Friday, August 8, 2008

భయం, అజ్ఞానం, చైతన్యం తో మాటామంతి.

ఈ మధ్య బ్లాగుల్లో మైనారిటీ- మెజారిటీ మతాల ఘర్షణల మీద , సెక్యులరిజం -సూడోసెక్యులరిజం పంధాల మీదా చాలాచాలా ‘హాట్’ చర్చలు జరుగుతూ ఉన్నాయి. "వాటి గురించి స్పందించడంకన్నా, ఊరకుండటం మంచిది" అని నా మిత్రుడు ఒక సలహా ఇచ్చారు కూడా. కానీ, ఎందుకో నా మనసే ఊరుకోక స్పందించేస్తూ ఉంటుంది.



అప్పుడప్పుడూ "ఇంత చదువుకున్నవారై ఉండీ, ఇంత సంస్కారవంతులై ఉండీ ఎందుకీ "అతివాదం" చేస్తూ ఉంటారా?" అని పిస్తుంది. కానీ మళ్ళీ, "వారిదీ ఒక దృక్కోణమే కదా, దాంట్లో తప్పేముందీ" అనిపిస్తుంది. అందుకే, నేను వారితో చేసే ప్రతివాదనలకు ఒక అవసరమైన ప్రాతిపదిక ఉంది అని నిర్ణయించుకున్నాను. వారి దృక్కోణాన్ని వారు కసిగా చెప్పిన తరువాత, మితవాదులందరూ నిశ్శబ్ధంగా ఉండిపోతే, వారు "తాము చెప్పిందే సత్యమనే అపోహలో ఉండిపోరూ!" . అందుకే వారికి ప్రత్యామ్నాయ వాదనలు తెలియాలి. వారు మనతో అంగీకరించకపోయినా, కనీసం చదివేవారు విభిన్నదృక్కోణాల నుంచీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం కలగాలి అనే ఒక చిన్న కోరిక వలన ఈ సాహసం చేసేస్తూఉంటానంతే. ఇప్పట్లో నా పంధా మారదేమో. క్షమించాలి మిత్రమా!



రెండు సంవత్సరాల క్రితం మతఘర్షణల గురించి ఎక్కడో ఒక మంచి సంవాదం చదివాను. Fear, Ignorance and Conscience మధ్య జరిగే సంభాషణలాగా చెప్పబడిన భారతీయ సెక్యులర్ దృక్పధం నాకు తెగ నచ్చింది. ఇప్పుడది పూర్తిగా గుర్తులేదు. కానీ, ఆ సంవాదం యొక్క సారం గుర్తుంది. దాన్నే నాకు గుర్తున్నంతవరకూ ఇక్కడ భయం, అజ్ఞానం, చైతన్యం మధ్య జరిగే సంభాషణలాగా ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను.



భయం: ఇప్పటికే చాలా ఆలస్యం చేసాం. అర్జంటుగా పాకిస్థాన్ మీద దాడిచేసి వార్ని అణిచెయ్యాలి.
అజ్ఞానం: నిజమే, ఈ సమస్యలన్నిటికీ పాకిస్థానే కారణం.
భయం: కాశ్మీర్ మనదే, అది మదేకావాలి.
అజ్ఞానం: పాకిస్థాన్ మాటిమాటికీ కాశ్మీర్ ముస్లింలకు మద్దత్తెందుకు ప్రకటిస్తూ ఉంటుంది?
భయం: మైనారిటీలైన ముస్లింలు భారతదేశంలో ప్రశాంతంగా ఉండలేరని వాళ్ళ నమ్మకం అంతే.
అజ్ఞానం:కానీ, మిగతా మైనారిటీలు ప్రశాంతంగానే ఉన్నారుగా?
భయం: నిజమే, ఈ ముస్లింలతోనే ఎప్పుడూ తంటా. ప్రపంచం మొత్తం ఎక్కడ తీవ్రవాదం తలెత్తినా అక్కడ ముస్లింలే కనిపిస్తారు.
చైతన్యం: అంత తేలిగ్గా ఈ పరిణామాల్ని నిర్వచించొచ్చా? గుజరాత్ నే చూడండి. ముస్లింలు 50 మంది హిందువులను సజీవదహనం చేస్తే, హిందువులు కొన్ని వేలమంచి ముస్లింలను చంపడంతోపాటూ, కొన్ని వందల సజీవ దహనాలూ, మానభంగాలూ చెయ్యలేదా! మరి దాని నేమందాం?
అజ్ఞానం & భయం: ఇలా మాట్లాడుతున్నావంటే, నువ్వు ఖచ్చితంగా సెక్యులరిస్టువో లేక సూడోసెక్యులరిస్టువో అన్నమాట!



చైతన్యం:నేను ఎవరన్నది అప్రస్తుతం. నేను చెప్పేది మాత్రం ఎక్కడ హత్య జరిగినా హత్యే, ఎక్కడ అత్యాచారం జరిగినా అత్యాచారమే, ఎక్కడ తీవ్రవాదం తలెత్తినా తీవ్రవాదమని మాత్రమే.
భయం:అన్నీ సమానమెలా అవుతాయి? కాశ్మీర్ లోని ముస్లింలకు దేశ భక్తి లేదు. పాకిస్తాన్ వాళ్ళకు శిక్షణనిచ్చి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది.
చైతన్యం:మరి హిందూ టెర్రరిస్టుల సంగతో! గుజరాత్ లో వారికి శిక్షణఎవరిచ్చారో తెలుసుకోనవసరం లేదా?
అజ్ఞానం:హేయ్! ఒక్క నిమిషం ఆగు. గుజరాత్, కాశ్మీర్ రెండు వేర్వేరు విషయాలు కదా! కాశ్మీర్లో వేరే దేశం జోక్యం ఉంది. గుజరాత్ లో అలాక్కాదు కదా ?
చైతన్యం:అంటే నీ ఉద్దేశం కాశ్మీర్ లో సాధారణ ప్రజలు అనుభవించే టెర్రరిజానికీ, గుజరాత్ లో సాధారణ ప్రజలు అనుభవించిన టెర్రరిజానికీ తేడా ఉందంటావ్?
అజ్ఞానం:సాధారణ ప్రజల అనుభవం విషయంలో తేడా లేదు. కానీ, కాశ్మీర్ భారతదేశ రక్షణకు సంబంధించిన విషయం కదా!
చైతన్యం: టెర్రరిజానికి ‘దేశ రక్షణ’ కొలమానమన్నమాట. టెర్రరిజం లెక్కలో గుజరాత్ లో చంపిన ముస్లింలూ, 1984 లో చంపిన సిక్కులూ రారన్నమాట?.
భయం:అలా అంటే ఎలాగా? 1984లో కూడా మైనారిటీలే ఈ హింస మొదలెట్టారు. వారు హిందూ మెజారిటీ అయిన భారతదేశంలో ‘సరిగ్గా బ్రతకడం నేర్చుకోవాలి’.
చైతన్యం:అంటే నీ ఉద్దేశం మెజారిటీగా ఉన్న హిందువులు శాంతి కాముకులూ, కేవలం మైనారిటీలు బ్రతనేర్వలేక ఇలాంటి గొడవలకి పాల్పడుతున్నారనేగా! మరి హిందువులు వారి మతంలోని మహిళల్ని, కులం పేరుతో కొన్ని కోట్లమంది దళితుల్నీ హింసించడం లేదంటారా?
అజ్ఞానం:దీనికి నేనొప్పుకోలేను. ఎందుకంటే మీరు చెప్పిన సమస్యలన్నీ మైనారిటీలలోనూ ఉన్నవే. కేవలం హిందువులలోనే అంటే అంగీకారాత్మకం కాదు.
భయం:భారతదేశం ఒక హిందూ దేశం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మాది. తరతరాల నుంచీ సంస్కృతిని రక్షించుకుంటూ వచ్చిన జాతి మాది. ముస్లిం, క్రైస్తవం,సిక్కుల వంటి మైనారిటీలతో పోల్చకూడదు.
చైతన్యం:మరి ఇంత ఘన చరిత్ర ఉన్న హిందూ మతానికి ఇంత ఉలుకెందుకు? మతానికి అంత శక్తుంటే నిజంగా ప్రజలు దానికి దూరమవుతారా?
భయం:కానీ..కానీ..ఇక్కడే ఈ ముస్లిం, క్రైస్తవ మత గురువులు రెచ్చిపోతున్నారు.ఏమీ తెలియని సామాన్య జనుల్ని మభ్యపెట్టి వాళ్ళ మతంలో కలుపుకుంటున్నారు.
చైతన్యం:కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలొ ఉన్న హిందూ మతం తన జనబాహుళ్యంలో తన నమ్మకాల్నీ, విలువల్నీ ప్రతిష్టించలేకపోయిందా? ఇంత మంది హిందూ మతం గొప్పతనాన్ని తెలీని జనాలు ఎలా మిగిలిపోయారు? వేరే మతాన్ని అంత సులువుగా నమ్మే విధంగా ఎలా తయారయ్యారు?



అజ్ఞానం:బహుశా, ఈ మతాలవారు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారనుకుంటా!
భయం:అవునవును! నిజమే అయ్యుండాలి. లేకపోతే ఇంతమంది ఎలా మారిపోతారు?
చైతన్యం:సరే. వారు బలవంతంగానే మతమార్పిడి చేస్తున్నారనుకుందాం. కానీ, అమాయకులైన పౌరుల్ని చంపడం దానికి సమాధానమా?
అజ్ఞానం:అంటే అది తప్పే అయినా తప్పనిసరి పని. అమెరికా ముస్లిం టెర్రరిజాన్ని రూపుమాపడానికి ఆఫ్ఘనిస్తాన్ లో అమాయకుల్ని చంపక తప్పడం లేదుకదా! ఇదీ అంతే.
చైతన్యం:అంటే దేశ రక్షణ పేరుతోనో, హిందూ ధర్మాన్ని కాపాడే పేరుతోనో మనుషుల్ని చంపితే తప్పులేదన్నమాట?
భయం:నిజమే కదా! ఇలా సమస్యల్ని సృష్టించేవారిని చంపకపోతే, వారు ద్విగుణీకృతమై ఇంకా సమస్యల్ని సృష్టిస్తారు.
చైతన్యం:పెరుగుతున్న మతకల్లోలాల సంస్కృతి చూస్తే ముస్లిం టెర్రరిస్టులతో పాటూ హిందూ టెర్రరిస్టులూ ద్విగుణీకృతమైనట్లున్నరే?
అజ్ఞానం:అదే మూర్ఖత్వమంటే. హిందువులు టెర్రరిస్టులు కాదు. మాకు ఈ ప్రజాస్వామ్య సెక్యులరిజంలో ఇతర మతాలతో కొన్ని సమస్యలున్నాయంతే. వాటిని టెర్రరిజం అంటే ఎట్లా?
చైతన్యం:అంటే గుజరాత్ లో ముస్లింలనూ, అంతకు మునుపు సిక్కులనూ చంపింది హిందూ టెర్రరిస్టులు కాదన్నమాట!
భయం:నువ్వు మళ్ళీ మొదటికొచ్చావ్! నీకు హిందూ మత నమ్మకాలగురించీ దాని గొప్పతనం గురించీ అస్సలు తెలీదు. నువ్వసలు హిందువువే కావు.


చైతన్యం:నిజమే! నేను తర్కమున్న మనిషిగా ఎదిగి, మానవత్వాన్ని పెంపొందించుకునే దారిలో జ్ఞానం నేర్పని నా హిందూ మతంలోని కరుడుకట్టిన మతతత్వాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు సహనాన్ని పాటించమంటే, సెక్యులరిస్ట్ గా ముద్రవేయబడుతున్నాను. హిందూ మతం పేరుతో జరిగే మారణహోమాన్ని నిరసిస్తే, సూడోసెక్యులరిస్టుగా పిలవబడుతున్నాను.మైనారిటీల సమస్యను అర్థం చేసుకుని వాటికి సమాధానం వెతుకుదాం అంటే, పక్షపాతిగా నిరసించబడుతున్నాను. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసే ఎటువంటి టెర్రరిజాన్నైనా ఖండిస్తానంటే, నాటకాలాడుతున్నానంటారు. ఏది ఏమైనా నేనొక చైతన్యాన్ని, మార్పుని ఆశిస్తాను. ప్రశాంతతనీ, శాంతిని కాంక్షిస్తాను. అదే నా అస్థిత్వం.

****

The picture is taken from: http://cache.daylife.com/imageserve/0bV4gOlgII6Tx/340x.jpg

20 comments:

Purnima said...

This is not a post, is it?? This is like a study guide for me. I should seriously work to understand it.

Thanks a ton!!

San .D said...

ఏదో యండమూరి నవలలో చదివిన వాక్యం గుర్తుకువస్తోంది.
"కేవలం సరిహద్దుకి చెరోపక్క ఉన్నాము అన్న కారణం వల్ల ప్రజలు శత్రువులయిపోవాలా?" అని.
సమస్య తీవ్రత తెలుసుకోకుండా తేలిగ్గా పాకిస్తాన్ ని నిందించేవారిని చూస్తే
నాకు బాధేస్తుంది.

చదువరి said...

ఇంగితజ్ఞానం పాత్రని కూడా ప్రవేశపెడితే సంభాషణ స్వరూపం మరోలా ఉండేదేమోననిపిస్తోంది. అదొక్కటే లోపంగా కనబడుతూందిక్కడ.

Kolluri Soma Sankar said...

Nice Post... Lot of thinking gone in...

వికటకవి said...

మీ చైతన్యం గారి పాత్ర పౌరహక్కుల సంఘం వాళ్ళ డైలాగుల్ని గుర్తు తెచ్చాయి. ప్రపంచంలో టెర్రరిజంగా చెప్పబడుతున్న దానికీ, మీ నిర్వచనానికి దిమ్మతిరిగేంత తేడా ఉంది. అందుకని ముందు మీ నిర్వచనం ఇచ్చి అప్పుడు మీ టెర్రరిజం ఫలానా అని చెప్తే మంచిదేమో.

ఈ తరహా చైతన్యమే ఎందుకూ కొరగాని బంగ్లా రైఫిల్స్ గాళ్ళు, మన బీ.ఎస్.ఎఫ్ వాళ్ళ మర్మాంగాలు కోసి మరీ హత్యచేస్తే నోర్మూసుక్కూచుంది.

మీ చైతన్యం కూడా సినీ ప్రేమలా గుడ్డిదల్లే ఉంది.

చదువరి గారి పాత్ర ఉండాల్సిందే.

చైతన్య.ఎస్ said...

భయం, అజ్ఞానం అన్న పాత్రలు హిందు అతివాద సక్తులకు ప్రతీక, చైతన్యం పాత్ర ద్వారా వారికి చెప్పడానికి ప్రయత్నించారు బాగుంది. మరి అదే చైతన్యం పాత్ర ద్వారా మైనార్టీలకు ఏమి సందెశం ఇవ్వలేరా ! ఇదే భయం, అజ్ఞానం పాత్రలు మైనార్టీ వర్గానికి ప్రతీకలు గా పెట్టి ఒక టపా మీరు రాస్తే చుడాలి అని ఉంది. భయం, అజ్ఞానం అన్నవి ఒక హిందు అతివాద శక్తులకే కాక మైనార్టీలకు కూడా వర్తిస్తుంది కదా? కాదంటారా !!

Dr. Ram$ said...

ఆంటే చివరకి హిందువులు ది తప్పు అన్నమాట.. ఒకటి మాత్రము చెప్పగలను , నేను తర్కించుకుంటున్నాను , నేను తర్కించుకుంటున్నానఅని, మీరు మీ భావలని యితరులు మీద రుద్దుతున్నారు కాని.. మీ వాదన లో పక్షపాతమైన తర్కము ఎక్కువ వుంటుంది.. వంద కోట్ల జనాభ వున్న మన దేశము లో హిందువులు ఎంత మంది వుంటారు?? ముస్లిములు ఎంత మంది వున్నారు?? నిజము గా మీరు చెప్పినట్లు హిందువులు అంతా అంతగా భయ పడుతూ వుంటే , ఇంకా ఎంత మంది ముస్లిములు మన దేశము లో మిగిలి వుండే వాళ్ళు.. అదే మన పొరుగు దేశము లో మైనారిటి మతాల కి మనము యిస్తున్న అంత గౌరవము , అక్కడ మైనారిటీ లు ఐన హిందువులు కి లభిస్తుందా??

ఇక్కడ మన దేశము లో మీరు భయము తో బతుకుతున్నారు అనుకుంటున్న హిందువులు ఎన్ని "మదర్సాలు" నడుపుతున్నారు?? a.k-47 ల తో ఎంత మందికి శిక్షణ ఇస్తున్నారు?? ఒక దేశ ఇంటిలిజెన్స్ సంస్థ నే ఉగ్రవాదాన్ని ఎగ దోలుతుంటే, కార్గిల్ యుద్దానికి కారణము యెవరు???? తీవ్రవాదులు మన భూ భాగము లో కి చాలా వరకు చొరబడే వరకు , హిందు టెర్రరిస్టులు గా మీరు పేర్కొంటున్న జనాలు ఏమి చేస్తున్నారు?? ఎంత మంది అమాయకులు ప్రాణాలు వదిలారు?? మీరు తీవ్రవాదులు గా పేర్కొంటున్న మీ హిందువులు , యే రోజైనా ఎక్కడైనా మానవ బాంబుల తో వినాశనము సృష్టించారా?? ప్రతి దానికి ఒక ఫ్యాషన్ లాగ ప్రతి రచయిత ముందు గోద్ర ఘటన ని నెత్తి కి యెత్తుకొని బయలు దేరతారు.. పార్లెమెంట్ మీద జరిగిన దాడి ని ఖండించడము చేత కాదు కాని.. నిజంగా మీరు అనుకుంటున్నట్లు అభద్రత భావము తో వున్న హిందు అతివాదులు, గోధ్ర ఘటనలు జరుపుకుంటూ పోతే ఈ దేశము లో ముస్లిము అనే వాడు ఒక్కడు కూడా వుండడు అనుకుంటా.. జనాభా ప్రాతిపదికన చూసుకుంటే..



మీకు మద్య లో యీ దళితులు అన్న భావన ఎందుకు వచ్హిందో అర్ధము కాలేదు?? మీరు అనుకుంటున్న ఆ గోద్ర ఘటన లో వున్న హిందువులు చాలా వరకు నిజమైన దళితులే..నిజమైన హిందు భావజాలాన్ని దళితుల లో నే ఎక్కువ గా చూస్తాము.. అంతే కాని మీరు పైన తగిలించిన నిలువు బొట్టు పెట్టుకున్న బొమ్మ లో మనుషులు కారు.. అసల ఈ టపా కి ఆ బొమ్మ కి సంభంధము ఏమిటి?? ఆ బొమ్మ అంత అవసరమా ఇక్కడ?? తరువాత మహిళల పై అత్యాచారల కి , మతానికి, మీ టపా కి సంభందము యేమిటో.. అంటే మీ వుద్దేశ్యము లో మీరు అనుకుంటున్న మతము వారు , మహిళల పై అత్యాచారాలు చేయండి అని, దళితుల ని వేదించండి అని చెపుతుందా??అంటే చెప్పగా మీరు ఎక్కడైన విన్నారా?? దేశము లో వున్న మొత్తము హిందువులు లో పైన మీరు బొమ్మ లో చూపించిన స్వాము లు ఎంత శాతమో తెలుసా మీకు?? అగ్రవర్ణాల వారు ఎంత శాతమో తెలుసా?? కనీసము సగము కూడా వుండరు.. అంటే మిగిలిన హిందువులు మన దేశము వాళ్ళూ కాదా?? మీరు ఓ తెగ కష్టపడి, బాధలు పడి పోతున్నారు అనుకుంటున్న మైనారిటీల ఈ దుస్తితి కి కారణము యెవరు?? మీ వుద్దేశ్యము ప్రకారము ఐతే హిందువులు అనేనా??

హిందు ధర్మాన్ని కాపాడుకుందాము అని చంపేద్దామా అని ఇంత టపా రాశారు.. మరి అదే ఇన్ని మారణ హోమాలకి తెగబడుతున్న హిందు వ్యతిరేక వర్గపు దాడులు కి మీరు ఇచ్హే సలహ??

Kathi Mahesh Kumar said...

@Dr.Ram: నా తర్కానికి ఆధారం నా అనుభవం, నేను నేర్చుకున్న జ్ఞానం. అది చాలా విస్తృతమైనది కాకపోవచ్చు.కాకపోతే అది "నా" పరిధి. దానికి సార్వజనీయత ఉండాలని నేను ఎప్పుడూ ఆశించను. కాబట్టి, నా భావాలని ఇతరుల మీద "రుద్దే" ప్రయత్నం నేను చేస్తున్నానని మీరన్నా అంగీకరించలేను.ఇక నా తర్కం పక్షపాతధోరణిలో ఉన్నాయని మీరనుకుంటే, అది మీ హక్కు. తెలియజెప్పారు సంతోషం.

నా అభిప్రాయాల్ని చాలా బలంగా చెప్పేప్రయత్నం చేస్తాను. అది నా హక్కు.ఎవర్నైనా వ్యతిరేకించినా, ఇష్టపడినా అంతే తీవ్రంగా తెలియజెబుతాను. అదీ వీలైనంత మర్యాదపూర్వకంగా.

ఇక హిందువుల్లో ప్రమాదంలో ఉన్నామనే భయం నీడ ఉందోలేదో అతివాదుల మాటల్లో తెలుస్తుంది."మన మతం ప్రమాదంలో ఉంది", "ముస్లింలు పెరిగిపోయి మన హిందువుల్ని మైనారిటీ్ల్ని చేస్తారు", "క్రైస్తవులు మతం పేరుతో మనవాళ్ళని లాగేసుకుంటున్నారు" లాంటి psycho-frenzy లో మీకు కనిపించడం లేదా? నేను మాట్లాడింది ఈ భయాల్ని కల్పించి వారి స్వార్థంకోసంవాడుకుంటున్న మతతత్వ పార్టీలూ,వారికి కొమ్ముకాస్తున్న ఛాంధస హిందువుల సంగతి.అంతేతప్ప ఎవరూ భుజాలు తడుముకోనఖ్ఖరలేదే!

మాటిమాటికీ మనకు పొరుగుదేశంతో మనకు పోలికెందుకో నాకు అర్థం కావడం లేదు.We are a democracy and a secular democracy and they are not. Their state religion is Islam. ఇక పోలికెక్కడొస్తుంది?

హిందువులు ఆయుధ శిక్షణ ఇవ్వటం లేదని మీరు ఖరాఖండీగా చెప్పగలరా? ఐతే గుజరాత్ కో, లేక మధ్య ప్రదేశ్ కో రండి. మీకు ట్రైనింగ్ ఇప్పించి ఒక శూలం చేత ధరింపజేసి జమ్మూలో అల్లర్లు చెయ్యడానికి పంపించే ప్రయత్నం చేస్తాను.అప్పుడుగానీ మన హిందూ మతతత్వవాదులు దాదాపు ఇస్లాంతీవ్రవాదాన్ని తలపించేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారని మీకు అర్థం కాదు.

హిందువులు చేసే అన్యాయాలూ, హింసా ముస్లింలమీదకన్నా దళితుల మీద ఉంటుంది. అందుకే మధ్యలో దళితులూ, మహిళలూ వచ్చారు.హిందూ మతం వీళ్ళపై అన్యాయాలు చెయ్యమని చెప్పదని మీరంటున్నారు...అందుకే మీరు మనుధర్మశాస్త్రం చదవాల్సిందే. అందులో ఎవరికి ఎలాంటి "శిక్ష" వెయ్యాలోకూడా ఉంది. తెలుసుకోగలరు.

దళితుల్లో చాలామంది తాము హిందువులని మనస్ఫుర్తిగా నమ్మరు. కాబట్టి ఎవరెంతశాతం అనే ప్రశ్న అనవసరం. ఇక ఫోటో సంగతంటారా. అదొక symbolic suggestion మాత్రమే.

మైనారిటీల దుస్తితికి ఇప్పటి వరకూ కారణం ప్రభుత్వమైతే, వారిలో ప్రస్తుతం పెరుగుతున్న alienation కి కారణం హిందూ మతత్వవాద సంస్థలు.ఆ insecurity తోవారు ఇలా ప్రవర్తిస్తే వారిని సరిదిద్దే ప్రయత్నం చెయ్యడం మానేసి, కేవలం అక్కసు వెళ్ళగక్కి ఇంకా విద్వేషాల్ని రగిలింస్తున్న హిందువుల్లోని భయం, అజ్ఞానం పైన నా వ్యాసం.

@చైతన్య: అటువైపునుంచీకూడా రాయడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే, అంత సాధికారత ఉండకపోవచ్చని నా అనుమానం.

@వికటకవి గారూ: ప్రపంచం యొక్క టెర్రరిజం నిర్వచనం అమెరికా ద్వారా ఇవ్వబడింది. చైతన్యం ఇచ్చిన నిర్వచనం మానవత్వం పరిధిలోంచీ చెప్పబడింది. మీకు అమెరికా నిర్వచనం సరైనదనిపిస్తే, శుభాకాంక్షలు.

పౌరహక్కుల సంఘాలు, వాళ్ళ పోరాటాలూ లేకపోతే ఇప్పటి law & order పరిస్థితి పోలీసురాజ్యమై ఉండేదని మీకు తెలియకపోవచ్చు. కాబట్టి,ఈ విషయాలు తెలుసుకున్న తరువాత వారిని నిరసించడానికి ప్రయత్నించండి.

@సోమశేఖర్: ధన్యవాదాలు

@చదువరి గారు: ఇంగితజ్ఞానం నేను సృష్టించిన పాత్రే అయినా, ఇక్కడ ప్రవేశ పెట్టాలనే ఆలోచన రాలేదు.గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అవకాశం దొరికినప్పుడు తనను ప్రవేశపెట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను.

@సందీప్ & పూర్ణిమ: దన్యవాదాలు.

Dr. Ram$ said...

త్రిశూల ల తో ఇప్పటకి ఎంత మంది ని పొడిచి చంపారో చెప్పగలరా???

Naga said...

"వాటి గురించి స్పందించడంకన్నా, ఊరకుండటం మంచిది" అని నా మిత్రుడు ఒక సలహా ఇచ్చారు కూడా.

- అలాంటి వారు ఎక్కువయ్యే దేశం ఇలా తగలడుతుంది. యుద్దాయ కృత నిశ్చయహ. వచ్చిన పని మనం చెయ్యాల్సిందే, ప్రొసీడూ.

ఇంగిత జ్ఞానానికి చైతన్యం ఎట్ల చెబితే అట్లే!

- నాగన్న.

Bolloju Baba said...

i endorse the first comment.

bollojubaba

Budugu said...

చాలా మంచి వ్యాసం. రెండు వైపులా తప్పులు ఉన్నాయి, దీనికి పరిష్కారం ఉండదు అనే అనుకుంటున్నాను.

మొదట ముస్లింలు టెర్రరిజం మొదలు పెట్టారు, తర్వాత హిందువులు కూడా మొదలు పెట్టారు
కేవల పుట్టుక ఆధారంగా దళితుళను అవమానాలకు గురి చేసారు/చేస్తునారు, మానవత్వం మరచిన 'కొందరు ' పశువుల్లాంటి అగ్రవర్ణాల వారు
కేవలం పుట్టక ఆధారంగా తమకు తరతరాల పాటు ప్రత్యేక సదుపాయాలు కావాలంటూ 'కొందరు ' దళితులు
సిగ్గువిడిచి కుక్కల కంటే హీనంగా బ్రతుకుతున్నారు.

దీనికి ముగింపు ఉండదేమో!!

Nandu said...

ఎందుకు హిందువులంటే అంత హీనమైన అభిప్రాయం మీకు ? హిందువులు మహిళలు దళితుల ను హింసించే వాళ్ళేనా ? ఇంత దారుణం గా ఎలా జనరలైజ్ చేస్తారు ? 'ఉద్యోగం మారిందంతే ' పోష్టు లో కూడా ఇకాగే రాసారు. హిందూ మతం అంతా తప్పుల తడక అని అనిపించేలా ?

ఏదైన మతం పైన ఇంత ఏక పక్షం గా మీ వాదనే కరెక్ట్ అని రాసిన మీరు , మీరు చెప్పిందే నిజం మిమ్ములను వ్యతిరేకించే వాళ్ళంతా అతివాదులు అనుకుంటున్న మీరు ముందు మీ రాతలని కొద్దిగా నిస్పక్షపాతం గా రాయండి. అప్పుడు కోరుకోండి అతివాదులు మారాలని. అంతే కాని అయిన దానికి కాని దానికి హిందువులందరిని నిందిచటం అసలు ఏ మాత్రం బాలేదు.

ఉపోద్ఘాతం లో అన్ని కోణాల నుండి ఆలోచించాలని చెప్పిన మీ నీతులు టపా మధ్యలో వచ్చేసరికి ఏమైయ్యాయి ? 'మానవత్వం పెంపొందుంచుకునే దారిలో జ్ఞానం నేర్పని హిందు మతం ' . ఒక మతం మీద ఇంత నీచమైన అభాండం వేసి మళ్ళి శాంతిని ఆకాంక్షిస్తున్నానంటారు. మొదట మీరు నిస్పక్షపాతం గా వున్నారో లేదో ఆలోచించుకోండి. నిస్పక్షపాత ముసుగు లో ఆత్మ వంచన చేసుకుంటున్నారు.

@ 'ఇప్పుడు సహనాన్ని పాటించమంటే సెక్యులరిస్టు గా ముద్రవేయబడుతున్నాను ' - అంటే మీకు మీరే సెక్యులరిస్టుగా వూహించేసుకుంటున్నారా ? సెక్యులరిజం అంటే అర్థం అన్ని మతాలు సమానం అని , అంతే కానీ మైనారిటీ మతాలు మంచివి , హిందూ మతం చెడ్డది అంటే అది ఏ విధంగానూ సెక్యులరిజం కాదు.

దయ చేసి మీ వ్యాసాలలో కొద్దిగా నైనా నిస్పక్షపాతాన్ని జోడించండి. ఇకా ఒక మతాన్ని ఆడిపోసుకోవటం ద్వారా ఉద్రేకాలని రెచ్చగొట్టకండి. దీనికి మీ జవాబు ఏంటొ కూడా వూహించగలను. నిజాలు మాట్లాడుతున్నాను అంటారు. అవి నిజాలు కాదు మీ ఆత్మవంచన.

మెజారిటీ మతాన్ని తిడితే సెక్యులరిస్టులు, ప్రజాస్వామ్యాన్ని వుద్ధరించే మహానుభావులు అయిపోతారనుకుంటున్నారేమో . అది తప్పు. కొంత మంది జనాలు ఇలానే వుంటారేమో.

@ 'అటువైపు నుండి కూడా రాయటానికి ప్రయత్నిస్తాను. కాకపోతే అంత సాధికారత వుండకపోవచ్చని నా అనుమానం ' - ఈ ఒక్క వాక్యం లో తెలిసిపోవటం లేదు మీరు పక్షపాతి అని. ఇక మీరు ఎంత వాదించినా ఈ పక్షపాతాన్ని మరింత పెంచుకోవటం తప్ప ఇంకేమీ కాదు.

trk said...
This comment has been removed by the author.
Sankar said...

వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి మనం కొనసాగిస్తున్నాం అని వాదించేవాళ్ళ శాతం చాలా ఎక్కువ. వాళ్ళు అమాయికుల్ని అన్యాయంగా చంపేసారు కాబట్టీ మనం ఇంకొంతమంది వాళ్ళవాల్ల అమాయికుల్ని చంపేసి లెక్క సరిచేసేద్దాం. తర్వాత ఈ మారణకాండ చివరికి వచ్చేప్పటికి మెజారిటీలమైన మనం మాత్రమే మిగులుతాం అని వీళ్ళ ఆలోచన. ఒకవేళ అదేజరిగితే ఆ తర్వాత మన మెజారిటీల్లో కొట్టుకు చావడానికి ఎన్ని సమస్యలు లేవు మళ్ళీ మనకి...వాళ్ళు చేసింది తప్పైతే దానికి మనం చేసింది ఎలా ఒప్పవుతుంది.ఈ అకృత్యాలకి పాకిస్తాన్‍లోని ఛాందసవాదుల్ని తప్పుపట్టడం ఎంత సమంజసమో ఇక్కడ అదే తరహా హింసకు ప్రోత్సాహం అందించేవారిని తూలనాడడం కూడా అంతే సమంజసం. హిందూ మతానికి కావల్సినంత సపోర్ట్ కావాలంటే ముందు కుల వ్యవస్ధని తరిమికొట్టాలి.. ఇది కేవలం పేరుకు మాత్రమే జరుగుతుంది. ఇప్పటికీ ఎంతమంది అందర్లో ఒకలా కొందర్లో ఇంకోలా మాట్లాడుతుంటారో గమనిస్తే ఈ సమస్య తీవ్రత అర్ధం అవుతుంది... మన మతంలో ఉన్నవళ్ళందరికీ ఒకేరకమైన సాంఘిక గౌరవం, నీతి లేనప్పుడు ఆ మతానికి ముప్పు ఏర్పడినప్పుడు అందరూ కలిసిరావాలని ఎలా కోరుకోగలం... కలిసి పని చేస్తున్నాం కలిసి తిరుగుతున్నాం అని ఏవేవో చెప్తాం కానీ అలా చేయడాన్ని గొప్పగా చెప్పుకొనే దిస్ధితిలోనే ఇంకా ఎందుకు ఉన్నామో ఒకసారి ఆలోచించలేం...
మహేష్‍గారూ ఇంతకీ ఈ ’చైతన్యం’ గారు ఇలా అన్నిరకల టెర్రరిజాన్నీ ఖండించడంతో పాటు సమస్య పరిష్కారానికి ఏమన్నా ఉపయోగపడే సూచనలు చేయగలడా అనేదే పెద్ద క్వశ్చన్.. ఏదో పరిష్కారం చెప్పలేకపోతే ఈ ’చైతన్యానికి కూడా ఎప్పుడొ ’భయం’ పెరిగి ’అజ్నాని’గా మారిపోయే ప్రమాదం ఉందికదా... ఈరోజుల్లో జరుగుతున్నా బాంబు దాడుల వగైరా విషయాలవల్ల ఎంతో మంది మీరు వదిలేసిన ఇంగితజ్నానులు ఇప్పటికే భయస్తులైపోయారు...

Unknown said...

మూలాలు, మూలాలు, మూలాలు...

ఇస్లాం మూలాలు తెలియకుండా ఎన్ని వాదోపవాదాలు జరిగినా ప్రయోజనం వుండదు. ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?

అన్ని మతాల్లాగే, ఇస్లాం ని ఓ మతంగా పరిగణించడమే సభ్య ప్రపంచం చేసే సరిదిద్దుకోలేని, అమాయకపు, మొదటి పొరపాటు. ఆ తరువాత ఎంత ప్రయత్నించినా, ఎన్ని వాదోపవాదాలు జరిగినా ఫలితం వుండదు.

సభ్య ప్రపంచపు మంచితనమే కానివ్వండి, అమయకత్వం అవనీయండి, అజ్ఞానమే అనుకోండి...ఏదేమైనా, ' ఇస్లాం మతం కాదు ' అనే విషయాన్ని ఒప్పుకోనివ్వదు. ఎందుకంటే, మిగతా మతాల్లాగే ఇందులో కొలవడానికి దేవుడున్నాడు, దేవుడి వునికిని చెప్పిన ప్రవక్తా వున్నాడు, పఠించడానికి గ్రంధమూ వుంది, పాటించడానికి ఇన్ని కోట్ల మందీ వున్నారు. ఇంక ఎలా అనుమానించేది? అనుమానించడమే పాపం, ఘోరంగా పరిగణించే సభ్య ప్రపంచం మనది.

ఇక్కడ ముస్లింలను తప్పు పట్టడం కాదు. నిజానికి ముస్లింలు కూడా ఇస్లాం బాధితులే. ఇస్లాం మూలాల్లోకి వెల్లి, 'ఖొరాన్ ' లో ఏముందో విమర్శనాత్మకంగా చదివి, విశ్లేషించి అర్ధంచేసుకొనగలిగితేనే, ఆ Grand Scheme of Totalitarian Ideology అర్ధమయ్యేది.

-భరత్

Kathi Mahesh Kumar said...

@నందు: నా నిరసన హిందువుల మీద కాదు,ప్రస్తుతం హిందూ మతం పేరుతో జరుగుతున్న విధానాల మీద.ప్రస్తుతం అమలులో ఉన్న హిందూమతం "మూస" దళిత, మహిళ వ్యతిరేకమైనదని ఏకాస్త సమాజాన్ని ప్రరిశీలించినవాడైనా చెప్పగలడు. ఒప్పుకోకుండా ఉండలేడు. మీరు కళ్ళు మూసుకుని పాలుతాగుతానంటే, నాకేమీ అభ్యంతరం లేదు. Practicing Hinduism at this point in time లో కొన్ని వేల తూట్లున్నాయి.అది ఒక హిందువుగా నేను తెలుసుకున్న నిజం. మీరు విభేధిస్తే, అది మీ ఇష్టం.

నేను నిస్పక్షపాతంగా రాస్తానని ఎప్పుడూ చెప్పడం లేదు. నేను అతివాదులకు వ్యతిరేకమైన ఒక ధృక్కోణాన్ని మాత్రమే ముందుంచుతున్నాను. రెంటినీ చదివి నిర్ణయం చెయ్యడం చదివినవారి పరం. అందులో నా ప్రమేయం లేదు.

మొత్తానికి మీరు "చైతన్యం" పేరుతో నేనే నా భావాల్ని చెబుతున్నానని నిర్ణయించుకున్నారు. దయచేసి మూడో పేరా చదవగలరు.ఇక నేను మైనారిటీలకు కొన్ని సమస్యలున్నాయన్నానేగానీ,మైనారిటీ మతాలు ‘మంచివని’ ఈ టపాలో ఎక్కడ చెప్పానో కాస్త చెప్పగలరా? ఇంతకు ముందు టపా ఏకపక్షం టపా, దానిలో మీరు balanced critique expect చేస్తే ఎలా? హిందూవాదులు మాత్రం తమ ఇతర మతవ్యతిరేక నిర్ణయాలు ప్రకటిస్తే అఖ్ఖరకురాని నిస్పక్షపాత ధోరణి నా టపాలకే కావలసొచ్చాయా?

నాది ఆత్మవంచన అని మీరన్నా, నేను ఇంకా మనిషిలాగానే మాట్లాడుతున్నాను. హిందూ మతం పేరుతో "నరకండి, చంపండి" అనే దయ్యాలు వేదాలు వల్లించిన రీతిలో నా టపాలు లేవు. కాబట్టి విద్వేషాన్ని నేను రగిలుస్తున్నానో, లేక రగిలించిన విద్వేషాలకు సమాధానం చెబుతున్నానో గ్రహించగలరు.

నేను హిందువునికాబట్టి, హిందూ మతంలోని లోపాలను చెప్పే "సాధికారత" నాకుంది. అదే ముస్లిం తరఫునుంచీ చెప్పాలంటే,అది లేకపోవచ్చు. అందుకే నేను ఆ మాట అన్నాను. అది తర్కానికి సంబంధించింది, పక్షపాతానికి కాదు.

@శంకర్: మీరు చెప్పివాటితో నేను ఏకీభవిస్తున్నాను. చైతన్యం పరిష్కారాన్ని సూచించి ఉంటే, ఇంకా బాగుండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమస్యని కూలంకషంగా అర్థం చేసుకుంటేగానీ,సమాధానాలు దొరకవు. కాబట్టే,కేవలం సిద్ధాంతాలు ప్రతిపాదించే దిశగా చైతన్యం వెళ్ళలేదేమో అని నాకనిపిస్తుంది.

@భరత్ గారూ: మీ బిందువు చాలా సహేతుకం. కానీ మూలాలనుదాటి, ఇటు ఇస్లాం అటు హిందూమతం కేవలం అలంకారాల మయమైన అర్థ జ్ఞానంతో విర్రవీగుతున్న ఈ తరుణంలో మళ్ళీ మూలాలవరకూ వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే ప్రస్తుతం ఉన్న స్థాయినుంచీ ముందుకువెళ్ళేదిశగా "సంస్కరణ" కావాలని నా ఇదివరకటి టపాలో కొన్ని వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ చెప్పాను.

@బడుగు:ఈ సమస్యకు ముగింపుకావాలి. అందుకే ఈ చర్చ. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

@బాబాగారూ: మీరూ ఆలోచించి చెప్పాలి.

@నాగన్న గారూ: మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

గీతాచార్య said...

నా బ్లాగు లో కలుద్దాం. వ్రాయాలంటే టైము పడుతుంది. అందులోనూ రేషనల్ వ్యూస్ అంటే ఇంకా కష్టం. రాయాలంటే మరి.

గీతాచార్య said...

"వారితో చేసే ప్రతివాదనలకు ఒక అవసరమైన ప్రాతిపదిక ఉంది అని నిర్ణయించుకున్నాను. వారి దృక్కోణాన్ని వారు కసిగా చెప్పిన తరువాత, మితవాదులందరూ నిశ్శబ్ధంగా ఉండిపోతే, వారు "తాము చెప్పిందే సత్యమనే అపోహలో ఉండిపోరూ!" . అందుకే వారికి ప్రత్యామ్నాయ వాదనలు తెలియాలి. వారు మనతో అంగీకరించకపోయినా, కనీసం చదివేవారు విభిన్నదృక్కోణాల నుంచీ సమస్యను అర్థం చేసుకునే అవకాశం కలగాలి అనే ఒక చిన్న కోరిక వలన ఈ సాహసం చేసేస్తూఉంటానంతే. ఇప్పట్లో నా పంధా మారదేమో. క్షమించాలి మిత్రమా!"


Hats-off! నేను మీతో అంగీకరించక పోయినా ఈ మాట అప్పుడు. మన బాటను ఎవరికోసమో వీడ రాదు అన్నా సత్యం తెలుసొంది.

లత వొరువూరు said...

"Practicing Hinduism at this point in time"

What do you mean by practicing Hinduism? Like going to temple every sunday, reading Gita etc etc?

what makes you a non-practicing Hindu and others practicing Hindus, tell me O! Blessed one!! you, the culmination of చైతన్యం!!

"చైతన్యం:కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలొ ఉన్న హిందూ మతం తన జనబాహుళ్యంలో తన నమ్మకాల్నీ, విలువల్నీ ప్రతిష్టించలేకపోయిందా? ఇంత మంది హిందూ మతం గొప్పతనాన్ని తెలీని జనాలు ఎలా మిగిలిపోయారు? వేరే మతాన్ని అంత సులువుగా నమ్మే విధంగా ఎలా తయారయ్యారు?"

Resign your job. Give away your assets to charity. When you reach a state where you don't whether you'll eat tonight or not, you'll have a clear idea how people convert. The problem here is not Religion or the inability of so called 'హిందూ మతం', but its about food. Poverty.