Tuesday, May 5, 2009

అస్తిత్వవాదాల గమ్యం!?!

ఈ మధ్య శివారెడ్డి గారి కవితా సంకలనం "ఆమె ఎవరైతే మాత్రం" పుస్తకావిష్కరణ సభకు వెళితే, అక్కడ పుస్తక పరిచయం చెయ్యడానికొచ్చిన వేణు గోపాల్ గారి ప్రసంగం నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అస్తిత్వవాదాల విషయంలో తన అభిప్రాయం ఆలోచనలకు పురిగొల్పింది.


సామాజిక-ఆర్ధిక-సాంస్కృతిక-రాజకీయ-ప్రాంతీయ నేపధ్యాలలో పుట్టిన అస్తిత్వ ఉద్యమాలు సాహితీరంగంలో చేసిన కృషి ఎవరూ కాదనలేనిది. అణచివేయబడ్డ గొంతుకలు అక్షరాల్ని పట్టి, ఆ అక్షరాలతో తమ కథల్ని,వ్యతల్ని కళ్ళకుట్టి ఎదుటనిలిపి ఉద్యమ స్ఫూర్తిని, జీవనశక్తిని నింపే దిశగా అస్తిత్వ ఉద్యమాల తోడ్పడ్డాయి. తెలుగు సాహిత్యాన్ని "రంగుల"మయం చేసాయి. స్త్రీవాదం, దళితవాదం, తెలంగాణా వాదం లాంటి అన్ని వాదాలూ మొదటగా అణచివేత నేపధ్యంగా ఒక ధిక్కారస్వరంలా మొదలై తమ ఆత్మనిశ్చయ ముద్రల్ని బలంగా చిత్రించి, సమాంతర అస్థిత్వాలుగా ఎదిగాయి.

ఈ ఎదుగుదల పరిణామక్రమంలో ఈ అస్తిత్వవాదాలు తమ ఉనికిని కోల్పోకుండా ప్రధానస్రవంతిలోకి మమేకం అవ్వడం సహజంగా జరగాల్సిన పరిణామం, ఉదాహరణకు, దళితవాదం కుల వివక్షతకు నిరసనగా తమ సాధికారక ఉనికిని ఎలుగెత్తి చాటడానికి ఉద్భవించినా, దాని అంతిమ లక్ష్యం సమానత్వాన్ని కాంక్షించి,మార్పుచెందిన సమాజంలో భాగమవడం. జీవితమైనా,సాహిత్యమైనా అదే జరగాలి. అంటే పుట్టుకతో వచ్చిన అస్థిత్వాలను పోగొట్టుకోవడానికి పోరాడి, సాధించి సంపాదించుకున్న వ్యక్తిత్వాల ఆధారంగా నూతన సమాజాన్ని నిర్మించి తమదిగా చేసుకోవడం ఈ ఉద్యమాల లక్ష్యం.

కానీ, ప్రస్తుతం అస్తిత్వ ఉద్యమాలు అటువైపు ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు అన్నది వేణుగోపాల్ గారి అభిప్రాయం. నిజమే! కాలక్రమంలో అస్థిత్వ ఉద్యమాలు తమ అంతిమ లక్ష్యాల్ని మరచి, వర్తమానంలో ధిక్కారస్వరాలకు వచ్చే గుర్తింపు, అవి కలిగించే మత్తులో మిగిలిపోతున్నాయి అనిపిస్తుంది. అంతే అయితే ఫరవాలేదు. ఆ ధోరణుల్ని మరింత ఛాందసంగా మార్చే వాదనలు ఈ మధ్యకాలంలో మరింతగా వినవస్తున్నాయి. ‘శ్రీశ్రీ, కొకు లు ఆంధ్రా వారు కాబట్టి, వారి సాహిత్యం తెలంగాణాకు వద్దు’. ‘స్త్రీవాద సాహిత్యం కేవలం స్త్రీలే రాయాలి’. ‘దళితసాహిత్యంతో దళితేతరులకు సంబంధం ఉండకూడదు’ వంటి "అతి"వాదాలు ఇలాంటివే.

బహుశా అస్తిత్వ ఉద్యమాల ప్రగతిలో ధిక్కార యుగం ఇంకా అంతమవలేదు. కొన్ని విషయాలలో ఇంకా బలమైన నిరసన,వ్యతిరేకత అవసరం. కానీ, ఇలాంటి అతివాదాలు ధిక్కారం నుంచీ సామరస్యత దిశగా ప్రయాణించాల్సిన అస్తిత్వవాద ఉద్యమాల్ని కేవలం అక్కసు వెళ్ళగక్కే ఉద్యమాలుగా మిగులుస్తాయేమో అన్నది ఆలోచించాల్సిన విషయం. పుట్టుకతో వచ్చిన ascribed, prescribed విలువలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న అస్తిత్వ ఉద్యమాలు, ఆ విలువల్ని ప్రశ్నించడంతో సాహిత్యం మొదలుపెట్టినా, ఒక సాధికారకమైన ప్రత్యామ్న్యాయ విలువల నిర్మాణం దిశగా అడుగులు వేసి సామరస్యతని సృష్టించాలి. ఆ అడుగులు ఆలస్యమవుతున్నాయో లేక దారి తప్పమో అన్నది ఒక్క క్షణం ఆగి తరచిచూసుకోవలసిన సమయం ఇది అనిపిస్తుంది.

****

4 comments:

గీతాచార్య said...

ఈ అస్థిత్వ ఉద్యమాలు వాటి అసలు లక్ష్యాల వైపు పయనించటంలేదన్నది పచ్చి నిజం. ఆలస్యం అవుతున్నాయి అనేకన్నా దారి తప్పాయి అనటమే సరైన మాట.

ఉద్యమ లక్ష్యాలను వదిలేసి, మీరన్నట్టు అతివాద, పిడివాదాల మీద దృష్టి సారించారు.

అసలు ఆ ఉద్యమాలని నీరు గారుస్తున్నదే వాటి నాయకులు.

Bolloju Baba said...

అస్థిత్వ వాదాలు కొన్ని సందర్భాలలో వేణుగోపాల్ గారు చెప్పినట్లుగా వెర్రితలలు వేసి మానవత్వానికి విఘాతం కలిగించేవిధంగా పరిణమించటం శోచనీయం.
వాటి అవసరం ఇక తీరిపోయింది ఇక అటువంటి సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సు వైపు మళ్ళించాలి అని చెప్పే అన్న విభజన రేఖ ను ఎవరు నిర్ణయించగలరు.

అస్థిత్వ వాదం అవసరమే. బహుసా ఏకాలానికి ఆకాలం ఒకరకమైన వాదాలతోనే కవిత్వం నడచింది. భావకవిత్వమనో, అభ్యుదయ కవిత్వమనో, విప్లవకవిత్వమనో.

బహుసా కాలమే ఈ మార్పును తీసుకురావాలేమో. ప్రస్తుతం మనమో సంధికాలంలో ఉన్నామేమో.

ఇలాంటి అస్థిత్వ వాదాల ఫోర్స్ వలన నిజమైన కవిత్వం వ్రాసిన అజంతా, కొప్పర్తి, ఇస్మాయిల్, సంగుభట్ల వంటివారికి రావలసినంత గుర్తింపు రాలేదేమోనని నా అభిప్రాయం. (వారి అనిబద్ద కవిత్వం వారిని ముందువరుసలో కూర్చోపెట్టలేకపోయింది.)

అన్నీ పోయినయ్ సరోవరం ప్రశాంతంగా ఉంది ఇక నికార్సైన కవిత్వాన్ని పొందవచ్చు అనుకొనే సమయంలో పులిమీద పుట్రలాగా ఈ ప్రాంతీయవాదమొకటి వచ్చి పడింది.

బొల్లోజు బాబా

ఈ ఏమోలు ఎక్కువై ఈ కామెంటో మో కవిత్వంలా మారినట్టుంది. ప్రస్తుతానికి బియర్ మి సార్.

Uyyaala said...

"అస్థిత్వ " కాదు ... "అస్తిత్వ " అనాలి !
‘శ్రీశ్రీ, కొకు లు ఆంధ్రా వారు కాబట్టి, వారి సాహిత్యం తెలంగాణాకు వద్దు’
అనే అతి వాదం కేవలం ఊహా జనితమే.
ప్రత్యెక తెలంగాణా ఉద్యమం మీద బురద జల్లే క్రమం లో సృష్టిస్తున్న పుకార్లివి
ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు లో విదేశాస్తుల్లా బతకాల్సి వస్తుంది
అనడం ఎంత కుట్ర పూరితమో ఇదీ అంతే !

Kathi Mahesh Kumar said...

@ప్రభాకర్ మందార: తప్పుని సూచించినందుకు ధన్యవాదాలు. దిద్దుకున్నాను.అతివాదాలు ఊహల్లోంచేపుట్టి జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. అక్కడక్కడా ఈ మాటలు వినబట్టే ఈ statement ఇచ్చారనుకుంటాను.

@బాబా గారు: ఆ "ఏమో"లవల్లనే పరిస్థితి ప్రశ్నార్థకమయ్యింది కదా! చూద్ధాం కొంత corrective measure వస్తాయని ఆశిద్ధాం.

@గీతాచార్య: ఇప్పుడు ఏంచెయ్యాలి అన్నది కూడా కొంత ఆలోచించవలసిన విషయమే.