Thursday, August 25, 2011

వచ్చాడు. కెలికాడు.

నిన్న సినీమ్యాక్స్ లో సినిమా చూడ్డానికి వెళుతుండగా ఒక మీడియా మిత్రుడు ఎదురుపడ్డాడు. ఒక ప్రముఖ దినపత్రికలో సినిమా జర్నలిస్టు. “ఏంటిబాసూ ఇక్కడ” అంటే “వర్మ సినిమాకిలే” అని జవాబిచ్చాను. పెద్ద టాక్ లేదుకదా మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంటూ నా వైపు ఒకసారి చూసి నవ్వేసాడు. నేనూ ఇబ్బందిగా ఎంతైనా వర్మ సినిమాకదా అని కవరింగ్ ఇచ్చాను.

అప్పుడే చుట్టుపక్కల గమనించాను. ఏదో సినిమా స్టాండీలు, వాటిపైన తమిళనటుడు జీవా ఫోటోలు “ఏంటీ రంగం సినిమా విజయోత్సవాలా?!” అనిఅడిగితే దానికి మిత్రుడు నవ్వేసి, “కాదు. రాబోయే సినిమా ప్రమోషన్లు” ఓహో...అంటూ పరికించి చూస్తే ఆ సినిమా టైటిల్ “వచ్చాడు. గెలిచాడు”...
సర్కాస్టిగ్గా నా మిత్రుడివైపు తిరిగి “‘రంగం’తో వచ్చాడు హిట్ కొట్టి గెలిచాడా!”  అన్నాను.

తను నావైపు తమాషాగా చూస్తూ “ఇండస్ట్రీ అంతేకదా బ్రదర్. హిట్ ఉన్నవాడిదే రాజ్యం. వాడు ఏంచేసినా చెల్లుతుంది. ఏం చెప్పినా ఊకొడుతుంది” అని పత్రిక ప్రాస భాషలో అనేశాడు.

 “రంగం సినిమా హిట్ అవడానికి కారణం కథ కదా, మరి అలాంటి కథల్ని వెతుక్కోకుండా ఆ హీరోని పట్టుకుని వేలాడితే మరో హిట్ వస్తుందని ఎందుకనుకుంటారు మనోళ్ళు” అని నేను సాలోచనగా నాలోనేను అనుకుంటే, నా మిత్రుడు సానుభూతిగా నా భుజంతట్టి, “ఇలా అలోచించి బుర్ర పాడుచేసుకోకు. నాకైతే ఈ సినిమా హిట్ అవడానికి జీవాకన్నా ఇంకో నటుడు అజ్మల్ పాత్ర కారణం అనిపిస్తుంది” అని చల్లగా చెప్పాడు.

నిజమే జీవాకు రంగం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నమాట నిజమేకానీ, కథాపరంగా అజ్మల్ చేసిన యువరాజకీయనేత పాత్ర నటనపరంగానూ, సబ్జెక్టుపరంగానూ చాలా ప్రముఖమైన పాత్ర. చివరికొచ్చేసరికీ మొత్తంగా కథను నడిపిన పాత్రగా నిలబడుతుంది.

కాకపోతే సమస్యల్ని తీర్చేవాడే హీరోకాబట్టి చివరాఖరికి జీవానే ఆ సినిమా హీరో. నా ఆలోచన సంగతి ఎలా ఉన్నా అసలే కాన్స్పిరసీ థియరీలు రాసే పత్రికలో గాసిప్స్ రాసే పాత్రికేయుడిగా నా మిత్రుడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకుందామనే క్యూరియాసిటీ కలిగి “అలా ఎందుకనుకుంటున్నావ్?” అని ఒక శరంసంధించాను. కానీ నేను రియలైజ్ కానిది ఎంట్రా అంటే, ఈ మిత్రుడు నా మైండ్ బ్లాంకయ్యే కాన్స్పిరసీ చెబుతాడని.

నా మిత్రుడు చెప్పెనదాని ప్రకారం రంగం సినిమా తెలుగులో హిట్ అవ్వడానికి ముఖ్యకారణం అజ్మల్ పాత్ర్ర. “ఒకసారి జాగ్రత్తగా గమనించు, ఆ పాత్ర తీరు, డ్రస్సింగ్, డయలాగ్స్ అన్నీ మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ని తలిపించడంలేదూ!” అన్నాడు.

ఒక్క క్షణం నాకు పోలిక అర్థం కాలేదు. కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి సినిమా రీలు మైండ్ లో తిరగేస్తే ఒక క్రూషియల్ సీన్ లో “నేనూ స్వార్థపరుడినే, నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే నా కుటుంబం పెద్దది. విశాలమైనది. మీరు, ఈ సమాజం, దేశం అన్నీ దానిలో భాగమే” అంటూ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా ఏదో సభలో (లోక్ సత్తా పార్టీ ఆవిర్భావసభ అనుకుంటా) అన్నాడు. “హమ్మో! నిజమేనేమో” అనుకున్నా.

“అయితే మాత్రం” అంటూ ఏదో బింకం నటించడానికి ప్రయత్నించాను. నా మిత్రుడు సాలోచనగా నన్ను పక్కకు తీసుకెళ్ళి “బాసూ, రంగం సినిమా A సెంటర్లకన్నా B-C సెంటర్లలో బాగా ఆడింది. సినిమా బాగుండటంతో పాటూ ఆంధప్రదేశ్ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది. జయప్రకాష్ నారాయణ్ లాంటి న్యూట్రల్ సిన్సియర్ ఫేస్ ను అడ్డుపెట్టుకును ఈనాడు పేపర్ అటు కాంగ్రెస్ ను తెలుగుదేశం ను ఎలా ఆడుకుందో వాడుకుందో అనేదే అసలు కథ. ప్రజలకు అర్థమయిన కథ. జె.పి.ఎలాగూ అగ్రకులాల రాజకీయాలకు మరో ఫేసు తనబండారమూ ఇలా ఎదో ఒక రోజు బయటపడుతుందని అందరికీ తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. అందుకే అలా కనెక్ట్ అయిపోయారు” అని తన కాన్స్పిరసీ థియరీతో నాకు జ్ఞానోదయం కలిగించాడు.

“ఛా! నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. సినిమా బాగుంది హిట్ అయ్యింది” అని నేను కొంచెం బెదురుగా అంటే, “బ్రదరూ జె,పి. కుల కోఠరీ గురించి, ఈనాడు అతన్ని ఎలా లీడర్ ను చేసింది అనేదాని గురించీ నీకూ తెలుసుకదా?” అని అడిగాడు.

“అదిసరే! కానీ మరీ సినిమా కథకూ దానికీ లింకు కట్టడం నాకైతే పెద్దగా లాజికల్ గా అనిపించడం లేదు” అని తేల్చేశాను. నా మిత్రుడు కొంచెం కోపంగా “ఇదేనయ్యా మీలాంటి సీరియస్ ఫిల్మ్ క్రిటిక్స్ తో వచ్చే తంటా, ‘తెలుగుతనం లేదు కాబట్టే శక్తి, తీన్ మార్, బద్రీనాథ్ ఫెయిలయ్యాయి’ అంటారు. ఇదిగో ఈ తెలుగు రాజకీయాల్ని చూపించింది కాబట్టే రంగం సినిమా హిట్ అయ్యింది అంటే మాత్రం ఒప్పుకోవడానికి కష్టం అంటారు. ఎలాగయ్యా మీతో చేసేది” అనేశాడు.

“మరీ బోడి గుండుకీ మోకాలికీ ముడిపెట్టడం...” అంటూనేను నసుగుతుండగానే ఎవరో ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతోందనే సరికీ ఫ్రీబీస్, స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ కవర్ల కోసం మావోడులగెత్తాడు కవరేజ్ అనుకుంటూ. నేను మాత్రం చేతిలో రాంగోపాల్ వర్మ ‘నాట్ ఎలవ్ స్టోరీ’ సినిమా టికెట్లు పట్టుకుని పిచ్చిచూపులు చూస్తూ “వచ్చాడు గెలిచాడు” పోస్టర్ చూస్తుంటే పోస్టర్ మసకబారి “వచ్చాడు. కెలికాడు” లా కనిపించింది.  

****

6 comments:

ఆ.సౌమ్య said...

హమ్మ నాయనో...కనీవినీ ఎరుగని కాన్స్పిరసీ ఇది...టూ మచ్...నాకు నవ్వలో, మీలా వెర్రి చూపులు చూడాలో కూడా తెలియట్లేదు.

Anonymous said...

వామ్మో మీ ఫ్రెండ్ ఎవరో గానీ చాలా లోతుగా ఆలో 'చించాడు '. అదే నిజం కావచ్చు. కానీ నా మటుకు నాకు(నేనూ ప్రేక్షకుణ్ణే కనుక) సినిమాలో బిగి నచ్చింది క్లైమాక్స్ లో ఊహించని మలుపు..దానికి తిరువళ్లువర్ సూక్తి కోట్ చెయ్యడం నన్ను గుక్కతిప్పుకోనివ్వలేదు.

Anonymous said...

కులకోఠారి వారి గురించి కాన్స్ పిరసి థియరీలు అవసరమా! వారి సంగతి అందరికి తెలిసిన విషయమే కదా! కొన్ని సంవత్సరాల క్రితం బాబుగారు, పచ్చ పేపర్ వారు జే పి గారికి ఇచ్చే ప్రాధాన్యత నచ్చక పచ్చ పేపర్ యజమాని వారి వద్ద తన అసంత్రుప్తిని వెళ్లగక్కారని,పచ్చ పేపర్ వారు నీ పని అయిపోయింది మేము(మీడీయా) ఇంకొకరిని ప్రమోట్ చేసి ప్రజలకిపనులు చేసి పెట్టేవారిని (alternative) చూపించాలి కదా! అందువలన జేపి గారి ని ప్రమోట్ చేయవలసిన అవసరం ప్రజాస్వామ్యం లో ఫోర్త్ ఎస్టేట్ పైన ఎంతో వుంది అని చెప్పి పంపారని, నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు పత్రికలో చాలా సంవత్సరాల క్రితం రాశారు. ఈ సదరు జమీన్ రైతు వారు కూడా ఆ పచ్చ వర్గం వారిదే. కాని మిగతా పచ్చ పేపర్లతో పోలిస్తే వీరు ఎంతో ఉత్తములు.
-----------------------------------కొంత కాల క్రితం మీరు దళితులకు పచ్చ వర్గ మోడల్ అవసరమా అని రాశారు? అదొక పెద్ద ఫైల్యుర్ మోడల్, కారణం ఇన్ని రోజులు తెర వెనుక రాజకీయాలు పచ్చవర్గం వారు చేసినట్టు, బహుశా మిగతా ఏ వర్గం వారు చేసి వుండరేమో! సామాన్య పౌరులు వారి రాజకీయాల గురించి మాట్లాడి వుంటే పిచ్చోళ్లని, కాన్స్ పిరసి థియరీల ని ముద్ర వేసి తొక్కిపడేసి వుండేవారు. కాని ఇప్పుడు యువనేత వలన అందరికి తెలిసాయి. అంతనికి వున్న బలం వలన ఎమీ చేయలేక పేపర్ నిండా పిచ్చి రాతలు రాసుకొని విలువను కోల్పోయారు. ఇక మీడీయా ప్రభావాన్ని. ఇక రాజకీయాలకు వస్తే మీడీయా ప్రభావాన్ని అతిగా నమ్మిన బాబుగారు కోలుకోలేని దెబ్బతిన్నారు. వీరిని వీరి వర్గ ప్రజలే నమ్మరు, వోటు వేయరు. వీరు ఎక్కువగా వుండే కృష్ణా,గుంటూరు, గోదావరి జిల్లాలలో పచ్చ పార్టి ఫర్ఫార్మేన్స్ ఘోరం గా దిగజారింది. వచ్చె ఎన్నికలలో ఈ పార్టికి ఎదురు దెబ్బ తగిలితే బాబు గారి మనం ముద్దుగా ఆంధ్రా అజిత్ సింగ్ అని పిలవ వచ్చు. ఇన్ని రోజులు కుల కోఠారి తో లాభాలను మాత్రం చవి చూసిన వారికి , రానున్న రోజులలో ఆ కోఠారి వలన నష్ట్టాలను కూడా చవిచూస్తారు. వారు అధికారం లో కి రావటం చాలా కష్ట్టం. ఈ మోడల్ చరిత్రలో కొన్ని దశాబ్దాలలో నే విఫలం చెందింది.ఇక పచ్చ వర్గం వారు తమదగ్గర ఉన్న డబ్బులతో కాలేజిలు, సినేమా, హాస్పిటల్, హోటల్, పోగాకు మొద||వ్యాపారాలు చేసుకొంట్టు ఆధునిక వైశ్యులుగా అవతరించ బోతున్నారు.

Raamu

Mauli said...

మీరు వ్రాసిన టపా ఏ౦టి, కులాల చెత్త వ్యాఖ్యలు ఏ౦టి ?? బ్లాగుల్లో ఇలా ప్రోత్సహి౦చవద్దని మనవి .

డబ్బి౦గ్ డైలాగ్ వ్రాసేవారు రాజకీయ మాటల రచయితో, జే .పి గారి ఉపన్యాసాలు గమని౦చిన వారో అయ్యు౦డొచ్చు ఆ ఒక్క స్టేట్మె౦ట్ కవర్ అయ్యి౦దేమొ :)

ప్రతిచోట సాధారణం గా ఉ౦డే కొత్త పార్టీల గురి౦చే సినిమా. ఆ౦ధ్ర రాజకీయాల్లో కూడా ఒకల్లు౦టారు జే పి కాక పొతే, చిర౦జీవిని పోల్చేవాళ్ళు :)

ఇక హిరో అ౦టారా, మీరు చెప్పిన ఇద్దరు కాక నక్సలైట్స్ కూడా సినిమాకి హీరో అని చెప్పుకోవచ్చు (సరదాగా :) ) .మొత్తానికి మీ వ్యాసం వల్ల ఒక మ౦చి సినిమా చూసాము.

Anonymous said...

నీతులు చెప్పబడును
October 23rd, 2011

ఇంటర్‌నెట్‌లో వెతికైనా సరే ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా మాట్లాడే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమాలాల్సి వచ్చింది. ఆయన నడిచే కంప్యూటర్..చిన్నపాటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం ఏమిటనిపించడం సహజమే. జెపి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు డివిజన్‌కు ఉప ఎన్నికలు జరిగితే జెపి మాత్రం అభ్యర్థిని నిలపలేదు? ఈ మధ్య ఆయన తమిళనాడు, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న అంశాన్ని వివరించారు. గతంలో పిజెఆర్ మృతితో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరిగితే పిజెఆర్ కుమారుడు పోటీ చేశాడు. మేం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అందుకే ఖైరతాబాద్ నుండి పోటీ చేస్తున్నాం అని జెపి ప్రకటించారు. మరి కూకట్‌పల్లి సంగతేమిటంటే, మా స్థానిక నాయకులు పోటీ వద్దన్నారు, నేను ఇంతకు మించి చెప్పను అన్నారు. అసలు విషయం ఏమంటే లోక్‌సత్తా జెపి ఓటర్లు, టిడిపి ఓటర్లు ఒకే వర్గం వారు. ఇద్దరు పోటీ చేస్తే సామాజిక వర్గానికే నష్టం అందుకే ఆయన పోటీ పెట్టలేదు. మరి సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు కావాలి అని నినదించే జెపి ఇలా చేయడం ఏమిటబ్బా అని

http://www.andhrabhoomi.net/sub-feature/mirchmasala-436

Anonymous said...

నీతులు చెప్పబడును
October 23rd, 2011

ఇంటర్‌నెట్‌లో వెతికైనా సరే ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా మాట్లాడే లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమాలాల్సి వచ్చింది. ఆయన నడిచే కంప్యూటర్..చిన్నపాటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం ఏమిటనిపించడం సహజమే. జెపి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు డివిజన్‌కు ఉప ఎన్నికలు జరిగితే జెపి మాత్రం అభ్యర్థిని నిలపలేదు? ఈ మధ్య ఆయన తమిళనాడు, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న అంశాన్ని వివరించారు. గతంలో పిజెఆర్ మృతితో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరిగితే పిజెఆర్ కుమారుడు పోటీ చేశాడు. మేం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అందుకే ఖైరతాబాద్ నుండి పోటీ చేస్తున్నాం అని జెపి ప్రకటించారు. మరి కూకట్‌పల్లి సంగతేమిటంటే, మా స్థానిక నాయకులు పోటీ వద్దన్నారు, నేను ఇంతకు మించి చెప్పను అన్నారు. అసలు విషయం ఏమంటే లోక్‌సత్తా జెపి ఓటర్లు, టిడిపి ఓటర్లు ఒకే వర్గం వారు. ఇద్దరు పోటీ చేస్తే సామాజిక వర్గానికే నష్టం అందుకే ఆయన పోటీ పెట్టలేదు. మరి సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన రాజకీయాలు కావాలి అని నినదించే జెపి ఇలా చేయడం ఏమిటబ్బా అని

http://www.andhrabhoomi.net/sub-feature/mirchmasala-436