Thursday, July 30, 2009

నిడదవోలు మాలతి గారి పునరావలోకనం పై నా పునరాలోచన


"(చివరకు మిగిలేది) నవల చదవడం ముగించిన తరవాత ఈ నవల సందేశం ఏమిటి అని చాలా ఆలోచించవలసివచ్చింది. మగవారి మనోభావాలు ఇంత సంకుచితంగా తమ పరిధిలోనే ఉంటాయా? మగవారిలో కనీసం దయానిధిలా ఆలోచించేవారు వుండటానికి అవకాశం ఉందనా? ఇలా జీవితం విశ్లేషిస్తూ కూచుంటే జీవితం నిజంగా అనుభవించడం గానీ, జీవితంలో సాధించేది గానీ ఏమీ ఉండదనా?" - నిడదవోలు మాలతి

నేను రాసిన "చివరకు మిగిలేది ఎందుకు చదవాలి?" వ్యాసం చదివిన ఒక మిత్రులు నిడదవోలు మాలతిగారు ఈ నవల మీద ఎప్పుడో రాసిన "పునరావలోకనం"ని pdf రూపంలో పంపించారు. మొత్తంగా చదివిన తరువాత కొంత ఆశ్చర్యం మరికొంత నిరాశ కలిగాయి. వ్యాసం చాలా శాస్త్రీయంగా సాగినా, నా భావాలకు ప్రతికూలంగా ఉండటం వల్లనో లేక నవల ముందిచ్చిన ఉపోద్ఘాతాన్ని పట్టుకుని మొత్తం నవలని (తన ప్రెజుడిస్ లతో కలిపి) జడ్జిచేసిన విధానం వల్లనోగానీ నిరాశ ఎక్కువ కలిగింది. అందుకే ఆ వ్యాసాన్ని ఉటంకిస్తూ దానిపై ఒక పునరాలోచన నాతరఫున్నుంచీ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

ఒక రచనను ముందుమాటా వెనుకమాటల్లాంటి ‘కొసరుమాటల’ తులనల ద్వారా (అవి స్వయంగా రచయిత రాసినవైనా సరే) బేరీజు చెయ్యడం పాఠకులకు చెల్లితే చెల్లచ్చేమోగానీ విమర్శకులకు చెల్లదనేది నా నమ్మకం. ఎందుకంటే విమర్శకుడి ఉద్దేశమే to see the work in itself, as IT IS. అలాంటప్పుడు మూల రచన ముందుండగా దాని ముందు వెనుకల్ని త్రవ్వి నవల స్థాయిని నిర్ణయిస్తాను అనేది విమర్శన స్ఫూర్తికే విరుద్ధం. పైగా "అతను (దయానిధి) జీవించి ఉండగానే ఇక ఏమీ లేదు అనుకోవడం నిరాశావాదం" గనక, నవలకు సామాజిక ప్రయోజనం ఏర్పడలేదని. "నిజానికి అతను జీవితంలో అనుభవించింది కూడా ఏమీ లేదు" (పుట 4) గనక పాఠకులకు ఈ నవల జీవితంపై కలగ జేసిన ధృక్పథం ఏమీ లేదని తేల్చెయ్యడం చాలా హ్రస్వదృష్టి అనిపించింది.

విమర్శకురాలు "అప్పట్లో అందరూ చదువుతున్నారనో,ఎవరో చదవమన్నారనో" యాభైసంవత్సరాల క్రితం ఈ నవలను చదివి "మనసును రంజింపజేయగల రచన"కాదు అని నిర్ధారించుకునేశారు. ఆ తరువాత ఇంత కాలానికి "మల్లీ ఈ వ్యాసంకోసం" చదివారు. మనసుకు హత్తుకోలేదు గనక "మళ్ళీ చదువుతానా అంటే ఏమో" (పుట 5) అనే సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి pre- conceived bias, prejudice నేపధ్యంలో నవల ‘విలువని’ పాఠకుడి కోసం ఎత్తి చూపడం సాధ్యమేనా? ఒకవేళ ప్రయత్నించినా నిస్పాక్షికమైన విమర్శన సాధ్యమేనా? అనేవి నా సమస్యలు. నావరకూ ఆ నిస్పాక్షికత కరువయ్యిందనే అనిపించింది.

విమర్శకురాలి విశ్లేషణలో నవల యొక్క చరిత్ర, ఈ నవలకి ఖ్యాతి నార్జించి పెట్టిన (రెండు) విశేషాల గుర్తింపుని నేను అంగీకరిస్తాను. ముఖ్యంగా ఈ నవలా విశేషాలైన సైకో అనలిటికల్ అప్రోచ్ (మానసిక విశ్లేషాత్మక విధానం), ‘జీవితం గురించి అభిప్రయాల సిద్ధాంతీకరణ’ నన్ను ఒక పాఠకుడిగా అమితంగా ప్రభావితం చేసిన అంశాలు. కాకపోతే వ్యాసంలో ఈ రెండు విషయాలనీ అపరిపక్వంగా అర్థం చేసుకున్న విమర్శన కనిపిస్తుందేతప్ప నవల సార్థకతను గుర్తించే నిశితదృష్టి కనిపించదు. అదే నిరాశను కలిగిస్తుంది.

సైకో అనలిటికల్ అప్రోచ్ సాహిత్యంలో ఎలా ఉపయోగిస్తారో తెలిసిన విమర్శకురాలైతే "దయానిధి వాదనల్లో, ఇతివృత్తం విషయంలో నేలవిడిచి సాము చేస్తున్నట్లు అనిపిస్తుంది" (పుట 1) అని నిర్ణయించి ఉండరు. ముఖ్యంగా "కథంతా దయానిధి అనబడే ఒక తాత్వికునికోణంలో నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు" (ఫుట 2) అని సుస్పష్టంగా గుర్తించిన పిదప ఇటువంటి జడ్జిమెంటుని వెలువరించడం ఆశ్చర్యకరం. తత్వచింతన, మానసికవిశ్లేషణ,ఆలోచన,భవ్యోద్రేకం స్థూలజగత్తుకు చెందిన ప్రక్రియలు కావు. భావజగత్తుకు చెందిన మానవ అంతరాళాల్లో అవి జరుగుతాయి. దాన్ని "నేలవిడిచి సాముచెయ్యడం" అనము. కళాసాధన అంటాము. కళాయజ్ఞం అని ప్రశంసిస్తాము. తల్లి, కోమలి,అమృతం,సుశీల, ఇందిర, నాగమణి, కాత్యాయని ఎవరూ దయానిధికి పూర్తిగా అర్థం కారు. సాహిత్యంలోనే కాదు నిజజీవితంలో కూడా ఎవరూ ఎవరికీ పూర్తిగా అర్థం కారు. కానీ, దయానిధి స్తూలజగత్తును మీరిన తన తాత్విక చింతనద్వారా భావజగత్తుకు చేరువై, వాళ్ళను మనకన్నా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే నవల ఉద్దేశం కూడా.

తల్లి నైతిక ప్రవర్తన దయానిధిని "బాధిస్తూంటుంది"(పుట 2) అని విమర్శకురాలు స్వీయప్రకటన కావించేసి, "దయానిధిలో ఆమె దుష్ప్రవర్తనకి వెనుకనున్న కారణాలు ఏమిటి అనిగానీ, ఆమెని అర్థంచేసుకోవాలన్న తపన, వాటిని అధిగమించి తాను సమపార్జించిన జ్ఞానం ద్వారా తన జీవితాన్ని చక్కదిద్దుకుందాం అన్న అవేశం కనిపించవు." అనే నిర్ధారణకి చాలా లాజికల్ గా వచ్చేసారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, "యవ్వనమొక ప్రాచీనశక్తి... నిశోధి తెరుచుకున్న ద్వారాలమధ్య ఆత్మహత్య చేసుకున్న యవ్వనపు శక్తి, సంస్కారాన్ని కోరదు... ఏ చదువు ఈ అస్థిపంజరపు నిర్మాణాన్ని మార్చగలదు? బుర్ర,మెదడు, యివి దాస్యానికి అంతరాయాలే." అన్న తాత్వికుడు దయానిధి. శారీరకశక్తులపైన ఒకస్థాయి పరిపూర్ణ అవగాహనా, వాటిని అధిగమించలేని బలీయమైన బలహీనతల్లో ఓలలాడిన ఇతడికి తల్లి "దుర్నడత"ను అర్థం చేసుకోవడం నిజంగా కష్టమా? తల్లి ప్రవర్తనని దయానిధి ఏనాడో అర్థం చేసుకున్నాడు. కానీ షేక్స్పియర్ హేమ్లెట్ లాగే ఆ అర్థాన్ని అంగీకరించే విఫలయత్నం (నవలలోని ‘చీకటి సమస్య’ ప్రకరణ దాని గురించే) చేస్తూవచ్చాడు. coming to terms with that reality through self realization is the effort. ఇక్కడ ఆ యత్నం ముఖ్యం. దాని ఫలితం కాదు.

విమర్శకురాలు ఈ విషయంలో ఒకడుగు ముందుకేసి, అమృతంలోని తల్లి సారూప్యతని చూసి దయానిధి అమృతానికి దగ్గరయ్యాడని, అమృతంతో "అనుభవం" కారణంగా తల్లి నడవడిక అర్థమయ్యిందని, తల్లికి పట్టిన దురవస్థే అమృతం కూతురికి పడుతుందన్న స్పృహకన్నా, అమృతం కూతురు తనదా కాదా అన్న ధ్యాసే ఎక్కువ అని తీర్మానించి (పుట 2) దయానిధిని నిజాయితీని పాఠకుడు శంకిస్తాడేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తూ విమర్శకురాలు దయానిధి నిజాయితీ మీద ప్రశ్నచిహ్నాన్ని ముద్రించేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనల్లోని అమృతం "ఆడతనాన్ని" విమర్శకురాలు గుర్తించలేకపోవడం.

అమృతం-దయానిధి కలయిక ప్రేమోద్రేకమే అయినా, పరిస్థితి అమృతం కల్పించింది అనేది కాదనలేని నిజం. ఆ కలయిన అమృతం తన సంసారాన్ని నిలబెట్టుకోవటానికి ఒక "అవసరం" అయినంత మాత్రానా, తనకు దయానిధి పట్ల ఉన్న ప్రేమ మలినమైపోదు. ప్రేమలేని దయానిధికి తన అపేక్షని అందించి, తన అవసరాన్ని పూర్తి చేసుకున్నంత మాత్రానా అమృతం స్వార్థపరురాలైపోదు. కానీ ఆ విషయాన్ని అంగీకరించడానికి మనకు మనసొప్పదు. స్త్రీపాత్రలకున్న సహజ అవసరాలు, కుటుంబం కోసం వాళ్ళు ఆడేనాటకాలూ బహిరంగంగా చర్చించాలంటే మనకు బెదురు. తేటతెల్లంగా కనిపించినా, కళ్ళు మూసుకుని "పవిత్రత జపం" చేస్తేనే మనకు ఆనందం.

నిజానికి ఈ కలయిక తరువాత ఎక్కువ గిల్ట్ ఫీలయ్యేది దయానిధి. అతని పూర్వపు భావాలూ,ఆదర్శాలూ,అభిప్రాయాలకీ ఈ నిజతత్వానికీ ఎంతటి బేధముందో తెలుసుకుని భయపడేది ఇతనే.తనకు నిజస్వరూపాన్ని చూపించి హాయిగా నిద్రపోతున్న అమృతానికి ముఖం చూపించలేక "పారిపోయేది" దయానిధే. వెళ్తూవెళ్తూ నిద్రపోతున్న అమృతాన్ని చూసి "అంత నిద్రపోవడానికి ఎంతటి నిర్మల హృదయమో! కడసారి పవిత్రంలో పవ్వళించిన అమృతం" అనుకోవడమూ దయానిధికే సాధ్యం. ఇక్కడ దయానిధి అమృతానికి అపవిత్రత,చెడుగు,దుర్నీతి ఆపాదించలేదు. అమృతం నిజరూపాన్ని (ఒక స్థాయిలో విశ్వరూపాన్ని) చూసిన కళ్ళతో "ఈ వ్యక్తుల్నీ, ఈ స్థలాన్నీ"చాడలేను అనుకుని వెళ్ళిపోతాడు. ఆ కలయికని అవినీతి అనుకోని దయానిధి నిజాయితీని పాఠకుడు ఎందుకు శంకించాలి? అమృతం అప్పటికీ పవిత్రమే అనుకునే దయానిధి మనసులో ఉన్న వికారమేమిటి? అది self realization అనుకోవాలా లేక self obsession అని విమర్శకురాలిలాగా తీర్మానించాలా?

దయానిధి-అమృతం కలయిక ఇక ఎత్తైతే,(తనకు పుట్టిందనుకుంటున్న) అమృతం కూతుర్ని చూడటానికి దయానిధి వెళ్తే అక్కడ అమృతం ప్రవర్తన మరొక ఎత్తు. దయానిధి ఇంట్లో, అత్తా-భర్తలు లేని సమయంలో, ఒంటరితనంలో దయానిధిపై అమితమైన అపేక్షను చూపిన అమృతం అక్కడ మచ్చుకైనా కనబడదు. బిడ్డద్వారా సంసారాన్ని సుస్థిరపరుచుకున్న గృహస్థురాలు కనిపిస్తుంది. దయానిధి చూసిన నిజరూప ఛాయలుకూడా అమృతంలో కానరావు. మరో కొత్త రూపంలో దర్శనమిస్తుంది. అమృతం ఇంటికి దొంగచాటుగా వెళ్తున్న దయానిధి పరిపరి విధాలుగా వారి "కలయిక" తరువాతి కలయికని ఊహించుకుంటాడు, ఆ కలయికలోని ప్రేమను కనీసం రహస్యంగానైనా వ్యక్తపరిచే అమృతాన్ని ఆశిస్తాడు. కానీ...ఈ అమృతం వేరు. ఆ అమృతం వేరు అని గ్రహిస్తాడు. తన జీవితం "బండి మలుపు" తిరిగిందని గుర్తిస్తాడు.

మరో ముఖ్యపాత్ర కోమలి గురించి విమర్శకురాలి ధృక్కోణానికీ అమృతం పట్లగల అవాజ్యనీయమైన అభిమానానికీ ఏదో బలవత్తరమైన కారణం ఉందనిపిస్తుంది. కోమలిని ప్రాగ్మాటిక్ అనీ, జాణ అనీ, లౌక్యం తెలిసిన స్త్రీ అని విమర్శకురాలు నవలమొత్తం ఆకళింపు చేసుకుని తేల్చేస్తారు. దయానిధికి కోమలిపట్లవున్న దైహికవాంచ, మానసిక ప్రేమని దయానిధి పాత్రలోని వైరుధ్యంగా తేల్చేస్తారు. ఇకడుగు ముందుకేసి, దయానిధి ధృక్పధం అన్ని స్త్రీపాత్రల పట్లా sexist అనే అర్థంవచ్చే విధంగా "అతని మనోవైజ్ఞానిక విశ్లేషణ ఒకచోటా శారీరకమైన "కళ్ళు" (పుట 2) మరొకచోటా ఉంటాయి" అని చెప్పి నవలలోవున్న (తను అనుకుంటున్న) అంగాంగవర్ణనల గురించి చెప్పారు.

కోమలి ఒక కుటుంబ స్త్రీ కాదు. తనది సామాజికంగా అమోదమైన పుట్టుకకూడా కాదు. కులగోత్రాలూ,చదువూసంస్కారాలూ లేవు. జీవితం ఒక గాలివాటు గమనం. ప్రపంచానికి నిమిత్తం లేని బ్రతుకు. అయినా దయానిధి ఆమెను వాంచించాడు. ఈ వాంఛకు కారణం తన యవ్వనం, కోమలి సౌందర్యం అని గ్రహించాడు. "ఇంద్రియాలు పీకేస్తున్నాయి. పల్చటి ఎముకలు చల్లటి మాంసం - వీటికి తన యవ్వనం దాస్యం చెయ్యక తప్పదు" అని తెలుసుకున్న తాత్వికుడు దయానిధి.ఆరంభ యవ్వనం నుంచీ ఫ్రౌఢయవ్వన పరిణామ దశవరకూ సౌందర్యశక్తులు ప్రబలంగా పనిచేస్తాయనే ఎరుక కలిగిన జ్ఞాని దయానిధి. కోమలి సౌందర్యం దయానిధిని చిత్రవర్ణ కిమ్మీరితం చేసింది. అందుకే "చదువు లేకపోతే చెప్పించొచ్చు, సంపర్కం వల్ల సంస్కారం తెప్పించొచ్చు, ఎట్లాపడితే అట్లా తయారు చేసుకోవచ్చు, కానీ సౌందర్యం ఎక్కడనుంచీ తేగలం..." అని ప్రశ్నిస్తాడు. "కోమలే కావాలి -ఇంకెవ్వరూ (తన యవ్వనానికి) పనికిరారు" అని నిర్ణయిస్తాడు. దైహిక వాంచలోని తాత్వికసిద్ధాంతాన్ని ఇంత చక్కగా చెప్పిన రచయిత తెలుగులో ఇంకెవరున్నారు? ఆ అనుభవాన్ని అందుకుని సిద్ధాంతీకరించిన పాత్రలెన్నున్నాయి?

కోమలిని కలవటానికి వెళ్ళిన దయానిధి "ఆకస్మికంగా ఆమెని ప్రేమించడం జరిగింది" అందుకే తిరిగొచ్చేశాను అనటంలో విమర్శకురాలికి అతని వైరుధ్యం కనిపించింది. కానీ అదొక సహజమైన పరిణామం అనే ఆలోచన రాకపోవడం విచారకరం. దయానిధి ఆ పరిణామానికి తనదైన కారణంకూడా చెబుతాడుకూడా. "(మనిషి) వాంఛించిన వస్తువుల్ని ఎప్పూడూ ప్రేమించలేడు. వాంఛించడం అంటే అనుభవించడం, అనుభవించడంవల్ల వస్తువు నశిస్తుంది. నశింపు కాకుండా చేసేదే నిజమైన ప్రేమ అనుకుంటాను" అని సిద్ధాంతీకరిస్తాడు. అంతటితో ఆగక "నాకు చంద్రుడూ, నక్షత్రాలూ, మేఘాలూ, హిమాలయా పర్వత శిఖరం, కోమలీ అందరూ సమానులే. ఇవి లేకపోతే నే జీవించలేను. వీటిని వాంఛించను. ప్రేమిస్తాను." అని కోమలికి తన జీవితంలోని ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఇంతకన్నా ఉత్తమమైన ప్రేమ,స్వార్థరహితమైన ప్రేమ ఉంటుందా? అంతకన్నా గౌరవం "సౌందర్యానికి" లభిస్తుందా? ఇందులో వైరుధ్యంకన్నా ఒక సిద్ధాంత పరిణామం కనిపిస్తుంది. ఒక తాత్వికుడి భావప్రగతి కనిపిస్తుంది.

ఇక కోమలి గురించి. కోమలి కుటుంబ స్త్రీ కాదు కాబట్టి జాణతనాన్నీ, లౌక్యాన్నీ తేలిగ్గా అంటగట్టచ్చు. ఎవరెవరితో తిరిగిందో, ఎంత మందిని డబ్బడిగిందో, ఎంత మందితో తన అవసరాలు తీర్చుకుందో లెక్కగట్టచ్చు. కానీ కోమలి లోని ఉనికే అర్థంకాని ముగ్ధను, అమాయకత్వాన్ని చూసిన దయానిధి నిజాయితీ మీద మాత్రం విమర్శకురాలికి అనుమానమే. అమృతం అవసరం కుటుంబం కోసం కాబట్టి "పవిత్రం". కోమలి అవసరం తనకోసం కాబట్టి ప్రాగ్మటిజం. ఈ వైరుధ్యం ఎవరిది. నటనకు పట్టంగట్టే మన నైతికతదా? పరిస్థితుల ప్రభావంలో జీవితాల్ని తమదైన విధంగా నిర్దేశించుకున్న ఈ ఇద్దరు మహిళలదా. ఐతే ఇద్దరూ జాణలే. లేకపోతే ఇద్దరూ పవిత్రమైనవారే. రెండూ కాకుండా ఏ జడ్జిమెంటూ లేకుండా ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించే, తాత్వికతను ప్రేరేపించే పాత్రలే. నా ఆప్షన్ మూడోది. ఇక పాఠకుల ఆప్షన్ వారి సంస్కారాన్ని బట్టి వారిది. విమర్శకురాలి కోణం మాత్రం ఇప్పటికీ (నాకు) అభ్యంతరకరమే.

ఒక విధంగా చూస్తే దయానిధి గమ్యం ఎప్పుడూ కోమలే. అయితే, ఆ గమ్యాన్ని చేరడానికి మరిన్ని అనుభవాలు అవసరమై జీవితాన్ని అలాఅలా గడిపాడు.దయానిధి గమ్యం తన తాత్విక చింతనద్వారా ప్రత్యామ్న్యాయ జీవన సిద్ధాంతాల్ని (తనకోసం) తెలుసుకోవడం. అలాంటప్పుడు "కోమలి అసలు స్త్రీయేకాదు. అన్ని శక్తుల్నీ తనలో కలుపుకుని దహించేసే ఒక జ్వాల. సంప్రదాయాలూ, ఆచారాలూ, నైతిక విలువలూ,కట్టుబాట్లు - అన్నింటినీ ముంచెత్తివేసే మహాసముద్రంలోని అఘాతం" అని గ్రహించిన మరుక్షణం తనను అందిపుచ్చుకోవలసింది. ఉన్న జీవన విలువల్ని కాల్చి-ముంచితేగానీ కొత్త సిద్ధాంతం పుట్టదుకదా! కానీ ఆ అద్వితీయ తీరానికి అప్పుడే చేరే ధైర్యాన్ని ప్రోది చేసుకోలేకపోయాడు. పారిపోయాడు. అనుభవాల్ని వెతుక్కున్నాడు. ఆనందాన్ని శోధించాడు. చివరకు కోమలి రాకతో, అప్పటివరకూ సంపాదించుకున్న అనుభవంతో సిద్ధాంతాన్ని స్థిరీకరించుకుంటాడు. అందుకే నవల అక్కడే అంతమవుతుంది.

మరణంతోనే జీవితానికి ముగింపు.కానీ దయానిధి శోధన "చివరకు మిగిలేది"ఏమిటో తెలుసుకోవడం. అది తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న "సత్యం"తో ఎవరైనా విభేధించొచ్చు. కానీ తన తత్వచింతన, దానికోసమై తను చేసిన యత్నాన్ని నిరర్థకం అని తీర్మానించడం సబబు కాదు.కాబట్టి నవల తన సిద్ధాంతంతో కాకుండా తన మరణంతో మరణంతో అంతమవ్వాలన్న ప్రతిపాదన అర్థరహితం (పుట 4). కోమలి గమ్యం కూడా దయానిధే. అందుకే తిరిగొచ్చిన తరువాత "నేనప్పుడు పుట్టలా. నాకు తెలీకుండా అవన్నీ జరిగాయి. ఇప్పుడన్నీ తెలుసు నాకు. మీదగ్గరే ఉండనియ్యండి...లేకపోతే చచ్చిపోతాను!" అంటుంది. దయానిధికి, కోమలి " సంపూర్ణంగా ఏర్పడలేదని" ఎప్పుడో తెలుసు. ఈ చేతులు మారిన ప్రయాణంలో పూర్ణత్వాన్ని సంతరించుకుని తిరిగొచ్చింది. తమతమ అనుభవాలు పరిపూర్ణం చేసిన రెండు జీవితాలు ఒకదానికొకటి గమ్యమై వీరి కలయిక జరిగింది. అందుకే కులస్త్రీ అయిన అమృతాన్ని త్రోసిరాజని కోమలి ఈ నవలానాయిక అయ్యింది.

విమర్శకురాలు దయానిధి మీద వేసిన మరో అపవాదు "తనచుట్టూ వున్న అమ్మాయిలందరూ తనకొసం తపించిపోతున్నారని, తనపై ఉచ్చులు పన్నుతున్నారనీ మురిసిపోతూ రోజులు గడపటం" (పుట 3). నవలలోని ‘అనుభవానికి హద్దులు లేవు’ ప్రకరణ మొత్తంగా ఈ ఆకర్షణ,వికర్షణ,ప్రకర్షణలదే. ఇందులో దయానిధి మురిసిపాటుకన్నా, స్త్రీత్వంలోని మార్మికతను అర్థంచేసుకునే ప్రయత్నం కనిపించకపోవడం శోచనీయం. యవ్వనాకర్షణలోని స్వేచ్చననుభవిస్తున్న స్త్రీపాత్రల మధ్యనున్న సౌందర్యాస్వాదకుడైన యువకుడు ఆ స్త్రీల స్త్రీత్వాన్ని గురించి అర్థం చేసుకునే ఆలోచన చేస్తే అది సత్యాన్వేషణ కాదా? ఉన్న ఒక్కమగాడినీ తమవైపు తిప్పుకోవాలనే అసంకల్పిత ఆలోచన అక్కడున్న కోమలి,సుశీల,నాగమణి,అమృతం తమదైన విధంగా చెయ్యటం అత్యంత సహజపరిణామం. కాలేజీ టుర్లలో, కార్పొరేట్ ఆఫీసుల్లో ఇది కొత్తకాదే! ఒకమగాడు పదిమంది ఆడవాళ్ళ మధ్యనున్నా అదే జరుగుతుంది. ఒక స్త్రీ పదిమంది స్నేహపూరితమైన మగాళ్ళమధ్య ఉన్నా ఈ ప్రయత్నాలు తప్పవు. వాటి ఉద్దేశం "అనుభవించడం" కానఖ్ఖరలేదు. కానీ ఆకర్షించడం వరకూ అసంకల్పితంగా జరిగేదే.

మూల ఉద్దేశాల్ని గాలికొదిలి, ఆపాదనల మధ్య తీవ్రమైన ప్రతిపాదనలు చేసిన ఈ వ్యాసం యొక్క నిబద్ధత శంకించదగినదిగా అనిపించింది. దయానిధిలోని తాత్విక చింతనని మగవారిలోని సంకుచిత భావనలు అని నిర్ణయించి, విమర్శకురాలు చేసిన వ్యాఖ్య All men are bastards అనే (ఇక్కడా మరో స్త్రీని అవమానిస్తున్నామన్న స్పృహకూడా లేని) పిడివాదస్త్రీవాదుల భావజాలానికి అతిదగ్గరగా అనిపించింది. ఈ పునరావలోకనం ఎప్పుడు చేశారో తెలీదు. కానీ ఈ పునరావలోకనం మీద ఒక పునరాలోచనమాత్రం అత్యంత అవసరం అని నా నమ్మకం.

*****

13 comments:

రమణ said...

చాలా చక్కగా విశ్లేషించారు మహేష్ గారు. మాలతి గారి వ్యాసం చదివాను. చాలా చోట్ల ఆమె అభిప్రాయాలతో విభేదించాను. ఎవరి అభిప్రాయాలు వారివి.
దయానిధి ప్రతి ఒక్కరినీ విశ్లేషిస్తూ పోతూ , జీవితంలో ఏమీ సాధించలేకపోయాడు అనుకోకూడదు. తనలో ఉన్న లోపాలను కోమలి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న స్త్రీ గా, అందించిన ప్రేమతో అధిగమిస్తాడు. చివరికి తన చుట్టూ ఉన్న వారిని, సమాజాన్ని అందరినీ అంగీకరిస్తాడు. ఇక అక్కడ నుంచి అతని జీవితం పూలబాటే అనుకోవాలి.

Anonymous said...

‘చివరకు మిగిలేది’ PDF లింక్ కూడా వుంటే షేర్ చేసుకోండి ప్లీజ్.

Kathi Mahesh Kumar said...

@a2zdreams: ఈ నవల pdf ఎక్కడా లభ్యతలో లేదు. కాకపోతే విరివిగా ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. ప్రస్తుతం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి కాపీ వందరూపాయలకే లభిస్తుంది.దయచేసి కొని చదవండి. లేకపోతే కనీసం ఎవరోఒకరి దగ్గర తీసుకుని చదవండి.

సుజాత వేల్పూరి said...

మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది! ఒక్క పాయింట్ కూడా వదలకుండా రాశారు.నాకు నచ్చింది.

కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచిద్దాం! మీరు ఈ నవల మీ జీవితం మీద అంతో ఇంతో ప్రభావం చూపిందని భావిస్తున్నారు కాబట్టి నవల్లో కనపడే తాత్విక చింతనని ఇష్టపడ్డారు. అమృతం తో అనుభవం తరవాత పిరికి వాడిలా పారిపోయే దయానిధిని కూడా సమర్థించ గలిగారు.

ఇంతకు ముందెక్కడో (నేనే అభిప్రాయపడ్డానో, ఇంకెవరన్నా రాస్తే అవుననుకున్నానో మరి) చదివినట్లు ఒక నవలను అందరు పాఠకులూ ఒకేలా ఎందుకు అర్థం చేసుకోవాలి?

తల్లి ప్రవర్తన గురించి నవల్లో ఎక్కడా స్పష్టంగా ఉండదు. మార్మికంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో దయానిధి తల్లి ప్రవర్తనను లోకులు చెప్పిన మాటల వల్లే కానీ మరే విధంగానూ అర్థం చేసుకోడానికి అవకాశం లేదు. తల్లి ప్రవర్తనను దయానిధి ఏనాడో అర్థం చేసుకున్నా, ఆ అర్థాన్ని అంగీకరించే విఫల ప్రయత్నం చేస్తూ వచ్చాడన్న మీ వాదనను బలపరిచే విధంగా నవల్లో చిత్రీకరణ ఉండదు! అలాంటపుడు ఒక్కోపాఠకుడూ ఈ విషయాన్ని ఒక్కోరకంగా అర్థం చేసుకోడానికి అవకాశం ఉంటుందిగా!

అమృతం పాత్రని మీరు బాగా అర్థం చేసుకున్నారు.

మాలతి గారు తన కోణంలో, తను అర్థం చేసుకున్న కోణంలో నవలను విశ్లేషించారు గానీ మరీ మీరన్నట్లు all men are bastards అన్న స్థాయిలో మాత్రం పిడివాదం చేశారని అనిపిస్తోందంటారా? దయానిధి పాత్ర ప్రవర్తన కొన్ని సార్లు అనుమానాలకు దారి తీసే విధంగా ఉండదా ఈ నవల్లో! మీరు దయానిధిని "దయానిధిగా" అంగీకరించారు కాబట్టి సమస్య లేదు. అంగీకరించకపోతేనో?

Kathi Mahesh Kumar said...

@సుజాత:నవల మూల ఆశయం జీవితం మీద ఒక తాత్విక చింతనను పరిచయం చేసి ఒకసిద్ధాంతాన్ని ప్రతిపాదించడం. అంతేతప్ప సామాజిక విలువలపై ప్రత్యేకమైన జడ్జిమెంటుని కాదు.

భూమిక తాత్వికతది అయినప్పుడు, ‘నేను కేవలం భౌతిక చర్యల ఆధారంగా దయానిధి జీవితాన్ని నిర్ణయిస్తాను. తన విలువల్ని,సాధనను బేరీజు చేస్తాను’ అని ఒక పాఠకుడు అంటే అది పాఠకుడి హక్కు. కానీ విమర్శకుడికి/రాలికి ఆ హక్కు లేదు. ఎందుకంటే,వ్యాసంలో నేను చెప్పినట్లు critic's job is to "to see the work in itself, as IT IS". ఇక్కడ మాలతి గారు చాలా liberty తీసుకుని నిర్ణయాలు చేశారు. నాకు సమస్య అక్కడే మొదలయ్యింది.

నవలలోని మార్మికత వలన పాఠకులతో అభిప్రాయ బేధాలొస్తే ధృక్కోణాలలోనే మార్పుంటుంది. కానీ ఎలా చూడాలో చెప్పాల్సిన విమర్శకులే రంగుటద్దాలిస్తే ఎలా?

దయానిధి షేక్స్పియర్ హేమ్లెట్ మీద రాయదలుచుకున్న వ్యాసం మొత్తం తన తల్లి ప్రవర్తనని అంగీకరించడానికి చేసే ప్రయత్నమే. ఆ హేమ్లెట్ వ్యాసం హఠాత్తుగా అన్నిపేజీల ప్రాముఖ్యత నవల్లో ఎందుకు సంతరించుకుందనుకుంటున్నారు? మరోసారి ఆ భాగం జాగ్రత్తగా చదివి చూడండి. Hamlet is Dayanidhi.His attempt to come to terms with the reality.

మాలతి గారు "మగవారి మనోభావాలు ఇంత సంకుచితంగా తమ పరిధిలోనే ఉంటాయా?" అన్న ప్రశ్నతో మొత్తం నవల ఔచిత్యాన్ని దయానిధి పాత్ర తాత్విక చింతనని ప్రశ్నార్థకం చేశారు. అదీ ముఖ్యంగా దయానిధి జీవితంలో ఉన్న స్త్రీలపట్ల తన భౌతిక చర్యల ఆధారంగా. ఆ చర్యల వెనుకనున్న "ఆలోచనని, తత్వాన్నీ" పరిగణలోకి తీసుకోకుండా. ఇలా మూల ఉద్దేశాల్ని వక్రీకరించి హ్రస్వదృష్టితో చేసిన sweeping generalisation అభ్యంతరకరం. అందుకే "పిడివాదస్త్రీవాదుల భావజాలానికి అతిదగ్గరగా అనిపించింది" అన్నాను.She has come very close to being a rogue feminist rhetoric for sure in this instance.

Bolloju Baba said...

చర్చంతా ఏక పక్షంగానే జరుగుతుంది. :-))

బహుసా కామెంటటానికి ఎవరైనా నవలను మరలా చదువుతున్నారేమో.

hoping to see more angles.

bollojubaba

భావన said...

చాలా బాగుంది మహేష్ మీ విశ్లేషణ... కాని సుజాత గారన్నట్లు గా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కన్ను తో చూస్తారు కదా.. మీకు ఆ విమర్శ లో లోపాలు కనపడినంత మాత్రాన "All men are bastards అనే పిడివాద స్త్రీవాదుల భావజాలం ఆమెది" అని ఒక్కసారి గా మీరు అలానే ముద్ర వేసేసేరు కదా.. As a critic మీరైనా అలా ముద్ర వెయ్యటం......?
ఏది ఏమైనా మీ అందరి అభిప్రాయాలు చదువుతుంటే urgent గా ఆ పుస్తకం వెతికి మళ్ళొ సారి చదవాలనిపిస్తోంది..

Kathi Mahesh Kumar said...

@భావన: నిజమే. వంద మంది పాఠకులకు ఈ నవల వందరకాలుగా అర్థం కావచ్చు. వంద ధృక్కోణాలకు అవకాశం ఉంది. కానీ "విమర్శకులకు" ఆ luxury లేదని గమనించాలి. ఒకవేళ విమర్శకుడు/రాలు నవలను వ్యక్తిగతం చేసి నిర్ణయాలు చేస్తే, that is open to questioning అనేది సాధారణంగా జరిగేదే.

ఎంత personalize చేసినా,(తెలిసీ) నవల మూల భావనల్నే విస్మరిస్తే అది విమర్శన అవదు.ఒక biased opinion అవుతుంది.విమర్శకులున్నది ఆ అపోహాపూరితమైన అభిప్రాయాన్ని చెప్పడానికి కాదు.As guardians of literature,they have a higher role to play.

నా వ్యాసంలోగానీ వ్యాఖ్యలోగానీ మాలతి గారిది పిడివాద స్త్రీభావజాలం అని అభియోగం మోపలేదు. ఈ నవల మీద వారు ప్రకటించిన కొన్ని నిర్ణయాలు ఆ భావజాలానికి అతిదగ్గరగా ఉన్నాయి అన్నాను. She sounded that way while judging parts of this novel. కాబట్టి నా వ్యాఖ్య వారి జడ్జిమెంటు మీదేతప్ప వారి మీద కాదు.

మరో మాట. నేను విమర్శకుడ్ని కాదండోయ్! పాఠకుడ్ని. మహా అయితే పాఠకవిమర్శకుడ్ని. A reader critic.

@బొల్లోజుబాబా: బాబాగారూ,ఏకపక్షమేమిటండీ బాబూ. నేను చెప్పిందే మరో పక్షం. మాలతిగారు ఆల్రెడీ ఒక పక్షం తీసుకున్నట్లే లెక్క. ఈ చర్చ వలన కొందరు మళ్ళీ నవల చదువుతుంటే, మరికొందరు కొత్తగా చదువే ఆలోచన చేస్తున్నట్లున్నారు. కాబట్టి నవలకు మాత్రం మంచిదే.

భావన said...

మీరు వ్యక్తిగతం గా అమె ను అన్నారు అనలేదు మహేష్... ఆమె Judgment ను మీరు విశ్లేషిస్తూ ఆమె వ్యాఖ్య కు ఒక బావజాలానికి దగ్గరి సామీప్యత ఆపాదించారని అన్నాను, మీరు ఒప్పుకోక పోయిన మేము మీకు క్రిటిక్ అనే బిరుదు ఇచ్చేసేము.. కాదంటే ఒప్పుకోరు.. :-)

సుజాత వేల్పూరి said...

నాకు ఒకటి చెప్పండి! విమర్శకులకు దాటకూడని హద్దులు, పాటించాల్సిన సూత్రాలూ, గీసుకోవలసిన గిరులూ ఉన్నాయా? 'మీరు మీ సొంత అభిప్రాయాలు ఇక్కడ చెప్పడానికి లేదు. ఈ పరిధుల్లోనే విమర్శించాలి.నవలను తులనాత్మకంగా పరిశీలించి తీరాల్సిందే" అని ఎవరు నిర్ణయిస్తారు? విమర్శకులకుండాలిసిన లక్షణాలేమిటి? వారికి స్వేచ్ఛ ఉందా లేదా? చెప్పాలనుకున్నది చెప్పలేనప్పుడు అసలా పుస్తకం జోలికి పోయి రాయడం దేనికంటారు?

విమర్శకుల పరిధులేమిటి?

Kathi Mahesh Kumar said...

@సుజాత: చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు.సాహిత్యంలోగానీ మరే ఇతర విభాగంలోగానీ ‘విమర్శన’ కుండాల్సిన ప్రాముఖ్యత,బాధ్యత,పరిధులు,ఉద్దేశాలు,లక్షణాల గురించి కనీసమాత్రంగా తెలుసుకోవాలంటే/చెప్పాలంటే అధమం ఒక నలభై లెక్చర్లు(దాదాపు ఒక సెమిస్టర్లో సబ్జెక్టు క్లాసులన్ని)కావాలి. నేను మీకు ఓ రెండు పేరాల్లో స్థూలంగా వివరించడానికి ప్రయత్నిస్తాను.

సాహిత్యసృజన విమర్శనకన్నా ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే. ఎందుకంటే, తులనకన్నా సృష్టి ఉన్నతం కాబట్టి. అది ఎలాంటిదైనా సరే సృష్టి సృష్టే!

సృజనాత్మకత వర్డ్స్ వర్త్ చెప్పినట్లు "emotions recollected in tranquility". కాబట్టి అక్కడ తర్కానికీ,తులనకూ స్థానం లేదు. మనిషీ ప్రకృతీ ఒక బలవత్తరమైన స్థాయిలో సంగమించి సాహితీసృజనకు ప్రాణంపోస్తాయి.

అలా సృష్టించబడిన సాహిత్యంలో తర్కాన్ని,తులలను ప్రవేశపెట్టి సామాజిక ప్రయోజనాన్నీ గుర్తించి ఆ ఆలోచనల్ని పాఠకులదగ్గరికి తీసుకొచ్చేవాడే విమర్శకుడు. అంటే తమ విశ్లేషణతో సృజనాత్మకతలోని నిగారింపుని గుర్తించే పరీక్షకుడు విమర్శకుడు.అంతటి బృహత్తర కార్యాన్ని భుజాన వేసుకున్న విమర్శకుడికి బాధ్యత,నిబద్ధత చాలా అవసరం.

వ్యక్తిగత అభిప్రాయాలకన్నా సామాజిక ప్రయోజనాన్ని ముందుంచాలి. ఉత్తమమైన ఆలోచనల గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వాలి.ముఖ్యంగా రచనను రచనగా చూడాలి.

విమర్శకుడి బాధ్యత "to make the best ideas prevail. New ideas reach society.The touch of truth is the touch of life, and there is a stir and growth everywhere; out of this stir and growth come the creative epochs of literature." ఆ ఉత్తమమైన ఆలోచనల వ్యాప్తిద్వారా మరింత సాహితీసృజన జరిగే అవకాశాల్ని మెరుగు పర్చడం.

విమర్శకుడికి అనుకున్నది చెప్పే అధికారంకన్నా, రచన ఆదర్శాన్ని అర్థంచేసుకుని విశ్లేషించడం ముఖ్యం. తన అనుకోలుకు తగ్గ ఆధారాలు చూపుతూ పాఠకుడికి రచనను పరిచయం చేస, దాని "విలువను" తెలపడం ముఖ్యం. ఆ రచన ఒక విఘాతమైతే దాని గురించి ‘వార్న్’చెయ్యడం ముఖ్యం.

ఈ మూలభావనలకు విఘాతంకలిగేలా విమర్శనం చేస్తే అది కేవలం "విమర్శ" అవుతుంది.నింద అవుతుంది. అది చాలా మంది mediocre విమర్శకులు చేస్తారు. ఈ వ్యాసంలోని కొన్ని భాగాలు ఆ కోవకు చెందుతాయని నా అభిప్రాయం.

పాఠకవిమర్శకుడికి మీరు చెప్పిన ఛాయ్స్ అన్నీ ఉన్నాయి. కానీ విమర్శకులు అని సాహిత్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నవాళ్ళు "కేవలం భాధ్యతాయుతంగానే" రాయాలి.

మాలతి said...

హమ్మయ్య. ఇప్పటికి తెలిసింది సూచనప్రాయంగానైనా నాతప్పేమిటో.
ఇందుమూలంగా మహేష్ గారికీ, సకలజనులకూ తెలియజేసుకుంటున్నాను. నేను 40 కాదు కదా నాలుగయినా కోర్సులు తీసుకోలేదు. నేను విమర్శకురాలినని అని ఏనాడూ ప్రకటించుకోనూ లేదు. వీలయినప్పుడల్లా నాది సగటు తెలివే అని కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. (మరీ మీడియోకర్ అంటే బాగులేదండీ. :p)
నాకు లేని టైటిలు అంటగట్టి, అది ఆధారంగా నాఅభిప్రాయాలని ఖండించడం మహేష్ గారికే తగును. వారే అథారిటీ.
సార్, మహేష్ కుమార్, పైన మీరు రాసిందంతా చదివే ఓపికా, తెలివీ నాకు లేవు. అందుచేత,మీరే పండితులని నిశ్శంకగా ఒప్పేసుకుంటున్నాను.

Kathi Mahesh Kumar said...

@మాలతి గారు: విమర్శకులు కోర్సులు తీసుకుని విమర్కులవ్వరు.సాహిత్య పాఠాలతోపాటూ యూనివర్సిటీల్లో సాహితీ విమర్శ ఎలా ఉండాలో మాత్రం కొందరు తెలుసుకుంటారు.

అందరు విమర్శకులూ అయాచితంగా విమర్శనంలోకి వచ్చినవాళ్ళే. ముఖ్యంగా మీలాంటి రచయితలు ఎంతకాదన్నా ప్రొఫెషనల్ విమర్శకులే. అది మీ శైలి,విధానాన్నిబట్టే చెప్పెయ్యొచ్చు. లేకపోతే మీరు పరిశోధనలాగా వ్యాసం మొదట్లో నవల చరిత్ర చివర్లో రెఫరెన్సులూ పెట్టరు. కాబట్టి "సగటు తెలివి" అని మమ్మల్ని తప్పుద్రోవ పట్టించకండి.

మీ వ్యాసంలోని కొన్ని భాగాలు నాకు మీడియోకర్ గా అనిపించాయి. అంతేతప్ప మీరు మీడియోకర్ విమర్శకురాలు అని కాదు. మీరు రాసిన తెలుగు రచయిత్రుల చరిత్ర one of the best అని ఎవరైనా ఒప్పుకోవలసిందే. కానీ చివరకు మిగిలేది విషయంలో కొన్ని personal bias లుపెట్టుకుని మీ వ్యాసంలోని కొన్ని భాగాల్ని మీడియోకర్ చేశారు. అంతే.