Sunday, July 5, 2009

తెలుగు పరిరక్షణ

ఈ మధ్య చర్చల్లో కొందరు తెలుగు పరిరక్షకుల్ని కలుసుకున్నాను. తమ అమెరికాంధ్ర పరిధుల్లోంచీ, హైద్రాబాదు పొలిమేరల్లోంచీ చాలా విశాలంగా తెలుగు కోసం బాధపడుతూ కనిపించారు. చాలా సహేతుకమైన బాధ వీరిది. జానుతెనుగుపదాలు మృగ్యమైపోతున్నాయి. సాహిత్యం అన్యాయమైపోతోంది. సారస్వతం చివరిశ్వాస విడుస్తోంది.సారస్వతంలోని స్వారస్యాన్ని అస్వాదించేవాళ్ళు కరువయ్యారు. పద్యాలు పాడిగట్టేస్తున్నాయి. అంటూ భోరున విచారించేశారు. ఈ కోలాహలంలో..."ఈ హాలాహలమంతా తెలుగు బోధనా పద్దతిది" అన్న నాపై, "అభ్యుదయవాదిగా కనబడాలనే దుగ్ధ, పాత సాహిత్యమూ ఆ తెలుగూ నేర్చుకోలేని చేతకానితనమూ,ఏదో భావజాలం యొక్క ఆవేశమూ, పేరు తెలీని 'ఫిక్సేషనూ కారణం" అంటూ నా మానసికవిశ్లేషణ చేసి సర్దిచెప్పారు.

బహుశా నా మానసిక సంతులన సరిగ్గాలేనందున నేను తార్కికంగా సమస్యను చూస్తున్నానేమో అని నాకే సందేహమొచ్చింది. ఎంతైనా తెలుగు కొందరు "పండితులకే" సొంతమయ్యిందికదా. వారి తెలుగులో ఎమోషనుంది, యాక్షనుంది, శృంగారముంది, రసస్పందనుంది, అలౌకిక ఆనందముంది, ఉన్నతమైన జీవితముంది, అత్యున్నతమైన ప్రమాణాలున్నాయి. కానీ నా ఏ తర్కంలో ఏముంది? బీద అరుపులు, జీవనోపాధి కోరుకునే భవితలు, తమ గోడు చెప్పుకుని ఏడ్చే ఏడుపులు. వాటికి ఈ ఉన్నతమైన లోకంలో చోటులేదు. జానపదమైనా సొగసుమాటల్లో రాస్తేనే జానుతెనుగు రూపాన్ని సంతరించుకుంటుంది. అదే జానపదులు పాడితే మాత్రం ప్రకృతి - వికృతుల్లోని ‘వికృతి’గా మిగిలిపోతుంది.

ఇలాంటివాళ్ళకు పల్లెతెలుగు యాసలు భాష కావు. వారి భావనలు సారస్వతం అసలు కావు. తెలుగుని సంస్కృతంతో శుద్దిచేసి, ఆ చావువాసనతో సావాసం చేస్తేగానీ, నిప్పుల్లోంచీ "పవిత్రమైన" అచ్చతెలుగు ఉదయించదు. కానీ నా బాధంతా ఇది కాదు. నా వాదనకు మూలం ఈ గోల కాదు. నా గొడవంతా ప్రాధమిక స్థాయిలో,పాఠశాలస్థాయిలో తెలుగు నేర్పించడం. "సరిగ్గా,శాస్త్రీయంగా" తెలుగు నేర్పించడం. పిల్లల సహజసిద్ధమైన విధానంలో తెలుగుని నేర్చుకుని, ప్రేమించి, తెలుగుతో మమేకం అవ్వడం.

నలభై లక్షలకు పైగా తెలుగు నేర్చుకుంటున్న,తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి తెలుగుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. పది కోట్ల జనాభాలో కనీసం ఆరు కోట్ల మంది పల్లెల్లో పట్టణాలలో తెలుగులో వ్యవహారాలు నడుపుతున్నారు. కాబట్టి, మరో శతాబ్ధం వరకూ తెలుగుకొచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే ఒక్క మాట. సాహిత్యం,సారస్వతం అంటూ నెత్తినెక్కి గొంతులో దిగేస్తున్న తెలుగుకి అటువిద్యార్ధులూ ఇటు జనసామాన్యం తూరుపుతిరిగి దండంపెట్టమనే కాలం మాత్రం రానేవచ్చింది. కేవలం అవకాశం కావాలి. అది ఒకప్పుడు సంస్కృతం రూపంలో, ఇప్పుడు ఇంగ్లీషు మీడియం with Hindi as primary (first) language తో ఎలాగూ తయారుగా ఉంది.

ప్రస్తుత పరిస్థితికి నాకు తోచిన కారణాలు;
1. "మాట్లాడే భాషకు" ప్రాధాన్యత ఇవ్వకుండా చదివే,రాసే భాషలను సహజత్వానికి దూరంగా తీసుకెళ్ళడం.
2. తెలుగు భాషాబోధన విద్యార్థికి సంతోషాన్ని అందించే ప్రక్రియగా కాకుండా "బలవంతం" ( రేప్) గా మారడం.
4. సంస్కృతాన్ని కాపాడే గుత్తాధిపత్యాన్ని మన తెలుగువాళ్ళు తీసుకుని మార్కులెక్కువేస్తామంటూ విద్యార్థుల్ని సంస్కృతంతో ఉద్ధరించడం.
5. తెలుగు ప్రాచీన వైభవం పేరుతో పద్యసాహిత్యానికి పట్టంగట్టి, కనీసం విద్యార్థులకు అర్ధమయ్యే గద్యాన్ని అట్కెక్కించడం.

మాట్లాడే భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా చదివే,రాసే తెలుగుల్ని "శుద్ధీకరణ"చెయ్యడం వలన మాతృభాషైన తెలుగుని కూడా విద్యార్థులు "పరాయి భాష" నేర్చుకునే విధంగా నేర్చుకోవసి వస్తోంది. ఉదాహరణకు ఇంట్లో ‘అన్నం తినడం’ అనే క్రియ స్కూలుకి వెళ్ళే సరికీ ‘భోజనం చెయ్యడం’గా మారిపోతుంది. ‘కసువు తియ్యడం’కాస్తా ‘శుభ్రపరచడం’ అయిపోతుంది. మాటిమాటికీ (మాటమాటకీ) నా ఇంటి తెలుగుని (నిజానికి దీన్నే మాతృభాష అంటారు) స్కూలు తెలుగు చులకనచేసి సంస్కరిస్తుందేతప్ప, తెలుగుకున్న విస్తృతత్వంలో ఆ భిన్నత్వానికి స్థానం కల్పించదు. ఇలా గిరిగీసుకుని ప్రతి విద్యార్థి తెలుగునీ వెలివేసుకుంటూ పోతే సహజత్వం ఎక్కడుంటుంది? "తన తెలుగు" కాని తెలుగుని "మాతృభాషగా" విద్యార్థి ఎలా నేర్చుకుంటాడు? అంటే మొత్తానికి స్కూలు తెలుగును ఒక ద్వితీయభాషగా తెలుగు విద్యార్థికి బోధిస్తున్నామే గానీ మాతృభాషగా ఎంత మాత్రమూ కాదు.

ఇప్పుడు బోధనా పద్ధతికి వద్దాం. నేను కాలేజిలో ఉన్నప్పుడు (1994-98) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక భాషాకమిటి (1989 లో అనుకుంటాను) ఇచ్చిన సిఫార్సులు చదవడం జరిగింది. అవిప్పుడు మొత్తంగా గుర్తుకు లేవు. కానీ ఈ క్రింది మూడు బిందువులూ వాటిల్లోని ముఖ్యాంశాలుగా నాకు గుర్తు.

1)మొదటి ఐదు తరగతుల్లో మౌఖికంగా బాల సాహిత్యం (పాటలూ,గేయాలూ,గీతాలూ,కథాపఠనం) నేర్పుతూ కేవలం ఆక్షరాలు రాయడం,చదవడం నేర్పాలి.

2)ఆరు ఏడు ఎనిమిదో తరగతుల్లో వాడుకభాషలోని కథలు,వ్యాసాలు,వాడుక భాషకు దగ్గరగా ఉండే శతక పద్యాలు ఇతర గేయాలను పరిచయం చెయ్యాలి. కథావ్యాసాల్లోని ఆలోచనల్ని,అభిప్రాయాల్నీ అర్థం చేసుకోవడం,విస్తరణ,కుదింపు,వాక్యనిర్మాణం (దానికి సంబంధించిన వ్యాకరణం) వంటి ప్రక్రియలలో నిపుణుల్ని చెయ్యాలి.నిఘంటువు శోధనను అనివార్యం చేసే చర్యలు చేపట్టాలి. తద్వారా పిల్లల్లోని ఆలోచనా శక్తిని,సృజనాత్మకనూ పెంపొందించి స్వయంగా తమ ఆలోచనల్ని రాసేవిధంగా ప్రేరేపించాలి.
ఉపవాచకాలుగా ట్రావెలాగులు,విహారప్రదేశాల వర్ణనలు వంటివి పరిచయం చెయ్యడం ప్రోత్సహించదగినవి.

3)తొమ్మిది పది తరగతుల్లో తెలుగును రెండు సమ భాగాలుగా చేసి పద్యసాహిత్యం ఒకవైపు గద్య సాహిత్యం మరొకవైపూ బోధించాలి. పద్యసాహిత్యాన్ని ఆధునిక కవితలతో మొదలుపెట్టి ఛంధోబద్ధమైన పద్యాల వరకూ అన్ని ప్రక్రియలతోనూ పరిచయం కలిగేలా బోధించాలి. గద్యసాహిత్యంలో కథ,కథానిక,గల్పిక,నవలిక వంటి ప్రక్రియను పరిచయం చేస్తూ పాఠ్యాంశాలను జతచెయ్యాలి.
ఉపవాచకంగా నవలా సాహిత్యాన్ని లేక నాటకాన్ని పరిచయం చెయ్యడం ఉత్తమం.

పై ప్రతిపాదనలు అమలు చెయ్యక ఇరవై సంవత్సరాలయ్యింది. ఇప్పుడు తెలుగు తగ్గిపోతోందని విషాదంగా విలపిస్తూ కారణాలు వెతుకుతున్న వారు పడుతున్న బాధ, అప్పట్లో ఈ ప్రతిపాదనల్ని అడ్డుకున్న "పండితుల" చెప్పిన కారణాలూ ఒకటే అవ్వడం paradoxical. "ఈ కొత్తల మోజులోపడిపోయి, మన భాషావారసత్వాన్ని, మన పూర్వ సాహిత్యాన్ని కాదనుకోనక్కర్లేదు, కాలదన్నుకోనక్కర్లేదు. భావితరాలకు మన వారసత్వంగా దాన్ని అందించాలి." అన్న ఒకే ఒక ఆశయంతో పాత పద్ధతిలో తెలుగు బోధనను యధాతధంగా ఉంచేశారు. ఇప్పుటివరకూ తెలుగంటే పారిపోవాలనుకునే విద్యార్థుల్ని ఇరవైసంవత్సరాలుగా యధాప్రయాసగా తయారు చేస్తున్నారు.

ప్రస్తుతం అమలులోవున్న సిలబస్, నెలకొనివున్న బోధానా పద్ధతి ఇలాగే కొనసాగితే "తెలుగుని ప్రేమించే" భావితరాలు ఖచ్చితంగా కనుమరుగౌతాయి. మొక్కుబడిగా ముక్కునబట్టి పరీక్షల్లో తెలుగు కూడా చీదేసొచ్చే తరాలే తయారవుతాయి. దానివల్ల ఈ భావితరాలకు వారసత్వాన్ని అందించాలని నన్నయ,తిక్కనను భట్టీపట్టించే మేధావులకు బాగానే ఉంటుందేమోగానీ బ్రతకున్న తెలుగు భాషకు, సంస్కృతికీ సంస్కృతానికి పట్టినగతి పట్టడానికి రాచమార్గం మాత్రం బహుచక్కగా ఏర్పడుతుంది.(పద్యంతో నాకు సమస్యలేదు. అది ఎప్పుడుచెప్పాలి అనేదాంతో ఖచ్చితంగా సమస్య ఉంది.) పల్లె జనుల వల్లో లేక ప్రైవేటు చదువులు చదివించలేని పేదోళ్ళ వల్లో మరో శతాబ్ధం కాలం తెలుగు బ్రతకినా ఆ తరువాత కుక్కినపేనవ్వడం ఖాయ.

తెలుగు పండితుల,మేధావుల పద్యసాహిత్యపు ఉన్మాదం విద్యార్థుల్ని నిత్యజీవితంలో మాట్లాడే,చదివే,అనుభవించే తెలుగుకి దూరం చేస్తోంది అనేది ఎప్పుడైనా ఒకసారి స్కూలుకెళ్ళి పిల్లల్తో మాట్లాడితే తెలిసే విషయం. తెలుగులో అభివ్యక్తికి విలువ ఇవ్వకుండా వత్తులకూ,పొల్లులకూ మార్కులు కత్తిరించాలి అనే (భాషయొక్క మూల ఉద్దేశాల్ని విస్మరించిన) తెలుగు బోధకుల ఛాంధసవాదం విద్యార్థుల్ని సంస్కృతంవైపు మరలిస్తోందన్న `సత్యం’ “సంస్కృతి పై నిరాధారమైన నిర్హేతుకమైన మాటలు”గా అనిపిస్తే అది ఎవరి కురచ అనుభవం?I feel such a display of arrogance is nothing but insensitivity towards next generation learners.

నా అనుభవం వ్యక్తిగతం కావచ్చు. కానీ ప్రభుత్వం నిర్వహించిన భాషా కమిటీ సర్వేలు,రిపోర్టుల మాటేమిటి? ఇక్కడ ఎవరైనానా national curriculum framework -2005 భాషాబోధన గురించి ఏం చెప్పిందో తెలుసుకున్నారా? సరే అది కేంద్రం యొక్క రిపోర్ట్ అనుకుందాం.1989 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో జరిపిన భాషా సర్వేలు ఏం చెప్పాయో ఎంత మందికి తెలుసు? తెలుగు యూనివర్సిటీ ఎందుకు ఉద్భవించిందో మీలో ఎందరికి తెలుసు? అవన్నీ ఎందుకు అమలుకాలేదో తెలుసా!

ఇక్కడ గుమిగూడి సాహిత్యం,సారస్వతం,భాషాచరిత్ర,సంస్కృతి,పూర్వసాహిత్యపు వైభవం అని చెబుతున్న పెద్దల్లాంటి పెద్దల చర్యల వలన రెకమండేషన్స్ ను అటకెక్కించారు. పూర్వపు వైభవాన్ని కాపాడటానికి బ్రతికున్న తెలుగుని...మా పల్లెభాషలో ‘చంకనాకించారు’. తెలుగు యూనివర్సిటీ వచ్చి భాషకు చేసిందేమీ లేదుగానీ జ్యోతిష్యం,వాస్తు వంటి గొప్పగొప్ప కోర్సులు మొదలెట్టేలా చేసింది. ఇప్పటివరకూ తెలుగులో ఒక చక్కని నిఘంటువుకూడా ఏర్పరచని ఈ యూనివర్సిటీని "తెలుగు యూనివర్సిటీ" అనాలంటేనే కంపరం.

ఈ ఆభిజాత్యపు ధోరణులవల్ల తెలుగుకు అన్యాయం చేస్తున్నది ఎవరు? తెలుగు సంస్కృతికి అన్యాయం చేస్తున్నది ఎవరు? ప్రజల తెలుగులోనే ప్రజల తెలుగు ప్రేమతో,గౌరవంతో నేర్పించండ్రా అని చెప్పే నాలాంటోళ్ళా లేక భూతకాలంలో బ్రతుకుతూ గతవైభవ పద్యచరిత్రను చేదుమాత్రల్లాగా మింగించి, “తెలుగురోగాన్ని” ప్రాలద్రోలదామనుకునే కొందరా!


చివరిగా.... తమ్మిరెడ్డి రవికిరణ్ మాటల్లో చెప్పాలంటే...

"చరిత్ర, సంసృతి భాషకి ప్రత్యేకంగా ఉండవు. ఆ భాష మాట్లాడే జనాల చరిత్రే, ఆ జనాల సంసృతే ఏ భాష చరిత్రయినా, సంసృతైనా. అందుకని మీరు జనాలనొదిలేసి, వాళ్ళ సామాజిక వైరుధ్యాలనొదిలేసి, వాళ్ళ ఆర్ధిక పరిస్థితుల్నొదిలేసి, వాళ్ళు మాట్లాడే భాషలో ప్రతిఫలించే అన్ని రకాల వైరుధ్యాలని, వర్గీకరనలణి వదిలేసి, మీకు తెలిసిన, మీకు నచ్చిన మీ సమాజంలో మీ అమ్మమ్మ, తాతయ్యలు మాట్లాడిన భాషనే ప్రామాణికవైన (ప్రామాణికవైన భాషకసలు అర్థం వుందా) భాష అనే సాము చేస్తున్నారు. మా అవ్వా, తాతలు పురాణాలు చదవలేదు, కావ్యాలు కంఠతా పెట్తలేదు, వేదాలు ఔపోసన పట్తలేదు. గుళ్ళో ఏవో పురాణాలనిన్నారు, వాళ్ళూ, వీళ్ళూ చెప్పిన కతలేవో విన్నారు. మాక్కొడా అవే చెప్పేరు, ప్రామాణిక భాషలో కాదు అచ్చవైన నెల్లూరు తెలుగులోనే. బళ్ళో చదివిన ఆ కొద్ది పాఠాలు తప్పిస్తే నాకు మరే పురాతన సాహిత్య పరిచయం లేదు. మా నాయన అదే కోవ, నేను అదే దారి. కాబట్టి పాత సాహిత్యం గురించి మీ బాధ నాకు, నాలాంటి వాళ్ళకి (గుర్తు పెట్టుకోండి మీరే దేశవేగిన, ఎందు కాలిడినా మేవే మెజారిటీ) అనవసరం. మెజారిటీ ఆశలు, ఆరాటాలు, ఆందోళనలు, అవస్థలు, ఇవన్నీ కలగలిసిన బ్రతుకుల చరిత్రలు, వాళ్ళ సంసృతులు వాళ్ళ భాషలో ప్రతిఫలించని సాహిత్యం చనిపోయితీరుతుంది. పూర్తిగా కాకపోయినా దేవ భాషలాగా నడుస్తున్న శవమై మిగులుతుంది. మీకు బాధ అనిపించినా సరే అదే వాస్తవం, మా వర్గ వాస్తవం, మా జీవన వాస్తవం. మెజారిటీ మేవే కాబట్టి మీరు ఎన్ని అభ్యంతరాలు ఏకరువు పెట్టినా, ఎంత ఉక్రోషాన్ని వెలిబుచ్చినా, ఎంత వెటకారాన్ని వ్యక్తపరిచినా మా వాస్తవే నిలబడితీరుతుంది"

*****


21 comments:

వీరుభొట్ల వెంకట గణేష్ said...

I see many times the word "Abhijyatyam" in your blogs. What is the meaning of that? One question, Why you are using old style bookish Telugu in your blog?

Anil Dasari said...

>> "నలభై లక్షలకు పైగా తెలుగు నేర్చుకుంటున్న,తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి తెలుగుకొచ్చిన ప్రమాదమేమీ లేదు. పది కోట్ల జనాభాలో కనీసం ఆరు కోట్ల మంది పల్లెల్లో పట్టణాలలో తెలుగులో వ్యవహారాలు నడుపుతున్నారు. కాబట్టి, మరో శతాబ్ధం వరకూ తెలుగుకొచ్చిన నష్టమేమీ లేదు"

మూడోది కూడా ఉంది. 'ఈనాడు దినపత్రిక ఉన్నన్నాళ్లూ తెలుగెక్కడికీ పోదు' :-)

Kathi Mahesh Kumar said...

@వీరుభొట్ల వెంకట గణేష్: నేను ఉపయోగించిన పదం ‘అభివ్యక్తి’. ‘అభివ్యక్తం’ కాదు. అభివ్యక్తి refers to the expressive function of the language.

I write the way I do because of the de-conditioning I have gone through my schooling while learning Telugu. మీరు తెలుగులోని రకాల్ని గురించి మరింత తెలుసుకోవాలేమో! What are you referring to as "old style bookish Telugu"?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Currently, I don't have any tool to write in Telugu. So, my response in English.

Nakku telisi mee rachan vidhanam grandhikam ga undi, not like commonly used lnaguage. Just wondering that why the people like you are still using "Grandhikam" even for writing blogs. BTW, I have asked the maning for "ABHIJYATYAM".

Kathi Mahesh Kumar said...

@వీరుభొట్ల వెంకట గణేష్:మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే లేఖిని వాడి తెలుగులో రాయొచ్చు. ప్రయత్నించండి. అటూఇటూగా ఆభిజాత్యానికి ఆంగ్లపదం prejudice.

నేను రాసేది గ్రాంధికం కాదు. వ్యావహారికమే.కాస్తోకూస్తో అన్ని రకాలూ కలగలిపిన భాష.

gaddeswarup said...

I had to look up Brown's dictionary (which may be outdated) for some of the words. It says that abhijaatyamu means lineage.
Could not find this "అస్వాదించే". Does it mean 'tasting'?
Gives meanings like 'juicy' for "స్వారస్యాన్ని"

నాగప్రసాద్ said...

>>"మాట్లాడే భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా చదివే,రాసే తెలుగుల్ని "శుద్ధీకరణ"చెయ్యడం వలన మాతృభాషైన తెలుగుని కూడా విద్యార్థులు "పరాయి భాష" నేర్చుకునే విధంగా నేర్చుకోవసి వస్తోంది." 100/100

>>"ప్రస్తుతం అమలులోవున్న సిలబస్, నెలకొనివున్న బోధానా పద్ధతి ఇలాగే కొనసాగితే "తెలుగుని ప్రేమించే" భావితరాలు ఖచ్చితంగా కనుమరుగౌతాయి." 200/100

టపా మొత్తం బాగుంది. చాలా చక్కగా వివరించారు. ఓవరాల్‌గా నా రేటింగ్ 200/100.

"మాయాబజార్" సినిమాలో కూడా చిన్నమయ్య తన శిష్యులతో అస్మదీయులు అని పలకండి అంటే వాళ్ళు పలకలేకపోతారు. అయినా అస్మదీయులు అనడం ఎందుకు? మనవాళ్ళంటే సరిపోతుందిగా అంటారు.

అది విన్న ఘటోత్కచుడు "అవునవును. పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం. వెయ్యండి రెండు వీరతాళ్ళు అంటాడు."

దీని గురించి ఇంకా చాలా రాయాలి. తొందరలో నా బ్లాగులో టపాగా ప్రచురిస్తాను.

Anonymous said...

mee blog lo kuda ekkuva padalu ardham kakunda ne vuntayi.. kaneesam vaduka bhasha kadu kuda..
mari meeru kuda vaduka bhasha lo rayochu kada...
malli meere vaduka bhasalo rayalani salaha..
okasari mee blogs lo chuste.. vaduka bhasha lo leni padalu enni vunnayo telustundi.

గీతాచార్య said...

పిల్లలకి వ్యావహారిక భాషలో ప్రాథమిక విద్యను నేర్పి అటుపైన క్రమంగా ఛందొబద్ధమైన తెలుగుని పరిచయాత్మకంగా నేర్పితే అందులోని సౌందర్యాన్ని ఆస్వాదించగలిగితే వారే పద్యములని నేర్చుకుంటారు. కానీ ఇప్పటి పద్ధతి కాస్త ఉల్టాగా ఉన్నట్టుంది.

మన తెలుగు ఒక కాస్మోపాలిటన్ భాష. అది అంత త్వరగా మరణించదు.

Kathi Mahesh Kumar said...

@గద్దేస్వరూప్: బ్రౌణ్యం తరువాత తెలుగులో కొన్ని వేల పదాలు కలిసాయి. మరో కొన్ని వేల పదాల వ్యావహారిక అర్థాలు,సాహితీ అర్థాలు,సాంకేతిక అర్థాలూ మారాయి.

కాబట్టి మీకు బ్రౌణ్యంలో కొన్ని పదాలు కనిపించకపోతే ఆశ్చర్యం లేదు. వాటి అర్థాలు సరిగ్గా అనిపించకపోతే విచిత్రం కాదు. ఆభిజాత్యానికి lineage అనే అర్థం కనిపించినా, ఇప్పటి వ్యావహారికంలో ఆ "వారసత్వాన్ని గట్టిగా పట్టుకుని ఇదే సరైనది" అనే ఛాంధసవాద ధోరణిని ఆభిజాత్యం అంటారు.

ఆస్వాదించే అంటే అర్థం relishing. స్వారస్యాన్ని అర్థం సాహిత్యంలో ఉన్న సారాన్ని ఆస్వాదించడం అనుకోవచ్చు.

ఇప్పటికీ మరో ప్రామాణిక (డిక్షనరీ) నిఘంటువును తయారుచేసుకోలేని జాతి మనది. తెలుగు యూనివర్సిటీ స్థాపించడంలోని ఉద్దేశాలలో ఈ నిఘంటువు తీసుకురావడం ఒకటి.ఇప్పటికి దాని జాడలేదు.

@అనామకుడు: నేను ఈ వ్యవస్థలో "సంస్కరింపబడిన"వాడిని. నా భాష ఇలా ఉండటానికి కారణం అదే.
ఇక్కడ నేను ఎవరికీ సలహాలు ఇవ్వడం లేదు. తెలుగు భాష చచ్చిపోతోందని బాధపడుతున్న పెద్దలకు నా అభిప్రాయం చెబుతున్నాను.అంతే.

@నాగప్రసాద్& గీతాచార్య: ధన్యవాదాలు.

విశ్వామిత్ర said...

నాకు తెలిసి "అభిజాత్యము" అంటే అహంకారము, పొగరు అనే అర్ధం వచ్చే సందర్భంలో వాడతారు. "పండితుల" పై మీ ప్రకోపాన్ని బాగానే చూపించారు.

"తెలుగు పండితుల,మేధావుల పద్యసాహిత్యపు ఉన్మాదం విద్యార్థుల్ని నిత్యజీవితంలో మాట్లాడే,చదివే,అనుభవించే తెలుగుకి దూరం చేస్తోంది" -- మీరు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్ళి చూడండి. ఎంతమంది టీచర్లు ముప్ఫ్హై ఆరును ముప్ఫై ఆరు అని పలకగలరో తెలుస్తుంది. అందులో సగం మంది ముప్పీ ఆరు అనిమాత్రమే అనగలరు. దానినే మనం అసలైన తెలుగు అందాము అంటారా? తెలుగు భాష మీరు అనుకుంటున్నట్టు కేవలం "పండితుల" భాష కాదు. కాని తెలుగుకు ఒక అందాన్ని తెచ్చింది మాత్రం నిస్సందేహంగా వాళ్ళే.

gaddeswarup said...

Sri Mahesh Kumar,
Thanks for the explanations. Though I like Telugu, my Telugu is poor and through blogs I try to get some idea of the current usage. I once visited the Telugu Academy to try to get some dictionaries online. The only success so far is through a friend P.P.C. Joshi who has put online "Adhunika Vyavahara Kosam" by Budaraju Radhkrishna:
http://www.pracheepublications.com/
There is also a site 'telugupadam' where some bloggers are making efforts to collect current interpretations. I also heard that there is an etymological dictionary in eight volumes (Vyutpatti pada kosam) published by Andhra University by 90's. I should try to get when I visit A.P. next. From my experiments in the last five years, I think that some thing is likely to come out through bloggers' efforts more quickly than from official undertakings.

వేమన said...

మహేష్ గారూ,

'స్వాభిప్రాయన్ని వ్యక్తం చేశా'నన్నా 'నాకు తోచింది చెప్పా'నన్నా దాదాపు ఒకటే అర్ధం ఒస్తుంది కాబట్టి మొదటి వాక్యంలో పదాలు దండగని మాట్లాడలేము. There are two ways to learn anything new. Lower the bar or raise yourself above it. ఇక వ్యవహారిక భాషకి దూరం అయిపొయిందంటారా, వ్యవహారిక భాష ప్రత్యేకంగా నేర్చుకోనక్కరలేదు, కాదంటారా ? ఎందుకంటే వ్యవహారిక భాషకే పరిమితమయితే తెలుగుకి ఒక వంద, నూట యాభై పదాలు చాలు. అప్పుడు మనం పుస్తకాలలో
' ప్రతిభ కనబరిచాడు ' అనే బదులు ' ఇరగ దీసాడు ' అని చదువుకొవచ్చు. ఎందుకంటే వ్యవహారిక భాష అనేది 'volatile'. It changes with time and is constantly influenced by the medium of usage.

Kathi Mahesh Kumar said...

@వేమన: నా ప్రతిపాదనని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు.

భాషా బోధనలో మాతృభాషను బోధించడానికి direct method వాడితే, ద్వితీయభాషను బోధించడానికి grammar translation పద్దతి వాడుతారు. ఇంట్లో తెలుగుకి స్కూల్లో ప్రాముఖ్యత ఇవ్వక మాతృభాషా బోధనను కూడా వ్యాకరణం ద్వారా నేర్చుకునే భాషగా తయారు చేశారు. అది తప్పు అని మాత్రమే నేను చెబుతున్నది.

తెలుగు ఇంట్లో "మాట్లాడే" విద్యార్థికి ఐదవతరగతి వరకూ "చదవడం,రాయడం" నేర్పించే పద్ధతి ఇది కాదు అని చెబుతున్నాను.ఇందులో raising the bar-lowering the bar కన్నా ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయ భాషా బోధన అనే చర్చ ముఖ్యం.

విద్యార్థి ఇంటిభాషని న్యూనతపరిచే పద్ధతి కాకుండా, దాన్నొక మూలంగా తీసుకుని పుస్తకభాషతో అన్వయించి చెప్పే చదువులు కావాలని ఆశిస్తున్నాను.మీరన్నట్లు వాడుక భాష volatile కాదు. It is DYNAMIC. భాష అలాగే ఉండాలి. అప్పుడే అది బ్రతుకుతుంది. ఎప్పుడైతే భాషా ప్రవాహం ఆగుతుందో అప్పుడు అది చావడం మొదలౌతుంది. ఆ గతి తెలుగుకు పట్టగూడదంటే పద్ధతి మార్చుకోవాలి.

Telugodu said...

"ముప్ఫ్హై ఆరును ముప్ఫై ఆరు అని పలకగలరో తెలుస్తుంది. అందులో సగం మంది ముప్పీ ఆరు అనిమాత్రమే అనగలరు. దానినే మనం అసలైన తెలుగు అందాము అంటారా? "
"ముప్ఫ్హై ఆరు" అని కొందరు పలికేదే సరి, ఎక్కువ మంది వేరేగా పలికితే అది తప్పు అనే వాదన "అభిజాత్యం" అనే పదానికి సరైన ఉదాహరణ. ముప్ఫ్హై ఆరు/ముప్ఫై ఆరు/ముప్పీ ఆరు , ఇవన్ని కూడా సరి అయినవే, అందరు అర్థం చేసుకో గల్గినవే !
"ఏదీ తప్పూ కాదు, ఏదీ ఒప్పూ కాదు, అన్నీ వేరే వేరే"
గమనిక - "తెలుగోడు" అనే మారు పేరు ఉన్న రచయితకు నాకు ఏ విధమైన సంబంధము లేదు.

Kathi Mahesh Kumar said...

@తెలుగోడు: బాగా చెప్పారు."ఏకత్వమంటే భిన్నత్వాన్ని నాశనం చెయ్యడం కాదు.భిన్నత్వాల్ని తనలో ఇముడ్చుకొని ఒకటవ్వడం" అనే ప్రాధమిక సూత్రాన్ని మరిచిన తెలుగు వ్యవస్థీకరణ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి ఉదభవించిందన్న నా నమ్మకాన్ని చాలా సులభంగా వివరించేశారు.

Anonymous said...

@మహేష్: ఇప్పుడు 36 ని స్కూల్లో ఎలా నేర్పాలని మీరు అంటున్నారో స్పష్టంగా లేదు. అలాంటి వివరణ కావాలి.

మెథడాలజీ మార్చాలి అన్న విషయంలో అందరూ ఓకే; మీరు ఆ వివరణ ఇచ్చాక, మీతో చాలా మంది ఏకీభవిస్తారని నా అభిప్రాయం; ఎలా మార్చుకోవాలి అన్న విషయానికి మీరైనా, మరెవరైనా ముందుకెళ్తే బావుంటుందేమో.

నా బ్లాగులో "స్టాండడైజేషనే అసలు శతృవేమో" నని రాసిన రోజు కూడా నా బాధ ఇదే! స్టాండడైజేషన్ యొక్క లక్ష్యం భాష "జీవించడం" కాదు. దాని లక్ష్యం ఇలాంటిదే! జీవించే భాష డైనమిక్‍గా ఉంటుంది అని ఎప్పుడో చెప్పుకున్నాం. డైనమిక్‌గా లేదు అంటే, అందులో జీవం లేదు అనే అర్ధం!

సో 36 ని ఎలా పలకాలంటారు మీరు? - అంటే బళ్ళో ఎలా నేర్పించాలంటారు? అది చెప్పండి
స్టాండైజేషన్ అసలే అవసరం లేదని మీ ఉద్దేశ్యమా?

Anonymous said...

Offtopic: నేను చాలా మంది లేఖిని వాడడం చూసాను, కానీ నాకు గూగుల్ ఇండిక్ transliteration చాలా సులభంగా బావుంటుంది అనిపిస్తుంది. మీరు ప్రయత్నించారా ?

రమణ said...

మహేష్ గారు,
మీరు వివరించిన ప్రతిపాదనలతో ఏకీభవిస్తాను.
కానీ వాడుక భాషను సారస్వతం చేయటంలో నాకు కొన్ని సందేహాలున్నాయి.
పదాలను పలికే తీరులో ఒక ప్రాంతానికి , మరొక ప్రాంతానికి వ్యత్యాసం ఉంటుంది.
ఏ ఏ ఉచ్చారణలను సారస్వతం చేయాలి? , అన్నింటినీ పుస్తకాలలో చేర్చాలా ?
ముఖ్యంగా పాఠ్యాంశాలలో అనేక మాండలికాలకు సంబంధించిన పదాలను చేర్చాలా ?

ఈ వాడుక భాషను పుస్తకాలలో ఉపయోగించే పద్ధతి కూడా మళ్ళీ ప్రామణికమౌతుందేమో కదా ?

hai telugu news said...

కత్తి మహేష్ గారు మీ వ్యాసం చాలా బాగా ఉంది. చర్చ అంతకన్నా బాగా రక్తి కట్టింది. అందరికీ ధన్యవాదాలు.

మీ వ్యాసంలో మరీ అర్ధం చేసుకోలేనంత గొట్టు పదాలేవీ లేవు. వాదన కోసం కొందరు అడ్డంగా వెళ్లారు. ఇంతకన్నా కష్టంగా ఉన్నా ఆంగ్లంలో బిజినెస్, కెరీర్ వ్యాసాలు చదువుతున్న వాళ్ళే వీళ్ళంతా. ఒక శబ్ద రత్నాకరం కొనుక్కుంటే ఇలాంటి సందేహాలు రావు. ఇది ఒకసారి పెట్టే పెట్టుబడి.

srinivas

Unknown said...

what Mr kathi mahesh kumar said is 100% correct. మనం సహజంగా మాట్లాడే భాషకు (Mass speaking language) ప్రాధాన్యత ఇవ్వకుండా చదివే,రాసే తెలుగుల్ని(poets speaking language) నేర్చుకొంటే తెలుగు కొన్నాళ్ళకు సంసృతంలా మృత భాష గా మారిపోతుంది. NO DOUBT about it. అయినా మన పిచ్చి గాని ఎంత మంది ఈ బ్లాగు చదువుతున్న వారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారో? నా ఉహ ప్రకారం ఒక్కలు కూడా ఉండరు. ఇది బాదకలిగిస్తున్నా పచ్చి నిజం.