఆ జ్ఞాన గుళిక పెళ్ళనే మహత్తర కార్యం గురించే. ‘పెళ్ళెందుకు’ అని ఇప్పుడున్న పెళ్ళికాని యువతని అడిగితే తోడుకోసం, భాగస్వామి కోసం, ఆత్మబంధువు కోసం, ప్రేమ కోసం, అనుబంధం కోసం, ఆత్మీయత కోసం, ఆధారంకోసం అని ఎన్ని కథలైనా చెబుతారు. అవి నిజం కూడా కావచ్చుగాక, కానీ ఈ సినిమాలో చెప్పే కారణం వింటే కూసింత మతిపోయి "అబ్బా. నిజమే!" అనిపించే జ్ఞానోదయం ఖచ్చితంగా అవుతుంది.

Why people get married.

"We need a witness to our lives. There's a billion people on the planet ... I mean, what does any one life really mean? But in a marriage, you're promising to care about everything. The good things, the bad things, the terrible things, the mundane things ... all of it, all of the time, every day. You're saying 'Your life will not go unnoticed because I will notice it. Your life will not go un-witnessed because I will be your witness'."

- Beverly Clark (Played by Susan Sarandon)

క్లార్క్ పాత్ర అంటుంది... "మనుషులు పెళ్ళి చేసుకోవడానికి కారణం జీవితాలకు ఒక సాక్ష్యం కావాలనుకోవడం. కొన్ని వేలకొట్ల మందుండే ఈ లోకంలో నిజంగా ఒక చిరుజీవితానికి అర్థం ఉందా? కానీ పెళ్ళిలో ఉంటుంది. ప్రతొక్క విషయానికీ ఒక గుర్తింపు ఉంటుంది. మంచైనా,చెడైనా, ఛడాలమైనదైనా, రోజువారీ బోరుకొట్టే విషయమైనా... ప్రతి క్షణం, ప్రతిరోజూ మన జీవితాన్ని తరచిచూడటానికి ఒక సాక్షి ఉంటుంది/ఉంటాడు. ప్రతి విషయం గుర్తింపబడుతుంది. జీవితం ఎవరూ గమనించకుండా ముగిసిపోదు. పెళ్ళిద్వారా మన జీవితానికి ఒక సాక్ష్యమివ్వడానికి సాక్షి లభిస్తుంది."


పెళ్ళిద్వారా మన జీవితాన్ని గుర్తించే సాక్షం లభిస్తుంది అనేది ఎందుకో ఒక మహత్తరమైన కారణం అనిపించింది. ఏమో అందరికీ ఆ కారణం కావాలేమో ! అందుకే పెళ్ళికి ఇంత మహత్వం ఉందేమో!

*****

వ్యభిచారం : చట్టవ్యతిరేకం Vs అనైతికం

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం మన దేశంలో 2.8 మిలియన్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 36% ఈ వృత్తిలోకి పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందే ప్రవేశించారు (బహుశా బలవంతంగా ప్రవేశపెట్టబడ్డారు). కొన్ని స్వచ్చంధ సంస్థల లెక్కల ప్రకారం సెక్స్ వర్కర్ల సంఖ్య 15 మిలియన్లు. ఒక ముంబై నగరంలోనే లక్షమంది వరకూ సెక్స్ వర్కర్లు ఉన్నారని ఒక అంచనా.

1956 ఏర్పడిన The Immoral Traffic (Suppression) Act (SITA) చట్టం వ్యభిచారాన్ని చట్ట విరుద్ధం చేయకపోయినా, పబ్లిక్ స్థలాల్లో విటుల్ని ఆకర్షించకూడదనే క్లాజ్ ఆధారంగా పోలీసులు సెక్స్ వర్కర్లను వేధించడానికి ఉపయోగించుకుంటూ పరిస్థితుల్ని అత్యంత దయనీయమైన స్థితికి తీసుకువచ్చారు. చిత్రంగా ఈ చట్టంయొక్క ఉపనామం "సీత". పోలీసులు పబ్లిక్ ఇండీసెన్సీ, పబ్లిక్ న్యూసెన్స్ లాంటి అర్థంకాని, చట్టప్రకారం నిర్వచింపలేని పదాల్ని ఉపయోగించి సెక్స్ వర్కర్లపై కేసులు బనాయించిన ఘటనలు కోకొల్లలు. ఈ నేపధ్యంలో చట్టాన్ని రక్షించేవారి చేతులనుంచీ రక్షణకల్పించమని సెక్స్ వర్కర్లు ఉద్యమాలు చేశారు. ఇక భారతదేశంలో పిల్లల్ని పడుపు వృత్తిలోకి దించే సమస్య అత్యంత విస్తృతం,అమానుషం. మన దేశంలోని 378 జిల్లాలలో మానవ ట్రాఫికింగ్, ముఖ్యంగా పిల్లల ట్రాఫికింగ్ ఏదో ఒక స్థాయిలో జరుగుతోందనే నిజం ఈ సమస్య విస్తృతత్వానికి నిదర్శనం.

ఈ పరిస్థితుల్లో HIV/AIDS వ్యాప్తి ప్రపంచం మొత్తాన్ని వణికించినట్లే భారతదేశాన్నీ పట్టిపీడిస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తిలో సెక్స్ వర్కర్ల పాత్రను గుర్తించి Targeted Interventions (TIs) పేరుతో చాలా కార్యక్రమాల రూపకల్పన చెయ్యడం జరిగింది. వ్యాధి వ్యాప్తిలో వీరి పాత్రను వ్యాధి నిరోధక దిశగా మళ్ళించకపోతే అత్యంత ప్రమాదకారిగా మారుతుందన్న నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం, సెక్స్ వర్కర్ల సమూహాలను సంఘటిత పరిచి లైంగిక విద్యద్వారా HIV/AIDS వ్యాప్తిని నిరోధించే కార్యక్రమాలను చేపట్టింది.

ఈ నేపధ్యంలో "మానవహక్కుల" ఆధారంగా ఉద్భవించిన డిమాండ్, ‘సెక్స్ వర్కర్ల హక్కుల రక్షణ’. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంగా అర్థం చేసుకోవడం అవగాహనాలేమి తప్ప మరొటి కాదు. భారతదేశంలో పడుపువృత్తి చట్టవ్యతిరేకం ఎప్పుడూ కాదు. Law actually "does not criminalise prostitution or prostitutes per se, but mostly punishes acts by third parties facilitating prostitution like brothel keeping, living off earnings and procuring, even where sex work is not coerced". అంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఉన్న చట్టాన్ని మరింత మానవీయం చెయ్యడానికి జరిగే యత్నమే తప్ప మరొటి కాదు. "Denial of equality of the rights and opportunities and of dignity and of the rights of equal protection against any discrimination of fallen women is violation of Universal Declaration under Article 7 and as well as Article 14 of Indian constitution" ఆధారంగా జరగనున్న ఒక corrective measure మాత్రమే. ఈ చట్టంలో ఉండబోయే మార్పల్లా "The emphasis IS NOT on the sex worker but the clients/pimps/brothel owners etc". అంత మాత్రానికే ఇన్ని వాదప్రతివాదనలు తయారవడం చూస్తుంటే కొంత అశ్చర్యం మరికొంత బాధా కలుగుతోంది.

ఈ కొత్తచట్టం వలన వ్యభిచారం మరింత మెరుగ్గా రెగ్యులరైజ్ చెయ్యబడుతుంది. తద్వారా వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టబడుతున్న వారి సంఖ్యతగ్గి హ్యూమన్ ట్రాఫికింగ్ వలయాలు చేధింపబడతాయి. ముఖ్యంగా పిల్లలు వ్యభిచార వృత్తిలోకి రాకుండా కాపాడగలుగుతాము. సెక్స్ వర్కర్ల అమానుష జీవితాలు ఉద్ధరింపబడతాయి. ప్రత్యామ్న్యాయ జోవనోపాధుల సృష్టిద్వారా గౌరవప్రదమైన జీవితాల్ని జీవించడానికి బయటికొచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. HIV/AIDS వ్యాప్తిని నిరోధించే అవకాశాలు మెరుగుపడి ప్రజారోగ్యంపై అనుకూల ప్రభావం పడుతుంది.

వ్యభిచారాన్ని హఠాత్తుగా (సమూలంగా) రూపుమాపాలనుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఆచరణయోగ్యంకాని ఆదర్శం. ప్రపంచంలో ఏ దేశమూ వ్యభిచారాన్ని సమూలంగా రూపుమాపిన దాఖలాలు అసలు లేవు. అయినా సరే, ఈ మహత్తర ఆదర్శాన్ని పూరించాలంటే మొదటగా ప్రస్తుతం ఉన్న సమస్యలకు సమాధానాలు వెతకాలి. ఆ దిశగా ప్రతిపాదిత చట్టం ఒక ముందడుగు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, చట్టపరమైన, మానవహక్కుల పరమైన కోణాల్ని విస్మరించి కేవలం "నైతికత" కోణంలోంచీ ఈ సమస్యను చూడటం అర్థరహితం. పైగా ఈ "చట్టబద్ధత" కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం.

ఈ మొత్తం వ్యాసంలోకూడా మేల్ ప్రాస్టిట్యూషన్ - మగ పడుపువృత్తిని గురించి ప్రస్తావించకపోవడం మన భారతీయ పురుషాహంకార సెక్సిస్ట్ నేచర్ కి ఉదాహరణేమో!

*****

Friday, June 5, 2009

కమలా దాస్ జ్ఞాపకార్థం


31 March 1934 – 31 May 2009

When I die
Do not throw the meat and bones away
But pile them up
And let them tell
By their smell
What life was worth
On this earth
What love was worth
In the end.

నా మరణానంతరం
మాంసాన్నీ ఎముకల్నీ పారెయ్యకండి
భద్రంగా ఒక చోట కుప్ప పొయ్యండి
ఈ భూమ్మీద జీవితం విలువేమిటో
చివరకు ప్రేమకున్న విలువేమిటో
అవి అప్పుడు చెబుతాయి

- కమలా దాస్


*****