Friday, September 4, 2009

సమర్థతా, రాజకీయమా?

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణంతో రాజకీయ శూన్యం ఏర్పడింది. బహుశా ఈ స్థాయి శూన్యత రాష్ట్రరాజకీయాలలో మొట్టమొదటిసారి.


ఆపద్ధర్మంగా రోశయ్యను ముఖ్యమంత్రిని చేసినా, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రెండోరోజే "తరువాత ఎవరు?" అనే ప్రశ్న తలెత్తడం ఆ ఉచ్చస్థాయి శూన్యత పట్ల నెలకొన్న అందోళనకు చిహ్నమేతప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పార్టీని ఒక్కమాటతో శాసించే నాయకుడు. అధిష్ట్రానంతో నిక్కచ్చిగా వ్యవహరించగలిగిన ఈ స్థాయి జననాయకుడు ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో లేరనే చెప్పాలి. మరి ఇలాంటి నాయకుడికి ప్రత్యామ్నాయం ఎవరు అనేది పెద్ద ప్రశ్న.

ఇప్పటికే కొందరు బ్లాగరలు ‘అనుభవం...సమర్ద్థతా’ అంటూ రాజకీయంలో అప్రస్తుతమైన పదాల్ని పదేపదే అంటున్నారు. నిజంగా రాజకీయ సమర్ద్థత అనేది ఒక బ్రహ్మపదార్థం. అనుభవం అవకాశం వస్తేగానీ రాదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో "రాజకీయ జరుగుబాటుతనం" అత్యంత ముఖ్యం. అనుభవం సమర్ద్థతా secondary.

D.శ్రీనివాస్, పురంధరేశ్వరి,జానారెడ్డి, జైపాల్ రెడ్డి ఎవరికి పట్టంగట్టినా కాంగ్రెస్ లో ఫ్యాక్షన్ గొడవలు తప్పవు. నిరసనస్వరాలు తప్పవు. అలా జరిగితే ఇప్పటిదాకా బలహీనమవుతున్న ప్రతిపక్షాలకు ఊతం దొరికినట్లే. కాబట్టి, వై.ఎస్. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే కనీసం మరో రెండు సంవత్సరాల వరకూ అటు స్వపక్షం ఇటు విపక్షానికి నోరెత్తే చాన్స్ ఉండదు

సానుభూతి రాజకియాలు,ఆనువంశిక రాజకీయాలు కాంగ్రెస్ కు కొత్త కాదు. అవి బ్రహ్మాండంగా పనికొస్తాయనడానికి బోలెడు ఆధారాలున్నాయి. పనిచెయ్యవని చెప్పడానికి మనదగ్గర ఆధారాలు లేవు. అలాంటప్పుడు ఎందుకీ మిడిల్ క్లాస్ స్లోగన్లైన ‘అనుభవం-సమర్థతా’ జపాలు!


కడప నుంచీ MP గా అత్యధిక మెజారిటీతో గెలిచిన వై.ఎస్.జగన్ కు మాస్ బేస్ లేదనే సాహసం ఎవరూ చెయ్యలేరు. అనుభవం లేదందామా….అంటే కావలసింది పరిపాలనా అనుభవమా, రాజకీయ అవసరమా అనే ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది.

ఇప్పటికే 118 మంది MLA లు (పార్టీ చీఫ్ విప్ భట్టివిక్రమార్కతో సహా) మద్దత్తు ప్రకటిస్తూ అధిష్టానానికి లేఖలు సమర్పించారు. రాష్ట్ర క్యాబినెట్ ఒక రెజొల్యూషన్ పాస్ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది జె.సి.దివాకర్ రెడ్డి, జానారెడ్డి,మర్రి శశిధర్ లు మాత్రమే. వీళ్ళని వై.ఎస్. వ్యతిరేకవర్గంగా తేలిగ్గా తీసెయ్యొచ్చు. రాజకీయంగా కూడా వీరి ప్రాధాన్యత తగ్గింది.


రాష్ట్రం సంగతి ఎవరికీ ఎప్పుడూ పట్టలేదుకాబట్టి, రాజకీయపరంగా చూస్తే వై.ఎస్.జగన్ ను ముఖ్యమంత్రిని చెయ్యడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు క్షేమకరం. ఎలాగూ ఐదు సంవత్సరాల కాలం ఉందికాబట్టి పరిపాలనా అనుభవం,సమర్థతా ఆ సమయంలో వచ్చేస్తాయని ఆశించడంతప్ప మనం చెయ్యగలిగేది పెద్దగా ఏమీ ఉండదు.

****

13 comments:

Vinay Chakravarthi.Gogineni said...

gud analysis.........asalu purandreswarini evaru guess chesaaru......

mana leaders eppudu antaaru choosara party ki manchi jarugutundi anipiste adi chestam ani......adi vallu eppudu marchiporu manalni marchipoyina

Konatham Dileep said...

ఇప్పుడు జగన్ పేరు ఇంత హడావిడిగా ముందుకు రావడం వెనుక వైయెస్ వల్ల బాగా లాభపడ్డ ఒక మూక ఉంది. వైయెస్ జగన్ వస్తేనే తమ దందా నిరాటంకంగా నడుస్తుందనే వారి ప్రయాస. రానున్న రోజుల్లో మనం ఇంకెన్నో వికృత రాజకీయ విన్యాసాలు చూడవలసి రావొచ్చు.

కొణతం దిలీప్

Kathi Mahesh Kumar said...

@కొణతం దిలీప్: చాలా సూటైన భవిష్యత్ దర్శనం చేశారు.

రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా తెచ్చిన సీట్లతోపాటూ రోజూవారిగా ఇచ్చే "నోట్లు" కూడా అధిష్టానానికి అత్యంత ప్రియం. ఆ దందా తెలిసిన వై.ఎస్.జగన్ "నాయకత్వాన్ని" కాదని ఎవరు మాత్రం పక్కదారి పట్టగలరు?

గీతాచార్య said...

It's not the question of who will become the CM. Unless and until Jagan acts a SONIA GANDHI, he will become the CM, as is obvious from the time of the death news.

What u said here is true. Hmm.

శ్రీనివాస్ పప్పు said...

మనదేశానికి రాజరికానికీ ప్రజస్వామ్యానికీ పెద్ద తేడా లేదు.ఏ స్వామ్యం వచ్చినా మనకున్న పెద్ద అలవాటే కదా ఈ వంశపారంపర్యపు సంస్కృతి,అప్పుడు రాష్ట్రానికి మాత్రం తప్పేదేముంది.తప్పేదీ లేదు,తప్పు ఏదీ లేదు.ఎవరొచ్చినా ఒకటే ఎడమచెయి తీసి పుర్ర చెయి పెట్టడమే అంతే తేడా...

Valluri Sudhakar said...

" అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో "రాజకీయ జరుగుబాటుతనం" అత్యంత ముఖ్యం. అనుభవం సమర్ద్థతా secondary." సరిగ్గా చెప్పారు. అంతేగాదు, రాజకీయవారసులకి/అనునయలకి ఉపాదికల్పన కూడా.

పునర్వసు said...

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిని కోల్పోయింది. ఇది బాధాకరం. సాటి వ్యక్తి దుర్మరణం పాలవటం ఎవరికైనా బాధ కలిగించేదే.
ఆయన చేసిన పనుల వలన లాభం పొందిన వారు ఆయనను పొగడడం, ఇబ్బంది పడిన వారు అయన పోయినందుకు ఆనందిమ్చడం సహజమే. చనిపోయిన వారి గురించి చెడ్డగా మాట్లాడడం వలన ప్రయోజనం లేదు.

మహేష్ గారు చెప్పినట్లుగా వై.ఎస్.ఆర్ పోవడం కాంగ్రెస్ కు పెద్ద లోటు. మరి ఆంధ్రప్రదేశ్ కు లోటా?
వ్యక్తిగత లబ్ది గురించి కాకుండా, ఆంధ్రప్రదేశ్ అబివృద్ది కావాలనుకునే కోరుకునే వారిగా నిజాయితీగా ఆలోచించండి.
వై.ఎస్.ఆర్ (లాంటి వ్యక్తి) తిరిగి కాలనుకున్తున్నారా?

srinivasrjy said...

బాగా చెప్పారు..
ఈరోజు శ్రద్దంజలి ఘతిస్తున్న సోనియానూ, రాహుల్ ని చూసారా?? అస్సలు విశ్వాసం గానీ, స్పందన గానీ లేదు వెధవలకి...
మొక్కుబడి ఎలాగో కానిచ్చేసి డిల్లీకి వెళ్ళిపోయారు....

ఇక ఈ రాష్ట్రానికి ఆదేవుదే దిక్కు ...!!!
కాంగ్రేస్ పతనం ప్రారంభమైంది...

నందకం said...

>>> అలాంటప్పుడు ఎందుకీ మిడిల్ క్లాస్ స్లోగన్లైన ‘అనుభవం-సమర్థతా’ జపాలు!<<<

మరి ఎందుకని రాహుల్ ని కాకుండా మన్‌మోహన్ ని ప్రధాని చేశారు?? ఐదేళ్ళల్లో కూడా రాహుల్కి ఎక్స్పీరియెన్స్ రాలేదనా!

Kathi Mahesh Kumar said...

@నందకం: రాహుల్ గాంధీకి అనుభవం-సమర్ధతా కావాలని ఎవరు అడిగారు? రాహుల్ ప్రస్తుతం ప్రధాని అవ్వడానికి సుముఖత చూపలేదు. అంతే. అంటే, అవ్వాలా- వద్దా అనే choice తను exercise చేసినట్లేతప్ప,మరొకటి కాదు. అవి సంపాదించుకుందామని తను వెనకడుగు వెయ్యటం కూడా తన "ఇష్టం" మీద ఆధారపడుందని గమనించండి.

మన్మోహన్ రాహుల్ కోసం పరిపాలనా వేదికని ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ పార్టీ మీద పట్టు సాధిస్తున్నాడు. ఇదొక బృహత్తరమైన వ్యూహం.అవకాశం ఉందికాబట్టి తీరిగ్గా గీస్తున్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. కానీ ప్రస్తుతం మన రాష్ట్రపరిస్థితి అలాంటిది కాదుకదా!

సుజాత వేల్పూరి said...

రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా ఏమీ నేర్చుకోలేడని గట్టిగా చెప్పవచ్చు! జగన్ కి కూడా అనుభవం లేదు గానీ రాహుల్ కంటే నయమే! అదీ కాక రాజశేఖర్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ పార్టీలో లేరు కాబట్టి, వారసత్వం అనుకోకుండా జగన్ కే పగ్గాలిస్తారు. తప్పదనుకుంటా. డమ్మీలెంతమంది ఉన్నా లాభం లేదు. జగన్ వచ్చినా కుమ్ములాటలు తప్పవు, ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తూ సమర్థుడై ఉంటే తప్ప!

Praveen Rangineni said...

కాస్త జగన్ విషాదం నుండి తేరుకొని నోరుమెదిపితె అప్పుదు తెలుస్తుంది..తను నా వల్ల కాదు అంటే...మన భావి ముఖ్య మంత్రి ని నిర్ణయించడం "అధిష్టానానికి" కష్టమే!

Vinay Chakravarthi.Gogineni said...

@sujatha

రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా ఏమీ నేర్చుకోలేడని గట్టిగా చెప్పవచ్చు! జగన్ కి కూడా అనుభవం లేదు గానీ రాహుల్ కంటే నయమే!

how can u say that..what u know abt those......