Tuesday, June 17, 2008

తమిళోళ్ళకి మనమంటే అలుసా !


ఈ మధ్య మన ‘కాలాస్త్రి’గారి బ్లాగులో ‘దశావతారం’ సినిమా చర్చతోపాటూ, తమిళోళ్ళు ఇతర భాషల వారి పట్ల చూపే చిన్నచూపూ చర్చకొచ్చింది. ఇలా మనకు (తెలుగువారికి) అనిపించడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? లేక నిజంగా తమిళులు అలాంటి భావన కలిగి ఉన్నారా? అని కాస్త ఆలోచించడం జరిగింది. చిన్నప్పటి నుండీ నేను పెరిగిన పరిసరాలు తమిళనాడు బార్డర్ లో ఉండటం, వారి సినిమా మరియూ రాజకియం పై కాస్తో కూస్తో ఉన్న అవగాహన, అంతే కాక కాలేజి మరియూ యూనివర్సిటీ రోజుల్లో ఈ భాష వారితో నా స్నేహన్ని దృష్టిలో ఉంచుకుని ఒక విశ్లేషణకు ఇక్కడ ప్రయత్నిస్తాను.


స్వాతంత్ర్యానంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత, దక్షిణాదిన తనదంటూ ఒక ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రంగా తమిళనాడు ఉద్భవించింది. ఈ ప్రత్యేకత మద్రాసు రాష్ట్రంగా ఇంతకుమునుపే దానికున్న గుర్తింపు వలనైతే కావచ్చునేమోగానీ, ఆ తరువాత కాలంలో భాష, సంస్కృతిక, రాజకీయ, సామాజిక,మరియూ ఆర్థిక రంగాలలో తనదైన శైలిలో చూపిన ప్రగతి ఆ స్థాన్నాన్ని సుస్థిరం చేసింది. వీరి ఈ విభిన్న శైలి, మనకు కాస్త ‘అతి’ అనిపింఛడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే వీరు narrow -minded అంటేనే కాస్త అల్లోచించాల్సి వస్తుంది. ఒక వేళ అలాంటి తమిళ వ్యక్తులు కొందరు మనకు తగిలినా మొత్తం తమిళజాతికి ఈ ఝాడ్యాన్ని అంటగట్టడం ఎంతవరకూ సమంజసం అని కాస్త తరచిచూడాల్సిన అవసరం ఎంతైనాఉంది.



ఈ తమిళుల ‘అతి’ కి కారణాలని నాకు అనిపించిన కొన్ని విషయాలను చూద్దాం. మొట్టమొదటిది వీరికి తమ భాష పట్ల ఉన్న అమితమైన ప్రేమ. అది ఒక్కొసారి మరీ హద్దులు మీరినట్టుగా ఉంటుంది. భాషోద్యమాల సమయంలో హిందీకి వ్యతిరేకంగా అమితంగా పోరాడిన రాష్ట్రం ఒక్క తమిళనాడే అన్నది అందరికీ తెలిసిన సత్యం. ఈ వ్యతిరేకతకు కారణం వారికి తమిళం మీది ప్రేమతోపాటూ, భారత ప్రభుత్వం యొక్క ఆధిపత్య (hegemony ) ప్రయత్నాలకు చెక్ పెట్టడంకూడా ఒకటి. తమ తమిళ వ్యక్తిత్వాన్ని (identity) కాపాడుకోవడానికి భాష ఒక పెద్ద ఆయుధం అని వీరు మనస్ఫూర్తిగా నమ్మారు. హిందీ చదువుతో నేషన్ బిల్డింగ్ సంగతేమోగానీ, తమ మూలాల్ని మాత్రం కదిలింఛడానికి ప్రయత్నం జరుగుతున్నదన్న నమ్మకంతో ఈ హిందీ వ్యతిరేక సమరశంఖాన్ని పూరించారు. ఆ పట్టూనే ఇప్పటికీ సాగిస్తున్నారు.



వ్యతిరేకమన్నంత మాత్రానా వీరికి హిందీ రాదు అనుకుంటే మట్టుకూ పప్పులో కాలే. చాలా వరకూ చెన్నైలో ఉన్నవారికి హిందీ అర్థమౌతుందిగానీ, మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపరు అంతే. కాకపోతే హిందీ రాకపోయినా దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశన చేయటంలొ వీరు ఒక ప్రముఖ పాత్ర వహించారు. మన దేశాన్ని ఒక ప్లూరలిస్టిక్ డెమాక్రసీగా మిగిల్చిన శక్తులలో వీరి భాషాభిమానం ఒకటి. "హిందీ తప్పదు కాబట్టి నవోదయా విద్యాలయాలు మాకొద్దు" లాంటి కొన్ని మూర్ఖపు పోకడలు తర్వాత వచ్చినా, మూలాలను గమనిస్తే వారి మూర్ఖత్వం కూడా ముచ్చటగానే ఉంటుంది.



రెండవది వీరి సామాజిక, సాంస్కృతిక ధృక్పధం. ఈ రెండింటికి ఇక్కడ చాలా దగ్గర సంబంధం ఉంది. మూకుమ్మడిగా బ్రాహ్మణేతర కులాలు భ్రాహ్మణ ఆధిపత్యంఫై తీవ్రమైన పోరాటం జరిపిన చరిత్ర వీరిది. కానీ ఎక్కడా బ్రాహ్మణులపై పోరుగా దీన్ని సలపకుండా, కేవలం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మట్టికలిపిన తెల్ల విప్లవాలలో(Revolution without bloodshed) ఇదొకటి. ఇలాంటి పరిణామం ఏ ఆఫ్రికాలోనో జరిగుంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేము. దాదాపు 50% మించి కులపరమైన రిజర్వేషన్లున్న రాష్ట్రమూ ఇదే, పెద్ద స్థాయిలొ పూజలూ పునస్కారాలూ జరిపి బ్రాహ్మణులకు గౌరవాలు కల్పించేదీ ఇక్కడే. ఈ mutually contradicting values తో తమిళులు గడుపుతున్న జీవన విధానం ప్రశంసనీయం.



సాంస్కృతిక పరంగా చూస్తే, బ్రాహ్మణులకు సంబంధింఛిన కళలుగా గుర్తించబడిన కర్ణాటక సంగీతం మరియూ భరతనాట్యాన్ని వీరు తలకెక్కించుకున్నట్టుగా ఎవ్వరూ చెయ్యలేదు. బాల మురళీకృష్ణ వంటి గాయకుణ్ణి మనం అవమానించి తరిమేస్తే, ప్రేమగా అక్కున చేర్చుకున్న సంస్కృతి వీరిది. లలిత కళలతో పాటూ, జానపద కళారూపాలైన గరగాట్టం, కూత్తు వంటి వాటినికూడా సమానంగా ఆదరించి పోషిస్తున్న సహృదయం వీరిది. ఇదే విధానం వీరి సినిమాలలో కూడా కనబడుతుంది. ఒక ఎమ్.జి.ఆర్ తో పాటూ శివాజీ గణేశణ్, జెమినీ గణేశణ్ ఉన్నట్టే, ఒక రజనీకాంత్ కు సమానంగా కమల్ హాసన్ వంటి కళాకారులెప్పుడూ ఉన్నారు. ఇలా ఇద్దరి పట్లా సమాన ఆదరణ చూపే ఈ తమిళోళ్ళు కొంచెం అర్థంకాక మనకు ‘అతిగా’ అనిపిస్తుంది.


రాజకీయపరంగా, ఆర్థిక పరంగా వీరు ఒకమెట్టు ఎప్పుడూ పైనే ఉన్నారు. మొదట్నుంచీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని సవాలుచేస్తూ వస్తున్న వీరు, ఏనుగుని ఢీకొంటూ కూడా తమ పంతాన్ని ఎల్లప్పుడూ నెగ్గించుకున్నారు. ప్రస్తుత కాలంలో అత్యధిక కాంగ్రెస్ MP లున్న మన రాష్ట్రానికంటే ఎక్కువ నిధులు వీరు కేంద్రం నుండీ దండుకోవడానికి కారణం, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అనుకున్నా, ఇలాంటి పని వారు 60 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. "ఎలా?" అని మాత్రం అడక్కండి, అది తమిళోడికే ఎరుక ! దీనికి కారణం బహుశా వీరిలో గట్టిగా ఉన్న భాషా,సాంస్కృతిక బంధం అని నా నమ్మకం. ఉదాహరణకు తమిళనాడు కేడర్ లో ఎవరైనా IAS,IPS లేక IFS అధికారి వస్తే, వారు ఖచ్చితంగా తమిళం నేర్చుకుని పనిచెయ్యల్సిందే. మరోటి, ఏ తమిళుడైనా ఇతర రాష్ట్రాలలో గానీ, ఢిల్లొ లోగానీ ఈ పదవుల్లో ఉంటే తన పూర్తి నిబద్ధత తమిళనాడు పట్ల చూపిస్తాడు. ఈ రెండుకారణాలుచాలవా అభివృద్దికి!



ఇక వీరి రాజకీయ అతికి పరాకాష్టగా చెప్పుకునేది ఒక్కోసారి ఒక్కొక్కపార్టీకి వీరిచ్చే absolute majority. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక్కరో ఇద్దరో MLA లు మాత్రమే ఉన్న అసెంబ్లీ సెషన్లు ఈ రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఇందులో ఉన్న మతలబు పెద్ద పెద్ద రాజకీయ పండితులకి కూడా వంటబట్టలేదుగానీ, ఎవరు అధికారంలోకి వచ్చినా చివరి విజయం మాత్రం ఎప్పుడూ ఒక సగటు తమిళుడిదే అనిపిస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో అంతకన్నా ఏంకావాలి?



ఇన్ని పరస్పర విరోధాభాసాల మధ్య జీవిస్తున్న కొందరు తమిళులు మనకు, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వారి నమ్మకం మనకు మూర్ఖత్వంగా అనిపించొచ్చు. వారి భాషా ప్రేమను చాదస్తంగా భావింఛవచ్చు. వారి సామాజిక భావావేశాన్ని అరుపులుగా వర్గీకరించోచ్చు. వారి రాజకీయ నిర్ణయాల్ని పిచ్చితనంగా అభివర్ణించొచ్చు. కాకపోతే వీరి ‘అతిని’ అర్థం చేసుకుని స్నేహం చేస్తే, I think they have a lot to offer to our culture and polity.



ఏదిఏమైనా, తమిళొళ్ళను ఎంత అపార్థం చేసుకున్నా, మొత్తం తమిళజాతికి మిగతా భాషల వారి పట్ల చిన్నచూపుందంటే, అంతగా ఆమోదయోగ్యంగా అనిపించదు. కొందరు ఇలా ప్రవర్తించే వారు ఖచ్చితంగా ఉండొచ్చుగాక, అలాంటి వారు మనలో మాత్రం లేరా? లేకపోతే "తెలుగు తేట, కన్నడ కస్తూరి, అరవం అధ్వానం" అన్నది ఎక్కడి నుండీ పుట్టిందీ?


27 comments:

sudha said...

baga chepparu arava gola gurinchi :)

Shankar Reddy said...

baga chepparu ....

Ramani Rao said...

చాలా బాగా చెప్పారు మహేష్ కుమార్గారు. నిజమే ఎవరి బాష వారికి గొప్పది. మన తెలుగులోనే ఉన్నారుగా, రాయలసీమ, తెలంగాణ, కోస్తా అని, ఎవరిని అన్నా ఇంకొకరికి పడదు. ప్రాంతీయ భాషల పట్లే ఇంత అభిమానము చూపిస్తున్నవాళ్ళము మనము, మరి వాళ్ళు వాళ్ళ బాషని గౌరవించుకోడంలో తప్పేమి లేదు. అది అందరికి అతి అనిపించినా సరె, మన తెలుగువాళ్ళే ఇంకా చాలా నేర్చుకొవాలి, పరువు పోతుందేమో అని పరాయి భాష మాట్లాడ్తారు, దర్పంకోసమో, మరి మన్ననల కోసమో తెలీదు కాని మాతృబాషని మాత్రం మన జోలికి రానీకుండా కాపాడుకొంటారు. ఇలాంటివాళ్ళు తమిళుల్ని చూసి నేర్చుకోవాల్సినది ఎంతైనా ఉంది. ఎవరి బాష వాళ్ళకి తీయనైనదే. "దేశ బాషలందు తెలుగు లెస్స" అని కాకుండా "లెస్సు" అనుకొనేవాళ్ళకి అన్నీ అతిగానే అ(క)నిపిస్తాయి.

రవి said...

ఏదో కాస్త తమిళులను కాస్త తిట్టుకుందాములే అంకుంటుంటే ఇలాంటి టపా రాసి, మా నోరు మూయించడం ఏమీ బాగలేదు మహేశ్ కుమార్ గారు :-)

సరే నా వరకు కొన్ని అనుమానాలు. ఇక్కడ బెంగళూరు లో, ప్రతి కంపనీలో, ఒక్క తమిళ్ వాడు చేరడం, తర్వాత ఓ గుంపు తయారు చేయడం ఇక్కడ పని చేస్తున్న దాదాపు అందరికీ తెలుసు. ఆ తర్వాత వాళ్ళకే ప్రమోషన్లూ, కుళ్ళు రాజకీయాలు వగైరా...అందుకే ఇక్కడ కన్నడిగులకూ పడి చావడం లేదు వీళ్ళంటే...

ఇంకొకటి, భాషాభిమానం ఓకేనే...భాషా దురభిమానం కొంచెం అసహ్యంగా ఉంటుంది. భాష అన్నది జీవికోపయోగి..ఏ భాషలో మాట్లాడితే పనులు జరుగుతాయో ఆ భాష మాట్లాడుతాం. నాకు తెలుగు మీద మక్కువ , ఐతే, హైదరాబాదు లో ఉన్నప్పుడు ఉర్దూ అవసరం వస్తే మాట్లాడ్డంలో తప్పేముంది?

ఇవన్నీ సరే..మీ టపా మాత్రం కత్తి లా ఉంది..:-) keep it up!

arvindrishi said...

karanaalu teleevu kanee telugu kannada cultures lo loukyam pallu ekkuva...navvatam lo edwatam lo basha lo ...premallo ..abhimanalalo annitlo ee loukyam kanipistundi.

Tams face value to veltaaru...pedda ga maatladataaru...strong cultural roots untaayi...identity ki respect istaaru ...national award vaste kamal/mani chakkaga traditional pattu lungee kattukuni veltaaru ...telugu heros ni pancha kattukellamanandi...bastee me sawal...viswanath laanti person kooda pant shirts lone veltaaru koncham scene sitaar unna padma vibheeshanulite ado type dress lo veltaaru.

mana identity ni balanga cheppukune manasu manaku lenappudu ade pani pakka vaadu chestunte loukyaaniki aavli teeram lo unnattoo atiga unnatoo anipinchatam lo aascharyam emee ledu..

Hindi national basha ante dravida desam lo gontettina telugodu kanee kannada vaaru kane leru...em chebdaam mana jaateeya bhavana gurinchi...we lack self identity...reasons inko post postaali magesaa..!

Andaroo navvutaranu aallakee delchu...aallante...north lo south ante no andhra no kannada...aravam adhvannam ani manam anukovatamein...uttaraadilo dravida janda pattukunedi vaalle..

ekkada unnam manam ...may be busy with our ooragayas or gongoora pachadees...!

arvindrishi said...

IIT chennai lo choosanu O saari genes and T shirt Othello ni kummesindi stage meeda ee ammayi..cut cheste inko 3 hrs tarwatah traditional pattu pavada and veena ...jil jil jingaa...

bratukuteruvuku basha ani sardicheppukuntaam telugu vallam. Just border cross cheste ade probelem akkada kooda.kanee vaallu balance chesukunnaru manam.Telugu rayatam raakunda maatladatam maatramein vachina post graduates naaku chaala mandi telsu...konkini ki script ledu ...telukki unna veellaki raadu...its not even a fashion statement to say telugu raadu ani...it's a passe...telugu lo type cheste time padtundi ani english lo type chestonna nenoo telugonne...:-)

when it comes to culture mana gaadelu nindukunnayi eppudo..!

ravi gaaru mee problem naakartha mayyindi...oka tamil jerite 10 mandi jerataaru...10 mandi telugollu jerina okanni chercharemo...evarni tittukundaam...??

sudha gaaru...vivekananda rock pakkane undi tamila kavi tiruvalluvar statue...jaatiki saamajika spruha nooriposina social kavi...mana vemana ekkada...telugu vaari di aarambha sooratwam annaru mana valle...

magesa thanks for the post...language, politics, food,culture...edina sare we are talking about a dynamic society.

Periyaar laanti social activists chaala ella kritamein brahmin domination ni tamilnadu lo challange chesaru with their dravidian theory.Ravanasurdni poojinchina they have a logic...manam denikee proponents ga anipinchatam le...

oka sorry picture potray cheyatledu...adbhutamina persona unnaru mana daggara ...but adi individual effort potana, vemana, annamayya all individuals...as a society manam edina kattama, edina chesama...edina kaneesam nasanam chesama...

south eastern countries to manam trade chesama? mana raajulu evaranna Indonasia ni occupy chesi paripaalinchara ...akkada chesaaru...desaalu gelichi aa remorse to brihadeeswaralayam kattinchaaru...oka jatiki pride ilantivi chestene vastundi...chaapa kinda neerula loukyan ga batikesete ela vastundi?

Chiken tikka masala telusa neeku ela ani adigite naa angrezi colleague ni rommu penchi cheptaadu I am British ani...manaki ekkada kaalina adi nijam...aa pride daasohamane culture ki undadu...raadu..!

కొత్త పాళీ said...

కొన్ని caveat-లు:
1. ఇవి కత్తి మహేశ్ కుమార్ వ్యక్తిగత అభిప్రాయాలు.
2. ఇవి ఎగువ మధ్య తరగతి (అంటె యూనివర్సిటీ చదువులూ, ఐటీ ఉద్యోగాలూ, లేక సివిల్ పదవులూ)కి చెందిన జనాభా గురించిన అభిప్రాయాలు.

కొన్ని సూచనలు:
ఏ భూఖండములోని ప్రజల ప్రవర్తనా గాల్లో వేలాడుతూనో, స్వయంభువుగానో ఉండదు. దాని వెనుక ఎన్నో ఏళ్ళ ఆర్ధిక రాజకీయ చరిత్ర ఉంటుంది. ఆంధ్రా ప్రజలైనా, తమిళ ప్రజలైనా ..
బ్రిఈటీషు సామ్రాజ్య పాలన నేపథ్యంలో శ్రీరంగపట్నం రాజధానిగా అనేక తమిళ భూముల్ని జయించి తమ పరిధిలోకి తెచ్చుకున్న హైదరలీ టిప్పుసుల్తానుల చర్యలు, భారత స్వాతంత్ర్య సాధన సందర్భంలో, తమిళ నాట మహా మేరువుల్లా నిలిచిన రాజాజీ, రామస్వామి నాయకర్, కామరాజ నాడార్ .. వీళ్ళ ఆలోచనల, చర్యల ప్రభావం అటుపైన తమిళనాడు పాలసీలని నిర్దేశించింది.
ఈ చారిత్రక నేపధ్యంతో చూస్తే తమిళనాడు ఇంకొంచెం బాగా అర్ధమవ్వచ్చు.
చివరి మాట - మారుమూల పల్లెల్లోకి వెళ్ళి చూస్తే .. అది తెలంగాణా కావచ్చు, తిరునల్వేలీ కావచ్చు .. అదే అమాయకత్వం, అదే బలిపశువు తనం, అదే అణచివేత, అదే దోపిడీ. ఇది నా కళ్ళారా చూసింది, అభిప్రాయం కాదు.

arvindrishi said...

kotta pali garu manchi perspective ichaaru...kavachu ground zero lo jeevitam challanging gaane undochu...freedom struggle leda antaku mundu muslim palana mana culture ni bhavani impact chesundochu ...to a large extent ee naati mana reflexes ni decide cheyochu...

kanee oka culture yokka psyche adi special gaane untundemo...may be adi ee temperory influences ki dooranga untundemo...may be nijangaane ee rendu cultures madhyana chaala differences unnayemo for hazaar reasons ...

Bolloju Baba said...

మీ టపా నిజంగా కత్తిలానే ఉంది.

నేను తమిళనాడులో నాలుగేళ్లు చదువునిమిత్తం ఉండవలసివచ్చింది. (పాండిచేరీ యూనివర్సిటీలో).

వారు వియ్ ఫీలింగు ని కులపరంగానో, మతపరంగానో కాక సాంస్కృతిక పరంగా సాధించుకోగలుగుతున్నారు.
ఈ నాటికీ అక్కడ ఉమ్మడికుటుంబాల సంఖ్య మనకంటా ఎక్కువ శాతంలోనే చూడవచ్చు.
ప్రతీ వీధిచివరన ఒక గుడి కంపల్సరీ.

సంగీతము నాట్యానికి సంబందించి ప్రతీ ఇంటిలో ఎవరో ఒకరు గ్రామస్థాయి కళాకారులుంటారు.

జానపదకళారూపాల పైన అనేక సినిమాలను నిర్మించుకొన్నారు. మనకు పిట్టలదొర వంటి (అదికూడా హాస్య ప్రధానం) ది తప్ప పెద్దగా కనిపించవు. (బహుసా నాపరిధి చిన్నదేమో).

వారు భాషను కూడా చాలా మట్టుకు పరభాషా పదాలనుండి కాపాడుకున్నారు. (ఉదా: ఫేను ని మిన్విసిరి: ఆకాసపు విసనకర్ర అని కిరసనాయలును : మనెన్నై: భూమినూని) మన తెలుగులోకూడా జరిగినా చాలాపదాలు సంస్కృత పదాలు గానే కనిపిస్తాయి.

ఇకపోతే లౌక్యం, మనవాడికి సహాయం చేసుకోవాలనే తపనా ఒక పాలు పాలు ఎక్కువే. బహుసా ఇదే వారిని కొన్ని సందర్భాలలో కుట్ర దారులుగా, గోతులుతవ్వే వారిగా మిగిల్చి వేస్తుంది.

ఒకప్పుడు మద్రాసు రైల్వే స్టేషనులో హిందిలో మాట్లాడితే వారికి దేహశుద్ది చేయటం అనెది వారి భాషాభిమానానికి వికృత పరాకాష్ట గాకూదా చెప్పుకోవచ్చు.
దీనికంతటికి ఒక కారణం వారు వారిని ద్రవిడులుగా భావించుకోవటం వల్ల వచ్చిందేమో అనిపిస్తుంది.

మన దగ్గరకు వచ్చేసరికి మనపై ఉత్తరభారతదేశ ప్రభావం కొంచెం ఎక్కువే. దానివల్ల, కొంతమట్తుకు నిజాం పాలన వల్ల, మనం సాంస్కృతికంగా వారంత హోమోజీనస్ గా ఉండకపోవటానికి కారణం అయిఉంటుంది.

ఏది ఏమైనా తెలుగు రచనల్లో చాలాచోట్ల అరవవాళ్ల పట్ల చాలా జోకులు, వెటకారాలు చలామణీలో ఉన్నాయి.
అదొక ముచ్చట.

బొల్లోజు బాబా

Anonymous said...

చక్కగా రాసారు. తమ భాష మీద తమిళులకున్న ప్రేమను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని నేను అనుకుంటాను. అయితే నేనూ వాళ్ళని తేలిగ్గా మాట్టాడుతూ ఉంటాను - కేవలం అసూయతో. 'అయ్యో మన భాషమీద మనకంత ప్రేమ లేకపోయిందే, కానీ వాళ్ళకుందే' అన్న అసూయతో! :)

Unknown said...

ம‌கேஷ் గారూ,

வணக்கம். మీ బ్లాగు తో నేను 99% ఏకీభవిస్తున్నాను. కాని టైటిల్ కి బ్లాగు లో విషయానికి ఎక్కడా పొంతన మాత్రం లేదు.

ரொம்ப​ நன்றி

శ్రీ said...

మహేష్ గారూ,మీ అభిప్రాయాలు చాలా బాగా చెప్పారు.మీ లాగే నేను కుడా తమిళనాడు సరిహద్దులో పెరగడం వల్ల వీరి గురించి ఒక అవగాహన ఉంది.కాలేజీ రోజుల్లో ఇటువంటి చర్చలు చాలానే జరిగాయి.

రవి గారు అన్నట్టు వాళ్ళ మధ్య కలిసికట్టుగా ఉండే గుణం ఉంది,మన మధ్య అది ఉండదు.ఉన్నా,చిన్న చిన్న గ్రూపుల మధ్య ఉంటుంది,నిజమేనా?ఇదే మనకి,వాళ్ళకి తేడా!

ఇపుడు మనమందరం చేయవలసింది ఏమిటంటే ఐకమత్యంతో ఉండడం!అలాగే మన పక్క రాస్ట్రంతో కుడా ఐకమత్యంతో ఉందాం.ఇలా అలవాటయిందనుకోండి దేశంలో అందరితో కలిసిఉంటాం!తద్వారా వసుధైక కుటుంబమవదాం!

Purnima said...

Hi Bloggers:
ఇక్కద నాదో ప్రశ్న..
అసలు ఒక జాతి వారిని గాని, ఒక భాష వారిని గాని, ఒక మతం వారిని గాని "వీరు ఇలానే ఉంటారు" అని ఇతిమిద్ధంగా చెప్పడం సాధ్యమా?? సబబా??

మనకి ఏర్పడిన అభిప్రాయాలు.. aren't they just limited by our experiences and observations??


మహేశ్ గారు: ఇంతకీ మనం లోకువా కాదా వాళ్ళకి? శీర్షికా లో అడిగిన ప్రశ్నకు జవాబు ఏంట? Are you suggesting that because of our inferiority complex, we feel so??

Anil Dasari said...

మహేష్,

మీతో ఏకీభవిస్తున్నాను. 'అరవం అధ్వాన్నం' అని మనమంటే 'సుందర తెలుంగు' అని వాళ్లు ముచ్చట పడతారు. ఎవరికి ఎవరంటే అలుసు?

రజనీకాంత్ లాంటి మరాఠీని భాషాభేదాలు లేకుండా నెత్తినెక్కించుకున్నారు తమిళులు. రజనీతో పోలిస్తే 'సెంతామిళ్' కమల్ హసన్ కి కూడా తమిళనాట అందరు వీరాభిమానులు లేరు. వాళ్ల మరో అగ్ర నటుడు, ప్రస్తుత రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ తెలుగువాడు. ప్రశాంత్, అజిత్, శ్రీకాంత్ (శ్రీరాం), విశాల్, అర్జున్, విక్రం లాంటి ప్రసిద్ధ తమిళ నటులెవరూ తమిళులు కాదు. రాజకీయ రంగంలోకొస్తే - జయలలిత సగం తెలుగు, ఎంజీఆర్ సగం మలయాళీ, వైగో పూర్తి తెలుగు. అంతెందుకు, వెర్రి తమిళాభిమానులు కుష్బూ లాంటి ఉత్తరాది నటికి గుడి కట్టారే కానీ రాధికకో, శ్రీదేవికో కట్టలేదు కదా.

తమిళులు తలుచుకుంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని పూర్తిగా తమిళంలో తిరగరాసి ఉండేవారు (త్రిమూర్తుల కృతులు అన్నీ తెలుగులోనే ఉంటాయి). కానీ వాళ్లలా చేయలేదే. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే తమిళులు దానికోసం కష్టపడి తెలుగు కూడా నేర్చుకోవటం నేను చూశాను.

నేను మద్రాసు లయోలా కాలేజిలో చదివే రోజుల్లో సంగతి ఇది. మా హాస్టల్ లో ఉన్న ఏడొందలమంది పైచిలుకు విద్యార్ధుల్లో మహా ఉంటే ఓ ఇరవై మంది తెలుగు వాళ్లుండేవాళ్లు. మెస్ లో భోజనాల సమయంలో ఎప్పుడూ తమిళ పాటలు పెడుతుండేవాళ్లు (అప్పట్లో ఆ పాటలు వింటుంటే నవ్వులాటగా ఉండేది మాకు: 'తంజావూరు మేళం, తాలికట్టు నేరం' లాంటివి). అవి వినీ వినీ విసుగెత్తిపోయి ఓ రోజు మా ఇరవై మందిమీ కలిసి వారానికి మూడు రోజులు మెస్ లో తెలుగు పాటలు పెట్టాలని వార్డెన్ కి మెమొరాండం ఇచ్చాము. మూడు రోజులని అడిగితే ఒక రోజుకన్నా ఒప్పుకుంటారని మా ఆశ. ఆయన దానిమీద ఓటింగ్ పెట్టాడు. చిత్రంగా భారీ మెజారిటీతో మా మూడు రోజుల ప్రతిపాదన నెగ్గింది - ఆ పాటల కేసెట్లేవో మేమే ఇవ్వాలనే కండిషన్ మీద. పాపం అప్పటినుండీ మా ఇరవైమంది కోసం మిగతా ఆరొందల ఎనభై మందీ నోరు మూసుకుని తెలుగు పాటలు వినేవాళ్లు.

నాకు తమిళులతో అన్నీ మంచి అనుభవాలే ఉన్నాయి. కన్నడిగులు, మలయాళీల నుండి మాత్రం ఎక్కువగా చేదు అనుభవాలెదురయ్యాయి. అంత మాత్రాన కన్నడిగులు, మలయాళీలు మంచి వాళ్లు కారని తీర్మానించలేను కదా.

Unknown said...

నాకు చాలా బా నచ్చింది ఈ వ్యాసం, నాకు చాలా విష్యాలు తెలిసాయి,
కొత్తపాళి గారు, మహేష్ గార్ల సమాచారం చాలా బావుంది.

Anil Dasari said...

'తంజావూరు మేళం, తాళికట్టు నేరం' పాటని ప్రస్తావిస్తుంటే నేను మద్రాసు వెళ్లిన కొత్తలో జరిగిన ఓ కామెడీ సంఘటన గుర్తొచ్చింది. అసందర్భమైనా ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను.

అప్పటికి నాకు తమిళం పెద్దగా అర్ధమయ్యేది కాదు. ఓ రోజు స్టెర్లింగ్ రోడ్ బస్ స్టాప్ లో నిలబడున్నాను. అటూ ఇటూ పదిమందిదాకా ఉన్నారు. బస్సు ఎంతకీ రాక విసుగొస్తుంది. అంతలో నా పక్కనున్నతను నాకేసి చూసి 'మనీ ఎన్న?' అనడిగాడు. చాలా రఫ్ గా ఉన్నాడతను - ఓ మోస్తరు రౌడీ లాగా.

'ఎవడు వీడు. డబ్బులు అడుగుతాడేమిటి నన్ను?' అనుకున్నా నేను, అతని మాటలు పట్టించుకోనట్లు నటిస్తూ. అతను మరో రెండు సార్లదే మాట అడిగాడు. నేను పట్టించుకోనట్లు నటిస్తూనే ఉన్నాను. అతనీ సారి నన్ను తట్టి పిలిచాడు. ఇక తప్పక అతనికేసి చూస్తే 'నేరం ఎన్న?' అనడిగాడు.

'వామ్మో. ఇదేం ఊరురా బాబు. ఇక్కడ దారినపోయేవాళ్లకి డబ్బులీయక పోతే నేరమా?' అనుకున్నా నేను. చిన్నగా భయం మొదలయింది. మిగతా వాళ్లు చోద్యం చూస్తున్నారు. 'వీడెవడన్నా లోకల్ రౌడీ ఏమో. అందుకే ఎవరూ కలగజేసుకోవటం లేదు' అనుకుంటూ జేబులోంచి పర్సు తీయబోయాను ఎంతోకొంత ఇస్తే నన్నొదిలేస్తాడేమోనని.

అంతలో అతనికి లైట్ వెలిగినట్లుంది నాకు తమిళం అర్ధమవటం లేదని. 'టైం ఎన్న సార్?' అన్నాడు చివరి ప్రయత్నంగానో ఏమో. 'ఓహో వీడు టైమడుగుతున్నాడా. అదేదో సరిగా అడిగి తగలడుండొచ్చుగా' అనుకుంటూ జేబులోంచి చెయ్యి తీసి టైం చెప్పానతనికి.

హాస్టలుకెళ్లాక తమిళ స్నేహితుడొకడికి ఈ సంగతి చెబితే వాడు నవ్వేసి అన్నాడు 'మచ్చా. అతనడిగింది మణి ఎన్న అని, మనీ ఎన్న అని కాదు. అలాగే, తమిళంలో నేరం అంటే క్రైం కాదు - టైం'.

Bolloju Baba said...

తెలుగు బ్లాగులోకంలో తమిళాభిమానులు చాలామంది ఉన్నారే.
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

అందరికీ నెనర్లు.
@రమణి, మన కున్నట్టే తమిళ్ వాళ్ళకీ, మధురై తమిళ్,పట్టిసీమ/కాడు తమిళ్, చెన్నై తమిళ్ అని ఇంకా చాలా తేడాలున్నాయ్.వీరు వాటిలోని అందాన్ని ఆస్వాదిస్తూనే, ఒక ప్రామాణికమైన తమిళ్ తయారుచేసుకుని ఆనందిస్తున్నారు.మన తెలుగు వాళ్ళ భాషాభిమానం గురించి "మాతృ భాష వైపు తల పెట్టి కూడా పడుకోరు" అని నేనే ఒక టపాలో అన్నాను.

@రవి గారూ,తమిళులు చేస్తున్న పనినే మన తెలుగువాళ్ళు చేసుంటే మనమెంత బాగుపడేవాళ్ళమో ఒక్కసారి ఆలొచించండి. వీళ్ళపై మీ కోపం హుష్ కాకి అయిపోతుంది.
ఇక కన్నడ-తమిళ యుద్దం అనాది కాలం నుండీ వస్తున్నదే. దాని గురించి వివరంగా చెప్పాలంటే మరో టపా రాయాల్సిందే.

@అర్వింద్, నువ్వు చెప్పినదాంతో 100% ఏకీభవించక తప్పదు. ఇక తెలుగువాడి పనికిమాలిన ‘లౌక్యం’ గురించి ఒక ఠావు పేజీలు రాయచ్చు.ఎంతైనా నేనూ ఒక తెలుగు వాడినే కదా.

@కొత్తపాళి, నేను తమిళ ఆర్థిక,సామాజిక,రాజకీయ,సాంస్కృతిక మరియూ చారిత్రక విషయాలని కుదించి నాకు అనిపించిన సారాన్ని ఇక్కడ రాశాను.వాటి గురించి విపులంగా రాయటం నా శక్తికి మించిన పని.నా అభిప్రాయాలలో కొన్ని అసంపూర్ణాలుండొచ్చు,శుద్ద తప్పులూ ఉండొచ్చు.ఏదో తెలిసింది చెబ్దామనేతప్ప, సిద్దాంతాలు ప్రతిపాదించడం ఉద్దేశం కాదని మీరు గ్రహించినందుకు నెనర్లు.

@బాబా గారూ, మనలో ఉత్తరాదివారి ప్రభావం చారిత్రకంగా,భౌగొళికంగా ఉన్నప్పటికీ, మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమైన మనం కాస్త ముందుచూపుతో వ్యవహరించి ఉంటే,పరిస్థితి ఇలా తయారయ్యేది కాదేమో!

@చదువరి, అసూయ అని అర్థమయ్యింది కాబట్టి, ఇప్పుడు మనలో ఆ లక్షణాలు పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం.

@K గారూ, టైటిల్ సంగతి తెలియాలంటే నేనిచ్చిన ‘కాలాస్త్ర్రి’ గారి లంకె చూడాలి. This post is a continued conversation from there.

@పూర్ణిమ,"వీరు ఇలాగే ఉంటారు" అని ఒక జాతి,భాష,మతం వారిని డిసైడ్ చెయ్యడం ఏమాత్రం సబబు కాదు. కానీ సొషియాలజీ,యాంత్రపోలజీ లాంటి శాస్త్రీయ పద్దతులతోనో లేక స్వీయానుభవంతోనో, "వీరు ఈ కారణంగా ఇలా ఉండొచ్చు" అని ఒక అభిప్రాయాన్నో లేక ఇదమిద్దంగా ఒక సిద్దాంతాన్నో ఆధారాలతో సహా ముందుకు తీసుకురావడంలొ తప్పులేదని నా నమ్మకం.

ఇక శీర్షిక లోని విషయాన్ని టపాలో సజెస్ట్ చేసి, కావాలనే సృష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేసాను.మీరు అనుకున్న సమాధానమే సరైనది. వాళ్ళు చిన్నచూపు చూస్తారని మనం ‘అనుకుంటాం’ అంతే.

@అబ్రకదబ్ర,మీ విస్తృతమైన కామెంట్ తో నా టపా విలువని మరింత పెంచారు. మీ అనుభవాలు చాలా కనువిప్పునూ,కాస్త సరదానూ జోడించాయి.

Unknown said...

మనం తమిళులంటే అలా ఆలోచించడానికి కారణం కొంత ప్రిజుడిస్ అయితే కొంత వారు ఇతర భాషల మనుషులతో కలవకపోవడం, పక్కన వాడికి తమిళం వస్తుందా రాదా అని ఆలోచించకుండా తమలో తాము మాట్లాడేసుకోవడం.
అయినా సరే వారి భాషాభిమానం, సంస్కృతి పట్ల ఆసక్తి మెచ్చుకోవాల్సిందే.

రవి said...

అబ్రకదబ్ర గారు,

ఒక్క మాట. "సుందర తెలుంగినిల్ పాట్టిసైత్తు దోణి ఓటి వళయాడువోం....సింధునదియిల్ ఇసై.." అన్న సుబ్రహ్మణ్య భారతి గానంలో భారత దేశంలో అన్ని సంస్కృతులనూ ఉదహరించడం జరిగింది. ఇంత మాత్రాన తెలుగు పై తమిళులకు అవ్యాజ అనురాగమా?

"ఆంధ్రా ఆళింగళు అడుప్పువె పొయ్ ఇంగరార్హళ్"..ఇది తెలుగు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకునే ఓ మాట.
అడుప్పు అంటే తమిళంలో నిప్పు, కుంపటి లేదా పొయ్యి.
పొయ్యి అంటే అబద్ధం తమిళంలో.

పై వాక్యానికి అర్థం ఏమిటంటే, " ఆంధ్రులు నిప్పును కూడా అబద్దం అంటారు ...ఇంకాస్త ఖచ్చితంగా చెప్పాలంటే,ఆంధ్రులు అబద్దపు కోరులు "

తమిళులు ఒకరిని ఆరాధించడం మొదలెడితే, అలా ఆరాధిస్తూనే ఉంటారు. భాషా, సంస్కృతితో సంబంధం లేకుండా. ఇది వాళ్ళ స్వభావం. అలానే తెలుగు వాళ్ళకు ఓ మంచి స్వభావం...ముక్కు సూటి తనం, ద్రోహ చింతనో, పక్కన వాడిని ఇబ్బంది పెట్టలనుకునే మనస్తత్వం లేకపోవడం (మనం తెలుగు వాళ్ళమే కాబట్టి మనకు ఇది కనబడదు. మీ ఇతర భాషా మిత్రులని అడగండి, చెబుతారు.)ఇందువల్ల వాళ్ళు గొప్ప ఎందుకవాలి?

ఇక సంస్కృతి గురించి. ఓ సారి మా కజిన్ (తను తమిళుడు) అన్నాడు. తమిళులు శాస్త్రీయ (కర్ణాటక) సంగీతాన్ని గొప్పగా ఆదరిస్తారు. తెలుగు వాళ్ళకా గుణం లేదు. అని.

నేను హైదరాబాదు లో ఉన్నప్పుడు మాడుగుల నాగఫణి శర్మ గారి ద్విగుణిత సహస్రావధానానికి రాత్రి 2 గంటల వరకు జనాలు హాజరు అవడం (అదీ చినుకులు పడుతున్నప్పుడు) స్వయంగా చూచాను. ఆ అవధానంలో పృచ్చకుడుగా ఓ సగటు వ్యక్తి (తనో పెద్ద సాహితీవేత్త కాదు), నా మిత్రుడు ఎన్నుకోబడ్డం కూడా జరిగింది. ఇది జరిగింది పబ్లిక్ గర్డెన్స్లో, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో. పట్టుపంచెల వ్యక్తుల మధ్య కాదు. ఏతావాతా చెప్పదల్చుకున్నదేమంటే, తమిళులకు సంస్కృతి మీద ఇష్టం ఎక్కువ అన్నది కేవలం శాస్త్రీయ సంగీతం అనే దృక్పథం నుంచి తేల్చి చెప్పవలసిన విషయం కాదు. ఆంధ్రులకు సాహిత్యం మీద మక్కువ ఎక్కువ, వాళ్ళకు సంగీతం మీద.

ఇక గ్రూపిజం గురించి. ఇదో ట్రైబలిజం లాంటిది. నా వరకు ఈ భావనే తప్పనిపిస్తుంది, తెలుగయినా, తమిళయినా. వాళ్ళు చేసారు, అలా ఉన్నారు, మనం అలా ఉండాలి అన్నది సెకండ్ హాండ్ ఆలోచన అని నాకనిపిస్తుంది. (మహేశ్, సీరియస్ గా తీస్కోవద్దు...కూల్...:-))

Kathi Mahesh Kumar said...

@రవి,
అంతా అబ్రకదబ్ర గారికి చెప్పినట్టు చెప్పి, చివరాఖర్న "మహేశ్, సీరియస్ గా తీస్కోవద్దు...కూల్..." అని నాకు పెట్టావేమిటి స్వామీ!

ఇక్కడ వాళ్ళలాగా మనముండాలని కాదు చెప్తుంట.వాళ్ళు అలా ఎందుకుంటారో,దానికి కొన్ని కారణాలు వెదుకుతున్నాం అంతే.ఇక కొందరికి "నిజమే కదా ! మనమూ వాళ్ళలాగా ఉంటే బాగుంటుంది" అనిపిస్తే ఫరవాలేదుగా?

మీరు చెప్పిన తెలుగు వారి లక్షణాలు మనలో నిజంగా ఉన్నాయా? ఐతే ఎవరైనా కన్నడ,తమిళ,మళయాళ లేక హిందీ మిత్రుడ్ని అడుగుతాను. ఇప్పటిదాకా నన్ను చూసి నా భాషేతర మిత్రులు "you are not like other Telugu guys" అన్నారేగానీ, అసలు తెలుగువాళ్ళ లక్షణాల గురించి చెప్పిన పాపాన పోలేదు.

Anil Dasari said...

రవి,

తొలిసారిగా 'సుందర తెలుంగు' పద ప్రయోగం చేసింది సుబ్రహ్మణ్య భారతి అని నేనెరుగుదును. తమిళులు ఎంత విరివిగా ఆ మాటలు వాడతారో తెలియజెప్పటానికి మాత్రమే నేనా ప్రస్తావన చేశాను.

నేను కానీ, మహేష్ కానీ తమిళులు మాత్రమే గొప్పవాళ్లు, తెలుగు వాళ్లు కాదు అనే వాదన చేయటం లేదు. శాస్త్రీయ సంగీతం సంగతి నేను ఉదహరించింది వాళ్లు తెలుగుని ఎంత ఇష్టంగా నేర్చుకుంటారో చెప్పటానికే కానీ, వాళ్లు మాత్రమే సంస్కృతి పరిరక్షకులు, మనం కాదు అని వాదించటానికి కాదు.

మనదేశంలో వివిధ భాషల వాళ్ల మధ్య గిల్లికజ్జాలు అన్ని చోట్లా ఉన్నవే. అటువంటి చిన్న విషయాలకి మనసు కష్ట పెట్టుకోవటం, పర భాషా ప్రజలని ద్వేషించటం తగదు అనేది నా ఉద్దేశం (ఈ నీతి మనకే కాదు, ఇతర భాషల వాళ్లకీ వర్తిస్తుంది). దేశవ్యాప్తంగా పంజాబీలని అవహేళన చేస్తూ ఎన్ని వేల 'సర్దార్జీ' జోకులు ప్రాచుర్యంలో లేవు? మరి వాళ్లు దేశమంతటినీ ద్వేషించటం మొదలెట్టాలా?

అన్నట్లు, మీరు చెప్పిన 'ఆంధ్రా ఆళింగళు ....' అనే దాంట్లో 'అడుప్పు' అంటే 'నిప్పు' కాదు, 'పొయ్యి' (stove/oven). తమిళంలో నిప్పుని 'నెరుప్పు' అంటారు. మొత్తం ఆ వాక్యానికి మీ అనువాదాన్నోసారి సరిచూసుకోండి.

రవి said...

అంతా అబ్రకదబ్ర గారికి చెప్పినట్టు చెప్పి, చివరాఖర్న "మహేశ్, సీరియస్ గా తీస్కోవద్దు...కూల్..." అని నాకు పెట్టావేమిటి స్వామీ!

;-) That is Ravi ;-)...
మహేశ్,నేను ఇంకొంచెం సరిగ్గా రాయల్సింది. ఆవేశం లో ఉన్నా కాబట్టి అలా జరిగింది.

ఐనా మీ బ్లాగు కు కామెంట్లు రాయాలంటే ఇక్కడ మా ఆఫీసులో కుదిరి చావదు. (జీమైల్, గూగుల్ బ్లాగు, ఓర్కుట్లు మూసేసారిక్కడ) ..సెక్యూరిటీ వలయాన్ని భయంకరంగా చేదించి రాయాల్సి వస్తుంది..అదీ ఓ కారణం...

అబ్రకదబ్ర గారు ,

'అడుప్పు' అంటే 'నిప్పు' కాదు, 'పొయ్యి' (stove/oven).

అడుప్పు అంటే మీరన్నట్టుగానే. ఐతే సాధారణార్థంలో, నిప్పు అని వాడతారు. ఈ సామెత ను ఆ అర్థంలోనే వాడతారనుకుంటా...నేనీ సామెత ఓ అరవాయన చెబితేనే విన్నాను. (నా సొంత కవిత్వం కాదు :-))..

ఎందుకో తమిళ్ వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళ గురించి పోలిక అన్నది వచ్చినప్పుడు, తెలుగు వాళ్ళు ఏ విషయం లోనూ తక్కువ కాదు అని ఎలుగెత్తి ఘోషించాలనిపిస్తుంది నాకు. ఇది చాదస్తమో, ఇంకొకటో తెలీదు. నా ఉద్దేశ్యం అంతే.

Kathi Mahesh Kumar said...

@రవి,
అంత కష్టపడి నా బ్లాగులో కామెంట్లు రాస్తున్నందుకు ముందుగా నెనర్లు. తెలుగువాళ్ళను తక్కువచేసి మాట్లాడితే నాకూ ఆవేశమొస్తుంది, అది సహజం కూడా.

కాకపోతే, మన తెలుగు వాళ్ళు మిగతా దక్షిణ భారతీయ సంస్కృతుల వారికన్నా కాస్త ఎక్కువగా తమ మూలాలనుండీ దూరంగా జరుగుతున్నారన్నది,కష్టమైనా మనం గ్రహించవలసిన నిజం.We are increasingly moving towards rootlessness.

ఇలాంటి నేపధ్యంలో మనలోపాల్ని ఏ భేజషాలూ లేకుండా అంగీకరించడం లేక ఇతర సంస్కృతులనుండీ కొన్ని సంరక్షణా విధానాల్ని గ్రహించడం చాలా అవసరం.

కేవలం ‘తెలుగు స్వాభిమానం’ పేరుతో మార్పుల్ని అర్థం చేసుకొవడానికి నిరాకరిస్తే, మనం ఇంకా ప్రమాదంలో పడే సమయం వస్తుందేమో!

Anonymous said...

raamaayaNamlO piDakala vETa: Arunachal Pradesh has an all-Congress Assembly, I believe.

Sudhakar said...

ఇక్కడ మహేశ్ తెలుగోళ్లని తక్కువ చేసి రాసినట్లు నాకనిపించలేదు..తమిళ జనాలను చూసి మన తెలుగోళ్ళు నేర్చుకోవాల్సింది చాలా వుంది.

"We are increasingly moving towards rootlessness." - ఈ మాట అక్షరాల సత్యం. నిజం నిష్టూరంగానే వుంటాది మరి. :-)

karlapalem Hanumantha Rao said...

కాకపోతే వీరి ‘అతిని’ అర్థం చేసుకుని స్నేహం చేస్తే, I think they have a lot to offer to our culture and polity-తమిళ సంస్కృతిని గురించి ఎంతో చక్కగా చెప్పారు.మనం తెలుగు వాళ్ళం ఎంత సేపటికి పక్క వాడి మీద పడి ఏడిచే అలవాటు మానేసి మీరు చెప్పినట్లు ఇరుగు పొరుగు వారిని సహృదయంతో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మనకే ఎంతో మేలు జరుగుతుంది.