Wednesday, April 8, 2009

ద్రవిడ ఉద్యమం - ఒక ధృక్కోణం


"సమగ్ర భారతదేశానిదీ ఓకే ఒక సాంస్కృతిక చరిత్ర. అది అత్యంత ప్రాచినమైనదీ, ఘనమైనదీ,విస్తృతమైనదీ మరియూ మిక్కిలి నాగరికమైనది." అని ఎరైనా చెబితే, మనం వెంఠనే తలకాయలూపేసి పొర్లుదండాలు పెట్టేస్తాం. కానీ నిజంగా మనది "ఒక" సాంస్కృతిక చరిత్రేనా, అని ప్రశ్నించుకోము.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ, ‘భిన్నత్వంలో ఏకత్వం అదే భారతీయతత్వం’ అనే నానుడిని వ్యాప్తిచేసి భారతీయతత్వాన్ని సృష్టించే నేపధ్యంలో, భిన్నత్వాలలోని విభిన్నత్వాన్ని కొంచెంకొంచెం త్యజించేలా చెయ్యడం జరిగింది. "Nation building" లో భాగంగా, దేశభక్తిని కలిగించే దిశగా జరిగిన ఈ ప్రయత్నంలో మన నాయకుల మేధావుల నిబద్ధతే మనకు కనిపిస్తుంది. కానీ, వారు ఎంచుకున్నది సరైన నమూనానేనా అనేది ఇప్పుడు అత్యంత ప్రశ్నార్ధకంగా తయారయ్యింది. "రాజకీయ ఏకత్వ భావన రావాలంటే సాంస్కృతిక భిన్నత్వం బలహీనమవ్వాలా?" అనేది ఎప్పటి నుండో కొందరు లేవనెత్తిన ప్రశ్న. ప్రస్తుతం స్థానిక విజ్ఞానం,స్థానిక జాతుల చరిత్ర, స్థానిక సంస్కృతులకు లభిస్తున్న గుర్తింపు దృష్ట్యా ఆ ప్రశ్నలూ,వ్యతిరేకతలూ చాలా సహేతుకం అనిపించక మానదు.


ఈ నేపధ్యంలో ద్రవిడ ఉద్యమాన్ని మనం పరికిస్తే,అదొక స్థానిక సంస్కృతి పరిరక్షణ ఉద్యమం అనిపిస్తుంది. కానీ అది సంతరించుకున్న విస్తృత రాజకీయ,సామాజిక రంగు మరియూ ప్రభావాన్ని ప్రసరించిన రంగాల దృష్ట్యా ఇదొక జాతిఉద్యమాన్ని తలపిస్తుంది.

మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన ఆర్య-ద్రవిడ సిద్ధాంతం జాతుల సిద్ధాంతం కాదు,కేవలం భాషా సిద్ధాంతం అనే ప్రాతిపదిక మీద, ఆధునిక భారతీయభాషా శాస్త్ర పండితుడు రాబర్ట్ కాడ్వెల్ (Robert Caldwell) ఈ పదాన్ని వాడాడు. ఎనిమిదవ శతాబ్ధంలో ఒక సంస్కృత పండితుడు వాడిన "ఆంధ్రద్రావిడ భాషలు" అన్న పదం ఆధారంగా కాడ్వెల్ వింద్య పర్వతాలను మీరి వున్న దక్షిణాపధంలో వాడే భాషలైన తమిళ,తెలుగు,కన్నడ,మళయాళ భాషలను "ద్రవిడ భాష"లన్నాడు. ఉత్తరభారతదేశంలో లభ్యమైన గ్రంధాలు ద్రవిడ భాషల్ని ప్రాకృత భాషలుగా లేక రాక్షసభాషలుగా వ్యవహరించారు. దీని ఆధారంగా కొందరు బ్రాహ్మణ మేధావులు, దక్షిణాపధం ఆదినుండీ అనాగరిక సంస్కృతి అనీ, వలస వచ్చిన ఆర్యుల కారణంగా నాగరికత సంతరించుకొన్నది అనే సిద్ధాంతాల్ని ప్రతిపాదించారు. దక్షిణ భారతదేశంలో "తెల్లగా" ఉండేవాళ్ళు సాధారణంగా బ్రాహ్మణులే అవడమూ, సంస్కృత భాష వీరికే తెలిసుండటంతో, ఈ సిద్ధాంతం ఆధారంగా ఆర్యులు = బ్రాహ్మణులు అన్న నమ్మకం బలపడింది.

తమ ఉన్నతికోసం తమని తాము ఆర్యులుగా, దక్షిణాదివారిని "రాక్షసులు"గా చిత్రీకరించిన బ్రాహ్మణ మేధావుల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణేతర మేధావులు తమ సిద్ధాంతాలతో ముందుకొచ్చారు.పాండ్యుల కాలం నాటి సంగం సాహిత్యం ఆధారంగా ఆర్యులు వచ్చారని చెబుతున్న కాలంకంటే ముందే ద్రవిడదేశం అత్యంత నాగరిక శోభలతో వర్ధిల్లిందని నిరూపించారు. బ్రాహ్మణ-బ్రాహ్మణేతర కులాల సమరం ఇంతటితో ఆరంభం.

ఈ ఆరోపణల,ప్రతిపాదనల నేపధ్యంలో ఈ అగ్నికి ఆజ్యం పోసిన విషయం, బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల ఆధిపత్యం. 20వశతాబ్ధం నాటికి మద్రాసు ప్రెసిడెంసీ లోని అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు బ్రాహ్మణుల పరమయ్యాయి. ఉదాహరణకు 1855 లో 305 ఉద్యోగాల్లో 237 వీరివే. అదీ డెప్యూటీ కలెక్టర్లూ, సబ్ జడ్జులు, జిల్లా మున్సిఫ్ లవంటి కీలక హోదాల్లో వీరు రాజ్యమేలారు. మరీ ముఖ్యంగా ఉన్నతవిద్యా బోధనాలయాలైన యూనివర్సిటీల్లో వీరిదే సింహభాగం. అంటే జనాభాలో కనీసం 5% కూడా లేని బ్రాహ్మణులు సామాజాన్ని నిర్దేశించి,ఆధిపత్యం చలాయించే స్థితిలో ఉన్నారు.కొంత ఇంగ్లషు చదువులు చదువుకుని, ఎదుగుదలని ఆశిస్తున్న బ్రాహ్మణేతరులు, అడ్డుగా ఉన్న బ్రాహ్మణుల పట్ల నిరసనభావాన్ని పెంచుకున్నారు.

ఈ పరిస్థితుల్లో 'The Madras Non-Brahmin Association' 1909లో స్థాపించబడింది. రాజకీయాలకు అతీతంగా ఒక సామాజిక సంస్థగా ఇది ఉద్భవించినా,కొన్నాళ్ళకే దీని పేరును ‘The Madras Dravidian Association' మారుస్తూ నిర్ణయం జరిగింది. ఈ కాలంలో ఈ ప్రయత్నాన్ని అభినిందించిన వాళ్లకంటే, "బ్రాహ్మణ వ్యతిరేక సంఘంగా" నిరసించినవారే ఎక్కువ. ఇందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రాంతపు బ్రాహ్మణేతరులు ఎక్కువగా ఉండటం గమనార్హం. అప్పటికే ఉన్న రెడ్డి సంఘాలూ,వెలమసంఘాలూ, బలిజ సంఘాల ఉపయోగంతో పోలిస్తే ఈ సంఘం యొక్క ప్రయోజకత్వం ప్రశ్నార్థకమని వీరి వాదన.

ఈ వాదోపవాదాల మధ్యన మద్రాసు ద్రవిడ సంఘం 1916 వరకూ పెద్దస్థాయి కార్యక్రమాలేవీ చెయ్యలేదు. మధ్యలో కొందరు అసంతృప్తి చెందిన సభ్యులు వేరుపడి "Madras United League" పేరుతో మరో సంఘాన్ని పెట్టుకున్నారు. 1916 లో మద్రాసులో కులవివక్ష కారణంగా అద్దె ఇళ్ళు దొరకక అవస్థ పడుతున్న విద్యార్థులకోసం మద్రాసు ద్రవిడ సంఘం ఒక హాస్టల్ ను నిర్వహించడం మొదలుపెట్టింది. ఈ సమయంలో ఈ ద్రవిడ assertion యొక్క రాజకీయ ప్రాముఖ్యతను గ్రహించిన పి.త్యాగరాయ చెట్టి మరియూ డాక్టర్ టి.ఎం.నాయర్ ఈ సంఘంలో చేరారు. ఆసమయంలోనే బ్రాహ్మణుల పార్టీగా భావింపబడుతున్న కాంగ్రెస్ హోం రూల్ ఉద్యమాన్ని ఆరంభించింది.

బ్రాహ్మణ నాయకత్వంలోని కాంగ్రెస్ కు మద్దతుగా నడుస్తున్న పత్రిక(హిందూ,స్వదేశమిత్రన్)లకు వ్యతిరేకంగా The South Indian People's Association పేరుతో ఆంగ్లంలో జస్టిస్ -ది మద్రాస్ మెయిల్ (ఫిబ్రవరి26,1917) ,తమిళంలో తిరవితన్ (జూన్,1917) మరియూ తెలుగుకోసం అప్పటికే ప్రచురణలో ఉన్న ఆంధ్రప్రకాశిక ను కొనుగోలు చేసి వీరికి అనుకూలంగా ప్రచురించడం మొదలుపెట్టారు. హోంరూల్ వచ్చినా బ్రాహ్మణాధిక్యత కలిగిన హోంమ్ రూల్ లో బ్రాహ్మణేతరులకు అన్యాయమే జరుగుందన్న వాదన ఆధారంగా, ప్రతి కులానికి సరైన ప్రాతినిధ్యం కావాలన్న డిమాండ్ చేస్తూ ద్రవిడ ఉద్యమం ముందుకు సాగింది.

బ్రాహ్మణేతరుల రాజకీయ ఆశయాల సాధనకై జస్టిస్ పార్టీ ఏర్పడింది. మింటో మార్లే సంస్కరణలు,Government of India Act of 1919 ల ఆధారంగా మద్రాసు ప్రెసిడెంసీ లో ముస్లిమేతర,బ్రాహ్మణేతర వ్యక్తికి రాజకీయ రిజర్వేషన్ కల్పించబడింది. ఇది దళితజాతీయ భావనకు కలిగిన గొప్ప విజయంగా చెప్పొచ్చు. ఈ దెబ్బకి కాంగ్రెస్ లో కూడా ద్రవిడ ఉద్యమం గురించి లుకలులు బయల్దేరాయి. ఈ విధంగా దళిత ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంగా మొదలై, సామాజిక-రాజకీయ ఉద్యమంగా ఎదిగింది.

అప్పటివరకూ మద్రాసు ప్రెసిడెంసీలో ఉన్న తెలుగువారు ఎంతో కొంత ఈ ఉద్యమాన్ని సమర్ధించినా, సంస్కృతాభిమానులైన తెలుగు వారు, సంస్కృతం వైపు మొగ్గుచూపారే గానీ ద్రవిడ మార్కుని ధరించడానికి వెనుకంజ వేసారు. అంతేకాక, ఆంధ్రప్రాంతంలో బ్రాహ్మణ-బ్రాహ్మణేతరుల మధ్య తీవ్రస్థాయిలో లేని వైషమ్యాలూ, కాంగ్రెస్ పార్టీ పట్ల గల రాజకీయ నిబద్ధతా, ఈ ఉద్యమాన్ని తెలుగు భాష మాట్లాడే ప్రదేశాలవరకూ పాకకుండా చేశాయి. అప్పటినుండీ ద్రవిడ ఉద్యమం, తమిళనాట సామాజిక-రాజకీయ ప్రక్రియలో మాత్రమే భాగంగా మిగిలింది.

ద్రవిడ ఉద్యమం ఒక సాంస్కృతిక ఉద్యమంగా మొదలై ఒక జాతిఉద్యమంగా మిగిలింది. ఒకప్పుడు ద్రవిడ జాతి ఎలా ఉండేది అనే చారిత్రాత్మక అపోహలతో, సిద్ధాంతాలతో మొదలై, చరిత్రతో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక సామాజిక-రాజకీయ-సంస్కృతిక identity గా ఎదిగింది. ఈ పరిస్థితుల్లో, "చారిత్రక సిద్ధాంతాలు ముఖ్యమా లేక వాటి ఆధారంగా ఏర్పడిన వర్తమానం ముఖ్యమా?" అంటే, వర్తమానాన్ని ఎన్నుకోవడం కోసం చరిత్రను తెలుసుకోవడం తప్ప దాన్ని తిరగరాయడానికి కాదనే సత్యం మనకు తెలిసిరానంత వరకూ విభేధించుకుంటూ ఆనందించాల్సిందే! Choice is ours.


*Caste & the Tamil Nation,The Origin of the Non-Brahmin Movement, 1905-1920; by K.Nambi Arooran ఆధారంగా.

13 comments:

One Stop resource for Bahki said...

Good info , I am looking for this

అసంఖ్య said...

మహేష్ గారు: వర్తమానం ఎన్నుకోవడం కోసం చరిత్ర ని అర్ధం చేసుకోవలంటున్నారు. నిజమే? అయితే దళితోద్యమం, ద్రవిడ ఉద్యమాల మీదఅవగాహన ఉన్న మీరు, వర్తమానాన్ని ఏ విధంగా ఎన్నుకుంటరు? ఈ చరిత్ర తెలుసుకోవడం ప్రస్తుతం ఏ విధంగా ఉపయోగం? [జవాబు మీ శైలిలో, ఇదికూడా తెలీదా, నువ్వో మూర్ఖుడివి అన్నా పర్వాలేదు :)]

నా వరకు, ఇలాంటి చరిత్రల మీద నమ్మకం పోయింది. ఎందుకంటే, మనకు లభ్యమయ్యే చరిత్ర, convenience sampling చెయ్యబడిందిగా తోస్తుంది. therefore, we can not make causal inference.

Anonymous said...

చరిత్ర గురించి నేను కొంత తెల్సుకోగలిగాను.. చక్కటి వ్యాసమండి!!!!

Naga said...

>> కానీ నిజంగా మనది "ఒక" సాంస్కృతిక చరిత్రేనా

ఇది ఒక్క వాక్యంతో పూర్తిగా కొట్టివేయడం కానీ ఒప్పుకోవడం కానీ చెయ్యలేం. కానీ, మనది దేశవ్యాప్తంగా ఒకే సాంస్కృతిక చరిత్ర అనడానికి ఆధారాలు చాలానే ఉన్నాయి.

Kathi Mahesh Kumar said...

@ధవళ సోమశేఖర్ - విజయనగరం: వ్యాఖ్యని బట్టి నా సమాధానం ఉంటుంది. నా వాదనని ప్రశ్నిస్తూ తమకు తెలిసిన ప్రతివాదనవైపున్న జ్ఞానాన్ని చెబితే నేనెప్పుడూ గౌరవిస్తాను. కేవలం నా వాదనల్లో కొన్ని పదాలేరుకుని వాటికి అభ్యంతరాలు లేవనెత్తో లేక కేవలం రంధ్రాన్వేషణే ధ్యేయంగా సాగే వ్యాఖ్యాతల్ని నేను మూర్ఖులుగానే పరిగణిస్తాను.

మీ ప్రశ్న సహేతుకమైనదే అయినా నామీద మీ అభిప్రాయాన్ని చూసి కొంత ఆశ్చర్యం కలిగింది.

దళిత-ద్రావిడ ఉద్యమాల్ని అందరూ చూసినట్లే అస్థిత్వ ఉద్యమాలుగా నేను చూస్తాను. భిన్నత్వానికి (పరస్పర)సముచితగౌరవం ఇస్తేనే ఏకత్వానికి బీజాలు పడతాయనే ఆలోచనను అంగీకరిస్తాను.అందుకే ఈ అస్థిత్వ ఉద్యమాలను సహానుభూతితో చూసే చారిత్రక కోణం నాకు ఆమోదయోగ్యం.

వర్తమానంలో జరుగుతున్న సామాజిక న్యాయ పోరాటానికి,రాజకీయ సంకీర్ణ ప్రభుత్వాలకీ ఈ ఉద్యమాలు ఏర్పాటు చేసిన ప్రాతిపదిక చాలా కీలకమైనది. అందుకే వీటిని divisive వాదాలుగా కాకుండా వర్తమానాన్ని అర్థవంతం చేసిన వాదాలుగా నేను అంగీకరిస్తాను.

చరిత్ర ఒక అంగీకారాత్మక ధృక్కోణం. ఇందులో మీ విలువలు,భావజాలం పట్ల నమ్మకంకన్నా నిజాల్ని నిలబెట్టిన ఆధారాలమీద నమ్మకం ఉంచడం మంచిది.

@నాగన్న: దేశవ్యాప్తంగా ఒకే సాంస్కృతిక చరిత్ర ఉండేదయితే మనకిన్ని తిప్పలుండేవి కాదేమో! ఆలోచించండి. India is not one people. India has never been one culture. We are trying to be one. Still making efforts to be one.

Anonymous said...

Can you throw light on దళిత udyamaalu in Andhra? Who, when, where they happend?

Anonymous said...

@@@@@@వ్యాఖ్యని బట్టి నా సమాధానం ఉంటుంది. నా వాదనని ప్రశ్నిస్తూ తమకు తెలిసిన ప్రతివాదనవైపున్న జ్ఞానాన్ని చెబితే నేనెప్పుడూ గౌరవిస్తాను. కేవలం నా వాదనల్లో కొన్ని పదాలేరుకుని వాటికి అభ్యంతరాలు లేవనెత్తో లేక కేవలం రంధ్రాన్వేషణే ధ్యేయంగా సాగే వ్యాఖ్యాతల్ని నేను మూర్ఖులుగానే పరిగణిస్తాను.@@@@@@

Good one !

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: దళిత ఉద్యమాల గురించి లెక్కకు మించిన పుస్తకాలు లభ్యతలో ఉన్నాయి. కొంత నేపధ్యం తెలుసుకోవాలంటే కేశవకుమార్ రచించిన ‘దళిత ఉద్యమం –వెలుగు నీడలు’ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చెయ్యండి.

@a2zdreams: ధన్యవాదాలు.

Anonymous said...

For educational purpose, as a insider of Dalitism,
can you put some light on the close relationship between Dalitisam, Islam and Missionaries.

Naga said...

సంస్కృతి అన్నది వంటలు, బట్టల్లా బయట కొంత వేరుగా ఉండవచ్చు, అవి వాతావరణం మొదలగువాటిపై ఆధారపడినవి. కానీ, నమ్మకాలు, స్వభావపరంగా ఎప్పుడూ భారత దేశం ఒకటే అని చెప్పవచ్చు. దీనికి బ్రిటిషు వాడితో కానీ, స్వాతంత్రంతో కానీ సంబంధం లేదు.

2500 సంవత్సరాల క్రితం బుద్ధుని కాలం నాటి రాతలలో కూడా ఈ విషయాలను స్పష్టంగా గమనించవచ్చు. ఆనాడు కూడా రాజులు రాజ్యాలకు అతీతంగా కాశీ ప్రముఖ పుణ్య క్షేత్రం, హిమాలయాలు ధ్యాన కేంద్రాలు.

హైందవ సంస్కృతి (అని మనం పిలుచుకుంటున్నది) నేటి ఇండియానే కాక చుట్టుపక్కల దేశాలన్నింటిలోను ఉండేది. నేడు ముస్లిం దేశమైన ఇండోనేషియా జాతీయ విమానాశ్రయం పేరు గరుడ అని ఉండడం అంతర్లీనంగా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే!

ఇంటి-ఇంటికీ, ఒకే ఇంటిలోని మనిషి-మనిషికీ విభేధాలు వస్తుంటాయి. రాజకీయాలతో రగులుతున్న రాష్ట్రాల విషయంలో ఏం చెప్పగలం?

Kathi Mahesh Kumar said...

@నాగన్న: అఖండ భారతం, భరతఖండం అంటూ పురాతనకాలంలోనే అనుకున్నారని మనం చెప్పుకోవడమేగానీ అది ఎంత వరకూ నిజం అనేది కొంచెం సందేహాస్పదమే.

మనకు తెల్లోళ్ళందరూ ఒకటే అయినట్లు, అమెరికన్లకు కళ్ళుచిన్నవిగా కనపడిన ప్రతొక్కడినీ "ఏషియన్స్" అనేస్తారు.వాళ్ళకు పాకిస్తానీయులూ,భారతీయులకు ఆ తరహా చిన్నకళ్ళు (చాలావరకూ)ఉండవని తెలీదు పాపం. మరి వాళ్ళ అపోహని మనం "నిజం" అనముకదా!

శంకరాచార్యుడు శక్తిపీఠాలు స్థాపించేవరకూ అన్ని ప్రదేశాలు తిరిగి పూజిస్తేగానీ హిందువు కాడన్న అపోహ ఉండేదే కాదు. అలా తిరిగిన లేదా తిరగ్గలిగిన బలిమికూడా ఏ కొద్దిమందికో మాత్రం ఉండేది. Indian lives in villages అనేమాట నిజమైతే అప్పట్లో వారికి తమ రాజెవరోకూడా సరిగ్గా తెలిసుండదు అలాంటిది అఖండ భారతం కూరలో కరివేపాకు.కాదంటారా!

Kathi Mahesh Kumar said...

@అనామకుడు: What makes you thing I am an insider of "dalitism"???

Naga said...

- సందేహాస్పదమే.. పది, వంద సంవత్సరాల చరిత్రను రాసి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవచ్చు కానీ, వేల సంవత్సరాల చరిత్రను రాసి సంపూర్ణంగా అధ్యయనం చేసి ఒక్క వాక్యంలో చెప్ప గలగడం ఆచరణలో సులభం కాదు.
-మనం నిజం అనం, కానీ వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది కదా ... ? ...నిజం కాకపోయినా... దృష్టి తీరుకు, దృష్టాంతానికి అవినాభావ సంబంధం ఉంది.
-మూడవ పేరాగ్రాఫు నాకు అర్థం కాలేదు.