Thursday, August 28, 2008

హైద్రాబాదొస్తున్నానోచ్ !

ఉద్యోగరీత్యా విధించుకున్న ఆరు సంవత్సరాల self exile నుంచీ మరో assignment రీత్యా హైదరాబాద్ వస్తున్నాను. So, I will be back in Hyderabad.



మొన్న హైదరాబాదొచ్చినప్పుడు ట్రాఫిక్కును చూసి భయపడ్డాను. ఆ భయాన్ని అధిగమించాలి

సిటీబస్సులో వెళ్తూ పక్కనున్న బిల్డింగులనుబట్టి దారి కనుక్కునే అవకాశం కోల్పోయినందుకు ఖంగారుపడ్డా...ఎన్ని కొత్తకొత్త హార్మ్యాలో !!! అవన్నీ ఇప్పుడు కనుక్కుని ఖంగారు తగ్గించుకోవాలి.

దేశంమొత్తం "హైద్రాబాదీ బిర్యానీ" ఆర్డరు చేసి, రుచిచూసి విసిగివేసారి వస్తున్నాను. మళ్ళీ ‘బావర్చి’లో బిర్యానీ తిని హైద్రాబాదు రుచిని మళ్ళీతాజాగా తెలుసుకోవాలి.

తెలుగు సినిమాల్ని ఢిల్లీ పాలికాబజార్లో పైరేటెడ్ DVD లలో చూసిచూసి విసుగెత్తి, పెద్దతెరపై తెలుగు సినిమా చెత్తను టికెట్టు కొనిమరీ ప్రోత్సహించాలి.

గోకుల్ చాట్లో నాకిష్టమైన దహీపాపడీ...మిర్చిబజ్జీలకు మొఖంవాచిపోయున్నాను. ఈ సారి కనీసం మరో ఆరు సంవత్సరాలకి సరిపడా రెండేళ్ళలోనే పట్టించెయ్యాలి.

సినిమా ఇండస్త్రీలోవున్న స్నేహితులందరి జీవితాల్నీ నేనే ఒక సినిమాగా తియ్యాలి.

హైద్రాబాదులోని నా స్నేహప్రపంచంలో మరిన్ని బ్లాగుదేశాలు చేరాయి. అన్నింటినీ ఒక్కటిగాచేసి, అంతానాదే అనేసుకోవాలి.

మళ్ళీ హైదరాబాదుని సొంతం చేసుకోవాలి.


వస్తున్నా హైదరాబాద్ ! just wait for me !

***

Tuesday, August 26, 2008

పరమసత్యాన్ని మించిన సత్యం !!!

సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు. "నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు.



సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!



పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు. నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత (Right Concentration).



మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.



యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు. తను పెదవి విప్పింది. "ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?".



"బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ. "నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు.



రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.



ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం. "పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్.



మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది. అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.



తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు. లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.




*మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.



***

Monday, August 25, 2008

స్త్రీవాద సాహిత్యంలో గందరగోళం

రెంటాల కల్పనగారు తమ బ్లాగులో రాసిన "కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కథ" అనే విశ్లేషణాత్మక వ్యాసానికి నేను రాసిన వ్యాఖ్యలను టపాగా ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను.

౦౦౦

ఈ కాలంలో స్రీవాదం అనేది ఒక politically correct పంధా. భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.
ఇలాంటి స్థితిలో rhetoric కి ఉన్న విలువ సాహిత్యానికి లేదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీలు emotive slogans వాడినట్లు చాలా మంది రచయిత/త్రు లు ఈ వాదాన్ని వాడేస్తున్నారు.


సాహిత్యాన్ని కేటగరైజ్ చెయ్యటంలో మొదటిది సహజసిద్దంగా వచ్చిన సాహిత్యాన్ని సిద్దాంతీకరించే పద్దతైతే మరొకటి సిద్దాంతాన్ని బట్టి సాహిత్యాన్ని సృష్టించడం.ప్రస్తుతంవున్న చాలా మంది స్త్రీవాద రచయిత/త్రు లు చేస్తున్న పని రెండోరకానికి చెందింది. అందుకే ఇన్ని సమస్యలున్నాయని నా అభిప్రాయం. విమర్శకుల వివక్షకి ముఖ్య కారణంకూడా అదే కాబోలు. విస్తృతమైన మానవసంబంధాలూ, సామాజిక సమస్యలమీద రచయిత/త్రులు సహజంగా రాసిన తరువాత వాటిల్లోవున్న స్త్రీవాదకోణాన్ని అర్థం చేసుకుని విమర్శనలు చెయ్యడం వేరు, కేవలం స్త్రీవాద రచనగనక ఆ ధృష్టికోణంలో దాన్ని చూసి ‘విలువకట్టడం’ వేరు.


“A failed writer becomes a critic” అన్నట్లు, మన తెలుగు సాహిత్య విమర్శకులలో చాలా మంది ఈ బాపతుగానే అనిపిస్తారు. వారు చేసే “విమర్శ”లెక్కువా “విమర్శనలు” తక్కువా. ఎంతసేపూ ఉన్న సాహిత్యంలో లోపాలను వెతకడానికి కంకణం కట్టుకున్నట్లు మాట్లాడతారేగానీ, ఆ రచనకున్న సామాజిక విలువ, పాఠకులకు ఈ రచన ఎలా ఉపయోగకరంగా ఉంటుందో విశ్లేషించరే? వీళ్ళందరూ T.S.Eliot, F.R.Leavis, Mathew Arnold వంటి విమర్శకులని చదివుండరనిపిస్తుంది.

౦౦౦

”ఈ భావజాలం యొక్క సైద్దాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా ఉంది.”ఏరకంగానో నాకైతే అర్దం కాలేదు. దీన్ని వివరించగలరా? - రెంటాల కల్పన

౦౦౦

అర్థం కాక అడిగారంటే నేను నమ్మలేను. అయినా ఆ స్టేట్మెంట్ ఇచ్చింది నేను గనక,వివరించాల్సిన నైతిక బాధ్యతని తీసుకుని వీలైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.


సాధారణంగా భారతీయ స్త్రీవాదాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటిది బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన సామాజిక ఉద్దరణ (1850- 1915). దీనికి మూలం మానవత్వం అనిచెప్పుకోవచ్చు. ‘సాంఘిక సంక్షేమం’ ఆధారంగా కొందరు సతీసహగమనం,వితంతువివాహం మొదలైనవాటి నిర్మూలనకు పోరాడిన సమయం ఇది.


రెండవది, స్వాతంత్రోద్యమ నేపధ్యంలో జరిగిన మహిళా చేతన (1915-1947). ముఖ్యంగా గాంధీ భారతీయ రాజకీయ తెరపైకివచ్చి మహిళల్ని కార్యోన్ముఖుల్ని చేసిన దశలో జరిగిన కాలమిది. ఇప్పుడే ‘మహిళలు మాత్రమే’ ఉన్న సంస్థలూ,ఉద్యమాలూ మొదలయ్యాయి. ఇవన్నీ దేశస్వాతంత్ర్యంతోపాటూ మహిళా స్వేచ్చని కాంక్షించేవిగా ఎదిగాయి.


స్వాతంత్ర్యానంతరం కూడా వీరి పరిధి మహిళాశిశు సంక్షేమం, సమాన వేతనాలు వంటివాటికే పరిమితమయ్యాయి. ప్రభుత్వంకూడా ఈ ఫనులన్నింటినీ ఒక ప్రోత్సాహంలాగానే (దయతలచినట్లు) చేసిందేతప్ప “హక్కుల” ధృక్కోణంలో చెయ్యలేదు.


మూడవభాగం 1970లలో ప్రపంచవ్యాప్తంగా,ముఖ్యంగా అమెరికాలో వచ్చిన స్త్రీవాద మార్పుల నేపధ్యంలో భారతీయ స్త్రీవాదం మరో బలమైన మలుపు తిరిగింది. వ్యక్తిగతస్వేచ్చ,హక్కులు, జెండర్, సెక్సువాలిటీ,గృహహింస, పితృస్వామ్యం వంటి విస్తృతమైన సమస్యల్ని ప్రధానస్రవంతిలోకి తీసుకురావడానికి ఈ సమయంలో ప్రయత్నాలు జరిగాయి.


పైన ఉన్న ప్రతి భాగంలో అప్పటి పరిస్థితికి అనుగుణంగా సాహిత్యసృజన జరిగింది. కాకపోతే, భారతదేశం 1990వ దశకంలో చాలా విప్లవాత్మకమైన మార్పుల్ని సంతరించుకుంది. 1970 లలోని సామాజిక,ఆర్థికవిధానాలతో స్త్రీవాద ఉద్యమం ముడిపడివున్నట్లే, ఈ విప్లవాత్మక మార్పుల దృష్ట్యా ఈ వాదంలోనూ మార్పులు రావాల్సింది. కానీ కొన్ని ఛాంధసవాద భావాలూ, సాంప్రదాయక విలువలలోని సౌఖ్యాన్ని అంతర్లీనంగా గ్రహించిన చాలామంది స్త్రీవాదులు కేవలం దీన్ని battle of sexes గా మార్చి, సమాజమూలాల్ని మార్చడంగురించి చర్చించడం మానుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది.


ఈ నేపధ్యంలో స్త్రీవాదంలో ఒక రకమైన డొల్లతనం కనిపించడం ప్రారంభమయ్యింది. అమెరికా స్త్రీవాదాన్ని ఆదర్శంగా తీసుకున్న స్త్రీవాదులు, కేవలం వారికి అనుకూలమైనవాటిని మాత్రమే ఏరుకుని, మిగతా “స్వేచ్చ” విషయాలలో పితృస్వామ్యం మూసనే మళ్ళీ మన సమాజంపై తమ సాహిత్యం ద్వారా రుద్దటం ప్రారంభించారు. ఇక్కడే ఒక disconnect మొదలయ్యింది. అటు ఎంచుకున్న అనుకూల మూలసిద్దాంతం, ఇటు త్వరితగతిన మారిన సమాజం నేపధ్యంలో ఒక విధమైన సైద్దాంతిక గందరగోళం ఏర్పడింది.


చాలావరకూ స్త్రీవాద రచయిత/త్రులు నగరానికి చెందినవారవటం కారణంగా ఈ తేడా మరింత స్పష్టంగా కనిపించడం మొదలయ్యింది. మూల సమస్యలకన్నా కొసరు సమస్యలను నెత్తికెత్తుకుని అదే స్త్రీవాదంగా భ్రమించడం మొదలయ్యింది. అందుకే “all men are pigs” వంటి సులభమైన భావజాలాన్ని సృష్టించి దీన్ని మగాడికీ ఆడవారికీ మధ్య సమస్యగా మాత్రమే చూపుతూ తమ పబ్బం గడుపుకోవడం మనకు తెలిసిందే. ఇంతలో మారాల్సిన సమాజం అర్జంటుగా మారిపోయి, ఈ సిద్దాంతాలకి “బూజుపట్టించేసింది”. యువతలో చాలామంది ఈమూస స్త్రీవాదం నుంచీ దూరంగా ఉండాలనుకోవడం ఈ సైద్దాంతిక అస్తవ్యస్తతే అని నాకు అనిపిస్తుంది.



“అడామగాకున్నది మిత్రవైరమేకానీ శతృత్వంకాదన్న” మూల సిద్దాంతాన్ని విస్మరించి ప్రస్తుత స్త్రీవాదం,దాని సాహిత్యంలో కఠినత్వాన్ని నటిస్తోందని నేను చదివిన కొన్ని కథల మూలంగా అనిపించింది. మార్చాల్సిన కనబడే సామాజిక వ్యవస్థలకన్నా, పితృస్వామ్య భావజాలమనే ఒక శతృవుతో పోరాడటానికి వీరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనబడుతుంది. దీనికితోడు, కొంత ఈ ఆలోచనా శైలితో విభేధించే ఏ స్త్రీనైనా లేక పురుషుడినైనా లేబుల్స్ తగిలించేసి “వెలివేసే” అలవాటు స్త్రీవాదుల్లో తయారయ్యింది.


70లలో ఆగిపోయిన స్త్రీవాద భావజాలం 90ల sensitivity ని పుణికితెచ్చుకోకుంటే, అసలే తెలుగు చదవడం మానేస్తున్న యువత, స్త్రీవాదం అనే మాటవింటేనే ఆ సాహిత్యంవైపు కన్నెత్తిచూసే సాహసం చెయ్యకపోవచ్చు. ఇక కేవలం రాసినోళ్ళూ,పబ్లిష్ చేసినోళ్ళూ లేక వృత్తిరీత్యా విమర్శకులూ ఆ సాహిత్యాన్ని చదవాల్సిందే. ఆ భావజాలాన్ని అభినందించాల్సిందే.


I don’t mean to take away any credit from feminism for what it has done in the past. But, at present if they don’t sensitize themselves with present day reality, the time may come when it is dead and none will be there even to mourn it.



ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను. Readers have every right to interpret the text as they wish. కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో a work of artని కొలవడం నేను అంగీకరించలేని విషయం.



“Literary criticism has a great role to play in not only indexing what is written, but also to contextualize the written word in present day society” అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. అందుకే సాహితీ సమీక్షలకూ, విశ్లేషణలకూ,విమర్శనలకూ నేను విలువనిస్తాను. కాకపోతే మన తెలుగులో కులాలూవాదాలూ తప్ప సమాజం ఎక్కడా విమర్శకుల ధృక్కొణంలో కనిపించక నిరాశపడుతూ ఉంటాను.



ఎలియట్ ఆర్నాల్డ్ చదివితేగానీ విమర్శకుడు కారాదని నా ఉద్దేశం కాదు. కానీ, విమర్శకుడిగా మన బాధ్యత,నిబద్దత తెలియాలంటే సాహితీ విమర్శకు సంబంధించిన విభిన్నమైన ఆలోచనలు ఖచ్చితంగా తెలియాలి. అందుకే బహుశా మన విమర్శకులు చదవలేదేమో అనే సందేహం వెల్లడించాను.


***

Sunday, August 24, 2008

నేను రోజూ ఎందుకు బ్లాగు రాస్తాను !

సి.బి.రావు గారు నా 'దరిద్రనారాయణుడు' టపాకు వ్యాఖ్యరాస్తూ నా బ్లాగు రాతలగురించి కొన్ని సందేహాలు లేవనెత్తారు. మొదటిది "అలవక రోజూ ఇలా, ఎలా కత్తుల్లా విసురుతున్నాడో" అని. రెండవది "ఇన్ని టపాలు, ఉల్లాసంగా, ఉత్సాహంగా రాయటానికి మీరేమి తాగుతారు" అని. అంతేకాక "వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అంటూ నాకొక చురకకూడా అంటించారండోయ్. వారడిగినవి చాలా విలువైన ప్రశ్నలు, ఎందుకంటే ఇప్పటివరకూ ఆప్రశ్నలకు నాకూ నిర్ధిష్టంగా జవాబులు తెలియదు.



హఠాత్తుగా మనల్ని ఎవరైనా జవాబు రాని ప్రశ్నలెవరైనా అడిగితే, "good question" అని మొదట అనేసి తరువాత ఆలోచించడం మొదలెడతాం. అలాగే, వారి వ్యాఖ్యకు ప్రతిగా ఏకంగా ఒక టపా "రాసేస్తా చూడండి" అని చెప్పి, ఇప్పుడు ఆలోచిస్తుంటే కాస్త గందరగోళంగా ఉంది. ఏదిఏమైనా, మన రతన్ టాటా 'నానో' కారు రేటు గురించి "a premise is a promise" అంటూ లక్షరూపాయలకే ఇవ్వడానికి తయారైనట్టు, నేనూ వీలైనంత సిన్సియర్గా సమాధానం ఆలోచిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను.



"To understand a writer in his totality, you need to understand his life and times" అంటారు. అలాగే రావుగారడిగిన ప్రశ్నలకి సమాధానంగా కొంత నా జీవితాన్ని వివరించకతప్పదు.



ఇంట్లో నేనే చిన్నవాడిని అవటం వలన స్వతహాగా కొంత రెబల్ మనస్తత్వం కలిగింది. పుస్తకాలు చదవడం చిన్నప్పుడే మా అన్నయ్య ద్వారా అలవడింది.అలా చదివినదాన్ని ఊహించి ఆనందించడం నా చుట్టూ చాలా మంది చేస్తే, నేను కాస్త తింగరోణ్ణికాబట్టి ఆనందించడంతోపాటూ ప్రశ్నించడం మొదలెట్టేవాడిని. అప్పట్లో అది నా తరహా భాష్యం (interpretation) చెప్పుకోవడానికి నేను చేసిన ప్రయత్నమన్నమాట. ఇలా చందమామ నుంచీ యండమూరి వరకూ చదివేసాను. యండమూరి అప్పట్లో కొంత సామాజిక నిజాల్ని ప్రశ్నించే రచనలు చెయ్యడం, నేను వాటిని చదవడంతో కొంత critical thinking మొదలయ్యింది. నాకు ఇష్టమొచ్చింది నేను మనస్ఫూర్తిగా చెయ్యగలగటం, అనే ఒక విలువని అప్పట్లో చాలా అభిమానించి internalize చేసుకున్నాను. అందుకే నన్నూ ఏ ఇంజనీరుగానో,డాక్టరు గానీ చేసెయ్యడానికి మా నాన్నగారు సైన్సు తీసుకోమంటే, ఖచ్చితంగా వద్దని చెప్పి ఆర్ట్స్ తీసుకున్నాను.



నా అదృష్టంకొద్దీ తేదీలు బట్టీపట్టమనే హిస్టరీ టీచర్లూ, స్టాటిస్టిక్స్ ఫార్ములాలు వల్లెవేయమనే ఎకనామిక్స్ టీచర్లూ లేక జ్యాగ్రఫీ అంటే మ్యాపులు కొలిచే సబ్జెక్ట్ అన్నట్లు చెప్పే టీచర్లు కాక, కొంత innovative గా పాఠాలు చెప్పే ఉపాధ్యాయగణం దయవల్ల నా విమర్శనా దృష్టికి కొంత తర్కం,ఆలోచనా దొరికాయి. ఉదాహరణకి చరిత్రపాఠాలు తారీఖుల ఆధారంగాకాక, ఘటనలను ఒక పద్దతి ప్రకారం అర్థం చేసుకోవడం వలన సులభంగా నేర్చుకోవచ్చని మా హిస్టరీ మాస్టారు నేర్పారు. ఒక "3C formula" మాకు నేర్పించి జీవితంలో చాలా పెద్ద సహాయం చేసిన ఆ టీచర్ని మర్చిపోలేను. మా మాష్టారి ప్రకారం ఏ చారిత్రాత్మక ఘటననైనా మూడు భాగాలుగ విభజించొచ్చు, 1.Causes (కారణాలు), 2. Course (ఘటనాక్రమం), 3. Consequences (ఫలితాలు), నిజంగా చరిత్రకు ఇవే ముఖ్యం. తారీఖులు కాదు.ఈ ఘటనలు జరిగిన తేదీ గుర్తుంటే అది ఒక బోనస్సేతప్ప,అదే అంతంకాదు. ఈ ఒక్క ఆలోచన, నా జీవితంలోని విషయాలను అర్థం చేసుకునే విధానంలో తీవ్రమైన మార్పుని తీసుకొచ్చింది.



ఈ ఆలోచనలు నాలో అంకురించి మొక్కగా మొలిచిన దశలో, మైసూర్ కాలేజిలో గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాను. అక్కడ నేను నా సబ్జెక్టు ఆంగ్ల సాహిత్యం. అసలే సగానికిపైగా మతాన్ని వ్యతిరేకించి, వ్యక్తి స్వాతంత్ర్యానికి పట్టంకట్టే ఈ సాహిత్యం నా స్వతంత్ర్యా భావాలకు రెక్కలనిచ్చింది. అప్పుడే "ఆంగ్ల సాహిత్యాన్ని అర్థం చేసుకో, తెలుగు సాహిత్యాన్ని అనుభవించు" అని చెప్పిన మా ఫ్రొఫెసర్ మాటతో అప్పటివరకూ యండమూరి వరకూ ఆగిన నా చదువు చలం,కొడవగంటి కుటుంబరావు,చివుకుల పురుషోత్తం,చిట్టిబాబు, బుచ్చిబాబు,తిలక్ ల పరిచయంతో పరిమళించింది.దానితోపాటూ చదవిన ఆంగ్లసాహిత్యం ఎలాగూ ఉంది. ఇలా మొత్తానికి చాలా మంది జీవితాల్లా కాక, my academics always helped my "Education" అన్నమాట.



ఆపైన ఏ TV లోనో సినిమాల్లోనో చేరదామనుకున్న నేను Communicationలో పోస్ట్ గ్ర్యాడ్యుయేషన్ చేసినా, అక్కడ సామాజిక సమస్యల గురించీ వ్యక్తులుగా, మీడియా ఫ్రొఫెషనల్స్ గా, ఈ దేశ పౌరులుగా మేము నెరవేర్చవలసిన బాధ్యత గురించీ ఒక theoretical frameworkలో చెప్పారు. గ్రామీణ నేపధ్యం కలిగిన నాకు ఆ సమస్యలు తెలిసున్నా, ఈ సైద్దాంతిక ధృక్కోణం నా ఆలోచనకు కొంత ఉద్వేగాన్ని అందించింది. ఈ నేపధ్యం కారణంగా జీవితాన్నీ, చుట్టూవున్న సమాజాన్ని నాదైన రీతిలో అనుభవించడానికీ,అర్థం చేసుకోవడానికీ, ప్రతిస్పందించడానికీ ప్రయత్నిస్తూ ఉంటాను.



ఈ నా ఆలోచనలకి,స్పందనలకీ బ్లాగు మూలంగా ఇప్పుడు అక్షరరూపం వస్తున్నాయంతే. బ్లాగులేనప్పుడు మిత్రులతో,కుటుంబ సభ్యులతో మౌఖికంగా చర్చించేవాడిని ఇప్పుడు రాస్తున్నాను. అంతే తేడా. ఆలోచించిందో లేక అనుకున్నదో చెప్పటం అలవోకగానే జరుగుతుందేతప్ప అలసటన్నది దరిదాపులకి కూడా రాదు. సాహితీమూర్తులను చదివి సంపాదించుకున్న భాష, నేను ఇప్పటివరకూ తెలుసుకున్న జ్ఞానం నా ఆలోచనల మరింత పదునుపెట్టి రాసేలా పురికొల్పుతుంటే, ఉత్సాహంగా రాయటానికి ఇంకేమీ అవసరంగా అనిపించలేదు. రాసిన తరువాత, రాసింది మరోసారి చదువుతుంటే కలిగే తృప్తే నా ఇంధనం. మరింకేం తాగనవసరం లేదు కూడాను.



"వ్యాఖ్య రాసే లోపలే, కొత్త టపా వస్తుంటే వ్యాఖ్య ఎలా రాస్తాము?" అన్నదానికి మరింత విస్తృతమైన సమాధానం ఇవ్వాల్సిందే.అలాగే ఈ మధ్య తలెత్తిన కొన్ని అపోహలకూ సమాధానం ఇవ్వాల్సిందే. ఒక ఆలోచనవచ్చిన తరువాత దాన్ని సాధ్యమైనంత త్వరగా, వీలైనంత ‘మూలసహజ స్థితిలో’ అక్షరరూపం ఇవ్వాలంటే దాన్ని అర్జంటుగా రాసెయ్యాలి. అందుకే టపామీదటపా నా బ్లాగులో ప్రత్యక్షమవుతున్నాయి.ఇదివరకూ జ్యోతి గారూ, దిలీప్ గారుకూడా ఈ విషయంగా నాకు కనీసం రెండ్రోజులకొక టపా చొప్పున రాయమని సూచించారు. కానీ వల్లకావడం లేదు. నా ఆలోచనా స్రవంతి అలా తయారయ్యింది. పేపరు మీద రాసే అలవాటు లేక, డైరెక్టుగా బ్లాగులోనే రాస్తున్నందువలన "పబ్లష్" నొక్కడం చాలా temptingగా ఉండి, ఆగలేకపోతాను.


౦౦౦

ఈ మధ్య కొందరు, నేనేదో లైమ్ లైట్ లో ఉండటానే కోరికతో ఇలా రోజుకొక టపా రాస్తానని తమతమ బ్లాగుల్లో చెప్పడం చదివాను. అంతేకాక కేవలం కాంట్రవర్సీలు సృష్టించి నా పాప్యులారిటీ పెంచుకోవడం ఒక (ఇగో సంతృపి పరుచుకునే) అవసరంగా భావించి పనికిమాలిన రాతలు రాస్తానని కూడా అనుకోవడం జరిగింది. నాకు ఈ అభిప్రాయాలు (నిందలు అనికూడా అనుకోవచ్చునేమో) నవ్వునే తెప్పించాయి. ఏదోఒకటి రాస్తే ఎవరైనా లైమ్ లైట్లో ఉండగలరా? అని ప్రశ్నించుకుని సంతృప్తికరమైన సమాధానం దొరకక మానేసాను. పైపెచ్చు నన్ను రెండ్రోజులకొక టపా రాస్తే, కనీసం చెప్పిన విషయం మీద ఆలోచించి వ్యాఖ్య చెయ్యడానికి అవకాశం ఉంటుందని చెప్పే పాఠకులు నా బ్లాగుకుండగా రోజుకొక టపా "కేవలం లైమ్ లైట్ లో వుండటానికి" నేను రాయాల్సిన అవసరం ఉందా! అన్న సందేహానికి సమాధానమే దొరకలేదు.



ఇక కాంట్రవర్సీల సంగతి మరింత హాస్యాస్పదం. నా ఆలోచనలు think of the unthinkable తరహాలో వివాదాస్పదంగా ఉండవచ్చేగానీ, కేవలం టపాలద్వారా వివాదాలు సృష్టించి "పబ్బం గడుపుకోనే" అవసరం నాకైతే ఖచ్చితంగా లేదు. బ్లాగు నా emotional outletకే తప్ప ఎటువంటి ఆర్థిక లాభాలనూ అపేక్షించి కాదే ! ఇక సామాజిక (బ్లాగులోకంలో) విలువంటారా, అది వివాదాన్ని సృష్టిస్తే వచ్చే అవకాశం అస్సలు లేదు. మరి వేటికోసం నేను వివాదాలు సృష్టించాలి?



నా ఆలోచనలతో, అభిప్రాయాలతో విభేధించేవారికి నా బ్లాగులో ఎప్పుడూ సముచిత స్థానం ఉండనే ఉంది. వారు తమ విభేధాలను నిస్సంకోచంగా పంచుకోనూవచ్చు, నా అభిప్రాయాలను తీవ్రంగా ఖండించనూవచ్చు. ఇక నేను రాసింది నేను చాలావరకూ విశ్వసించి (వీలైనంత వరకూ దానికి సంబంధించిన సమాచారం సేకరించి) రాస్తానుగనక నా అభిప్రాయాలకు మద్దతుగా వాదనలు వినిపించే హక్కు నాకూ ఉందని నమ్ముతాను. ఆ హక్కును "పిడివాదం" అంటే, వారు హేతువును చూపకుండా కేవలం నమ్మకాల ఆధారంగా చేసేదికూడా అదేకదా !



మన తెలుగువారిలో, వ్యతిరేకతను అంగీకారాత్మకంగా తెల్పే (disagree agreeably) లక్షణం చాలా తక్కువన్న నా నమ్మకాన్ని చాలా మంది నిజం చేసారంతే. ఏది ఏమైనా, నా బ్లాగు నా వ్యక్తిత్వానికి ఒక అద్దం లాంటిది. నన్ను నిజజీవితంలో అందరూ అభిమానించనట్లే ఇక్కడా కొందరు ద్వేషిస్తారు, మరికొందరు అభిమానిస్తారు. అభిమానానికి సహేతుకమైన కారణం చాలావరకూ ఉంటుందికానీ, ద్వేషానికి.... ఒక్క అపోహ లేక వారు జీవితాన్ని చూసే ధృక్కోణం వ్యతిరేకమైతే చాలు. అయినా ఆలోచనలు వేరైనంతమాత్రానా వ్యక్తుల్ని ద్వేషించాలని నేను అనుకోను. అందుకే ఎప్పుడూ అంగీకారాత్మకంగా విభేధించడానికి ప్రయత్నిస్తాను. ఇక అంతకుమించి హద్దుదాటితే చురక అంటించగలిగే భాష ఎలాగూ నాదగ్గరుందని. అంతేకాక మర్యాదపుర్వకంగా నిరసించగలిగే సంస్కారం కూడా నా పెంపకం, నేను నేర్చుకున్న చదువూ నాకందించాయి అని నేను భావిస్తాను.



ఇదివరకూ ఒక టపాలో చెప్పినట్లు, నా బ్లాగులో నేను మనస్ఫూర్తిగా నమ్మినవీ లేక తీవ్రంగా విభేధించేవీ రాస్తుంటాను. If we all agree, do we really have anything to discuss? అందుకే నా అస్తిత్వం నేను నేనులా ఉండటంలో ఉందని నమ్మినట్లే, నా బ్లాగూ నా బ్లాగులాగానే ఉంటుంది. అందరికీ నా బ్లాగులో స్వాగతం...as long as you have an apatite for disagreement and difference of opinion.



***

Saturday, August 23, 2008

దరిద్రనారాయణుడు

నేను జిల్లాస్థాయిలో పనిచేసేటప్పుడు ఒక IAS అధికారి, కలెక్టర్ గా ఉండేవారు. తను IITలో ఇంజనీరింగ్, IIMలో మేనేజ్ మెంట్ చేసి, విదేశాలకివెళ్ళే అవకాశం వదులుకుని, సివిల్సి పరీక్షలో ర్యాంకుసాధించి ప్రభుత్వాధికారిగా మారారు. తనతో ఎప్పుడు దేనిగురించి చర్చించినా,ఎంతోకొంత నేర్చుకుని బయటపడేవాడిని. అందుకే మేధావులతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అంటారు కాబోలు.



వీరికి ఒక చిత్రమైన అలవాటుండేది. ఎప్పుడు ముఖ్యమైన ఫైలు మీద సంతకం పెట్టాలన్నా, తన డెస్కు పై అద్దం క్రింద ఉంచిన ఒక ఫోటోని చూసుకుని ఆ తరువాత సంతకం పెట్టేవారు. నేనిది కొన్నాళ్ళు గమనించాను. ఆసక్తిగా అప్పుడప్పుడూ ఆ ఫోటో ఏమిటో చూద్దామని ప్రయత్నించినా, ఇటువైపునుంచీ కనబడేది కాదు. ఏదైనా దేవుడి ఫోటో అయ్యుంటుందని నేను తీర్మానించేసి అప్పటికి ఆ ఆలోచనకు గుడ్ బై చెప్పేసాను.



కొన్నాళ్ళ తరువాత నేను జిల్లాస్థాయి నుంచీ రాష్ట్రస్థాయి కన్సల్టెంట్ గా హైదరాబాద్ వచ్చే సమయంలో, తన ల్యాప్ టాప్ పైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించడానికి ఆయన పిలిస్తే, వారు కూర్చున్నవైపు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు యాధృచ్చికంగా వారు తరచూ పైలుమీద సంతకం పెట్టేముందు చూసే పోటో నా కళ్ళబడింది. ఆ ఫోటో,వయసుకి ముందే వయసుడిగిపోయి అర్ధనగ్నగా ఉన్న బక్కచిక్కిన ముదుసలిది.



ఒక్క క్షణం నా ప్రతిస్పందన ఆగినట్టనిపించింది. అంటే, ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ప్రతిసారీ తను తలుచుకునేది ఎక్కడో కనబడకుండా ఉండే భగవంతుణ్ణి కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పేదవాడ్ని. ఒక్క క్షణం నాకు ఆ ఆలోచనే అత్యంత గౌరవప్రదంగా అనిపించింది. నిజంగా ఇదే ‘సేవ’ కు అర్థం అనిపించింది. తన నిర్ణయం ఆ ఫోటోలో నిలువెత్తుగా నిలిచిఉన్న నిజమైన దేశ ప్రతినిధికి లాభదాయకంగా ఉండాలని కోరడం...కనీసం నష్టాన్ని కలిగించకూడదని అనుకోవడంకన్నా మించిన నిబద్ధత ఉంటుందా?



భూమిపై అవతరించిన మహానుభావులందరూ బుద్ధుడూ, క్రీస్తూ, మహ్మదూ, గాంధీతో సహా సమాజంలోని అత్యంత పేదవారి క్షేమం, చైతన్యం, అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను చెప్పినవారే. ఏ సమాజానికైనా పేదల, బలహీనుల, పీడితుల అవసరాలూ హక్కులూ సంరక్షింపబడినప్పుడు మాత్రమే సంపూర్ణత్వం సిద్ధిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి చారిత్రక యుగంలోనూ వివిధ కారణాలవల్ల పేదరికం సృష్టింపబడుతూనే ఉంది. ఈ పేదరిక నిర్మూలనే అంతిమ లక్ష్యంగా ఏ అభివృద్దైనా జరగాలి అని కాంక్షించడంకన్నా మించిన భక్తి, మతం, భగవంతుడూ వుండడని ఆ అధికారి నాకు చెప్పకనే చెప్పారు.



ఈ ఆలోచన నిజానికి ఏ మతానికీ కొత్త కాదు. హిందూ మతంలో "దరిద్రనారాయణుడు" అని పేదవారి గుండెల్లో ఉండే దేవుడి గురించి ఎప్పుడో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆధునిక యుగంలో ఈ ఆలోచన యొక్క బలాన్ని తెలియజెప్పింది ఇద్దరు. ఒకరు స్వామి వివేకానంద, రెండు మోహన్ దాస్ కరంచంద్ ‘గాంధీ’. కాకపోతే, ‘దరిద్రనారాయణుడి సేవ’ అని ఒక పూజ చేసి మిన్నకుండటమో, లేక గుడిలో కొందరికి అన్నదానం చేసి తృప్తిపడటమో జరుగుతోందేతప్ప, ఈ మూల సిద్దాంతాన్ని అటు జీవితంలో, ఇటు అభివృద్ధి మూసలో మన సమాజం ఇంకా సంపూర్ణంగా అన్వయించుకోలేదు. అలా జరగనంతవరకూ మన పవిత్రతలు అపవిత్రాలే, అభివృద్ధి అర్థరహితమే !



నేను మతాన్నీ, దేవుడ్నీ నమ్మను. కానీ మానవత్వాన్ని పెంపొందించే అన్ని విధానాలనూ,ఆలోచనలనూ అత్యంత గౌరవభావంతో చూస్తాను. అందుకే మతంచెప్పే మూడాచారాలకన్నా, ఇలాంటి విలువలను అవలంభిస్తేనే సర్వమానవాళికీ మంచి జరుగుతుందని భావిస్తాను.



"DARIDRANARAYAN is one of the millions of names by which humanity knows the unnamed and unfathomable God, who is unnamable and unfathomable by human understanding, and it means God of the poor, God appearing in the hearts of the poor. Therefore, Daridranarayan seva, seva of the poor, hungry, destitute, is the worship of Sri Narayan himself."



****

రచనలు - ‘బ్లాగు రచనలు’

ఈ మధ్య చర్చల్లో ఒక బ్లాగరి "మనం రాసేది బ్లాగులూ, పోస్టులూ కదా! మరి వాటిని రచనలు అనొచ్చా?" అని ఒక అమూల్యమైన ప్రశ్న సంధించారు. ఒక్క క్షణం అర్థం చేసుకోవడానికి సమయం పట్టినా, నేను సమాధానం వెతకడానికి ఆట్టే కాలయాపన చెయ్యలేదు. రాసేది ‘రచన’ అయితే, రాసేవాడు ‘రచయిత’. అది బ్లాగులో ‘రాసినా’, పత్రికలకు రాసినా, ఏకంగా పుస్తకాలే రాసినా, రాసినదాన్ని ‘రచన’ అనెయ్యొచ్చనే తీర్మానానికొచ్చేసి, అదే చేప్పాను. కాకపోతే నేను చెప్పింది over simplification అనిపించి, ఈ దశగా కొంత ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనల్ని ఈ టపాలో పంచుకుంటాను.



పత్రికల్లో,పుస్తకాల్లో రచనలు జనబాహుళ్యాన్ని ఉద్దేశించి రాయడం వలన లేక రచయిత తనసొంతానికి రాసుకున్నా, ప్రచురణకర్త అవి చాలామంది ప్రజల ఆలోచనలను అందిపుచ్చుకుందని నమ్మటం వలన ప్రచురింపబడతాయి. అందుకే వాటిల్లో నాణ్యత పరమైన జాగ్రత్తలు (quality control) తీసుకుంటారు. ఆ రచనలోని విషయం, సమాజంలో అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న విలువలు, నమ్మకాలు, విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా ఉండేలా చూడటం. ముద్రణలో అక్షరదోషాలూ, వాక్యనిర్మాణంలో ambiguity లేకుండా చూడటం. రచయిత రాసినదాన్ని చదివేవారి tasteకి అనుగుణంగా, పొందికలో అవసరమైన మార్పులు చేయడం లాంటివి జరుగుతాయి. ఈ పరిణామంలో ఒక రచన కాపీ ఎడిటర్ దగ్గరనుంచీ, సబ్ ఎడిటర్ (ఉప సంపాదకులు), ఎడిటర్ (సంపాదకులు) ఒక్కోసారి పబ్లిషర్ (ప్రచురణకర్త) వరకూ ఆ రచనలోని ఒక్కోఅక్షరాన్నీ, ఆలోచననీ, భావాన్నీ, శైలినీ, పొందికనీ పరిశీలించి పరీక్షించి అప్పటి సాహిత్యం యొక్క విలువలతో, వ్యాపార అవకాశాలతో (business possibility) బేరీజుచేసి "పబ్లిష్" మీట/ బొత్తం నొక్కుతారు.



ఇక మన బ్లాగు విషయానికొస్తే, పైన చెప్పిన quality controls ఇక్కడ వుండవు. బ్లాగనేది ఒక వ్యక్తిగత అభివ్యక్తీకరణ మార్గం కనుక, రచయిత అనుకున్నది, తనకు అనిపించినది, తను అనుభవించినది, తను ఆలోచించేదీ నిరభ్యంతరంగా రెండోవ్యక్తి value judgment అవసరం లేకుండా రాసుకోవచ్చు. ఇది జనబాహుళ్యానికి ఉద్దేశింపడింది కాకపోయినా, ఆరంభంలోనే వివిధ విషయాలపై రాసే బ్లాగుల ఆధారంగా, అభిరుచి ఉన్న విషయాలపై రాసే బ్లాగుల్ని search option ద్వారా జనబాగుళ్యం కాకున్నా, కనీసం ఆ విషయం పట్ల ఆసక్తిగల కొందరు చదవటానికి వీలు కలిగేది. ఇప్పుడు కూడలి, జల్లెడ లాంటి బ్లాగ్ అగ్రిగేటర్లు, ఫోరంలు వచ్చిన తరువాత ప్రచురణకు ముందు ఉండే Editorial control ఉండకపోయినా, పది మందీ చూస్తారు గనక ఎంచుకునే విషయాల్లో, రాసే శైలిలో, అభివ్యక్తి రీతిలో ఒక మానసిక ఎడిటింగ్ అవలంభించడం జరుగుతోంది. ఇంకా కొంచెం ముందుకు సాగితే, పాఠకుల feedback ఆధారంగా ప్రస్తుతం ఉన్నటపాలోనే మార్పులో, లేక రాయబోయేవాటిల్లో ఆ సూచనలను అవలంభించడమో చేస్తున్నాము. అంటే, "పబ్లిష్" మీట/బొత్తం వ్యక్తిగతంగా బ్లాగరి చేతిలోనేఉన్నా, కొంతవరకూ pre-editing, మరికాస్త post-editing ఇక్కడా మొదలయ్యిందన్నమాట.



అది ఎంతవరకూ సమంజసం అనేది చాలా వరకూ వ్యక్తిగతం కాబట్టి దాని గురించి చర్చ (ఈ టపా నేపధ్యంలో) అనవసరం. మన మూల బిందువు, రచనలు- బ్లాగురచనలు. ఇప్పుడు ఈ మూలబిందువుని పై విశ్లేషణకి అన్వయిస్తే ఉదయించే ప్రశ్న, "కేవలం నాణ్యతా ప్రమాణాలున్నంత మాత్రానే, ముద్రితమైనదాన్ని మాత్రం ‘రచన’ అని పిలిచి, బ్లాగు పోస్టులను ఆ పదప్రయోగం నుంచీ దూరం చెయ్యాలా?" అని. నాకైతే ఈ ‘వివక్ష’ అంతగా నప్పలేదనే చెప్పాలి. చారిత్రాత్మకంగా సాహిత్యసృజనా దాని పురోగతిని చూస్తే, రచయితలూ, కవులూ, కథకులూ (ఈ మధ్య వచ్చిన కమర్షియల్ రచనల్ని వదిలేస్తే) చాలావరకూ జనాలకోసం రాయలేదు. తమకు ముఖ్యమనిపించిన లేక తాము ప్రతిస్పందించిన విషయాలను అసంకల్పితంగా అక్షరబద్ధం చేసారు. ఆ తరువాతనే వారి అక్షరాల ‘విలువని’ గుర్తించిన అప్పటి రాజులు, జమిందారులో లేక ఇప్పటి ఎడిటర్లూ,పబ్లిషర్లూ వాటిని జనానికి అందించే ప్రయత్నం చేసారు.



అంటే, వ్యక్తిగతమైన అసంకల్పిత రాతలు మొదట పుట్టి, ఆ తరువాతనే ఈ నాణ్యతావిలువలూ, అవి జన బాహుళ్యానికి అందటాలూ, విమర్శకుల విశ్లేషణలూ మొదలయ్యాయన్నమాట. ఈ విధంగా చూస్తే మన బ్లాగులు సరైన దారిలోనే వెళ్తున్నాయి. కాబట్టి నిరభ్యంతరంగా ‘రచన’ అనే పదం వాడుకోవచ్చు. కాకపోతే నేను రచయితని అంటే, ప్రజలు మన రచనల కాంప్లిమెంటరీ కాపీ అడిగే అవకాశం ఉందికాబట్టి, నేను ‘బ్లాగు రచయిత’ని అని గర్వంగా చెప్పుకుని మన బ్లాగు ‘లింకు’ మాత్రం చేతికందించి తప్పించుకోవచ్చన్నమాట.



ఈ మధ్యకాలంలో ప్రముఖ రచయితలు కూడా మరింత మంది పాఠకుల్ని చేరడానికి బ్లాగుదారి నెంచుకోవడం మనకు తెలిసిందే. ఈ పరిణామంలో మార్పు ఇటువేపునుంచీకూడా మొదలౌతోంది. మన తెలుగు బ్లాగరలు e-పుస్తకాలవరకూ వస్తే, ఇంగ్లీషు బ్లాగర్లు పుస్తకాల పబ్లిషింగ్ వరకూ వచ్చేసారు. మనదీ రాబోయే కాలంలో ఆ దారే కావచ్చు. కాబట్టి, నిస్సందేహంగా బ్లాగర్లందరూ రచయితలే, ప్రతిపోస్టూ రచనే.



So, Welcome to the (blog) writers club, Congratulations.


****

Friday, August 22, 2008

మా ముకుందుడు కృష్ణుడైన వేళ...

ఫ్లూటు పోజెలాపెట్టాలో తెలీక ఏకంకా నోట్లో దోపేసాడు.


గోవర్ధనగిరినెత్తరా నాన్నా! అంటే, పక్కింటి గోడెక్కుతానని చూపిస్తే ఎలా?
ఇదే కరెక్టుపోజట.."ఏలా?" అంటే, క్యాలెండర్ చూడమన్నాడు.
త్వరగా ఫోటో తీసేస్తే, వాళ్ళ స్కూల్లోని రాధమ్మ దగ్గరికెళ్ళిపోతాడట!
మావాడి స్కూల్లో రెండ్రోజుల ముందే జన్మాష్టమి జరుపుతూ, మావాడ్ని కృష్ణుడి వేషానికి రెడీ చెయ్యమన్నారు. అందుకే ఇలా...మా ముకుందుడు కృష్ణుడైన వేళ క్లిక్కిన ఫోటోలివి.

Thursday, August 21, 2008

మనిషి - మార్పు

"The only person who always likes change is a wet baby" అంటారు. నిజమే, తడిచిన న్యాపీప్యాడ్ నుంచీ చిన్నపాప కోరుకునే మార్పేతప్ప, నిత్యజీవితంలో మనిషి ‘మార్పుని’ అంత మనస్ఫూర్తిగా ఎప్పుడూ కోరుకోడు. కారణం, మార్పు మన ప్రస్తుత జీవనవిధానాన్ని సవాలు చేస్తుంది. మన ఆలోచనాధోరణి మారాలంటుంది. మార్పు జరిగిన కొంతకాలం మనల్ని అయోమయానికి గురిచేస్తుంది. అలవికాని మానసిక వత్తిడిని గురిచేస్తుంది. అంతేకాక, ఈ మార్పు అసలు ఎలా జరుగుతోందో, దీనివలన మనకొచ్చే నిర్ధుష్ట్యమైన లాభాలేమిటో, మార్పుకు అవతలి ఒడ్డున ఏముందో తెలియకపోవడం జరుగుతుంది.



అందుకే మనిషికి మార్పంటే భయం. మనిషి తన స్థిరత్వంలో ఉన్న ఆనందాన్ని ఎప్పుడూ అభిలషిస్తాడు, ప్రేమిస్తాడు, కాంక్షిస్తాడు. వాటి తీవ్రత మనిషి మనిషికీ మారినా, మూలం మాత్రం statusquo. మార్పులేని హాయైన జీవితం. న్యూటన్ మహాశయుడు తన first law of motion లో చెప్పినట్లు ఈ జఢత్వాన్ని కాంక్షించే ఏవస్తువైనా, కొంత "external unbalanced force" పడందే కదల్దు. మనుషులూ అంతే, కొంత తోస్తేగానీ మార్పువైపు కదలరు. అది వ్యక్తిగతమైన మార్పైనా సరే, సామాజికమైనదైనా ఇదే తంతు, ఇదే పంధా.



ఈ ఆధునిక జీవితంలో మార్పుల తీవ్రత చాలా అధికంగా ఉంది. మారుతున్న భౌతిక, ఆర్థిక మార్పులతో మనుషులూ వారి అభిప్రాయాలూ, ఆలోచనలూ, విలువల తోపాటూ సమాజం యొక్క ధోరణి మారాల్సినంత మారకపోవడం, మనిషి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తోందేతప్ప ఏవిధంగానూ సహాయపడటం లేదు. ఈ పరిస్థితుల్లొ ప్రభుత్వాలూ, ఇతర సంస్థలూ, ఉద్యోగాలూ, పరిశ్రమలూ మొదలగు అన్ని రంగాలలో అవసరమౌతున్న దశ ప్రారంభమయ్యింది. అసలే fear of changeని బలంగా తన జీవనవిధానంలో పొందుపరుచుకున్న మనిషి ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు. అందుకే ఎక్కడ చూసినా 'change management', 'organizational change' అంటూ బోర్డులుకట్టి మరీ, మార్పుని కార్పొరేట్ బోర్డురూముల్లోకి ముఖాముఖి తెచ్చిపెడుతున్నారు.



"మార్పు ఒక జీవన సత్యం". "నేతి నేతి" (not this... not this) అనుకుంటూ, నిరంతరం ప్రశ్నించుకుంటూ,అనుక్షణం మారాలని చెప్పే  వేదాల్ని మనం హాయిగా అటకెక్కించేసి, కేవలం ఛాందస భావాల్నీ, మార్పుని వ్యతిరేకించే మూసలోపోసిన వ్యవస్థీకృత మతాన్నీ వాటి విలువల్నీ అందిపుచ్చుకుని, వెనుకబడుతున్నామేగానీ మార్పు దిశగా మనస్ఫూర్తిగా ప్రయాణించలేకపోతున్న సమాజంగా మిగిలిపోతున్నాం. ఎంత విచారించినా, మార్పు అందరిలోనూ ఒక్కసారే రాదనే నిజాన్నికూడా గుర్తెరిగి ప్రవర్తించాలన్నది చాలా ముఖ్యమైన విషయం.



సామాజిక శాస్త్రవేత్తలు, మార్పు సమాజంలోని మనుషుల్లో ఏవిధంగా వస్తుందో, ఆ వివిధ దశల్లో మారే మనుషులు ఎలా ఉంటారో వారి లక్షణాలేమిటో చాలా విశదంగా వివరించడం జరిగింది. వ్యక్తిగతమైన మార్పు ‘తెలియని మూర్ఖత్వం’ నుంచీ ‘తెలిసిన మూర్ఖత్వం’ వైపుగా జ్ఞానసమపార్జనద్వారా పయనించి, తన ‘తెలియని శక్తుల్ని’ చైతన్యవంతం చేసుకుని అంతర్గత శక్తుల్ని కూడగట్టుకుని ‘చైతన్యావస్థ’లొ మార్పుకు సిద్దమవుతాడట. కానీ మన దగ్గర సమస్యల్లా "జ్ఞానసమపార్జన"లో వస్తుంది. మార్పుకు అవసరమైన జ్ఞానం సత్యశోధనా, తార్కిక అవగాహన ద్వారా లభిస్తే, మనలో చాలా మంది మూఢనమ్మకాలలో, సహజంగా మార్పుని వ్యతిరేకించే మతాచారాలలో, out dated సామాజిక కట్టుబాట్లలో వెతుక్కుంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మార్పు సులభంగా రాదు. కానీ మార్పు ఎవరు ఆపినా ఆగే ప్రవాహం కాదుగనక, అది వచ్చి మన మూలాల్ని కదిలించేసిన తరువాత కుప్పకూలిపోవడాలూ, గుండెపోట్లు తెచ్చుకోవడాలే మిగులుతాయి.



ఒక సమూహంలో మార్పు ఏ విధంగా వస్తుందో, ఆ మారే మనుషుల్ని ఏవిధమైన కేటగరైజ్ చెయ్యొచ్చో తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మార్పు నేఫధ్యంలో ఒక సముహాన్ని ఐదురకాలుగా విభజించొచ్చు. మొదటి రకాన్ని ఆద్యులు (innovators) అంటారు. అసలు మార్పుకు మూలమే వీరన్నమాట. సమాజాన్ని ప్రభావితంచేసే లేక సమూలంగా మార్చే సాంకేతిక పరికరాల్నీ, సైద్ధాంతిక ప్రతిపాదనల్నొ, సామాజిక నిర్మాణాన్నో ఒక ఆలోచనగా లేక వస్తువుగా తయారు చేసే రకంగా వీరిని చెప్పుకోవచ్చు. గెలీలియో, కార్ల్ మార్క్స్, మన చలం ఇలాంటిరిలో వస్తారన్నమాట. వీరు సృష్టించినవి లేక ప్రతిపాదింఛినవి అంత సాధారణంగా మింగుడుపడవు. కాకపోతే కాలక్రమేణా ఇవే మానవ జీవిత ఆదర్శాలుగా మారతాయి.



రెండవరకం వార్ని ఆరంభకులు (early adopters) అని పిలుచుకోవచ్చు. మార్పు సంభవించిన వెంఠనే, దాన్ని అందిపుచ్చుకోవడంలో వీరు ముందుంటారు. ఆలోచనతోపాటూ అవసరమైన ఆర్థిక బలిమికూడా ఇలాంటి వారికి ఉంటుంది. ఈ మార్పువలన ఎక్కువ లాభం పొందేవారు వీరే. వ్యాపారస్తులూ, పారిశ్రామికవేత్తలు, నాయకులు ఈ శ్రేణిలోకి వస్తారు. సామాన్య జనం ఈ మార్పుని అర్థం చేసుకోలేక, తమ విలువల కొలమానంతో వీరిని కొలవలేక, "ఇదొక ఫ్యాషన్ అంతే" అనుకుని తృప్తిపడుతూ ఉంటారు. ఈ శ్రేణిలో ఉన్నవారిని మిగతా సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ అందుకోలేరు. వీరెప్పుడూ రెండడుగులు ముందేవుంటారు.



మూడోరకం వారు అర్థం చేసుకుని ఆహ్వానించేవారు (early majority). మేధావులూ, ఆలోచనాపరులూ ఈ కోవలోకి వస్తారు. అవసరమైన ఆర్థిక బలిమి లేకపోయినా తమ మేధతో మార్పుని, దానివల్ల రాబోయేమార్పుల్ని భౌతికంగా చూడకపోయినా, అర్థం చేసుకుని, జీవితాలకి అన్వయించుకుని ఆచరించేవాళ్ళు వీరు. వీరి సంఖ్య చాలా ఉండటం వలన ఈ శ్రేణి నుండే సామాన్యులకి ఈ మార్పుని దగ్గరగా చూసే అవకాశం, అర్థం చేసుకునే సౌలభ్యత లభిస్తాయి. అంటే, innovation in practice ఇక్కడ కనబడుతుందన్నమాట.



నాలుగో రకం, అంతుచూసి అవలంభించేవారు (late majority). వీరు ఎవరైనా మార్పుని మొదట అందిపుచ్చుకుని, అనుభవించి, అప్పటికీ హాయిగా ఉండటం చూస్తేగానీ ఈ మార్పుదిశగా అడుగులెయ్యరు. మార్పుని చూసినా, వీరు అంత సులభంగా ఇప్పుకోరు. "అది ఇక్కడ సాధ్యం కాదులే", "వారినైతే ఎవరూ అడగరు, కాబట్టి ఏమైనా చేస్తారు" లాంటి స్టేట్ మెంట్లిస్తూ మార్పుని దాట వేస్తుంటారు. మార్పు గుమ్మందాకా వచ్చినా, వీరిలో లెక్కలేనన్ని అనుమానాలుంటాయి. వీరు అపోహలూ సందేహాల ఆధారంగా మార్పుని తమదైన శైలిలో సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో మార్పు తీవ్రత చేతిలో ఓడిపోయో లేక మార్పులో ఉన్న లాభాన్ని గ్రహించో మొదట రహస్యంగా మార్పుని జీవితాల్లోకి తీసుకొచ్చి, తరువాత బాహాటంగా, ఆపైన గర్వంగా అవలంభిస్తారు. మధ్యతరగతి మనుషులంతా దాదాపు ఈ శ్రేణిలో వచ్చేవారే.



ఆఖర్నవున్న ఐదవ రకం వ్యతిరేకులు (Resistors).  వీరికి మార్పు అనగానే చిర్రెత్తుకొస్తుంది. స్థిరత్వాన్ని అమితంగా ప్రేమించి, మార్పుని తీవ్రంగా నిరసించి, ద్వేషించే రకం. మార్పు ఎటువంటిదైనా అది సమాజాన్ని నాశనం చెయ్యడానికే బయల్దేరుతుందని మనసా,వాచా,కర్మణా నమ్ముతారు. వీరి దగ్గర, మార్పుకు వ్యతిరేకంగా కట్టలుకట్టల సమాచారం లభిస్తుంది. వేదాలనుంచీ, పక్కింట్లో జరిగిన విపరీతాలవరకూ వీరి చిట్టాలో మార్పుకి వ్యతిరేకంగా ఉదాహరణలు కనబడతాయి. వీరు మారరు, ఎవరైనా మారుతుంటే తీవ్రమైన అభ్యంతరాలు లేవదీసి పూర్తి సమాజాన్ని కొన్ని తరాలు కాకపోయినా కొన్ని సంవత్సరాలైనా వెనుకబాటుతనం ఉండేలా చూడటం వీరి నిత్యకృత్యం. వీరెప్పుడూ moral high ground లో ఉన్నట్టుగా భావిస్తూ, తక్కిన సమాజాన్ని నిరసిస్తూ అడుగడుగునా తీవ్రభావజాలాన్నీ, మార్పుపట్ల ద్వేషాన్నీ వెళ్ళగక్కుతూ ఉంటారు. గుండెపోట్లూ, అల్సర్లూ, బీపీ వీరికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి. తర్కం, లాభం, ఉపయోగం, ప్రగతి లాంటి పదాలంటే వీరికి విరక్తి.



ఇలా వివిధరకాలుగా మనుషులుంటే, ప్రతి మార్పులోనూ మనం ఒకే శ్రేణిలో కాకుండా వివిధ శ్రేణుల్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకి సెల్ ఫొన్ విషయంలో నేను ‘అంతుచూసి అవలంభించే వారి’ శ్రేణి, అదే కంప్యూటర్ విషయంలో ‘అర్థం చేసుకుని ఆహ్వానించే’ శ్రేణి ఇలా అన్నమాట.



ఏది ఏమైనా మార్పన్నది సహజం. అది జరిగి తీరవలసిందే. ఒక్కోసారి మారకపోతే మన మనుగడ అస్థిత్వం రెండూ నశించే ప్రమాదం వస్తుంది. అంతవరకూ వేచి చూడక ఎంత త్వరగా ఈ మార్పుల శ్రేణుల్లో మెట్లెక్కగలమన్నది మనం సంపాదించే జ్ఞానం, మనకున్న విద్వత్తు మీద ఆధారపడివుంటుంది.



చివరగా మార్పు గురించిన ఒక ప్రకృతి సత్యం చెప్పి ముగిస్తాను. పక్షుల్లో గ్రద్ద (Eagle) కి అత్యంత ఎక్కువ జీవన సమయం ఉంది. దాదాపు 70 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. కానీ 40 ఏళ్ళొచ్చేసరికీ తన రెక్కలు బరువై, ముక్కు (Beak) సుడితిరిగిపోయి అటు ఎగరలేక, వేటాడినా ఆ వంకరతిరిగిన ముక్కుతో తినలేక అష్టకష్టాలూ పడుతుంది. ఇలా కొనసాగితే కొన్నాళ్ళకి ఆకలిని భరించలేక చనిపోవడం ఖాయం. అప్పుడు గ్రద్ద ఒక పని చేస్తుంది... ఎక్కడో దూరంగా ఉన్న కొండమీదకెక్కి, అక్కడున్న రాతితో తన ముక్కుని తనే ఊడగొట్టుకోవడం మొదలుపెడుతుంది. అలా నరకయాతన అనుభవిస్తూ ఊడగొట్టబడిన ముక్కు మళ్ళీ కొత్తగా రావాలంటే, దాదాపు 150 రోజులు పడుతుంది. అలా వచ్చిన కొత్త ముక్కుతో అది తన ఎగరలేని రెక్కలలోవున్న ముసలిఈకల్ని పెకిలించడం మొదలెడుతుంది. ఇలా దాదాపు ఐదునెలల కాలంలో తను "పునర్జన్మ" ఎత్తి మళ్ళీ విజయవంతంగా మరో 30 ఏళ్ళు బ్రతుకుతుంది.



ఇలా బ్రతకడం కోసం మనజీవితాల్లోనూ మార్పు తప్పదు. ఈ మార్పు కారణంగా కొన్ని పాత చిహ్నాల్ని, ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ, అచారాల్నీ, వదులుకోకతప్పదు. ఈ "భారాల్ని" ఒదులుకుంటేతప్ప మార్పు అనే పునర్జన్మ మనకు కలగదు. ఉన్నదాంట్లో సుఖంగావున్నామని మనం అనుకున్నా, change is an eternal force, దాన్నుంచీ తప్పించుకోవడం ఎవరి తరం కాదు. అందుకే మార్పు మిమ్మల్ని బలవంతంగా మార్చే ముందే, ఆ మార్పుని ఆహ్వానించడం, అందిపుచ్చుకోవడం లాభదాయకం అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందదాయకం కూడా.



ఒక సారి ఆలోచిద్దాం. మార్పుని జీవితంలో భాగం చేసుకుందాం. Change is a way of life and change is the only permanent thing in life.


****

Tuesday, August 19, 2008

అర్బన్ సొఫిస్టికేషన్ (Urban Sophistication) అంటే ఏమిటి?

ఈ మధ్య ఒక మిత్రుడు హఠాత్తుగా ఐమాక్స్ ధియేటర్ కెళ్తుండగా, "అర్బన్ సొఫిస్టికేషన్ (Urban Sophistication) అంటే ఏమిటి?" అని ఒక విలువైన ప్రశ్నడిగాడు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గ్లోబలైజేషన్ నేపధ్యంలో ఈ పదం యొక్క ప్రయోగం చాలా చోట్ల, చాలా ఘటనల్లో వినడం జరిగింది. కానీ, ఇప్పటివరకూ అదొక జీవినవిధానమా, aatitudఆ, ప్రవర్తనా, బట్టలేసుకునేతీరా, వెళ్ళే ప్రదేశాలా (హోటళ్ళూ, మల్టీప్లెక్సులూ) అనేది నిర్ధిష్టంగా తెలిసిరాలేదు. కాకపోతే, అది ఈ ఆధునిక నగర జీవనంలో మనిషిని judge చెయ్యడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానం ఇది అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. కొందరు పెద్దలు మాత్రం అలాంటిదొకటి అసలు లేదేమో అనే అనుమానం వెలిబుచ్చుతారు.




నేను యూనివర్సిటీలో చదువు ముగించాక (year 2000) ఉద్యోగ ప్రయత్నాలకోసం బొంబాయి వెళ్ళాను. అప్పటికే సినీదర్శకుడు రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ హౌస్ లో ‘శ్రీ రాఘవేంద్రస్వామి’ సీరియల్ కు పనిచెయ్యడం వలన అక్కడే పనిచేస్తున్న మాసీనియర్ ఒకతను నాకు సినిమాల మీదున్న interest ని గుర్తించి, హైదరాబాద్ కన్నా బొంబాయిలొ భవిష్యత్తు బాగుంటుందని అప్పట్లో చిరంజీవి ‘చూడాలనివుంది’ సినిమాని అనిల్ కపూర్ తో హిందీలో తీస్తున్న ప్రముఖ హిందీ దర్శకుడు సుధీర్ మిశ్రా (ఇస్ రాత్ కీ సుబహ్ నహీ, హజారో క్వాయిషే ఐసీ) reference ఇచ్చి బొంబే పంపాడు.




సినిమా మీద ఎన్నో ఆశలతో నేను బొంబాయి వచ్చి సుధీర్ మిశ్రాని కలవగానే నాకు తెలిసిన విషయం, అనిల్ కపూర్ ‘నాయక్’ అనే సినిమా కోసం bulk dates దర్శకుడు శంకర్ కు ఇచ్చెయ్యడం వలన, ‘కలకత్తా మైయిల్’ (చూడాలనివుంది సినిమా హిందీ వర్షన్) సినిమా postpone అయ్యిందని. అప్పటికే సుధీర్ మిశ్రా ‘నింబస్’ production house కోసం కొన్ని TV సీరియళ్ళు తీస్తున్నారు. ఆ సీరియళ్ళలో పనిచెయ్యమని అతను చెప్పినా, నా హిందీ మీద కొంచెం డౌటున్న నేను సాహసించలేకపోయాను. అయితే అప్పుడే SAB TV వాళ్ళు తెలుగు ఛానల్ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్న విషయం తెలిసి సుధీర్ మిశ్రా నన్ను అక్కడి senior producer ఒకరి పేరుచెప్పి కలవమన్నారు. ఇక్కడ మొదలాయ్యాయి నా సినిమా కష్టాలు.




దాదాపు 16 రోజులు పట్టింది SAB TV లో రిసెప్షనిస్టుని దాటి ఆ ప్రొడ్యూసర్ ని కలవడానికి. అప్పటికే బొంబాయిలో ట్రెయిన్ ప్రయాణాలతో ఒకవైపు విసిగున్న నాకు, ఈ రిసెప్షనిస్టు పెట్టిన కష్టాలు తోడై చిర్రెత్తుకొచ్చి పెట్టాబేడా సర్ధుకుని, అప్పటివరకూ ఆశ్రయమిచ్చిన మా అన్నయ్య స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పి హైదరాబాదొచ్చిపడ్డాను. ఈ రిసెప్షనిష్టు అనుభవం ఒక మిత్రుడికి చెబితే, "may be your ‘urban sophistication’ didn't match the expectations of that receptionist" అన్నాడు. అది నేను జీవితంలో రెండోసారి ఈ పదం వినడం. మొదట విన్నది, హిందీ నటుడు దేవానంద్ గురించి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ‘ఆశిష్ నంది’, "he represented a care-free urban sophisticated man" అని తన వ్యాసంలో చెప్పినప్పుడు.




నా మిత్రుడు చెప్పిన perception సరైనదే అని నాకనిపించింది. అప్పటి బొంబాయి సినీ మరియూ టీవీ పరిశ్రమలో ఉన్న వ్యక్తుల జీన్స్ ప్యాట్ టీ షర్టులూ, పిలకలలూ, మేక గడ్డాలకూ నా వేషభాషలకూ చాలా తేడా ఉండేది. ఇంగ్లీషు బాగానేవచ్చినా, దాంట్లో కొంత దక్షిణ భారతీయ యాస తోడైతే, అక్కడ చాలామంది అప్పుడే అమెరికానుంచో, బ్రిటన్ నుంచో దిగివచ్చినట్లు యాక్సెంట్ తో మాట్లాడేవారు. నిజంగా అలా దిగుమతైన బాపతులుకూడా ఉండేవాళ్ళు. అంటే, what you are capable of కన్నా, how you carry yourself with... "urban sophisticaion" అన్నది నాకు entry barrier అయ్యిందన్నమాట.




ఈ మధ్యకాలంలో ఇది మారినట్టు అనిపిస్తోంది. కేవలం వేషభాషలే కాక, వ్యవహరించే తీరూ, స్పందించే విధానం ఈ పరిధిలోకి వస్తున్నట్టుగా నా అనుభవం. నోరెళ్ళబెట్టకుండా ఐమాక్స్ లో ఎస్కలేటర్ ఎక్కడం, నిస్సంకోచంగా మాల్ లోని దుకాణాల్లోకి అడుగుపెట్టడం, కాస్ట్లీ రెస్టారెంటుల్లోకి గుబులు లేకుండా ప్రవేశించి అధికారికంగా ఆర్డరివ్వడం వంటివి physical manifestations of urban sophistication గా మారినట్లున్నాయి. కాకపోతే ఇక్కడకూడా ఆంగ్లభాషో లేక ఆంగ్లం కలిపిన తెలుగో తప్పటం లేదు. బహుశా అది నగరజీవనానికి, మన ప్రజల నాగరికతకూ ఒక కొలమానంగా ఎప్పుడో మారినట్లుంది. మన తెలుగు TV లోకూడా తెలుగు రాని తెలుగు యాంకర్లు మోడ్రన్ డ్రస్సుల్లో "హాయ్" అంటూ urban sphistication ఒలికిస్తూ ప్రత్యక్షమవుతుంటారు.




ఈ విధానాన్ని మరొకమెట్టుకి తీసుకెళ్తే, intellectual urban sphistication ఒకటి తయారయ్యింది. కాటన్ చీరలూ, పెద్ద బొట్టూ, సగం రవికా ధరించి, మహిళల్ని ఉద్దరించడానికి ఫెమినిజం పదాలు జాలువారుస్తూ కొందరు. మాసిన జీన్సులూ, ఖద్దరు జుబ్బాలూ, హ్యాండ్ మేడ్ బ్యాగులూ ధరించి పర్యావరణ హక్కుల గురించి ఇంగ్లీషులో పోరాడేవాళ్ళు ఇలాంటి కేటగరీలో వస్తారనుకుంటాను. వీళ్ళకొక credibility, appeal అనేవి సహజంగా వచ్చేస్తాయి. మధ్యతరగతి నగరవాసులంతా మనకోసమే వీళ్ళ వేదనా, ఆవేదనా అనే విపరీతమైన నమ్మకాన్ని వీరిపట్ల ఏర్పరుచుకుంటారు. దాదాపు ఇలాంటి urban sophistication కాలేజుల్లో, యూనివర్సిటీలలో అమ్మాయిల పరిచయాన్ని కలిగిస్తాయి.




ఇలా ఎక్కడ చూసినా ఈ సర్వాంతర్యామి కనిపిస్తున్నా, దీని అసలు అర్థమేమిటో ఇప్పటికీ నాకు తెలియరాలేదు. మీకు తెలిస్తే చెప్పండి. నేను చెప్పినవాటిల్లోఉన్నది నిజంగా నేను అనుకున్న urban sphistication నో లేక నా అపోహో తెలియజెప్పి జ్ఞానోదయం కలిగించండి.


****

దేశభక్తి అంటే?!?

15 ఆగష్టు, 26 జనవరి రాగానే "సహజంగా" మనందరిలో దేశభక్తి పొంగిపొర్లి ప్రవహిస్తుంది. ఎక్కడ దేశభక్తి సినిమాపాటలో, ప్రైవేటు ఆల్బమ్సో లేక ప్రభుత్వం చేత ఆమోదింపబడిన జాతీయగేయాల పట్టికలోంచో ఏపాట ఎక్కడ వినిపించినా శరీరంలోని "కండిషన్డ్ హార్మోన్లు" అకస్మాత్తుగా విడుదలై, ఆవేశాన్ని పుట్టించేసి, కళ్ళు చెమర్చింపజేసి ఉద్వేగానికి గురిచేస్తాయి. మన ఛాతీ మామూలు రోజులకంటే ఒక ఇంచి పెరిగిమరీ గర్వాన్ని కలిగిస్తుంది. మువ్వన్నెల జెండా తగిలించుకుని పొద్దున్నే జెండా వందనానికై స్కూలుకెళ్ళే చిన్నపిల్లల్ని రోడ్డుపక్కనున్న కాకాహోటల్లో కాఫీతాగుతూనో, బాల్కనీలో నిల్చునో చూసి మనం "ఆహా ఎంత గొప్ప దేశం మనది" అని సంతోషించి, చక్కగా హాలిడే జరుపుకోవడానికి సిద్ధమైపోతాం. కాకపోతే ఎవరైనా, "దేశభక్తి అంటే ఏమిటి?" అని ప్రశ్నిస్తే మాత్రం ఆ ప్రశ్నించినవాడొక దేశద్రోహిగానో లేక అధమం unpatriotic గానో అనిపిస్తాడు.




నావరకూ దేశభక్తి అంటే, "కేవలం మనం ఈ దేశంలో పుట్టామన్న ఒకేఒక్క కారణం చేత ఈ దేశాన్ని ప్రేమించడం". చాలా పచ్చిగా అనిపించినా అది కాదనలేని నిజం. By chance నేను పాకిస్తాన్ లో పుట్టుంటే, ఆ దేశాన్ని విజయవంతంగా ప్రేమిస్తూ, భారతదేశాన్ని ద్వేషించకపోతే అది unpatriotic అనుకుంటూ బ్రతికేసేవాడినే కదా! దీనిప్రకారం దేశభక్తి అంటే, ఎవరోనిర్ణయించిన హద్దుల్ని ఆధారంచేసుకుని, అవి physicalగా తెలియకపోయినా, మానసికంగా వాటిని అంగీకరించి, ఆ హద్దుల్ని ఓక దేశంగా దానిలో నివసించే సమూహాన్ని దేశ ప్రజలుగా భావించి, unconditionalగా ప్రేమించడం. చాలా romantic idea. వినడానికీ, అనుభవించడానికీ చాలా బాగుంది, కానీ ఆలోచించడానికి...ఏమో నాకైతే తెలీదు.




కాకపోతే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడప్పుడూ నాకు దేశం మీద unconditional ప్రేమంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా మనదేశం, తన ప్రజలపైనే జరుపుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, కొందరు ‘సందేహంగా’ నా నిబద్ధతను శంకించినప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది. దేశాన్ని, లేక దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నింఛడంకూడా unpatrioticగా ఈ మధ్య చాలా మంది భావించెయ్యడాన్ని వారి తెలియనితనం అనుకోవాలో లేక వారికి జరిగిన దేశభక్తి conditioning విధానం వారి patriotismని కాస్తా jingoism గా మార్చేసిందేమో అనిపిస్తుంది. వారి హద్దు "మనదేశం అన్యాయం చేస్తే సరేగానీ, పక్కదేశంవాడు అదే అన్యాయాన్ని చేస్తే మాత్రమే తప్పు" అనిపించేలా ఉంటుంది. బహుశా మన దేశం ఒక అర్థంకాని జిగ్సా పజిల్ లాంటి విభిన్న సంసృతులూ, భాషల నేపధ్యం నుంచీ తయారు చెయ్యబడటం వలన ఈ confusions మనలో ఇంకా ఎక్కువే ఉన్నాయనుకుంటాను.



ఏదిఏమైనా దేశభక్తి ఎవరో చెబితేనో, ఏదో చేస్తేనో వచ్చేదైతే కాదు. మహా అయితే ఆవేశం, ఉత్సాహం ఆ క్షణానికి "జై హింద్" అంటే వస్తుందేమోగానీ, క్రియాశీలక దేశభక్తి నిర్థిష్టమైన మానవత్వం నుంచీ వస్తుందనుకుంటాను. అప్పుడు కూడా నాలాంటివాడు పాకిస్తాన్ నూ, అమెరికాను కూడా సమానంగా ప్రేమించేసి అపవాదు మూటగట్టుకోగలడు. అందుకే ఇప్పటికీ దేశభక్తంటే నాకు అర్థం కావటం లేదు...ఏమిటో ఈ విచిత్రం. నామట్టుకూ నాకు అశరీరంగా భావంలో,ఆలోచనలో మాత్రమే ఉండే దేశంకన్నా, నాకుటుంబాన్ని ప్రేమించడం సులువనిపిస్తుంది. నాకు అదే ముఖ్యంకూడా !


****

Monday, August 18, 2008

వెధవతనంలో సిన్సియారిటీ...

చిన్నప్పుడు మొత్తం మహాభారతం కథలుగా చదివాను. ఆఖర్న స్వర్గారోహణ పర్వానికొచ్చేసరికీ నిజంగా మహాభారతం నా కళ్ళు తెరిపించిందనిచెప్పొచ్చు. కృష్ణుడు అవతారం చాలించిన తరువాత, పంచపాండవులు ద్రౌపతితో సహా రాజ్యాన్ని త్యజించి స్వర్గానికి బయల్దేరుతారు. ఈ ఆరోహణ క్రమంలో వారితో పాటూ ఒక కుక్కా అనుసరిస్తుంది. మార్గంలో ఒక్కో మజిలీలో ఒక్కొక్కరు వరుసగా కుప్పకూలిపోతే చివరకు ధర్మరాజూ, తనని అనుసరించిన కుక్కా స్వర్గద్వారాన్ని సమీపిస్తారు. స్వర్గంలో కుక్కకు ప్రవేశం లేదంటే, మన ధర్మరాజు యధావిధిగా "తప్పదు" అని భీష్మించిన క్షణాన ఆ కుక్క ‘ధర్మం’ అవతారమెత్తి ధర్మరాజుని అభినందించి తనే ధర్మరాజుకి guideగా వ్యవహరించి స్వర్గం visit చేయిస్తుంది.



స్వర్గంలో అడుగుపెట్టిన ధర్మరాజుకు ధుర్యోధనుడు నవ్వుతూ ఎదురొచ్చి కౌగిలించుకుంటే, మిగతా కౌరవులుకూడా ఆనందడోలికల్లో మునిగితేలుతూ కనబడతారు. వారిని చూసి ధర్మరాజు సంతోషించినా, తన కళ్ళు మాత్రం సహజంగా తన తమ్ములను వెదుకుతాయి. తమ్ముళ్ళ ముఖాలు స్వర్గంలో ఎక్కడా కనబడకపోయేసరికీ, ఉండబట్ట లేక వివరమడుగుతాడు ధర్మరాజు. ఈ ప్రశ్నకు ‘ధర్మం’ తాపీగా, "వాళ్ళు నరకంలో ఉన్నారుగా, వెళ్ళికలుద్దాం పద" అని ధర్మరాజుని వెళ్ళదీస్తాడు. "నా తమ్ముళ్ళు నరకంలో ఉండటం ఏమిటి?" అని మధనపడుతూ ధర్మనందనుడు నరకానికి ప్రయాణమవుతాడు.



నరకంలో నరకయాతనలనుభవిస్తున్న తమ్ములను చూసి వ్యాకులత చెందిన ధర్మరాజు ఆక్రోశంతో ధర్మాన్ని "ఇదేమి న్యాయం" అని నిలదీస్తాడు. "ఎప్పుడూ మంచికోసం పోరాడిన నా ధీరవీరులైన తమ్ములకు నరకమూ, అన్యాయం పక్షాన నిలిచి పోరాడిన కౌరవులకు స్వర్గమా?" అంటూ ఆవేదన చెందుతాడు. అప్పుడు ‘ధర్మం’ చిన్నగా నవ్వుతూ,"ధర్మనందనా! నీవు ధర్మరక్షణా దీక్షితుడవైయుండీ ‘అశ్వద్ధామా హత: కుంజరహ’ అని అబద్దమాడటం మూలంగా ఈ నరక దర్శనం చేయ్యాల్సొచ్చింది. ఇక మీ తమ్ములంటావా, వారు ధర్మం పక్షాన నిలబడిపోరాడినా, స్వార్థం, బంధుప్రీతి, కుయుక్తిని ఎప్పుడూ వారు వీడలేదు. అందుకే కొంతకాలం నరకవాసం తప్పదు" అని చెబుతాడు.



అదివిని ధర్మరాజు, "అంతా బాగుందికానీ, అన్యాయంగా కౌరవులకుమాత్రం స్వర్గసుఖాలెలా వచ్చాయ్? ముఖ్యంగా అంత అధర్ముడైన ధుర్యోధనుడు నరకానికి రాకుండా స్వర్గ సుఖాలెందుకనుభవిస్తున్నాడు?" అని తన అక్కసు వెళ్ళగక్కుతాడు. దానికి ధర్మం నర్మగర్భంగా నవ్వి, "నీకు తెలియని ధర్మమా, ధర్మనందనా! కౌరవులు తాము నమ్మినదాన్ని అక్షరాలా ఆచరించారు. వారి తలపులలోగానీ నడతలోగానీ ఇసుమంతైననూ తేడాలేదు. రాజ్యాన్నీ, అధికారాన్నీ,ధనాన్నీ మనస్ఫూర్తిగా ప్రేమించారు. తమ శత్రువులను అంతే నిష్టగా ద్వేషించారు. రెండునాల్కల ధోరణి, కపటం, కుత్సితం ఏనాడూ ఎరుగరు. అంతటి సాధకులకు స్వర్గంకాక నరకం ప్రాప్తిస్తుందని ఎలా అనుకున్నావ్?" అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చుట్టూఉన్న ‘మాయ’ విడిపడి జ్ఞానోదయం కలిగి స్వర్గానికి అర్హత సంపాదించుకుంటాడు.



అదే ‘ధర్మం’ చెప్పిన రహస్యాన్ని మన భాషలో చెప్పాలంటే, కౌరవులు తమ వెధవతనంలో చూపిన సిన్సియారిటీ మూలంగా స్వర్గానికొచ్చిపడ్డారన్నమాట. అప్పట్నుండీ స్వర్గాన్ని ఆశించి కాదుగానీ, నేను నమ్మింది మాత్రం ఆచరించడం మొదలెట్టేసాను. దాన్ని సమాజాన్ని రక్షించేవాళ్ళు "తప్పు" అని ఆడిపోసుకున్నా, మతగ్రంధాలూ, వేదాలూ అంటూ ఊదరగొట్టి ప్రజలు భయపెట్టాలనిచూసినా నాకుమట్టుకూ ‘వెధవతనమైనా నేను తర్కించి నమ్మిందే నిజమైపోయింది’.



నిజానికి, వెధవతనాన్ని సిన్సియర్గా ఆచరించేవాళ్ళు వివిధ రంగాలలో సక్సెస్ అందుకోవడంకూడా గమనించానండోయ్. ఉదాహరణకి, రాజకీయాలలో లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లను తీసుకోండి. ఎంత సిన్సియర్ వెధవలు వీరూ! నిజ్జంగా కాంగ్రెస్, బీజేపీలకు వీరి వెధవతనంలో ఉన్నంత సిన్సియారిటీ ఉందంటారా? లాలూ వచ్చి, రైల్వేని ఉద్ధరిస్తున్నానని పచ్చి అబద్ధం చెప్పినా నవ్వే అతని కళ్ళూ, తుళ్ళే తన శరీరం అతని వెధవతనాన్ని ఎంచక్కా బహిర్గతం చేసేసి "వీడింతే" అని మనం అనుకునేలా చెయ్యవూ! ఇక ములాయం సింగ్ అసలు అబద్దం చెప్పడం మీరు చూసారా? అమర సింగ్ ఎప్పుడూ అతని తరఫున చెప్పడానికి తయారుగా ఉన్నా, అప్పుడప్పుడూ ములాయం మాట్లాడితే, "వీడెంత వెధవో తెలుస్తూనే ఉంది" అని మనం అనుకోమా...! వీరి ముఖ్య ఉద్దేశం డబ్బు, పదవులూ వాటికోసం ఏమైనా చేస్తారు. అంతేకాక కాంగ్రెస్, బీజేపీ లలాగా ఆదర్శాలు వల్లెవేస్తూ అంత రెండునాల్కలూ, కుత్సితాలూ, డ్రామాలూ ఆడరుగనక ఖచ్చితంగా స్వర్గ ప్రాప్తి తప్పదని నా నమ్మకం.



ఇక మన సినిమాలలో ఈ సిన్సియారిటీ ఇద్దరికే ఉంది. ఒకరు రాంగోపాల్ వర్మ, రెండోది ఎస్.ఎస్. రాజమౌళి. "నాకు ఆటైంలో ‘కిక్’ ఇచ్చిన సబ్జెక్టి సినిమాగా తీస్తా, నాకు ప్రేక్షకులతో, సినిమాల వల్ల వచ్చే లాభాలతో సంబంధం లేదు", అని విర్రవీగి, తన వెధవతనాన్ని పబ్లిగ్గా బయటపెట్టుకునే సిన్సియారిటీ మన వర్మ సొత్తు. ఇంత దమ్మున్న దర్శకుడు అసలు భారతదేశంలో ఉన్నారా అనిపిస్తుంది. తన సినిమాని తిట్టు, బాంబెట్టి పేల్చేయ్ తను మాత్రం విజయవంతంగా తన వెధవతనాన్ని బయటపెడుతూ ఇంకో సినిమాతో తయారౌతాడు. ముఖం పగిలేలా ‘హిట్’ ఇచ్చినా ఇస్తాడుకూడా!



ఇక రాజమౌళి సిన్సియారిటీది మరో ఎత్తు. సింహాద్రి, సై, ఛత్ర్రపతి, మొన్నమొన్నొచ్చిన ‘యమదొంగ’ లాంటి నేలబారు, చెత్త సబ్జెక్టులని సైతం తను తీర్చిదిద్దిన సిన్సియారిటీ చూసికదండీ మన ఆంధ్ర ప్రేక్షకుడు నీరాజనాలు పడుతోంది. తను తీసేది పక్కా కమర్షియల్ సినిమా అని తనకు తెలుసు. అయినా మనస్ఫూర్తిగా దానికి హంగులద్దుతాడు. కథ నేలవిడిచి సాము చేసేదైనా, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు కథతోపాటూ ఆనందంగా ‘తేలిపోయేలా’ సినిమా తీసే ఇతని నిబద్ధత ధూర్యోధనుడికి తీసిపోదుకదా! మిగతా దర్శకుల్లాగా అటోకాలూ ఇటోకాలూ వెయ్యకుండా సిన్సియర్గా తాను నమ్మిన సినిమాని పచ్చిపచ్చిగా తీసే సిన్సియారిటీ ఉందిగనకనే సక్సెస్ వస్తోంది.



మొత్తానికి చెప్పొచ్చేదేమిటంటే, చేసేది వెధవ పనైనా సిన్సియర్గా చేస్తే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చేప్పేవి శ్రీరంగనీతులూ, దూరేవి .... గుడిసెలూ అన్నట్లు తయారయితేమాత్రం, ముఖం పగలడం ఖాయం, నరకానికి బార్లా గేటు తెరిచిమరీ ఆహ్వానింపబడటం తధ్యం. నమ్మింది సిన్సియర్గా చేసేయ్ సోదరా! వెధవతనంలో సిన్సియారిటీ చూపరా వీరుడా!!



****

Sunday, August 17, 2008

ఈ కాశ్మీరం నాకొద్దు !

పంద్రాగస్టు వేడుకల మధ్యన ఒక న్యూస్ ఛానల్లో కాశ్మీర్ లోజరుగుతున్న అమర్నాథ్ భూవివాదం గురించి చూపిస్తుంటే, ఆ విజువల్స్ నేపధ్యంలో ఎక్కడో ఒక పాకిస్తాన్ జెండా కనబడింది. ఒక్క క్షణం నాకు పిచ్చికోపమొచ్చింది. కానీ మరొక్క క్షణంలో, "ఏమిటి మనకీ ఖర్మ" అనిపించింది. ఈ ఒక్క ఘటనకాదు 1990 లనుంచీ అక్కడ ఏర్పడిన(నా కర్థమైన) పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుంటే, "మనకు నిజంగా ఇంత జంఝాటం అవసరమా?" అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.




ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్న సమస్య అక్కడి ప్రభుత్వ చేతగానితనం, భారతప్రభుత్వ అలసత్వం, సంఘ్ పరివార్ రాజకీయ ఎత్తుగడే అయినా, అదక్కడ ఆగక ఒక అంతర్జాతీయ సమస్య రూపంలో మళ్ళీ కాశ్మీర్ ను నిలిపింది. ఇక ఈ అవకాశంకొసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కాకపోతే, ఈ సంఘటను ఒక సాధారణ ఘటనగా పరిగణించక, దీన్ని అవకాశంగా చేసుకుని మన కాశ్మీర్ stratagey ని పునర్నిర్వచించడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అది భారతదేశ భవిష్యత్తుకు చాలా కీలకం కూడా.




ఇలాంటి వేర్పాటువాద భావనలతో మనం ప్రజాస్వామికంగా ఇదివరకూ ‘డీల్’ చేసాముకూడా. కానీ కాశ్మీర్ రోజురోజుకీ ఇంకా సమస్యాత్మకంగా పరిగణిస్తోందేతప్ప సమస్య అంతమవటం లేదు. నాగాలాండ్, అస్సాం, మిజోరాం లాంటి రాష్ట్రాలు ఇదివరకూ విడిపడాలనే ప్రయత్నం చేసినా "సామ,దాన,భేధ, దండోపాయాలు" ఉపయోగించి విజయవంతంగా ఆ ఉద్యమాలను అంతం చేసాం. పంజాబ్ రాష్ట్రం కూడా ఖలిస్తాన్ కావాలని తీవ్రప్రయత్నం చేసి భారతదేశ విధానాలకు లొంగిపోవాల్సి వచ్చింది.



ఈ అన్ని ఉద్యమాలలో మనం ఉపయోగించిన విధానాన్ని మూడు వ్యూహాల్లో చెప్పాలంటే, 1) నిర్దాక్షిణ్యంగా హింసాత్మక వేర్పాటూవాదుల్ని అణగదొక్కడం. 2) సానుకూలంగాఉన్న వేర్పాటువాదుల్ని రాజకీయప్రక్రియలో భాగం చేసి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం. 3) కేంద్రప్రభుత్వం అత్యధిక ఆర్థిక వనరులు సహాయం చేసి శాంతితోపాటూ ఆర్థికంగా ఆప్రదేశాన్ని పునర్నిర్మించడం. ఈ మూడు విధానాలనూ కాశ్మీర్ లో కూడా ప్రయోగించినా ఫలితం మాత్రం శూన్యం మిగిలింది.



ప్రస్తుతం అక్కడి వేర్పాటువాదులు కోరుతున్న కోరికల్లో అర్థం లేదు. భారతప్రభుత్వం చేస్తున్న పనుల్లో తర్కం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యూహాలు దెబ్బతినడం సహజమేకదా! వేర్పాటువాదులు కాశ్మీర్ కు "అటానమీ" కావాలంటారు. 370 ఆర్టికల్ మూలంగా వాళ్ళకు సిద్దించిందంతా అటానమీనే...మరి ఇంకా ఏంకావాలో నాకైతే అస్సలర్థంకాదు. మన పార్లమెంటు పాస్ చేసిన చట్టాలుకూడా, వారు తమ రాష్ట్రంలో మళ్ళీ అంగీకరిస్తేతప్ప అమలుకావు. ప్రెసిడెంట్ తన అధికారాన్ని కాశ్మీర్ లో ఉపయోగించలేడు. కాశ్మీరీలు భారతీయులేగానీ, భారతీయులు మాత్రం కాశ్మీరీలు కాజాలరు. అక్కడ మనం ఆస్థినికూడా కొనలేంకదా! ఇంతకంటే అటానమీ కావాలా ఎవరికైనా?




ఇక ఆర్థిక సహాయం అంటారా...భారతప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు అందించే తలసరి ఆర్థిక సహాయం 1000- 1500 రూపాయలుకాగా (అదీ చాలా వరకూ అప్పురూపంలో), కాశ్మీర్ లో ఇచ్చేదిమాత్రం దాదాపు 10,000 రూపాయలు. అంటే దాదాపు పదింతలెక్కువ. అదీ ఫ్రీగా. ఇదిపోనూ ఇక ప్రధానమంత్రి నిధి, ప్రత్యేక నిధి అని మరికొన్ని వందలకోట్లు ప్రతి ఏటా మన డబ్బు తీసుకెళ్ళి కాశ్మీర్ లో ‘మండిస్తున్నాం’. ఇక్కడ మనడబ్బు అని ఎందుకంటున్నానంటే, కాశ్మీర్ లో ట్యాక్స్ ద్వారా లేక వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం నగణ్యం.




ఇక మనం కాశ్మీరాన్ని బలవంతంగా మన భూభాగంలో ఉంచుకోవడానికి పెడుతున్న ఖర్చు కొన్ని వేలకోట్లు దాటుతుంది. పార్లమెంట్ దాడి తరువాత జరిగిన "ఆపరేషన్ పరాక్రం" కోసం భారతీయ ఆర్మీ(10 నెలలలొ) పెట్టిన ఖర్చు అక్షరాలా 6,500 కోట్లు...800 మంది సైనికుల ప్రాణాలు.




కాస్త ఎమోషన్ ని పక్కనపెడితే, ఇవన్నీ నిజంగా మనకవసరమా? "మేము భారతదేశంతో ఉండం మొర్రో" అటుంన్నవాళ్ళని బలవంతంగా పట్టి ఉంచడం, కేవలం "కాశ్మీర్ నుంచీ కన్యాకుమారివరకూ మాది ఒకేదేశం" అని చెప్పుకోవడానికి బాగుంటుందనేనా! అందుకే ఒక్కసారి "మీ ఖర్మ" అని కాశ్మీరాన్ని వదిలేస్తే ఎలావుంటుందా అనే ఆలోచన వస్తుంది.




కాశ్మీర్ ఒక ప్రత్యేకమైన దేశం అయితే ఆర్థిక వనరులు లేక క్షీణించి మళ్ళీ మన కాళ్ళ బేరానికి వస్తారు. సమస్య తీరిన తరువాత, భారతదేశాన్ని ఇరుకున పెట్టలేదు గనక అసలే అమెరికా దయాదాక్షిణ్యాలమీద బతుకుతున్న పాకిస్తాన్ పెద్ద సహాయం చెయ్యకపోవచ్చు. ఒకవేళ కాశ్మీర్ వెళ్ళి పాకిస్తాన్లో చేరితే, ఇప్పుడున్న ప్రజాస్వామ్యం, అంతగా కోరుకుంటున్న అటానమీ రెండూ పోయి ‘గతవైభవాన్ని’ తలుచుకుని ఏడవడం తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. ఇంతా జరిగితే భారతదేశానికొచ్చే నష్టం, మనం ఏమోషనల్ గా నమ్ముతున్న "కాశ్మీర్ భారత్ లో ఒక భాగం" (నిజానికి మ్యాప్ లో చూసే కాశ్మీరం కూడా సగమే మనదగ్గరుంది) అన్న అపోహ మాత్రం ఛిన్నాభిన్నమవడం. రాజకీయనాయకుల ఉపన్యాసాలూ, ఉగ్గుపాలతో నేర్పిన దేశభక్తీ కొంచెం గింజుకుని కృశించడం.




తార్కికంగా మనకు జరిగేనష్టం పెద్దగా లేకపోగా, ఇంకా మనకు ఆర్థికంగా, మిలటారీ పరంగా చాలా లాభాలున్నాయి. కానీ మనలో బలంగా నాటుకుపోయిన "భావనలు" అలా చెయ్యనివ్వటం లేదు. దీనికి అంత త్వరగా సమాధానకూడా లేకపోవచ్చు. అయినా J&K లో జమ్మూ, లడాక్ లను తీసేస్తే (అక్కడ ఈ వేర్పాటువాదం లేదు. సాంస్కృతికంగా కూడా వీటికీ కాశ్మీర్ లోయకీ సంభంధం లేదు) కాశ్మీర్ లోయలో ఉన్న జనం మన విజయవాడ జనాభా అంతమంది మాత్రమే ఇక భూభాగం కనీసం గోవా రాష్ట్రమంత కూడా ఉండదేమో...కానీ దానికి మనం చెల్లిస్తున్న మూల్యం...ఇది మనకు నిజంగా అవసరమా?!?



అందుకే ఈ కాశ్మీరం నాకొద్దు...



****

*some of the statistics in above article are taken from 'Vir Sangvi' .

Saturday, August 16, 2008

తీవ్రవాదానికి లాజిక్ దొరికితే?

ఈ మధ్య బెంగుళూరు, అహ్మదాబాదుల్లో జరిగిన బాంబుదాడుల తరువాత ప్రముఖ పత్రికలన్నీ హోరాహోరీగా ఒక వారంపాటూ బాధ్యతగా తమ కలాలు ఘుళిపించి ఇప్పుడు మరో విషయం కోసం తమ కలాలు పదునుపెడుతున్నాయి. మన తెలుగు టివీ ఛానళ్ళు ఆల్రెడీ వర్షం, వరదల వెనక, మోకాళ్ళలోతు నీళ్ళలో నిలబడి మరీ తమ కధనాల్ని వినిపించేస్తున్నాయి. అంటే, ప్రస్తుతానికి తీవ్రదాద దాడుల అధ్యాయం మన జనస్మృతినుండీ మరొక్కసారి పక్కకి తప్పుకున్నదన్నమాట.



ఈ హోరాహోరీలో అక్కడక్కడా పత్రికల్లో చాలా మంచి విశ్లేషణాత్మక వ్యాసాలూ, పరిశీలనలూ చదివాను. వారంతా ఏక కంఠంతో అంగీకరించిన విషయం ఏమిటంటే, "భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న దాడులకు పాకిస్థాన్ ప్రమేయంకన్నా, భారతీయ ముస్లింలలో పెరుగుతున్న అసంతృప్తి,అసహనం, ద్వేషం ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నాయి" అని. నిజమే కావచ్చు. పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చినా, ఈ తీవ్రవాదులు మనవాళ్ళే! బాంబు చెయ్యడం పాకిస్తాన్ నేర్పినా, పెట్టింది భారతీయుడే, పెట్టబడిందీ భారతదేశంలోనే. ఈ నేపధ్యంలో తీవ్రవాదాన్ని ఎలా అరికట్టాలి అనే అత్యవసర ఆలోచనతోపాటూ, alienate అయిపోతున్న ముస్లిం యువతని అర్థంచేసుకుని, సమాధానాలు వెదకడం కూడా ఒక అవసరం అని నా భావన.



ముస్లిం యువత అని నేను చెప్పడానికి ఒక నిర్ధిష్టమైన కారణముంది. ఇప్పటివరకూ పట్టుబడిన తీవ్రవాదులందరూ యువకులే కావడం ఒక కారణమైతే, ఇప్పుడున్న ముస్లిం పెద్దలు, వృద్దులూ,రాజకీయనాయకులూ వీరికి మార్గదర్శకం ఇవ్వలేకపోవడం మరోకారణం. ముస్లిం సముదాయంలోకూడా ఈ "generation gap" తీవ్రంగా ఉండి, ఒకరినొకరు అపనమ్మకంగా చూస్తున్నారా? ఈ కారణంగానే పరిస్థితులు చేయిదాటిపోయాయా? అనేది ఒక సందేహమైతే, మరోటి ముస్లిం రాజకీయ నేతలనుకూడా ఈ ముస్లింయువత తమ శత్రువులుగా చూసి, సమస్యకు వీరూ ఒక కారణం అనుకుంటున్నారా? అనేది మరో అనుమానం.



పై ఆలోచనల నేపధ్యంలో జెనరేషన్ గ్యాప్ ని చూపిస్తూ ఒక ముస్లిం యువకుడూ, ఒక వృద్ధుడి మధ్యన తీవ్రవాదం గురించి ఒక సైద్ధాంతిక సంభాషణ జరిగితే ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాను.



యువకుడు: మీతరంవాళ్ళు ఘోరంగా విఫలమైపోయారు. మతంకోసం, మతంలోని ప్రజలకోసం ఇప్పటివరకూ ఏమీ చెయ్యలేకపోయారు.

వృద్ధుడు: ఏం చెయ్యమంటావ్? ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో డబ్బు, శక్తీ ఉన్నవాళ్ళు తప్ప, అందరూ అన్యాయానికి గురవుతున్నవాళ్ళే. ముస్లింలు అందులో ఒక భాగం మాత్రమే. ఈ కారణాన్ని చూపించి, మాకుమాత్రమే అన్యాయం జరుగుతోందని తిరుగుబాటు చెయ్యమంటావా?

యువకుడు: మీ వాదనలో నాకు చేతకానితనం, నపుంసకత్వం కనబడుతున్నాయి. అసలు ఇస్లాంపట్ల ఉండాల్సిన కనీస నిబద్ధత కొరవడినట్లనిపిస్తోంది. అన్యాయానికి ఎదురొడ్డిపోరాడటం ఒక ముస్లింగా అది మీ బాధ్యత. ఖురాన్ అసలు అన్యాయాన్ని సహించొద్దని చెప్పిందని మీకు తెలియదా?

వృద్ధుడు: నీ మాటల్లో నాకు ప్రతీకారం కనబడుతోందేతప్ప మరోటికాదు. ఈ దారిలో ఆలోచిస్తే మొత్తం ముస్లిం జాతికే నష్టంవాటిల్లుతుంది. ముస్లింలకు నిజంగా నువ్వు న్యాయం చెయ్యాలనుకుంటే వారిని విద్యావంతుల్ని చెయ్యి. అర్థికంగా ఎదగడానికి సహాయపడు. సామాజికంగా ప్రగతి సాధించడానికి చేయూతనివ్వు. శాంతి స్థాపనకు పూనుకో!

యువకుడు: గత 60 సంవత్సరాలుగా శాంతీయుతంగా మీరు ముస్లింలకోసం సాధించిన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన ప్రగతి ఎంత? అంకెలు తీసుకుంటే మన మతానికి ఎక్కడైనా న్యాయం జరిగినట్లు నిరూపించగలవా? మీ పంధానే సరైనదైతే ఇవన్నీ చెయ్యకుండా మిమ్మల్నాపిందెవరు? ముస్లింలను రెండవతరగతి పౌరులుగా తీర్చిదిద్దిందెవరు? అందుకే నేను మార్పును కోరుతున్నాను. దాన్ని మీరు ప్రతీకారమన్నా, హింసాత్మకం అన్నా నా భావనలో మార్పుండదు.

వృద్ధుడు: ఇలా చేస్తే చట్ట వ్యతిరేకం, దేశద్రోహం అవుతుంది.

యువకుడు: ఏ చట్టాన్ని నేను గౌరవించాలి? 1993 అల్లర్లలో రెఢ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హిందు మతవాద నేతల్ని తప్పించి, దానికి ప్రతీకారంగా జరిగిన బాంబ్ బ్లాస్ట్ తరువాత, కేవలం అనుమానం పేరుతో కొన్ని వందలమంది ముస్లిం యువకుల్ని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన ఈ చట్టాన్నా నేను గౌరవించాలి?
గుజరాత్ అల్లర్లలో ముస్లింలను ఊచకోతకోస్తుంటే, పక్కనే నిల్చుని తమాషా చూసిన ఈ చట్టాన్నా నేను గౌరవించాలి?

వృద్ధుడు:అన్యాయం జరిగినమాట వాస్తవం. కానీ, నువ్వు చెప్పిన అన్ని విషయాలపైనా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎంక్వైరీ కమిషన్లు విచారణ చేస్తున్నాయి. అవన్నీ పూర్తయితేగానీ ముస్లింలకు సరైన న్యాయం జరగదు. మనం సహనంతో వాటికోసం ఎదురు చూడాలి.

యువకుడు: అధికారం లేని కమిషన్లూ, అస్థిత్వంలేని వాటి రిపోర్టులూ...! ఇప్పటివరకూ ఏంజరిగింది? కృష్ణ కమిషన్, నానావతి కమిషన్ రిపోర్టులెక్కడున్నాయి? వారు వెలికితీసిన నిజాలూ, తెలియజెప్పిన సాక్షాలూ ఎక్కడున్నాయి? కోర్టులు వాటిని ఎందుకు ఒప్పుకోవడం లేదు. కేసులింకా ఎందుకు సాగదీస్తున్నారు. ప్రభుత్వంలో పార్టీలు మారితే పాలసీలు మారే ఈ దేశంలో, అన్యాయం జరిగినవాళ్ళకి న్యాయం నిజంగా జరుగుతొందా ఎక్కడైనా?

వృద్ధుడు: అందుకని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావా?

యువకుడు: మరి వేరేదారి?

వృద్ధుడు: మనది ప్రజాస్వామ్యం. ఓటుద్వారా నాయకుల్నెన్నుకునే అధికారం మనకున్నంతవరకూ ఆ దారిలోనే మనం మన సమస్యలకు సమాధానం వెతకాలి.

యువకుడు: ఈ హిందూ మతతత్వ రాజకీయ నేతలతోపాటూ, ఈ ముస్లిం రాజకీయ నాయకుల్నికూడా ఒకేసారి మట్టుబెట్టాలి. స్వార్థం నిండిన ఈ నాయకులు ఎక్కడున్నా తమ సంచులు నింపుకుంటున్నారేగానీ,తమ ప్రజలకోసం ఏ పనీ చెయ్యటం లేదు. పైపెచ్చు, ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని తమ పబ్బాలు గడుపుకుంటున్నారంతే!

వృద్ధుడు: మారుతున్న భారతదేశ ఆర్థిక జగత్తులో మన ముస్లింల అభివృద్ధికీ చోటుంది. ఈ తీవ్రవాదం వలన ముస్లింలకు జరిగేది నష్టమేతప్ప లాభమేమీ ఉండదు.

యువకుడు: హైటెక్ భారతీయ సక్సెస్ కథలో ముస్లింపాత్రలెన్ని? ఒక్క ముస్లిం పేరు ఈ అద్వితీయ అభివృద్ధి నాటకంలో కనబడుతోందా? మరి ఇప్పటివరకూ జరగని ఈ చిత్రం హఠాత్తుగా జరిగిపోతుందని నన్ను నమ్మనంటావా? నిజానికి ముస్లింలను ఈ దారిలో భాగస్తుల్ని చెయ్యాలన్న ఆలోచనకూడా ఎవరికీ లేదు. అందుకే కమిషన్లు మనకూ రిజర్వేషన్లు హిందువులకూ కల్పిస్తున్నారు.

వృద్ధుడు: మనదేశంలో మనకు అన్యాయం జరుగుతున్నంత మాత్రానా, శత్రుదేశం సహాయంతో మన దేశంలోనే అల్లర్లు సృష్టించడం దీనికి సమాధానమా?

యువకుడు: ఇది సమాధానం కాదు. కానీ మా సహనాన్ని తెలియజెప్పడానికి ఒక మార్గం మాత్రమే. ఇక పాకిస్తానంటావా... మాకు వారికన్నా, వారికిప్పుడు మా అవసరం చాలా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఈ తీవ్రవాదానికి కారణం అని చెప్పడం మమ్మల్ని అవమానించడమే అవుతుంది. అలా ఒకవేళ భారత ప్రభుత్వం అనుకుంటే, అది వారి మూర్ఖత్వమో లేక నిజమైన సమస్యని అర్థం చేసుకుని తీర్చలేని అసమర్ధతో మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

వృద్ధుడు: ఈ పంధా వలన ముస్లింలకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతుందని నీకనిపించడం లేదా?

యువకుడు: ఒక వేళ తాత్కాలికంగా అన్యాయం జరిగినా, కనీసం ఇప్పటివరకూ ఉన్న మీలాంటివారి దాస్య ప్రవృత్తితొలగి ఒక సగౌరవ ముస్లిం సముదాయం త్వరలో ఏర్పడుతుందని నా ప్రఘాడ నమ్మకం. అన్యాయాన్ని సహించడంకన్నా, కనీసం పోరాడాలనే ఇస్లాం మత సిద్ధాంతం నాకు ఆదర్శం.

వృద్ధుడు: అందుకు హింస వాడాలని ఖురాన్ చెప్పలేదుకదా! మరి మీరు ఇలా వేలమంది ప్రాణాలు తీస్తే అల్లా మిమ్మల్ని క్షమిస్తాడా?

యువకుడు: బలవంతుడు అణచివేస్తే, బలహీనుడు తిరగబడక తప్పదు. మెజారిటీ మతం వారు తలబిరుసుగా ప్రవర్తిస్తే, మైనారిటీ హింసతో సమాధానం చెప్పకతప్పదు. ఇది తప్ప మరో దారిలేదు. మార్పుకు మరో మార్గం ప్రస్తుతపరిస్థితుల్లో మాకు లేదు.


ప్రస్తుత కాలంలో తీవ్రవాదానికి ఉపయోగపడుతున్న ముస్లిం యువతలోని అసహనానికీ, అపనమ్మకానికీ పై సంవాదం ఒక ఉదాహరణ మాత్రమే. మనం చట్టం, న్యాయాల పరిధిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన మార్పులు ముస్లిం సముదాయంలో తీసుకురానంతకాలం ఎక్కడో ఒక దగ్గర కొందరు ముస్లిం యువకులు ఈ దారినెంచుకోవడం మానరు. అలాంటి వారికి తీవ్రవాదానికి అనుకూలంగా లాజిక్ దొరికితే! ఇక మనం క్షణక్షణం భయంతో బ్రతకాల్సిందే. కాబట్టి సమస్యకు అన్ని సమాధానాలూ ఆలోచించాలి. తీవ్రవాదాన్ని అణచడానికి కేవలం భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టం చేస్తే చాలదు. The solution has to be holistic.

****

Saturday, August 9, 2008

మందు ఫిలాసఫీ

అవి కాలేజిలో జీవిత ప్రయోగాలు చేసే రోజులు. మైసూరులో జరిగిన నా కాలేజి జీవితం, అనుభవాల పిటారా అని చెప్పుకోవచ్చు. స్నేహం, ప్రేమ, అభిమానం, ఆదరణ లాంటి అనుభవాలతో పాటూ, తినడం, తాగడంలో కూడా హద్దులు నేర్చుకున్న అపురూపమైన జీవితం అనుభవం అది. ఆ అనుభవసారాల్ని జీవన వేదాలుగా భావించి, బ్రతుకుని మలుచుకున్న నాకూ, నాతోటి చాలా మంది మిత్రులకు ఆ క్షణాలు తలుచుకోవడం, వేయి పుణ్యతీర్థాల దర్శనమంత పవిత్రం. ఆ జ్ఞాపకాల హరివిల్లులోంచీ ఒక అల్లరి అనుభవాన్నీ అందులో నేను నేర్చుకున్న సారాన్నీ ఇక్కడ టపాబద్ధం చెయ్యడానికి ప్రయత్నిస్తాను.



కాలేజీలో చేరిన రెండో సంవత్సరం. అప్పటికీ చుట్టుపక్కలున్న హోటళ్ళూ, బార్లూ కరతలామలకమై, కర్ణాటక చప్పిడి కూడుకు నిరసనగా, కారంకూడు పెట్టే ఆంధ్రా హోటళ్ళూ, కనీసం చిల్లీ చికెనూ, మటల్ మసాలాలు అందించే రెస్టారెంట్లకు వందనగీతాలు పాడేసాం. అప్పటికే ‘బీరుప్రాసనైన’ మందు ప్రయోగాన్ని, మరో మెట్టుకు తీసుకెళ్ళి బీరునుంచీ అసలుసిసలైన బారు బాపతు విస్కీ, బ్రాందీ, రమ్ముల రుచులుగ్రోలే సువర్ణసమయానికి శ్రీకారం చుట్టేసాం. నేనూ, నాతోపాటూ కొందరు మిత్రులకు, నెల పుట్టగానే వచ్చే మనియార్డరు చేతికందిన రోజు, ఈ అందమైన అనుభవాల ప్రయోగాల రోజుగా మారిపోయేది.



అప్పటికే, కొందరు మిత్రులు తమ ఆనందాల అనుభవాల్ని భరించలేక, వాంతులూ, హేంగోవర్ల బాధలుపడిలేచినా, మళ్ళీ ఆ అద్వితీయ ఆనందం కోసం సగర్వంగా ప్రతినెలా తయారయ్యేవాళ్ళు. ఆ నెల, నా మనియార్డర్ ఒక వారం ముందేవచ్చేసింది. ఇంకేం, నామిత్రులు ఊరకుంటారా! ఉదయం 11 గంటలకు డబ్బుచేతికొస్తే, సాయంత్రంవరకూ ఆగలేక, మధ్యాహ్నం క్లాసుందనైనా పట్టించుకోక, లంచ్ కే రెస్టారెంటుకు నన్నెత్తుకెళ్ళిపోయారు. ఎంతైనా బిల్లుకట్టే భాధ్యత ఆ రోజు నాదేకదా!



తీరా అక్కడికెళ్ళాక, "తినడంతోపాటూ, తాగాల్సిందే" అనే తీర్మానం కూడా చేసేసారు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని బీరు ప్రమాణకంగా పాడేసుకుని, బిరియానీతో పాటూ, బీరుపానం కానించి, కాలేజీకొచ్చిపడ్డాం. అప్పుడు గుర్తొచ్చింది, మద్యాహ్నం లంచ్ తరువాత 2 గంటలకు క్లాసు మా ప్రొఫెసర్ రఘునాథ్ దని. అదీ అప్పుడే ఇంగ్లీషు సాహిత్యంలోని రొమాంటిక్ పొయటీ తాటతీస్తున్న మా రఘునాధ్ క్లాసు ఎలా మిస్ చేసేదీ అని తర్జనభర్జనలు పడి, మందు ముఖాలతోనే క్లాసు వైపు నడిచాం.



ఎలాగూ తాగింతర్వాత తిన్నాం, ఆ తరువాత మౌత్ ఫెష్నర్లూ గట్రా నోట్లోనానేసాం కాబట్టి, మన గౌరవాలకొచ్చిన ఢోకాలేదని అల్రెడీ మొదలైపోయిన క్లాసులోకి చల్లగా "మే ఐ కమిన్" అని చెప్పి , ఎంటరైపోయాం. అసలే గండరుగండడైన మా ఫ్రోఫెసర్ మా వాలకాలు, నడకలూ, గుభాళింపులూ చూసి, విషయం పట్టేసాడు. క్లాసులో మాకు క్లాసు పీకలేదుగానీ, మర్యాదగా క్లాసు తర్వాత తన రూములో కలవమన్నాడు.



"నిండా మునిగినోడికి ఇంకా చలేమిటి" అని మనసులో అనుకుని నలుగురం క్లాసుతరువాత, తన క్లాసుకోసం గది గుమ్మం దగ్గర నిలబడి తలుపు సున్నితంగా బాదేసాము. "కమిన్" అని రఘునాధ్ గొంతు ఖంగుమనే సరికీ అప్పటికే గుండేల్లోఉన్న గుబులుకాస్తా, ఎగిరిపోయి ఏకంగా గుండే గొంతులోకొచ్చి కూర్చుంది. ఎదురుగా వరుసతీరి నిల్చున్న మమ్మల్ని ఆసాంతం చూసి, "I have no issues with you guys boozing. But, coming to class is not appreciated" అని ఒక ముక్కలో తన నిరసన విజయవంతంగా తెలిపేసాడు. మేము "సారీ సర్, మీ క్లాసు అస్సలు మిస్ కాకూడదని ఈ సాహసం చేసాం" అని కొంచెం, వెన్నా-జామూ కలిపిన సున్నితత్వాన్ని ఒలికించి, బాధగా ముఖాలుపెట్టి నిలబడ్డాం. తనేమనుకున్నాడో ఏమో, " It's OK. Why don't you guys come down to my place this evening...at 7 O'clock " అని చెప్పి మాకు బయటకు దారి చూపించేసాడు. "ప్రస్తుతానికి లెక్చర్ తప్పిందనుకుంటే, మళ్ళీ ఇంటికి రమ్మంటాడేమిటా" అని ఒక మూలపీకుతున్నా, "ఏమైతేనేం చూద్దాం" అని సాయంత్రం వరకూ ఎదురు చూసాం.



7 గంటలకు ఠంఛనుగా మా క్యాంపస్ పక్కనే ఉన్న రఘునాధ్ ఇంట్లో తేలాం. మాకు ఎదురొచ్చిమరీ, రఘునాధ్ అథిదులకిమల్లే స్వాగతించేసరికీ కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా, "తన రూటే సపరేటు" కాబట్టి కొంచెం తమాయించుకున్నాం. మమ్మల్ని ఆదరంగా సోఫాలో కూర్చోబెట్టి, తన పెళ్ళానికి స్నాక్స్ తయారు చెయ్యమని పురమాయించి, తన దగ్గరున్న స్కాచ్ విస్కీ బాటిలొకటి బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు. అంతే మా పై ప్రాణాలు పైనే పోయాయ్! ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా మా ముందున్న గ్లాసుల్లో పెగ్గులుపోసి, "సోడా నా వాటరా?" అని అడిగేసరికీ మేమీ లోకానికొచ్చిపడి, నానా ఇబ్బందీ పడ్డాం. ఒకడు వద్దంటే, మరొకడు గ్లాసువైపు చూసి లొట్టలేస్తే, మరొకరు బిత్తరచూపులు చూసాం. నాకైతే మైండ్ బ్లాంకై ఏమీతెలీలేదు.



మా ఖంగారు చూసి మందహాసంతో, మా జేమ్స్ బాండ్ (అదే మా ప్రొఫెసర్ నాధ్...రఘునాథ్) "Don't worry boys this is the time to enjoy a drink" అని మాకు నచ్చజెప్పి, తన దగ్గరున్న అతివిలువైన స్కాచ్ వడ్డించాడు. ఒక డ్రింక్ తరువాత కొంచెం బెట్టు సడలిన మేము, "sorry for what happend today sir" అని చల్లగామళ్ళీ మన్నింపు దండకం మొదలెట్టేసరికీ తను నవ్వుతూ, "I can understand your excitement. That's why I have invited you guys to suggest a right time to do the right thing" అని మాకళ్ళు తెరిపించాడు. ఇంతలో మా హరీష్ ఊరికే ఉండక, "మందు మంచిది కాదని అందరూ అంటారుకదా, మీకా వాల్యూడ్జిమెంట్ లేదా?" అని అడిగేసాడు. "Any thing with limits is always good. There is no point in attaching value to a lifeless thing like drink. The 'value' actually comes from the person who consumes it" అని సత్యం పలికాడు.



మేమింకా కాస్త సందేహంగా చూస్తుంటే, తనే కొనసాగించి, "we must always know our limits. Take the drink for an example, if you sit with friends in a beutiful evening with a glass of drink, its great fun. You enjoy it till a point of time, but after a point if you still continue, you reach a stage where you don't know what you are doing. Then whats the point in boozing?" అని మాకు జ్ఞానోదయం కలిగించాడు. నిజమే, మనమేంచేస్తున్నామో మనకే తెలీని స్థితివస్తే, ఆ తాగుడికి అర్థం లేదుకదా? ముఖ్యంగా సొషియల్ డ్రింకింగ్ లో, తాగేది మిత్రులతో కలిసినప్పుడో, లేక కంపెనీ పార్టీల్లోనో అలాంటప్పుడు మనం మన లిమిట్స్ దాటితే అటు వ్యక్తిగా మనకు విలువా ఉండదు, మన ఎంజాయ్ మెంట్ కు అర్థమూ ఉండదు.



ఈ సంఘటన తరువాత మా నలుగురు మిత్రులూ ఎప్పుడూ లిమిట్స్ దాటి తాగెరుగం. ఇప్పటికీ మా జీవితాల్లో అది ఒక ముఖ్యమైన సూత్రంగా మిగిలిపోయింది. "Booz till you enjoy boozing. After a point of time you don't know what you are doing. Then what's the point is boozing?"



****

Friday, August 8, 2008

భయం, అజ్ఞానం, చైతన్యం తో మాటామంతి.

ఈ మధ్య బ్లాగుల్లో మైనారిటీ- మెజారిటీ మతాల ఘర్షణల మీద , సెక్యులరిజం -సూడోసెక్యులరిజం పంధాల మీదా చాలాచాలా ‘హాట్’ చర్చలు జరుగుతూ ఉన్నాయి. "వాటి గురించి స్పందించడంకన్నా, ఊరకుండటం మంచిది" అని నా మిత్రుడు ఒక సలహా ఇచ్చారు కూడా. కానీ, ఎందుకో నా మనసే ఊరుకోక స్పందించేస్తూ ఉంటుంది.



అప్పుడప్పుడూ "ఇంత చదువుకున్నవారై ఉండీ, ఇంత సంస్కారవంతులై ఉండీ ఎందుకీ "అతివాదం" చేస్తూ ఉంటారా?" అని పిస్తుంది. కానీ మళ్ళీ, "వారిదీ ఒక దృక్కోణమే కదా, దాంట్లో తప్పేముందీ" అనిపిస్తుంది. అందుకే, నేను వారితో చేసే ప్రతివాదనలకు ఒక అవసరమైన ప్రాతిపదిక ఉంది అని నిర్ణయించుకున్నాను. వారి దృక్కోణాన్ని వారు కసిగా చెప్పిన తరువాత, మితవాదులందరూ నిశ్శబ్ధంగా ఉండిపోతే, వారు "తాము చెప్పిందే సత్యమనే అపోహలో ఉండిపోరూ!" . అందుకే వారికి ప్రత్యామ్నాయ వాదనలు తెలియాలి. వారు మనతో అంగీకరించకపోయినా, కనీసం చదివేవారు విభిన్నదృక్కోణాల నుంచీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం కలగాలి అనే ఒక చిన్న కోరిక వలన ఈ సాహసం చేసేస్తూఉంటానంతే. ఇప్పట్లో నా పంధా మారదేమో. క్షమించాలి మిత్రమా!



రెండు సంవత్సరాల క్రితం మతఘర్షణల గురించి ఎక్కడో ఒక మంచి సంవాదం చదివాను. Fear, Ignorance and Conscience మధ్య జరిగే సంభాషణలాగా చెప్పబడిన భారతీయ సెక్యులర్ దృక్పధం నాకు తెగ నచ్చింది. ఇప్పుడది పూర్తిగా గుర్తులేదు. కానీ, ఆ సంవాదం యొక్క సారం గుర్తుంది. దాన్నే నాకు గుర్తున్నంతవరకూ ఇక్కడ భయం, అజ్ఞానం, చైతన్యం మధ్య జరిగే సంభాషణలాగా ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.



భయం: ఇప్పటికే చాలా ఆలస్యం చేసాం. అర్జంటుగా పాకిస్థాన్ మీద దాడిచేసి వార్ని అణిచెయ్యాలి.
అజ్ఞానం: నిజమే, ఈ సమస్యలన్నిటికీ పాకిస్థానే కారణం.
భయం: కాశ్మీర్ మనదే, అది మదేకావాలి.
అజ్ఞానం: పాకిస్థాన్ మాటిమాటికీ కాశ్మీర్ ముస్లింలకు మద్దత్తెందుకు ప్రకటిస్తూ ఉంటుంది?
భయం: మైనారిటీలైన ముస్లింలు భారతదేశంలో ప్రశాంతంగా ఉండలేరని వాళ్ళ నమ్మకం అంతే.
అజ్ఞానం:కానీ, మిగతా మైనారిటీలు ప్రశాంతంగానే ఉన్నారుగా?
భయం: నిజమే, ఈ ముస్లింలతోనే ఎప్పుడూ తంటా. ప్రపంచం మొత్తం ఎక్కడ తీవ్రవాదం తలెత్తినా అక్కడ ముస్లింలే కనిపిస్తారు.
చైతన్యం: అంత తేలిగ్గా ఈ పరిణామాల్ని నిర్వచించొచ్చా? గుజరాత్ నే చూడండి. ముస్లింలు 50 మంది హిందువులను సజీవదహనం చేస్తే, హిందువులు కొన్ని వేలమంచి ముస్లింలను చంపడంతోపాటూ, కొన్ని వందల సజీవ దహనాలూ, మానభంగాలూ చెయ్యలేదా! మరి దాని నేమందాం?
అజ్ఞానం & భయం: ఇలా మాట్లాడుతున్నావంటే, నువ్వు ఖచ్చితంగా సెక్యులరిస్టువో లేక సూడోసెక్యులరిస్టువో అన్నమాట!



చైతన్యం:నేను ఎవరన్నది అప్రస్తుతం. నేను చెప్పేది మాత్రం ఎక్కడ హత్య జరిగినా హత్యే, ఎక్కడ అత్యాచారం జరిగినా అత్యాచారమే, ఎక్కడ తీవ్రవాదం తలెత్తినా తీవ్రవాదమని మాత్రమే.
భయం:అన్నీ సమానమెలా అవుతాయి? కాశ్మీర్ లోని ముస్లింలకు దేశ భక్తి లేదు. పాకిస్తాన్ వాళ్ళకు శిక్షణనిచ్చి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది.
చైతన్యం:మరి హిందూ టెర్రరిస్టుల సంగతో! గుజరాత్ లో వారికి శిక్షణఎవరిచ్చారో తెలుసుకోనవసరం లేదా?
అజ్ఞానం:హేయ్! ఒక్క నిమిషం ఆగు. గుజరాత్, కాశ్మీర్ రెండు వేర్వేరు విషయాలు కదా! కాశ్మీర్లో వేరే దేశం జోక్యం ఉంది. గుజరాత్ లో అలాక్కాదు కదా ?
చైతన్యం:అంటే నీ ఉద్దేశం కాశ్మీర్ లో సాధారణ ప్రజలు అనుభవించే టెర్రరిజానికీ, గుజరాత్ లో సాధారణ ప్రజలు అనుభవించిన టెర్రరిజానికీ తేడా ఉందంటావ్?
అజ్ఞానం:సాధారణ ప్రజల అనుభవం విషయంలో తేడా లేదు. కానీ, కాశ్మీర్ భారతదేశ రక్షణకు సంబంధించిన విషయం కదా!
చైతన్యం: టెర్రరిజానికి ‘దేశ రక్షణ’ కొలమానమన్నమాట. టెర్రరిజం లెక్కలో గుజరాత్ లో చంపిన ముస్లింలూ, 1984 లో చంపిన సిక్కులూ రారన్నమాట?.
భయం:అలా అంటే ఎలాగా? 1984లో కూడా మైనారిటీలే ఈ హింస మొదలెట్టారు. వారు హిందూ మెజారిటీ అయిన భారతదేశంలో ‘సరిగ్గా బ్రతకడం నేర్చుకోవాలి’.
చైతన్యం:అంటే నీ ఉద్దేశం మెజారిటీగా ఉన్న హిందువులు శాంతి కాముకులూ, కేవలం మైనారిటీలు బ్రతనేర్వలేక ఇలాంటి గొడవలకి పాల్పడుతున్నారనేగా! మరి హిందువులు వారి మతంలోని మహిళల్ని, కులం పేరుతో కొన్ని కోట్లమంది దళితుల్నీ హింసించడం లేదంటారా?
అజ్ఞానం:దీనికి నేనొప్పుకోలేను. ఎందుకంటే మీరు చెప్పిన సమస్యలన్నీ మైనారిటీలలోనూ ఉన్నవే. కేవలం హిందువులలోనే అంటే అంగీకారాత్మకం కాదు.
భయం:భారతదేశం ఒక హిందూ దేశం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మాది. తరతరాల నుంచీ సంస్కృతిని రక్షించుకుంటూ వచ్చిన జాతి మాది. ముస్లిం, క్రైస్తవం,సిక్కుల వంటి మైనారిటీలతో పోల్చకూడదు.
చైతన్యం:మరి ఇంత ఘన చరిత్ర ఉన్న హిందూ మతానికి ఇంత ఉలుకెందుకు? మతానికి అంత శక్తుంటే నిజంగా ప్రజలు దానికి దూరమవుతారా?
భయం:కానీ..కానీ..ఇక్కడే ఈ ముస్లిం, క్రైస్తవ మత గురువులు రెచ్చిపోతున్నారు.ఏమీ తెలియని సామాన్య జనుల్ని మభ్యపెట్టి వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారు.
చైతన్యం:కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలొ ఉన్న హిందూ మతం తన జనబాహుళ్యంలో తన నమ్మకాల్నీ, విలువల్నీ ప్రతిష్టించలేకపోయిందా? ఇంత మంది హిందూ మతం గొప్పతనాన్ని తెలీని జనాలు ఎలా మిగిలిపోయారు? వేరే మతాన్ని అంత సులువుగా నమ్మే విధంగా ఎలా తయారయ్యారు?



అజ్ఞానం:బహుశా, ఈ మతాలవారు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారనుకుంటా!
భయం:అవునవును! నిజమే అయ్యుండాలి. లేకపోతే ఇంతమంది ఎలా మారిపోతారు?
చైతన్యం:సరే. వారు బలవంతంగానే మతమార్పిడి చేస్తున్నారనుకుందాం. కానీ, అమాయకులైన పౌరుల్ని చంపడం దానికి సమాధానమా?
అజ్ఞానం:అంటే అది తప్పే అయినా తప్పనిసరి పని. అమెరికా ముస్లిం టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఆఫ్ఘనిస్తాన్ లో అమాయకుల్ని చంపక తప్పడం లేదుకదా! ఇదీ అంతే.
చైతన్యం:అంటే దేశ రక్షణ పేరుతోనో, హిందూ ధర్మాన్ని కాపాడే పేరుతోనో మనుషుల్ని చంపితే తప్పులేదన్నమాట?
భయం:నిజమే కదా! ఇలా సమస్యల్ని సృష్టించేవారిని చంపకపోతే, వారు ద్విగుణీకృతమై ఇంకా సమస్యల్ని సృష్టిస్తారు.
చైతన్యం:పెరుగుతున్న మతకల్లోలాల సంస్కృతి చూస్తే ముస్లిం టెర్రరిస్టులతో పాటూ హిందూ టెర్రరిస్టులూ ద్విగుణీకృతమైనట్లున్నరే?
అజ్ఞానం:అదే మూర్ఖత్వమంటే. హిందువులు టెర్రరిస్టులు కాదు. మాకు ఈ ప్రజాస్వామ్య సెక్యులరిజంలో ఇతర మతాలతో కొన్ని సమస్యలున్నాయంతే. వాటిని టెర్రరిజం అంటే ఎట్లా?
చైతన్యం:అంటే గుజరాత్ లో ముస్లింలనూ, అంతకు మునుపు సిక్కులనూ చంపింది హిందూ టెర్రరిస్టులు కాదన్నమాట!
భయం:నువ్వు మళ్ళీ మొదటికొచ్చావ్! నీకు హిందూ మత నమ్మకాలగురించీ దాని గొప్పతనం గురించీ అస్సలు తెలీదు. నువ్వసలు హిందువువే కావు.


చైతన్యం:నిజమే! నేను తర్కమున్న మనిషిగా ఎదిగి, మానవత్వాన్ని పెంపొందించుకునే దారిలో జ్ఞానం నేర్పని నా హిందూ మతంలోని కరుడుకట్టిన మతతత్వాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు సహనాన్ని పాటించమంటే, సెక్యులరిస్ట్ గా ముద్రవేయబడుతున్నాను. హిందూ మతం పేరుతో జరిగే మారణహోమాన్ని నిరసిస్తే, సూడోసెక్యులరిస్టుగా పిలవబడుతున్నాను.మైనారిటీల సమస్యను అర్థం చేసుకుని వాటికి సమాధానం వెతుకుదాం అంటే, పక్షపాతిగా నిరసించబడుతున్నాను. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే ఎటువంటి టెర్రరిజాన్నైనా ఖండిస్తానంటే, నాటకాలాడుతున్నానంటారు. ఏది ఏమైనా నేనొక చైతన్యాన్ని, మార్పుని ఆశిస్తాను. ప్రశాంతతనీ, శాంతిని కాంక్షిస్తాను. అదే నా అస్థిత్వం.

****

The picture is taken from: http://cache.daylife.com/imageserve/0bV4gOlgII6Tx/340x.jpg

Thursday, August 7, 2008

ఉద్యోగం మారిందంతే!

మాంచి ఆఫరొస్తే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి బైబై చెప్పి...కొత్త ఉద్యోగాన్ని దర్జాగా గుండెలకదుముకోమూ? ‘శూద్రులే’ అయినా, ఆ చతుర్వర్ణాన్నొదిలి కమ్మలూ,కాపులూ, రెడ్లూ కూసింత సామాజిక గౌరవం పెంచుకోవడం కోసం ఎంచక్కా ఒకమెట్టెక్కి ‘క్షత్రియులని’ చెప్పుకోలేదూ! "బీ.సీ. లైతేమాత్రం మాకేం ఒరిగింది", జనాభాప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచమని అధికారమున్న కులాలుకూడా హాయిగా డింమాండ్ చెయ్యట్లేదూ? "బ్రాహ్మణులైతే మా తాతలకొరిగిందేతప్ప, మేము మాత్రం పేదరికంలో మగ్గుతున్నాం" అని ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ లాభాలలో వాటాలివ్వండి అని ద్విజులడగటం లేదూ? ఇదంతా మనకు ఓకే...కానీ క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేస్తే మాత్రం పొడుచుకొస్తుంది. ఎందుకో?



ఇప్పుడే ‘దేవర అనంతం’ అనే బ్లాగులో ‘మనదేశానికి పట్టిన క్యాన్సర్ - క్రైస్తవ మిషనరీలు’ అనే వ్యాసం చదివొస్తున్నాను. దేవరగారి బాధంతా, ఆర్థిక లాభాలుచూపి హిందువుల్ని క్రైస్తవులు మతమార్పిడి చేస్తున్నారని. అంత బాధ నిజంగా ఎందుకో నాకైతే అర్థం కాని విషయం. డాలర్లొస్తే మాతృదేశాన్ని వదిలేసి అమెరికా చెక్కేస్తే అది "ప్రొగ్రెస్". కనీస గౌరవం , బతకడానికి కావలసిన ఆర్థిక అవసరాలకోసం only by mistake గాపుట్టేసిన మతాన్నొదిలేస్తే అది దారుణమా ? వారెంచుకున్న ఉదాహరణలుకూడా పాపం పేదబడుగు వర్గానికో లేక కాయకష్టం చేసుకునికూడా ఐదువేళ్ళూ నోట్లోపెట్టుకోలేని బెస్తవాళ్ళ సంగతి. వారికి మతం కన్నా జీవనం ముఖ్యం కాదంటారా? మనం మాత్రం డబ్బుకోసం దేశాలూ,ఉద్యోగాలూ మారొచ్చు, వారు మతం మారితే అన్యాయమైపోయిందా? ఎందుకీ double standards?



ఇంకో ఆరోపణ క్రైస్తవులు మొదట ‘సేవ’ అని తరువాత ‘మతం’ అని మెల్లగా సామ్రాజ్యవాదం వైపుకి తీసుకెళ్తాట. ఛట్! నిజమా! నా కళ్ళిప్పుడే తెరుచుకున్నాయి. మనదేశం సామ్రాజ్యవాద మార్కెట్ గా మారి దాదాపు 20 సంవత్సరాలు సగర్వంగా అవ్వొస్తుంటే ఇప్పుడు కొత్తగా క్రైస్తవులు మనల్ని మార్చడమేమిటి? దీని కేమైనా అర్థముందా, అపోహకాకుంటేనూ! సామ్రాజ్యవాద మార్కెట్ వలన తక్కువ ధరకే వచ్చే వాల్ మౌంటెడ్ DTH TV కావాలిగానీ, అదే వాదాన్ని బూచిగా చూపి మతమార్పిడిని నిరసిస్తే ఎట్లా? అయినా, విధ్య వైద్య రంగాలలో ఇప్పటికీ దాదాపు 30% సంస్థలు క్రైస్తవులు నడపటం లేదా. మనలో ఎంతమంది మొంటెసరీనో, కాన్వెంటో, సెయింట్ జాన్సనో, సెయింటానులోనొ జబ్బలు చరుచుకుంటూ చదివి, "ఇంగ్లీషు మాకు బహుబాగా వచ్చు" అని గర్వంతో గగనాలకెగసిన మనమేనా వారి సేవను తప్పుపట్టేది? అంతెందుకు, పరుపుకూడా దిగలేని పేషెంట్ మలాన్నీ, వాంతినీ కడిగే వీరి సేవలోని సిన్సియారిటీనా ప్రశ్నించేది. బస్తీమే సవాల్...! ఎంత మంది తలెత్తుకుని హిందువులమని చెప్పుకునేవారిలో ఉంది ఈ దయ, జాలి, కరుణ, సేవాతత్పరత? పుట్టపర్తి సత్యసాయిబాబా హాస్పెటల్లో ఎంతమంది క్రైస్తవ నర్సులున్నారో తెలుసా? ఎందుకీ పనికిమాలిన మత గర్వం?



ఇంకో ఆరోపణ, మతం మార్పిడిద్వారా వీరు ప్రజల్ని వారి సంస్కృతికి వ్యతిరేకంగా చేసి, చివరికి దేశానికి వ్యతిరేకుల్ని చేస్తారట. ఏ సంస్కృతీ? ఎవరి సంస్కృతి? నాకైతే తెలీదు. ఈ వ్యాసం రాసిన దేవరవారికి కూడా తెలుసని నేననుకోను. గుడికెళితే టెంకాయకొట్టడానికి టికెట్టడిగే ‘నా’ హిందూమతంకన్నా, దేవుడికి క్యాండిల్ వెలిగించాలనే కోరిక తెలిపితేచాలు, క్యాండిల్ కూడా వారే సమకూర్చే సంస్కృతి కలిగిన క్రైస్తవ మతమా సంస్కృతికి వ్యతిరేకం? పూజకో రేటు, దర్శనానికో స్థాయీ కల్పించే సంస్కృతికన్నా, ఒకే గుంపులో ప్రార్థించే ఈ మతమా మన సంస్కృతికి వ్యతిరేకంగా మనవాళ్ళని ప్రేరేపించేది? వ్యతిరేకించాలంటే, వేలకారణాలు రెడీగా ఉన్న మన తూట్ల సంస్కృతిని, వీళ్ళా తుత్తునీయాలు చేసేది? మతమౌఢ్యంతో మత్తెక్కిన మన మతవాదులే చాలరూ, ఈ ఘనకార్యానికి! ఇంకొకళ్ళెందుకు?



మతమార్పిడంటే నావరకూ, just a job change అంతే! ప్రస్తుతం పనిచేసే చోట మన శ్రమకూ, అస్తిత్వానికీ విలువలేకపోతే, వేరే చోట మంచి బతుకు వెతుక్కోవడమే మతమార్పిడి. దానికి వ్యతిరేకంగా ఎవరూ గుండెలు బాదుకోనవసరం లేదు. అమెరికా వెళ్ళి డాలర్లకోసం పాటుబడే మిత్రుడికి ఎంతగౌరవమిస్తామో, మతం మారిన హిందువుకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. రెంటిలోనూ పెద్ద తేడా లేదు. ఎందుకంటే, డాలర్ నోటు మీదకూడా "IN GOD WE TRUST" అని ఉంటుంది.

****

Wednesday, August 6, 2008

మా నాయన నేర్పిన మతం

పుట్టుకతో హిందువునే అయినా, ప్రతి సంవత్సరం తిరుపతి కొండెక్కి, తలనీలాలు సమర్పించిన చిరాకుతో బహుశా నా తొమ్మిదవ తరగతిలో అనుకుంటాను మతమంటే విసుకొచ్చేసింది. అర్థంకాని పూజలూ, పూజయ్యేంతవరకూ పస్తులూ, తాళ్ళు కట్టుకోవడాలూ, బొట్లుపెట్టుకోవడాలూ అంటే ‘టీనేజ్ రెబెలియన్’ కలిగిన కాలమది. ఐతే మాత్రం పండగలన్నా,పిండివంటలన్నా, గుంపులు లేని గుళ్ళన్నా, తియ్యటి కొబ్బరిముక్కన్నా ఇప్పటికీ ఆరాధిస్తాను ఆస్వాదిస్తాను. కాకపోతే, దేవుడికీ నాకూ మాత్రం చుక్కెదురే. "If God exists, that's his business" అనుకునే మనస్త్వత్వం నాది.



చిన్నప్పటినుంచీ కాస్త తర్కం మరిగిన బుర్ర మనది. అదెక్కడినుంచీ వచ్చిందో నాకే తెలీదు. బాల్యంలో చదివిన బాలమిత్ర, చందమామ కథలనుంచో లేక కాస్త బాల్యానికి బైబై చెప్పేరోజుల్లో చదివిన డిటెక్టివ్ పుస్తకాల మహిమో తెలీదుగానీ, నచ్చని విషయాన్ని తర్కించి తోలుతీస్తేగానీ ఒప్పుకునేవాడ్ని కాదు. ఈనా తర్కానికి మా అమ్మ చిరాకుపడి తలపై ఒకటంటిస్తే, ‘మా నాయన’ మాత్రం ఓపిగ్గా జవాబివ్వడానికి ప్రయత్నించేవారు. ఇక మా అన్నయ్య చాలా సిన్సియర్ గా చెప్పినవి ఫాలో అవ్వడమేతప్ప ప్రశ్నించి ఎరుగడు. ఈ విషయంలోతను ‘రాముడు మంచి బాలుడు’ కంటే సిన్సియరన్నమాట. ఇక మా చెల్లెలు గారాలపట్టికాబట్టి, కన్సెషన్లన్నీ తనకే. ఉపవాసం రోజుకూడా, "పాపం చిన్నపిల్ల" అని ప్రత్యేకంగా పులిహోర తినిపించి మరీ తన చేత ఉపవాసం చేయించేవారు. మనకే ఇక్కడ ఆకలితో నకనకలు, అనవసరపు అనుమానాలూ, తర్కాలూనూ...



ఇలా నా తార్కిక ప్రశలు సందించి మా నాయన దగ్గర సమాధానం రాబట్టే ప్రయత్నంలో, నాకు తెలీకుండా ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. మతమంటే ఒక తార్కిక దృక్కోణం ఏర్పడింది. అదేలాగో చెబుదామని ఈ టపా కడుతున్నాను.




నాకు ఊహతెలిసిన తరువాత మతం గురింఛి నేనడిగిన ప్రశ్న దేవుడున్నాడా? అని. ఆ ముక్క అడగ్గానే ఎప్పుడోఒకప్పుడు నేనడుగుతాననే సందేహం మానాయనకు ముందే కలిగినట్లు నవ్వి, "దేవుడున్నాడో లేదో నాకు తెలీదు. ఉంటే మంచిదేగదా?" అన్నారు. "నిజమే కదా !" అనిపించింది. "దేవుడంటే శివుడో విష్ణువో కాదు. అదొక శక్తి అంతే. జీవితానికి అన్వయించి చెప్పాలంటే అదొక ‘నమ్మకం’. మనిషికి తనకన్నా పెద్ద శక్తొకటి తనను కాపాడుకొనుందనే నమ్మకం చాలా అవసరం. అదే దేవుడంటే. ఇప్పుడు చెప్పు, ఉంటే మంచిదా, కాదా?" అన్నారు. ఇక నిజంగా నా దగ్గర ఆ విషయం గురించి అడగడానికేమీ మిగల్లేదు. దేవుడు అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నకాదు. తన వ్యక్తిత్వం మీద, క్షమత మీద ఆధారపడే మనిషికి దేవుడు అవసరం లేదు. తమను తాము కాపాడుకునే సత్తా ఉన్నప్పుడు, ఎదో శక్తి కాపాడుతుందనే ‘నమ్మకం’ యొక్క అవసరం లేదు. ఆక్షణంలో నేను దేవుడ్ని త్యజించాను. కొందరు సరదాగా అంటారు కదా, "I was an atheist till I realized I was GOD" అని. ఆ తర్వాత నేనూ అలాగే ఫీలయ్యాను. Yes, I am God.



నేనడిగిన రెండో ముఖ్యమైన ప్రశ్న, పూజలూ పునస్కారాలు అవసరమా? అని. దానికి మా నాయన చెప్పిన సమాధానంతొ నాకు పుజచెయ్యాలనే బూజు ఈ జీవితకాలానికి వదిలిపొయింది. ఆయనంటారు "దేవుడు నమ్మకమైతే, పూజాపునస్కారాలు ఆ నమ్మకాన్ని మళ్ళీమళ్ళీ పెంపొందించుకొవటానికి చేసే సాధన. ఒక practice. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేస్తారు. ప్రసాదాలూ, పళ్ళూఫలాలూకూడా అంతే! దేవుడే సృష్టింఛిన ఈ చక్కెర పొంగలీ, పులిహోరా, దద్దోజనం ఆయనకే అర్పించి మనమేదో ఘనకార్యం చేసేసామనుకుంటే ఎలాగా? ఇక మంత్రతంత్రాలంటావా...అవి అర్థం కాకపోతే వాటికీ సినిమా పాటలకీ పెద్ద తేడా లేదు. అర్థంచేసుకుంటే వాటిల్లో భగవంతుణ్ణి పొగిడేవో లేక ఆయన ప్రసాదించిన జీవితాన్ని అమూల్యమనేవే ఉంటాయితప్ప, మాయలూ మంత్రాలతో దేవుడ్ని ప్రత్యక్ష్యం చేసేవికావు" అని. అంతే, ఆ తరువాత నేను పూజకోసం కడుపు మాడ్చుకోవడం, మంత్రాలకు అర్థం తెలీకుండా తలఊపడం మానేసాను. వీలైతే పూజారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. తను అర్థం చెప్పకపోతే పక్కకి తప్పుకుంటాను. నాకు తెలిసిన కాస్తోకూస్తో సంస్కృతంతో కొన్ని మంత్రాలకు అర్థంతీసే ప్రయత్నం చేసానుకూడా. చాలా వరకూ మంత్రాలు దేవుడి గుణగణాలూ, బంధుత్వాలూ లేక ఆయన సౌదర్యాన్నో శక్తినో తెలిజజెప్పేవేతప్ప పనికొచ్చేవి చాలా తక్కువ కనిపించాయి. నా అదృష్టంకొద్దీ నా పెళ్ళి ఆర్యసమాజ్ లో జరగటం వలన పెళ్ళి మంత్రాలకి అర్థాలు చెప్పిమరీ నా పెళ్ళి కానిచ్చారు . అందుకే, "I had most meaningful marriage" అనుకుంటూ ఉంటాను.



తన సమాధానాలు విన్నతరువాత నాకు అసలు మా నాయనకు మతం మీద నమ్మకముందా అనే సందేహం వచ్చింది. ఆమాటా ఒక సారి ఆడిగేసాను. "ఇంత తార్కికంగా మతాన్ని చూసే నువ్వు, అమ్మవెంట గుళ్ళు గోపురాలకెందుకు తిరుగుతావు? మమ్మల్ని ప్రతి సంవత్సరం తిరుపతి ఎందుకు తీసుకెళతావు?" అని. దానికాయన ఆశ్చర్యంగా చూసి "నాకు మతంకన్నా కుటుంబ బంధాలు ముఖ్యం. మీ అమ్మకు దేవుడంటే భక్తి. కాబట్టి, తనకోసం గుళ్ళూగోపురాలు చుడతానేతప్ప, దేవుడి కోసం కాదు. ఇక ప్రతి సంవత్సరం తిరుపతంటావా...అదొక ఫ్యామిలీ ఔటింగ్. ప్రతి శలవుల్లో కుటుంబంతోసహా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి. తిరుపతి దగ్గర, తెలిసిన ఊరు,పెద్ద ఖర్చు లేదు పైపెచ్చు పుణ్యంపురుషార్థం రెండూనూ" అని చెప్పి నవ్వారు. ఉండబట్టలేక అక్కసుగా అదిగేసాను, "మరి గుండో?" అని. దానికాయన, సమ్మర్లో గుండును మించిన సుఖంముందంటావా? దానికి తోడు, ఇలా కత్తెరపడిన తలకు వెంట్రుకలు బాగా మొలుస్తాయని చెబుతారు అంతే!" అని మా గుండు రహస్యాన్ని వెళ్ళడించారు. అప్పటి నుండీ నేను గుండు కొట్టుకుంటే ఒట్టు. కాకపోతే ఈ వివరణవల్ల నేను నేర్చుకున్నవి రెండు విషయాలు. మొదటిది, మనం నమ్మకపోయినా కుటుంబంకోసం కొన్ని పనులుచెయ్యకతప్పదు. భగవంతునికన్నా, మానవసంబంధాలు విలువైనవి. మన తర్కంకన్నా, పెళ్ళాంపిల్లల ప్రేమ గొప్పది. రెండో విషయం, ప్రతి ఆరు నెలలకో లేక సంవత్సరానికో ఒకసారి కుటుంబంతోకలిసి ఒక ఔటింగ్/హాలిడే వెళ్ళడం. ఇవిరెండూ ఇప్పుడు నా జీవితంలో ముఖ్యమైన భాగాలు.



ఇంత జ్ఞానోదయమైనా అప్పుడప్పుడూ కొన్ని చిన్నవీ,చిలిపివీ అయిన ప్రశలు అడుగుతూనే ఉండేవాడిని. ఒక సారి, "దేవుడికి టెంకాయే ఎందుకు కొట్టాలి? అది దేవుడికి ఇష్టమనా లేక ఆయన ఇదే కావాలని కోరాడా?" అని నేనడిగిన ప్రశ్నకు ఆయన, "అన్నింటినీ సృష్టించిన దేవుడు తనకు ఇది కావాలి అని ఎప్పుడూ కోరడు. టెంకాయ మానవుడి అహానికి గుర్తు(బయటనున్న టెంక).దాన్ని పగలగొడితేగానీ లోపలున్న ఆత్మ(మెత్తటి కొబ్బరి) సాక్షాత్కారమవదు. అహాన్ని పగులగొట్టి దేవుడికి మన ఆత్మల్ని అర్పించడమే దీని పరమార్థం" చెపారు. ఇప్పటికీ నేను కొబ్బరికాయ కొట్టాల్సొస్తే గుర్తుచేసుకునేది ‘నా అహం (ego) తగ్గిందా, లేదా?’ అని మాత్రమే.



ఇలా మా నాయన నాకు విశ్వరూపదర్శనమిచ్చి, నా మతాన్ని మలచారు. అందుకు మా నాన్నకి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మూఢాచారాలనుంచీ, అర్థరహిత మంత్రాలనుంచీ, ఉబుసుపోకచేసే పూజాపునస్కారాలనుంచీ విముక్తి ప్రసాదించిన నాతండ్రికి ధన్యుడిని. తార్కికత్వానికి మానవత్వం నేర్పి, మానవసంబంధాల విలువను తెలియజెప్పిన జనకునికి నేను సర్వదా కృతజ్ఞుడిని .



అందుకే ఇప్పుడు, తర్కంలేని విలువా, మానవత్వం లేని మతం నిరర్థకం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను.


****